పెదవి విప్పని చంద్రబాబు
ప్రతి విషయంలో తానే 'అడ్వాన్స్'గా ఉంటానని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 'ప్రలోభాల పర్వం'పై మౌనం దాల్చారు.
హైదరాబాద్: ప్రతి విషయంలో తానే 'అడ్వాన్స్'గా ఉంటానని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 'ప్రలోభాల పర్వం'పై మౌనం దాల్చారు. ముడుపుల వ్యవహారంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరెస్టై 24 గంటలు గడిచినా చంద్రబాబు స్పందించలేదు. సాక్షాత్తూ తమ బాసే(చంద్రబాబు) ఆదేశాల ప్రకారమే 'డీల్' నడిచిందని స్వయంగా రేవంత్ రెడ్డి వెల్లడించినా అధినేత ఇప్పటివరకు పెదవి విప్పలేదు.
తమ పార్టీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో మీడియాకు ముఖం చాటేశారు. తెలంగాణలో పార్టీ తరపున గట్టిగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి జైలు పాలై రోజు గడిచినా చంద్రబాబు మౌనవ్రతం వీడలేదు. కీలకంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నా కూడా నోరు విప్పలేదు. తనకు 'రిస్క్' అనుకున్నప్పుడు ముఖం చాటేయడం చంద్రబాబు అలవాటేనని ఆయన ప్రత్యర్థులు అంటున్నారు. పార్టీ కోసం రేవంత్ రెడ్డిని బలిపశువు చేశారని చేశారని చెప్పుకుంటున్నారు.
మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నది జగమెరిగిన సత్యం. ఎమ్మెల్యేలను మేనేజ్ చేసే ఆయన మొదట సీఎం అయ్యారని, అయితే ఈసారి వ్యూహం బెడిసి కొట్టిందని ప్రత్యర్థులు అంటున్నారు. అవినీతిని అంతం చేస్తానంటూ లెక్చర్లు దంచే చంద్రబాబు నిజస్వరూపం సాక్ష్యాలతో బట్టబయలు కావడంతో సైకిల్ పార్టీ సారథి సైలెంట్ అయిపోయారు.
మహానాడులో అవినీతిపై చంద్రబాబు మాట్లాడి రెండు రోజులు గడవకే ముందే తెలుగు తమ్ముళ్లు ముడుపుల వ్యవహారంలో బుక్కైయ్యారు. ఈ కేసులో చంద్రబాబు పేరు చేర్చాలని టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో పెదవి విప్పితే చిక్కుల్లో ఇరుక్కుంటామన్న ఉద్దేశంతోనే చంద్రబాబు సైలెంట్ అయిపోయారని ఆరోపిస్తున్నాయి.


