నగరంలో విద్యార్థిని వాణిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులను ఉరి తీయాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉషారాణి డిమాండ్ చేశారు.
అనంతపురం అర్బన్, న్యూస్లైన్: నగరంలో విద్యార్థిని వాణిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులను ఉరి తీయాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉషారాణి డిమాండ్ చేశారు. మంగళవారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆమె, ప్రసన్నాయపల్లి సర్పంచ్ సావిత్రి, వంద మంది మహిళలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లే మహిళలకు రక్షణ లేకుండా పోతోందని విమర్శించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితులకు ఆరోజే కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. అనంతరం వారు ఎస్పీ శ్యాంసుందర్ను కలిసి నిందితులను అరెస్టు చేసి నిర్భయ చట్టం కింద కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. బాధితురాలిని పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నాయకురాళ్లు షామిర్బేగం, భాగ్యలక్ష్మి, శోభాదేవి, విజయలక్ష్మి, రమాదేవి, లీలావతి, ఆదెమ్మ, భవాని, ద్రాక్షాయణి, పద్మావతి, ప్రభావతి, యశోదమ్మ, ఈశ్వరమ్మ తదితరులున్నారు.
బాధితురాలికి అండగా ఉంటాం : డీఆర్డీఏ పీడీ నీలకంఠా రెడ్డి
బాధితురాలు వాణిని డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డి మంగళవారం సర్వజనాస్పత్రిలో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీ శారు.అండగా ఉంటామని హామీ ఇచ్చారు. డీఆర్డీఏ-ఐకేపీ జెండర్ విభాగం ఆధ్వర్యంలో సహకరి స్తామన్నారు. అనంతరం రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు.
హిందూపురంలో రాస్తారోకో: యాసిడ్ దాడి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ హిందూపురంలో మహిళలు, వి ద్యార్థులు ర్యాలీ నిర్వహించి వన్టౌన్ ఎస్ఐ రామయ్యకు వినతిపత్రం అందజేశారు.
బాధితురాలిని నిమ్స్కు తరలించండి
వాణికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించాలని సూపరింటెండెంట్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావుకు కలెక్టర్ లోకేష్కుమార్ సూచించారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణతో కలిసి మంగళవారం ఆయన ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించారు. బాధితురాలి వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. 15 రోజుల తర్వాత వాణికి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.


