
నంద్యాల గెలుపు కోసం బరితెగింపు...
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ బరి తెగిస్తోంది.
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ బరి తెగిస్తోంది. ఎలాగైనా ఉప ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ నేతలు సాక్ష్యాత్తు రౌడీ షీటర్ల సాయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీ కోసం పని చేస్తే రౌడీ షీట్లు ఎత్తివేస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. నంద్యాలలో జరిగిన పార్టీ సమావేశంలో ఏకంగా జిల్లా అధ్యక్షుడే రౌడీషీటర్లకు హామీలు గుప్పించారు.
జిల్లా అధ్యక్షుడు సోమివెట్టి వెంకటేశ్వర్లు పార్టీ సమావేశంలో మాట్లాడుతూ... ‘రౌడీషీట్ ఉందని భయపడొద్దు. ఈ విషయం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లాం. పార్టీ కోసం పని చేస్తే రౌడీషీట్ ఎత్తేస్తాం. త్వరలో నంద్యాలకు మంత్రి లోకేశ్ వస్తారు, మీతో సమావేశం అవుతారు.’ అని ఆఫర్ ఇచ్చారు. ఏకంగా జిల్లా అధ్యక్షుడే రౌడీషీటర్లకు హామీలు గుప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.