చంద్రబాబు పాలనంతా భయానకమే:వైఎస్ జగన్ | ys jagan mohan reddy takes on chandra babu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనంతా భయానకమే:వైఎస్ జగన్

Mar 19 2014 8:52 PM | Updated on Jul 25 2018 4:09 PM

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

ముమ్ముడివరం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై  వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆనాటి బాబు పాలనంతా భయానకంగానే సాగిందని జగన్ విమర్శించారు. చదువుల కోసం విద్యార్థులు ఎన్నెన్నిఅవస్థలు పడుతున్నారో ఏ ఒక్కరోజూ చంద్రబాబు తెలుసుకోలేదని దుయ్యబట్టారు. తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్ముడివరంలో ఎన్నికల రోడ్ షోకు హాజరైన అశేష జనవాహనిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి రావాలని అబద్ధాలను, అమలు సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నారని జగన్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ప్రజలకు సూచించారు.

 

ఆనాడు బెల్టుషాపులు పెట్టించిన ఘనత చంద్రబాబు నాయుడిది కాదా?అని నిలదీశారు.  చంద్రబాబు పరిపాలిస్తున్నప్పుడు విశ్వసనీయత అనే పదానికే అర్ధం తెలియదన్నారు. అధికారం కోసం ఆచరణ సాధ్యంకాని హామీలను బాబు ఇస్తున్నారన్నారు.  వైఎస్ఆర్ తన హయాంలో 13 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన సంగతిని ప్రజలకు తెలిపారు.  మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటూ చంద్రబాబు దొంగహామీలు ఇస్తున్నారని , అది అసలు సాధ్యమేనా?అని జగన్ ప్రశ్నించారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ చిరునామా ఎక్కడ అని అడిగితే ప్రతి ఒక్కరి గుండెలోతుల్లోఉన్నారని చూపిస్తున్నారని జగన్ స్పష్టం చేశారు. రాముని రాజ్యం అయితే చూడలేదు కాని..రాజశేఖరుని సువర్ణయుగం చూశానని గర్వంగా చెప్పొచ్చని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే నాలుగు సంతకాలు చేస్తానని జగన్ తెలిపారు.

 

అక్కా చెల్లెమ్మల జీ వితాల్లో వెలుగు తెచ్చేలా అమ్మఒడి పథకం అమలుపై తొలి సంతకం చేస్తానన్నారు.అవ్వా, తాతలు ప్రతి రోజు పనికి పోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవ్వా, తాతల జీవితాలకు ఊరటనిచ్చేలా పెన్షన్ ను రూ.700 చేసేలా రెండో సంతకం, గిట్టుబాటు ధరలేని రైతన్న ఇంట వెలుగు నిండేలా మూడో సంతకం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. అక్కా, చెల్లెళ్ల కళ్లల్లో సంతోషం కోసం డ్వాక్రా రుణాల మాఫీ చేస్తూ నాలుగో సంతకం చేస్తానన్నారు.అక్కడికక్కడే ఇళ్లు,రేషన్‌కార్డు ఇప్పించే ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో ముప్పై ఎంపీ స్థానాలను గెలుచుకునేలా అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదామన్నారు. మన ప్రయోజనాలు కాపాడేవారిని ప్రధానిని చేద్దామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే  గుజరాత్‌ను మించిపోయేలా అభివృద్ధి సాధిద్దామన్నారు. వచ్చే ప్రతి ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలన్నారు. ఈ సందర్భంగా ముమ్మడివరం ఎమ్మెల్యే అభ్యర్థిగా గుత్తుల సాయిని,  అమలాపురం ఎంపీ అభ్యర్థిగా విశ్వరూప్‌ను వైఎస్ జగన్ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement