పద్మరాజు కృషి మేలిమి బంగారం

పద్మరాజు కృషి మేలిమి బంగారం - Sakshi


పాలగుమ్మి పద్మరాజు శతజయంతి (జూన్ 24, 1915) ముగింపు సందర్భంగా...

(దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి గొంతు పోయే రోజుల్లో నేను హైదరాబాదు ఆలిండియా రేడియోలో చేరాను. అది 1963. శాస్త్రిగారు చెప్పాలనుకున్న మాటలు చిన్న చిన్న పుస్తకాల మీద రాసేవారు. దైనందిన అవసరాల మాట అటుండగా, కొన్ని విషయాలు గ్రంథస్తం చేయవలసినంత గొప్పవి. నేనంటూ ఉండేవాడిని: ‘ఈ పుస్తకాలను నాకు ఆస్తిగా రాసిచ్చేయండి’ అని. శాస్త్రిగారు నవ్వేవారు. సాహితీ ప్రపంచంలో వచనాన్ని గొప్పగా రాసే రచయితల్లో శాస్త్రిగారొకరని నా ఉద్దేశం. నా దృష్టిలో వీరుకాక వేలూరి శివరామశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీశ్రీ పేర్లు చెప్తాను. ఏమైనా ఆ పుస్తకాలన్నింటినీ వారబ్బాయి బుజ్జాయి భద్రపరిచారు. అంతేకాదు, చాలారోజులు శ్రమపడి బాలాంత్రపు నళినీకాంతరావుగారూ ఆయనా కూర్చుని కొన్నింటిని ఏరి చక్కని పుస్తకంగా రూపుదిద్దారు. అయితే ఆ పని సగంలోనే ఆగిపోయింది - నశినీకాంతరావుగారి ఆరోగ్యం బాగులేక, తర్వాత నళినీకాంతరావుగారు వెళ్లిపోయారు. నేనూ బుజ్జాయిగారూ కలిసి ఆ పనిని పూర్తిచేద్దామనుకున్నాం. ‘మూగనయాక’ అని పుస్తకానికి పేరు వారే స్థిరపరిచారు. ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి ప్రచురణ కర్త కూడా ముందుకు వచ్చారు.

 

 నళినీకాంతరావుగారు పరిష్కరించిన రెండు వ్రాతప్రతులను నేను ఇంటికి తెచ్చుకున్నాను. చేతికి అందేటట్టు నా మంచం దగ్గర పెట్టుకున్నాను. అయితే నేను ఊళ్లో లేనప్పుడు మా యింటిని పునర్నిర్మించే ప్రయత్నంలో ఆ పుస్తకాల విలువ తెలియనివారెవరో కదిపేశారు. ఇక వాటి జాడ ఎంత వెదికినా దొరకలేదు. నిస్సహాయంగా, సిగ్గుపడి కొన్నాళ్లు బుజ్జాయిగారి పలకరింతను తప్పించుకు తిరిగాను. నా జీవితంలో నిస్సహాయంగా దూరమైన వ్రాత ప్రతి ఇదొక్కటే. తెలుగు సాహిత్యానికి తీరని నష్టం కలిగించిన సందర్భమూ ఇదే. ఇందుకు బుజ్జాయిగారికి బేషరతుగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. శాస్త్రిగారు ఆ రోజుల్లో ఏం మాట్లాడదలిచినా, నేను సభలో ఉంటే నా చేతనే చదివించేవారు. ఈ రెండు ప్రసంగ పాఠాలూ నళినీకాంతరావుగారు ‘మూగనయాక’ పుస్తకంలో చేర్చినవి. పాలగుమ్మి పద్మరాజుగారి శతజయంతి సందర్భంగా ఆయన ముఖ్య అభిమాని అయిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ఈ ప్రసంగాల కంటే గొప్ప నివాళి మరొకటి ఉండదు.

 - గొల్లపూడి మారుతిరావు)

 

కథకుడు, నవలా రచయిత, నాటక కర్త, కవి, విమర్శకుడు అయిన పద్మరాజు గొప్పతనాన్ని గూర్చి లోతులకు వెళ్లి పరిశీలించి అందంగా, వివరాలతో చెప్పగల శక్తి నాకు లేదు - ముసిలి రోగినైన నాకు ఓపికా లేదు.

 ఏ సాహిత్య రూపం తీసుకున్నా అది పద్మరాజు చేతిలో మేలిమి బంగారం అయిపోయి, మొదటి శ్రేణిలో కూర్చుంటుంది.

 ‘‘ఇంతవరకూ ఆయనకంటే ముందంజ వేసిన ప్రధాన కథకుడు లేకపోవడమే కాకుండా, రాను రాను ఆయన బెంగాలీ శరశ్చంద్రుడిలాగ, అన్నీ మొదట ఇతని జీవితంలోనే భాగాలైనట్లుంటాయి. అందుకే ఇతను నిర్మించిన ప్రతి మూర్తీ చక్కగా చెక్కిన వట్టి బొమ్మ కాదు - అనుభావాలతో చలించిపోయే ప్రాణి. సైన్స్, ఆర్ట్ ఇతనిలో సరి అయిన పాళ్లలో సమ్మేళనమొందాయి.

 ఇలాగ ఎన్ని కథలు, నవలలు - ‘కూలిజనం’, ‘చచ్చి సాధించాడు’ అనే డిటెక్టివ్ నవల, ‘బ్రతికిన కాలేజి’, ‘రెండవ అశోకుడి మూణ్ణాళ్ల పాలన’, ‘రామ రాజ్యానికి రహదారి’, ‘నల్లరేగడి’ సరేసరి - ఇలాగ ఎన్నో నవలలేనా, నాటకాలూ, నాటికలూ!

 రేడియోలో ముందు అనౌన్స్‌మెంట్ వినకుండా, నాటక ప్రసారం వినడం మొదలుపెట్టగానే, ‘ఇది పద్మరాజుది’ అని చెప్పేసుకుంటాను.

 ఇక కవిత్వం -

 భారత సాహిత్య అకాడమీ ప్రచురించిన కావ్య సంకలనం మీలో ఎవరైనా చదివారా? దానిలో పద్మరాజు కవిత! దాని సంపాదకుడైన రసజ్ఞుడూ, గొప్ప కవీ అయిన కాటూరి అన్నాడు నాతో - ‘‘బావా! ఈ పద్మరాజు గొప్ప కవి అవుతాడు, కవిత్వం వదలకపోతే’’ అని - అలాగే పద్మరాజు ‘పురిటిపాట’ అనే కవిత చదువుతూంటే -

 ‘‘కడవలా ఆమె కడుపిం తుందేమీ

 అని అనుకోనివాడు లేడు.

 లోపలి బెదురు దాచుకున్నారు.

 ఆ రాత్రొక వల్లకాడు’’

 అనే చోట గుండె హడలిపోయి అలాగే ఆ కవితామార్గాన్నే పోతూ - హడలుతూ, మూలుగుతూ, ఆక్రోశిస్తూ -

 గుండెకు హత్తుకుని ఆమె మట్టుకు అంది

 ‘మనబ్బాయి’ అని -

 అన్నాక తేరుకుంటాము.

 చీకటిమీద కవితో!

 ‘చీకటి ఒక మహోద్యమం’ అని మొదలుపెట్టి, ‘అది స్వేచ్ఛగా అణువణువుగా విడి వ్యాపించింది నక్షత్రాలయి’

 అంటూ చిక్కని కవిత్వంలో నడుచుకుపోతాం. ఇది అంతా కవిత్వపు ముద్ద. ఎన్ని సుప్త ఛందాలు, వ్రాయని పద్యాలుగా ఉన్నాయో పద్మరాజులో అని అనుకున్నాను.

 మావంటి ఇష్టులమీద దయకొద్దీ ఇతను కవిత్వం, గేయం జోలికి అట్టే పోలేదుగాని, అలాగ చేస్తే మా నోట్లో మన్నే - ‘శ్రీ రాజరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్బు’లో ఇతని పాట విన్నారు గదా!

 తెనుగు నాట నేనెరిగున్న మేధావులూ, ప్రతిభావంతులూ అయిన అయిదారుగురిలో పద్మరాజు ఒకడు. ఇతని వద్దనే, ఇతని ప్రక్కనున్నప్పుడే, నేను చిన్నవాడనుగా నాకు నేనే కనిపిస్తాను.

 (1978 కాకినాడలో జరిగిన పద్మరాజు షష్టిపూర్తి ఉత్సవ సభలో చదవబడిన ప్రశంస నుంచి.

 ఆ సభ నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే ఆ సభలో నేను వక్తని. ఎం.వి.శాస్త్రిగారి ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళా మందిరంలో ఉదయాన జరిగింది. కృష్ణశాస్త్రిగారు అనారోగ్యం కారణంగా రాలేదు. ప్రసంగ పాఠాన్ని నేనే చదివాను.)

 

 ‘నల్లరేగడి’ నవల పద్మరాజు ‘నల్లరేగడి’ గొప్ప నవల.  ఈ లోకంలో పైకి వచ్చేవాళ్లు చాలామంది ఉంటారు అన్ని రంగాలలోనూ. అలాగ వచ్చి నిలబడిపోయేవారు బహుకొద్దిమంది. ముందుకు వచ్చేవారిలో ఎందరో కేవలమూ జబ్బ పుష్టివల్ల వచ్చేవాళ్లుంటారు - వెనుక నుంచి తోసి, గిల్లి, కొట్టి, అరిచి నానా హంగామా చేసి. మరికొందరు బాజా భజంత్రీలు, వంధిమాగధులూ, భుజకీర్తులూ, బిరుదుపాఠాలూ వగైరాలతో ‘యేమిట్రోయ్, వీరెవరోయ్’ అనేటట్టు యమ సందడి చేస్తూ వస్తారు. కొందరు కాళ్ల సందుల్లో దూరీ, పాకీ యిట్టే ముందు పంక్తిలోనికి వచ్చేస్తారు.  ఈ మూడు రకాలూ అంతగా నిలబడిపోరు - ఏ కార్య రంగంలోనైనా, సాహితీ రంగంలోనైనా. ఇక కొద్దిమంది, అడుగడుగూ ముందుకు వేస్తూ, క్రమంగా ముందు పంక్తిలో నిలబడి ఉంటారు.



ఈలోగా భుజబలం వాళ్లూ, ఉరిమే వాళ్లూ, బాజా భజంత్రీల వాళ్లూ వగైరా గాలిపోయిన రబ్బరు బొమ్మల్లాగున చప్పబడి పక్కకి ఒరిగిపోతారు. నిదానంగా వచ్చి స్థిరంగా ఉండిపోయేవారు శ్రీ పాలగుమ్మి పద్మరాజు - కేవలమూ అర్హత వల్ల, ప్రతిభ వల్ల సాహిత్య వీధిలో ముందుముందుకు ప్రయాణం చేస్తూ అగ్ర శ్రేణిలోనికి వచ్చి స్థిరపడ్డవారు...  ప్రప్రథమ శ్రేణి కథా రచయితలలో, నవలలు రాసేవారిలో బహు కొద్దిమందిలో పద్మరాజు ముఖ్యుడు అని నా అభిప్రాయం... పద్మరాజుకు భాషపై మంచి అధికారం ఉంది. నిర్దుష్టం, స్పష్టం అయినా గంభీరమూ, సులభ సుందరమూనూ, బాగా తెలుగు తెలిసున్నవాడిది ఆ భాష. పూర్వ కవులు మొదలుకొని కోట్లమంది మాట్లాడే జీవద్భాష దాకా జీర్ణించుకుంటే తయారైన భాష పద్మరాజుది. నిశితమైన శాస్త్ర దృష్టితో, విజ్ఞాన దృష్టితో సమగ్రమైన హృదయం జోడించి ఉంది ఇతనికి... పద్మరాజు నాకు ఒరిపిడి రాయి. అతని మెప్పు సాహిత్య మందిర ప్రవేశానికి ఉత్తరువు.

 (1973లో ఢిల్లీ ఆంధ్ర సంఘ సమావేశంలో చదివించిన పరిచయ ప్రసంగం నుంచి)

 - గొల్లపూడి మారుతిరావు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top