ప్రాణాలు కాపాడింది రోజానే

ప్రాణాలు కాపాడింది రోజానే - Sakshi


కారు ప్రమాదానికి గురై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తనను మానవత్వంతో కాపాడిన శాసనసభ్యురాలు, నటి రోజాకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు కలైంజియం. ఈయన నటి అంజలి వివాదంలో వార్తల్లోకెక్కిన దర్శకుడు. ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కలైంజయం ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. అయితే తాను ప్రాణాలతో ఉండటానికి నటి రోజానే కారణమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 

 దీని గురించి దర్శకుడు కలైంజయం తెలుపుతూ ఆంధ్ర రాష్ట్రం రాజమండ్రిలో జరిగిన మిత్రుడి పెళ్లికి హాజరై మరుసటిరోజు ఉదయం చెన్నైకి తిరిగొస్తుండగా కారు చక్రం టైర్ బద్దలై కారులో ఉన్న వారందరూ హైవే రోడ్డుపై పడిపోయామన్నారు. ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదని ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్‌పై పడి వున్నానని తెలిపారు. పోలీసులు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదం చేస్తున్నారు. ఆస్పత్రిలో వైద్యులు లేరని వెంటనే వారిని రప్పించి తమకు తగిన చికిత్స అందించాల్సిందిగా పోలీసు అధికారులు ఆస్పత్రి సిబ్బందిని అడుగుతున్నట్లు తెలిసిందన్నారు. తనకు తెలుగు భాష తెలియకపోవడంతో ఏమి చేయలేని అశక్తుడిగా ఉండిపోయానన్నారు. తీవ్రగాయాలతో ఒళ్లంతా రక్తసిక్తమయిందని తెలిపారు.

 

 తనకు స్పృహ వచ్చి పోతూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో వున్నానన్నారు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి నేరుగా తన బెడ్ వద్ద నిలబడి వున్న పోలీసు అధికారి వద్దకు వచ్చి తాను రోజా మేడమ్ వద్ద నుంచి వస్తున్నాను. మేడమ్ ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు మాట్లాడండి అని చెప్పారన్నారు. దీంతో కొన్ని నిమిషాల్లోనే పెద్ద ప్రైవేటు ఆస్పత్రికి మార్చినట్లు చెప్పారు. అక్కడ ఎలాంటి ఫీజు లేకుండా మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డానన్నారు. ఇందుకు కారణమైన రోజాకు ఆమె భర్త ఆర్‌కె సెల్వమణికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని దర్శకుడు కలైంజయం పేర్కొన్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top