చంద్రబాబుకు చిరంజీవి లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సినీనటుడు చిరంజీవి బహిరంగ లేఖ రాశారు. 'ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఆవేదన కలిగిస్తున్నాయి.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సినీనటుడు చిరంజీవి బహిరంగ లేఖ రాశారు. 'ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఆవేదన కలిగిస్తున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు గర్జన సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలు దిగ్ర్భాంతి కలిగించాయి. అయితే ఈ సంఘటనలకు ప్రధాన కారణం...20 మాసాలుగా రాష్ట్రంలో పారదర్శకత లేకుండా సాగుతున్న మీ పరిపాలనే కారణం అని చెప్పడానికి అనే ఉదంతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కాపులను బీసీల్లో చేర్చతామని ఏడాదికి వెయ్యి కోట్ల నిధులు ఇస్తామని.. 18 నెలలు కాలయాపన చేసి కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఇచ్చారు. రైతు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని, కాపులను బీసీల్లో చేర్చే మాటను కూడా విస్మరించారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీల్లో చేర్చేలా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి. ఇక అమరావతి నిర్మాణంలోనూ పారదర్శకత లోపించింది. పాలనా లోపాలు నిరూపించిన వారిపై ఎదురు దాడి చేయడం దారుణం. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే కాపులు, బీసీలు మహిళలే కాదు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చినవారు సైతం రోడ్డెక్కి ఉద్యమం చేస్తారు' అని చిరంజీవి హెచ్చరించారు.


