జీఎస్టీ రష్‌: కస్టమర్లతో కళకళ | GST rush! Goods fly off the shelves as consumers chase discounts | Sakshi
Sakshi News home page

జీఎస్టీ రష్‌: కస్టమర్లతో కళకళ

Jul 1 2017 8:44 AM | Updated on Aug 14 2018 4:01 PM

పండుగ వేళ షాపులన్నీ కస్టమర్లతో కళకళలాడటం చూస్తుంటాం.. అదే పండుగ రష్‌ దుకాణాలకు జీఎస్టీ వేళా విశేషం తీసుకొచ్చింది.



న్యూఢిల్లీ :
పండుగ వేళ షాపులన్నీ కస్టమర్లతో కళకళలాడటం చూస్తుంటాం.. అదే పండుగ రష్‌ దుకాణాలకు జీఎస్టీ వేళా విశేషం తీసుకొచ్చింది. నేటి(జూలై1) నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గురువారం, శుక్రవారం కంపెనీలు, దుకాణాలన్నీ చివరి క్షణం వరకు భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేశాయి. దీంతో కస్టమర్లకు రద్దీ ఒక్కసారిగా విపరీతంగా పెరిగింది. పెద్ద పెద్ద కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ రిటైలర్ల వద్దనైతే, పెద్ద పెద్ద క్యూలైన్లే దర్శనమిచ్చాయి. ఈ రెండు రోజుల్లో మాల్స్‌కు పెరిగిన రద్దీ 20 శాతానికి పైగా ఉందని, అంతేకాక వారి బిల్లింగ్‌ సైకిల్‌ కూడా సగటున 30 శాతం వృద్ధిని నమోదుచేసినట్టు మాల్స్‌ రిపోర్టు చేశాయి. అంతేకాక కొన్ని షోరూంలు గతేడాది కంటే 100-200శాతం కంటే అధికంగా విక్రయాలు జరిపినట్టు ప్రకటించాయి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు, ఏసీలు కొనుగోలు చేయడానికే వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపినట్టు తెలిపాయి. 
 
గురువారం, శుక్రవారం డిమాండ్‌ భారీ ఎత్తున్న పెరిగిందని, తమ క్యాష్‌ కౌంటర్‌లో వద్ద క్యూలైన్లు కూడా కిక్కిరిసి పోయినట్టు రిలయన్స్‌ డిజిటల్‌ సీఈవో బ్రియన్ బాడే చెప్పారు. దివాళి లేదా ధన్‌తేరాస్‌ రోజు చూసే కన్జ్యూమర్‌ డ్యూరెబుల్‌ విక్రయాల రద్దీని ఇప్పుడే తాము కళ్లారా చూశామని ఆనందం వ్యక్తంచేశారు. ధన్‌తేరాస్‌ రోజు కంటే ఎక్కువగానే గురువారం, శుక్రవారం రోజుల్లో విక్రయాలు నమోదైనట్టు కూడా కొంతమంది డ్యూరెబుల్స్‌, లగ్జరీ రిటైలర్లు పేర్కొన్నారు.  జీఎస్టీ అమలుతో ముగిసిన సేల్‌ సీజన్‌లో ఫ్యాషన్‌, లైఫ్‌స్టయిల్‌ రిటైరల్లు అదనపు డీల్స్‌ కూడా ఆఫర్‌ చేశారు. శుక్రవారం అర్థరాత్రి అంటే జీఎస్టీ లాంచింగ్‌ వరకు డిస్కౌంట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. జీఎస్టీ రాకతో, ఇన్ని రోజులుగా కురిపించిన డిస్కౌంట్ల పర్వానికి కంపెనీలు ఇక స్వస్తి చెప్పాయి.
 
జీఎస్టీ రాకకంటే ముందస్తుగానే తమ వద్ద నున్న పాత స్టాక్‌ను విక్రయించుకోవడానికి కంపెనీలు ఈ డిస్కౌంట్లను ఆఫర్‌ చేశాయి. అప్పారెల్ రిటైలర్లు వ్యాపారాలు ఈ నెలలో 30 శాతానికి పైగా ఎగిసినట్టు పేర్కొన్నాయి. ముఖ్యంగా విక్రయాలు ఈ నెల చివరి 15రోజుల్లో అత్యధికమొత్తంలో జరిగాయని, ఓ వైపు ఈద్‌ ఫెస్టివల్‌, మరోవైపు జీఎస్టీ వీకెండ్‌ కావడంతో తమ విక్రయాలు జోరు కొనసాగినట్టు సిటీ వాక్‌ డైరెక్టర్‌ యోగేశ్వర్‌ శర్మ చెప్పారు. మామూలు రోజుల్లో కంటే ఈ శుక్రవారం 12 శాతానికి కంటే ఎక్కువగా కొనుగోలుదారులు విచ్చేసినట్టు పేర్కొన్నారు. ఇలా కొన్ని దుకాణాల్లో మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని దుకాణాల్లో, మాల్స్‌లో ఇదే రష్‌ కనిపించినట్టు తెలిసింది. 



Advertisement
 
Advertisement
Advertisement