కాల్‌మనీ కేసు: 4 జిల్లాల్లో సోదాలు | police attacks over call money case | Sakshi
Sakshi News home page

కాల్‌మనీ కేసు: 4 జిల్లాల్లో సోదాలు

Dec 15 2015 10:42 AM | Updated on Aug 24 2018 2:36 PM

సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం తనిఖీలు చేపట్టారు.

హైదరాబాద్: సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం తనిఖీలు చేపట్టారు. అనుమానం ఉన్న వడ్డీ వ్యాపార సంస్థలు, పలు ఇళ్లపై దాడులు చేస్తున్నారు. గుంటూరు, కృష్ణా, వైఎస్ఆర్ కడప, తూర్పు గోదావరి జిల్లాల్లో దాడులు కొనసాగుతున్నాయి.

వైఎస్సార్ కడప: జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. కడప నగరంలో డీఎస్‌పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహించి కడపలో 10 మంది, ప్రొద్దుటూరు లో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి నుంచి భారీ ఎత్తున ప్రాంసరీ నోట్లు, భూముల తనఖా పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే ఈ తనిఖీలు పోలీసులు అధికారంగా వెల్లడించడం లేదు.

తూర్పుగోదావరి: జిల్లాలోని రాజమండ్రిలో కూడా కాల్ మనీ కేసుకు సంబంధించి సోదాలు జరుపుతున్నారు. ముఖ్యంగా వాహన ఫైనాన్స్ కంపెనీలపై పోలీసులు దృష్టిసారించారు. అనపర్తిలోని శివ దుర్గ అనే వాహన ఫైనాన్స్ కంపెనీలో తనిఖీలు చేపడతున్నారు.

విజయవాడ: విజయవాడలోని పలువరి వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్నారు. ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు 18 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రాంసరీ నోట్లు, అగ్రిమెంట్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇబ్రహిపట్నం మండలం కాసవరం గ్రామానికి చెందిన కందుల భాస్కరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా అతని వద్ద నుంచి పలు ప్రాంసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement