మనకూ స్పానిష్‌ హైస్పీడ్‌ రైలు | Sakshi
Sakshi News home page

మనకూ స్పానిష్‌ హైస్పీడ్‌ రైలు

Published Mon, Apr 18 2016 4:37 PM

మనకూ స్పానిష్‌ హైస్పీడ్‌ రైలు

ముంబై: గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అత్యాధునిక స్పానిష్‌ రైలు ఈ నెల 21 న ముంబై రేవుకు చేరుకుంటుంది. దీన్ని తయారుచేసిన టాల్గో కంపెనీ వారం క్రితమే స్పెయిన్‌లో నౌకలోకి దీన్ని ఎక్కించింది. ముంబై ఢిల్లీ నగరాల మధ్య నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ రైలు ప్రారంభమైతే రెండు నగరాల మధ్య ప్రస్తుత కాల వ్యవధి 12 గంటలకు తగ్గుతుంది. సాధారణ రైలుతో అయితే, ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం కనీసం 16గంటలవరకు పడుతుంది.

అంటే రాత్రి భోజనం చేసి రైలెక్కితే మరుసటి రోజు అల్పాహారానికి గమ్యస్థానం చేరుకుంటారు. టాల్గో కంపెనీ తన 9వ సిరీస్‌లో భాగంగా తయారు చేసిన ఈ స్పానిష్‌ రైలు మన రైళ్లకన్నా భిన్నంగా ఉంటుంది. రైలు జంట చక్రాలకు యాక్సిల్‌ ఉండదు. బోగీలు కూడా కప్లింగ్‌ పద్ధతిలో ఉండవు. రైలు కింది భాగానికి బోగీలకు మధ్యన గ్యాప్‌ ఉంటుంది. ఈ ఆధునిక పద్ధతి వల్ల రైలు మలుపుల వద్ద కూడా వేగంగా దూసుకుపోతుంది. బోగీలు, బాడీ అడుగు భాగానికి గ్యాప్‌ ఉండడంతో కుదుపులు ఉండకపోవడమే కాకుండా చక్రాల శబ్దం ప్రయాణికులకు వినిపించదు.

సీటు బెల్టు సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా ఏ రకమైన గేజ్‌ పట్టాలపై కూడా దీన్ని నడిపేందుకు వీలుగా గేజ్‌ మార్పిడి చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.ఈ రైలును ముందుగా ఢిల్లీ పల్వాల్‌ సెక్షన్‌లో ప్రయోగాత్మకంగా నడిపి చూస్తారు. అనంతరం నెలాఖరికి ఢిల్లీ ముంబై నగరాల మధ్య ప్రవేశపెడతారు. ఈ రైలుకు ధర లేదు. అంటే స్పెయిన్‌కు చెందిన టాల్గో కంపెనీ తన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు పరిచయంచేసి ప్రచారం చేసుకోవడానికి దీన్ని ఉచితంగా అందిస్తోంది.

Advertisement
Advertisement