ఢిల్లీలో అరుణ్ జైట్లీని కలిసిన చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని వివరిస్తున్నారు. సాయం కోరుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రధాన అంశమైన రుణమాఫీ విషయంలో కేంద్రం నుంచి ఆయనకు ఎటువంటి హామీ లభించినట్లు కనిపించడంలేదు. విజ్ఞప్తులు మాత్రం చేస్తున్నారు. అటువైపు నుంచి స్పందన ఏవిధంగా ఉందనేది తెలియడంలేదు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చంద్రబాబు నాయుడు 40 నిమిషాలసేపు సమావేశమయ్యారు. రైతు రుణమాఫీకి అన్ని విధాల సహకరించాలని ఆయన అరుణ్జైట్లీని కోరారు. ఏపీ ఆర్థికలోటును కేంద్రం పూడ్చాలని కోరారు. రైతు రుణమాఫీ అంశంలో ఆర్బీఐ సహకరించేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి, ఏపీ రాజధాని ఏర్పాటుకు అధిక నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పెట్రో కారిడార్, పెట్రో యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. అన్ని అంశాలను పరిశీలిస్తానని మాత్రం అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు.


