మీ పెద్దరికం పోగొట్టుకోకండి | Minister Harish Rao advise to Rahul Gandhi | Sakshi
Sakshi News home page

మీ పెద్దరికం పోగొట్టుకోకండి

May 30 2017 1:46 AM | Updated on Mar 18 2019 9:02 PM

మీ పెద్దరికం పోగొట్టుకోకండి - Sakshi

మీ పెద్దరికం పోగొట్టుకోకండి

రాహుల్‌ గాంధీ గారూ.. మీరు సంగారెడ్డికి వస్తే స్వాగతం, సంతోషమే కానీ స్థానిక కాంగ్రెస్‌ నాయకుల మాటలు పట్టుకుని మాట్లాడితే అభాసుపాలవుతారు.

స్థానిక నేతల మాటలు పట్టుకుంటే అభాసుపాలవుతారు
► రాహుల్‌గాంధీకి మంత్రి హరీశ్‌రావు సూచన
► ఇక్కడ జరిగే మంచిని చూసి ఇతర రాష్ట్రాల్లో చెప్పండి


సాక్షి, సంగారెడ్డి: ‘రాహుల్‌ గాంధీ గారూ.. మీరు సంగారెడ్డికి వస్తే స్వాగతం, సంతోషమే కానీ స్థానిక కాంగ్రెస్‌ నాయకుల మాటలు పట్టుకుని మాట్లాడితే అభాసుపాలవుతారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచిని మంచి అన కుండా మసిపూసి మారేడు కాయ చేస్తే మీ పెద్దరికం పోతుంది’ అంటూ ఏఐసీసీ ఉపాధ్య క్షుడు రాహుల్‌ గాంధీకి మంత్రి హరీశ్‌రావు సూచించారు. సంగారెడ్డిలో సోమవారం జరి గిన గొల్ల కుర్మల కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు.

మూడేళ్ల పాలనలో దేశంలోనే  తెలంగాణ అనేక రంగాల్లో నంబర్‌ వన్‌ స్థానం లో ఉందని.. ఇక్కడ జరిగే మంచిని నేర్చుకుని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో చెప్తే అక్కడా మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. రైతులతో రాహుల్‌ గాంధీ ముఖాముఖీ జరుపుతారనే వార్తలపై స్పందిస్తూ.. సింగూరు ప్రాజెక్టు కింద తొలిసారిగా సాగునీరు పొందిన రైతు లతో మాట్లాడితే బాగుంటుందన్నారు. గతం లో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి కి.. కాంగ్రెస్‌ పార్టీపై నమ్మకం లేక వేరే పార్టీ నుంచి మెదక్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వారికి.. సంగారెడ్డి సభ బాధ్యతలు ఎలా అప్ప గిస్తారని హరీశ్‌రావు ప్రశ్నించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గొర్రెలు, మేకల పంపిణీకి పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల ఎకరాల అటవీ భూముల్లో గడ్డి పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

గొల్ల, కుర్మల కులదైవం కేసీఆర్‌: తలసాని
గొల్ల, కుర్మల కులదైవాలు మల్లన్న, బీరప్పల స్వరూపమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఎన్‌సీడీసీ పథకం ద్వారా గొర్రెల పంపిణీకి గతంలో కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా.. అప్పటి ప్రభుత్వాలు కౌంటర్‌ గ్యారంటీ ఇవ్వలేదన్నారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక ఎన్‌సీడీసీ నిధులకు గ్యారంటీ ఇవ్వడంతో పాటు.. ఏకంగా 84 లక్షల జీవాల పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు.

టీఆర్‌ఎస్‌ సర్వేపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై తలసాని స్పందిస్తూ.. ‘మీరో నలుగురు.. మేమో నలుగురం రాజీనామా చేద్దాం.. ఎవరు ఓడితే వాళ్లు రాజకీయాల నుంచి తప్పుకోవా లని’సవాల్‌ విసిరారు.సంగారెడ్డిలో రాహుల్‌ పర్యటన ద్వారా సాధించేదేమిటో కాంగ్రెస్‌ నేతలు చెప్పాలని డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, రాములు నాయక్, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్య నారాయణ, జెడ్పీ చైర్‌పర్సన్‌ రాజమణి మురళీ యాదవ్, గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధి సమాఖ్య చైర్మన్‌ రాజయ్య యాదవ్‌ తదతరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement