
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ
త్వరలోనే కేంద్ర మంత్రిమండలిని పునర్వ్యవస్థీకరించనున్నట్టు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: త్వరలోనే కేంద్ర మంత్రిమండలిని పునర్వ్యవస్థీకరించనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ తన కేబినెట్లో మార్పులు-చేర్పులు చేయాలని ఎప్పటినుంచో భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. అయితే, తాజాగా బిహార్లో కొత్త సమీకరణలు తెరపైకి రావడం.. జేడీయూ ఎన్డీయేలో చేరడంతో ఇక కేంద్ర కేబినెట్ విస్తరణ అనివార్యమని అంటున్నారు. తాజాగా బీజేపీతో చేతులు కలిపిన జేడీయూకు కేంద్ర మంత్రివర్గంలో రెండు బెర్తులు దక్కే అవకాశముందని తెలుస్తోంది.
ఇక కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడంతో తన పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్లో పలు మార్పులు-చేర్పులు జరగవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం అదనపు శాఖలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రులకు ఆ భారం నుంచి సడలింపు ఇవ్వొవచ్చునని, కొత్తవాళ్లకు అవకాశం కల్పించవచ్చునని అంటున్నారు.