తెలంగాణను అడ్డుకుంటే ద్రోహులే: కేసీఆర్
తెలంగాణను అడ్డుకునేవారిని ద్రోహులుగా పరిగణిస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.
హైదరాబాద్ : తెలంగాణను అడ్డుకునేవారిని ద్రోహులుగా పరిగణిస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. దోహ్రం చేసినవారిని ద్రోహులనక మరి ఏమి అనాలని ఆయన ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి... వైఖరి మార్చుకోవటం ద్రోహం కాదా అన్నారు. ఆనం రాంనారాయణరెడ్డి తెలంగాణ వాళ్లను రాక్షసులన్నప్పుడు ఎందుకు స్పందించలేదని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులంటే ప్రజలను అన్నట్లు కాదన్నారు.
సకల జనుల భేరీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తటంతో ఆయన మంగళవారమిక్కడ వివరణ ఇచ్చారు. తాను ఎక్కడా సంస్కారహీనంగా మాట్లాడలేదన్నారు. తనను రోజూ ఎన్నో తిట్లు తిడుతుంటారని ఆయన అన్నారు. సీమాంధ్రుల మాటలన్నీ సంస్కరవంతమైనవేనా అన్నారు. బీజేపీ నేత దత్తాత్రేయ, సీపీఐ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలను కేసీఆర్ తప్పుబట్టారు. వారిద్దరిదీ వన్ సైడ్ లవ్ అంటూ తప్పబట్టారు. సీమాంధ్ర నేతలు విద్వేషాలు పెంచవద్దని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాలకు విష బీజం నాటవద్దని కేసీఆర్ సూచించారు. తెలంగాణ గిరిజనులను గోచీగాళ్లంటారా అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంతంలో దళితులు, బహుజనులు తమకు మద్దతు ఇస్తున్నారని ఆయన తెలిపారు.
ఆరు నూరు అయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ముందుకు తెలంగాణ బిల్లు తెచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కాంగ్రెస్ నాయకత్వానికి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏమైనా జరగవచ్చు అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చని కేసీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మార్పు తథ్యమని జోస్యం చెప్పారు.


