'అర్హతల ఆధారంగా ఇచ్చేది కాదు'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి హెచ్చరించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి హెచ్చరించారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తాము అనేకసార్లు ప్రత్యేకహోదాపై కేంద్రంలోని పెద్దలను కలిశామని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
'మా అభిప్రాయాలకు వ్యతిరేకంగా, రాష్ట్రాన్ని విభజించినప్పుడు తమ హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. కేంద్రం దగ్గర చంద్రబాబు మోకరిల్లుతున్నారు. మీరు మసిపూసి మారేడుచేసి రాష్ట్రానికి వెన్నుపోటు పొడుద్దామనుకుంటున్నారు. అర్హతల ఆధారంగా ఇచ్చేది కాదు ఇది.. రాష్ట్రవిభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని పూడ్చేందుకు ఇవ్వాల్సిన ప్రత్యేక హక్కు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
తమ కేంద్ర మంత్రులను ఉపసంహరించుకుని కేంద్రాన్ని టీడీపీ హెచ్చరించాలి. అంతేతప్ప కేంద్రం కాళ్లమీద పడి రాష్ట్రహక్కులను కాలరాయొద్దు, తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని కించపరచొద్దు. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని వాళ్ల విధానం ప్రకటించారు. అయితే ఇది మన రాష్ట్రానికి వర్తించదు'


