రూ.7 లక్షల కోట్ల సంపద హాంఫట్
స్టాక్ మార్కెట్ చరిత్రలో మరోసారి భారీ పతనం నమోదైంది. సెన్సెక్స్ సోమవారం ఏకంగా 6 శాతం నష్టపోయింది.
ముంబై: స్టాక్ మార్కెట్ చరిత్రలో మరోసారి భారీ పతనం నమోదైంది. సెన్సెక్స్ సోమవారం ఏకంగా 6 శాతం నష్టపోయింది. నిఫ్టీ కూడా నష్టాల సునామీలో కొట్టుమిట్లాడింది. ఫలితంగా దాదాపు 7 లక్షల కోట్ల రూపాయిల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది.
వరుసగా పతనమవుతూ వస్తున్న రూపాయి మరింత చతికిలపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని భరోసా ఇచ్చారు.
సెన్సెక్స్ 1624 పాయింట్లు పతనమై 25741 వద్ద ఆగింది. నిఫ్టీ 490 పాయింట్లు పడిపోయి 7809 వద్ద ముగిసింది. అన్ని ప్రధాన షేర్లు పడిపోయాయి. ఇంధన, బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ వాటాలు భారీగా నష్టపోయాయి.
చైనా, యూరోపియన్ మార్కెట్లు కుప్పకూలడంతో మన మార్కెట్లు కూడా అదే బాటలోనే పయనించాయి. దీంతో స్టాక్ మార్కెట్ చరిత్రలో మూడో అతిపెద్ద పతనం నమోదైంది. 2008, జనవరి 21న తర్వాత సెన్సెక్స్ భారీగా పతనమవడం ఇదే తొలిసారి.


