
వార్తావ్యాఖ్య : నితీశ్కుమార్ కటీఫ్ రాజకీయం
నితీశ్ కుమార్ రూటే సపరేటు. బిహార్ రాజకీయాలలో సంచలనాలు సృష్టిస్తున్న జనతాదళ్ (యు) నేత తనదైన ముద్రతో మరో అద్భుత విన్యాసం చేశారు.
నితీశ్ కుమార్ రూటే సపరేటు. బిహార్ రాజకీయాలలో సంచలనాలు సృష్టిస్తున్న జనతాదళ్ (యు) నేత తనదైన ముద్రతో మరో అద్భుత విన్యాసం చేశారు. మహాఘట్బంధన్ను వదిలి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి ఆరోసారి ముఖ్యమంత్రిగా గురువారంనాడు ప్రమాణం చేశారు. నితీశ్ను సమర్థించాలా, విమర్శించాలా అన్న మీమాంసలోకి రాజకీయ పరిశీలకులనూ, ప్రజాస్వామ్యప్రియులనూ మరోసారి నెట్టివేశారు.
‘మిట్టీ మే మిట్ జాయెంగే, బీజేపీసే హాత్ నహీ మిలాయేంగే, సంఘ్ముక్త్ భారత్ బనాయేంగే’ (మట్టిలో కలసిపోతాం కానీ బీజేపీతో చేతులు కలపం, సంఘ్ విముక్త్ భారత్ నిర్మిస్తాం) అంటూ నినదించిన బిహార్ ముఖ్యమంత్రి మరోసారి బీజేపీతో చేతులు కలిపి సరికొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారని రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాజీ మిత్రుడిని తూర్పారపట్టారు. ‘హిందూస్థాన్లో రాజనీతి ఇట్లాగే ఉంటుంది. ఒక వ్యక్తి ప్రయోజనం కోసం ఏమైనా చేయవచ్చు. నీతి లేదు. నియమం లేదు. విశ్వసనీయత లేదు,’ అంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఘాటుగా విమర్శించారు. ఈ పరిణామాన్ని నితీశ్ ఘర్వాప్సీగా అభివర్ణించవచ్చు.
ఈ విమర్శలతో ఏకీభవిద్దామా లేక క్షేత్రవాస్తవికతనూ, వర్తమాన భారత రాజకీయాల స్వభావాన్నీ అర్థం చేసుకొని నితీశ్ కుమార్ నాటకీయ నిర్ణయాల మూల్యాంకనం చేద్దామా?
భారత రాజకీయాలలో నితీశ్ కుమార్ విలక్షణమైన నాయకుడు. వ్యక్తిగతంగా అవితీని మాలిన్యం అంటని పరిశుభ్రమైన నాయకుడు. తన వ్యక్తిగత ప్రతిష్ఠనూ, విశ్వసనీయతనూ కాపాడుకోవడానికి ఎంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడరు. అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, బ్రిటన్లో మాదిరి నితీశ్ కుమార్ సైతం పార్టీ విధేయతలకూ, కూటరాజనీతికీ అవసరానికి మించి ప్రాధాన్యం ఇవ్వరు. సమాజహితం దృష్టిలో పెట్టుకొని స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీ విధేయతను బట్టి కాకుడా విషయ ప్రాధాన్యం ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకునే ఉన్నత స్థాయి రాజకీయం ఆయనది. అమెరికా కాంగ్రెస్ పరిశీలనలో ఉన్న బిల్లుపైన రిపబ్లికన్ పార్టీ, డెమొక్రాటిక్ పార్టీ సెనేటర్లూ, దిగువ సభ ప్రతినిధులూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం తరచూ జరుగుతుంది. అటువంటి రాజకీయం నితీశ్ కుమార్ ఆచరిస్తున్నారు.
బీజేపీతో కలిసి బిహార్లో ఎన్డీఏ ప్రభుత్వం నడిపిస్తూ, రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థిని కాదని యూపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ ఓటు వేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్లతో కలిసి మహాఘట్బంధన్ ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారు. సర్జికల్ స్ట్రయిక్స్ పేరుతో పాకిస్తాన్పైన మెరుపుదాడులు నిర్వహించడాన్ని బలపరిచారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా మహాఘట్బంధన్నూ, ప్రతిపక్ష ఐక్యతనూ తోసిరాజని బీజేపీతో చేతులు కలిపి ప్రధాని మోదీ చేత శభాష్ అనిపించుకున్నారు. ఏ మోదీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించినందుకు నిరసనగా బీజేపీతో పొత్తు రద్దు చేసుకొని ఆర్జేడీ, కాంగ్రెస్లతో కదం కలిపి మతతత్వ శక్తులపైన యుద్ధం ప్రకటించారో అదే మోదీ ఆమోదంకోసం, ప్రశంసకోసం నితీశ్ తహతహలాడుతున్నట్టు కనిపిస్తున్నారు.
రాహుల్గాంధీ అన్నట్టు నితీశ్ కుమార్ మహాఘట్బంధన్ను విచ్ఛిన్నం చేయడం ద్వారా బిహార్ ప్రజలను వంచించారా? బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతామంటూ ఎన్నికలలో ఓట్లు సంపాదించి గెలిచిన తర్వాత మూడేళ్ళకు మిత్ర పక్షానికి జెల్లకొట్టి ప్రతిపక్షమైన బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం అవకాశవాదరాజకీయమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు సూటిగా, సరళంగా ఉండవు. నితీశ్ కుమార్ను సమర్థించడానికీ, వ్యతిరేకించడానికీ బలమైన వాదనలు ఉన్నాయి. అనుకూలమైన అంశాలు ఏమిటి? నితీశ్ కుమార్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచీ బిహార్లో గూండా రాజకీయాలకూ, అవినీతికీ, సంఘవిద్రోహ శక్తులకూ వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతూ వచ్చారు. రాష్ట్రంలో నేరాల రేటు తగ్గడానికీ, విద్యారంగంలో బాలికలు ప్రగతి సాధించడానికీ, అన్ని రంగాలలో ముందంజ వేయడానికీ దోహదం చేశారు.
తన పార్టీ నాయకులను అవినీతికి దూరం ఉంచారు. ఈ లక్ష్యాలకోసమే ఈ రోజు బీజేపీతో చేతులు కలిపారు. లాలూ తనయుడూ, ఉపముఖ్యమంత్రి తేజశ్వనీ యాదవ్పైన వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణల నేపథ్యంలో మహాఘట్బంధన్ ప్రభుత్వం కొనసాగే అవకాశం లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొటున్న తేజశ్వనీ యాదవ్ రాజీనామా చేసే ప్రసక్తి లేదని లాలూ ప్రసాద్ ప్రకటించిన తర్వాత నితీశ్ కుమార్ ఎదుట ఉన్నది ఒకే ఒక్క మార్గం– సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దు చేయడం. అవినీతిపై పోరాటం కొనసాగడం బిహార్ ప్రజలకూ అవసరమే. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ అదనపు నిధులు తెచ్చి అభివృద్ధికోసం వినియోగించడం బిహార్ ప్రజల సంక్షేమం కోసమే. అవినీతి అరోపణలు వెల్లువెత్తినా, ప్రభుత్వ వ్యవహారాలలో పెద్దన్న లాలూ ప్రసాద్ జోక్యం మితిమీరినా మిన్నకుండటమే సంకీర్ణధర్మం అయితే అది నితీశ్కుమార్కు శిరోధార్యం కాదు. వాజపేయి, మన్మోహన్సింగ్లు అవినీతి మంత్రులను సంకీర్ణ సుస్థిరతకోసం అనుమతించడం ద్వారా దేశానికి అపకారం చేశారు.
యూపీఏ ప్రభుత్వాధినేత మన్మోహన్సింగ్ వ్యక్తిగతంగా మచ్చలేని వ్యక్తి. సోనియాగాంధీపైన అవినీతి ఆరోపణలు వచ్చినా ఏదీ నిరూపణ కాలేదు. అటువంటి వ్యక్తుల సారథ్యంలోని యూపీఏ–2 ప్రభుత్వం భ్రష్టు పట్టడానికి ప్రధాన కారణం డిఎంకే మంత్రులు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి ముందే మన్మోహన్సింగ్ మారన్, రాజాలపైన చర్య తీసుకొని ఉంటే యూపీఏకి ఇంతటి అప్రతిష్ఠ వచ్చేది కాదు. లాలూ కుమారుడూ, ఉపముఖ్యమంత్రి అయిన తేజస్వినిని పల్లెత్తు మాట అనకుండా తానే రాజీనామా సమర్పించడం చాణక్యనీతి. అవినీతి మకిల అంటినా సంకీర్ణధర్మం పాటించడమే రాహుల్గాంధీ చెబుతున్న నీతి, నియమం అయితే వాటి పట్ల నితీశ్కుమార్కు ఏ మాత్రం గౌరవం లేదు.
మహాఘట్బంధన్ పుట్టి ముంచాలన్న నితీశ్కుమార్ నిర్ణయం కొంతమేరకు సమర్థనీయమే. కానీ ఆ నిర్ణయం అమలు జరిగిన తీరు మాత్రం పూర్తిగా ఆక్షేపణీయం. నితీశ్కుమార్ రాజీనామా చేసిన తర్వాత బిహార్ శాసనసభలోని మొత్తం 243 స్థానాలలో 80 స్థానాలు కలిగిన ఆర్జేడీ అతిపెద్ద పార్టీ. రాజ్యాంగం ప్రకారం అతిపెద్ద పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ముందు ఇవ్వాలి. ఆ పార్టీ సిద్ధంగా లేకపోతేనో, విఫలమైతేనో ప్రత్నామాయం గురించి ఆలోచించాలి. రాష్ట్రపతి కోవిద్ బిహార్ గవర్నర్గా ఉండగా ఇటువంటి పరిణామాలు సంభవిస్తే ఏమి చేసేవారో తెలియదు. కానీ తాత్కాలిక గవర్నర్గా వ్యవహరిస్తున్న పశ్చిమబెంగాల్ గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠీకి రాజ్యాంగ మర్యాదలు పాటించే సహనం లేదు. మమతాబెనర్జీతో తివారీ ఘర్షణ పడుతున్న తీరు గమనించినవారికి ఆయన నేరుగా నితీశ్ చేత ప్రమాణం చేయించడం ఆశ్చర్యం కలిగించదు. ఘటనాఘటన సమర్థుడైన ప్రధాని నరేంద్రమోదీకి సైతం విధివిధానాల పట్ల పట్టింపు లేకపోవడం విచారకరం. నితీశ్కుమార్ కటీఫ్ రాజకీయానికి ఇది పరాకాష్ఠ.
నితీశ్కుమార్ మనుషులు కేంద్రంలో చేరతారు. మోదీ భృత్యులు బిహార్ ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు. మహాఘట్బంధన్ మూడేళ్ళ ముచ్చటగా మిగిలిపోతుంది. లాలూ కానీ సోనియాగాంధీ కానీ చేయగలిగింది ఏమీలేదు. మోదీ–నితీశ్ ద్వయం ఎత్తుగడలు ప్రతిపక్షాలను చిత్తు చేశాయి. బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని నిర్వీర్యం చేశాయి. అయినా పోరాటం ఆగదు.
- కే రామచంద్ర మూర్తి