అన్నాచెల్లెళ్ల ప్రేమ పెళ్లి
వారిద్దరూ అన్నాచెల్లెళ్లు. మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. సీక్రెట్గా పెళ్లి కూడా చేసుకున్నట్లు యువతి చెబుతోంది.
► వరుసకు పెదనాన్న చిన్నాన్న పిల్లలు
► కుటుంబసభ్యుల అభ్యంతరం
► ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతి
విజయనగరం క్రైం: వారిద్దరూ అన్నాచెల్లెళ్లు. మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. సీక్రెట్గా పెళ్లి కూడా చేసుకున్నట్లు యువతి చెబుతోంది. అన్నయ్యతో పంపించాలని చెప్పి మంగళవారం మధ్యాహ్నం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలానికి చెందిన యువతి(20) అదే గ్రామానికి చెందిన పెద్దనాన్న కుమారుడితో ప్రేమలో పడింది. యువకుడి తల్లిదండ్రులు విజయనగరంలో నివాసం ఉంటున్నారు. యువతి అప్పుడప్పుడు పెద్దనాన్న ఇంటికి వచ్చేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
ఆ యువకుడితోనే పెళ్లి చేయాలని యువతి కొద్దిరోజుల క్రితం పురుగు మందు తాగేయడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసు సిబ్బంది ఇద్దరికి కౌన్సెలింగ్ చేశారు. తమను విడదీయడానికి ఇరుకుటుంబాలు ప్రయత్నిస్తున్నాయని తెలియడంతో ఆ యువతి మంగళవారం మధ్యాహ్నం నీటిలో నిద్రమాత్రలు కలిపి తాగడంతో ఆపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే స్థానికులు జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ ఇరుకుటుంబాలు గొడవపడ్డాయి. యువతికి తల్లిదండ్రులు ఎంత నచ్చచెప్పినప్పటికీ యువకుడితోనే పంపించాలని మొండికేస్తోంది.
పంపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో ఆస్పత్రి వైద్యుడు అధికారులతో ఫోన్లో సంప్రదించి యువతి తల్లిదండ్రులు, మహిళా కానిస్టేబుల్ను సెక్యూరిటీగా నియమిస్తే వైద్యం అందిస్తానని చెప్పడంతో వారు సమ్మతించారు. అవుట్ పోస్టు పోలీసులు యువతి నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. ఇదే విషయాన్ని వన్టౌన్ ఎస్సై వెంకటరమణ వద్ద ప్రస్తావించగా యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడడం వాస్తవమేనని తెలిపారు. వరుసకు అన్నాచెల్లెళ్లు కావడంతో కేసు నమోదు చేయలేదని కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.


