ఒలింపిక్స్లో గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తా
- చంద్రబాబు వింత వ్యాఖ్యలు.. గొల్లుమన్న నెటిజన్లు
విజయవాడ: ‘బీకాంలో ఫిజిక్స్ చదివా’నంటూ దేశవ్యాప్తంగా ఫేమస్(!) అయిపోయారు టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ఖాన్. మంత్రి పదవి చేపట్టిన తర్వాత చినబాబు లోకేశ్.. ‘ఫిజిక్స్’ను మించిన వ్యాఖ్యలెన్నో చేశారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ‘ఆవిధంగా’ ముందుకు వెళ్లారు..
అవకాశం చిక్కిన ప్రతిసారిలానే.. బుధవారం విజయవాడలో నిర్వహించిన బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ సన్మాన సభలోనూ చంద్రబాబు భారీ ప్రసంగం చేశారు. మాటల మధ్యలో ‘నోబెల్ ప్రైజ్’ గురించి బాబు చేసిన వ్యాఖ్యలపై సోషల్మీడియాలో విపరీతమైన జోక్స్ పేలుతున్నాయి.
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. ‘మన పిల్లలు ఒలింపిక్స్లో గెలవాలి. గెలిచేవరకు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. మొదటిస్థానంలో ఎవరు నిలుస్తారో వాళ్లకి నోబెల్ ప్రైజ్ ఇస్తా. ఇదే విజయవాడలో సన్మానం చేస్తా. అదే నా ఆశ, ఆశయం..’ అని అన్నారు.
గతంలోనూ ఓసారి నోబెల్ ఇస్తానన్న చంద్రబాబుపై ఏ రేంజ్లో సెటైర్లు పేలాయో తెలిసిందే. ఇప్పుడు ఆయనే మరో అడుగుముందుకేసి.. ఒలింపిక్స్లో గెలిచినవాళ్లకు నోబెల్ ఇస్తాననడం మరీ దారుణం. ఇదే విషయాన్ని నెటిజన్లు సైతం తప్పుపడుతున్నారు.
‘శాంతి, సాహిత్యం, సైన్స్ రంగాల నిపుణులకు మాత్రమే అందించే నోబెల్ పురస్కారాన్ని.. క్రీడాకారులకు సైతం ఇస్తానంటున్న బాబును ఏమనాలి?’ అని ప్రశ్నిస్తున్నారు. మరొకరైతే కాస్త ఘాటుగా.. ‘బాబుగారిని జలీల్ ఖాన్కు అన్నయ్య అందామంటే ఆల్రెడీ లోకేశ్ ఉన్నారు. కాబట్టి తాతని అనొచ్చేమో!’ అని కామెంట్ చేశారు.
బుధవారం సాయంత్రం చంద్రబాబు ‘నోబెల్’ వ్యాఖ్యలు చేయడానికి కొద్ది గంటల ముందే ఆయన తనయుడు లోకేశ్.. ‘టీడీపీ నుంచి ప్రధానిగా ఎన్నికైన గొప్ప నేత పీవీ నరసింహారావు..’ అంటూ మాజీ ప్రధానికి నివాళులు అర్పించడం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.