పాత కరెన్సీ రద్దు.. ఇవిగో కొత్త నోట్లు
రద్దుచేసిన పాత 500, 1000 రూపాయల కరెన్సీ స్థానంలో భారత ప్రభుత్వం కొత్త నోట్లను రూపొందించింది..
న్యూఢిల్లీ: దేశంలో విచ్చలవిడిగా సాగుతోన్న అవినీతిని రూపుమాపే క్రమంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రస్తుతం మనుగడలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఆ నోట్లు చెల్లవని, ఎవరిదగ్గరైనా రూ.500, రూ.1000 నోట్లు ఉంటే వారు డిసెంబర్ 31 లోగా ఆయా నగదును బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసుల్లో డిపాజిట్ చేయాలని ప్రధాని సూచించారు. ఈ ప్రక్రియ అమలులో భాగంగా బుధ, గురువారాల్లో ఏటీఎం సెంటర్లు పనిచేయవని పేర్కొన్నారు.
అయితే రద్దుచేసిన పాత 500, 1000 రూపాయల కరెన్సీ స్థానంలో భారత ప్రభుత్వం కొత్త నోట్లను రూపొందించింది. ఈ మేరకు ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలోనే కొత్త నోట్ల తాలూకు ఫొటోలను రిజర్వ్ బ్యాంక్ వర్గాలు విడుదల చేశాయి. ఎప్పటి నుంచో ఊరిస్తోన్న రూ.2000 నోటుకు కూడా ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఈ ఫొటోల్లో కనిపిస్తున్న నోట్లు నవంబర్ 10 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని ఆర్బీఐ ఉన్నతాధికారులు చెప్పారు.




