బాబు జేబులో జేపీ

బాబు  జేబులో  జేపీ - Sakshi


బాబు, జేపీల మధ్య లోపాయికారీ ఒప్పందం

టీడీపీ, బీజేపీ ఓడిపోవద్దంటూ.. జేపీ మమ్మల్ని పోటీ నుంచి తప్పించారు

జేపీ కోసమే బాబు రేవంత్‌రెడ్డిని మల్కాజ్‌గిరి బరిలో నిలపలేదు

గెలిస్తే.. బీజేపీకి మద్దతిచ్చి కేంద్రమంత్రి అవ్వాలని జేపీ ఆశ

సిద్ధాంతాలు వదిలి పొత్తుల కోసం వెంపర్లాడారు

లోక్‌సత్తా రాష్ట్ర కార్యదర్శి ఏనుగు రామారావు ఆరోపణ




 ఎలక్షన్ సెల్

 

తెలంగాణలో లోక్‌సత్తా పార్టీ నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజ్‌గిరి నుంచి ఆ పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ, చేవెళ్ల నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏనుగు రామారావు, సికింద్రాబాద్ నుంచి పి.రోహిత్‌కుమార్, మహబూబాబాద్ నుంచి రెడ్యానాయక్‌లను పార్టీ అభ్యర్థులుగా ఈ నెల ఆరో తేదీన ప్రకటించింది. జయప్రకాశ్ నారాయణ మాత్రం మల్కాజ్‌గిరి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. మిగతా ముగ్గురు నామినేషన్లు వేసేందుకు సిద్ధం కాగా చివరి క్షణంలో జేపీ వారికి బీ ఫారాలు ఇవ్వలేదు. ‘మనం ఆ మూడు చోట్ల పోటీ చేస్తే ఓట్లు చీలి టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఓడిపోతారు. అందువల్ల మీరు పోటీ చేయొద్ద’ని అభ్యర్థులకు నచ్చజెప్పి తానుమాత్రం లోక్‌సభ బరిలో నిలిచారు. ఈ మొత్తం తతంగం వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జయప్రకాశ్ నారాయణల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం ఉందని లోక్‌సత్తా పార్టీ నుంచి చేవెళ్ల టిక్కెట్టు లభించి బీఫారం పొందని ఏనుగు రామారావు ఆరోపిస్తున్నారు. ఆయన ‘సాక్షి’కిచ్చిన ఇంటర్వ్యూ..

 ఆయన మాటల్లోనే..!



 ఫోనోచ్చింది.. ఒప్పందం కుదిరింది



 నన్ను చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిగా ఈ నెల ఆరున అధికారికంగా ప్రకటించారు. 9వ తేదీ నామినేషన్లకు చివరి గడువు కావడంతో 8వ తేదీ రాత్రి బీ-ఫారం కోసం పార్టీ ఆఫీసుకు వెళ్లాను. ఎంత రాత్రయినా బీ-ఫారం ఇవ్వలేదు.చివరకు మనం ఆ మూడుచోట్లా (మల్కాజిగిరి మినహా) పోటీ చేయడంలేదంటూ జేపీ చావు కబురు చల్లగా చెప్పారు. లోక్‌సత్తా పోటీలో ఉంటే ఓట్లు చీలి టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఓడిపోతారనే కుంటి సాకు చెప్పారు. ‘మల్కాజిగిరిలో కూడా టీడీపీ అభ్యర్ధి రంగంలో ఉన్నాడు కదా. టీడీపీ కోసం మీరు కూడా తప్పుకోవాలి కదా’ అంటే సమాధానం లేదు. వాస్తవానికి ఆ రోజు జరిగిందేంటంటే.. జేపీకి ఆ రోజు చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్‌లో ఏదో మాట్లాడారు. ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘చేవెళ్లలో దేవేందర్‌గౌడ్ కొడుకు వీరేంద్రగౌడ్ టీడీపీ తరపున పోటీ చేస్తున్నాడు. ఏనుగు రామారావు పోటీ చేస్తే వీరేంద్రగౌడ్ గెలవడు.. అందువల్ల ఏనుగు రామారావును బరిలోకి దింపొద్ద’ని చంద్రబాబు చెప్పడం వల్లే నాకు బీ ఫామ్ ఇవ్వలేదు. దేవేందర్‌గౌడ్ కొడుకు కోసం చంద్రబాబుతో ఒప్పందం కుదుర్చుకొని నన్ను తప్పించారు. చేవెళ్లలో నేను పోటీ చేస్తే కనీసం లక్ష ఓట్లు వస్తాయి. ఇప్పుడు నేను పోటీ నుంచి తప్పుకుంటే.. ప్రత్యర్థుల నుంచి డబ్బులు తీసుకొని అమ్ముడుపోయానని ప్రజలు పొరబడే అవకాశం ఉంది. కాబట్టి జేపీ బహిరంగంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. జేపీ మల్కాజిగిరీలో పోటీలో ఉంటే వ్యతిరేకంగా ప్రచారం చేస్తాను.



 లోక్‌సత్తా స్థాయిని దిగజార్చారు



 మద్యం, డబ్బులు పంచొద్దు.. నేరచరితులకు టిక్కెట్లు ఇవ్వొద్దనేది లోక్‌సత్తా విధానం. అలా చేసే పార్టీలకు మద్దతు ఇవ్వొద్దనేది నిబంధన. టీడీపీ, బీజేపీలతో పొత్తుకోసం వెంపర్లాడి.. లోక్‌సత్తా స్థాయిని జేపీ దిగజార్చారు. వామపక్షాలతో పొత్తు అన్నాడు. కానీ వాళ్ల వల్ల తనకు ప్రయోజనం లేదనుకొని టీడీపీ, బీజేపీ పంచన చేరాడు. ఆమ్‌ఆద్మీతో పొత్తు అన్నాడు. కానీ వాళ్లు విలీనం అన్నారు. దీంతో అహం దెబ్బతిని దానికి దూరంగా ఉన్నాడు. పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి పార్టీని ఎదగనీయడం లేదు. తనకు తాను మేధావినని అనకుంటూ.. పార్టీలోని ఇతర నాయకులకు విలువ ఇవ్వడు. ప్రైవేటు ఎస్టేట్‌లా పార్టీని తయారుచేశాడు.

 

 అవినీతిపరులతో చేతులు



 చంద్రబాబు-జయప్రకాశ్ నారాయణ ఇద్దరూ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి ఇష్టపడ్డా మల్కాజిగిరి నుంచి ఆయనను చంద్రబాబు నిలబెట్టలేదు. జేపీతో ఒప్పందం చేసుకవడం వల్లనే బలమైన రేవంత్‌రెడ్డిని తప్పించి ఈ మధ్యే టీడీపీలో చేరిన మల్లారెడ్డికి టిక్కెట్టు ఇచ్చారు. బలహీన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా జేపీకి మార్గం సుగమం చేశారు. అందుకు కృతజ్ఞతగా జేపీ మమ్మల్ని బలి చేశాడు. ఒకవేళ గెలిస్తే బీజేపీకి మద్దతు ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి పొందొచ్చన్నది జేపీ దురాలోచన. వయస్సు మీద పడుతుండటంతో ఆయనకు పదవీ వ్యామోహం పెరిగింది. అంతేకాదు తన స్వప్రయోజనాల కోసం కటారి శ్రీనివాసరావును ఈసారి కూకట్‌పల్లి నుంచి పోటీ చేయిస్తున్నారు. ఎందుకంటే ఆ అసెంబ్లీ స్థానం మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఓట్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆయన్ను ఇక్కడి నుంచి నిలబెట్టారు. జేపీలాంటి దేశద్రోహులకు బుద్ధి చెప్పాలి. జేపీ మాయమాటలకు ఎందరో బలయ్యారు. అవినీతిపరులు, నేరచరిత్రులకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి ఇప్పుడు వాళ్లతోనే చేతులు కలుపుతున్నార

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top