హోదా తెస్తే నిప్పు.. లేకుంటే తుప్పు | chandra babu is compromising on special status, says jogi ramesh | Sakshi
Sakshi News home page

హోదా తెస్తే నిప్పు.. లేకుంటే తుప్పు

Sep 7 2016 2:39 PM | Updated on Mar 23 2019 9:10 PM

హోదా తెస్తే నిప్పు.. లేకుంటే తుప్పు - Sakshi

హోదా తెస్తే నిప్పు.. లేకుంటే తుప్పు

చంద్రబాబు నిజంగా నిప్పే అయితే ప్రత్యేకహోదా సాధించాలని, అది చేయకపోతే ఆయన తుప్పే అవుతారని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు.

ఐదు కోట్ల మంది ఆంధ్రప్రజలంతా గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రత్యేక హోదా కోసం ఎదురుచూస్తుంటే.. కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాత్రం నియోజకవర్గాల పునర్విభజన అంటున్నారని.. మరోసారి ఆ మాట అంటే జనం చెంపమీద కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ తాను నిప్పు నిప్పు అంటుంటారని, నిజంగా ఆయన నిప్పే అయితే ప్రత్యేక హోదా సాధించాలని, అది చేయకపోతే ఆయన తుప్పే అవుతారని విమర్శించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు అమ్మేయడానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. గత వారం పది రోజులుగా దీనిపై రకరకాల నాటకాలు జరుగుతున్నాయని, ఈరోజు ఫైనల్ స్టేజికి వచ్చిందని అన్నారు. ఢిల్లీ పెద్దలంతా ముఖ్యమంత్రితో టెలిఫోన్ సంభాషణలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు మాత్రం తనకు ప్రత్యేకహోదా అవసరం లేదు, ప్యాకేజి అవసరం లేదు, రైల్వే జోన్ అవసరం లేదు.. తనకు కావల్సిందల్లా డీలిమిటేషన్ మాత్రమే అంటున్నారని, అది జరిగితేనే తాను ఒప్పుకొంటానని ఢిల్లీ పెద్దలతో చెబుతున్నారని.. ఇంతకంటే నీచ, నికృష్ట సీఎం ఎవరూ ఉండరని మండిపడ్డారు. 5 కోట్ల మంది ప్రజలు ప్రత్యేకహోదా ఎప్పుడు ప్రకటిస్తారని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని, లక్షలాది మంది పిల్లలు కూడా ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని.. ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు క్యూ కడతారని ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు.

ఒకరోజు ప్రత్యేక హోదానా.. ప్యాకేజినా అని, మర్నాడు ప్యాకేజి వైపు కేంద్రం మొగ్గు అంటారని, మళ్లీ వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్యాకేజి కోసం సంప్రదింపులు అంటున్నారని.. అంటే ప్యాకేజి ఇవ్వాలన్నా మిగిలిన సీఎంలను సంప్రదించాల్సిన దుస్థితిలో ఉన్నామా అని జోగి రమేష్ నిలదీశారు. వాళ్లకు తాన తందానా అంటూ సుజనా చౌదరి, పెద్దనాయకుడు వెంకయ్య నాయుడు తయారయ్యారని చెప్పారు. పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు ఐదేళ్లు కాదు.. పదేళ్లు హోదా ఇవ్వాలన్న వెంకయ్య నాయుడు ఇప్పుడు వంకయ్య నాయుడుగా మారిపోయాడని విమర్శించారు. 15 ఏళ్లు హోదా ఇవ్వాలని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం నీతి తప్పారని, మాట తప్పారని అన్నారు. ఆయన ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు రెడీ అయ్యారని చెప్పారు.


ఉదయం నుంచి అందరం గుండెలమీద చెయ్యి వేసుకుని ప్రత్యేకహోదా కోసం ఎదురుచూస్తుంటే.. నియోజకవర్గాల పెంపు కోసం రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడామని సుజనా చౌదరి చెబుతున్నారని, ప్రజలు ఆయనను చెంపమీద కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని జోగి రమేష్ తెలిపారు. ప్రత్యేకహోదా తెమ్మని మిమ్మల్ని కేంద్రమంత్రి చేస్తే.. మీరు అడిగేది ఏంటి.. డీలిమిటేషన్ చేస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా అని అడుగుతున్నామన్నారు. చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలని, విజయవాడలో కూర్చుని ప్రగల్భాలు పలకడం కాదుని చెప్పారు. డీలిమిటేషన్ మీకు, మీ పార్టీకి కావాలేమో.. 5 కోట్ల మంది ప్రజలకు అక్కర్లేదని, వాళ్లకు కావల్సింది ప్రత్యేక హోదా మాత్రమేనని స్పష్టం చేశారు. దాన్ని సాధించలేక దద్దమ్మల్లా విజయవాడలో కూర్చుని మాట్లాడతారేంటని ప్రశ్నించారు. పార్లమెంటుకు కూడా విలువ లేదా.. ప్రధాని ఇచ్చిన హామీకి విలువలేదా అంటూ నిలదీశారు. చేతకాకపోతే పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోవాలని, విశ్వసనీయత లేనప్పుడు మీరు ఇంకా పదవుల్లో కూర్చుంటే సిగ్గుచేటని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement