నేనేమీ నీలాగా అవినీతిపరుడుని కాను
ముఖ్యమంత్రి చంద్రబాబు కు మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరోసారి లేఖాస్త్రం సంధించారు.
- పదవి కోసం నువ్వు ఎంతకైనా దిగజారుతావు
- ముఖ్యమంత్రికి ముద్రగడ ఘాటు లేఖ
జగ్గంపేట/కిర్లంపూడి:(జగ్గంపేట): ముఖ్యమంత్రి చంద్రబాబు కు మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరోసారి లేఖాస్త్రం సంధించారు. తనకు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు పుస్తకం రాయించినట్టు విన్న ఆయన తీవ్రంగా స్పందించారు. ‘నేనేమీ నీ లాగా అవినీతిపరుడిని కాను. మీలాగా నేర చరిత్ర కూడా నాకు లేదు. కుర్చీ కోసం పిల్లనిచ్చిన మామనే చెప్పులతో కొట్టించే నీచ బుద్ధి కూడా నాకు లేదు. పదవి కోసం ఎంత కిందకైనా దిగజారే వ్యక్తివి నువ్వు. అందుకే నాపై తప్పుడు రాతలు రాయిస్తున్నావ్..’’ అంటూ సీఎం చంద్రబాబుపై ముద్రగడ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి రాసిన లేఖను సోమవారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ముద్రగడ మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు ఎన్ని రకాలుగా కవ్వించినా ఉద్యమం నుంచి వెనక్కితగ్గేది లేదని ఆయన స్పష్టంచేశారు.
ఉద్యమం నుంచి వెనక్కి తగ్గేది లేదు : ‘తమరి ఆదేశాలతో మీ పెంపుడు పత్రిక అధినేత మరో పెంపుడు వ్యక్తితో పుస్తకం రాయించిన సంగతి విన్నాను. కేవలం మీ పదవి కోసం మా కాపు జాతికిచ్చిన బీసీ రిజర్వేషన్ హామీని అమలుచేయాలంటూ నేను రోడ్డెక్కి అడగటం తప్పా?.. అలా అడిగినందుకు నా కుటుంబ సభ్యులపై పోలీసులతో దాడి చేయించి అవమానిస్తారా? నేనేదైనా నిరసన కార్యక్రమం చేపడుతుంటే సెక్షన్ 30, 144 అమల్లో ఉందని పోలీసులతో చెప్పిస్తున్నారు. నాపై ఎన్ని పుస్తకాలు రాయించినా, పోలీసులతో కొట్టించినా ఉద్యమం నుంచి వెనక్కి తిరగడం నా తుది శ్వాస ఉండగా జరగదు. ’ అని తన లేఖలో పేర్కొన్నారు.





