మాయదారి మలుపే ముంచేసింది

మాయదారి మలుపే ముంచేసింది


నీటి ఉధృతిని సకాలంలో గమనించలేకే ఘోరం

క్షణాల్లో కొట్టుకుపోయి గల్లంతైన విద్యార్థులు

 ఇప్పటిదాకా నాలుగు మృతదేహాల వెలికితీత

 మృతులు: విజేత, ఐశ్వర్య, లక్ష్మీగాయత్రి, రాంబాబు

 దొరక ని మరో 20 మంది ఆచూకీ.. బతికే అవకాశాల్లేనట్లే

 అధికారుల అలసత్వం.. నింపాదిగా సహాయక చర్యలు

 తక్షణం స్పందిస్తే సగమైనా బతికేవారు: విద్యార్థులు

 నేటి ఉదయం వెళ్లనున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు

 అధికారుల అలసత్వంపై హిమాచల్ హైకోర్టు ఫైర్

 సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న

 మిగతా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు

 

 మండి (హిమాచల్‌ప్రదేశ్) నుంచి సాక్షి ప్రతినిధి ప్రవీణ్: ప్రకృతి అందాల నడుమ ఎలాగైనా కలిసి ఫొటో దిగాలన్న ఆశే అశనిపాతమైంది. జలరక్కసి రూపంలో మృత్యువు విరుచుకుపడింది. క్షణాల మీద బలి తీసుకుంది. ఆదివారం హిమాచల్‌ప్రదేశ్ కులుమనాలి సమీపంలో బియాస్ నది ప్రమాదంలో 24 మంది విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ గల్లంతైన దుర్ఘటనకు డ్యాం సిబ్బంది నిర్లక్ష్యంతో పాటు నది మూలమలుపు కూడా కారణమైంది. నీళ్లు లేవన్న భరోసాతో నదిలోకి దిగిన విద్యార్థులు తమకు కాస్త ఎగువన ఉన్న మూలమలుపు కారణంగా, డ్యాం నుంచి విడుదలై శరవేగంతో దూసుకొస్తున్న జలప్రవాహాన్ని సకాలంలో పసిగట్టలేకపోయారు. తీరా గ్రహించేసరికే ఆలస్యమైంది. అంతా దాని బారిన పడి, ఆక్రందనలు చేస్తూ, తోటివారి కళ్లముందే నిస్సహాయంగా కొట్టుకుపోయారు.

 

 ఇలా జరిగింది...

 

 జూన్ 3 రాత్రి హైదరాబాద్‌లో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన విద్యార్థుల బృందం 5న అర్ధరాత్రి 1.50కు ఆగ్రాలో దిగింది. రెండు రోజులు ఆగ్రా, పరిసరాలు, 7న ఢిల్లీలో అక్షరదామ్ తదితరాలు, 8న సిమ్లా చూసి మధ్యాహ్నం రెండు బస్సుల్లో మనాలి బయల్దేరింది. మండి దాటాక 35 కిలోమీటర్ల దూరంలోని తలౌటిలో ఆగింది. దారిపొడవునా కనువిందు చేస్తున్న జలపాతాలను చూసి మైమరచిన విద్యార్థులు ఒక్కసారి ఎలాగైనా నదిలోకి దిగాల్సిందేనని భావించారు. తలౌటి వద్ద అందుకు వీలు కుదిరింది. అక్కడ ఎలాంటి హెచ్చరికలూ లేకపోవడం, ప్రవాహమూ లేకపోవడం, స్థానికులు కూడా పర్లేదనడంతో విద్యార్థులంతా నదిలోకి దిగారు. అక్కడ 20 మీటర్ల వెడల్పే ఉంది. చిన్న చిన్న రాళ్లపై అడుగులు వేసుకుంటూ నది మధ్యలోని మూడు ఎత్తయిన బండ రాళ్లపైకి వెళ్లి నుంచుని ఫొటోలు దిగసాగారు. కొందరు బయటికి వెళ్లగా దాదాపు 30 మంది దాకా ప్రమాద సమయంలో అక్కడే ఉన్నారు. అదే సమయంలో ఎగువన డ్యాం గేట్లు ఎత్తేయడంతో జలరాశి వారికేసి అమిత వేగంతో ముంచుకు రాసాగింది. కానీ తమకు కాస్త ఎగువన ఉన్న నది మూలమలుపు కారణంగా వారు చివరిక్షణం దాకా ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు. కొంతమంది చివరి క్షణాల్లో అప్రమత్తమై చిన్న రాళ్ల మీదుగా ఒడ్డుకు చేరుకున్నారు. కానీ మధ్యలోని మూడు బండరాళ్ల మీద ఉన్నవాళ్లు ప్రమాదాన్ని పసిగట్టేలోపే ప్రవాహ ంలో కొట్టుకుపోయారు.

 

 18 మంది విద్యార్థులు, ఆరుగురు విద్యార్థినులు, ప్రహ్లాద్ అనే టూర్ ఆపరేటర్.. మొత్తం 25 మంది గల్లంతయ్యారు. సోమవారం సాయంత్రం వరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. వాటిని పోస్టుమార్టం కోసం మండీ జోనల్ ఆసుపత్రికి తరలించారు. మృతులను హైదరాబాద్‌కు చెందిన ఆకుల విజేత, గంపల ఐశ్వర్య, అప్పనబోతుల లక్ష్మీగాయత్రి, నల్లగొండ జిల్లాకు చెందిన బానోతు రాంబాబుగా గుర్తించారు. తోటివారి దుర్మరణాన్ని కళ్లారా చూసి షాక్‌కు గురైన విద్యార్థులను తొలుత కులుకు, అక్కడి నుంచి చండీగఢ్‌కు తరలించారు. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వారిని మార్గమధ్యంలో పరామర్శించారు. విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

 

 సమన్వయ లోపమే శాపం

 

 విద్యార్థులు కొట్టుకుపోయన నది లోయలో ఉండటం ఒక సమస్య కాగా, పాలకుల సమన్వయ లోపం కూడా సహాయక చర్యల పాలిట శాపంగా మారింది. దానికి తోడు ప్రమాదం జరిగిన వెంటనే చీకటి పడటంతో సహాయక చర్యలకు వీల్లేకుండా పోయింది. ఆదివారం సాయంత్రం ప్రమాదం జరిగితే, సోమవారం ఉదయానికి గానీ సహాయక బృందాలు రాలేదు! అవి కూడా కేవలం మృతదేహాల వెలికితీతేగా అన్నట్టుగా మొక్కుబడిగా పని చేశాయి. ఇప్పటిదాకా ఒక్క విద్యార్థిని కూడా ప్రాణాలతో తీసుకురాలేకపోయారు. ఎస్‌ఎస్‌బీ, పోలీసులు, హోంగార్డులు, స్థానిక డైవర్లు, రాఫ్టర్లతో కూడిన 70 మంది బృందం సహాయ, వెలికితీత కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది. సోమవారం రాత్రి కార్యకలాపాలను నిలిపేశారు. మంగళవారం ఉదయం తిరిగి మొదలు పెట్టనున్నారు. బ్యారేజీ నుంచి ప్రమాద స్థలి వరకు, అక్కడి నుంచి దిగువన పండోహ్ అనే డ్యాం వరకు నది 20 మీటర్ల వెడల్పే ఉంది. నది అంతా పూడికతో కూడుకుని ఉండటం వల్ల మృతదేహాలు అందులో కూరుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. కిందికి కొట్టుకొచ్చిన 4 మృతదేహాలు పండోహ్ డ్యాం వద్దే దొరికాయి. సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉంటామని మండీ పోలీసు ఉన్నతాధికారి పీఎల్ ఠాకూర్ ‘సాక్షి’కి తెలిపారు. మరోవైపు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులను వెంటబెట్టుకుని సహాయక చర్యలు కొనసాగుతున్న ప్రాంతానికి వెళ్లారు. మంగళవారం ఉదయం వారంతా ప్రమాద స్థలి వద్దకు వెళ్లనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 8 గంటలకల్లా అక్కడికి చేరుకోనున్నారు.

 

 జలపాతాలు ఆకట్టుకున్నాయి: చేతన్, విద్యార్థి

 

 ‘‘జలపాతాలు, బియాస్ నది ఆకట్టుకున్నాయి. అక్కడ కొన్ని ఫొటోలు దిగాలనిపించింది. లోపలకు వెళ్లొచ్చా, సమస్య ఉంటుందా అని స్థానికులనడిగాం. పర్లేదనడంతో వెళ్లాం. నదిలోని చిన్న రాళ్లను ఆసరాగా చేసుకుని పెద్ద రాళ్లపైకి వెళ్లాం. చూస్తుండగానే నీటి ప్రవాహం ఐదారు రెట్లు పెరిగిపోయింది’’

 

 సగానికి పైగా బతికేవారు: రవికుమార్, విద్యార్థి

 

 ‘‘అంత ప్రమాదం జరిగినా, మేమంతా మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. తక్షణం స్పందిస్తే కనీసం 10 నుంచి 15 మంది బతికేవారు. జరిగింది చూసి అక్కడికి వచ్చిన సిబ్బంది తదితరులు కూడా సహాయక చర్యలు మొదలు పెట్టాల్సింది పోయి మమ్మల్ని తిట్టడం మొదలు పెట్టారు’’

 

 ఎక్కడిదీ ఆ ఉధృతి...

 ప్రమాద స్థలికి సరిగ్గా 2.7 కిలోమీటర్ల ఎగువన కులు దారిలో తలౌటి వద్ద అనే చిన్న బ్యారేజీ ఉంది. అక్కడ 126 మెగావాట్ల లర్జి విద్యుదుత్పాదన కేంద్రముంది. విద్యుదుత్పత్తిని తగ్గించాల్సిందిగా ఆదివారం సాయంత్రం ఉన్నతాధికారుల నుంచి ఆదేశం రావడంతో బ్యారేజీ నీటి నియంత్రణలో విధుల్లో ఉన్న హరివంశ్‌సింగ్ నీటిని నదిలోకి వదిలేశారు. సాయంత్రం 6.15కు ఒకటో నంబరు గేటును అర మీటరు ఎత్తారు. దాదాపుగా అదే సమయానికి విద్యార్థులు నదిలోకి దిగారు. ‘‘గేటును 6.45కు మరో ఒకటిన్నర మీటర్ల మేరకు ఎత్తాం. ఎగువ నుంచి నీటి ప్రవాహం ఇంకా పెరగడంతో ఏడింటికి ఐదో నంబర్ గేటును కూడా 2.5 మీటర్లు ఎత్తాం. ఒకటో నంబర్ గేటునూ మరో 2 మీటర్లు ఎత్తాం’’ అని హరివంశ్ ‘సాక్షి’కి వివరించారు. సైరన్ మోగిం చలేదన్న ఆరోపణను ప్రస్తావించగా దాన్ని విన్పించి చూపించారు. ‘‘ఇది అంతదూరం వినిపించదు. బ్యా రేజీ చుట్టుపక్కల వరకే విన్పిస్తుంది’ అని చెప్పారు.

 

 చెప్పుల కోసం వెళ్లి...

 ప్రవూదం జరగడానికి వుుందే బయుటకు వచ్చిన విద్యార్థిని చెప్పుల కోసం తిరిగి వెళ్లి నీటి ప్రవాహంలో గల్లంతరుుంది. కరీంనగర్ సమీపంలోని రేకుర్తివాసి దాసరి రాజిరెడ్డి చిన్నకూతురు శ్రీనిధి విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్  సెకండియర్ చదువుతోంది. ‘అప్పటిదాకా అందరం కలిసే కూర్చున్నాం. ఎదురుగా డ్యాం పరిసరాలు అందంగా కనిపించడంతో.. అందులో నీరు తక్కువగా ఉందని లోపలికి వెళ్లాం. ఫొటోలు దిగాం. ప్రమాదం జరగడానికి ముందే శ్రీనిధి బయటకు వచ్చింది. కానీ, చెప్పులు మర్చిపోవడంతో తన సెల్‌ఫోన్ నాకు ఇచ్చి లోనికి వెళ్లింది. అంతే... కళ్లు మూసి తెరిచేలోగా ఉప్పెనలా వచ్చిన డ్యాం నీటిలో శ్రీనిధి కొట్టుకుపోయింది. ఏం జరిగిందో కొన్ని నిమిషాలపాటు అర్థం కాలేదు’ అని శ్రీనిధి క్లాస్‌మేట్ దివ్య ఆవేదన చెందింది.

 

 సవూచారం లేని సందీప్

 బియాస్ నది వద్ద జరిగిన దుర్ఘటనలో రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామానికి చెందిన బస్వరాజ్ సందీప్ గల్లంతయ్యూడు. మేడ్చల్ న్యాయస్థానంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుున బస్వరాజ్ వీరేష్‌కు సందీప్ మొదటి సంతానం. సందీప్ గల్లంతయిన విషయం మీడియా ద్వారా తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోమవారం సాయంత్రం వరకు కూడా వీరికి సందీప్ విషయమై ఏ సమాచారం అందలేదు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో సందీప్ ఫోన్‌లో తనతో మాట్లాడాడని, ప్రవూదం విషయుం తెలిసిన తరువాత అతడి నంబర్‌కు కాల్ చేస్తే పనిచేయుడం లేదనే సవూధానం వస్తోందని వీరేష్ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు.

 

 భీతిల్లిన భీక్యాతండా

 బియాస్ నది వరదల్లో తమ తండాకు చెందిన విద్యార్థి గల్లంతయ్యూడనే సమాచారంతో  నల్లగొండ జిల్లా మోతె వుండలం భీక్యా తండాలో ఒక్కసారి విషాదఛాయలు అలుముకున్నాయి. లాల్‌తండా గ్రామ పంచాయతీ పరిధిలో భీక్యాతండాకు చెందిన బానోతు శేఖర్-బుజ్జి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు నాగరాజు ఇంజనీర్‌గా స్థిరపడగా, చిన్నకుమారుడు రాంబాబు(20) విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కాలేజిలో సెకండియర్ చదువుతున్నాడు. సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడు చేదోడువాదోడుగా తల్లిదండ్రులకు వ్యవసాయపనుల్లో సహకరించేవాడు. బియాస్ నది వరదల్లో కొడుకు గల్లంతై చనిపోయాడన్న సమాచారం అందండంలో రాంబాబు తల్లి బుజ్జి ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయింది.


 

 నర్సంపేట, గిర్మాజీపేటలో విషాదం




 హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో గల్లంతైన వారిలో వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన చిందం పరమేశ్, గిర్మాజీపేటకు చెందిన అఖిల్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయూరు. చిందం వీరన్న, ఉమ దంపతులకు ముగ్గురు సంతానం. చిన్న కుమారుడు పరమేశ్ హైదరాబాద్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్టడీ టూర్‌కు తోటి విద్యార్థులతో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లి గల్లంతు కావడంతో నర్సంపేటలో విషాదం అలుముకుంది. గిర్మాజీపేటకు చెందిన మిట్టపల్లి సంజయ్,సునీత దంపతులకు ఒక కూతురు, కుమారుడు. కుమారుడు అఖిల్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళశాలలో ఈఅండ్‌ఐఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు హిమచల్‌ప్రదేశ్‌లో గల్లంతు కావడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. అఖిల్ ప్రమాదంలో చిక్కుకున్నాడని తెలియగానే... తల్లి షాక్‌కు గైరై సొమ్మసిల్లిపడింది.




 

 మిత్రులను కాపాడి మునిగిపోయాడు

 

 ఉధృతమవుతున్న జల ప్రవాహం ఓవైపు... నీటిలో కొట్టుకు పోతున్న స్నేహితులు మరోవైపు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కూడా సాహసానికి ఒడిగట్టాడు ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి ముప్పిడి కిరణ్‌కుమార్. తన ప్రాణాలను సైతం లెక్కచేయక అతను స్నేహితులను కాపాడేందుకే ప్రాధాన్యమిచ్చాడు. బియాస్ నదిలో జరిగిన ప్రమాదంలో ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుుడు ముప్పిడి వెంకటరమణ కుమారుడు కిరణ్  స్నేహితుల కోసం వెళ్లి ప్రమాదంలో గల్లంతైనట్టు తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం.... ప్రమాదం జరిగిన స్థలంలో కిరణ్‌కు సమీపంలో ప్రత్యూష అనే విద్యార్థినితో పాటు మరో విద్యార్థిని ఉన్నారు. వీరిలో ప్రత్యూష కుటుంబం, కిరణ్ కుటుంబం సన్నిహితులు. తన సమీపంలో ఉన్న ఆ ఇద్దరు విద్యార్థినులను కాపాడేందుకు కిరణ్ నదీప్రవాహంలోనే ఉండిపోయాడు. ఇద్దరినీ అతికష్టం మీద ఒడ్డుకు చేర్చాడు. తాను కూడా ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేస్తుండగా, అతను నిల్చున్న బండరాయి జారింది. దీంతో కిరణ్ ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు.                         

 -సాక్షి నెట్‌వర్క్

 

 లైఫ్ జాకెట్లు ఎవరూ ధరించలేదు




 ఆదివారం సాయంత్రం 6.30-6.45 గంటల మధ్య సుమారు 48 మంది విద్యార్థులు లార్జీ డ్యామ్ గేట్లకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఫొటోలు దిగేందుకు కిందకు దిగారు. ఆ సమయంలో పాదాలు మునిగేలా మాత్రమే అక్కడ నీళ్లున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న రెండు పెద్ద బండరాళ్లపై నిల్చుని విద్యార్థులు ఫొటోలు దిగారు. విద్యార్థులు లైఫ్‌జాకెట్లు, హెల్మెట్లు ధరించి నీళ్లలోకి దిగినట్లుగా కొన్ని పత్రికల్లో వచ్చిన ఫొటోలు అవాస్తవం. అసలు అవి వేసుకోమని విద్యార్థులకు చెప్పిన వారెవరూ అక్కడ లేరు. నీటి ప్రవాహమే లేనప్పుడు అవన్నీ వేసుకోవాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు.గేట్లు తెరవడానికి కొన్ని నిమిషాల ముందు 24 మంది విద్యార్థులు సురక్షితంగా పైకి వచ్చేశారు. గేట్లు తెరుస్తున్నప్పుడు సైరన్ శబ్దం వినిపించలేదు. డ్యామ్ పైనున్న వారు మాత్రం హిందీలో గేట్లు తెరుస్తున్నట్లుగా అరిచారు. కానీ ఈ శబ్దం కూడా సరిగా వినిపించకపోవడంతో విద్యార్థులు అక్కడే ఉన్నారు. నిమిషం వ్యవధిలో విద్యార్థులు నీటిలో కొట్టుకుపోవడం తీవ్రంగా కలచి వేసింది.    

        - సుమబాల, ఫ్యాకల్టీ మెంబర్, వీఎన్‌ఆర్ వీజేఐటీ

 

 సైరన్ శబ్దం వినిపించలేదు

 గేట్లు తీసే సమయంలో సైరన్ శబ్దం మాకు వినిపించలేదు. ఫొటోలు దిగే సమయంలో నీటి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోందని మాకు మేమే గమనించి మొత్తం 48 మందిలో 24 మందిమి పైకి వచ్చేశాం. మిగతా వారు ఫొటోలు దిగుతున్నారు. మేము పైకి వచ్చేలోగానే నిమిషం వ్యవధిలో అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ నీళ్లలో కొట్టుకుపోవడంతో మేము ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం. ముందు నదిలోకి దిగే సమయంలో అక్కడున్న స్థానికులు ఫరవాలేదు అని చెబితేనే నీళ్లలోకి దిగాము.     - సద్ది దివ్య, విద్యార్థిని, క్షేమంగా బయటికి వచ్చిన విద్యార్థిని

 

 అలారం శబ్దం రాలేదు...

 

 ‘విద్యార్థులు డ్యామ్ వద్ద ఫొటోలు దిగేందుకు వెళ్లారు. నేను మరికొంత మంది విద్యార్థులు ఒడ్డున నిలబడ్డాం. డ్యామ్ గేట్లు ఒక్కసారిగా ఎత్తడంతో నీటి ప్రవాహం దూసుకొచ్చింది. డ్యామ్‌గేట్లు ఎత్తినప్పుడు ఎలాంటి అలారం శబ్దం వినపడలేదు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నీటి ప్రవాహం పెరిగింది. రక్షించాలని కేకలు వేశాం. నేను ‘100’ నంబర్‌కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారమిచ్చా. ప్రమాదం జరిగిన సుమారు రెండు గంటలకు బైక్‌మీద ఒక పోలీసు కానిస్టేబుల్  ఘటనా స్థలానికి వచ్చాడు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే కొందరినైనా కాపాడుకుని ఉండేవాళ్లం...’ తాండూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి పానుగంటి సృజన్ వివరించాడు.

 

 అన్నయ్యా అంటూ పలకరించి...

 

 ‘‘అన్నయ్యా నీ మెయిల్ ఐడీ ఎస్‌ఎంఎస్ చేస్తే టూర్‌లో మధురస్మతులను పంపిస్తానని’’ ఫోన్‌లో అన్నయ్యతో మాట్లాడిన ఐశ్వర్య కొద్దిగంటలలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. హైదరాబాద్ అల్వాల్ జ్యోతి నగర్‌లో నివసించే గంప దుర్గాదాస్, సుధలకు అభిషేక్, ఐశ్వర్య (19) సంతానం. ఐశ్వర్య ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్లగా, తండ్రి దుర్గాదాస్, తల్లి సుధ సోదరుడు అభిషేక్ కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. మధ్యలో తల్లి సోదరుడు మధురైకి, తండ్రి  శబరిమలైకు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం సోదరుడికి ఫోన్ చేసిన ఐశ్వర్య తాజ్‌మహల్, ఫతేఫూర్ సిక్రీలను సందర్శించిన ఫొటోలు పంపిస్తానని, మెయిల్ ఐడీ పంపించమని అన్నయ్యతో మాట్లాడింది. అయితే అర్థరాత్రి ఐశ్వర్య మృతదేహం లభించినట్లు సమాచారం రావడంతో వీరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

 

 వెళ్లింది మూడు బ్యాచ్‌లు 163 మంది

 వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మొత్తం మూడు బ్యాచుల్లో 163 మంది విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్లారు. వారంతా జూన్ 3న బయల్దేరారు. వీరి లో సెకండియర్ ఆటోమొబైల్ బ్రాంచ్ నుంచి 35 మంది, సీఎస్‌ఈ నుంచి 80 మంది, ఈఐఈ బ్రాంచ్ నుంచి 48 మంది వెళ్లారు. ఈఐఈ బ్రాంచ్ విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు.

 బాధితుల సమాచారం కోసం హైదరాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నంబర్లు

 అశోక్ కుమార్, డీఆర్వో సెల్ నం.    9440815887

 మూర్తి, జేడీ, సాంకేతిక విద్య సెల్ నం.    9912342187

 

 విచారణకు ఆదేశం

 సిమ్లా: ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైన ప్రమాదంపై మండి డివిజనల్ కమిషనర్‌తో సోమవారం న్యాయ విచారణకు హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ఆదేశించారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top