టీడీపీ 3 నెలల పాలనలో 19 హత్యలు | 19 murders during 3 months of tdp reign, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

టీడీపీ 3 నెలల పాలనలో 19 హత్యలు

Aug 14 2014 7:35 AM | Updated on Jul 25 2018 4:09 PM

టీడీపీ 3 నెలల పాలనలో 19 హత్యలు - Sakshi

టీడీపీ 3 నెలల పాలనలో 19 హత్యలు

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 19 హత్యలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజం
     
గ్రామాల్లో చిచ్చుపెట్టి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు
చంద్రబాబుకు మానవత్వం ఉందా?
టీడీపీకి ఓటు వేయలేదన్న ఒకే కారణంతో కృష్ణారావును చంపారు
సీబీఐ విచారణ కోసం కోర్టును ఆశ్రయిస్తాం
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం


విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 19 హత్యలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.  గ్రామాల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మానవత్వం ఉందా అని మండిపడ్డారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో హత్యకు గురైన వైఎస్సార్ సీపీ నేత, గ్రామ ఉప సర్పంచి ఆలోకం కృష్ణారావు కుటుంబ సభ్యులను జగన్ బుధవారం పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గొట్టుముక్కల ఘటనపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. జగన్ మాట్లాడిన విషయాలు ఆయన మాటల్లోనే..

‘‘ఆదివారం రాత్రి గ్రామంలో అందరూ చూస్తుండగా కృష్ణారావును దారుణంగా హతమార్చారు. చంపొద్దని ఆయన భార్య కాళ్లావేళ్లా పడ్డా లెక్కచేయలేదు. ఇది నిజంగా సమాజం సిగ్గుపడాల్సిన ఘటన. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. కేవలం టీడీపీకి ఓటు వేయలేదన్న ఒకే కారణంతో ఉప సర్పంచిని, గతంలో ఏ తప్పూ చేయని వ్యక్తిని, ఒక్క కేసూ లేని వ్యక్తిని హతమార్చారు. ఇతర పార్టీలకు ఓట్లు వేసే వారు ఉండకూడదన్న దౌర్భాగ్య ఆలోచనతో గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఆరోజు పొద్దున్నే గ్రామంలో యర్రంరెడ్డి సీతయ్యను కొట్టారు. స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు అవహేళన చేశారు. మళ్లీ రాత్రి 9 గంటలకు గ్రామంలో సెల్వరాజు అనే వ్యక్తి తల పగులగొట్టారు. రక్తం కారుతున్న సెల్వరాజు ఫోన్‌చేసి పోలీసులను బతిమిలాడినా, చివరకు సర్పంచి ఫోను చేసినా పోలీసులు స్పందించలేదు. అదే రోజు రాత్రి 11.30 గంటలకు సెల్వరాజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసులు పెట్టమని అడిగినా పట్టించుకోలేదు. ఎవరినీ అరెస్టు చేయలేదు. రాత్రి 11.50 గంటలకు గ్రామంలో యథేచ్ఛగా దాడిచేశారు. 20 మంది ఇంటి బయట ఎవ్వరూ రాకుండా కాపు కాస్తుండగా ఆరుగురు కృష్ణారావు ఇంట్లోకి చొరబడి అతి కిరాతకంగా చంపేశారు. పోలీసులను ఇంత దారుణంగా వాడుకోవడం సరైన పద్ధతా? చంద్రబాబు అధికారంలో ఉండొచ్చు. కానీ ఇది శాశ్వతం కాదు. ఇవ్వాళ వారు ఉండొచ్చు. రేప్పొద్దున మనం ఉంటాం. సాక్షాత్తూ పోలీసులకు సహకరించండి అంటూ సిగ్నల్స్ ఇచ్చి, వారి డ్యూటీని చేయనీయకుండా చేస్తున్నారు. హింసను ప్రోత్సహించేలా, పోలీసులను కూడా భాగస్వాములను చేసేలా ముఖ్యమంత్రి, మంత్రులు వ్యవహరించటం ఎంతవరకు సమంజసం? హత్య జరిగి రెండు రోజులైనా నిందితులను అరెస్టు చేయలేదు. వారే వచ్చి లొంగిపోయేదాకా అరెస్టు చేయలేదంటే వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతున్నది.’’

రెండున్నర నెలల క్రితం కూడా ఇంతే...

‘‘ఇదే జిల్లాలో రెండున్నర నెలల క్రితం ఇటువంటి కిరాతక హత్య జరిగింది. అవనిగడ్డ నియోజకవర్గంలో మే 16న బాణాసంచా కాలుస్తుంటే పిల్లలు భయపడతారని, పక్కన కాల్చండి అని చెప్పినందుకు రేపల్లె సురేష్ అనే వ్యక్తి నెత్తి పైనే బాంబు పెట్టి  చంపేస్తే దిక్కుదివాణం లేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. చంద్రబాబును అడుగుతున్నా.. నువ్వు నిజంగా మనిషివేనా?’’ ఓటు వేయలేదనే కారణంతో మనుషులను చంపటం మానవత్వం కాదని చంద్రబాబుకి చెబుతున్నాను.

బాబూ ముందు హామీలు నిలుపుకో..

‘‘బాబు ముందు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలి. రైతులు రుణాల మాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. పంటల బీమా కూడా రాని పరిస్థితిలో ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి. డ్వాక్రా అక్కచెల్లెళ్లకు తోడుగా ఉండండి. ఇంటి కో ఉద్యోగం ఇవ్వండి’’.
 
అండగా ఉంటాం: కృష్ణారావు కుటుంబానికి భరోసా

 
విజయవాడ: ఆలోకం కృష్ణారావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. జిల్లా నేతలు కృష్ణారావు కుటుంబానికి అందుబాటులో ఉంటూ అన్ని విధాలా ఆదుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు ఎవరూ మనోధైర్యం కోల్పోకుండా పనిచేయాలని చెప్పారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న జగన్.. అక్కడి నుంచి నేరుగా గొట్టుముక్కలకు చేరుకుని కృష్ణారావు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. గంటన్నరకు పైగా కృష్ణారావు సతీమణి ముత్తమ్మ, పెద్ద కుమార్తె వాసిరెడ్డి నాగమణి, చిన్న కుమార్తె చనుమోలు పాపాయమ్మ, కుమారుడు శ్రీనివాస్‌లతో మాట్లాడారు. ‘నేనున్నాను.. అధైర్యపడొద్ద’ని వారికి భరోసా ఇచ్చారు.   

డీజీపీకి జగన్ ఫిర్యాదు

కృష్ణారావు కుటుంబ సభ్యులతో మాట్లాడిన తరువాత జగన్ అక్కడి నుంచే నేరుగా ఏపీ డీజీపీ జేవీ రాముడుతో ఫోన్లో మాట్లాడారు. గొట్టుముక్కల ఘటనపై ఫిర్యాదు చేశారు. గ్రామ ఉప సర్పంచిని  చంపినా పోలీసులు స్పందించలేదని, మరో ఐదుగురిని చంపుతామని టీడీపీ కార్యకర్తలు గ్రామంలో అందరినీ బెదిరిస్తున్నారని, తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. టీడీపీ ఆగడాలపై పలువురు గ్రామస్తులు, కార్యకర్తలు, మహిళలు జగన్‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement