‘రుద్రమదేవి’కి సీక్వెల్!

‘రుద్రమదేవి’కి సీక్వెల్!


గుణశేఖర్ ‘రుద్రమదేవి’ సినిమాలో ప్రధానంగా రుద్రమదేవి కథ వరకే చెప్పారు. అదీ ఆమె పట్టాభిషేకం వరకే సాగింది. రుద్రమదేవి జీవితంలోని అనేక ఇతర ప్రధాన ఘట్టాలు, ఆమె తరువాత కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన మహావీరుడు, ఆమె మనుమడు ప్రతాపరుద్రుడి జీవితం చరిత్రలో మరో పెద్ద అధ్యాయం.



చరిత్ర ప్రకారం రుద్రమదేవికి కూడా ముగ్గురూ కుమార్తెలే. మూడో కుమార్తె ముమ్మిడమ్మకూ, మహదేవరాజుకూ కలిగిన బిడ్డ - ప్రతాపరుద్రుడు. ఆ బాలుణ్ణి రుద్రమదేవి దత్తత తీసుకుంది. ఆమె అనంతరం యువరాజు ప్రతాపరుద్రుడే రాజయ్యాడు. అతని పాలనలో కాకతీయ రాజ్యం ఉన్నత స్థితికి చేరింది. ప్రతాపరుద్రుని తరువాత కాకతీయ వంశం అంతరించింది.



అన్నీ కుదిరితే... ‘ప్రతాపరుద్రుడు... ది లాస్ట్ ఎంపరర్’ పేరిట ‘రుద్రమదేవి’ చిత్రానికి సీక్వెల్ తీయాలని గుణశేఖర్ సంకల్పం. అందుకు తగ్గట్లే, ‘రుద్రమదేవి’ సినిమాను ప్రతాపరుద్రుడి ప్రస్తావనతో, ‘ప్రతాపరుద్రుడు... ది లాస్ట్ ఎంపరర్’ అనే టైటిల్‌ను చూపించి, ముగించడం విశేషం. దాదాపు 80 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సినిమా తీసిన గుణశేఖర్ ఆ సీక్వెల్ కూడా తీస్తే... తెలుగుజాతి చరిత్రలో కాకతీయ సామ్రాజ్య ఘట్టం మొత్తాన్నీ తెర కెక్కించిన ఫిల్మ్ మేకర్ అవుతారు. అదంతా, ఈ ‘రుద్రమదేవి’కి ప్రేక్షకాదరణను బట్టే ఉంటుంది.


-రెంటాల జయదేవ

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top