అన్ని విషయాలపై రేపు మాట్లాడతా: చంద్రబాబు
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఆడియో టేపుల విడుదల తదితర అంశాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఏపీ సీఎం చంద్రబాబు సమాధానం దాటవేశారు.
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఆడియో టేపుల విడుదల తదితర అంశాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఏపీ సీఎం చంద్రబాబు సమాధానం దాటవేశారు. అన్ని విషయాలపై రేపు (బుధవారం) సవివరంగా మాట్లాడతానని చెప్పారు. రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం ఢిల్లీకి వచ్చిన ఆయన ఓ హోటల్ లో చైనా కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులకు చైనా కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు. రేపు ఉదయం పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నట్లు .. సాయంత్రం 4:10 గంటలకు ప్రధాని మోదీతోనూ, రాత్రి 7:45 గంటలకు రాష్ట్రపతితోనూ బాబుకు అపాయింట్ మెంట్ ఖరారయినట్లు తెలిసింది.
కాగా, ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా ఏపీ భవన్ లోనే బసచేసే బాబు ఈసారి మాత్రం ఓ ప్రైవేటు హోటల్ లో దిగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.


