
2వేల కోట్ల డ్రగ్స్ కేసు.. కీలక నిందితుడి అరెస్ట్
వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ముఠా కేసులో కీలక నిందితుడిని థానే పోలీసులు అరెస్ట్ చేశారు.
థానే: వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ముఠా కేసులో కీలక నిందితుడిని థానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్, నేపాల్ సరిహద్దు ప్రాంతంలో జయ్ ముఖిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత నెలలో రూ.2 వేల కోట్ల డ్రగ్స్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచీ అతడు పరారీలో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ లోని గోరక్ పూర్ లో నిందితుడు ఉన్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు కొన్ని గంటలపాటు అన్వేషించి జయ్ ముఖీని అదుపులోకి తీసుకున్నట్లు థానే క్రైమ్ విభాగం డీసీపీ పరాగ్ మనేర్ వెల్లడించారు.
నేపాల్ సరిహద్దు ప్రాంతంలో నిందితుడు తలదాచుకున్నాడని సమాచారం తెలిసినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ పోలీసులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గోరక్ పూర్ నుంచి రైలులో గోరక్ పూర్ వెళ్లడానికి సిద్ధమవుతుండగా సోమవారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో తమ బృందంతో కలిసి వెళ్లి అదుపులోకి తీసుకున్నాం, అనంతరం థానేకు తీసుకొచ్చామని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ లో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే 18.5 టన్నుల నిషేధిత డ్రగ్స్ కేసులో నిందితులను మహారాష్ట్రలోని సోలాపూర్ లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తమ విచారణలో మరిన్ని వివరాలు బయటకు వస్తాయని డీసీపీ పేర్కొన్నారు.