లోకేశ్‌కు అక్రమ సంతానం

విలేకరులతో మాట్లాడుతున్న కోలా కృష్ణమోహన్ - Sakshi


* 14 ఏళ్ల క్రితమే చంద్రబాబు ‘తాత’య్యారు  

* చీటింగ్ కేసు నిందితుడు కోలా కృష్ణమోహన్ ఆరోపణ

 

సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి కుమారుడు లోకేశ్‌కు పద్నాలుగేళ్ల క్రితమే కుమారుడు పుట్టాడని చంద్రబాబు ఒకప్పటి సన్నిహితుడు, యూరో లాటరీ వ్యవహారంలో నిందితుడు కోలా కృష్ణమోహన్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేశ్‌కు సంబంధించి పలు గుట్లు రట్టు చేశారు.



లోకేశ్ తన కుమారుడికి సంతోష్‌గా నామకరణం కూడా చేశారన్నారు. గతంలో లోకేష్ ఒక అమ్మాయితో వెళ్లిపోయారని, బెంగళూరులో కొంతకాలం సంసారం చేశారన్న విషయం తాను రెండేళ్ల కిందట చెప్పానని గుర్తుచేశారు. 1999లో వారిద్దరికి ఒక కుమారుడు పుట్టాడని, ఇప్పుడు ఆ బిడ్డకు 14 ఏళ్ల వయసుందని వెల్లడించారు. ఆ అమ్మాయి న్యాయం కోసం చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేసిందని, సీఎంగా ఉండి కూడాబాబు ఆ అమ్మాయికి న్యాయం చేయలేదన్నారు.



ఈ విషయాలను రెండేళ్ల కిందట చెప్పినప్పుడు ఈ మాటలను చంద్రబాబుగానీ టీడీపీ వారుగానీ ఖండించలేదని గుర్తుచేశారు. తాను మీడియా ముందు మాట్లాడిన రెండు నెలల తరువాత ఆ అమ్మాయి తన అడ్రసు కనుక్కుని తన వద్దకు వచ్చి జరిగిన అన్యాయాన్ని వివరించిందన్నారు. తాను రెండు రోజుల్లో ఆమెను మీడియా ముందుకు తెస్తానని, భద్రతా కారణాల రీత్యా ఆమె పేరును, ఇతర వివరాలను గోప్యంగా ఉంచుతున్నానన్నారు. తాను ఆ అమ్మాయిని, లోకేశ్ కుమారుడు సంతోష్‌ను మీడియా ముందుకు తెచ్చిన తరువాత డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని, దీంతో వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు.



తనకు అధికారమిస్తే మూడు నిమిషాల్లో వచ్చి ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తానని గొప్పలు చెబుతున్న చంద్రబాబు స్వయానా తన కోడలికే న్యాయం చేయలేకపోతున్నారని కోలా విమర్శించారు. ఆ అమ్మాయిని దూరం చేయడానికే లోకేశ్‌ను అప్పట్లో అమెరికాకు చదువుల కోసం పంపారన్నారు. ఇదేమీ రహస్యం కాదని లోకేశ్ వ్యవహారం అందరికీ తెలిసిందేనని, ఒక పోలీసు అధికారికి కూడా ఇందులో ప్రమేయం ఉందని ఆరోపించారు.



చంద్రబాబు విదేశీ ఖాతాలకు సాక్ష్యాలు బహిర్గతం

రెండేళ్ల క్రితం తాను చంద్రబాబుకు విదేశీ బ్యాంకుల్లో ఖాతాలున్నాయని, వాటిలో భారీగా నిధులున్నాయని చెబితే టీడీపీకి చెందిన వర్ల రామయ్య వంటి వారు అందులో నిజం లేదని తేలిగ్గా మాట్లాడారని చెప్పారు. అప్పట్లో తన వద్ద సాక్ష్యాధారాలు లేవు కనుక తిరిగి మాట్లాడలేదని కృష్ణమోహన్ అన్నారు. ఇపుడు విదేశీ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పత్రాలు దొరికాయి కనుక ధైర్యంగా వాటిని మీడియా ముందుంచుతున్నానని జిరాక్స్ ప్రతులను అందజేశారు.



సింగపూర్‌లోని డాయిష్ బ్యాంకులో రూ. 4.9 కోట్లు, క్రెడిట్ సూసి బ్యాంకులో రూ. 878 కోట్లు, నాట్‌వెస్ట్ బ్యాంకులో రూ. 1,284 కోట్లు చంద్రబాబు ఖాతాల్లో ఉన్నాయన్నారు. ఇవికాక ఆయన సింగపూర్‌లోని మారియట్ హోట ళ్ల షేర్లను అమ్మేసి 3,600 కోట్ల రూపాయలు పొందారన్నారు. చంద్రబాబుకు ఇన్ని ఆస్తులుంటే ఎన్నికల అఫిడవిట్‌లో తనకు రూ. 42 కోట్లు మాత్రమే ఉన్నట్లు బొంకారని విమర్శించారు. చంద్రబాబు విదేశీ ఖాతాలపై సీబీఐతో విచారణ జరిపించాలని తాను లేఖ రాయబోతున్నానని, అలాగే తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు ఆయనను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడుగా ప్రకటించాలని కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేస్తానన్నారు.



చంద్రబాబు 1999 ఎన్నికలకు ముందు తన వద్ద నాలుగు కోట్ల రూపాయలకు పైగా డబ్బు తీసుకుని మచిలీపట్నం లోక్‌సభ స్థానం కేటాయిస్తానని మోసం చేశారని, ఆ తరువాత తన డబ్బు కూడా తిరిగివ్వలేదని ఆరోపించారు. అంతటితో ఆగకుండా తనను ఇప్పటికి రెండుసార్లు కిడ్నాప్ చేయించారన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు మనుషులు విజయవాడలో తనను అపహరించారని వివరించారు.

 

ఎవరీ కృష్ణమోహన్?

యూరో లాటరీ వ్యవహారంలో పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కోలా కృష్ణమోహన్ చీటింగ్ కేసులో నిందితుడు. విజయవాడకు చెందిన ఆయన గతంలోనూ చంద్రబాబుపై పలు ఆరోపణలు చేశాడు. ఎంపీ సీటు కోసం బాబుకు భారీగా ఫండ్ ఇచ్చినట్లు మీడియా ముందు వెల్లడించి సంచలనం సృష్టించాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top