ఇక వెంకయ్య వద్దంట

ఇక వెంకయ్య వద్దంట


బెంగుళూరు: వచ్చే జూన్ లో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడుని తిరిగి కర్నాటక నుంచి ఎంపిక చేస్తారని బీజేపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే కర్నాటక ప్రజలు మాత్రం మరోసారి తమ రాష్ట్రం నుంచి అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నారు. ఇక చాలు వెంకయ్య అంటూ ట్విట్టర్ లో ప్రజలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.



ప్రస్తుతం కర్నాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న వెంకయ్యనాయుడుకు వచ్చే జూన్ 30తో పదవీ కాలం పూర్తవుతుంది. ఇప్పటికే మూడు సార్లు (1998, 2004, 2010) రాజ్యసభకు అవకాశం దక్కించుకున్న వెంకయ్య నాయుడుకు నాలుగోసారి అదికూడా తిరిగి కర్నాటక నుంచే ఎంపిక చేస్తారని బీజేపీ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఆ ప్రచారం నేపథ్యంలో నెటిజన్లు ట్విట్టర్ లో స్పందిస్తూ వెంకయ్యను కర్నాటక నుంచి రాజ్యసభకు పంపించవద్దంటూ ట్వీట్లు చేస్తున్నారు.



బీజేపీ తరఫున ప్రస్తుతం కర్నాటక రాష్ట్రం నుంచి పదవీ కాలం పూర్తిచేస్తుకుంటున్న వారిలో వెంకయ్యనాయుడితో పాటు అయనూర్ మంజునాథ్ కూడా ఉన్నారు. ఇద్దరు సభ్యుల పదవీ విరమణ పొందుతుండగా కర్నాటక శాసనసభలో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరిగణలోకి తీసుకుంటే ఆ పార్టీ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలదు.



కర్నాటక శాసనసభలో 225 మంది శాసనసభ్యుల్లో కాంగ్రెస్ (123), బీజేపీ (44), జేడీ (ఎస్) 40, కేజేపీ (2), ఎస్కేపీ (1), స్వతంత్రులు (9), నామినేటెడ్ (1) ఉన్నారు. ప్రస్తుతం కర్నాటక నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వెంకయ్య నాయుడు తోపాటు ఆ పార్టీకే చెందిన మంజునాధ్, కాంగ్రెస్ కు చెందిన ఆస్కార్ ఫెర్నాండెస్, ఇటీవలే దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యా (గతంలో జేడీఎస్ మద్దతుతో ఇండిపెండెంట్ గా గెలిచారు) పదవీ విరమణ చేస్తున్నారు.


 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top