భవిష్యత్తు వైఎస్ జగన్‌దే

భవిష్యత్తు వైఎస్ జగన్‌దే - Sakshi


♦ ప్రజా పోరాటాలు చేస్తూ ఇప్పటికే మంచి నాయకుడిగా ఎదిగారు

♦ ఇంకా పెద్ద నాయకుడు కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నా

♦ ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు వెల్లడి

♦ దాసరితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్

 

 సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేస్తూ ఇప్పటికే మంచి నాయకుడిగా ఎదిగారు. భవిష్యత్తులో ఇంకా పెద్ద నాయకుడు కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. భవిష్యత్తు జగన్‌దే’’ అని ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు,  ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని దాసరి నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం దాసరి మీడియాతో మాట్లాడారు. ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటున్న జగన్‌కు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని చెప్పారు.



 జగన్ సాయంత్రం 5.20 గంటలకు దాసరి నివాసానికి వెళ్లి 6 గంటల వరకూ ఉన్నారు. దాసరి తన ఇంటి గేటు వద్దనే జగన్‌కు ఎదురేగి సాదరంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పారు. దాసరి కుమారుడు, సోదరుడు.. జగన్‌తో కలసి ఫొటోలు తీయించుకున్నారు. జగన్, దాసరి నారాయణరావు దాదాపు నలైభె  నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ వెంట వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి కూడా ఉన్నారు. భేటీ ముగిసిన తరువాత దాసరి నారాయణరావు బయటి వరకూ వచ్చి జగన్‌ను సాగనంపారు.






 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top