దేవిశ్రీ మోగించట్లేదు!

దేవిశ్రీ మోగించట్లేదు!


బాలకృష్ణ వందో చిత్రానికి  మ్యూజిక్ కంచె

చారిత్రక చిత్రానికి చిరంతన సంగీతం!


 

గత ఏడాది తన ‘కంచె’కు మ్యూజిక్ చేసి, అవార్డులూ రివార్డులూ పొందిన బొంబాయి మ్యూజిక్ డెరైక్టర్ చిరంతన్‌భట్ వైపు క్రిష్ చూపు ఉందని ‘సాక్షి’కి అందిన సమాచారం. ఇప్పటికే మూడు సిచ్యుయేషన్స్ ఆయనకు క్రిష్ చెప్పారట. అందులో ఒక దానికి ఇప్పటికే చిరంతన్ ట్యూన్ కట్టేశారనీ, ఆ ట్యూన్ బాగుందనీ వినికిడి. మొన్న ఆదివారమే పెళ్ళి చేసుకొని, ప్రస్తుతం విహారయాత్రలో ఉన్న క్రిష్ తిరిగి వచ్చే లోగా చిరంతన్ మరికొన్ని ట్యూన్లు సిద్ధం చేసే సూచనలున్నాయి. హనీమూన్ నుంచి రాగానే ఆ ట్యూన్లు విని, అధికారికంగా కొత్త మ్యూజిక్ డెరైక్టర్‌ను క్రిష్ ఎనౌన్స్ చేస్తారు. ఏమైనా, చాలారోజులకొస్తున్న ఓ చారిత్రకచిత్రానికి సంగీతమిచ్చే అరుదైన ఛాన్స్ దేవిశ్రీప్రసాద్ వదిలేసుకున్నట్లే!




ఇవాళ తెలుగు సినీ రంగంలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డెరైక్టర్ అంటే - దేవిశ్రీ ప్రసాద్. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, చారిత్రక కథా చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ నుంచి దేవిశ్రీ తప్పుకోవడం! చేతి నిండా సినిమాలు, మరో విదేశీ పర్యటన కూడా ఉండడంతో, ఈ చారిత్రక కథాచిత్రానికి దేవిశ్రీ తగినంత టైమ్ కేటాయించలేకపోతున్నారట!




ఆ ముగ్గురిలో... కొత్త మ్యూజిక్ డెరైక్టర్ ఎవరు?

దర్శకుడు క్రిష్ ఇప్పుడు మరో సంగీత దర్శకుడి అన్వేషణలో పడ్డారు. గతంలో ‘శ్రీరామరాజ్యం’కి సంగీతం అందించిన ఇళయరాజా, భక్తిరస ప్రధానమైన ‘పాండు రంగడు’తో పాటు తాజా ఇండస్ట్రీ సెన్సేషన్ ‘బాహుబలి’కి బాణీలిస్తున్న కీరవాణి - ఇలా కొన్ని పేర్లు కృష్ణానగర్‌లో ప్రచారంలో ఉన్నాయి.


‘సాక్షి’ సేకరించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం క్రిష్ బృందం అసలు ఇళయరాజాను ఇంతదాకా సంప్రతించనే లేదట! ఇక, గతంలో క్రిష్ ‘వేదం’కు సంగీతం అందించిన కీరవాణి విషయానికి వస్తే ప్రస్తుతం చేస్తున్నవి ‘బాహుబలి 2’, ‘ఓం నమో వెంకటేశాయ’ - రెండే. పైగా పౌరాణికం, జానపదం, సాంఘికం - ఇలా అన్ని తరహా సినిమాలకూ బాణీలు కట్టిన అనుభవం ఆయనకుంది. కానీ, ‘వేదం’ తరువాత మళ్ళీ కీరవాణి కాంబినేషన్‌ను రిపీట్ చేయని క్రిష్ ఆయన వైపు మొగ్గుతారా అన్నది సందేహమే. అన్నట్లు, క్రిష్ పెళ్ళికి దర్శకుడు రాజమౌళి బృందం వచ్చినా కీరవాణి ఏ బిజీ వల్లో కానీ హాజరు కాలేదు.




దేవిశ్రీతో తేడా ఎక్కడొచ్చినట్లు?

అసలు ఈ భారీ హిస్టారికల్ సినిమా అనుకోగానే ఇళయరాజా, కీర వాణి సహా పలువురి పేర్లు చర్చకు వచ్చాయట. క్రిష్ లేటెస్ట్ సెన్సేషన్ దేవిశ్రీ వైపే మొగ్గారు. దేవిశ్రీ కూడా మొదట్లో ఉత్సాహపడ్డారు. కానీ, ఆ తరువాత వరుసగా అంగీకరించిన అనేక ప్రాజెక్ట్స్ మధ్య రెగ్యులర్ చిత్రా లకు భిన్నమైన ఈప్రెస్టీజియస్ ఛాన్స్‌కు దేవిశ్రీ ఎందుకనో తగినంత సమయం కేటాయించట్లేదని వినికిడి. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న తొలిసారిగా ఈ చిత్రం డిజిటల్ మోషన్ పిక్చర్ రిలీజ్ చేశారు. దానికి కూడా దేవిశ్రీ తగినంత సమయం కేటాయించ లేదని వినికిడి. అప్పటికి ఓ డిజిటల్ ప్రచార మాధ్యమ సంస్థ చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజి క్‌తోనే పోస్టర్ రిలీజ్ కానిచ్చేశారు. ఆ తరువాత దేవిశ్రీ కొట్టి(ం)చ్చిన నేపథ్య సంగీతం అంతంత మాత్రంగా ఉండడంతో, ఇప్పటి దాకా ఆ డిజిటల్ మోషన్ పోస్టర్‌ను చిత్రయూనిట్ అధికారికంగా రిలీజ్ చేయలేక పోయింది.



ఒక పక్కన సినిమా షూటింగ్ శరవేగంతో జరిగిపోతున్నా, ఇప్పటి వరకు ఆయన రెండు పాటల కోసం 4 ట్యూన్లే చేశారట. అవి యూనిట్‌కు అంత తృప్తికరంగా అనిపించలేదు. కానీ, కొత్త ట్యూన్‌లకు కూర్చొనేందుకు దేవిశ్రీ సమయం ఇవ్వలేకపోతున్నారు. ఆ మధ్య దేవిశ్రీ తన తండ్రి సత్యమూర్తి జయంతి జరుపుతూ ఆయనతో పనిచేసిన హీరో లందరి నుంచి వీడియోలో అభిప్రాయం తీసుకున్నారట. కానీ, అప్పట్లో మొరాకోలో షూటింగ్‌లో ఉన్న బాలకృష్ణ గుర్రంపైనుంచిపడి ప్రమాదం పాలై, ఆస్పత్రి హడావిడిలో వీడియో బైట్ ఇవ్వలేకపోయారట. అది కూడా దేవిశ్రీలో అసంతృప్తి పెంచిందా అని కృష్ణానగర్‌లో ఒకటే చర్చ.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top