సమస్యలపై ఎవరు పోరాడినా మద్దతు: వైఎస్ జగన్
చంద్రబాబు నాయుడు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఎవరూ పోరాటం చేసినా తాము ఆప్యాయంగా స్వాగతిస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఎవరూ పోరాటం చేసినా తాము ఆప్యాయంగా స్వాగతిస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణే కాదని, ఏ పార్టీకి అయినా తాము తోడుగా ఉంటామన్నారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్...చంద్రబాబు సిట్ అంటే సిట్...స్టాండ్ అంటే స్టాండ్ అంటున్నారని, ఆయన ఆ పరిస్థితి నుంచి మారాలని, సమస్యలపై పోరాటం చేయాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. కాగా ఏపీ బడ్జెట్పై వైఎస్ జగన్ ఇవాళ సాయంత్రం విజయవాడలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. ముగింపు సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ...తాను ప్రెస్ మీట్ పెట్టింది ఏపీ బడ్జెట్ మీద అని... పవన్ కల్యాణ్ గురించి మనకెందుకబ్బా అని అన్నారు.
కాగా వచ్చే మార్చినాటికి జనసేన పార్టీ పూర్తిస్థాయి రాజకీయపార్టీగా అవతరిస్తుందని, 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే.


