ఇదీ తెలంగాణ ప్రభుత్వ కొత్త రాజముద్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజముద్ర మారింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలతోపాటు, పౌరసమాజం కూడా కొన్ని లోటుపాట్లను ఎత్తిచూపిన నేపథ్యంలో.. దానికి మార్పులు చేసి కొత్త రాజముద్రను రూపొందిం చారు. గతంలో రాజముద్రలో.. వృత్తాకారం వెలుపల తెలుగులో ఉన్న ‘సత్యమేవ జయతే’ని దేవనాగరి భాషలో మూడు సింహాలకు దిగువన ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో వృత్తాకారం వెలుపల పెద్ద అక్షరాలతో ఉన్న ‘సత్యమేవ జయతే’ని రాజముద్ర వృత్తాకారం లోపల ఉన్న మూడు సింహాల చిహ్నానికి దిగువన రెండు మిల్లీమీటర్ల పరిమాణంలో ముద్రించారు.
అలాగే ఈ రాజముద్రలో ఇదివరకు చార్మినార్లో మూడు మినార్లు మాత్రమే కనిపించేవి. సవరించి నాలుగు మినార్లు స్పష్టంగా కనిపించేలా రూపొందించారు. రాజముద్ర వెలుపలి వృత్తం, అశోక చిహ్నం, ‘సత్యమేవ జయతే’ బంగారు రంగులో.. మిగిలిన వృత్తాలు, కాకతీయ తోరణం, చార్మినార్.. ఆంగ్లం, తెలుగు, ఉర్దూలో తెలంగాణ ప్రభుత్వం అన్న అక్షరాలు ఆకుపచ్చ రంగులో ఉండేలా మార్చారు. దీనిని ప్రభుత్వం ఆమోదించింది. బంగారు వలయం తరువాత ఆకుపచ్చ వలయం, దాని దిగువన ఇంగ్లిష్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని.. ఆ సర్కిల్లోనే తెలంగాణ ప్రభుత్వం అని తెలుగులో, దానికి కుడివైపున ఉర్దూలో తెలంగాణ సర్కార్ అని ఉంది. ఆ తరువాత ఆకుపచ్చ వలయం ఉంటుంది. ఈ వలయంలోపల కాకతీయ తోరణం, పైభాగంలో మూడు సింహాల అశోక చిహ్నం, తోరణం దిగువలో చార్మినార్ చిత్రాన్ని ముద్రించారు.