ఉడీ దాడి చేసింది ఎవరు?: సల్మాన్ ఖాన్ | Sakshi
Sakshi News home page

ఉడీ దాడి చేసింది ఎవరు?: సల్మాన్ ఖాన్

Published Fri, Sep 30 2016 4:21 PM

ఉడీ దాడి చేసింది ఎవరు?: సల్మాన్ ఖాన్ - Sakshi

ముంబై: ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన సర్జికల్ దాడిని సంపూర్ణంగా సమర్థిస్తున్నానన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. ఇంతటితో ఉడీకి సంబంధించి ప్రతీకారం తీరినట్లేనని వ్యాఖ్యానించారు. ఇండియాలో పాకిస్థానీ నటీనటులపై నిషేధం విధించడం సరికాదన్న ఆయన నిర్మాతల మండలి నిర్ణయాన్ని తప్పుపట్టారు. 'ఉడీ సైనిక స్థావరంపై దాడి చేసింది ఎవరు? ఉగ్రవాదులేకదా, పాకిస్థానీ నటీనటులు కాదుకదా! మరి అలాంటప్పుడు నటీనటులపై నిషేధం ఎందుకు?' అని ప్రశ్నించాడు. శుక్రవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ విలేకరులతో మాట్లాడుతూ..
 
'వాళ్లు ఉగ్రవాదులు కాదు. నటులు. ఇక్కడ(ఇండియాలో) పని చేసుకునేందుకు వీసా తీసుకొనిమరీ వచ్చారు. మన ప్రభుత్వమే వీసాలు మంజూరుచేసింది' అని వ్యాఖ్యానించిన సల్మాన్.. 'వాళ్లు నటులా? ఉగ్రవాదులా?' మీరు చెప్పండి.. అని విలేకరులను ప్రశ్నించారు. పాకిస్థానీ నటులు ఇండియాను విడిచి వెళ్లాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పాక్ నటీనలులపై నిషేధం విధిస్తున్నట్లు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సైఫ్ అలీఖాన్, దీపికా సహా పలువురు ఆర్టిస్టులు ఖండించారు. తాజాగా ఇప్పుడు సల్మాన్ ఖాన్ వంతు.

Advertisement
Advertisement