దీపావళికి 180 కోట్ల శంకర్ ‘మనోహరుడు’

దీపావళికి 180 కోట్ల  శంకర్ ‘మనోహరుడు’


 దక్షిణ భారతీయ సినీ చరిత్రలో ఓ సంచలనానికి ఈ దీపావళి తెర తీయనుంది. తొలిసారిగా ఓ దక్షిణ భారతీయ భాషా సినిమా చైనాలో విడుదల కానుంది. సాంకేతికంగా, కథాపరంగా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే చిత్రాలను రూపొందించే దర్శకుడు శంకర్, విక్రమ్ హీరోగా రూపొందిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) ఈ దీపావళికి చైనాలో ఏకంగా 15 వేల థియేటర్లలో విడుదల కానుంది. సినిమాలపై, థియేటర్లపై ప్రభుత్వ నియంత్రణ ఉండే చైనాలో విడుదలవుతున్న తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రంగా ‘ఐ’ చరిత్రకెక్కనుంది. గతంలో విక్రమ్‌తో ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’), కమలహాసన్‌తో ‘దశావతారం’ చిత్రాలను నిర్మించిన ‘ఆస్కార్ ఫిలిమ్స్’ అధినేత వి. రవిచంద్రన్ ఈ విషయం ఆదివారం నాడు వెల్లడించారు. తెలుగు పత్రికా విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ చిత్రం గురించి తొలిసారిగా అనేక ఆసక్తికరమైన విషయాలను ఈ విధంగా వెల్లడించారు.

 

 12 గంటలు మేకప్... రిఫ్రిజిరేటర్‌లో విక్రమ్

 ఇప్పటికి రెండున్నరేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దాదాపు రూ. 180 కోట్లు ఖర్చయింది.  ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు సగానికి పైగా ఏ.ఆర్. రెహమాన్ (సంగీతం), పి.సి. శ్రీరామ్ (ఛాయాగ్రహణం), ఆంటోనీ (ఎడిటింగ్), పీటర్ హెయిన్స్ (ఫైట్స్) లాంటి ప్రతిభావంతులు ఈ ‘ఐ’ చిత్ర రూపకల్పనలో కీలక భూమికలు పోషిస్తున్నారు. మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి విభాగాలకు విదేశీ నిపుణులు సేవలందిస్తున్నారు. ‘‘ఈ సినిమా కోసం హీరో విక్రమ్ పడిన శ్రమ, చూపిన అంకితభావం మాటల్లో చెప్పలేనిది. ఒక స్పెషల్ గెటప్ కోసం ఆయనకు మేకప్ చేయడానికే దాదాపు 12 గంటలు పట్టేది. అయినా, ఆయన ఓపిగ్గా ఉండేవారు. మేకప్ వేసిన తరువాత పూర్తి ఏ.సి.లోనే ఆయన ఉండాల్సి వచ్చేది. అందు కోసం దాదాపు పది అడుగుల ఎత్తున్న ఒక రిఫ్రిజిరేటర్ లాంటిది నిర్మించాం. ఈ గెటప్ కోసం ప్రత్యేకంగా ఆయన 125 కిలోల స్థాయికి బరువు పెరిగారు. తెరపై ఆ దృశ్యాలను చూస్తున్నప్పుడు ప్రేక్షకులు థ్రిల్‌కు గురి అవుతారు’’ అని రవిచంద్రన్ తెలిపారు.

 

  మూడెకరాల సెట్... పాటకు 40 రోజులు...

 ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేక ట్రైలర్‌నూ, ఒక పాటనూ ఆయన విలేకరుల కోసం ప్రత్యేకంగా ముందుగా చూపించారు. హీరో నీళ్ళపై నడిచే ఆశ్చర్యకరమైన దృశ్యాలున్న ఈ సినిమా పాటలు, ఫైట్ల కోసం శంకర్ డబ్బునూ, కాలాన్నీ లెక్కచేయలేదట. ఒక విచిత్రమైన ఘట్టంలో, అపూర్వమైన గెటప్‌తో హీరో వచ్చే ఒక సిట్యుయేషనల్ సాంగ్ కోసం ఏకంగా మూడెకరాల్లో ఒక సెట్ వేసి, 40 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. అలాగే, చైనాలో తీసిన ఒక సైకిల్ ఫైట్‌కు కూడా దాదాపు 40 రోజులు కష్టపడ్డారు. ‘‘ఈ సినిమా మీద నాకున్న నమ్మకం అపారం. ప్రతి ఘట్టం తెరపై చూడగానే ‘అయ్’ అని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా ఉంటుంది. అందుకే సినిమాకు ‘ఐ’ అని పేరు పెట్టాం’’ అని ఆయన చెప్పారు. చైనా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కథానాయికగా అమీ జాక్సన్ నటిస్తున్నారు.

 

  భారతీయ ‘జేమ్స్ కామెరూన్’

 ‘‘దీన్ని కేవలం సాంఘిక చిత్రమనో, యాక్షన్ సినిమా అనో, ప్రేమ కథా చిత్రమనో, థ్రిల్లర్ అనో - ఒక గాటన కట్టి చెప్పలేం. రేపు ఈ చిత్రం చూసినప్పుడు నా మాటల్లో నిజం అందరికీ తెలుస్తుంది’’ అని రవిచంద్రన్ పేర్కొన్నారు. ‘‘దాదాపు 285 రోజుల పైగా షూటింగ్ జరుపుకొన్న ఈ సినిమా మునుపటి ‘అపరిచితుడు’ కన్నా వంద రెట్లు గొప్పగా ఉంటుంది. ఎన్నో విశేషాలతో, ప్రాణం పెట్టి తీసిన ఈ సాంకేతిక అద్భుతం చూశాక శంకర్‌ను ‘భారతీయ జేమ్స్ కామెరూన్ (ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు)’ అనాలని అనిపిస్తుంది. ఈ సినిమా ఇలా రావడం ఆ తిరుమల వెంకటేశ్వరుడి కృప. నన్నడిగితే ఈ భారీ చిత్రానికి నేను కాదు... ఆయనే నిర్మాత’’ అని వ్యాఖ్యానించారు.

 

  హైదరాబాద్‌కు జాకీ చాన్... చెన్నైకి ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్!

 ‘‘సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుతున్నారు. సినిమాలో మొత్తం అయిదు పాటలున్నాయి. సెప్టెంబర్ 15న ఆడియో విడుదల చేస్తున్నాం’’ అని రవిచంద్రన్ తెలిపారు. విశేషం ఏమిటంటే, ఈ చిత్రం తెలుగు ఆడియో రిలీజ్‌కు తన చిరకాల పరిచయస్థుడైన యాక్షన్ హీరో జాకీచాన్‌ను హైదరాబాద్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. చెన్నైలో జరిపే తమిళ ఆడియో రిలీజ్‌కు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్‌ను ఆహ్వానిస్తున్నారు. ‘‘చెన్నైలో భారీ వేదికపై ఆడియో రిలీజ్ జరపాలని ప్రయత్నిస్తున్నాం. అన్ని వివరాలూ మరో రెండు, మూడు రోజుల్లో ఖరారు కానున్నాయి’’ అని రవిచంద్రన్ ‘సాక్షి’కి చెప్పారు.

 

  భారీ ఎత్తున విడుదల

 తమిళంలో తయారైన ఈ టెక్నికల్ వండర్‌ను ఇంగ్లీష్, హిందీ, మలయాళాల్లో అను వదించి భారత్‌లో విడుదల చేస్తున్నారు. అలాగే, చైనీస్ డబ్బింగ్ వెర్షన్‌ను చైనా, తైవాన్‌లలోనూ ‘ఐ’ పేరుతోనే దీపావళికి అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఒక్క భారత్‌లోనే అన్ని భాషల్లో కలిపి 4 వేల పైచిలుకు హాళ్ళలో విడుదలకు సన్నాహాలు సాగుతున్నాయి. ‘‘తెలుగులో ‘మనోహరుడు’గా వస్తున్న ఈ చిత్ర డబ్బింగ్ దాదాపు పూర్తయింది. శ్రీరామకృష్ణ సంభాషణలు, రామజోగయ్యశాస్త్రి, తదితరులు పాటలు అందిస్తున్నారు’’ అని రవిచంద్రన్ చెప్పారు. మీడియా ముందుకెన్నడూ రాని రవిచంద్రన్ తొలిసారి ఈ చిత్రం గురించి పలు విషయాలు పంచుకోవడం గమనార్హం.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top