నా రాజకీయ జీవితాన్ని అంతం చేయడానికి కుట్ర
తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బతీసే లక్ష్యంతోనే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బతీసే లక్ష్యంతోనే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తన రాజకీయ జీవితాన్ని అంతం చేసేందుకు పన్నిన కుట్రలను, కుతంత్రాలను బయటపెడతానని ఆయన చెప్పారు. శనివారం రాత్రి చంద్రబాబు తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాబలంతోనే తాను ముఖ్యమంత్రిని అయ్యాయని, సీఎం కిరణ్కుమార్రెడ్డిలా ఎవరి దయాదాక్షిణ్యాలతోనో సీఎంను కాలేదన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వదిలిన బాణాలన్నారు. జగన్పై ఆయన అక్కసు వెళ్లగక్కారు. జగన్ జైలు నుంచి విడుదలైతే ప్రముఖ వ్యక్తిలా రాచమర్యాదలు చేశారని, జాతీయ, రాష్టస్థ్రాయి టీవీ చానళ్లు కూడా ఆయన ఇంటికి వెళ్లే సమయంలో ప్రత్యక్ష ప్రసారాలతో విపరీతమైన కవరేజీ ఇచ్చాయన్నారు. కాగా, చంద్రబాబు నిర్వహించిన విలేకరుల సమావేశానికి సాక్షి ప్రతినిధిని అనుమతించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్తనిస్తున్నాం. అనుమతించి ఉంటే ఈ ప్రశ్నలకు బదులు అడిగేవారం.
1.జగన్పై కక్ష తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సీబీఐ ద్వారా కేసులు పెట్టినంత కాలం సీబీఐని నిజాయితీ సంస్థగా చిత్రీకరించిన మీరు, మీ పార్టీ.. జగన్కు బెయిల్ రాగానే సీబీఐపై ఆరోపణలు చేయడంలోని ఆంతర్యమేంటీ? 2.తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చిన మీరే ఇప్పుడు టీడీపీని రాజకీయంగా దెబ్బకొట్టాలనే లక్ష్యంతోనే రాష్ర్ట విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని అనడమేంటి?
3.తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర చేసినప్పుడు కూడా విభజన అంశంపై మీరేం మాట్లాడలేదు. ఇంతకూ మీరు విభజనను సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? ఏదో ఒకటి చెప్పగలరా?


