నా నిజాయితీని నిరూపించుకుంటా: తరుణ్

నా నిజాయితీని నిరూపించుకుంటా: తరుణ్ - Sakshi


హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సిట్‌ ఎదుట తన నిజాయితీని నిరూపించుకుంటానని ప్రముఖ నటుడు తరుణ్‌ అన్నారు. తన తండ్రి చక్రపాణితో కలిసి నేటి ఉదయం ఆయన సిట్ కార్యాలయానికి వచ్చారు. హైదరాబాద్‌ నగరాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్‌ వ్యవహారానికి సంబంధించి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హీరో తరుణ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌కు సంబంధించి డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్‌ కే నాయుడు, నటుడు సుబ్బరాజును విచారించిన సిట్ బృందం ప్రముఖ డ్రగ్ డీలర్, ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో సంబంధాలపై నేటి ఉదయం పది గంటల నుంచి సిట్ అధికారులు తరుణ్‌ను ప్రశ్నిస్తున్నారు. విచారణలో తరుణ్ సానుకూలంగా స్పందిస్తున్నట్లు సిట్ అధికారులు చెబుతున్నారు.



గతంలో సొంతంగా పబ్ నిర్వహించిన తాను ఆరేళ్ల కిందటే ఈ వ్యాపారానికి స్వస్తి పలికినట్లు విచారణలో తరుణ్ చెప్పారు. ప్రస్తుతం ఏ పబ్‌లోనూ తాను పార్ట్‌నర్‌గా కొనసాగడం లేదని చెప్పిన తరుణ్.. విచారణ అనంతరం అన్ని విషయాలు చెబుతానన్నారు. డ్రగ్స్ కేసులో సిట్ ఎదుట తన నిజాయితీని నిరూపించుకుంటానని ఆయన ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. నేటి విచారణలో భాగంగా కెల్విన్‌తో తరుణ్‌కు పరిచయం ఎలా ఏర్పడింది, ఆ పరిచయం ఇప్పటికీ కొనసాగుతోందా అనే కోణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తరుణ్ గతంలో సొంతంగా నిర్వహించిన పబ్‌ ప్రారంభోత్సవానికి హాజరైన వివరాలతో పాటు వారితో ఉన్న రిలేషన్‌పై ప్రశ్నలు అడిగి కీలక సమాచారం సేకరిస్తున్నారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top