రేవంత్ రెడ్డికి కరచాలనాలూ, ఆలింగనాలూ..
న్యాయమూర్తి అనుమతితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అసెంబ్లీకి చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆలింగనాలతో స్వాగతం పలికారు.
హైదరాబాద్: న్యాయమూర్తి అనుమతితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అసెంబ్లీకి చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యేలతోపాటు మిత్రపక్షం బీజేపీ ఎమ్మెల్యేలు ఆలింగనాలతో స్వాగతం పలికారు.
అప్పుడే ఓటువేసి బయటికి వస్తోన్న బీజేపీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, ఇతరులు రేవంత్ ను కౌగిలించుకుని పలకరిచారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికిముందు టీడీపీ ఎమ్మెల్యేలందరూ టీడీఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఓటు వేసిన అనంతరం రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.
పోలింగ్ నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భద్రట కట్టుదిట్టం చేశారు. మీడియాపై సైతం కొన్ని ఆక్షలు విధించడం గమనార్హం. పోలింగ్ స్టేషన్లోకి మొబైల్ ఫోన్లు, పెన్నులు సహా ఇతర వస్తువలు తీసుకురావద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో ఓటేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలందరూ తమ తమ సెల్ ఫోన్లు, ఇతర వస్తువులను అక్కడే ఏర్పాటుచేసిన క్లాక్ రూమ్ లో భద్రపరిచి లోపలికి వెళ్లిన దృశ్యాలు కనిపించాయి.
మొత్తం 120 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. కాగా, సీపీఎం, సీపీఐ తాము ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించాయి. దీంతో 118 మంది ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. పోలింగ్ ముగిశాక, ఇదే రోజు 5 గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభించి... రాత్రికల్లా విజేతలను ప్రకటిస్తారు.


