
'అదొక బాధ్యత.. దాన్ని ఆస్వాదిస్తా'
త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన అజ్యింకా రహానే తనపై ఉంచిన కొత్త బాధ్యతతో మరింత రాటుదేలతానని స్పష్టం చేశాడు.
ముంబై: త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన అజ్యింకా రహానే తనపై ఉంచిన కొత్త బాధ్యతతో మరింత రాటుదేలతానని స్పష్టం చేశాడు. ఈ సరికొత్త బాధ్యత కచ్చితంగా తన వ్యక్తిగత ప్రదర్శన మెరుగు కావడానికి దోహద పడుతుందన్నాడు. వైస్ కెప్టెన్సీ అనేది ఒక బాధ్యత అని, తాను ఎప్పుడూ బాధ్యతలు తీసుకోవడాన్ని ఆస్వాదిస్తానని తెలిపాడు. గతంలో జింబాబ్వేతో పర్యటనకు కెప్టెన్సీ గా వ్యవహరించినప్పుడు జట్టు నుంచి చాలా నేర్చుకున్నానని రహానే తెలిపాడు.
గత మూడు-నాలుగు సంవత్సరాల క్రితం విండీస్ కు టూర్ కు వెళ్లిన భారత జట్టులో తాను సభ్యుడునని ఈ సందర్బంగా రహానే తెలిపాడు. ఆ సమయంలో అక్కడి పిచ్ లు చాలా మందకొడిగా ఉన్నాయన్నాడు. అయితే అక్కడ బార్బోడాస్, జమైకా పిచ్ లలో మంచి బౌన్స్, పేస్ ఉంటుందనే విషయాన్ని విన్నట్లు రహానే తెలిపాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో భిన్నమైన వికెట్లపై ఆడాల్సి ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. విండీస్ పిచ్లపై ఆడటానికి యువకులతో కూడిన జట్టు వెళుతుందని, తామంతా ఆ టూర్ లో ఆడటానికి చాలా ఉత్సుకతో ఉన్నట్లు పేర్కొన్నాడు.