నేను ఈ తరం వాడిని : వైఎస్‌ జగన్‌ | I belong to this generation, says Ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

నేను ఈ తరం వాడిని : వైఎస్‌ జగన్‌

Oct 1 2013 2:45 AM | Updated on Jul 25 2018 4:07 PM

నేను ఈ తరం వాడిని : వైఎస్‌ జగన్‌ - Sakshi

నేను ఈ తరం వాడిని : వైఎస్‌ జగన్‌

‘నేను ఈ తరం వాడిని. నాకు శాంతి, అభివృద్ధి రెండూ కావాలి. మేము లౌకికవాదానికే కట్టుబడి ఉంటాం’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

* మేము లౌకికవాదానికే కట్టుబడి ఉంటాం: జగన్‌
* మాకు శాంతి కావాలి, అభివృద్ధి జరగాలి
* మోడీని సమర్థుడైన పాలకునిగా అభినందిస్తాను
* వేరే మతం వారైనంత మాత్రాన వారిలో అభద్రతా భావం సృష్టించడం తగదు
* మతం పూర్తిగా వ్యక్తిగతమైనది.. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయం చేయకూడదు

సాక్షి, హైదరాబాద్‌: ‘‘నేను ఈ తరం వాడిని. నాకు శాంతి, అభివృద్ధి రెండూ కావాలి. మేము లౌకికవాదానికే కట్టుబడి ఉంటాం’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. లౌకికవాదం నుంచి తాను తప్పుకోలేదని చెప్పారు. ‘నేను చంద్రబాబు మాదిరిగా కాదు, ఆయన ఎలాంటి యూటర్‌‌నలైనా తీసుకుంటారు. నరేంద్ర మోడీ విషయానికి వస్తే ఒక సమర్థుడైన పాలకుడిగా ఆయనను నేను అభినందిస్తాను. వాస్తవానికి ముస్లింలైనా, క్రైస్తవులైనా అందరమూ ఇక్కడే పుట్టాం. అందరƒ మూ ఇక్కడే జీవనం కొనసాగించాలి. ఇక్కడే మరణించాలి. నేను ఈ తరానికి చెందినవాడిని, వేరే తరానికి చెందిన వాడిని కాను. పాత తరానికి చెందినవాడిని ఎంతమాత్రం కాను. నాకు కావాల్సిందల్లా శాంతి, అభివృద్ధి. ఇక్కడే పుట్టిన వారంతా, బతకాల్సిన వారంతా, మరణించాల్సిన వారంతా వేరే మతంలో పుట్టినంత మాత్రాన వారిలో ఎందుకు అభద్రతా భావాన్ని సృష్టించాలి. మతం అనేది పూర్తిగా వ్యక్తిగతమైంది. మతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయం చేయకూడదు.

నరేంద్ర మోడీని నేనొక సమర్థుడైన పాలకుడిగా అభినందిస్తూనే ఆయనను నేను కోరేది ఏమిటంటే.. దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అన్ని పార్టీలనూ లౌకిక వేదిక మీదకు తీసుకురావడం ద్వారా రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించండి. అలా కాకుంటే వేరే మతానికి చెందినవారిలో అభద్రతా భావాన్ని సృష్టించిన వాళ్లమవుతాం. దాంతో దేశంలో అంతర్గత ఉగ్రవాదం ప్రబలుతుంది. బయట సరిహద్దుల్లో ఉన్న శత్రువులతో పోరాడే మాట అటుంచుదాం. దేశం లోపలే ఉగ్రవాదాన్ని సృష్టించినట్లు అవుతుంది. రాజకీయ వ్యవస్థలో మార్పు కోసమే అన్ని పార్టీలనూ లౌకిక వేదిక మీదకు తీసుకురావాలని కోరుతున్నాను. ఇది భారతదేశం. అందరినీ గౌరవించే భారతదేశంలో ఒక వ్యక్తిలా ఉండాలని కోరుతున్నాను’ అని అన్నారు. ఎన్నికల అనంతరం ఏ పార్టీతో జత కలుస్తారు అని ప్రశ్నించినప్పుడు.. ‘తొందరెందుకు, నేను లౌకికవాదినని చెప్పాను. లౌకికవాద కమ్యూనిస్టు పార్టీలున్నాయి. జేడీ(యూ) ఉంది. వాళ్లేం చేస్తారో, నేనూ అదే చేస్తాను. ముందుగానే ఎలా చెబుతాం? మా ముందు చాలా ప్రత్యామ్నాయ అవకాశాలు (ఆప్షన్లు) ఉంటాయి.’ అని జగన్‌ బదులిచ్చారు.

నాపై అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు
‘పత్రికా సోదరులకు, జాతీయ, రాష్ట్ర తెలుగు మీడియా విలేకరులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గత పదహారు నెలలుగా నేను జైల్లో ఉన్నా చెరగని ఆప్యాయతలతో నామీద అభిమానాన్ని చూపించిన రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క , ప్రతి చెల్లెమ్మ, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి సోదరుడు, ప్రతి స్నేహితుడికీ మీ అందరి ద్వారా ఇవాళ చేతులు జోడించి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అంటూ జగన్‌ విలేకరుల సమావేశాన్ని ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement