-
వికటించిన ‘నారాయణ’ మంత్రం..?
సాక్షి, విశాఖ సిటీ: జీవీఎంసీకి వచ్చిన ప్రతిసారీ మున్సిపల్ స్కూల్స్లో నారాయణ మెటీరియల్తో విద్యార్థులను చదివిస్తున్నాం.. ఈ సారి శతశాతం ఫలితాలు వస్తాయని ఊదరగొట్టిన మంత్రి నారాయణ.. ఉన్న పరువు తీసేశారు. గత విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలు కనబరిచిన జీవీఎంసీ హైస్కూల్స్పై మంత్రి కార్పొరేట్ రుద్దుడు ఉత్తీర్ణత శాతాన్ని తగ్గించేసింది. కార్పొరేషన్ పాఠశాలలు పదో తరగతి ఫలితాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. 2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పోలిస్తే జీవీఎంసీ పాఠశాలల విద్యార్థులే ఎక్కువ మంది 10 పాయింట్లు సాధించారు. ఈ సారి 100 మంది విద్యార్థులకు 10కి 10 పాయింట్లు సాధించడమే లక్ష్యంగా జీవీఎంసీ ప్రత్యేక కార్యచరణను రూపొందించుకుంది. అయితే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రంగ ప్రవేశం చేసి మొత్తం వ్యవస్థను మార్చేశారు. ‘మా నారాయణ స్కూల్లో కరిక్యులమ్ భిన్నంగా ఉంటుంది. దాన్ని చదివితే విద్యార్థులకు 10కి 10 పాయింట్లు గ్యారెంటీ..’ అంటూ.. ఎప్పటికప్పుడు జీవీఎంసీలో సమీక్షలు నిర్వహించి ఉపన్యాసాలు ఇచ్చేవారు. మంత్రి ఆదేశాల్ని పాటించిన విద్యాశాఖాధికారులు దాదాపు నారాయణ స్టడీ మెటీరియల్నే పేరు మార్చి మున్సిల్ స్కూళ్ల విద్యార్థులతో బట్టీ పట్టించారు. 100 శాతం ఫలితాలు మాట అటుంచితే చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన గతేడాదితో పోలిస్తే స్వల్పంగా ఉత్తీర్ణత శాతం తగ్గడంతో జీవీఎంసీ విద్యాశాఖ ఊపిరి పీల్చుకుంది. ఉత్తీర్ణతతో పాటు 10 పాయింట్లూ తగ్గాయి మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో 27 హైస్కూల్స్ ఉన్నాయి. ఇందులో 1907 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి చదవగా.. 1903 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 868 మంది బాలురు, 1035 మంది బాలికలున్నారు. వీరిలో 91.75 శాతంతో 1746 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 796 మంది బాలురు, 950 మంది బాలికలు పాసయ్యారు. 157 మంది ఫెయిల్ అయ్యారు. 2017–18 విద్యా సంవత్సరంలో 92.67 ఉత్తీర్ణత శాతం ఉండగా, ఈ ఏడాది 0.92 శాతం తగ్గింది. దీంతో పాటు గతేడాది 39 మంది విద్యార్థులు 10 పాయింట్లు సాధించగా ఈ ఏడాది ఆ సంఖ్య కూడా తగ్గి 31కి దిగజారింది. 4 పాఠశాలల్లో శతశాతం ఉత్తీర్ణత గతేడాది 2 పాఠశాలలు మాత్రమే 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ సారి ఆ సంఖ్య నాలుగుకి చేరింది. అనకాపల్లిజోన్ పరిధిలోని గాంధీనగరం హైస్కూల్, డా.బీఆర్ అంబేడ్కర్ హైస్కూల్, భీమిలి జోన్లోని డా.బీఆర్ అంబేడ్కర్ హైస్కూల్, పీఎన్ఎం హైస్కూల్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. నాలుగు స్కూల్స్లో బాలురు, 8 స్కూల్స్లో బాలికలు 100 శాతం పాసయ్యారు. ఎంజీఎం హైస్కూల్ 73.33 శాతంతో అట్టడుగున నిలిచింది. 14 పాఠశాలలు 90 శాతానికి పైగా, 9 స్కూల్స్ 70 శాతానికి పైగా ఫలితాలు సాధించాయి. అయితే గతేడాది 9.8 జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య 29 కాగా ఈ సారి ఏకంగా 40 మందికి చేరడం విశేషం. మంత్రి చలవతోనే బెడిసి కొట్టాయి.. 2016–17 విద్యా సంవత్సరంలో కేవలం 7గురు విద్యార్థులు మాత్రమే 10 పాయింట్లు సాధించడంతో.. 2017–18–లో 40 మంది విద్యార్థులకు ఆ సంఖ్య చేరుకోవాలని కార్పొరేషన్ ప్రణాళికలు రూపొందించింది. దీనికి అనుగుణంగా ప్రత్యేకమైన స్టడీ మెటీరియల్ తయారు చేసి, విద్యార్థులకు అందించడంతో 39 మంది విద్యార్థులు 10 పాయింట్లు సాధించారు. ఈ ఏడాది మాత్రం మంత్రి నారాయణ సూచనలకనుగుణంగా బో ధన సాగడంతో ఫలితాల్లో చతికిలపడ్డామంటూ జీవీఎంసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
కొంప ముంచారు!
‘నగర టీడీపీ నేతలు నా కొంప ముంచారు.. ఓటర్లకు ఇవ్వాల్సిన నగదులో కొంత నాయకులు మింగేశారు.. మనం వేసుకున్న ప్రణాళిక విధంగా ఓటర్లకు నగదు చేరలేదు.. నేను నమ్మిన నాయకులే నాకు వెన్నుపోటు పొడిచారు.. నేతల స్వార్థంతో నా కొంప మునిగేలా ఉంది’ అని మంత్రి నారాయణ నెల్లూరు పోలింగ్ సరళిపై తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. కాగా టీడీపీ నాయకులు మంత్రి నారాయణ వ్యవహార శైలిపై స్పందిస్తూ ఏరు దాటాకతెప్ప తగలేసినట్లుందని ఆరోపిస్తున్నారు. ఎన్నికలయ్యేంత వరకు తమతో పనిచేయించుకుని, ఇప్పుడు నగదు మింగేశామని నిందలు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సాక్షి, నెల్లూరు: నెల్లూరుసిటీలో ఓటర్లకు నగదు పంపిణీ విషయంలో టీడీపీ నేతలు మోసం చేసి తన కొంప ముంచారని మంత్రి నారాయణ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓటింగ్ అయిపోయిన తర్వాత తమను అవమానించడం ఎంతవరకు సబబు? అని నగర టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది నెల్లూరు నగర నియోజకవర్గంలో మంత్రి నారాయణ, టీడీపీ నేతల మధ్య జరుగుతున్న అంతర్గత పోరు. ఎన్నికల అనంతరం పోలింగ్ సరళిపై అంతర్గత సమావేశంలో మంత్రి నారాయణ అయన సన్నిహితుల వద్ద నగర టీడీపీలో ఉన్న కీలక నాయకులపై చిందులు తొక్కినట్లు సమాచారం. 70 వేల మంది నగదు అందలేదని సర్వేలో వెల్లడి తన కంటే తన డబ్బును చూసి నేతలు పనిచేశారని, ఓటుకు నోటు పంపిణీలో కొందరు నాయకుల ప్రమేయం పెట్టడంతో కొంత భాగం పంపకాలు చేయకుండా నిధులు మింగేశారంటూ నేతల తీరుపై మంత్రి నారాయణ మండిపడినట్లు సమాచారం. నగర నియోజకవర్గంలో సుమారు లక్షా యాభై వేల మంది ఓటర్లకు గాను ఒక్కో ఓటర్కు రూ.2 వేలు వంతున పంపకాలు చేసేందుకు మంత్రి నారాయణ నగదు సమకూర్చినట్లు తెలిసింది. అయితే అందులో సుమారు 70 వేల మంది ఓటర్లకు సక్రమంగా నగదు అందలేదని మంత్రి చేయించిన అంతర్గత సర్వేలో వెల్లడి కావడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలిసింది. ఓటర్లకు నగదు పంపిణీ వ్యవహారంలో ఎన్నో జాగ్రతలు తీసుకుని తమ విద్యాసంస్థల ఉద్యోగుల చేత పంపిణీ చేయించాలని చూసినా కీలక నేతలు నగదు పంపిణీ వ్యవహారంలో దూరి నగదు కాజేశారని ఆయన వాపోయినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో కీలకమైన ముగ్గురు నేతలతోపాటు టీడీపీ కార్పొరేటర్లకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చానని అవి కూడా చాలదన్నట్లుగా ఓటర్లకు నగదు పంపకాల విషయంలో కూడా దూరి అందులో నగదు కూడా కాజేయడంపై ఆయన నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ కీలక నేతలను నమ్మి నట్టేట మునిగేలా ఉన్నానంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. సహకరించిన వారిపై నిందలా? ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం లేని మంత్రి నారాయణ ఎన్నికల బరిలో దిగినప్పుడు అన్ని విధాలా సహకరించిన తమపై నగదు కాజేశారంటూ నిందలు మోపడంపై టీడీపీ కీలక నేతలు మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్లగా పార్టీని నమ్ముకుని ఉన్న వారిని మంత్రి నారాయణ నమ్మకుండా ఓటుకు నోటు పంపిణీ వ్యవహారంలో ఆయన విద్యాసంస్థల ఉద్యోగుల చేత పంపకాలు చేయించుకుని తమపై నిందలు వేయడం ఎంత వరకు సమంజసమని వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలోమంత్రికి సహకరించినందుకు మమ్మల్ని దొంగలుగా ముద్రవేయడంపై వారు మండిపడుతున్నట్లు తెలిసింది. మంత్రి నారాయణ వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. -
మంత్రి నారాయణకు తోడల్లుడు ఝలక్..
సాక్షి, నెల్లూరు : ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మంత్రి నారాయణకు ఊహించని షాక్ తగిలింది. మంత్రి నారాయణ తోడల్లుడు రామ్మోహన్తో పాటు పలువురు అనుచరులు తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పి, నెల్లూరు లోక్సభ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. మంత్రి నారాయణ విధానాలు నచ్చక పలువురు పార్టీని వీడుతున్నారని.. రామ్మోహన్ రావడం వల్ల తమ పార్టీ మరింత బలపడుతుందన్నారు సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్. చంద్రబాబు అసలు రూపం తెలుసుకుని వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నారని నెల్లూరు లోక్సభ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి చెప్పారు. నెల్లూరు నగరాన్ని 5వేల కోట్లతో అభివృద్ధి చేశామని చెబుతున్న మంత్రి నారాయణ.. డబ్బుతో ఓట్లు ఎందుకు కొంటున్నారని ఆయన తోడల్లుడు రామ్మోహన్ ప్రశ్నించారు. కాగా నెల్లూరు నగర అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న మంత్రి నారాయణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం అడ్డదారులు ఎంచుకుంటున్నారు. ఓటుకు నోటు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న వైనం విస్మయానికి గురి చేస్తోంది. టీడీపీ కోటరీలో కీలక నేతగా ఉన్న నారాయణ విద్యాసంస్థల అధినేత అయిన ఆయనకు ఓటమి భయం పట్టుకుంది. దీంతో నోట్ల కట్టలు తెగ్గొట్టేశారు. కేవలం నోట్లతో ఓట్లు కొల్లగొట్టాలని నగర పరిధిలో నోట్లు వరదలా పారిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేని ఆయన టీడీపీ కోటరీలో మాత్రం కీలక నేతగా ఎదిగిన నారాయణ... చంద్రబాబుకు బినామీ అని కూడా ప్రచారం ఉంది. రెండు దశాబ్దాలుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో నారాయణ తన విద్యాసంస్థల ఉద్యోగులతో సర్వేలు చేయిస్తూ... పార్టీకి భారీ విరాళాలతో ఆర్థిక వనరలు సమకూర్చేవారు. నారాయణకు రోజు రోజుకు ప్రజాదరణ తగ్గిపోతోంది. ఓటమిపై బెంగతో తన విద్యాసంస్థల ఉద్యోగులతో ఓటర్లకు నగదు చేరవేస్తూ వైఎస్సార్ సీపీ నేతలకు పట్టుబడుతున్నారు. దీంతో నగదు పంపిణీ కష్టతరం కావడంతో చివరకు విద్యార్థుల స్కూల్ బ్యాగుల ద్వారా చోటా నేతలకు నగదు చేరవేస్తున్నట్లు సమాచారం. -
‘నారాయణ’ సిబ్బందితో నగదు పంపిణీ!
నెల్లూరు (క్రైమ్): ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నేతలు అరాచకాలకు తెరలేపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు రాబట్టుకు నేందుకు భారీ నజరానాలు ముట్టజెప్పే పనిలో నిమగ్నమయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ.. రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలను పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బంది ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వీరిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. వారు బృందాలుగా విడిపోయి నగర నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో గత కొద్ది రోజులుగా మకాంవేసి ఓట్ల సర్వే నుంచి నగదు పంపిణీ వరకు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఓటర్లకు కోట్లాది రూపాయల నగదు పంపిణీ వీరి ద్వారా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆదివారం ‘నారాయణ’ సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి 43వ డివిజన్లోని జెండా వీధి, కుమ్మర వీధి ప్రాంతాల్లో నగదు పంపిణీకి చర్యలు చేపట్టారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు కుమ్మర వీధిలోని తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ నగదు లెక్కిస్తున్న వారిని పట్టుకున్నారు. వీరిలో ఓ వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడ్డ వారిలో నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమణారెడ్డితోపాటు మరో ఉద్యోగి సమ్మద్ ఇంకొకరున్నారు. ఈ విషయమై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారం అందించారు. స్క్వాడ్ ఇన్చార్జ్ రాజేంద్రకుమార్సింగ్ వీరి నుంచి రూ.8.30 లక్షల నగదును స్వాధీనం చేసుకుని ఆ ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పరారైన వ్యక్తి వద్ద రూ.35 లక్షలు ఉన్నట్లు సమాచారం. కాగా, టీడీపీ నేతల తప్పుడు ఆరోపణల విచారణకే సమయం కేటాయిస్తున్న నగర పోలీసులు తాయిలాల పంపిణీలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా టీడీపీ నేతలు, అనుచరులు, సానుభూతిపరులు నగదు పంచుతూనో, తాయిలాలు పంచుతూనో దొరికిపోతే మాత్రం వారి వివరాలను ఎంతో గోప్యంగా ఉంచుతున్నారు. పోలీసులపై ఒత్తిడి ఇదిలా ఉంటే, టీడీపీ నేత పట్టాభిరామిరెడ్డి తన అనుయాయులను పోలీస్స్టేషన్కు పంపి తమ వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు అందుకు రంగం సిద్ధంచేశారు. నిజానికి ఎన్నికల సమయంలో వీరు నగదుతో దొరికినందున ఈ సమాచారాన్ని ముందుగా ఎన్నికల సంఘానికి తెలిపి వారి ఆదేశాలతో కేసు నమోదు చేసి నగదు మూలాలను గుర్తించాలి. కానీ, ఇక్కడ మంత్రి పలుకుబడితో.. పట్టుబడిన వారికి వెంటనే బెయిల్ ఇచ్చేలా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నోటు పంపిణీ విషయంపై సమాచారం అందుకున్న నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్ చిన్నబజారు పోలీస్స్టేషన్కు చేరుకుని విచారణను నిష్పక్షపాతంగా జరిపి సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ షేక్ కరీముల్లాను కోరారు. -
ఓటర్లకు ‘సైకిల్’ తాయిలాలు
ఐదేళ్లుగా ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన తెలుగుదేశం పార్టీ అధికార అంతమున ఎన్నికల వేళ అన్ని వర్గాలకు తాయిలాల వల విసురుతోంది. పథకాల పేరుతో ప్రలోభాలకు తెరలేపింది. పేదలకు అందరికీ ఇళ్లు, రైతులకు అన్నదాత సుఖీభవ, అక్కచెల్లెమ్మలకు పసుపు, కుంకుమ అంటూ తాయిలాల ఎర వేసిన ప్రభుత్వం, విద్యా సంవత్సరం ఆఖరి నెలలో ఎన్నికల కోడ్ వచ్చాక విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీకి బరితెగించి అడ్డంగా దొరికిపోయింది. సాక్షి, నెల్లూరు (టౌన్): బాలికా విద్యను ప్రోత్సహించేందుకు 8, 9 తరగతులు చదివే బాలికలకు సైకిళ్లు పంపిణీ చేస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఒక్కసారి మాత్రమే అరకొరగా సైకిళ్లు పంపిణీ చేసిన ప్రభుత్వం నాలుగేళ్లుగా విస్మరించింది. ఈ దశలో అందరికి అన్నీ చేశామని చెప్పుకునేందుకు ఎన్నికల కోడ్ను బేఖాతరు చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. ఎన్నికలల్లో లబ్ధి పొందేందుకు విద్యార్థులను సైతం వదలడం లేదు. ఓటర్లను మభ్యపెట్టేందుకు ఆ పార్టీ నేతల అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటికే అమలకు నోచుకోని ఎన్నో పథకాలను లబ్ధిదారులకు అందజేశామని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు ఇచ్చే సైకిళ్లతో వారి తల్లిదండ్రులను తమ బుట్టలో వేసుకుందామని తెర వెనుక చక్రం తిప్పిన మంత్రి నారాయణ, ఆ పార్టీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా అవేమి లెక్క చేయని టీడీపీ నాయకులు మంగళవారం 3 ట్రక్కుల సైకిళ్లను విద్యార్థినులకు పంపిణీ చేసేందుకు సంబంధిత కాంట్రాక్టర్ను ఉసిగొల్పారు. ఈ నేపథ్యంలో వాటిని తీసుకెళ్తుతుండగా ఓ ట్రక్కును మూలాపేటలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల వద్ద వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. సైకిళ్లు పంపిణీపై చిన్నబజారు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. 20,419 సైకిళ్ల పంపిణీకి రంగం సిద్ధం ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో 20,419 మంది విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయాల్సి ఉంది. వాటిని విద్యా సంవత్సర ప్రారంభంలో పంపిణీ చేయాల్సి ఉంది. హీరో సైకిళ్లు పంపిణీ బాధ్యతను హర్యానాకు చెందిన ఓ కాం ట్రాక్టర్కు అప్పజెప్పింది. మార్చిలో ఎన్నికలు జరుగుతాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సైకిళ్ల పంపిణీకి తెరలేపింది. సైకిళ్లను ఫిబ్రవరి చివరి వారంలో జిల్లాకు పంపించింది. ఇప్పటి వరకు కేవలం 3 పాఠశాలల్లో 331 మంది విద్యార్థినులకు మాత్రమే అందజేశారు. 60 సైకిళ్లను సీజ్ చేసిన పోలీసులు సైకిళ్లు పంపిణీ ఎన్నికల్లో కలిసి వస్తుందని భావించిన టీడీపీ నేతలు వెంటనే అమలుకు శ్రీకారం చుట్టారు. సదరు కాంట్రాక్టరుపై ఒత్తిడి తీసుకువచ్చి సైకిళ్లు పంపిణీ చేసేలా ఒప్పించారు. నవాబుపేట ప్రాంతంలోని బీవీఎస్ మున్సిపల్ పాఠశాలల్లో ఉన్న విడి పరికరాలను రాత్రికి రాత్రి హడావుడిగా బిగించి 3 ట్రక్కుల్లో ఇతర పాఠశాలలకు తీసుకెళ్లి విద్యార్థినులకు పంపిణీ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే స్థానిక మూలాపేట వద్ద ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల వద్ద ట్రక్కును వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. ఆ ట్రక్కులో 60 సైకిళ్లు ఉన్నాయి. ఈ విషయంపై వెంటనే పోలీసులకు సమాచారం అందించి వారికి ట్రక్కును అప్పగించారు. అయితే మరో 2 ట్రక్కుల సమాచారం ఇప్పటికి తెలియలేదు. ట్రక్కును తీసుకు వచ్చిన కాంట్రాక్టర్పై చిన్నబజారు పోలీసుస్టేషన్లో కేసు నమోదైనట్లు తెలిసింది. తెర వెనుక మంత్రి నారాయణ, నేతల హస్తం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీని నిలిపివేయాలని సదరు కాంట్రాక్టర్కు ఆదేశాలు ఇచ్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. సైకిళ్లు విడి పరికరాల కోసం నగరంలో 3 పాఠశాలల్లో 6 గదులను వారికి అప్పగించారు. పంపిణీ నిలిపివేయాలని ఆదేశాలు ఉన్నా.. సదరు కాంట్రాక్టర్ ట్రక్కుల్లో సైకిళ్లను తరలించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయడంలో మంత్రి నారాయణ, టీడీపీ నేతల ఒత్తిడి ఉందన్న ప్రచారం జరుగుతోంది. సైకిళ్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీని వాసరావు ఫొటోలు ఉన్నాయి. సైకిళ్లను పంపిణీ చేసినట్లయితే ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని టీడీపీ నేతలు భావించారు. ఈ నేపథ్యంలో సైకిళ్లను ఆయా పాఠశాలలకు పంపిణీ చేసే బాధ్యతను సదరు కాంట్రాక్టర్కు అప్పగించి చేతులు దులుపుకున్నారు. అయితే సైకిళ్లతో కూడిన ట్రక్కును పట్టుకోవడంతో టీడీపీ నేతల నోటిలో వెలక్కాయ పడిన చందంగా మారింది. కాంట్రాక్టర్పై ఫిర్యాదు చేశాం సైకిళ్లు తరలిస్తున్న కాంట్రాక్టర్పై చిన్న బజారు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాం. ట్రక్కులో ఉన్న సైకిళ్లను పోలీసు స్టేషన్లో అప్పగించాము. వీటిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాం. – అలీంబాషా, ఎన్నికల రిటర్నింగ్ అధికారి -
టీడీపీలో టికెట్ల లొల్లి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీలో టికెట్ల చిచ్చు రేగింది. ప్రధానంగా టికెట్ ఆశిస్తున్న కీలక నేతలు, జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న నేతలు తీవ్రంగా నిరసన గళం విప్పుతున్నారు. ప్రధానంగా నెల్లూరురూరల్ నుంచి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి, నెల్లూరు నగరం నుంచి మంత్రి పి.నారాయణ, సర్వేపల్లి నుంచి మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పోటీ చేస్తారని అధిష్టానం ప్రకటించిందని జిల్లాలో ముఖ్యులు అధికారికంగా ప్రకటించుకోవటంతో కొత్తు చిచ్చు రేగింది. నెల్లూరు నగర, రూరల్ సీటుపై ఆశలు పెంచుకున్న నగర మేయర్ అబ్ధుల్ అజీజ్కు మద్దతుగా ముస్లింలు రంగంలోకి దిగగా, మరోవైపు నెల్లూరు రూరల్ టికెట్ హామీతో పనిచేస్తున్న ఆనం జయకుమార్రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అది కూడా శనివారం జిల్లాలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన జరగనున్న క్రమంలో రాజకీయ అలజడి రేగడంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ పూర్తిస్థాయిలో వేడెక్కింది. గురువారం మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమర్నాథ్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర సీఎంను కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు సిటీ నుంచి మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకరరెడ్డి, సర్వేపల్లి నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిల అభ్యర్థిత్వాలు ఖరారు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఆదాల నివాసంలో మంత్రి నారాయణ, ఆదాల, బీద కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి ప్రకటించుకోవడంతో పార్టీలో అసమ్మతి సెగలు రేగాయి. ప్రధానంగా ఆదాల శిబిరంలో కీలక నేతగా ఉన్న ఆనం జయకుమార్రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సమాచారం తెలుసుకోవడానికి ఆదాల నివాసానికి వచ్చిన క్రమంలో సమావేశం నిర్వహించి ప్రకటించుకోవటంతో మనస్థాపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దివంగత ఆనం వివేకానందరెడ్డి సోదరుడు ఆనం జయకుమార్ టీడీపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. గతేడాది నుంచి నగర టీడీపీ అధ్యక్ష పగ్గాలు ఇస్తామని స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. దీంతో పార్టీలో ప్రధానంగా ఆదాల క్యాంపులో కీలకంగా పనిచేస్తూ ఆయన్ను బలపర్చారు. ఆదాల ప్రభాకర్రెడ్డి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారు రూరల్ టికెట్ నీకే ఇస్తామని మంత్రి నారాయణ మాజీ మంత్రి ఆదాల నివాసంలో కొన్ని నెలల క్రితం చెప్పడంతో జయకుమార్ రూరల్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఆనం కుటుంబానికి రూరల్ నియోజకవర్గంలో ఉన్న వర్గాన్ని కూడగట్టి ఎన్నికలకు సన్నాహాలుగా పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఆదాల తాను పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని గతంలో స్వయంగా ప్రకటించుకున్నారు. ఆ దిశగానే చంద్రబాబు నాయుడిని అనేక మార్లు కలిసి నియోజకవర్గాల వ్యవహారాలపై చర్చించారు. దీంతో అందరూ పార్లమెంట్కే అని భావించిన క్రమంలో ఆదాల తన నిర్ణయం మార్చుకోని నెల్లూరు రూరల్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించటంతో పొలిటికల్ హీట్ రేగింది. మరో వైపు నగరంలో మైనార్టీలు కూడా తీవ్ర అసమ్మతి గళం విప్పారు. నగర మేయర్ అబ్ధుల్ అజీజ్ మేయర్గా వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందాడు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ టికోటు ఇస్తామని మంత్రి నారాయణ హామీ ఇవ్వడంతో టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు అజీజ్కు కూడా టీడీపీ మొండిచెయ్యి చూపింది. అజీజ్ నెల్లూరు సిటీ, లేదంటే రూరల్లో ఒక సీటు వస్తుందనే ధీమాతో ఉండి ఆ దిశగా హడావుడి చేశారు. సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ కూడా టికెట్ మీకే ఇస్తామని హామీ ఇచ్చారు. చివరకు నగర, రూరల్ అభ్యర్థుల్ని ప్రకటించటంతో నైరాశ్యంలో పడిపోయారు. దీంతో శుక్రవారం నగరంలో మైనార్టీ సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న తమకు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని లేని పక్షంలో టీడీపీకి గట్టిగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. శనివారం సీఎం పర్యటన జరగనున్న క్రమంలో పొలిటికల్ హీట్ రేగడం చర్చగా మారింది. మేయర్పై బీద ఆగ్రహం నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్కు నెల్లూరు సిటీ టికెట్ ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు శుక్రవారం రాత్రి నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మంత్రులు, సీనియర్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర ఈ విషయంలో చర్చిద్దామని వారిని లోపలికి పిలిచారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న అజీజ్ను బీద తిట్టినట్లు తెలిసింది. దీంతో మేయర్ మద్దతుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం పార్టీలో కలకలం రేపింది. -
దూరం.. దుమారం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీలో నేతల మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరింది. మంత్రి నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ముఖ్యులతో చెప్పిన రోజు నుంచి మొదలైన వర్గ విభేదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తనకు ఎవరూ పోటీ రాకూడదని అందరినీ దూరంగా పెడుతున్న పరిస్థితి రాజకీయ దుమారం రేపుతోంది. మంత్రి రాక ముందు వరకు నగర టికెట్పై మేయర్ అబ్దుల్ అజీజ్తో సహా అనేక మంది నేతలు ఆశలు పెంచుకున్నారు. పరిస్థితి రివర్స్ కావడంతో నేతల అంతర్గత సమావేశాల్లోనూ మంత్రి తీరుపై అసహనం వ్యక్తమవుతోంది. తాజాగా నగర ప్రథమ పౌరుడు మేయర్ అబ్దుల్ అజీజ్ ఫొటో లేకుండా రూరల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర దూమారం రేగింది. నగరంలో ఉన్న ఏకైక మైనార్టీ నేతను నన్నే అవమానిస్తారా? అంటూ అక్కడే మేయర్ అసంతృప్తి వ్యక్తం చేయడం, వెంటనే ముస్లిం మతపెద్దలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. నగరంలో మంత్రి నారాయణ అధికార పార్టీ సిటీ అభ్యర్థిగా బరిలో వస్తాడనే ప్రచారం మొదలైనప్పటి నుంచి నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. అంతకు ముందు వరకు టికెట్ ఆశిస్తున్న నేతలు తమ గాడ్ఫాదర్గా భావిస్తున్న నారాయణ ద్వారా తమకు టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటూ నగరంలో అధికార పార్టీ నేతలుగా చలామణి అయ్యారు. నగర మేయర్గా అబ్దుల్ అజీజ్ వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన వ్యక్తి. కొద్ది రోజులకే మంత్రి నారాయణ, సీఎం తనయుడు లోకేష్ సిటీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో అధికార పార్టీలోకి జంప్ చేశారు. అజీజ్తో పాటు టీడీపీ నగరఇన్చార్జి ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధతో పాటు మరి కొందరు నేతలు ఆశలు పెంచుకున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి మంత్రి నారాయణ నగరంలో హడావుడి మొదలు పెట్టారు. పార్టీ ముఖ్యల సమావేశంలో నెట్లూరు సిటీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు నగరంలో ఏ అభివృద్ధి పని జరిగినా నగర మేయర్ హడావుడి అక్కడ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత నుంచి మేయర్ ప్రాధాన్యత తగ్గిపోయి మంత్రి హవా పెరిగిపోయింది. శంకుస్థాపనలు మొదలుకొని అన్ని పనుల వరకు నారాయణ అధికారుల ద్వారా చేయించడంతో నగర మేయర్ పాత్ర పూర్తిగా కనుమరుగైంది. ఈ పరిణామాలను మేయర్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ఫలితం లేకపోవడంతో పాటు నీకే టికెట్ ఇస్తామని మళ్లీ హామీ ఇచ్చారు. దీంతో నగరంలో మంత్రి వర్సెస్ మేయర్గా అధికార పార్టీ రాజకీయం కొనసాగుతోంది. రొట్టెల పండగ మొదలుకొని.. నగరంలో నగరపాలక సంస్థ ప్రత్యేక నిధులు, జనరల్ ఫండ్తో నిర్వహించుకునే ప్రతి కార్యక్రమం కూడా మంత్రి తనవల్లే జరిగిందంటూ హడావుడి ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బారాషహీద్ రొట్టెల పండగకు ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు మంజూరు చేయలేదు. పండగకు రాష్ట్ర ప్రభుత్వ హోదా ఉన్నప్పటికీ, మంత్రులు నిధులు ఇస్తామని ప్రకటించనప్పటికీ రూపాయి కూడా నిధులు రాని పరిస్థితి. ఈ క్రమంలో నగరపాలకసంస్థ జనరల్ ఫండ్లో నుంచి ఖర్చు పెట్టి ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు, అభివృద్ధి పనులు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు రోజున అన్ని మంత్రి నారాయణ చేశాడంటూ విస్తృతంగా ప్రచారం హోరెత్తించడంతో మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత నుంచి ఇదే పరంపర కొనసాగుతూ వచ్చింది. ఇటీవల మటన్ మార్కెట్ పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం మధ్యాహ్నం అని ఆహ్వానాలు ముద్రించి ఉదయం మంత్రి ఒక్కరే వచ్చి చేసి వెళ్లిపోయారు. షాదీమంజిల్ వ్యవహారం, జూనియర్ కళాశాలకు జనరల్ ఫండ్ నుంచి రూ.1.5 కోట్లు కేటాయింపులు, నవాబుపేట ఘాట్ అభివృద్ధి ఇలా అన్ని నగరపాలక సంస్థ చేసినా మంత్రి మాత్రం నేనే చేశాను అని చెప్పడం, ఆయన అనుచరగణం మంత్రికి రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయండని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నగరంలో నెల్లూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో ఒక్కదాంట్లో కూడా మేయర్ ఫొటో లేకపోవడం, అది కూడా దర్గా సమీపంలో ఉండడంతో మేయర్ అక్కడ అసంతృప్తి వ్యక్తం చేసి ఇదేమీ పద్ధతి అంటూ అక్కడ ఉన్న నేతలను ప్రశ్నించారు. ఇది నగరంలో చర్చనీయాంశంగా మారడంతో ముస్లిం పెద్దలు మైనార్టీ నేతగా ఉన్న మేయర్కు అవమానం జరగడంపై మేయర్ చాంబర్లో భేటీ కావడం అధికార పార్టీలో చర్చకు దారి తీసింది. మొత్తం మీద నగరంలో అధికార పార్టీలో వార్ యథావిధిగా కొనసాగుతూనే ఉంది. -
నారాయణా.. అంతా మీ ఇష్టమేనా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు కనీస విలువ లేదా.. ఎవరి మనోభావాలతో మీకు పనిలేదా.. మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి ఇద్దరి మాట మినహా మిగిలిన వారిని కనీసం పట్టించుకోరా’ అంటూ రూరల్ తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. ఆదివారం నగరంలోని కిలారి తిరుపతినాయుడు కల్యాణ మండపంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, రూరల్ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిలారి వెంకటస్వామి నాయుడు సమావేశం నిర్వహించారు. సమావేశానికి 130 మంది వరకు సీనియర్ టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలు మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తల మనోభావాలకు సంబంధం లేకుండా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి అనుచరులకే అన్ని పనులు, పదవులు కట్టబెట్టారని విమర్శించారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాలు మొదలుకొని అభివృద్ధి పనుల కాంట్రాక్ట్ వరకు ఆదాల అనుచరుడు, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పార్టీ వ్యక్తులకు కాకుండా ఇతర రాజకీయ పార్టీలకు చెందినవారికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. అలాగే మంత్రి నారాయణకు నియోజకవర్గంలో పట్టుమని 10 మందితో పరిచయాలు ఉండవు. అయితే ఆయన నెల్లూరు రూరల్ అభ్యర్థిని నిర్ణయిస్తారు. పనిచేసుకోమని చెబుతారు. ఇలా అయితే పాత వారందరూ పార్టీని వీడిపోవటం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల్లో పాతవారికి చోటు దక్కలేదని, నీరు–చెట్టు పనులు కూడా పాతవర్గంలో ఒక్కరికీ ఇవ్వలేదని, మంత్రి నారాయణ అన్నీ అతనికి కావల్సిన వారికి, మాజీ మంత్రి ఆదాల తనకు కావల్సిన వారికే ఇస్తుంటే కార్యకర్తలు ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుంటారని ప్రశ్నించారు. మా పరిస్థితేంటి? నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నగర మేయర్ అబ్దుల్ అజీజ్ను మంత్రి నారాయణ ప్రకటించడానికి అంతా సిద్ధం చేస్తుంటే మాలాంటి వారి పరిస్థితి ఏంటని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు మండిపడ్డారు. 135 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించారు. వారిలో ఒక్కరైనా టీడీపీ కార్యకర్తలు ఉన్నారా అని ప్రశ్నించారు. పింఛన్లు మొదలుకొని రేషన్ డిపోల వరకు ఒక్కదానిలో కూడా మొదటి నుంచి టీడీపీలో ఉన్న వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూరల్ టీడీపీలో జరుగుతున్న పరిణామాలు, మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల తీరుపై మొదట తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఫిర్యాదు చేస్తామని, అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. అలాగే సభ ముగింపు సమయంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసురెడ్డి హాజయ్యారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు పాముల రమణయ్య, కార్పొరేటర్ మన్నెం పెంచలయ్య, నేతలు రామమూర్తి, బద్దేపూడి రవీంద్ర, జలదంకి సుధాకర్, ఉరందుల సురేంద్రబాబు, జానా గిరిబాబు, ఎస్కే ఆసీఫ్, రాఘవప్పనాయుడు, సుబ్బరాజు, శేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
ఈ చెత్తేంది నారాయణా!
నెల్లూరు సిటీ : మున్సిపల్ మంత్రి నారాయణ సొంత జిల్లాలో ఒక కార్పొరేషన్.. ఆరు మున్సిపాలిటీలున్నాయి. ఇక్కడ రోజుకు 400 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దీనిని డంపింగ్ యార్డులకు తరలిస్తుండడంతో చెత్త కొండలు గుట్టలుగా పేరుకుపోతోంది. తడి, పొడి చెత్త సేకరణ అంతంతమాత్రంగానే ఉంది. చెత్తతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. నెల్లూరు నగరంలో చెత్త తరలింపులో అధికార పార్టీ నేతలు బినామీలను ఏర్పాటు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. కార్పొరేషన్ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. ఏడు లక్షలు జనాభా ఉన్న నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. పాలకులు చెబుతున్న స్మార్ట్ సిటీ ఇలాగే ఉంటుందేమో! అంటూ ప్రజలు విస్తుపోతున్నారు. కావలి పట్టణంలోని డంపింగ్ యార్డును మోర్లవారిపాళెంకు తరలించారు. రెండేళ్లుగా చెత్త పేరుకుపోతూనే ఉంది. దుర్వాసన వస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ వాహనాలు మరమ్మతులైనా పాలకులు పట్టించుకోవడంలేదు. నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులే లేవు. రహదారుల పక్కనే చెత్తను తరలిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాయుడుపేటలో స్వర్ణముఖినది సైతం కంపోస్టు యార్డుగా మారిపోతోంది. చిట్టమూరు మండలంలో మూడు ఎకరాల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. గూడూరు పట్టణంలో రోజుకు 28 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అయితే ఇష్టానుసారంగా డంప్ చేస్తున్నారు. వెంకటగిరి పట్టణంలో చెత్తసేకరణ గ్రామాల కంటే దారుణంగా తయారైంది. ప్రధాన వీధుల్లో మినహా మిగతా ప్రాంతాల్లో మూడు రోజులకోసారి చెత్తను సేకరిస్తున్నారు. పట్టణంలో ఇంటింటికీ తిరిగి చెత్తసేకరణ ఇంకా ప్రారంభం కాలేదు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన డంపింగ్ యార్డుకు ప్రహరీ లేకపోవడంతో గాలికి చెత్త సమీప పొలాల్లో పేరుకుపోతోంది. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఆరేళ్ల క్రితం సీ గ్రేడ్ మున్సిపాలిటీగా మారిన ఆత్మకూరులో చెత్త సేకరణ ఆరంభశూరత్వంగా మారింది. రెండునెలల పాటు చెత్తను తరలించారు. ఆ తర్వాత అంతంతమాత్రంగానే సేకరణ జరుగుతోంది. పట్టణంలోని చెత్తను శివారు ప్రాంతాలకు తరలిస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజల అవస్థలు వర్ణనాతీతం. చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చెత్తతో విద్యుత్ తయారీకి అనుమతులిచ్చింది. దేశవ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వీటిని ఏర్పాచేస్తున్నట్టు ప్రకటించింది. అందులో నెల్లూరు నగరం కూడా ఉంది. అప్పటి నెల్లూరు కమిషనర్ పీవీవీఎస్ మూర్తి ఓ ప్రైవేట్ సంస్థతో ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకునేందుకు ఒప్పందాలు జరిగాయి. నెల్లూరు నగరంతోపాటు కావలి, గూడూరు మున్సిపాలిటీల్లో ప్రతి రోజూ చెత్తను తరలించి తద్వారా విద్యుత్ ఉత్పత్తికి చేయాలని నిర్ణయించారు. దీంతో కొన్నేళ్లుగా చెత్త సమస్యకు విముక్తి కలిగిందని ప్రజలు భావించారు. అయితే ఇప్పటికీ ఆ ఊసేలేదు. కంపోస్టు యార్డుగా స్వర్ణముఖి నాయుడుపేట పట్టణ సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో ఇష్టారాజ్యంగా వ్యర్థాలను పడేస్తుండటంతో కంపోస్టు యార్డుగా తయారైంది. నదిపై ఉన్న కాజ్వేపై నుంచి వాహనాల్లో చెత్త నిల్వలు, భవనాలకు సంబంధించిన వ్యర్థాలను నదిలో వేస్తుండడంతో స్వర్ణముఖి నది రోజురోజుకూ రూపుకోల్పోతోంది. మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ కంపోస్టు యార్డు లేకపోవడంతో పట్టణవాసులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి లారీల్లో వ్యర్థాలను నదిలో పడేస్తున్నారు. అధికారులు కూడా పట్టించుకున్న దాఖలాల్లేవు.– నాయుడుపేట టౌన్ -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై పోలీస్ జులుం
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపాల్టీలో మంత్రి పి.నారాయణ పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కాలనీ సమస్యలను పరిశీలించాలని మంత్రిని కోరడానికి వచ్చిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై దౌర్జన్యం చేశారు. అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతున్న పోలీసుల తీరుపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ‘హౌస్ ఫర్ ఆల్’ గృహాలను లబ్ధిదారులకు కేటాయించేందుకు మంత్రి నారాయణ శనివారం సూళ్లూరుపేట మున్సిపాల్టీ పరిధిలోని మన్నారుపోలూరుకు వచ్చారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత నాయుడుపేటకు బయలుదేరారు. ఇదే సమయంలో వట్రపాళెం వద్ద స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మంత్రి కాన్వాయ్ను ఆపి, మర్యాదపూర్వకంగా మంత్రికి శాలువా కప్పారు. జాతీయ రహదారికి పక్కనే ఉన్న వట్రపాళెంలో కనీస వసతులకు దూరంగా బతుకుతున్న నిరుపేదల బాధలను చూడాలని మంత్రిని కోరారు. అది పెద్ద నేరమైనట్లు గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబు, స్థానిక పోలీస్ అధికారులు రెచ్చిపోయారు. డీఎస్పీ రాంబాబు ఎమ్మెల్యే కిలివేటిని పక్కకు నెట్టేశారు. అక్కడే ఉన్న పలువురు సీఐలు, ఎస్సైలు కూడా కల్పించుకుని ఎమ్మెల్యేను ఈడ్చుకెళ్లారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కిలివేటితోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందోళనకు దిగారు. పోలీస్ జులుం నశించాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో మంత్రి నారాయణ స్పందిస్తూ.. ‘‘నేను రాను, నాకు వేరే షెడ్యూల్ ఉంది. నాయుడుపేటకు వెళ్లాలి, ఈ రోజు షెడ్యూల్లో వట్రపాళెం లేదు. ఊరికే విసిగించకు’’ అంటూ రుసరుసలాడారు. నాయుడుపేటలో గందరగోళం నాయుడుపేటలో ‘హౌస్ ఫర్ ఆల్’ ఇళ్లు కేటాయింపు సభలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. పేదలకు మేలు చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. మంత్రి నారాయణ తీరును ఆయన తప్పుపట్టారు. జై వైఎస్సార్ అంటూ ప్రసంగాన్ని ముగించబోయారు. అదే సమయంలో సభలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు కూడా జై వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ‘నుడా’ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎమ్మెల్యే సంజీవయ్యపై ఆగ్రహం వ్యక్తం చేసి, అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు కూడా పోటీగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కార్యకర్తలను అడ్డుకుని, బయటకు పంపేందుకు యత్నించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆగ్రహం వ్యక్తం చేసి సభ నుంచి బయటకు వచ్చేశారు. -
వెన్నుపోటే!
నగర టీడీపీలో నలుగురు నేతలు.. ఆ నలుగురివీ సొంత అజెండాలు.. లాబీయింగ్లు.. రాజకీయ పైరవీలు.. కానీ ఆ నలుగురు నేతలు మాత్రం నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఉంటే ఆయన వెంటే ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారు పరోక్షంగా మంత్రి నారాయణ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వ్యక్తిగత అజెండాతో ముందుకుసాగుతున్నారు. ఆ నలుగురికి నగర టీడీపీ టికెట్ కావాలి. అందరికీ దీనికి సంబంధించి రకరకాల హామీలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అందరూ మంత్రి నారాయణ అభ్యర్థిత్వాన్ని తెరపైన ఆమోదిస్తున్నట్లు కనిపిస్తున్నా తెర వెనుక మాత్రం తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు సహకరించడంపై ఇప్పుడే నీలినీడలు కమ్ముకున్నాయి. పర్యవసానంగా మంత్రి నారాయణకు సొంత పార్టీలోనే వెన్నుపోట్లు తప్పవనే ప్రచారం పార్టీలో బలంగా సాగుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర టికెట్ విషయాన్ని పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బరిలో ఎవరిని దింపాలన్న విషయంలో నాలుగు నెలల క్రితం వరకూ అయోమయంగా ఉన్న అధిష్టానంలో ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో నగర టీడీపీ అభ్యర్థిగా మున్సిపల్శాఖ మంత్రి నారాయణ బరిలో ఉంటారని ఆ పార్టీలో బలంగా ప్రచారం సాగుతోంది. మంత్రి నారాయణ సైతం తన అభ్యర్థిత్వం ఖరారు అయిందనే సంకేతాలు పార్టీ శ్రేణులకు ఇవ్వడంతోపాటు ముఖ్యులకు తానే పోటీ చేస్తున్నానని చెప్పి ఆ మేరకు పనుల్లో మంత్రి నారాయణ బిజీగా ఉన్నారు. అయితే మంత్రినారాయణ కోటరీలో కీలక నేతలుగా ఉన్న టీడీపీ నగర ఇన్చార్జ్ ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధ ఈ టికెట్పైనే ఆశలు పెంచుకున్నారు. నాలుగు నెలల క్రితం వరకు మంత్రి ద్వారానే లాబీయింగ్ పర్వం నిర్వహించారు. మంత్రి కూడా అందరికీ టికెట్ ఇప్పిస్తాననే హామీతో వారిని ఇప్పటివరకు తనతో తిప్పుకోవడంతోపాటు ఆర్థికంగా కూడా కొందరికి లబ్ధి చేకూర్చారు. ఈ పరిణామాల క్రమంలో నలుగురు నేతల ఆశలు అడియాశలయ్యేలా టికెట్ ఇప్పిస్తానన్న గాఢ్ ఫాదర్ నేరుగా బరిలో నిలవనుండడంతో వారు వ్యక్తిగత అజెండాతో ముందుకుసాగుతున్నారు. సొంత లాబీయింగ్పై దృష్టి సారించడంతోపాటు మంత్రి నెల్లూరు నగరంలో తమ సహకారం లేకుండా ఎలా గెలుస్తారో చూద్దాం అంటూ తమ వర్గీయుల వద్ద బహిరంగంగానే వాఖ్యానిస్తుండడం ఆ పార్టీలో కలకలం రేపింది. దీనికితోడు మంత్రి నగరంలో లేని సందర్భంలో నలుగురు నేతలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనార్హం. కచ్చితంగా టిక్కెట్ వస్తుందనే ఆశ 2014 ఎన్నికల్లో టీడీపీ నగర అభ్యర్థిగా ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈక్రమంలో మంత్రి నారాయణ ముంగమూరుకు రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో కొన్ని కాంట్రాక్ట్ పనులు, అలాగే నెల్లూరు నగరంలోనూ పలు పనులు కేటాయించారు. పనుల విలువ వందల కోట్లలో ఉంది. అలాగే ఇప్పుడు తాజాగా మళ్లీ భారీగా పనులు శ్రీధరకృష్ణారెడ్డికి అప్పగించనున్నారు. ఈక్రమంలో శ్రీధరకృష్ణారెడ్డి తనకు సహకరించాలనేది మంత్రి షరతుగా తెలుస్తోంది. అయితే అన్ని చోట్ల ఇన్చార్జ్లకు దక్కిన విధంగానే తనకు పనులు దక్కాయే తప్ప కొత్తగా ఏమీ రాలేదని, 2014 నుంచి నగరంలో పార్టీ అభ్యున్నతి కోసం తాను పనిచేస్తున్నానని, తనకు కచ్చితంగా టికెట్ వస్తుందని ముంగమూరు భరోసాతో ఉన్నారు. మేయర్ ధీమా నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ టికెట్ హామీతోనే మంత్రి నారాయణ ద్వారా వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈక్రమంలో ముస్లిం కోటాలో తనకు టికెట్ వస్తుందని ధీమాతో ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో మంత్రికి, అబ్దుల్ అజీజ్కు మధ్య దూరం పెరిగింది. రొట్టెల పండగ కార్యక్రమం కోసం నగరపాలక సంస్థ నుంచి నిధులు కేటాయించడంతోపాటు అన్నీ తానై 20 రోజులపాటు అక్కడే ఉండి పనులు చూసుకున్నారు. చివరికి అన్ని పనులు మంత్రి నారాయణ చేశారని భారీగా పత్రికా ప్రకటనలు గుప్పించడంతో అబ్దుల్ అజీజ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు లోకేష్ తనకు హామీ ఇచ్చారని టికెట్ తప్పక వస్తుందని ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. నుడా చైర్మన్కు బాలకృష్ణ ఆశీస్సులు! నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనకు బాలకృష్ణ ఆశీస్సులు ఉన్నాయని, తప్పక అవకాశం వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే తాళ్లపాక అనురాధ తనకు మహిళా కోటాలో టికెట్ వస్తుందని భరోసాతో ఉన్నారు. ఈక్రమంలో మంత్రి కోటరీ నేతలంతా అభ్యర్థులే అయితే మంత్రి కోసం నగరంలో పనిచేసేదెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
మంత్రి నారాయణ మొండివైఖరి
నెల్లూరు సిటీ: మంత్రి నారాయణ మొండివైఖరితో పారిశుధ్య కార్మికులు సమ్మెను కొనసాగించాలని నిర్ణయించారు. 27 రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో నగరం చెత్తాచెదారాలతో నిండిపోయింది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్తో మేయర్ అజీజ్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు. సోమిరెడ్డి తన నివాసంలో కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరిపినా, మేయర్ అజీజ్ మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడినా ఫలితం లేకుండాపోయింది. 279 జీఓపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మెట్టుదిగకపోవడం.. అటు కార్మిక సంఘాలు సైతం సమ్మె విరమించేదిలేదని తేల్చిచెప్పడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. సమస్య జఠిలం కార్పొరేషన్ పరిధిలో 877 మంది పారిశుధ్య కార్మికులు సొసైటీ కింద, 260 మంది కాంట్రాక్టర్ కింద, 350 మంది పర్మనెంట్ పద్ధతిలో ఉన్నారు. సొసైటీ కార్మికులను 279 జీఓలో ప్రైవేట్ కాంట్రాక్టర్ కింద పనిచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత నెల 14 నుంచి కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్లారు. రోజూ 350 మెట్రిక్ టన్నుల చెత్తాచెదారాలు నగరంలో ఉత్పత్తవుతాయి. 27 రోజులుగా 9500 మెట్రిక్ టన్నుల చెత్తలో కార్పొరేషన్ అధికారులు అక్కడక్కడా 20 శాతాన్నే తొలగించారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదం ఉంది. రెండు దఫాల చర్చలు విఫలం కౌన్సిల్ సమావేశం అనంతరం మేయర్ శనివారం కార్మిక సంఘ నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమ్మె విరమణపై చర్చలు జరిపారు. ఈ క్రమంలో కార్మిక సంఘాలు మేయర్ ఇచ్చిన ముందస్తు అనుమతులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మేయర్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని, తాత్కాలికంగా 279 జీఓను అమలు చేయమని చెప్పారు. అయితే అనుమతులను వెనక్కి తీసుకుంటనే సమ్మెను విరమిస్తామని కార్మిక సంఘ నాయకులు తేల్చిచెప్పారు. అనంతరం మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడారు. 279 జీఓపై వెనక్కి తగ్గేదిలేదని, అవసరమైతే పోలీసుల బందోబస్తు మధ్య ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయిద్దామని మేయర్కు మంత్రి చెప్పినట్లు సమాచారం. అనంతరం శనివారం రాత్రి సోమిరెడ్డి నివాసంలో కార్మిక సంఘ నాయకులతో మరో ధఫా ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే సోమిరెడ్డి నుంచి కూడా సానుకూల సమాధానం రాకపోవడంతో కార్మిక సంఘాలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి నారాయణ నిర్ణయమే ఫైనల్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిర్ణయమే ఫైనల్ అని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మేయర్, మంత్రి సోమిరెడ్డి చర్చలు జరిపినా ఫలితం ఉండదని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. మంత్రి నారాయణ మాత్రం కార్మిక సంఘాల డిమాండ్లకు వెనక్కి తగ్గడం లేదు. జిల్లాలోని టీడీపీ ముఖ్యనేతలెవరూ సొంత నిర్ణయం ప్రకటించలేకపోతున్నారు. మంత్రి నారాయణతో మేయర్ ఫోన్లో మాట్లాడిన సమయంలో 279 జీఓను అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పినట్లు సమాచారం. మరోవైపు మంత్రి నారాయణ నెల్లూరులో రెండు, మూడు రోజులు ఉండి వెళ్లిపోతారని, తాము నగరంలో ఎలా తిరగాలని టీడీపీలోని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులతో మాట్లాడకుండా ఇలా మొండిగా వ్యవహరిస్తే తామే నష్టపోతామని గుసగుసలాడుతున్నారు. వీరి పంతాలతో ప్రజలకే ఇబ్బందులు ఓ వైపు కార్మికులు తమ పొట్టగొట్టద్దని సమ్మె చేస్తుంటే.. మంత్రి నారాయణ మొండివైఖరి కారణంగా నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో నాలుగు రోజుల్లో వినాయకచవితి పండగను ఎలా చేసుకోవాలని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన కూడళ్లు, వీధుల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకున్న సమయంలో చెత్తాచెదారాలతో ఇబ్బందులు పడతామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ వ్యవస్థనుప్రైవేటీకరించేందుకే: కార్పొరేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. 279 జీఓ అమలైతే భవిష్యత్తులో పన్నుల భారం ప్రజలపై భారీగా పడనుంది. ప్రజలు కూడా కార్మికుల సమ్మెకు మద్దతిస్తున్నారు. – కత్తి శ్రీనివాసులు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడుమంత్రి పట్టించుకోకపోవడందారుణం: కార్మికులు 27 రోజులుగా సమ్మె చేస్తున్నా, మంత్రి నారాయణ, అధికార పార్టీ నేతలు పట్టించుకోకపోవడం దారుణం. 279 జీఓకు సంబంధించి మేయర్ అజీజ్ ఇచ్చిన ముందస్తు అనుమతులను తాత్కాలికంగా వెనక్కి తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. – రూప్కుమార్యాదవ్, వైఎస్సార్సీపీ కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ -
అన్నా క్యాంటీన్ల అంచనాలు పెంచి కోట్లు కొట్టేశారు
-
మంత్రి నారాయణ ఖాతాలోకి వేల కోట్లు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో గత నాలుగేళ్లుగా సమర్థవంతమైన అవినీతి పాలన నడుస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అవినీతిని సమర్థవంతంగా పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. అర్బన్ హౌసింగ్ స్కీమ్లో సుమారు 30 వేల కోట్ల అవినీతి జరిగిందని, మట్టి-నీరు పథకంలో మరో 30 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇసుక తవ్వకాల ద్వారా వేల కోట్లు దోచేస్తున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల ద్వారా అవినీతి చేసుకోమంటూ కిందస్థాయి నేతలకు అనుమతి ఇచ్చేశారని దుయ్యబట్టారు. 'సర్వశిక్షా అభియాన్కు కేంద్రం ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. విద్యకు 30 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు. వీటిలో 8 నుంచి 9 వేల కోట్లు చేతులు మారుతున్నాయి. విద్యకు కేటాయించిన నిధులన్నీ మంత్రి నారాయణ పరమవుతున్నాయి. అంతేకాకుండా సర్వశిక్షాఅభియాన్లో పోస్టులు అమ్ముకుంటున్నారు. దేశంలో ఎన్ఆర్జీఎస్ కింద సంవత్సరానికి 40వేల కోట్లు కేటాయిస్తే 9వేల కోట్లు కేవలం ఏపీకి ఇస్తున్నారు. జీవో 51 ద్వారా 10 ప్రాజెక్టులను తాకట్టు పెట్టి 6500 కోట్లు తేవాలని చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఉపాధి హామీ పథకాలుగా మారిపోయాయి' అని సోము వీర్రాజు ఆరోపించారు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, ఎల్ఈడీ బల్బులు, ఇల్లులు, 24 గంటల కరెంట్, నీరు చెట్టు, ప్రధాన మంత్రి భీమా, మరుగుదొడ్లు వంటి వాటిని కేంద్రమే భరిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అవీనీతికి పాల్పడుతోంది. ఆ సొమ్ముతో రాష్ట్రంలోని ఉన్న ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేయొచ్చు. బీజేపీ బలం పెరుగుతుందనే టీడీపీ నేతలు మా పార్టీ నాయకులపై దాడులు చేయిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 20 వేల కోట్ల అప్పు తెచ్చారు. ఇంత అప్పు ఉండగా మళ్లీ అప్పు తేవడానికి సిద్ధమయ్యారు. సీఎం అప్పులకు సిద్ధమౌతుంటే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఏంచేస్తున్నారు. పైగా సీఎం సభలకు రాకపోతే ప్రభుత్వ పథకాలు ఇవ్వమంటూ ప్రజలను బెదిరిస్తున్నా'రని సోము వీర్రాజు మండిపడ్డారు. -
చంద్రబాబు పాలనపై అధ్యయనం జరగాలి
-
టీడీపీలో గ్రూప్ వార్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తీరుతో మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి అసంతృప్తికి గురయ్యారు. అది కూడా మంత్రి నారాయణ సమక్షంలో ఆయన క్యాంప్ కార్యాలయంలో ఈ వ్యవహారం జరగటంతో పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి అపాయింట్మెంట్ ఆదాల కోరితే ఆయన కంటే ముందుగానే బీద రవిచంద్ర కుదరదని చెప్పటం, అది కూడా పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలో చెప్పటం, దీనికి మంత్రి మౌనం వహించటంతో ఆదాల కినుకు వహించారు. వెంటనే పార్టీ రాష్ట్ర అ«ధ్యక్షునికి దీనిపై ఆదాల ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇది కూడా సీఎం పర్యటన నేపథ్యంలో జరగటంతో పార్టీలో హాట్ టాపిక్ అయింది. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఇద్దరు గురుశిష్యులు. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. కొంత కాలంగా పార్లమెంట్ పరిధిలో కార్యక్రమాల్లో పార్లమెంట్ ఇన్చార్జి హోదాలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో శనివారం నగరంలో తెలుగుదేశం పార్టీ దళిత తేజం బహిరంగ సభ కార్యక్రమం జరగనుంది. ఈ సభకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లు, ఆర్థిక వ్యవహారాలు, ఇతర అంశాలపై చర్చించటానికి మంత్రి పి.నారాయణ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో పాటు నగర నేతలు పలువురు పాల్గొన్నారు. సమావేశం ముగిశాక మాజీ మంత్రి ఆదాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ములుమూడిలో అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి నారాయణను ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా కోరారు. గడిచిన నాలుగేళ్లలో రూరల్ నియోజకవర్గంలో కార్యక్రమాలకు పెద్దగా రాలేదు. తప్పనిసరిగా రావాలని కోరారు. దీనికి మంత్రి నారాయణ బదులివ్వటానికి ముందే ఎమ్మెల్సీ బీద రవిచంద్ర జోక్యం చేసుకోని మంత్రి నారాయణ ఎలా వస్తారు. సీఎం కార్యక్రమంహడావుడిలో ఉంటారు. పొద్దునే ఏర్పాట్లు చూసుకోవాలి. ఆయన రావటం కుదరదని ఖరాఖండిగా చెప్పాడు. అది నగర నేతలు, డివిజన్ కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తల సమక్షంలో చెప్పటంతో ఆదాల తీవ్ర అసంతృప్తికి లోనై అక్కడి నుంచి వెంటనే వెనుదిరిగారు. మంత్రి నారాయణ కనీసం ఒక్కమాటకు కూడా మాట్లాడలేదు. దీంతో పార్టీలో తనకి ప్రాధాన్యం ఇవ్వటం లేదని, తాను కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నా నేతలు తీరు సరిగాలేదని ఆదాల తన అనుచరుల వద్ద ఆక్రోశం వెళ్లగక్కారు. మరోవైపు వెంటనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ఫోన్ చేసి బీద రవిచంద్ర తీరుపై ఫిర్యాదు చేశారు. నగరంలో ఫ్లైక్సీల హడావుడి శనివారం నగరంలో జరిగే దళిత తేజం కార్యక్రమం ఫైక్సీల హడావుడి కూడా పార్టీలో తీవ్ర చర్చకు దారీతీసింది. కొందరు దళిత నేతలు కూడా దీనిపై పార్టీ ముఖ్యుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నగరం అంతా దళిత తేజం ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు కానీ దానికి భిన్నంగా ఒక సామాజికవర్గం నేతలు ఫ్లెక్సీలు హడావుడి చేయటం అందులోనూ దళిత నేతలకు చోట లేకపోవటం గమనార్హం. ముఖ్యంగా గత 15 రోజులుగా దళిత తేజం విజయవంతం చేయండని పార్టీ దళిత నేతలుగా ఉన్న ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, మాజీ మంత్రులు బల్లి దుర్గాప్రసాద్, పరసా రత్నం, పార్టీ నేతలు నెలవల సుబ్రమణ్యం, జోత్స్నలత తదితరులు అన్ని నియోజకవర్గాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో నగరంలో భారీగా ఏర్పాటు చేసిన ఫ్లైక్సీల్లో దళిత నేతలు కల్పించలేదు. దీనికి భిన్నంగా నగరంలో ముంగమూరు శ్రీధర్కృష్ణారెడ్డి. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి పట్టాభి, తాళ్లపాక అనురాధ తదితర నేతలు భారీగా ఫ్లైక్సీలు ఏర్పాటు చేయటం పార్టీ అలంకరణ కమిటీకి తలనొప్పిగా మారింది. పరసా హడావుడి మరోవైపు సీఎం పర్యటన పేరుతో పరసా రత్నం హడావుడి చేశారు. శుక్రవారం పెళ్లకూరులో సమావేశం నిర్వహించి జనసమీకరణ బాధ్యత అధికారులకు అప్పగించారు. ఏపీఎం పద్మ, ఉఫాధి హామీ ఏపీఓ జ్ఞాన ప్రకాష్తో కలిసి ఆయన సమావేశం నిర్వహించి పొదుపు సంఘాల మహిళలు, ఉపాధి హమీ కూలీలతో మాట్లాడి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసీ జనాలను తరలించాలని ఆదేశాలు జారీ చేయటం చర్చనీయాంశం అయింది. -
నారాయణ మాటలు నీటిమూటలు
నెల్లూరు(సెంట్రల్): నగరంలోని మైనార్టీలకు కోట మిట్టలో షాదీమంజిల్ను ఈ రంజాన్లోపు నిర్మి స్తామని చెప్పిన మంత్రి నారాయణ మాటలు నీటిమాటలుగా మిగిలిపోయాయని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్ విమర్శించారు. కోటమిట్టలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. షాదీమంజిల్ను అధునాతనంగా నిర్మిస్తానని జనవరిలో మంత్రి చెప్పారని, అయితే కనీసం శంకుస్థాపన చేశారానని ప్రశ్నించారు. తాము ఏది మాట్లాడినా రాజకీయం అంటారని, అయితే ఏడు నెలలుగా కనీసం పట్టించుకోరానని ప్రశ్నించారు. నగరంలోని గంజిఖానాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తాను ఎంపీ నిధుల నుంచి రూ.30 లక్షలను తీసుకొచ్చానని, అయితే షాదీమంజిల్ను నిర్మిస్తున్నప్పుడు ఇది ఎందుకని చెప్పడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయని ఆరోపించారు. మంత్రివర్గంలో మైనార్టీలకు స్థానమేదీ..? ప్రస్తుతం ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరని, మైనార్టీలపై టీడీపీ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీని ద్వారా అర్థమవుతోందని చెప్పారు. చంద్రబాబు ఇక్కడ బీరాలు పలుకుతూ, ఢిల్లీలో వంగి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీడీపీ మధ్య సంబంధం కొనసాగుతుంటే, ప్రతిపక్షంపై నెపం వేయాలని చూడటం సిగ్గుచేటని విమర్శించారు. ఇతర రాష్ట్రంలోని బీజేపీకి చెందిన మంత్రి సతీమణికి టీటీడీ బోర్డులో స్థానం ఎలా కల్పించారని ప్రశ్నించారు. శ్వేతపత్రం విడుదల చేయాలి నెల్లూరులోని దర్గామిట్టలో గల దర్గా వద్ద రూ.20 కోట్లతో ఏదో చేశామని మంత్రి, టీడీపీ నాయకులు బీరాలు పలకడం కాదని, ఇప్పటి వరకు ఎంత నిధులు కచ్చితంగా వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. షాదీమంజిల్ ఉండే జెండావీధి ప్రాంతంలో ఇరుకు రోడ్డులో డివైడర్ను ఏర్పాటు చేయడంపై స్థానికులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారన్నారు. కార్పొరేటర్లు ఖలీల్ అహ్మద్, ఓబిలి రవిచంద్ర, గోగుల నాగరాజు, దేవరకొండ అశోక్, నాయకులు హంజాహుస్సేన్, మునీర్ సిద్ధిఖ్, కుంచాల శ్రీనివాసులు, నజరుల్లా, అతహర్బాషా, ఫజల్, అహ్మద్, ఆరిఫ్, మైనుద్దీన్, తారీఖ్ అహ్మద్, ఇంతియాజ్, మున్వర్, పఠాన్ ఫయాజ్ఖాన్, మున్నా, కాలేషా, ముజీర్, మంజూర్, బాబాభాయ్, షబ్బీర్, జావీద్, మస్తాన్, అలీమ్, తదితరులు పాల్గొన్నారు. -
కన్నీటి పర్యంతమైన దొంతు శారద
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీలో మున్సిపల్ ప్రకంపనలు మొదలయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల మితిమీరిన జోక్యంతో మహిళా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా, స్వంత్రంగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మున్సిపల్ చైర్ పర్సన్లుగా ఉన్న మహిళలకు కనీస గౌరవంతో పాటు పదవి ద్వారా సంక్రమించిన హక్కులను కూడా కాలరాసేలా విధంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. పర్యవసనంగా మహిళా ప్రజాప్రతినిధుల్ని ఇంటికే పరిమితం అనే చందంగా అధికార పార్టీలో వేధింపుల పర్వం కొనసాగుతోంది. ఈ పరిణమాల క్రమంలో వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ దొంతు శారద బుధవారం కన్నీటి పర్యంతమవుతూ రాజీనామా కు సిద్ధపడ్డారు. చివరకు జిల్లా ఇన్చార్జి మంత్రి అమరనాథ్రెడ్డి ఫోన్చేసి బుజ్జగించటంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, కావలిలో అధికార పార్టీ మహిళలు మున్సిపల్ చైర్పర్సన్లుగా కొనసాగుతున్నారు. గడిచిన నాలుగేళ్లుగా పార్టీలో మహిళా నేతల పరిస్థితి దయనీయం. పట్టణాలకు ప్రథమ మహిళలే అయినా పార్టీలోనూ, పాలనలోనూ చివరి మహిళలుగా మిగులుతున్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ సొంత జిల్లాలోనే పట్టణాల ప్రథమ మహిళలకు కనీస ప్రాధాన్యం లేకపోవటంతో పార్టీలో పరిస్థితికి నిదర్శనం. గతంలో కావలిలో పార్టీ ఇన్చార్జి బీద మస్తాన్రావు, మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య మధ్య ఇదే తరహలో అధిపత్య పోరు సాగింది. ముందస్తు ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు పదవీ కాలం పూర్తి కాగానే అలేఖ్యను పదవి నుంచి తప్పుకోవాలని బీద ఒత్తిడి తేవటం, ఒప్పందంలోని అంశాలను మీరు ఏమీ పాటించకుండా ఇప్పుడు రాజీనామా చేయమని కోరటం సరికాదని ఆమె సామాజిక వర్గ మద్దతుతో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో అధిష్టానానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారటంతో ఆమెనే కొనసాగిస్తున్నారు. ఇదే తరహాలో గూడూరు మున్సిపాలిటీలోనూ ఎమ్మెల్యే సునీల్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మధ్య కొంత కాలం ఆధిపత్య పోరు కొనసాగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే మున్సిపల్ పాలనలో మితిమీరిన జోక్యం చేసుకుని మున్సిపల్ చైర్పర్సన్ ప్రా«ధాన్యం తగ్గిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ పరిణమాల క్రమంలో ముగ్గురు మున్సిపల్ చైర్పర్సన్లు మంత్రి నారాయణకు మొర పెట్టుకున్నా తమకు ఎమ్మెల్యేలే ముఖ్యమని మంత్రి సృష్టం చేశారు. దీంతో కొన్ని నెలలుగా మున్సిపల్ చైర్పర్సన్స్ వరెస్స్ ఎమ్మెల్యేలుగా వ్యవహారం సాగుతుంది. ఈ క్రమంలో మళ్లీ వెంకటగిరిలో ముసలం మొదలై తారా స్థాయికి చేరింది. బీసీ మహిళ కావటం వల్లే వేధింపులు గురువారం వెంకటగిరి పట్టణంలో జరిగే మినీ మహానాడు వంటి కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలు, ఏర్పాట్లుపై తనకు ఎటువంటి సమాచారం లేకపోవడంపై ఆమె మనస్థాపం చెందారు. దీంతో అమె తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆమె ససేమిరా అనడంతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి అమరనాథ్రెడ్డి నేరుగా ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె వెంకటగిరిలో స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నాలుగేళ్లుగా వ్యవహరిస్తున్న తీరు భరించామని, ఇక తన వల్ల కావడం లేదంటూ ఆమె మంత్రితో ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి సంబంధించి ఏ ఒక్క నిర్ణయంలో తనకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెప్పిన విధంగానే నడుచుకుంటున్నానని అయినా తనను అడుగు అడుగునా అవమానిస్తున్నారంటూ వాపోయారు. తన మాట వినాల్సిన అవసరం లేదని అధికారులు, సిబ్బందికి చెబుతుంటే ఎలా చైర్పర్సన్గా కొనసాగాలో అర్థం కావడం లేదని తెలిపారు. పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే అండతో ఆయన ముందే తనపై దూషణలకు దిగుతున్నా వారిని వారించకపోవడం వారిని పరోక్షంగా ప్రోత్సహించడం కాదా అంటూ మంత్రితో ఆమె ఫోన్లో కన్నీటి పర్యంతమయ్యారు. స్పందించిన మంత్రి అమరనాథ్రెడ్డి తనే స్వయంగా ఎమ్మెల్యేతో మాట్లాడి సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. -
ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం శనివారం హైదరాబాద్లో జరిగింది. మంత్రి నారాయణతో పాటు, మాజీ డీజీపీ సాంబశివరావు బంధువు అయిన భార్గవ్తో ఆమె నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు. వీరి వివాహం ఆగస్టు 29న జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మంత్రి సీటుకు అనుచరుల ఎసరు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగర టీడీపీలో ఎత్తుగడ రాజకీయాలకు పూర్తి స్థాయిలో తెరలేచాయి. నిత్యం మంత్రి నారాయణ వెంట ఉండే కీలక అనుచరగణమే ఆయన సీటుకు ఎసరు పెట్టాయి. అదే స్థానం కోరుతూ పలువురు నేతలు కీలక లాబీయింగ్కు తెరతీసి సరికొత్త సమీకరణాలు తెరపైకి తెచ్చి సీటు హామీ వచ్చిందని ప్రచారం చేసుకుంటూ హడావుడి చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే మంత్రి నారాయణ చుట్టూ ఉన్న ప్రథమ శ్రేణి నేతలు అంతా టికెట్ కోసం ప్రయత్నిస్తూ గురువుకే సున్నం పెడుతున్నారు. వీరిలో ఒకరైతే మరో అడుగు ముందుకు వేసి సీటు తనకి వస్తే ఖర్చు మంత్రిగారే పెట్టుకుంటానని చెప్పారనే ప్రచారానికి తెరతీశారు. ఈ పరిణామాల క్రమంలో మంత్రి నారాయణ జిల్లాలో మరో నియోజకవర్గం సీటుపై దృష్టి సారించి అక్కడ రాజకీయ పనులు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇప్పటికే నగర టీడీపీ చుక్కాని లేని నావలా తయారైంది. నేతలు పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ వారి వ్యక్తిగత కార్యక్రమాలు మినహా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాఖలాల్లేవు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం పలుమార్లు నేతలు అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పినా అది ఎవరూ పట్టించుకోని పరిస్థితి. దీంతో నగర టీడీపీలో గందరగోళం నెలకొంది. పాత, కొత్త నేతల వివాదాలు, గొడవలు, ఆదిపత్య పోరు నిత్య కృత్యంగా సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడే అసెంబ్లీ టికెట్ ఫైట్కు అధికార పార్టీలో తెర లేచింది. సార్వత్రిక ఎన్నికలకు మరో 10 నెలలు సమయం ఉన్నా అధికార పార్టీలో మాత్రం టికెట్ హడావుడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా గత ఏడాది కాలంగా అయితే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నెల్లూరు నగరం నుంచి తాను పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో ప్రకటించుకున్నారు. దీనికి అనుగుణంగా నగరంలో కార్యక్రమాలు చేస్తున్నారు. కనీసం వారంలో రెండు రోజుల పాటు నగరంలో పర్యటనలు నిర్వహించటం, అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు నగరంలో అధికార పార్టీ కార్పొరేటర్లందరినీ తనవైపు మరల్చుకోవడానికి వీలుగా అందరికీ పనులు చేయించటం, ఆయా డివిజన్లకు నిధులు కేటాయించి నేరుగా తనతోనే మాట్లాడాలని ఆదేశాలు ఇచ్చి నగరంలో బలంగా వర్గం ఏర్పాటు చేసుకునే యత్నాలు సాగించారు. అయితే అవి కొంతమేరకే ఫలించాయి. ఈ క్రమంలో మంత్రి కోటరీలో కీలక వ్యక్తులుగా ఉన్న నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర టీడీపీ ఇన్చార్జి మంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి. టీడీపీ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధలు టికెట్ రేసులోకి వచ్చారు. అలాగే నుడా చైర్మన్, నగర టీడీపీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా సీటు కోసం తన లాబీయింగ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఎవరికీ వారు కార్యక్రమాలు నిర్వహించి హడావుడి చేస్తున్నారు. అయితే అంతిమంగా మాత్రం ఎవరు పార్టీ కార్యక్రమాలు నిర్వహించని పరిస్థితి. దీంతో నగరంలో ఆధిపత్యం విషయమై నేతల మధ్య పలుమార్లు అంతర్గత వివాదాలు రేగి మంత్రి వద్దే పంచాయితీలు జరిగాయి. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత 1983లో ఆనం రామనారాయణరెడ్డి, ఆ తర్వాత 1994లో తాళ్లపాక రమేష్రెడ్డి మాత్రమే అధికార పార్టీ నుంచి ఇక్కడ గెలుపొందారు. 1994లో రమేష్రెడ్డి గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. దీంతో స్వతహాగానే నగరంలో పార్టీకి పట్టు తక్కువ. ఈ క్రమంలో 2014 నుంచి భారీగా వలస వచ్చిన నేతలు కూడా ఎక్కువ అయ్యారు. నేతలు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ అన్న రీతిలో నగరంలో పరిస్థితి ఉంది. మైనార్టీ కోటాలో అజీజ్ హడావుడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మేయర్గా గెలుపొందిన అబ్దుల్ అజీజ్ పార్టీ ఫిరాయించారు. ఈయన నెల్లూరు టికెట్ తనకే దక్కుతుందని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే టికెట్ హామీతోనే పార్టీ ఫిరాయించానని, మంత్రి నారాయణతో పాటు లోకేశ్, చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని చెబుతుండటంతో పాటు రెండు నెలలుగా మైనార్టీ ఆత్మీయ సమావేశాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించి టికెట్ డిమాండ్ను బలపరుచుకునేలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇన్చార్జి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి టికెట్ తనకే వస్తుందని బలంగా చెప్పుకుంటూ పనిచేస్తున్నారు. మరోవైపు నగర టీడీపీ ఇన్చార్జీ హోదాలో నగరంతో పాటు రాజధానిలోనూ మంత్రి సహకారంతో భారీగా కాంట్రాక్ట్ వర్కులు తీసుకుంటు మందస్తు సన్నాహాల్లో ఉన్నారు. ఇక తాళ్లపాక అనురాధ కూడా టికెట్ కోసం ఆశిస్తూ తనకి టికెట్ వస్తే పార్టీ, మంత్రి నారాయణ ఖర్చు పెడతరానే ప్రచారం చేసుకుంటున్నారు. ఇక నుడా చైర్మన్ కోటంరెడ్డి యథావిధిగా బాలయ్య కోటాలో టికెట్ వస్తుందనే ఆశలో ఉన్నారు. నగర నేతలను ఏకతాటిపైకి తీసుకురావాలని మంత్రి రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో నగరంలో తలనొప్పులు పడటం కష్టమనే భావనతో కొత్త నియోజకవర్గంపై దృష్టి సారించారు. మొత్తం మీద నగరం టీడీపీలో కొనసాగుతున్న టికెట్ ఫైట్ మంత్రికే తలనొప్పిగా మారటం విశేషం. -
ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ
అమరావతి: సీఆర్డీఏపై మంత్రి వర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. అనంతం ఏపీ మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 1312 ఎకరాలను 65 సంస్థలకు కేటాయించామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో 65 సంస్థల్లో 7 సంస్థలు మాత్రమే నిర్మాణాలు చేపట్టాయని వెల్లడించారు. వచ్చే మంత్రి వర్గ సమావేశంలో విట్, ఎస్ఆర్ఎం, మాతా అమృతమయి లాంటి సంస్థలకు మరో 100 ఎకరాల చొప్పున కేటాయింపు ప్రతిపాదనలు పంపుతున్నామని చెప్పారు. అలాగే బాబు జగజ్జీవన్ రాం స్మృతివనానికి 10 ఎకరాలు, ఇండియన్ ఆర్మీకి 4 ఎకరాలు, చండ్ర రాజేశ్వర రావు ట్రస్ట్కు 3 ఎకరాలు, ఇషా ఫౌండేషన్కు 10 ఎకరాల చొప్పున కేటాయింపులకు మంత్రివర్గ ఉప సంఘం ఆమోదం తెలిపిందని వ్యాఖ్యాఇనంచారు. సీఆర్డీఏ పరిధిలో భూకేటాంపులు చేసినా..పనులు ప్రారంభించని ప్రైవేటు సంస్థలకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. -
నెల్లూరులో రెచ్చిపోతున్న కబ్జారాయుళ్లు
-
రాజధానిలో యూజర్ చార్జీలు
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిం చేందుకు వచ్చే సంస్థలపై యూజర్ చార్జీల భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సీఆర్డీఏ అధికారులు ఈ ప్రతిపాదనలు చేశారు. రాజధానిలో నిర్మించబోయే పైప్లైన్ డక్టులు, గ్యాస్, పెట్రో స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలను వినియోగించుకున్నందుకు ఈ చార్జీలు వసూలు చేసే విషయాన్ని పరిశీలించాలని కోరారు. యూజర్ చార్జీలను వసూలు చేయడం ద్వారా కొంతమేర ఆదాయ వనరులు పెంచుకోవచ్చని సూచించారు. రాజధానిలో తాగునీరు, మురుగునీరు, విద్యుత్, కమ్యూనికేషన్ తదితర వ్యవస్థల కోసం ఏర్పాటు చేయబోయే పైప్లైన్ డక్టులనే వాణిజ్య సంస్థలు తమ అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.. అన్ని రకాల కేబుళ్లు, పైప్ లైన్లు ఈ డక్టుల ద్వారానే వెళ్లాల్సివుంటుందని, ఇవే కాకుండా గ్యాస్, పెట్రో స్టేషన్లు, జల మార్గాల ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని తెలిపారు. తొలుత అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. 203 మంజూరు చేయగా అందులో 187 క్యాంటీన్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 10 ఎకరాల్లో షాపింగ్ మాల్.. అమరావతి నగరంలో 10 ఎకరాల్లో షాపింగ్ మాల్ నిర్మించాలని, థియేటర్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, రిటైల్ షాపింగ్ సదుపాయాలు ఇందులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని సీఆర్డీఏ నిర్మించి నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ప్రతిపాదించారు. ఏడాదిన్నరలో 38 వేల కుటుంబాలు రాజధానికి తరలివస్తాయన్న అంచనాతో వారి అవసరాల నిమిత్తం ఈ మాల్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా రాజధానిలోని ప్రధాన రహదారుల వెంబడి కంటైనర్ హోటళ్లను ఏర్పాటు చేయడానికి అనుమతివ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ హోటళ్ల ప్రతిపాదనను విజయవాడలోని మురళీ ఫారŠూచ్యన్ నిర్వాహకులు ఐటీసీతో కలిసి అభివృద్ధి చేస్తున్నారని సీఆర్డీఏ కమిషనర్ తెలిపారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించిన మౌలిక వసతుల కోసం రూ.166 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. బాండ్ల ద్వారా రాజధాని నిర్మాణంలో ఎన్ఆర్ఐలను భాగస్వాముల్ని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కాగా మహిళల ఆరోగ్య పరిరక్షణ (కేన్సర్పై లక్ష మందికి అవగాహన కల్పణ) కార్యక్రమానికి సంబంధించిన రెండు అవగాహన ఒప్పందాలను మెప్మా, హెల్త్ యూనివర్శిటీ, రెసిడెన్షియల్ స్కూల్స్ అధికారులు ముఖ్యమంత్రి సమక్షంలో కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ భాగస్వామ్యంతో చేపట్టనుంది. సమావేశంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్జైన్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వెయ్యి అపార్టుమెంట్లు నిర్మిస్తాం రూ.494 కోట్లతో రాజధానిలో వెయ్యి అపార్టుమెంట్లు నిర్మించనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ చెప్పారు. సీఆర్డీఏ సమావేశం తర్వాత ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో పనిచేసే ప్రైవేటు ఉద్యోగుల కోసం వీటిని నిర్మిస్తున్నామని, నిర్మాణం పూర్తయ్యాక వేలం ద్వారా వారికి విక్రయిస్తామన్నారు. జీ+11 విధానంలో మూడు కేటగిరీల్లో ఈ అపార్టుమెంట్లు నిర్మిస్తామని ఇందుకోసం ప్రభుత్వం పది ఎకరాలు కేటాయించిందన్నారు. 1200 చదరపు అడుగుల్లో 500 అపార్టుమెంట్లు, 1500 అడుగుల్లో 300, 1800 అడుగుల్లో 200 అపార్టుమెంట్లను నిర్మిస్తామన్నారు. చదరపు అడుగును రూ.3,500కు విక్రయిస్తామని తెలిపారు. -
రాజధాని రోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి..
సాక్షి, నెల్లూరు: రాజధాని రోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. మంత్రులు నారాయణ, లోకేష్ కనుసన్నల్లో రూ. 400కోట్ల కుంభకోణం చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ కుంభకోణంలో రూ. 100కోట్లు అడ్వాన్స్గా తీసుకున్నారని పేర్కొన్నారు. అంతేకాక ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి రుణం తీసుకుని.. 5వేల కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు. దీంట్లో 5 నుంచి 10 శాతం కమీషన్ మంత్రులు తీసుకుంటున్నారని కోటం రెడ్డి తెలిపారు. -
రాజధానిపై ప్రజల్లో సందేహాలున్నాయ్: సీఎం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రంతో విభేదాల వల్ల పనులు నిలిచిపోతాయనే ప్రచారం జరుగుతోందని, అది వాస్తవం కాదని చెప్పాలని అధికారులకు సూచించారు. రాజధాని పనులను డ్రోన్ల ద్వారా వీడియో తీసి, రెండు నిమిషాల లఘుచిత్రాలు రూపొందించి ప్రతి నెలా సినిమా థియేటర్లలో, మీడియా చానళ్లలో ప్రదర్శించాలని ఆదేశించారు. రాజధాని వ్యవహారాలపై బుధవారం సచివాలయంలో సీఆర్డీఏ, ఏడీసీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాజధానికి అవసరమయ్యే నిధులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై 18 ఏళ్లకు రూపొందించిన ఆర్థిక ప్రణాళికను ఈ సమావేశంలో ఆమోదించారు. కాగా, మొత్తం రాజధాని ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.48,115 కోట్లు అవసరమని అంచనా వేసినట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు. సీఎంను కలిసిన ఐబీ డైరెక్టర్ రాజీవ్ జైన్: ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ రాజీవ్ జైన్, ముఖ్యమంత్రి చంద్రబాబు కలయిక రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. షెడ్యూల్లో లేకుండా జైన్ బుధవారం నేరుగా సచివాలయానికి రావడం ఉత్కంఠ రేపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇటీవల కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇరువురు సుమారు గంటన్నర సేపు భేటీ కావడం గమనార్హం. సమావేశం వివరాలను సీఎంవో గోప్యంగా ఉంచడంపైనా సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని కేంద్రానికి వివిధ వర్గాల ద్వారా ఫిర్యాదులు అందడం, కేంద్రం నుంచి అందిన నిధుల వినియోగంలోనూ పెద్ద ఎత్తున లోపాలు చోటుచేసుకున్నాయనే విమర్శలు ఉన్న నేపధ్యంలో ఐబీ భేటీ జరగడం విశేషం. ప్రధాని మోడీ దీక్షను ఎద్దేవా చేసి ఈ నెల 20న సీఎం చంద్రబాబు ఒక రోజు నిరాహార దీక్ష చేస్తుండటంతో ఐబీ డైరెక్టర్ పర్యటన టీడీపీ శ్రేణుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ భేటీలో పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలకపాత్ర పోషించడం పరిశీలనాంశం. సీఎంతో భేటీ తర్వాత మంగళగిరిలో డీజీపీ కార్యాలయాన్ని సందర్శించారు. అకస్మాత్తుగా ఐబీ డైరెక్టర్ రాష్ట్రంలో పర్యటించడంపై టీడీపీ వర్గాలు ఒకింత ఆందోళన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్
వారి కోసం విరుష్క స్పెషల్ గిఫ్ట్.. ఎందుకంటే? (ఫొటోలు)
ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
WC: నో రిజర్వ్ డే!.. ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే.. జరిగేది ఇదే!
‘పీవోకే’ భారత్లో భాగమే.. మేం దానిని చేజిక్కించుకుంటాం
YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..
T20 WC: సంజూ వద్దు.. పంత్ బెటర్!.. తుదిజట్టులో ఆడించినా..
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement