
‘త్వరలో జైలుకు చంద్రబాబు’
జైలు అనే మాట వింటే సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైఎస్సార్ సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: జైలు అనే మాట వింటే సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైఎస్సార్ సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. త్వరలోనే ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో కురసాల కన్నబాబుతో కలిసి అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ప్రతిరోజు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. ఓటు కోటు కేసులో ఆడియో టేపులతో దొరికిపోవడం ప్రపంచమంతా చూసిందన్నారు. జైలుకు వెళతారనే భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయారని దుయ్యబట్టారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరిపేందుకు వెనుకంజ వేశారన్నారు. స్వప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. విశాఖలో లక్షలాది రూపాయల భూములు ఆక్రమణకు గురైనా విచారణ జరిపించకుండా తప్పించుకున్నారని మండిపడ్డారు. జైలు శిక్ష పడితే అనుభవించడానికి మీకున్న వయసు కూడా సరిపోదని వ్యాఖ్యానించారు. రాజకీయ కుట్రతో అక్రమంగా జగన్పై కేసులు పెట్టించి జైలుకు పంపించారని అన్నారు. 2019లో చంద్రబాబుకు ప్రజలకు బుద్ధి చెబుతారని అమర్నాథ్ పేర్కొన్నారు.
తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి జగన్పై పదేపదే చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని కురసాల కన్నబాబు విమర్శించారు. చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణకు సిద్ధపడడం లేదని ప్రశ్నించారు. హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జగన్పై ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబుకు జగన్ పేరు ఎత్తందే తెల్లవారడం లేదని, జగన్ పేరు వినగానే నిద్రలో ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిజస్వరూపం బయటపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.