టీడీపీ అడ్డుకుంటోంది
రాష్ట్రంలో కేంద్రం క్రెడిట్ కొట్టేస్తున్నారు
కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ఆరోపణలు
భీమవరం : రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నా అదంతా తమ ఘనతగానే తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటుందని బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి యు.వి.కృష్ణంరాజు ఆరోపించారు. ఈ అంశాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. గురువారం భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కృష్ణంరాజు మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీని స్వతంత్రంగా ఎదగ నీయకుండా టీడీపీ అడ్డుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ బలాన్ని చాటేందుకు రాజమండ్రి సభను వేదికగా చేసుకోనున్నట్లు
ఆయన స్పష్టం చేశారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశంలో అనేక రంగాల్లో వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని వాజ్పేయ్ కలలను సాకారం చేసేందుకు ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయని కృష్ణంరాజు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మార్చి 6వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో రాజమండ్రిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
బీజేపీ కార్యకర్తలును వేధిస్తున్నారు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా బీజేపీ కార్యకర్తలకు దక్కకుండా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో గోకరాజు రామరాజు, పాకా సత్యనారాయణ, సాయి దుర్గరాజు పాల్గొనున్నారు.
సంబంధిత వార్తలు