ఓటు నమోదుపై పవన్ కీలక నిర్ణయం
ప్రముఖ సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు నమోదుపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్: ప్రముఖ సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు నమోదుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తన ఓటును నమోదు చేసుకోవాలని పవన్ నిర్ణయించారు. సోమవారం ఏలూరుకు చెందిన జనసేన నేతలు హైదరాబాద్లో ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా పవన్ తన నిర్ణయాన్ని తెలిపారు. ఏలూరులో తనకు ఇల్లు చూడాలని పవన్ జనసేన నేతలను కోరారు. పవన్ సొంత జిల్లా పశ్చిమగోదావరి.
పవన్కు ప్రస్తుతం హైదరాబాద్లో ఓటు హక్కు ఉంది. ఇప్పటి వరకు హైదరాబాద్లోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా రాష్ట్ర విభజన జరగడం, మారిన రాజకీయ పరిస్థితుల కారణాల వల్ల పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


