breaking news
Donald Trump
-
ట్రంప్ కొత్త రూల్స్.. భారత ఉద్యోగుల్లో వణుకు!
వాషింగ్టన్: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలు, ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్ కార్డ్లు, అంతర్జాతీయ విద్యార్థుల వీసా కాలపరిమితి, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్లలో కీలక మార్పులు తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నూతన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయ నిపుణులు, విద్యార్థులపై అత్యధిక ప్రభావం పడే అవకాశం ఉంది.హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, లేబర్, స్టేట్ డిపార్ట్మెంట్లు విడుదల చేసిన తాజా నిబంధనల ప్రకారం, థర్డ్-పార్టీ క్లయింట్ సైట్లలో పనిచేసే హెచ్-1బీ ఉద్యోగుల అర్హతలను మరింత కఠినతరం చేయనున్నారు. ఐటీ కన్సల్టింగ్ కంపెనీలు గట్టి నిబంధనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే, 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి, అందులో సగానికి పైగా హెచ్-1బీ లేదా ఎల్-1 వీసాదారులు ఉన్న పెద్ద కంపెనీలకు వీసా పొడిగింపుల (ఎక్స్టెన్షన్స్) సమయంలో అదనపు బయోమెట్రిక్ ఫీజులను విధించనున్నారు.మరోవైపు, గ్రీన్ కార్డ్ ప్రక్రియకు కీలకమైన 'పెర్మ్ (PERM) లేబర్ సర్టిఫికేషన్' విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. విద్యార్థుల విషయానికొస్తే, ఇప్పటివరకు ఉన్న 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' విధానాన్ని రద్దు చేసి, గరిష్టంగా నాలుగేళ్ల నిర్ణీత కాలపరిమితిని (ఫిక్స్డ్ టెన్యూర్) ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల చదువు పూర్తయిన తర్వాత ప్రతిసారీ వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా, హెచ్-4 వీసాదారుల వర్క్ పర్మిట్ (ఈఏడీ) ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ను నిలిపివేయనున్నారు. దీనివల్ల దాదాపు లక్ష మంది భారతీయులు ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. -
‘ఆంక్షలను తొలగించబోతున్నా.. మీకు సంతోషమేనా?’
అంకారా: రష్యా నుంచి క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసినందుకు గాను గతంలో తుర్కియేపై విధించిన ఆంక్షలను ఎత్తి వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో ఆ దేశం అమెరికా నుంచి ఎఫ్–35 ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు.అంకారాలో మంగళవారం తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్తో జరిగిన సమావేశంలో ట్రంప్.. ‘ఆంక్షలను తొలగించబోతున్నా, మీకు సంతోషమేనా?’అంటూ ప్రశ్నించారు. ఈ అంశంపై తమ అధికారులు తగు చర్యలను ప్రారంభించినట్లు చెప్పారు. అమెరికాఎఫ్–35 యుద్ధ విమానాల ప్రోగ్రామ్లోకి తుర్కియే తిరిగి ప్రవేశించడానికి ఇంకా అడ్డంకులు అనేకం ఉన్నప్పటికీ ’కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్’ (కాట్సా) కింద విధించిన ఆంక్షలను తొలగించడంతో ఆ విమానాలను దక్కించుకోవడానికి తుర్కియేకు మార్గం సులువు కానుంది. -
‘మర్యాదగా ఒప్పందానికైనా రండి.. లేదంటే కథ ముగిస్తాం’
అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజీకి చేరాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "మర్యాదగా మాతో ఒప్పందానికైనా రావాలి.. లేదంటే కథ ముగించేస్తాం అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణించగా.. ప్రస్తుతం ఇరాన్లో ఆయన అంత్యక్రియల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైట్హౌస్ వేదికగా ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.వైట్హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. తాము ఏ రకంగానైనా విజయం సాధించి తీరుతామంటూ ధీమా వ్యక్తం చేశారు. "మేం ఎలాగైనా గెలవబోతున్నాం. అయితే ఒక ఒప్పందానికి వస్తాం.. లేదా కథ ముగించేస్తాం. ఇరాన్ పని ముగించడం మాకేమీ అంత కష్టం కాదు. కానీ, నేను ఒప్పందానికే మొగ్గు చూపుతాను.. ఎందుకంటే అక్కడ ఉన్న 91 మిలియన్ల (9 కోట్లకు పైగా) ప్రజలు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. మేం అనుకుంటే కేవలం ఒక్క గంటలోనే ఇరాన్లోని వంతెనలన్నింటినీ నేలమట్టం చేయగలం" అని ట్రంప్ హెచ్చరించారు.అలాగే ఇరాన్ వద్ద ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండటానికి వీల్లేదని ట్రంప్ స్పష్టం చేశారు. మేం ఆ దేశం నుంచి రేడియోధార్మిక పదార్థాలను, సంపన్న యురేనియంను స్వాధీనం చేసుకోబోతున్నాం. ఇరుదేశాల మధ్య యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఉన్న ధరల కంటే ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు బ్యారెల్కు మరింత తగ్గాయి. మేం కొన్ని రాయితీలు సాధించాం. వాటిని వారు కొనసాగించాల్సిందే" అని ఆయన పేర్కొన్నారు.గత నెలలోనే అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరి.. కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ ట్రంప్ మాత్రం తన దూకుడు తగ్గించడం లేదు. జూలై 3న జరిగిన ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ అగ్రనాయకత్వం, మతాధికారులు భారీగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందేఅమెరికా మీడియా సంస్థ 'ఆక్సియోస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... నాయకులంతా అక్కడే గుమికూడారు. ఒక్క దెబ్బతో వారందరినీ మట్టుబెట్టే అవకాశం మాకు వచ్చింది. కానీ మేం అలా చేయలేదు. ఎందుకంటే వారందరినీ చంపేస్తే ఆ తర్వాత మేం ఎవరితో చర్చలు జరపాలి?" అని అన్నారు. ఖమేనీ అంత్యక్రియలకు అంతమంది తరలిరావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. "చాలామంది ఇరాన్ ప్రజలు ఖమేనీకి వ్యతిరేకమనుకున్నా.. బహుశా అవన్నీ నకిలీ కన్నీళ్లు కావచ్చు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ట్రంప్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. జూలై 4న 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్న అమెరికాకు అసలు నాగరికత, చరిత్రే లేవని ఎద్దేవా చేసింది. "మనుషులను చంపగలరు.. కానీ ఆదర్శాలను కాదు. మీరు ఆయతుల్లా ఖమేనీని చంపి ఉండొచ్చు. కానీ నిజానికి మీరు ఒక సెంట్ల సీసాను పగలగొట్టారు.. దాంతో ఆ సువాసన ఇప్పుడు అన్ని వైపులా వ్యాపించింది. ఈ విషయాలు మీకు అర్థం కావు... ఎందుకంటే అమెరికాకు అటు నాగరికత లేదు, ఇటు చరిత్ర లేదు, అసలు గౌరవమే లేదు. .ఖమేనీ అంత్యక్రియలకు తరలివచ్చిన జనసందోహాన్ని చూసైనా అమెరికా వాస్తవాన్ని గ్రహించాలని ఇరాన్ ఈ సందర్భంగా హితవు పలికింది. -
ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ సంచలన పిలుపు!
టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్ రాజధాని టెహ్రాన్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇక్కడి ప్రసిద్ధ ఇస్లామిక్ ప్రార్థనా స్థలం ‘గ్రాండ్ మొసల్లా' కాంప్లెక్స్ లక్షలాది మంది ఇరానీయులతో కిక్కిరిసిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు మరణించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అలజడి కారణంగా దాదాపు నాలుగు నెలల ఆలస్యం తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు వారం రోజుల పాటు సాగే ఈ భారీ అంత్యక్రియల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.ఈ అంత్యక్రియల ప్రార్థనలు కేవలం శోకసంద్రంగానే కాకుండా, ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకారం తీర్చుకోవాలనే నినాదాలతో హోరెత్తాయి. ప్రార్థనా మందిరంలో చేరిన లక్షలాది మంది ప్రజలు ఇరాన్ జాతీయ జెండాలతో పాటు, ప్రతీకారానికి చిహ్నమైన ఎరుపు రంగు జెండాలను ప్రదర్శించారు. ఖమేనీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను అంతమొందించాలంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు, పోస్టర్లు, గ్రాఫిటీలను ప్రదర్శించారు.అమెరికా నశించాలి,ఇజ్రాయెల్ నశించాలి అనే నినాదాల మధ్య.. ఇరాన్ మిలటరీ త్రివిధ దళాధిపతులు, అగ్రశ్రేణి రాజకీయ నాయకులు బహిరంగంగా హాజరయ్యారు. ట్రంప్ను చంపడం మా బాధ్యత అంత్యక్రియల వేళ లౌడ్స్పీకర్లలో ఈవెంట్ను నడిపిస్తున్న మొహమ్మద్ రసౌలి అనే కవి మాట్లాడుతూ..ఇకపై శవాల కఫనే మా వస్త్రం. ఖమేనీ రక్తం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం.. ట్రంప్ను హతమార్చడం ఇకపై మా బాధ్యత’అని పిలుపునివ్వడంతో లీడర్లు, ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.ఈ ఉద్రిక్తతల మధ్య అర్మేనియాలో ఇరాన్ రాయబారి ఖలీల్ షిర్ఘోలామి ఎక్స్ వేదికగా స్పందిస్తూ అమెరికా, ఇజ్రాయెల్లపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మీరు మనుషులను చంపగలరు కానీ వారి ఆదర్శాలను చంపలేరు. మీరు అయతుల్లా ఖమేనీని చంపడం ద్వారా ఒక అత్తరు సీసాను పగులగొట్టారు. ఇప్పుడు దాని సువాసన (ఆదర్శం) అంతటా వ్యాపించింది. నాగరికత, చరిత్ర, గౌరవం లేని మీకు ఇది ఎప్పటికీ అర్థం కాదు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్లోని వరుస పరిణామాలు అంతర్జాతీయంగా చర్చాంశనీయమయ్యాయి. -
భారత్పై ఇజ్రాయెల్ ప్రధాని కీలక వాఖ్యలు
ఇజ్రాయెల్కు అమెరికా మాత్రమే ఏకైక శక్తివంతమైన మిత్రదేశం అంటూ యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తోసిపుచ్చారు. అమెరికాకు ఆవల కూడా భారత్ సహా ఇతర దేశాల మద్దతు ఇజ్రాయెల్కు ఉందన్నారు. లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు, ఇరాన్-అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందం.. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.వాన్స్ చేసిన వ్యాఖ్యలపై నెతన్యాహు స్పందిస్తూ.. తమకు అనేక దేశాల అండ ఉందని.. వాటిలో చిన్న దేశమైన ఇండియా కూడా ఉందన్నారు. అక్కడ 140 కోట్ల జనాభా ఉంది. అక్కడ మాకు ఎంతటి అపారమైన మద్దతు ఉందో తెలుసా" అంటూ ఆయయన వ్యాఖ్యానించారు. అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ వాన్స్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని నెతన్యాహు చెప్పారు. ఆయనకు నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అంతమాత్రాన ఆయన చెప్పే ప్రతిదానితో నేను ఏకీభవిస్తానని కాదు. అలాగే వైట్హౌస్లో తమకు లభించిన అత్యంత గొప్ప స్నేహితుడని.. తాను భావించే ప్రెసిడెంట్ ట్రంప్కు, తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.నెలల తరబడి సాగుతున్న ఘర్షణలను ముగించడానికి, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి విస్తృత ప్రాంతీయ చర్చలు కోసమే ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని రూపొందించినట్లు వాన్స్ సమర్థించుకున్నారు. వాషింగ్టన్ అందిస్తున్న సైనిక మద్దతును ఇజ్రాయెల్ నాయకులకు గుర్తు చేస్తూ, ఇజ్రాయెల్ రక్షణ ఆయుధాలలో మూడింట రెండు వంతులు అమెరికా తయారు చేసిందని వాన్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్కు సమస్య ట్రంప్ కాదు. అమెరికా అధ్యక్షుడే తమ పెద్ద సమస్య అని ఇజ్రాయెల్లో ఎవరైనా భావిస్తే.. వారు వాస్తవ పరిస్థితులను గ్రహించాలి" అంటూ వాన్స్ వ్యాఖ్యానించారు. -
ఎప్పటికీ అగ్రస్థానంలోనే..
వాషింగ్టన్: అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఆనందకరమైన, అద్భుతమైన మైలురాళ్లలో ఒకటిగా అభివర్ణించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రాజధాని వాషింగ్టన్లోని నేషనల్ మాల్లో ‘సెల్యూట్ అమెరికా’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న యోధులతోపాటు పలువురు ప్రముఖులను సత్కరించారు. వియత్నాం యుద్ధరంగంలో ప్రత్యేక దళాలకు నాయకత్వం వహించిన తొలి నల్లజాతి అధికారిని సన్మానించారు.తనదైన శైలిలో ప్రసంగిస్తూ జనాన్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కమ్యూనిజంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మనం ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉంటామని అమెరికన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికాను ఎట్టిపరిస్థితుల్లోనూ పతనం కానివ్వబోమని తేల్చిచెప్పారు. తాము ఎల్లప్పుడూ అత్యుత్తమంగానే ఉంటామన్నారు. ‘సేవ్ అమెరికా చట్టాన్ని’ ఆమోదించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు.‘‘రోజు మన దేశం మళ్లీ విజయం సాధిస్తోంది. మునుపెన్నడూ లేనంత గొప్పగా పునరాగమనం చేసింది. మనం అమెరికాను గొప్పగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తాం. దీని ప్రకారం ఓటర్లందరూ తమ ఓటరు గుర్తింపు కార్డును చూపించాలి. అలాగే పౌరసత్వానికి సంబంధించిన రుజువును తప్పనిసరిగా సమర్పించాలి’’ అని ట్రంప్ తేల్చిచెప్పారు. ఇది నాకు ‘మూడో పర్యాయం’మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతానని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. తన హయాంలో అమెరికా సైన్యం ఎన్నో విజయాలు సాధించిందని హర్షం వ్యక్తంచేశారు. దేశ సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నానని వివరించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. తన ప్రస్తుత అధ్యక్ష పదవీకాలాన్ని ‘రెండో పర్యాయం’ అని కాకుండా ‘మూడో పర్యాయం’ అని పిలిచి ఉండాల్సిందని చెప్పారు. 2020 నాటి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అందుకే బైడెన్ గెలిచారని ట్రంప్ పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.వాస్తవానికి ఆ ఎన్నికల్లో విజయం తనదేనని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన, శక్తివంతమైన దేశంగా అమెరికా ఎదగడం చరిత్రలో యాదృచి్ఛకంగా జరిగిన పరిణామం కాదని ట్రంప్ తేల్చిచెప్పారు. అధ్యక్షుడిగా తన మొదటి పదవీ కాలంలో సైన్యాన్ని గొప్పగా పునరి్నరి్మంచామని అన్నారు. వాస్తవానికి సైన్యాన్ని మూడో పదవీకాలంలో ఉపయోగిస్తామని చెప్పాలని వెల్లడించారు. కానీ, అలా చెప్పే ఉద్దేశం లేదన్నారు. వివాదానికి ఆస్కారం కల్పించడం తనకు ఇష్టం లేదన్నారు. స్వర్ణయుగానికి ఆరంభం మాత్రమేఎంతోమంది వీరుల త్యాగంతో అమెరికా జెండా ఎల్లప్పుడూ స్వేచ్ఛ, న్యాయాలకు చిహ్నంగా నిలుస్తోందని ట్రంప్ అన్నారు. చరిత్రకు సాక్షిగా నిలిచిన పలు అమెరికా జాతీయ జెండాలను నేషనల్ మాల్లో ప్రదర్శించారు. అమెరికా తొలినాటి జెండా కూడా ఇందులో ఉంది. 1777 నాటి జెండాను ట్రంప్ చూపించారు. అప్పట్లో 13 రాష్ట్రాలకు ప్రతీకగా 13 నక్షత్రాలు, 13 పట్టీలు ఉన్న జెండా అని చెప్పారు. యార్క్టౌన్ యుద్ధ సమయంలో విజయగర్వంతో రెపరెపలాడిన నక్షత్రాలు, పట్టీల జెండాను గుర్తుచేసుకున్నారు.నిరంకుశత్వంపై స్వేచ్ఛ సాధించిన విజయాన్ని, అణచివేతపై స్వాతంత్య్రం పొందిన ఆధిక్యతను 1776 జూలై 4 నుంచి 2026 జూలై 4 వరకు అమెరికన్ స్ఫూర్తి సాధించిన చిరస్థాయి విజయాన్ని నేడు గొప్ప వేడుకగా నిర్వహించుకుంటున్నామని వివరించారు. అమెరికాను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ‘‘ఇది అమెరికా స్వర్ణయుగానికి ఆరంభం మాత్రమే. రెండున్నర శతాబ్దాల క్రితం నాటి తరహాలోనే ఒక విషయాన్ని ప్రకటిస్తున్నాం. మా దేశం, మా పిల్లల కోసం, స్వేచ్ఛా ఆశయం కోసం మా దేశాన్ని ఎవరూ చేరుకోని సరికొత్త శిఖరాలకు చేరుస్తాం.దేశాన్ని మరింత గొప్పగా, మెరుగ్గా, శక్తివంతంగా తీర్చిదిద్దుతాం. అమెరికాను మరింతగా ప్రేమిస్తాం’’ అని ట్రంప్ స్పష్టంచేశారు. అనారోగ్యం, వైకల్యం, సైనిక విధి నిర్వహణ లేదా ప్రయాణం వంటి అనివార్య కారణాలు ఉంటే తప్ప ఇకపై పోస్ట్ ద్వారా ఓటు వేసే విధానం ఉండదని చెప్పారు. దాంతో ఎన్నికల్లో మోసాలకు అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇందులో అర్థం కాని విషయం ఏదీ లేదన్నారు.కమ్యూనిజాన్ని ట్రంప్ మళ్లీ తప్పుపట్టారు. ‘‘కమ్యూనిస్ట్ వ్యవస్థ అమెరికన్ వ్యవస్థకు పూర్తిగా భిన్నమైనది. కమ్యూనిస్ట్ వ్యవస్థ ఎప్పుడూ విజయవంతం కాలేదు. ఆ ప్రమాదకరమైన వ్యవస్థ తిరిగి అమెరికాలో తన వికృత రూపాన్ని చూపిస్తామంటే ఇక్కడ ఎవరూ ఒప్పుకోరు. అమెరికా ఎప్పటికీ కమ్యూనిస్ట్ దేశం కాదు’’ అని ట్రంప్ పునరుద్ఘాటించారు. -
ట్రంప్ వార్నింగ్.. ఒకే చోట ఇరాన్ అగ్రనేతలు.. ఒక్క దెబ్బతో అంతం చేయగలం
-
ట్రంప్నకు ఝలక్.. మాజీ అధ్యక్షుల సందేశంపై కొత్త చర్చ!
వాష్టింగన్: అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తైన సందర్భంలో విడుదలైన ఒక రాజకీయ సందేశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, అలాగే డెమోక్రటిక్ నేత, న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ పరిపాలన విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా వలస విధానాలు మరియు ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతలపై వారంతా ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందేశం సాధారణంగా దేశభక్తి, ఐక్యతను ప్రతిబింబించే 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంలో వెలువడటంతో, దీనికి మరింత రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. జాతీయ స్థాయిలో వేడుకల వాతావరణం కొనసాగుతుండగా, ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో ఉన్న విభేదాలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి.వలస విధానాలపై తీవ్ర విమర్శలుమాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ మరియు ఒబామా తమ సందేశంలో అమెరికా వలస విధానాలు గతంతో పోలిస్తే మరింత కఠినతరంగా మారాయని పేర్కొన్నారు. వారి అభిప్రాయం ప్రకారం, అమెరికా స్థాపించిన విలువలలో ఒకటైన అవకాశాల సమానత్వం ప్రస్తుతం ప్రమాదంలో పడుతోందని వారు హెచ్చరించారు. వలసదారులపై తీసుకుంటున్న కఠిన చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాజిక వైవిధ్యాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అమెరికా చరిత్రలో వలసదారుల పాత్ర కీలకమని, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని సూచించారు.ఇరాన్ ఉద్రిక్తతలపై ఆందోళనవిదేశాంగ విధానాల అంశంలో ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని మాజీ అధ్యక్షులు హెచ్చరించారు. దౌత్యపరమైన చర్చలకు బదులు సైనిక ధోరణి పెరుగుతుందన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికా.. ప్రపంచ శాంతి మరియు స్థిరత్వంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, ఆ లక్ష్యానికి దౌత్య మార్గాలే ప్రధానంగా ఉండాలని వారు సూచించారు.మమ్దానీ ఫైర్.. మరోవైపు.. న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ కూడా ఈ సందేశంలో పాల్గొని, ప్రస్తుత విధానాలు సామాన్య ప్రజల అవసరాలను పక్కన పెడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆరోగ్యం, వలసలు, ఆర్థిక అసమానతలు వంటి అంశాల్లో ప్రభుత్వం మరింత మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవం సాధారణంగా జాతీయ ఐక్యత, గర్వానికి ప్రతీకగా నిలుస్తుంది. అయితే ఈసారి విడుదలైన ఈ రాజకీయ సందేశం, వేడుకల వాతావరణాన్ని కొంతవరకు రాజకీయ చర్చల వైపు మళ్లించింది. ఒకవైపు దేశ చరిత్రను స్మరించుకుంటూ వేడుకలు జరుగుతుండగా, మరోవైపు విధానాలపై విమర్శలు అమెరికా రాజకీయ వ్యవస్థలో ఉన్న విభేదాలను ప్రతిబింబిస్తున్నాయి. -
ఇరాన్ నేతల ఏడుపు.. అంతా ఫేక్!.. నోటి దురుసు ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ.. ఆ దేశంలో మిగిలి ఉన్న కీలక నాయకత్వాన్ని తాము ఒకే ఒక్క షాట్తో అంతమొందించగలమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, అలా చేస్తే భవిష్యత్తులో చర్చలు జరపడానికి ఎవరూ మిగలరు కాబట్టి తాను ఆ పని చేయడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. అదే సమయంలో ఖమేనీ అంత్యక్రియల్లో తీరని ఆవేదనతో కన్నీరు మున్నీరవుతున్న నేతలను ఉద్దేశిస్తూ ట్రంప్ తన నోటికి పని చెప్పారు. అమెరికన్ మీడియా సంస్థ ‘ఆక్సియోస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఇరాన్ నేతలందరూ ఖమేనీ అంత్యక్రియల్లో ఉన్నారు. ఒక్క షాట్తో వారందరినీ మేము తుడిచిపెట్టేయగలము. కానీ మేము ఆ పని చేయబోవడం లేదు. ఎందుకంటే ఆ తర్వాత చర్చలు జరపడానికి అక్కడ ఎవరూ ఉండరు. నిజానికి వారు మాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి అర్ధరిస్తున్నారు అని వ్యాఖ్యానించారు.ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు ముగిసే వరకు చర్చల నుంచి వారం రోజుల పాటు విరామం తీసుకోవాలని ఇరు పక్షాలు నిర్ణయించుకున్నట్లు కూడా ట్రంప్ స్పష్టం చేశారు. ఈ లోపు ఏ పక్షం కూడా అవతలి పక్షంపై ఎలాంటి దాడులు చేయబోవని ఆయన వెల్లడించారు. Mohammad Bagher Ghalibaf broke down in tears 🥺 pic.twitter.com/ypcwHrAPvg— ساسان (@eghtesadnia) July 3, 2026ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్ ఆశ్చర్యంఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ గాలిబాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలు కన్నీరు పెట్టుకుంటూ కనిపించారు. ఖమేనీ అంత్యక్రియలకు వేలాది మంది హాజరుకాగా, ఇరాన్ నేతలు భావోద్వేగానికి లోనై ఏడ్చారు. అయితే, అంత్యక్రియల్లో ఇరాన్ ప్రజలు, నేతలు ఏడవడంపై డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు ఖమేనీని ద్వేషిస్తారని తాను అనుకున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. బహుశా అవి నకిలీ కన్నీళ్లు కావచ్చు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొనసాగుతున్న అంత్యక్రియలుఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు ప్రస్తుతం అధికారికంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఆయన మరణించగా, యుద్ధ పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ అంతిమ సంస్కారాలు జూలై మొదటి వారంలో ప్రారంభమయ్యాయి. ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలను ఇరాన్, ఇరాక్లలోని 5 ప్రధాన నగరాల్లో జూలై 3 నుండి జూలై 9 వరకు 7 రోజుల పాటు నిర్వహించేలా ఇరాన్ ప్రభుత్వం షెడ్యూల్ చేసింది. జూలై 4, 5 తేదీల్లో రాజధాని టెహ్రాన్లోని ‘గ్రాండ్ మొసల్లా’ ప్రార్థనా మందిరంలో ఖమేనీ, ఆయనతో పాటు మరణించిన కుటుంబ సభ్యుల పార్థివ దేహాలను ప్రజల సందర్శనార్థం ఉంచారు. లక్షలాది మంది ప్రజలు ఆయనకు నివాళులర్పించేందుకు తరలివస్తున్నారు. టెహ్రాన్ తర్వాత ఈ అంతిమయాత్ర కోమ్ నగరానికి, ఆపై ఇరాక్లోని ప్రముఖ షియా పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాలకు తరలివెళ్తుంది. చివరగా జూలై 9న ఖమేనీ సొంత పట్టణమైన ఇరాన్లోని అత్యంత పవిత్ర నగరం మషహద్లో ఆయన భౌతిక కాయాన్ని అధికారికంగా ఖననం చేయనున్నారు. -
పుతిన్కు ట్రంప్ ఫోన్.. ఉక్రెయిన్ వార్పై కీలక నిర్ణయం?
వాషింగ్టన్/మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శనివారం రాత్రి దాదాపు 90 నిమిషాల పాటు సుదీర్ఘ టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఉద్దేశించిన ఈ చర్చలు అత్యంత స్పష్టంగా, సూటిగా సాగాయని క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే జరగనున్న ‘నాటో’ సదస్సుకు ముందే ట్రంప్ ఈ కీలక అడుగు వేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పుతిన్తో మాట్లాడటానికి ముందే ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ సంప్రదింపులు జరిపారు.ఉక్రెయిన్ సంక్షోభానికి త్వరితగతిన ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని రష్యా అధినేతకు ట్రంప్ ప్రతిపాదించినట్లు క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషాకోవ్ ఆదివారం ఉదయం ప్రకటించారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ముందడుగు పడటంతో, గత కొన్నేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి త్వరలోనే తెరపడనుందనే ఆశలు చిగురిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో నాటో కూటమి దేశాలు కూడా ఈ చర్చలపై తీవ్రంగా దృష్టి సారించాయి. -
మాజీ అధ్యక్షులందరితో రీయూనియన్
వాషింగ్టన్: అమెరికా పూర్వ అధ్యక్షులందరితో వైట్హౌస్లో రీ యూనియన్ పార్టీ ఏర్పాటు చేయాలని ఆశగా ఉందని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. బరాక్ ఒబామా, జో బైడెన్సహా అందరు పూర్వ అధ్యక్షులతో కలిసి వైట్హౌస్లో ఫుట్బాల్ మ్యాచ్ చూస్తే బాగుంటుందని ఆయన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్తో నిర్వహించిన ఒక పాడ్కాస్ట్లో తెలిపారు.అమెరికా 250వ స్వాతంత్య్ర ఉత్సవ వేడుకల్లో భాగంగా ‘‘స్టోరీ టైమ్ విత్ సెకెండ్ లేడీ’ పేరుతో ఈ పాడ్కాస్ట్ను నిర్వహించారు. ఇందులోనే డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రచురించిన ‘ప్రేసిడెంట్స్ ప్లే’ పుస్తకంలో కొంత భాగాన్ని చదివి వినిపించారు. బహిరంగ సభలు, విలేకరుల సమావేశాల్లో ఒబామా, బైడెన్లను విమర్శించే అవకాశాన్ని ఏనాడూ వదులుకోని ట్రంప్ వారితో కలిసి సూపర్ బౌల్ మ్యాచ్ చూసేందుకు వైట్హౌస్లో ఆతిథ్యం ఇవ్వాలన్న ఆలోచన ఉషా వాన్స్దేనని వెల్లడించారు.‘‘బరాక్ ఒబామా, జో బైడెన్లతోపాటు బుష్లను ఆహ్వానించాలనుకుంటా. బహుశా వీరిలో కొందరినైనా ఆహ్వానించి వారితో కలిసి ఫుట్బాల్ మ్యాచ్ చూడాలి. ఇదే మంచి స్టోరీ అవుతుంది కదా?. మీడియాకు పిచ్చెక్కుతుంది. అధ్యక్షుల రీ యూనియన్ అంటే సరదాగానూ ఉంటుంది’’ అని అన్నారు. -
'ప్రమాదపుటంచున' సోషలిస్ట్ క్యూబా
1823లో అమెరికా 5వ అధ్యక్షుడు మన్రో సిద్ధాంతం ప్రకారం లాటిన్ అమెరికా అంతా అమెరికాకు చెందుతుంది; పశ్చిమ భూగోళంలోకి యూరపు దేశాలు వలస రాకూడదు; తూర్పు భూగోళంలో అమెరికా జోక్యం చేసుకోదు. దక్షిణ అమెరికా దేశాలు అమెరికాకు చెందినవని (బ్యాక్ యార్డ్) అర్థం. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ ఈ సిద్ధాంతాన్ని నిస్సిగ్గుగా అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు.స్పానిష్–అమెరికన్ యుద్ధం ముగిసిన తర్వాత 1902 మే 20న క్యూబన్ రిపబ్లిక్ ఏర్పడింది. ఈ యుద్ధంలో స్పానిష్ వలస ప్రాంతా లైన క్యూబా, ప్యూర్టోరికో, గ్వామ్, ఫిలిప్పైన్స్లను అమెరికా స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత 1917 నుండి 1923 వరకూ అమె రికా మెరైన్లు క్యూబా ద్వీపాన్ని ఆక్రమించి సమ్మెలను అణిచివేస్తూ అమెరికా కార్పొరేట్ ప్రయోజనాల భుజం కాశారు. అమెరికా సైనిక ఆక్రమణ అధికారికంగా ముగిసినప్పటికీ, క్యూబాపై అజమాయిషీ కోసం ‘ప్లాట్’ సవరణను విధించింది. 1917లో పాలస్తీనా ఏర్పాటు చేసి 1948 వరకూ బ్రిటిష్వాళ్ళు కంట్రోల్ కోసం తీసుకొన్న మాండేట్ (అజమాయిషీ) లాంటిది ఇది. దీనితో వాషింగ్టన్కు సము చితమని భావించినప్పుడల్లా క్యూబా వ్యవహారాల్లో సైనిక జోక్యం చేసుకునే ‘అనియంత్రిత’ హక్కును పొందింది. కానీ సోషలిస్టు క్యూబా దీన్ని తిరస్కరించింది. ప్రపంచ మద్దతు అవసరం!క్యూబాపై గత 66 ఏళ్లుగా అమెరికా సాగించిన భయోత్పాతం, అలాగే ప్రస్తుతం తీవ్రతరమవుతున్న పాలన మార్పు ప్రయత్నాలన్నీ 1959 విప్లవానికి ముందు ఉన్న ప్లాట్ సవరణకూ, పుల్జెన్సియో బాటిస్టా ప్రభుత్వ నియంతృత్వంలోని సంబంధాలను పునరుద్ధరించటానికి ఉన్న అడ్డంకులను తొలగించటానికీ ఉద్దేశించినవి. సోష లిస్టు ప్రణాళిక ఆర్థిక విధానానికి బదులుగా... స్వేచ్ఛా విపణి పెట్టు బడిదారీ విధానం వైపు, సాంఘిక కోతల వైపు క్యూబా ప్రస్తుతం నడవబోతున్నది. ఫలితంగా క్యూబాలో ప్రభుత్వ ఆధీనంలోని నియంత్రిత ఆర్థిక వ్యవస్థ కూలిపోనుంది. ‘యుద్ధ ఆర్థిక వ్యవస్థ’ పేరిట ప్రవేశపెట్టనున్న ప్రభుత్వ పొదుపు చర్యలు, సాంఘిక కోతల ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పడిపోయే ప్రమాదం ఉంది.సామ్రాజ్యవాద ఆంక్షలను క్యూబా ఎదుర్కోలేకపోయింది. చైనా, రష్యాల సహాయం అంతంతమాత్రంగా ఉంది. ట్రంప్ జన వరి నెలలో క్యూబాకు ఇంధన దిగుమతుల్ని నిషేధించాడు. ముడి చమురు ఎగుమతి దేశాలపై తీవ్ర ఆంక్షలుంటాయని హెచ్చరించారు. వెనెజులా, అమెరికా కబంధహస్తాల్లోకి వెళ్లిపోయింది. మెక్సికో వంటి దేశాలు సహాయాన్ని ఆపాయి. ఇంధన కొరతతో గంటలకొద్దీ క్యూబా అంధకారంలోకి వెళ్లాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. క్యూబాలో 1959 విప్లవ సమానత్వ లక్ష్యాలు దూరం కాబోతు న్నాయి. ఒకప్పటి సోవియట్ యూనియన్ 1990వ దశకంలో కుప్ప కూలిన తర్వాత క్యూబాకు సంపూర్ణంగా ఆపన్నహస్తం అందించే వారే లేకపోయారు.క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న ఆంక్షల దాడి... ప్రపంచ ఆధిపత్యానికి ఎదురయ్యే ప్రతీ సవాలునూ నాశనం చేయాలనే దాని ప్రయత్నానికి ఒక కేంద్రీకృత రూపం మాత్రమే. ఇటువంటి ప్రయత్నాలు ఇరాక్, అఫ్గా నిస్తాన్, లిబియా, సిరియాల విధ్వంసానికి, గాజాలో మారణ హోమానికి, ఇరాన్ పై యుద్ధానికి, వెనెజులా అధ్యక్షుడు మధురోను అపహరించి, ముడిచమురు స్వాధీనం చేసుకోవటానికి కారణ మయ్యాయి. మే 14న సి.ఐ.ఎ. డైరెక్టరు జాన్ రాట్ క్లిఫ్ హవానాకు వచ్చి పెట్టుబడిదారీ ఆర్థిక విధాన దిశగా సంస్కరించకపోతే క్యూబాను సర్వనాశనం చేస్తామని ఒత్తిడి ప్రకటించాడు. పెట్టుబడీ దారీ ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన సోషలిస్టు విప్లవాలు మనుగడ సాధించాలంటే ప్రపంచ కార్మికుల సంఘీభావం, మద్దతు అవసరం.సోషలిస్టు ప్రణాళిక ఆర్థిక విధానానికి బదులుగా... స్వేచ్ఛా విపణి పెట్టుబడిదారీ విధానం వైపు, సాంఘిక కోతల వైపు క్యూబా ప్రస్తుతం నడవబోతున్నది. - బుడ్డిగ జమిందార్, వ్యాసకర్త, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యులు -
మేం మంచివాళ్లం.. ఇరాన్కు వారం సెలవిచ్చాం
ఇరాన్లో మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి జరుగుతున్న వీడ్కోలు కార్యక్రమాల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మౌంట్ రష్మోర్ వద్ద జరిగిన భారీ సభలో ఆయన చేసిన సెటైరికల్ వ్యాఖ్యలు వివాదంగా మారాయి.“మేం మంచివాళ్లం కాబట్టి ఇరాన్కు ఒక వారం సెలవిచ్చాం” అంటూ ట్రంప్ ప్రసంగించారు. అంతకుముందు ఇరాన్పై జరిగిన సైనిక చర్యలను ప్రస్తావిస్తూ ఆయన “మేం ఇరాన్ను గట్టిగా దెబ్బకొట్టాం… వాళ్లు చర్చలకు సిద్ధంగా ఉన్నారు” అని వ్యాఖ్యానించారు.మేము వెనెజువెలాను ఒక రోజులోనే ఓడించాం. ఇరాన్ను కూడా తీవ్రంగా దెబ్బతీశాం. వాళ్లు ఇప్పుడు ఒప్పందానికి రావడానికి ఎంతో తహతహలాడుతున్నారు. మేము మంచివాళ్లం కాబట్టి వారికి అంత్యక్రియల కోసం ఒక వారం సమయం ఇచ్చాం. వీలైనంత త్వరగా వాళ్లు మాతో డీల్ కుదుర్చుకుంటే మంచిది అని అన్నారాయన.ట్రంప్ వ్యాఖ్యలను సభలో ఉన్నవాళ్లు చప్పట్లు, నవ్వులతో స్వాగతించారు. ప్రస్తుతం.. అమెరికా అంతటా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.Trump on Iran: "We Gave Them a Week Off… Because We're Nice." pic.twitter.com/AcJ63EaUjO— GP Singh (@GanpatSinghDew5) July 4, 2026ఇక మరోవైపు ఇరాన్లో సంతాప దినాలు నడుస్తున్నాయి. రాజధాని టెహ్రాన్లో గ్రాండ్ మోసల్లా కేంద్రంగా ఖమేనీకి వీడ్కోలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు నల్ల దుస్తుల్లో హాజరై కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు.. ‘‘అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలి.. ట్రంప్ను హతమార్చాలి’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, ఫ్లకార్డులు ఆ కార్యక్రమంలో కనిపించడం గమనార్హం. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం సాధారణంగా 24 గంటల్లో అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, యుద్ధ పరిస్థితులు, భద్రతా కారణాల వల్ల ఇంతకాలం వాయిదా వేస్తూ వచ్చారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ సంతాప యాత్రలో ఖమేనీ పార్థివదేహాన్ని ఖోమ్, నజాఫ్, కర్బలా మీదుగా మష్హద్కు తరలించి జూలై 9న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు భారత్, పాకిస్థాన్, రష్యా, చైనా సహా అనేక దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇరాన్లో శోక వాతావరణం కొనసాగుతున్న సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ దీనికి ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఉద్రిక్తతల కారణంగా.. అమెరికా–ఇరాన్ సంబంధాల్లో కొత్త రాజకీయ దుమారానికి కారణమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ట్రంప్ను కూల్ చేసేందుకు.. నాటో కొత్త ఎత్తుగడలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో గత కొంతకాలంగా నెలకొన్న విభేదాలకు తెరదించే ప్రయత్నంలో అట్లాంటిక్ కూటమి (నాటో) కీలక అడుగులు వేస్తోంది. సభ్యదేశాల మధ్య ఐక్యతపై ఎలాంటి సందేహాలకు తావులేకుండా చేయడంతో పాటు, వాషింగ్టన్ ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ ఈసారి శిఖరాగ్ర సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబోతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ.. ఐరోపా భద్రతకు పెరుగుతున్న సవాళ్లు, అమెరికా వైఖరిలో వచ్చిన మార్పులు, సభ్యదేశాలపై ట్రంప్ ఒత్తిడి.. ఈ మూడింటి మధ్య జరుగుతున్న అంకారా(టర్కీ) సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.నాటో ఏర్పడి దాదాపు ఎనిమిది దశాబ్దాలు అవుతోంది. ప్రస్తుతం అమెరికా, కెనడా, ఐరోపాలోని మొత్తం 32 దేశాలు ఈ కూటమిలో సభ్యులుగా ఉన్నాయి. ప్రపంచ సైనిక వ్యయంలో సగానికి పైగా ఈ దేశాలదే. అలాంటి కూటమిలో గత కొన్నేళ్లుగా ఒక ప్రశ్న తరచూ వినిపిస్తోంది. అమెరికా లేకుండా నాటో కొనసాగగలదా? అదే సమయంలో మరో ప్రశ్న కూడా ముందుకొచ్చింది. అమెరికా ఎందుకు మిగతా దేశాల భద్రత కోసం అంత భారీగా ఖర్చు చేయాలి? ఈ రెండో ప్రశ్ననే డొనాల్డ్ ట్రంప్ అత్యంత బలంగా లేవనెత్తారు.ట్రంప్కు నాటోపై వ్యక్తిగత వ్యతిరేకత లేదు. కానీ కూటమి నిర్వహణ తీరుపై ఆయన చాలాకాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ప్రతి ఏడాది వందల బిలియన్ డాలర్లు రక్షణపై వెచ్చిస్తుంటే, ఐరోపాలోని అనేక దేశాలు మాత్రం తమ భద్రత బాధ్యతను అమెరికాపైనే వదిలేశాయని ఆయన విమర్శిస్తున్నారు. "అమెరికా డబ్బుతో యూరప్ భద్రత ఎందుకు?" అనే ప్రశ్నను ఆయన ఎన్నికల ప్రచారంలోనే కాదు, అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ పదేపదే లేవనెత్తారు. సభ్యదేశాలు తగిన రక్షణ వ్యయం చేయకపోతే అమెరికా తన భద్రతా హామీలను పునఃసమీక్షిస్తుందని కూడా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో ఒక దశలో అమెరికా నిజంగానే నాటో నుంచి తప్పుకుంటుందా? అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగింది.అయితే ట్రంప్ ఎప్పుడూ ‘‘నాటోను రద్దు చేస్తాను’’.. ‘‘నాటో నుంచి తప్పుకుంటాం’’ అని అధికారికంగా ప్రకటించలేదు. ఆయన లక్ష్యం కూటమిని బలహీనపరచడం కాదని, సభ్యదేశాలు కూడా సమాన బాధ్యతలు తీసుకునేలా చేయడమేనని ఆయన సన్నిహితులు, విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు అంకారాలో జరుగుతున్న సమావేశం చూస్తే, ట్రంప్ ఎన్నాళ్లుగానో చెబుతున్న అంశాలకే నాటో స్పందిస్తున్నట్లు స్పష్టమవుతోంది.అందుకే ఈసారి సభ్యదేశాలు కీలక నిర్ణయానికి వచ్చాయి. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (GDP)లో కనీసం 2 శాతం రక్షణ రంగానికి కేటాయించాలనే లక్ష్యాన్ని దశలవారీగా 5 శాతానికి పెంచేందుకు అంగీకరించాయి. ఇందులో 3.5 శాతం నేరుగా సైనిక సామర్థ్యాల పెంపు, ఆయుధాల కొనుగోలు, సైనిక దళాల ఆధునికీకరణకు వినియోగిస్తారు. మిగిలిన 1.5 శాతం సైబర్ భద్రత, కీలక మౌలిక సదుపాయాలు, రక్షణ పరిశ్రమ, సైనిక రవాణా వ్యవస్థల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. నాటో చరిత్రలో ఇదే అతిపెద్ద రక్షణ వ్యయ లక్ష్యంగా భావిస్తున్నారు.ఇదొక్కటే కాదు.. సమావేశం ముగింపులో విడుదల చేసే సంయుక్త ప్రకటనలో నాటో ఒప్పందంలోని ఆర్టికల్-5 మీద తమ నిబద్ధత "అచంచలం" అని మరోసారి ప్రకటించనున్నారు. ఈ నిబంధనే నాటోకు వెన్నెముకగా భావిస్తారు. ఒక సభ్యదేశంపై దాడి జరిగితే అది మొత్తం కూటమిపై దాడిగా పరిగణించి మిగతా సభ్యదేశాలన్నీ రక్షణకు ముందుకు రావాలనేది దీని సారాంశం. ట్రంప్ గతంలో ఈ అంశంపైనా సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అదే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ సమావేశంలో మరో కీలక అంశం ఉక్రెయిన్. రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కీవ్కు సైనిక, ఆర్థిక సహకారాన్ని ఎలా కొనసాగించాలన్న దానిపైనా చర్చ జరుగుతోంది. అయితే గత సమావేశాలతో పోలిస్తే ఈసారి ఉక్రెయిన్ అంశం కంటే అమెరికా-నాటో సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. ట్రంప్ వైఖరి కారణంగా కూటమిలో ఎలాంటి చీలికలు ఏర్పడకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.నాటోలోని చాలా దేశాలు ఇప్పటికే రక్షణ వ్యయాన్ని పెంచడం ప్రారంభించాయి. 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించినప్పుడు కేవలం మూడు దేశాలే జీడీపీలో 2 శాతం రక్షణకు ఖర్చు చేసేవి. ఇప్పుడు 32 సభ్యదేశాల్లో మెజారిటీ ఆ లక్ష్యాన్ని చేరుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఐరోపా దేశాలు తమ సైనిక బలాన్ని పెంచడంపై మరింత దృష్టి సారించాయి. ఇప్పుడు 5 శాతం లక్ష్యంతో ఆ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది.అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం అమెరికా-చైనా పోటీ, రష్యా దూకుడు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు... ఇలా అనేక పరిణామాలు ఒకేసారి చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నాయకత్వంలోని నాటోలో ఎలాంటి బలహీనత కనిపించినా అది ప్రత్యర్థి దేశాలకు ప్రయోజనకరంగా మారే అవకాశం ఉందని సభ్యదేశాలు భావిస్తున్నాయి. అందుకే ట్రంప్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలను విస్మరించకుండా, వాటికి సమాధానమిస్తూ కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేసే దిశగా ఈసారి అడుగులు వేస్తున్నాయి.అమెరికా లేకుండా నాటోను ఊహించడం కష్టం. అదే సమయంలో నాటో లేకుండా ఐరోపా భద్రతను ఊహించడం కూడా అంతే కష్టం. ఈ వాస్తవాన్ని గుర్తించిన సభ్యదేశాలు ఇప్పుడు ఒకే సందేశం ఇవ్వాలని చూస్తున్నాయి. అమెరికా నమ్మకాన్ని కోల్పోకుండా, కూటమి బలాన్ని మరింత పెంచుకోవడం. అంకారా సమావేశం నుంచి వెలువడే నిర్ణయాలు రానున్న సంవత్సరాల్లో అమెరికా-నాటో సంబంధాలను ఏ దిశగా తీసుకెళ్తాయో నిర్ణయించనున్నాయి. -
ట్రంప్కు అత్యంత ఖరీదైన ఉంగరం
బ్రస్సెల్స్: ఖతార్ ప్రభుత్వం నుంచి గతంలో కానుకగా రూ.3,360 కోట్ల విమానాన్ని కానుకగా అందుకున్న ట్రంప్కు కానుకలు వచ్చి పడుతూనే ఉన్నాయి. తాజాగా, బెల్జియం వజ్రాభరణాల కంపెనీ రూ.21 లక్షలకు పైగా విలువ చేసే వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని ఇచ్చేందుకు సిద్ధమైంది. అధ్యక్షుడికి 250 ఏళ్ల అమెరికా ఉత్సవాలకు కానుకగా ఇస్తున్నట్లు బెల్జియంకు చెందిన ఆంట్వెర్ప్ వరల్డ్ డైమండ్ సెంటర్(ఏడబ్ల్యూడీసీ) తాజాగా ప్రకటించింది. ఏడబ్ల్యూడీసీ నుంచి అమెరికాకు ఏటా ఎగుమతయ్యే రూ.16,800 కోట్ల పాలిష్ చేసిన వజ్రాలపై టారిఫ్లను రద్దు చేసినందుకే ఈ బహుమానమని ఏడబ్ల్యూడీసీ తెలిపింది.ఈ భారీ ఉంగరంలో ప్రత్యేకతలేమంటే..డజన్ల కొద్దీ వజ్రాలతో అమెరికా జాతీయ పతాకం, 1776–2026 సంవత్సరాలు, సూపర్మ్యాన్ లోగో ఆకారంలో 45, 47 సంఖ్యలు.. వజ్రాల రెక్కలు కలిగిన ఒక గరుడ పక్షి, కెంపుతో చేసిన డాలును మోస్తూ, పచ్చలు పొదిగిన ఆలివ్ కొమ్మను తన కాళ్లతో పట్టుకుని ఉంది. పైన మెరిసిపోయే 250 అంకె, కింద 18–క్యారెట్ల బంగారంతో ‘250 YEARS USA’ అనేవి ఉన్నాయి.దీని తయారీకి 321 వజ్రాలు, 56 నీలాలు, 13 పచ్చలు, ఆరు కెంపులను పొదిగిన, గడియారమంత ఉన్న ఈ బంగారు ఉంగరాన్ని అధ్యక్షుడు ట్రంప్కు ఇవ్వాలంటూ అమెరికాలో తమ బిల్ వైట్కు అందజేసినట్లు ఏడబ్ల్యూడీసీ తెలిపింది. ఉంగరం ఖరీదు రూ.21 లక్షల నుంచి రూ.29 లక్షల వరకు ఉండొచ్చన్నది నిపుణుల అంచనా. ఈ వజ్రపు ఉంగరాన్ని ఇంకా అధ్యక్షుడు ట్రంప్కు అందజేయలేదని వైట్హౌస్లోని ఓ అధికారి తెలిపారు. -
ఇరాన్, అమెరికా.. చర్చల ముసుగులో హత్యా కుట్ర?
ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గుతున్నట్లుగా కనిపిస్తున్న తరుణంలో మరో సంచలన ఆరోపణ వెలుగులోకి వచ్చింది. శాంతి చర్చల నేపథ్యంలో ఇరాన్ ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ హత్యా కుట్రకు పూనుకోవచ్చని అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అమెరికా మధ్యప్రాచ్య దేశాల ద్వారా ఇరాన్కు రహస్య హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది.న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మరియు పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్లను లక్ష్యంగా చేసుకుని హత్యా ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేసినట్లు సమాచారం. వీరిద్దరూ శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నందున, వారిపై దాడి జరిగితే మొత్తం చర్చల ప్రక్రియ కుప్పకూలే ప్రమాదం ఉందని వాషింగ్టన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు నివేదిక పేర్కొంది.ఈ నేపథ్యంలో అమెరికా కొన్ని మధ్యప్రాచ్య దేశాల ద్వారా ఇరాన్కు గోప్యంగా హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో, యుద్ధ ప్రారంభ దశలో ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక, రాజకీయ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు అమెరికా వర్గాలు అంగీకరించినప్పటికీ, ప్రస్తుత శాంతి చర్చల దశలో అలాంటి చర్యలు పరిస్థితిని పూర్తిగా దెబ్బతీస్తాయని భావించినట్లు సమాచారం.అమెరికా ఇలా.. యుద్ధ ప్రారంభంలో ఇజ్రాయెల్ ఇరాన్ నాయకత్వాన్ని బలహీనపరచే లక్ష్యంతో దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ దాడుల్లో కొంతమంది ఉన్నతాధికారులు మరణించినట్లు కూడా కథనాలు చెబుతున్నాయి. అయితే, తర్వాతి దశలో చర్చల ప్రక్రియ ప్రారంభమైన తరువాత అమెరికా వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శాంతి చర్చలను కొనసాగించాల్సిన అవసరాన్ని అమెరికా అధికారులు ప్రాధాన్యంగా పేర్కొంటూ, హింసాత్మక చర్యలు జరిగితే మొత్తం ప్రక్రియ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించినట్లు సమాచారం.ఇదిలా ఉండగా, ఇరాన్ తరఫున అరాఘ్చీ, ఘాలిబాఫ్లు అమెరికా మరియు ప్రాంతీయ దేశాలతో జరుగుతున్న చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. జూన్లో అమెరికా–ఇరాన్ మధ్య ఒక ప్రాథమిక ఒప్పందం కుదిరినట్లు సమాచారం ఉంది. ఇది హార్మూజ్ జలసంధి ద్వారా రవాణా పునరుద్ధరణతో పాటు తదుపరి అణు చర్చలకు మార్గం సుగమం చేసేలా ఉన్నట్లు చెబుతున్నారు.అయితే ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ తిరిగి బలపడుతుందని, దాని మిసైల్ సామర్థ్యాలు మరియు ప్రాంతీయ ప్రభావం పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య కొనసాగుతున్న సంక్లిష్ట సమీకరణాలు, మధ్యప్రాచ్య శాంతి చర్చల భవిష్యత్తుపై కొత్త అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. -
బోరబండలో డొనాల్డ్ ట్రంప్!
హైదరాబాద్లోని ఒక రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ అని తన పేరు పెట్టారనే విషయం తెలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకేసారి వంద ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీగా ఇంటికొచ్చినంతగా సంతోషించాడు. ఆ సంతోషంలో... ‘అర్జంటుగా హైదరాబాద్కు వెళ్లాలనుకుంటున్నాను. ప్రయాణ ఏర్పాట్లు చేయండి’ అని సిబ్బందిని ఆదేశించాడు. విమానం ఎక్కడానికి ముందు ‘30 రోజుల్లో తెలంగాణ భాష–యాస’ అనే పుస్తకాన్ని బట్టీ పట్టాడు ట్రంప్. కొన్ని రోజుల్లోనే తెలుగు భాషపై గట్టి పట్టు సంపాదించి గ్రేట్ అనిపించుకున్నాడు.హైదరాబాద్లో ట్రంప్.... ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ అనే బోర్డ్ను చూస్తూ నాన్స్టాప్గా ఆనందించాడు. ఆ తరువాత... ‘మారు వేషంలో గల్లీ గల్లీ తిరగాలనుకుంటున్నాను. నో సెక్యూరిటీ గిక్యూరిటీ’ అన్నాడు ట్రంప్.‘సార్...ప్రాబ్లం అవుతుందేమో!’ అన్నారు అమెరికా నుంచి వచ్చిన హై ప్లస్ సెక్యూరిటీ వాళ్లు. ‘ఐ లవ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమే నాప్రాణం. ప్రాబ్లమే నా ప్రతిబింబం. ప్రాబ్లమే నా సుడిగుండం. ప్రాబ్లమే నా అగ్నిగుండం. ప్రాబ్లమ్ లేకుండా నేనే లేను’ కవితాత్మకంగా అన్నాడు ట్రంప్.‘సరే... తమరి ఇష్టం’ అన్నారు సెక్యూరిటీ వాళ్లు.ఒక సాధారణ రైతు వేషంలో హైదరాబాద్లో తిరుగుతున్న ట్రంప్ బోరబండలోని ‘పీపీటీ–పీపాలకు పీపాలు తాగండి’ అనే జనతా బార్ దగ్గర ఆగాడు. మందుబాబులు బార్లో కాదు... రోడ్డు మీద, రోడ్డు పక్కన, చెట్టు కింద, చెట్టు పైనా... ఎక్కడ పడితే అక్కడ మందు తాగుతూ కనిపించారు.వారిని ఆసక్తిగా గమనిస్తున్నాడు ట్రంప్. ఇంతలో దూరం నుంచి ఒక మందుబాబు పరుగెత్తుకు వచ్చి... ‘అన్నా... నువ్వు ఇక్కడున్నవా... నీ కోసం వెదుకని స్టేట్ లేదు. ఊరు లేదు’ అని ట్రంప్ మీద పడి ఏడ్వడంప్రారంభించాడు. ‘నేను నీ అన్నేమిటీరా... లిక్కరికీ కిరికిరీ. నోర్ముస్కొని పో’ అని గద్దించాడు ట్రంప్.‘ఒరేయ్ ఎంకులు, శ్రీను, ఎంకటేశ్వర్లు, గుర్నాదం... ఒకసారి ఇటొచ్చేయండి’ అని గట్టిగా అరిచాడు మందుబాబు. అంతే... సాటి మందుబాబులు పరుగెత్తుకు వచ్చారు. ‘ఇన్ని రోజులు ఎక్కడికి బోయినవు అన్నా... మేమెట్ల బతకాలే అన్నా... నిన్ను చూస్తే బోనాల పండుగ ముందుగాల్నే వచ్చినట్లుంది’ అని ట్రంప్ను గట్టిగా పట్టుకున్నారు ఆ నలుగురు.ఇంతలో అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చాడు. ‘ఏందిరా మీ లొల్లి?’ అని గద్దించాడు.‘ఈయన మా అన్న నర్సింగ్. రెండు సంవత్సరాల కింద ఇంట్ల నుంచి పారిపోయిండు. ఇప్పుడు దొరికిండు’ అన్నాడు గుర్నాదం.‘ఈనే మీ అన్న అని గ్యారెంటీ ఏమిటీ?’ అడిగాడు కానిస్టేబుల్. సెల్ఫోన్ ఫొటోగ్యాలరీలో పాత ఫోటోలు చూపించాడు శ్రీను.‘ఏమయ్యా పెద్ద మనిషి... ఈ ఫోటోలలో ఉన్నది నువ్వే కదా! ఎందుకు అబద్దం ఆడుతున్నవు?’ అని ట్రంప్పై చిరాకు పడ్డాడు కానిస్టేబుల్.‘మిస్టర్ కానిస్టేబుల్... సేమ్ టు సేమ్ ఉండే వ్యక్తులు లోకంలో ఏడుగురు ఉంటారు అనే స్మాల్ విషయం నీకు తెలియదా?’ కానిస్టేబుల్పై కన్నెర్ర చేశాడు ట్రంప్. ట్రంప్ కోపాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు కానిస్టేబుల్.‘అన్నా... నువ్వు చీపు లిక్కర్ తాగక చానా రోజులైంది’ అంటూ అపురూప మద్యాన్ని ట్రంప్తో బలవంతంగా తాగించారు ఆ నలుగురు. అంతే... శ్రీ ట్రంప్కు క్షణాల్లో పద్నాలుగు లోకాలు, సమస్త జీవరాసులు, నక్షత్రమండలాలు, ఉల్కలు, అంతరించి పోయిన డైనోసర్లు, గ్రహాంతర జీవులు కనిపించాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూడా కనిపించింది!!! – యాకుబ్ పాషా -
ఇరాన్-అమెరికా చర్చలు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంటోందా? తాజా చర్చల్లో తాము కోరుకున్న దాదాపు అన్ని అంశాలకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న పరోక్ష చర్చలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఖతార్ రాజధాని దోహాలో ఇటీవల జరిగిన తాజా రౌండ్ చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇరాన్ మా ప్రభుత్వం కోరుకున్న దాదాపు అన్ని షరతులకు అంగీకరించినట్లు అనిపిస్తోంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఇంకా తుది శాంతి ఒప్పందం దిశగా పరిస్థితి పూర్తిగా స్థిరపడలేదని కూడా ఆయన అంగీకరించారు.“మేము చర్చలు జరుపుతున్నాం. ఏమి జరుగుతుందో చూడాలి. నాకు అనిపిస్తోంది.. వారు మేము కోరిన దాదాపు అన్నింటికీ అంగీకరించారు” అని ట్రంప్ సీఎన్బీసీ(Trump CNBC Interview)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఇరాన్ సైనికంగా ఇప్పటికే బలహీనపడిందని, కొన్ని మిసైళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అవసరమైతే వాటినీ లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం తమకు ఉందని హెచ్చరించారు.“వారు డ్రోన్తో ఒక నౌకపై దాడి చేశారు. దానికి నేను ప్రతిస్పందనగా చర్య తీసుకున్నాను. గత వారంలో.. వరుసగా మూడు రాత్రులు, అంతకుముందు రెండు రాత్రులు తీవ్రంగా దాడులు చేశాం” అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి..ఇదిలా ఉంటే.. దోహాలో జరిగిన చర్చల్లో ఇరాన్ నిధుల విడుదల, హర్ముజ్ జలసంధిలో సముద్ర రవాణా భద్రత వంటి కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే అణు కార్యక్రమం (Nuclear programme) అంశం ఈ దఫా చర్చల్లో చర్చకు రాలేదని రాయిటర్స్ కథనం వెల్లడించింది. అదే సమయంలో చర్చల్లో “సానుకూల పురోగతి” కనిపించిందని ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొనడం గమనార్హం. జూన్లో జరిగిన తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఆధారంగా చేసుకుని ఈ చర్చలు ముందుకు సాగుతున్నాయి అని ఖతార్ ప్రతినిధి మీడియాకు తెలిపారు. మరోవైపు.. వాషింగ్టన్ వర్గాలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నాయి. అణు కార్యక్రమంపై చర్చలు తర్వాతి దశలోనే ప్రారంభమవుతాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు.ఇప్పటికే అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తుల సమక్షంలో వేర్వేరు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఇరాన్ మాజీ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం తదుపరి దశ చర్చలు జరిగే అవకాశం ఉందని ఖతార్ విదేశాంగ శాఖ వెల్లడించింది. మొత్తంగా చూస్తే, ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గే దిశగా కొన్ని సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, అణు అంశంపై స్పష్టత రాకపోవడం వల్ల పరిస్థితి ఇంకా అనిశ్చితంగానే ఉంది. -
ఇరాన్ పద్మవ్యూహం... అమెరికాకు అసలైన అగ్నిపరీక్ష!
దాడులు ప్రతి దాడులతో అట్టుడికిపోతున్న పశ్చిమాసియాలో.. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఓ కొలిక్కి రావాలంటే సైనిక చర్య తప్పేలా లేదా? అమెరికా ఒకవేళ సైనిక చర్యకు దిగితే.. ఏయే మార్గాలను ఎంచుకుంటుంది? ఇరాన్పై పూర్తిస్థాయి యుద్ధం అంటే.. అమెరికాకు భారీ నష్టమే కాకుండా.. ఊహించని రిస్క్ కూడా. అసలు ఇరాన్పై సైనిక చర్య అమెరికాకు సాధ్యం అవుతుందా? ప్రాణనష్టం లేకుండా యుద్ధాన్ని ముగించడం అమెరికాకు, దానికి మద్దతు ఇచ్చే ఇజ్రాయెల్కు సాధ్యమేనా?..ఇరాన్ ఓ కంచుకోట..!భౌగోళికంగా ఇరాన్ ఒక సహజమైన కోట లాంటిది. ఆ దేశం చుట్టూ ఎత్తైన పర్వతాలుంటే.. లోపల భయంకరమైన ఎడారులు, ఉప్పు నేలలు ఉన్నాయి. శత్రు సైన్యం ఇరాన్ లోపలి నగరాల వరకు వెళ్లడం దాదాపు అసాధ్యమే. అందుకే, అమెరికా మిలటరీ ప్లానర్స్ ఒక సరికొత్త వ్యూహాన్ని ఆలోచిస్తున్నారు. ఇరాన్ లోపలికి వెళ్లకుండా, కేవలం దాని దక్షిణ తీరప్రాంతాన్ని(Southern Coastline) టార్గెట్ చేయడం! ఎందుకంటే ఇక్కడే ఇరాన్ ఆర్థిక, సైనిక వనరులు ఉన్నాయి. కానీ మిలిటరీ నిపుణులు ఒక మాట అంటారు. ఇరాన్లో అడుగుపెట్టే మొదటి తొలి మైలు దూరాన్ని కిలోమీటర్లలో కొలవవచ్చు, కానీ తదుపరి 100 మైళ్లను సంవత్సరాలలో కొలవాల్సి ఉంటుందనేది దాని సారాంశం..! అందుకే.. ఇరాన్పై ఒత్తిడి పెంచడానికి అమెరికా ముందు కేవలం ఐదు ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే..1. ఖార్గ్ ఐలాండ్ (Kharg Island): ఈ ద్వీపం ఇరాన్కు చమురు విషయంలో గుండెకాయలాంటిది. భూతల దాడులకు దిగితే.. అమెరికా కన్నుపడే మొదటి ప్రాంతం ఇదే. ఇరాన్ దేశ మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో 90% నుంచి 95% ఇక్కడి నుంచే జరుగుతాయి. పర్షియన్ గల్ఫ్లో లోతు తక్కువగా ఉండటం వల్ల, ఇరాన్ తన మెయిన్ల్యాండ్ నుంచి పైప్లైన్ల ద్వారా చమురును ఈ దీవికి తెచ్చి, ఇక్కడ పెద్ద ట్యాంకర్లలో లోడ్ చేస్తుంది. అంటే, ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. దీన్ని ఆక్రమిస్తే ఇరాన్ మోకాళ్లపై పడుతుందని అమెరికా అనుకోవచ్చు. కానీ రిస్క్ ఏంటంటే.. ఇక్కడ దాడి జరిగితే గ్లోబల్ ఆయిల్ మార్కెట్ క్రాష్ అవుతుంది. అంతేకాదు, పక్కనే ఉన్న అరబ్ దేశాల ఆయిల్ ఫీల్డ్స్పై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. ఇది అంతర్జాతీయ సంక్షోభానికి దారితీస్తుంది.2. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ (Strait of Hormuz): ఇక అమెరికా ఎంచుకునేందుకు అవకాశమున్న రెండో మార్గం.. హార్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాకు ఇది అత్యంత కీలకమైన జలసంధి. అయితే దీన్ని కంట్రోల్ చేయడం అమెరికా అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే దీని చుట్టూ ఇరాన్ బలమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుంది. బందర్ అబ్బాస్ నగరం, ఖేష్మ్ ఐలాండ్లను దాటుకుని అమెరికా ఇక్కడ నిలబడటం చాలా కష్టం. ఇరాన్ దగ్గర వందలాది స్పీడ్ బోట్లు, మిస్సైల్ బ్యాటరీలు ఉన్నాయి. అవి అమెరికా నౌకాదళంపై నిరంతరం రాకెట్ల వర్షం కురిపించగలవు. ఇక్కడ ఆపరేషన్ మొదలైతే, అది పరిమితంగా కాకుండా.. ఒక సుదీర్ఘమైన ప్రపంచ ఆర్థిక యుద్ధంగా రూపాంతరం చెందే ప్రమాదం ఉంది.3. మూడు ద్వీపాలు.. ఫైబర్-ఆప్టిక్ డ్రోన్ల ముప్పు: ఇక అమెరికా వద్ద ఉండే మూడో ఆప్షన్.. గల్ఫ్లో ఉండే మూడు చిన్న ద్వీపాలు. అవి.. అబు మూసా, గ్రేటర్ టంబ్, లెస్సర్ టంబ్. అమెరికా సైన్యం వీటిని ఈజీగా ఆక్రమించి.. మిలిటరీ బేస్లు పెట్టొచ్చు. కానీ, అమెరికా సేనలకు అసలు నరకం ల్యాండింగ్ అయ్యాక మొదలవుతుంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది... అదే ఫైబర్-ఆప్టిక్ డ్రోన్. సాధారణ డ్రోన్లను అమెరికా తన టెక్నాలజీతో ‘జామ్’ చేయగలదు. కానీ ఈ ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లు రేడియో సిగ్నల్స్ మీద పనిచేయవు, వీటికి వెనుక 60 కిలోమీటర్ల పొడవైన వైర్ ఉంటుంది. వీటిని జామ్ చేయడం అసాధ్యం! ఇరాన్ కొండల చాటు నుండి ఈ డ్రోన్లను వందల సంఖ్యలో వదిలితే.. ఈ ద్వీపాల్లో ఉండే అమెరికా సైనికులు కేవలం ‘సిట్టింగ్ డక్స్’ అంటే.. సులభమైన టార్గెట్స్ లాగా మిగిలిపోతారు.4. చాబహార్ పోర్ట్ (Chabahar Port): భూతల దాడుల కోసం అమెరికా వద్ద ఉండే నాలుగో ఆప్షన్ చాబహార్ పోర్ట్. దీన్ని భారత్ కూడా అభివృద్ధి చేసింది. ఇరాన్ దగ్గరున్న ఏకైక ఓపెన్ ఓషన్ డీప్-వాటర్ పోర్ట్ ఇది. ఇది గల్ఫ్ దేశాలకు కొంచెం దూరంగా, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే.. ఇక్కడ ల్యాండ్ అవ్వడం అమెరికాకు ఈజీ. కానీ సమస్య ఏంటంటే.. ఇక్కడ అమెరికాకు ఎలాంటి లెవరేజ్ దొరకదు. ఇరాన్ ప్రధాన నగరాలకు, ఆయిల్ ఫీల్డ్స్కు చాబహార్ చాలా దూరంలో ఉంది. దీన్ని పట్టుకుని అమెరికా సాధించేది ఏమీ ఉండదు. ఇక్కడి నుంచి ఇరాన్ను లొంగదీసుకోవాలంటే, అమెరికా సైన్యం దేశం లోపలికి నడుచుకుంటూ వెళ్లాలి. అంటే మళ్లీ ఒక పెద్ద గ్రౌండ్ వార్లోకి దిగాల్సిందే.5. ఖుజెస్తాన్ (Khuzestan)-ప్రాక్సీల వ్యూహం: గ్రౌండ్ వార్కు అమెరికా సిద్ధమైతే.. ఆ దేశం ఎంచుకునే ఐదో ఆప్షన్ ఖుజెస్తాన్ మాత్రమే. అయితే.. ఇది అత్యంత ప్రమాదకరమైన రూట్. ఇది చమురు నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. కువైట్లోని అమెరికా బేస్ నుంచి ఇక్కడికి రావడం అమెరికాకు ఈజీ. ఒకప్పుడు సద్దాం హుస్సేన్ కూడా ఇరాన్పై దాడికి ఇదే రూట్ను వాడుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అమెరికా సైన్యం మాత్రం ఇరాక్లోని బస్రా మీదుగా రావాలి. అక్కడ ఇరాన్ మద్దతు ఉన్న 2 లక్షల మంది 'ప్రాక్సీ మిలిషియా' సైన్యం కాపు కాసి ఉంటుంది. అంటే, అమెరికా సైన్యం ఇరాన్ సరిహద్దును తాకక ముందే.. ఇరాక్లోనే ఒక భారీ అంతర్జాతీయ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ 5 ప్రాంతాలను చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇరాన్లోకి ఎంటర్ అవ్వడానికి అమెరికాకు దారులు ఉన్నాయి. కానీ, గెలవడానికి దారులు లేవు. వెస్ట్రన్ బోర్డర్లో ఉన్న కుర్దిష్ తిరుగుబాటుదారులను వాడుకోవాలని చూసినా.. అది ఇరాన్ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచి దేశాన్ని మరింత ఏకం చేస్తుంది. చివరగా చెప్పాలంటే.. యుద్ధంలో ఎవరు మొదట కొట్టారు? లేదా ఎంత గట్టిగా కొట్టారు? అనేది ముఖ్యం కాదు. చివరి వరకు తట్టుకుని ఎవరు నిలబడ్డారు? అనేదే ముఖ్యం.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు -
మరోసారి యుద్ధమా?.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్
ఒకవైపు ఇరాన్తో శాంతి చర్చలు కొనసాగుతుండగా.. మరోవైపు వైట్హౌస్లో యుద్ధంపై అత్యంత కీలక సమావేశాలు జరిగాయి. ఇరాన్పై మరోసారి భారీ సైనిక దాడులు చేసి "ఈసారి కథ ముగించేయాలా?" అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అత్యున్నత రక్షణాధికారులతో సుదీర్ఘంగా చర్చించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే చివరి క్షణంలో ట్రంప్ యూటర్న్ తీసుకున్నట్లు ఆ కథనం వెల్లడించింది.. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ట్రంప్ ఇటీవల రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్తో అధ్యక్ష భవనంలో పలు దఫాలుగా సమావేశమయ్యారు. ఇరాన్తో కొనసాగుతున్న అణు చర్చలను విరమించి, మళ్లీ పెద్ద ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించాలా? అనే అంశంపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.అమెరికా రక్షణ వర్గాల్లోని కొంతమంది అధికారులు ఈ ఆపరేషన్ను ఫినిష్ ది జాబ్ "Finish the Job"గా అభివర్ణించినట్లు సమాచారం. గత సైనిక చర్యలతో ఇరాన్ సైనిక సామర్థ్యం దెబ్బతిన్న నేపథ్యంలో, మిగిలిన మౌలిక సదుపాయాలనూ పూర్తిగా ధ్వంసం చేసి యుద్ధానికి ముగింపు పలకాలని వారు సూచించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తుది ఆమోదం ఇవ్వలేదు. ఇప్పుడే మరోసారి భారీ యుద్ధానికి వెళ్తే దౌత్య చర్చలు పూర్తిగా దెబ్బతింటాయని, ఇరాన్ అణు కార్యక్రమాన్ని చర్చల ద్వారానే నియంత్రించడం మంచిదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చెప్పింది కూడా సబబేనని అధికారులు భావించినట్లు సదరు వార్తా కథనం పేర్కొంది.అయితే యుద్ధం పూర్తిగా తప్పిపోయిందని భావించే పరిస్థితి లేదని అమెరికా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించినా లేదంటే అమెరికా బలగాలపై దాడులకు పాల్పడినా, పరిమిత స్థాయి సైనిక దాడులు చేపట్టేందుకు ట్రంప్ సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మిలిటరీ ఆప్షన్ను పూర్తిగా పక్కన పెట్టలేదని అధికారులు చెబుతున్నారు.ఇదే సమయంలో ఖతార్ రాజధాని దోహాలో అమెరికా-ఇరాన్ మధ్య మరో విడత పరోక్ష చర్చలు కూడా జరిగాయి. ఈ సమావేశాల్లో హర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకాయానం పునరుద్ధరణ, ఇరాన్కు చెందిన సుమారు 6 బిలియన్ డాలర్ల ఫ్రీజ్డ్ నిధుల్లో కొంత భాగాన్ని విడుదల చేయడం, ఒప్పంద ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం వంటి అంశాల్లో పురోగతి సాధించినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత వంటి ప్రధాన వివాదాలు మాత్రం ఇంకా పరిష్కారానికి రాలేదు.హర్ముజ్ జలసంధి ఇప్పటికీ ఇరు దేశాల మధ్య అతిపెద్ద వివాదంగా కొనసాగుతోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గంపై అధిక నియంత్రణ కోరుతున్న ఇరాన్.. అంతర్జాతీయ నౌకాయానం ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనసాగాలని అమెరికా పట్టుబడుతోంది. ఇదే అంశం భవిష్యత్ చర్చల్లోనూ కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రస్తుతం ట్రంప్ దౌత్య చర్చలకే ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, పరిస్థితులు మారితే మరోసారి భారీ సైనిక చర్యలకు వెనుకాడబోమనే సంకేతాలను కూడా ఇస్తున్నారు. దీంతో ఇరాన్-అమెరికా ఉద్రిక్తత తాత్కాలికంగా తగ్గినట్లే కనిపిస్తున్నా.. యుద్ధ మేఘాలు మాత్రం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
క్రిప్టోతో ట్రంప్ ఆదాయం 1.2 బిలియన్ డాలర్లు
న్యూయార్క్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన సంపదను విపరీతంగా పెంచుకున్నారు. గత ఏడాది క్రిప్టో వ్యాపారాల ద్వారా ఏకంగా 1.2 బిలియన్ డాలర్లు (రూ.11,413 కోట్లు) సంపాదించారు. ఈ విషయాన్ని మంగళవారం విడుదలైన ఒక ఫెడరల్ నివేదిక వెల్లడించింది. ట్రంప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారు నష్టపోయారని, ఆయన మాత్రం లాభపడ్డారని పేర్కొంది. ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేవలం స్టార్టప్లుగా ఉన్న ఈ కొత్త వ్యాపారాలు భారీగా ఆదాయం గడించాయి.ట్రంప్ తన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ వ్యాపారం ద్వారా గవర్నెన్స్ టోకెన్లు సహా కొత్త క్రిప్టో ఉత్పత్తులను విక్రయించి 500 మిలియన్ డాలర్లకు పైగా పొందారు. ట్రంప్ ముఖాన్ని ముద్రించిన స్మారక మీమ్ నాణేల అమ్మకాల ద్వారా మరో క్రిప్టో వ్యాపార సంస్థ అయిన సీఐసీ డిజిటల్ ఎల్ఎల్సీ 600 మిలియన్ డాలర్లకు పైగా ఆర్జించింది.అయితే, అమ్మకాల తర్వాత టోకెన్లు నాణేల విలువ భారీగా పడిపోయింది. ట్రంప్ గత సంవత్సరం తన బ్రాండెడ్ బైబిళ్లు, స్నీకర్లు, ఇతర చిన్న వస్తువులను అమ్మడం ద్వారా మిలియన్ల డాలర్లు ఆర్జించారు. కేవలం బ్రాండెడ్ వాచీల అమ్మకం ద్వారానే ఆయనకు 4.7 మిలియన్ డాలర్లు సమకూరాయి. ట్రంప్ నికర ఆస్తి విలువ 2024లో 2.3 బిలియన్ డాలర్లు ఉండగా, నేడు 6 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఫోర్బ్స్ అంచనా వేసింది. -
ట్రంప్కు మళ్లీ భంగపాటు
చరిత్ర తెలుసుకోకుండా, తన పరిమితులేమిటో గ్రహించకుండా ఎడాపెడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ఆ దేశ సుప్రీంకోర్టు నుంచి మరోసారి చుక్కెదురైంది. అమెరికా గడ్డపై జన్మించినంత మాత్రాన పౌరసత్వం ఇవ్వటం కుదరదంటూ నిరుడు జనవరిలో ట్రంప్ తీసుకొచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వును మంగళవారం కొట్టేస్తూ, 6–3 మెజారిటీతో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తన ఉత్తర్వును ట్రంప్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకే ఈ కేసు వాద ప్రతివాదాల సమయంలో స్వయంగా హాజరయ్యారు. ఒక అమెరికా అధ్యక్షుడు ఇలా రావటం ఇదే తొలిసారి. తమ తప్పుడు నిర్ణయాలవల్ల దేశంలో అస్తవ్యస్థ స్థితిగతులు ఏర్పడినప్పుడు జనం దృష్టి మళ్లించేందుకు లేదా మిన్ను విరిగి మీద పడే అతి గొప్ప చర్యలు తీసుకుంటున్న అభిప్రాయం వారిలో కలిగించేందుకు ఎక్కడైనా ఇలాగే వ్యవహరిస్తారు. అలాంటివారిలో అగ్రగణ్యుడు ట్రంప్. నిజానికి సుప్రీంకోర్టులో రిపబ్లికన్లవైపు మొగ్గుచూపే న్యాయమూర్తుల సంఖ్య అధికంగానే ఉంది. కనుకనే అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికార పరిధిని దాటుతూ తీసుకుంటున్న పలు నిర్ణయాలకు అనుకూలంగా ఈ రెండేళ్లలోనూ తీర్పులు వెలువడ్డాయి. అయితే అనేక దేశాలపై అధిక సుంకాల విధింపు, ఇప్పుడు జన్మతః పౌరసత్వం అంశాల్లో మాత్రం ఆయన నిర్ణయాలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేక పోయింది. ఇది భవిష్యత్తులో అనేకానేక సమస్యలకు దారి తీస్తుందని గ్రహించింది. ట్రంప్ రెండో ఏలుబడి మొదలయ్యాక న్యాయమూర్తులకు పనిభారం బాగా పెరిగింది. అందుకే హేతుబద్ధత లేకుండా, బహిరంగ విచారణైనా జరపకుండా వారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న ఉదంతాలున్నాయి. అక్రమ వలసల పేరుచెప్పి జాతి, భాష వంటి కారణాలతో వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేస్తూ వందలమంది భద్రతా బలగాలు విరుచుకుపడటం, అరెస్టులు చేయటం వగైరాలను సుప్రీంకోర్టు నిర్మొహమాటంగా సమర్థించింది. ఆరోగ్య సంరక్షణ గ్రాంట్లపై కోత విధించటం, జాతి, లింగపరమైన మైనారిటీల విషయంలో తీసుకున్న నిర్ణయాలకూ న్యాయమూర్తులు మద్దతుపలకటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆసియాలో మనతో సహా పలు దేశాల్లోనూ... యూరప్, ఆఫ్రికా ఖండ దేశాల్లోనూ జన్మతః పౌరసత్వం ఇవ్వరు. అయితే అమెరికాలో కొన్ని చారిత్రక కారణాలవల్ల ఇందుకు సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 పొందుపరిచారు. అమెరికా వలసవచ్చిన వారి తోనే నిర్మాణమైంది. అంతర్యుద్ధం ముగిసి, బానిసత్వం రద్దుకావటం వంటి పరిణామా లతో 1857లో నల్లజాతీయులు అమెరికా పౌరులు కాలేరంటూ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. నల్లజాతీయుల్ని పీల్చిపిప్పిచేసి సంపద పెంచుకున్న అమెరికా ఇంత కృతఘ్న తతో ఉండటాన్ని ప్రశ్నిస్తూ ఆందోళనలు జరిగాక 1868లో ఈ 14వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. నల్లజాతికి చెందిన మాజీ బానిసలు, వారికి పుట్టిన సంతానం దేశ పౌరులే అవుతారని ఈ సవరణ స్పష్టం చేసింది. చైనా వలస కుటుంబానికి ఇది వర్తించబోదని ప్రభుత్వం నిరాకరించినప్పుడు అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఇక్కడి పౌరులే అవుతారని 1898లో సుప్రీంకోర్టు తెలియజేసింది. ట్రంప్ ఉత్తర్వు ఏడాదిన్నరగా లక్షలాదిమందిని అనిశ్చితిలో పడేసింది. రెండేళ్ల క్రితం అమెరికా సెన్సెస్ బ్యూరో దేశంలో 52 లక్షలమంది భారతీయులున్నారని చెప్పింది. నిరుడు వెలువడిన లెక్క ప్రకారం హెచ్–1బీ వీసాలున్నవారిలో 71 శాతం మంది భారతీయులే. వీరందరికీ తాజా తీర్పు ఊరటనిస్తుంది. అయితే గ్రీన్కార్డుకు దరఖాస్తుచేసి ఎదురుచూస్తున్నవారికి ఈ తీర్పువల్ల ఉపశమనం దొరకదు. అక్కడ జన్మించినవారి పిల్లలు దేశ పౌరులుగా మారినా, తల్లిదండ్రులకు ఎదురుచూపులు తప్పవు. తమ వీసా దరఖాస్తుల్లో అబద్ధం చెప్పి దేశంలో ప్రవేశించినవారి ఆచూకీ తెలుసుకోవటం, వారిపై ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించటం తమ ప్రాధాన్యతంటూ అమెరికా న్యాయశాఖ చెప్పటం సహజంగానే గుబులు రేపుతోంది. తీర్పు వెలువడ్డాక కూడా కొత్తగా చట్టం తీసుకొస్తానంటూ ట్రంప్ చెప్పటం ఆయన మొండివైఖరికి నిదర్శనం. ఇప్పటికైనా వివేకంతో మెలగటం, అసలైన సమస్యలపై దృష్టిసారించటం అవసరమని ఆయన గ్రహించాలి. -
నాటోతో అమెరికాకు తల్లాక్?
ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్.. క్లుప్తంగా నాటో.. ఇప్పుడు నాటో-అమెరికా మధ్య ఇడుపు కాయితం.. అదే విడాకులు జరగనున్నాయా? నాటో నుంచి అమెరికా పూర్తిగా వైదొలిగిపోతుందా? అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ సైనిక అత్యవసర పరిస్థితి లేదా యుద్ధం వస్తే.. నాటో కూటమికి ఎలాంటి సైనిక సహాయం పంపాలనే నియమాలను ఆయన మార్చేశారు. దీని సారాంశం ఏమిటంటే.. నాటో దేశాలకు ఇకపై అమెరికా మద్దతు చాలా చాలా తక్కువగా ఉంటుంది.నాటోకు ఈ సపోర్ట్ ఉండదు..•విమాన వాహక నౌకలు (Carriers) ఉండవు•క్యారియర్ యుద్ధ విమానాలు ఉండవు•ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు (Precision munitions) ఉండవు•లాజిస్టికల్ సరఫరా (రవాణా సదుపాయాలు) ఉండదు•శాటిలైట్ మద్దతు కూడా చాలా పరిమితంగా ఉంటుంది.చైనాతో యుద్ధానికి సిద్ధం??అమెరికా అధికారిక ప్రకటన ప్రకారం.. చైనాతో ఏ క్షణంలోనైనా యుద్ధం రావచ్చనే ఉద్దేశంతో అమెరికా పనిచేయాలని హెగ్సెత్ భావిస్తున్నారు. అందుకే.. చైనాతో పోరాడటానికి అవసరమయ్యే ఏ సైనిక వనరులను కూడా ఇతర ప్రాంతాలకు తరలించకూడదని నిర్ణయించారు. ఇక అనధికారికంగా చూస్తే ఇరాన్ యుద్ధం తర్వాత, ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ యుద్ధాలు చేసే సామర్థ్యాన్ని అమెరికా కోల్పోయింది. అన్ని వనరులను కేవలం చైనా కోసమే కేటాయించాలని అమెరికా నిర్ణయించుకున్నప్పుడు, ఇక ప్రపంచంలో మరెక్కడా జోక్యం చేసుకోలేదు. ఇరాన్ యుద్ధాన్ని ట్రంప్ ప్రభుత్వం నడిపిన తీరు వల్ల, తూర్పు అర్ధగోళం నుంచి అమెరికా తన పట్టును కోల్పోతుందనేది నిర్వివాదాంశం..! రాజకీయంగా ట్రంప్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసింది. అదేంటంటే.. ఐరోపా (Europe) ఇక తనను తాను కాపాడుకోవాలే తప్ప.. అమెరికా సాయం ఉండదు.భవిష్యత్ ఏమిటి?అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో.. నాటో కూటమి పేపర్పై మాత్రమే మిగిలి ఉంటుంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే అమెరికా చేతులెత్తేస్తే, ఐరోపా దేశాల వద్ద లేని ప్రత్యేకమైన అమెరికన్ ఆయుధాలు రావని తేలిపోతే.. ఇక నాటో కూటమికి అర్థమే ఉండదు. దీంతో, నాటో కథ ముగిసినట్లే అవుతుంది!. 1949 నుండి నాటో ప్రణాళిక ఎలా ఉందంటే అమెరికా కొన్ని పెద్ద సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుంది, ఐరోపా దేశాలు వాటిని చేయవు. ఐరోపా దేశాలు ఎప్పుడూ అమెరికాపై ఆధారపడేలా చేయడం కోసమే యూఎస్ఏ అలా చేసింది. ఒకవేళ యుద్ధం వస్తే, వారి సైన్యాలన్నింటినీ అమెరికానే కమాండ్ చేయాలనేది దాని ఆలోచన. కానీ ఆ వ్యవస్థ ఇప్పుడు ముగిసిపోయింది. ఐరోపాలో అమెరికా తన సైనిక ప్రభావాన్ని కోల్పోయింది.ఐరోపాకు కింకర్తవ్యమ్..?ఇప్పుడు ఐరోపా దేశాలు తమను తాము రక్షించుకోవడానికి సిద్ధమవుతున్నందున, అమెరికాతో ఉన్న 'ఇంటర్ఆపరబిలిటీ' (Interoperability) అంటే.. కలిసి పనిచేసే సామర్థ్యం దెబ్బతింటుంది. అమెరికా ఆయుధ వ్యవస్థలు చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి, ఎక్కువ కాలం మన్నికగా ఉండటానికి డిజైన్ అయ్యాయి. కానీ ఐరోపా దేశాలు ఎదుర్కొనే యుద్ధాలు అలాంటివి కావు. ఒక యుద్ధంలో తమ సైన్యాన్ని నడిపించే అమెరికాతో కలిసి పనిచేయడం కోసమే ఐరోపా దేశాలు ఇంతకాలం అమెరికా ఆయుధాలను కొనుగోలు చేశాయి. కానీ అమెరికా సైన్యమే రానప్పుడు, ఇక ఆ ఆయుధాలను వాడటంలో ఎలాంటి అర్థం లేదు. ప్రస్తుత డ్రోన్ల యుగంలో.. అమెరికా తరహా ఆయుధ వ్యవస్థలను నిర్మించుకోవడానికి ఐరోపాకు 10 నుండి 15 ఏళ్ల సమయం లేదు. అంత వేగంగా వాటిని నిర్మించలేరు. కాబట్టి, వారు ఉక్రెయిన్ తరహా ఆయుధాలను తయారు చేసుకుంటారు. వీటికి బ్యాకప్గా బహుళ-దేశాల అణ్వాయుధ రక్షణను ఏర్పాటు చేసుకుంటారు.ఇది ఎలా సాగుతుందో కాలమే చెప్పాలి. సరిగ్గా ఒక సంవత్సరంలోనే ఐరోపా, అమెరికా సైన్యాలు కలిసి పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల వారు కలిసి పనిచేయాల్సి వచ్చినా, వేర్వేరు కమాండ్ స్ట్రక్చర్స్, వేర్వేరు వ్యూహాలతో పనిచేయాల్సి ఉంటుంది. వాషింగ్టన్ తీసుకున్న ఈ రాజకీయ నిర్ణయం వల్ల నాటో కూటమికి చరమగీతం పాడినట్లవ్వడమే కాకుండా.. ఐరోపా దేశాలు తీసుకునే ఆయుధ కొనుగోలు నిర్ణయాలు కూడా ఈ కూటమిని శాశ్వతంగా ముగించేలా చేస్తాయి. నాటో (NATO) ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది. కానీ ఇప్పుడు అమెరికా ఒక వ్యూహాత్మక విచ్ఛిన్నం (Strategic breakdown), సరికొత్త ప్రపంచ సమీకరణాల వైపు అడుగులు వేస్తోంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఐరోపా, అమెరికా ఒకే వైపు కాకుండా, రెండు వేర్వేరు ధ్రువాలుగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు. -
ఒక దారి మూసుకుపోయింది.. ఇప్పుడు ప్లాన్-బీ రెడీ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'బర్త్రైట్ సిటిజన్షిప్' నిర్ణయంపై అత్యున్నత న్యాయస్థానం బ్రేక్ వేసింది. అయితే ట్రంప్ వెంటనే ప్లాన్-బీ అమల్లోకి తెచ్చారు. "కోర్టు అడ్డుకున్నా.. నేను ఆగను" అన్నట్లుగా కొత్త వ్యూహాన్ని ప్రకటించారు. ఇంతకీ దాన్ని అధిగమించేందుకు ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నారు?అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వం కల్పించే 'బర్త్రైట్ సిటిజన్షిప్' (Birthright Citizenship) విధానాన్ని పరిమితం చేయాలన్న ట్రంప్ ప్రయత్నాలకు అమెరికా సుప్రీంకోర్టు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. అక్రమంగా లేదంటే తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్న విదేశీయుల పిల్లలకు కూడా పుట్టుకతోనే పౌరసత్వ హక్కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఆయన పెద్ద షాకే తలిగిందని అంతా అనుకున్నారు. అయితే ఇక్కడితో ఆగే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు."కోర్టు తీర్పు నిరాశ కలిగించినా.. నా దారి నాకుంది" అంటూ కొత్త వ్యూహాన్ని ప్రకటించారు. దీంతో ట్రంప్ తదుపరి అడుగు ఏంటన్న దానిపై అమెరికా రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది.ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజే జన్మహక్కు పౌరసత్వం (Birthright Citizenship)పై కీలక కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు, హక్కుల సంఘాలు కోర్టులో సవాల్ చేశాయి. దిగువ కోర్టులు ఇప్పటికే ఆ ఉత్తర్వును నిలిపివేయగా.. తాజాగా అమెరికా సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని సమర్థించింది.సుప్రీంకోర్టు ఏమంది?..ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని ధర్మాసనం 6-3 మెజారిటీతో కీలక తీర్పు ఇచ్చింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ (Fourteenth Amendment) ప్రకారం అమెరికా భూభాగంలో జన్మించిన దాదాపు ప్రతి వ్యక్తికీ పౌరసత్వ హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. అక్రమంగా లేదంటే తాత్కాలికంగా అమెరికాలో ఉన్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు కూడా అమెరికా చట్టాల పరిధిలోనే ఉంటారని, అందువల్ల వారికి పుట్టుకతోనే పౌరసత్వం లభిస్తుందని కోర్టు పేర్కొంది. ఈ హక్కును తొలగించాలంటే కేవలం అధ్యక్ష ఉత్తర్వు సరిపోదని, రాజ్యాంగ పరమైన మార్పులు అవసరమనే విషయాన్ని కూడా తీర్పు స్పష్టం చేసింది.ట్రంప్ స్పందన ఏంటి?సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "ఈ తీర్పు అమెరికాకు మంచిది కాదు. కానీ దీనిని కాంగ్రెస్లో చట్టం ద్వారా సులభంగా సరిచేయవచ్చు. రాజ్యాంగ సవరణ అవసరం లేదు. కాంగ్రెస్ ఈ రోజే పని ప్రారంభించాలి. వారికి నా పూర్తి మద్దతు ఉంటుంది" అని పేర్కొన్నారు. జన్మహక్కు పౌరసత్వం వల్ల అమెరికాపై భారీ ఆర్థిక భారం పడుతోందని, ప్రస్తుత విధానం దేశానికి అన్యాయమని ఆయన మరోసారి వాదించారు.అంతేకాదు.. సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ మరో సంచలన వ్యాఖ్య చేశారు. "చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు అభినందనలు" అంటూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్గా పౌరసత్వం లభించే ప్రస్తుత విధానం అక్రమ వలసలను, 'బర్త్ టూరిజం'ను ప్రోత్సహిస్తోందని ట్రంప్ మరోసారి ఆరోపించారు. ఈ తీర్పుతో చైనా సహా ఇతర దేశాల పౌరులకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్న ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్య చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జస్టిస్ డిపార్ట్మెంట్ ఏమందంటే..సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటికీ అక్రమంగా అమెరికా పౌరసత్వం పొందేందుకు జరుగుతున్న 'బర్త్ టూరిజం' (ప్రసవం కోసం అమెరికాకు వెళ్లడం)పై చర్యలు కొనసాగుతాయని అమెరికా న్యాయశాఖ స్పష్టం చేసింది. చట్టంలోని లోపాలను ఉపయోగించుకుని పౌరసత్వం పొందేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఇక ముందు ఏం జరగొచ్చు?సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు అమలు దాదాపు నిలిచిపోయినట్లే. అయితే జన్మహక్కు పౌరసత్వాన్ని పరిమితం చేసేలా కాంగ్రెస్లో కొత్త చట్టం తీసుకురావాలని ట్రంప్ పట్టుదలగా ఉన్నారు. అయితే రాజ్యాంగంలోని 14వ సవరణకు విరుద్ధంగా అలాంటి చట్టం నిలబడుతుందా? లేదంటే మళ్లీ కోర్టుల్లోనే నిలిచిపోతుందా? అన్నది ఇప్పుడు అమెరికా రాజకీయాలు, న్యాయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. -
‘పుట్టుకతో పౌరసత్వం’ సబబే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసల విధానానికి దేశ అత్యున్నత న్యాయస్థానంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు భారీ ఊరట లభించింది. అమెరికా గడ్డపై జన్మించినవారికి పౌరసత్వం ఇవ్వడం సమంజసమేనని అమెరికా సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ‘జన్మతః పౌరసత్వం’వెసులుబాటుకు కళ్లెం వేస్తూ డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరిలో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా నివసిస్తున్న వారికి పుట్టిన పిల్లలు అమెరికా పౌరులు కారని తేల్చిచెబుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది.జన్మతః పౌరసత్వం విస్తృత భావనను సమర్థించింది. తల్లిదండ్రులు అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా ఉన్నప్పటికీ.. వారికి పుట్టిన పిల్లలకు 14వ రాజ్యాంగ సవరణ అమెరికా పౌరసత్వాన్ని కల్పిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ట్రంప్ ఆర్డర్ను నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు 6–3 తీర్పుతో సమర్థించింది. ఈ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఇక్కడి పౌరులేనని(చాలా పరిమితమైన మినహాయింపులతో) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చరిత్రాత్మక తీర్పునిచ్చారు.అంతర్యుద్ధం తర్వాత ఆమోదించిన 14వ సవరణపై సుదీర్ఘకాలంగా ఉన్న అవగాహనపై, ఇటీవలి ఫెడరల్ చట్టాలపైనా ఆధారపడి ఈ తీర్పును వెలువరించారు. ‘‘అçప్పుడైనా, ఇప్పుడైనా పౌరసత్వం అంటే హక్కులను కలిగి ఉండే హక్కు. అంటే రాజకీయ సమాజంలో స్వేచ్ఛగా పాలుపంచుకునే హక్కు. 14వ రాజ్యాంగ సవరణను రూపొందించినవారు.. ఈ దేశంలో స్వేచ్ఛగా జన్మించిన ప్రతి వ్యక్తికీ పౌరసత్వం హామీని వర్తింపజేశారు. ఆ వాగ్దానాన్ని ఈ రోజు మనం నిలబెట్టుకుంటున్నాం’’అని న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ తమ తీర్పులో వెల్లడించారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను ఆరుగురు జడ్జీలు వ్యతిరేకించగా, ముగ్గురు సమర్థించారు. ‘బర్త్ టూరిజం’ఆందోళనకరం: డి.జాన్ సౌర్ అమెరికాలో జన్మించిన విదేశీయుల పిల్లలకు పౌరసత్వం విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ట్రంప్ నిర్ణయాన్ని యూఎస్ సొలిసిటర్ జనరల్ డి.జాన్ సౌర్ సమర్థించారు. జన్మతః పౌరసత్వ నిబంధనను ప్రధానంగా పూర్వకాలంలో బానిసలుగా ఉన్నవారికి, వారి పిల్లలకు పౌరసత్వం మంజూరు చేయడానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. అమెరికాలో ‘బర్త్ టూరిజం’విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. పుట్టే పిల్లలకు అమెరికా పౌరసత్వం కోసమే విదేశీయులు ప్రత్యేకంగా ఇక్కడికి వస్తున్నారని విమర్శించారు.అయితే, ఇందులో నిజం ఎంతో చెప్పాలని న్యాయమూర్తులు ప్రశ్నించగా, కచ్చితమైన గణాంకాలు లేవని అంగీకరించారు. అమెరికా రాజ్యాంగం, న్యాయపరమైన నిర్ణయాలు, వ్యాఖ్యానాలు జన్మతః పౌరసత్వాన్ని బలంగా సమర్థిస్తున్నాయని పిటిషనర్లు వాదించారు. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు అమల్లోకి వస్తే తమ పౌరసత్వ హక్కులకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ట్రంప్ ఉత్తర్వులు ప్రతికూల పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరించారు. అమెరికాలో ఏటా జన్మంచే దాదాపు 2,50,000 మంది శిశువులపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని, అలాగే లక్షలాది కుటుంబాలు తమ శిశువుల పౌరసత్వ హోదాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు వెల్లడించారు. ట్రంప్కు ఈ ఏడాది రెండో పరాభవం సుప్రీంకోర్టులో ఈ కేసు మౌఖిక వాదనల సందర్భంగా ఒకసారి డొనాల్డ్ ట్రంప్ స్వయంగా హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఎదుట హాజరైన తొలి సిట్టింగ్ అమెరికా అధ్యక్షుడిగా రికార్డుకెక్కారు. కానీ, కేసులో విచారణ ముగియక ముందే అక్కడినుంచి వెళ్లిపోయారు. అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఈ ఏడాది ట్రంప్ కీలక విధానపరమైన నిర్ణయాన్ని రద్దు చేయడం ఇది రెండోసారి. ప్రపంచవ్యాప్తంగా విధించిన విస్తృతమైన సుంకాలను కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో కొట్టివేసింది. తాజాగా ట్రంప్ పరిపాలనా యంత్రాంగానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.జన్మతః పౌరసత్వం అనేది వలస వ్యవస్థ దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆయన విధించిన ఆంక్షలను పలు దిగువ న్యాయస్థానాలు నిలిపివేశాయి. దాంతో అవి అమెరికాలో ఎక్కడా అమల్లోకి రాలేదు. జన్మతః పౌరసత్వం విషయంలో కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉందని ట్రంప్ ముందే గ్రహించారు. ‘బుద్ధిలేని న్యాయమూర్తులు’అని ఆక్షేపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పుట్టబోయే శిశువులకు అమెరికా పౌరసత్వం దక్కడం కోసం ప్రసవించడానికి అమెరికాకు ఇతరదేశాల ధనిక గర్భిణి స్త్రీలపైనా విమర్శలు ఎక్కుపెట్టారు.విభేదించిన ముగ్గురు జడ్జీలు ట్రంప్ ఉత్తర్వును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు విభేదించారు. జస్టిస్ క్లారెన్స్ థామస్, జస్టిస్ నీల్ గోర్సచ్, జస్టిస్ శామ్యూల్ అలిటో ఈ తీర్పును ఆక్షేపించారు. 14వ రాజ్యాంగ సవరణను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు తీవ్రమైన పొరపాటు చేసిందని అన్నారు. కేవలం బిడ్డకు జన్మనిచ్చు, వెంటనే స్వదేశాలకు తిరిగి వెళ్లే ‘బర్త్ టూరిస్టుల’ను ప్రోత్సహిస్తారా? అని నిలదీశారు. కోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుందని, ఇది విచారకరమని పేర్కొన్నారు. ఈ మేరకు వారు 91 పేజీల అసమ్మతి లేఖ రాశారు. -
వైట్హౌస్ బాల్రూమ్ కాంట్రాక్ట్లో ట్రంప్ హస్తం!
వాషింగ్టన్: వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రాజెక్టులను నాణ్యతతో నిర్మించే సంస్థలను బిడ్డింగ్ ద్వారా ఎంపికచేసి ఆ సంస్థకే కాంట్రాక్ట్ కట్టబెట్టాలనే నిబంధనలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చరమగీతం పాడారని, ఆ కాంట్రాక్ట్ అప్పగింతలో ఆయన స్వయంగా కలుగజేసుకున్నారని ‘ది వాషింగ్టన్ పోస్ట్’మంగళవారం సంచలన కథనాన్ని ప్రచురించింది. అమెరికా అధ్యక్ష భవనంలోని బాల్రూమ్ తూర్పు విభాగాన్ని పునర్నిర్మించేందుకు గత ఏడాది ఇచ్చిన కాంట్రాక్ట్ వివరాలను రహస్యంగా ఉంచాలనే ఉద్దేశంతో ‘ఎగ్జిక్యూటివ్ రెసిడెన్స్’కార్యాలయం ద్వారా ఈ తతంగం నడిపించారని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది.దాదాపు రూ.4,730 కోట్ల(500 మిలియన్ డాలర్ల) విలువైన ప్రాజెక్ట్ను ఫలానా సంస్థకే ఎందుకు అప్పగించారనే ప్రశ్నకు ట్రంప్ సర్కార్ బదులు చెప్పకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోందని తాజాగా అమెరికా మీడియా కోడైకూస్తోంది. బిడ్డింగ్ లేకుండానే క్లార్క్ కన్స్ట్రక్షన్ అనే సంస్థకు ఈ నిర్మాణ కాంట్రాక్ట్ను కట్టబెట్టారు. ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి ఆ సంస్థతో సంప్రతింపులు జరిపి కాంట్రాక్ట్ మొత్తాన్ని ఖరారుచేశారని తెలుస్తోంది. వర్జీనియాకు చెందిన ఈ కంపెనీకి ఇప్పటికే 3 శాతం ప్రాఫిట్ మార్జిన్ ఇచ్చినట్లు తాజాగా బహిర్గతమైన కాంట్రాక్ట్ ఒప్పందం ద్వారా వెల్లడైంది. కాంక్రీట్ వంటి ముడి పదార్థాల ధరలను స్వయంగా ట్రంప్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.అయితే తాను మెచ్చిన సంస్థకే కాంట్రాక్ట్ కట్టబెట్టి ప్రతిగా కిక్బ్యాక్ రూపంలో ఆర్థికలబ్ది పొంది ఉంటారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బిడ్డింగ్ ప్రక్రియ చేపట్టకుండా కాంట్రాక్ట్ అప్పగించడం, వివరాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు ఎగ్జిక్యూటివ్ రెసిడెన్స్ కార్యాలయాన్ని రంగంలోకి దింపడంతో కాంట్రాక్ట్ ప్రక్రియలో పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈస్ట్వింగ్ బాల్రూమ్ నిర్మాణం అనేది ట్రంప్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్. ఇందులో 250 అడుగుల విస్తీర్ణంలో అర్ధచంద్రాకార కమాను, నేషనల్ మాల్ రిఫ్లెక్టింగ్ సరస్సు, లింకన్ మెమోరియల్లో అతిపెద్ద నడువా నిర్మించాలని తలపోశారు. ఇందుకయ్యే వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చుచేయకుండా సంపన్నులు దేశం కోసం విరాళంగా ఇవ్వాలని ట్రంప్ గతంలో కోరారు. తర్వాత 100 కోట్ల డాలర్ల నిధులు మంజూరు చేయాలని చట్టసభలను కోరారు. అయితే మధ్యంతర ఎన్నికల్లో ప్రజావ్యతిరేకత రావచ్చనే భయంతో అధికార రిపబ్లికన్లు ఈ ప్రతిపాదనకు అడ్డు చెప్పారు. -
అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్కు ఎదురుదెబ్బ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు యూఎస్ సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో పుట్టే ప్రతి బిడ్డకు లభించే సహజ సిద్ధమైన ‘బర్త్రైట్ సిటిజన్షిప్’ (పుట్టుకతో వచ్చే పౌరసత్వం) హక్కును రద్దు చేస్తూ ట్రంప్ గతంలో జారీ చేసిన వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ తీర్పు అమెరికాలో స్థిరపడిన లక్షలాది మంది భారతీయులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు,ప్రవాస భారతీయ కుటుంబాలకు ఊరటనిచ్చింది.అమెరికా భూభాగంపై జన్మించే పిల్లలకు రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ఆటోమేటిక్గా పౌరసత్వం లభిస్తుందని, దీనిని మార్చే అధికారం అధ్యక్షుడి ఉత్తర్వులకు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అక్రమ వలసలను అడ్డుకునే పేరుతో, తాత్కాలిక వీసాలపై (హెచ్1బీ వీసా) ఉన్న విదేశీయుల పిల్లలకు కూడా పౌరసత్వం రద్దు చేయాలన్న ట్రంప్ యత్నాలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది.భారతీయులకు ఎందుకు బిగ్ రిలీఫ్?అమెరికాలో గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. ఒకవేళ ట్రంప్ తెచ్చిన ఆర్డర్ అమలులోకి వచ్చి ఉంటే.. అమెరికాలో పుట్టే భారతీయుల పిల్లలకు పౌరసత్వం లభించేది కాదు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో భారతీయ దంపతులకు అమెరికాలో పుట్టే పిల్లల పౌరసత్వానికి ఎలాంటి ఢోకా లేదని తేలిపోయింది. -
మోదీ సరిగా నిద్రపోరు.. ఆయన నా టైపే!
భారత్–అమెరికా సంబంధాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత అనుబంధం ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా ఆ ఇద్దరి స్నేహానికి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు.భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (USISPF) లీడర్షిప్ సమ్మిట్లో మాట్లాడిన అమెరికా రాయబారి సెర్గియో గోర్.. ట్రంప్-మోదీ స్నేహంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కొన్ని నెలల క్రితం మియామిలో జరిగిన యూఎఫ్సీ ఈవెంట్ సందర్భంగా ట్రంప్తో కలిసి బ్యాక్స్టేజ్లో ఉన్నప్పుడు.. ఒక్కసారిగా "ప్రధాని మోదీకి ఫోన్ చేద్దాం" అని ట్రంప్ చెప్పారన్నారు. అయితే.. అప్పటికే భారత్లో ఉదయం 6 గంటలు అవుతుందని.. బాగా వేకువజామున అని తాను చెప్పగా, ట్రంప్ వెంటనే..‘‘ఆయన(మోదీ) ఈపాటికే లేచి ఉంటారు. ఆయన నాలాగే. నిద్ర తక్కువే (He's like me). సరిగా నిద్రపోరు’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చినట్లు గోర్ వివరించారు. అయితే ఆ రోజు కాల్ చేయకపోయినా.. మరుసటి రోజు ఇద్దరూ మాట్లాడుకున్నారని తెలిపారు. అయితే ఈ సంఘటనలో ప్రధాన విషయం ఫోన్ కాల్ కాదని.. ఇద్దరు నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహబంధమేనని గోర్ వ్యాఖ్యానించారు."ఎవరైనా నిజమైన స్నేహితులైతే ప్రతి విషయం ముందుగానే షెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ట్రంప్ నిజంగానే ప్రధాని మోదీని తన స్నేహితుడిగా భావిస్తారు" అని ఆయన అన్నారు.భారత్తో బంధానికి ట్రంప్ ప్రాధాన్యంభారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ట్రంప్ ఉన్నారని సెర్గియో గోర్ స్పష్టం చేశారు. ఇటీవల వాషింగ్టన్లో ట్రంప్తో దాదాపు రెండు గంటలపాటు సమావేశమైన సందర్భంగా కూడా ఆయన భారత్ గురించి ఎంతో అభిమానంతో మాట్లాడారని చెప్పారు. ట్రంప్కు తన గత భారత పర్యటన ఇప్పటికీ గుర్తుండిపోయే అనుభవమని, భారత్పై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని గోర్ తెలిపారు. రెండోసారి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా ట్రంప్ భారత్ను సందర్శిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది ట్రంప్ భారత్లో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే.మొదటి టర్మ్లోనే బలపడిన స్నేహంట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలోనే మోదీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికాలో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమం, భారత్లో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' సభలు ఆ ఇద్దరి స్నేహానికి ప్రతీకగా నిలిచాయి. అప్పటి నుంచి రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఇండో-పసిఫిక్ వ్యూహం వంటి కీలక రంగాల్లో రెండు దేశాల సహకారం మరింత బలపడిందని అధికారులు చెబుతున్నారు.భవిష్యత్తుపై ఆశలువచ్చే రెండేళ్లు భారత్-అమెరికా సంబంధాలకు అత్యంత కీలకమని సెర్గియో గోర్ అభిప్రాయపడ్డారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతిక రంగాల్లో మరింత స్పష్టమైన ఫలితాలు సాధించడంపై ఇరు దేశాలు దృష్టి పెట్టాయని చెప్పారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు రాబోయే దశాబ్దాల పాటు ద్వైపాక్షిక సంబంధాలకు బలమైన పునాది వేస్తాయని ఆయన పేర్కొన్నారు. -
వెనెజువెలా: పాపం వాళ్లు… శిథిలాల్లో ప్రాణాల కోసం పోరాటం!
ఒక దేశం నుంచి బలవంతంగా పంపించారు. పోనీలే.. స్వస్థలానికి చేరామన్న ఊపిరి కూడా తీసుకోకముందే ప్రకృతి రూపంలో వచ్చిన విధ్వంసం వారిని మింగేసింది. డిపోర్ట్ చేసిన కొద్ది గంటల్లోనే భారీ భూకంపం వారిని శిథిలాల కిందకి లాక్కెళ్లింది. కొందరు ప్రాణాలతో బయటపడగా.. వంద మందికి పైగా ఇప్పటికీ కనిపించకుండా పోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతోంది.వెనెజువెలాను కుదిపేసిన జంట భూకంపాలు ఇప్పటివరకు కనీసం 1,719 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించారు. నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగెస్ ప్రకారం 5,034 మంది గాయపడ్డారు, ఇంకా వేలాది మంది ఆచూకీ లేని పరిస్థితి నెలకొంది. వారం గడిచినా.. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గత బుధవారం సాయంత్రం 7.2 మరియు 7.5 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపాలు.. దేశ చరిత్రలోనే అత్యంత ప్రాణాంతక విపత్తులుగా మారాయి. లా గ్వైరా సహా పలు ప్రాంతాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. భవనాలు కూలిపోవడంతో రోడ్లు, హోటళ్లు, నివాసాలు శిథిలాలుగా మారాయి. అయితే అప్పటి నుంచి ప్రకంపనలు ఆగకపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటిదాకా 500కు పైగా ప్రకంపనలు(ఆఫర్ట్ షాక్స్) సంభవించినట్లు తెలుస్తోంది. ఈ విపత్తు సమయంలోనే అమెరికా నుంచి డిపోర్ట్ చేయబడిన 146 మంది వెనిజులా వలసదారులు దేశానికి చేరుకున్నారు. వారిని లా గ్వైరాలోని హోటల్లో తాత్కాలికంగా ఉంచగా, కొన్ని గంటల్లోనే అదే ప్రాంతాన్ని భూకంపం తీవ్రంగా దెబ్బతీసింది.డిపోర్టేషన్ తర్వాతే విధి పరీక్షడొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక.. వలస నియంత్రణ చర్యల్లో భాగంగా కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. అక్రమ చొరబాటు దారులంటూ బేడీలు వేయించి మరీ యుద్ధ విమానాల్లో.. అత్యంత దయనీయమైన పరిస్థితుల నడుమ స్వస్థలాలకు పంపించి వేస్తున్నారు. అలా డిపోర్టేషన్ ఫ్లైట్లలో భాగంగా వచ్చిన ఈ వెనెజువెలా వలసదారులు, స్వదేశానికి తిరిగొచ్చిన వెంటనే ఈ విపత్తులో చిక్కుకున్నారు. ఇది ఇప్పుడు అంతర్జాతీయంగా మానవతా చర్చకు దారితీస్తోంది.ఆ 100 మంది ఎక్కడ?హోటల్ శిథిలాల నుంచి కొందరు బయటపడగా, మరికొందరు ఐదు కిలోమీటర్ల దూరం నడిచి సహాయం కోరారు. కానీ 100 మందికి పైగా వలసదారుల ఆచూకీ ఇంకా తెలియకపోవడం ఆందోళన పెంచుతోంది. వాళ్లంతా ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉంటారని చెబుతున్న అధికారులు.. వాటిని తొలగించే పనిని కొనసాగిస్తున్నారు. లిస్బెత్ పోర్టిల్లో అనే శరణార్థి సహా కొందరు వలసదారులు శిథిలాల నుంచి బయటపడి ప్రాణాలతో తప్పించుకున్నారు. “చుట్టూ అరుపులు, పరుగులు, దుమ్ము… ఎవరూ ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి. కొందరు దుస్తులు, మరికొందరు చెప్పుల్లేకుండా ప్రాణభయంతో పరుగులు తీశారు” అని ఆమె వివరించింది. రెండో అంతస్తులో ఉన్న గదిలోనే ఆమె శిథిలాల కింద ఇరుక్కున్నప్పటికీ అదృష్టవశాత్తు బయటపడింది. “నేను మళ్లీ పుట్టాను… దేవుడు నాకు రెండో అవకాశం ఇచ్చాడు” అంటూ ఆమె కన్నీళ్లతో చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి.మృతుల సంఖ్య పెరుగుతున్న భయంప్రభుత్వ లెక్కల ప్రకారం 1,719 మంది మరణించగా, 15,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇంకా వేలాది మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి మరింత విషమించవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి (UN) 10,000 బాడీ బ్యాగ్స్ పంపించాలని నిర్ణయించింది. 24 దేశాలు కలిసి 521 టన్నుల సహాయాన్ని పంపించాయి. 2,700కు పైగా రెస్క్యూ సిబ్బంది, 86 డాగ్ యూనిట్లు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. అమెరికా కూడా తన సహాయాన్ని 300 మిలియన్ల డాలర్లకు పెంచింది. -
ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మెలోని స్ట్రాంగ్ రిప్లై
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్రంగా స్పందించారు. తాను అమెరికాకు వ్యతిరేకిని కాదని.. అలాగని ఎవరి ముందూ మోకరిల్లే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల ఆమెను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో మెలోని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇటాలియన్ మీడియాలో ఓ కార్యక్రమంలో మెలోని ఇటలీ-అమెరికా సంబంధాలపై మాట్లాడారు. పాశ్చాత్య దేశాలన్నీ ఐక్యంగా ఉంటేనే బలంగా ఉంటాయని నమ్మే వ్యక్తినని.. పాశ్చాత్య కూటమిలో ఇటలీ మరింత బలంగా ఉంటుందని నమ్ముతానన్న మెలోని... దాని కోసమే నిరంతరం శ్రమిస్తాను. అయితే, బలమైన సంబంధాలు నిజాయితీగా మాట్లాడుకోవడంపైనే ఆధారపడి ఉంటాయని.. తాను చాలా స్పష్టంగా, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తినంటూ మెలోని పేర్కొన్నారు.మెలోనిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇటలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగా ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. జూన్ 21, 22 తేదీల్లో మయామిలో జరగాల్సిన బిజినెస్ ఫోరమ్కు ఆయన హాజరుకావాల్సి ఉంది. తజాని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "ప్రధాని జార్జియా మెలోనిపై ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన తీవ్రమైన, అవమానకరమైన వ్యాఖ్యలు ఇటలీ మొత్తాన్ని కించపరిచేలా ఉన్నాయి. అందుకే నా అమెరికా పర్యటనను రద్దు చేసుకుంటున్నానంటూ ప్రకటించారు.ఇటలీకి చెందిన 'లా7' ఛానల్ ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణం. ఎవియాన్ సదస్సు సందర్భంగా మెలోనితో జరిగిన సంభాషణపై ఆ ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ట్రంప్ విచిత్ర సమాధానం ఇచ్చారు. ‘‘మీ ప్రధాని ఎలా ఉన్నారు? ఆమె నాతో ఒక ఫోటో దిగడానికి ఎంతగానో ప్రాధేయపడ్డారు. ఆమెకు నాతో ఫోటో కావాలని చాలా ఆశపడ్డారు. నిజానికి నేను ఫోటో దిగకపోవచ్చు. కానీ ఆమెను చూసి జాలిపడి ఒప్పుకున్నాను’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. నేను ఆమెతో మాట్లాడినందుకు బహుశా ఆమె సంతోషంగా ఉండవచ్చు. కానీ ఆమెతో మాట్లాడాల్సిన అవసరమైతే నాకు లేదు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. -
అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ట్రంప్కు భారీ బూస్ట్
అమెరికా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. స్వతంత్ర ఫెడరల్ ఏజెన్సీల అధిపతులను ఎలాంటి కారణం చెప్పుకుండానే తొలగించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. 91 ఏళ్ల నాటి కీలక న్యాయసూత్రాన్ని పక్కనబెట్టింది. తద్వారా అమెరికా అధ్యక్షుడి అధికారాలను గణనీయంగా విస్తరించేందుకు మార్గం సుగమం చేసింది. అదే సమయంలో.. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతకు మాత్రం రక్షణ కల్పించింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో గవర్నర్ లీసా కుక్ను వెంటనే తొలగించేందుకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు వేసింది. ఈ రెండు తీర్పులు కలిసి అమెరికాలో అధ్యక్షుడి అధికారాలు, కేంద్ర బ్యాంకు స్వతంత్రతపై కొత్త చర్చకు తెరలేపాయి.స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం ఈ తీర్పులు వెలువడ్డాయి. ఈ తీర్పుపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్ష అధికారాలకు సంబంధించిన అత్యంత కీలక తీర్పుల్లో ఇదొకటని పేర్కొన్నారు. అయితే లీసా కుక్ కేసులో సాంకేతిక కారణాలతో మాత్రమే తీర్పు వచ్చిందని, ఆమెపై తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని సోషల్ మీడియాలో వెల్లడించారు.దశాబ్దాల.. న్యాయసూత్రానికి ముగింపుఫెడరల్ ఏజెన్సీల అధిపతుల్ని తొలగించే కేసులో.. 6-3 మెజారిటీతో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. 1935లో వచ్చిన హంపేరీస్ ఎగ్జిక్యూటర్ Humphrey's Executor తీర్పును రద్దు చేసింది. ఆ తీర్పు ప్రకారం ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) వంటి స్వతంత్ర సంస్థల సభ్యులను అధ్యక్షుడు విధానపరమైన విభేదాల కారణంగా తొలగించలేడు. ఇప్పుడు ఆ పరిమితిని తొలగిస్తూ.. అలాంటి రక్షణలు రాజ్యాంగంలోని అధికారాల విభజన సూత్రానికి విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. దీంతో అధ్యక్షుడికి స్వతంత్ర ఫెడరల్ సంస్థలపై మరింత నియంత్రణ లభించినట్టైంది. ఏయే సంస్థలపై ప్రభావం?ఈ తీర్పు ప్రభావం కేవలం ఫెడరల్ ట్రేడ్ కమిషన్కే పరిమితం కాదు. నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ (NLRB), మెరిట్ సిస్టమ్స్ ప్రొటెక్షన్ బోర్డ్, కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ వంటి అనేక స్వతంత్ర సంస్థల బోర్డు సభ్యులను కూడా అధ్యక్షుడు అవసరమైతే పదవి నుంచి తొలగించే అవకాశం ఏర్పడింది. దీంతో భవిష్యత్తులో వైట్హౌస్ ప్రభావం ఈ సంస్థలపై మరింత పెరిగే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఫెడరల్ రిజర్వ్కు మాత్రం.. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు గుండెకాయగా భావించే ఫెడరల్ రిజర్వ్ విషయంలో సుప్రీంకోర్టు భిన్నమైన వైఖరి తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్ ఫెడ్ గవర్నర్ లీసా కుక్ను వెంటనే తొలగించాలన్న అభ్యర్థనను 5-4 మెజారిటీతో తిరస్కరించింది. చట్టం కల్పించిన విధివిధానాలు పాటించకుండా ఆమెను తొలగించలేరని స్పష్టం చేసింది. కేసు పూర్తయ్యే వరకు లీసా కుక్ పదవిలో కొనసాగవచ్చని ఆదేశించింది.ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ తన తీర్పులో ఫెడరల్ రిజర్వ్ చరిత్రను ప్రస్తావిస్తూ.. ఈ సంస్థ రాజకీయ జోక్యానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రత్యేక రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. అధ్యక్షుడి ఇష్టానుసారంగా గవర్నర్లను తొలగించే అవకాశం ఉంటే, వడ్డీ రేట్లపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. లీసా కుక్పై ఆరోపణలు ఏమిటి?2025 ఆగస్టులో ట్రంప్, లీసా కుక్పై మార్ట్గేజ్ మోసం ఆరోపణలు చేస్తూ ఆమెను తొలగించే ఉత్తర్వులు జారీ చేశారు. మిషిగన్, జార్జియా రాష్ట్రాల్లోని రెండు ఇళ్లను ఒకేసారి ప్రధాన నివాసంగా చూపించి గృహ రుణాల్లో అక్రమ ప్రయోజనాలు పొందారని ఆరోపించారు. అయితే ఇవి నిరూపితం కాని ఆరోపణలేనని, అసలు ఉద్దేశం తనను వడ్డీ విధానంపై రాజకీయ ఒత్తిడికి లోను చేయడమేనని లీసా కుక్ ఆరోపించారు. తనపై ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని కూడా స్పష్టం చేశారు.ట్రంప్ లక్ష్యం వేరే.. తన రెండో అధ్యక్ష పదవీకాలం ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్ వడ్డీ రేట్లు వేగంగా తగ్గించాలని ఫెడరల్ రిజర్వ్పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తక్కువ వడ్డీ రేట్లతో ప్రభుత్వ రుణభారం తగ్గడమే కాకుండా, గృహ, వాహన రుణాలు కూడా చౌకవుతాయని ఆయన వాదిస్తున్నారు. కానీ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేట్లను తగ్గించడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ విభేదాల నేపథ్యంలోనే కుక్, అలాగే మాజీ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్పై ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి పెంచిందని విమర్శలు వచ్చాయి. పావెల్పై దర్యాప్తు కూడా..ఫెడరల్ రిజర్వ్ మాజీ ఛైర్మన్ జెరోమ్ పావెల్పై కూడా ట్రంప్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఫెడ్ ప్రధాన కార్యాలయ భవనాల పునరుద్ధరణ వ్యయాల పేరుతో విచారణ చేపట్టినా, అది వడ్డీ రేట్లపై ప్రభావం చూపేందుకు చేసిన ప్రయత్నమేనని పావెల్ ఆరోపించారు. అనంతరం కోర్టు జోక్యంతో ఆ విచారణ నిలిచిపోయి, చివరకు అమెరికా న్యాయశాఖ దానిని ఉపసంహరించుకుంది.ఒకవైపు అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారాలను మరింత బలోపేతం చేస్తూనే, మరోవైపు ఫెడరల్ రిజర్వ్ వంటి అత్యంత కీలక ఆర్థిక సంస్థ రాజకీయ జోక్యానికి గురికాకుండా రక్షణ కల్పించింది. అమెరికా సుప్రీం కోర్టు వెల్లడించిన ఈ రెండు తీర్పులు.. అమెరికా రాజ్యాంగ వ్యవస్థలో కీలక మలుపుగా భావిస్తున్నారు. అధ్యక్ష అధికారాలు ఎంతవరకు ఉండాలి? స్వతంత్ర సంస్థల స్వేచ్ఛ ఎంతవరకు కాపాడాలి? అనే చర్చలకు ఈ తీర్పు కొత్త దిశ చూపిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
నేడు దోహాలో చర్చలు
దుబాయ్: ఇరాన్పై ఓవైపు దాడులు చేస్తూ మరోవైపు చర్చలకు సిద్ధపడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘దాడులకు తట్టుకోలేక మాతో సమావేశానికి ఇరాన్ సిద్ధపడింది. అందుకే మంగళవారం ఇరాన్ ప్రతినిధి బృందంతో సమావేశంకాబోతున్నాం. ఖతర్ రాజధాని నగరం దోహాలో ఈ సమావేశం జరగనుంది’’అని ట్రంప్ ప్రకటించారు. హార్మూజ్లో విదేశీ చమురునౌకపై ఇరాన్ దాడిచేసిందని ప్రతిగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణి స్థావరాలపై అమెరికా దాడిచేయడం, ఇందుకు ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్లపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడటంతో మళ్లీ పరస్పర దాడులు మొదలయ్యాయని పశి్చమాసియాలో ప్రబలిన భయాందోళనల మధ్య తదుపరి దశ చర్చలున్నాయంటూ ట్రంప్ సోమవారం ప్రకటన చేయడం గమనార్హం. అయితే ట్రంప్ ప్రకటనకు భిన్నంగా ఇరాన్ స్పందించింది. మంగళవారం చర్చల కోసం ఎలాంటి షెడ్యూల్ లేదు అని ఇరాన్ సీనియర్ మధ్యవర్తి కాజెమ్ ఘరిబాబాడీ స్పష్టంచేశారు. మరోవైపు చర్చల ప్రతిపాదనల్లో పేర్కొన్న ప్రకారం ఖతర్ తమకు చెందిన గతంలో స్తంభింపజేసిన 6 బిలియన్ కోట్ల డాలర్ల ఆస్తులను త్వరలో విడిపించనుందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోమవారంప్రకటించారు. హార్మూజ్ జలసంధిపై తమకు ఇంకా పట్టు ఉందని, ఒప్పందానికి ఇరాన్ ప్రజల మద్దతు ఉందని తెలియజేసేందుకే పెజెష్కియాన్ ఈ ప్రకటన చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మంగళవారం చర్చలు ఉంటాయని ఈ అంశంలో మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న పాకిస్తాన్ సోమవారం ప్రకటించింది. సాంకేతిక అంశాలపై మరి కొద్ది రోజుల్లో చర్చలు ప్రారంభమవుతాయని అమెరికా సైతం మరో ప్రకటనలో పేర్కొంది. -
'ఇరాన్ను లేకుండా చేస్తాం'.. 'నరకం చూపిస్తాం'!
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది రోజులకే.. ఇరు దేశాలు మళ్లీ పరస్పర దాడులకు దిగడంతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్పై దాడి జరిగిందని ఆరోపిస్తూ అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దీనికి ప్రతిగా అమెరికా గల్ఫ్ ప్రాంతంలోని సైనిక స్థావరాలపై విరుచుకుపడుతోంది. హర్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న పనామా జెండా కలిగిన కికు (KIKU) అనే చమురు ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్తో దాడి చేసిందని అమెరికా ఆరోపించింది. సుమారు 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును తీసుకెళ్తున్న ఈ నౌక దెబ్బతిన్నప్పటికీ సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. దీనికి ప్రతిగా అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్లోని 10 కీలక సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, సముద్ర మైన్లను మోహరించే సామర్థ్యాలపై లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించే అవకాశం ఇచ్చినా.. ఇరాన్ మళ్లీ దాడులకు పాల్పడిందని అమెరికా ఆరోపించింది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల విరమణను ఇరాన్ పదేపదే ఉల్లంఘిస్తోందని ఆరోపించిన ఆయన, అవసరమైతే అమెరికా యుద్ధాన్ని పూర్తిస్థాయిలో ముగిస్తుందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి వస్తే.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనే దేశమే ఇక ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. హర్ముజ్ జలసంధిపై నియంత్రణ పూర్తిగా తమదేనని మరోసారి స్పష్టం చేసిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ.. తమ నిబంధనలను ఉల్లంఘించే నౌకలు ఉద్రిక్తతలకు కారణమవుతాయని హెచ్చరించారు. అదే సమయంలో, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు త్వరలోనే నరకాన్ని అనుభవిస్తాయి అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నేవీ కమాండర్ హెచ్చరించారు. మరోవైపు పశ్చిమాసియాలో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత విస్తరించాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్బేస్, బహ్రెయిన్లోని అమెరికా ఐదో నౌకాదళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే కువైట్ సైన్యం తమ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుంటున్నాయని తెలిపింది. గల్ఫ్ దేశాల్లో సైరన్లు మోగించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.అయితే తీవ్ర సైనిక ఉద్రిక్తతల మధ్య కూడా దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. స్విట్జర్లాండ్లో శాంతి చర్చలపై అవగాహన ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ దాడులతో.. 60 రోజుల వ్యవధిలో శాంతి చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. అయితే.. మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్, పాకిస్తాన్ల విజ్ఞప్తితో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు చర్చలకు ముందుకొచ్చినట్లు సమాచారం అందుతోంది. మంగళవారం లేదంటే ఈ వారంలోనే దోహాలో సమావేశమై హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు, సముద్ర భద్రత, కాల్పుల విరమణ అమలుపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలు సఫలమైతే ప్రాంతంలో యుద్ధ ముప్పు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. మరోవైపు ఇరు దేశాల నుంచి వస్తున్న హెచ్చరికలు మధ్యప్రాచ్యాన్ని మరోసారి అగ్నిగుండంలా మార్చే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. -
ట్రంప్ నిర్ణయానికి సవాల్.. మమ్దానీ సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: అమెరికాలో వలసదారుల అంశంపై రాజకీయ వివాదం మరోసారి తీవ్రరూపం దాల్చింది. వలసదారుల డిపోర్టేషన్ అంశంపై కేంద్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య ఉద్రిక్తత మళ్లీ పెరిగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వలస విధానానికి సంబంధించి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తీర్పును అమలు చేయబోమని మమ్దానీ ప్రకటించారు.వలస విధానాల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించేలా అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ట్రంప్ సర్కార్కు అనుకూలంగా తీర్పును వెల్లడించింది. హైతీ, సిరియా దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులకు ఇప్పటివరకు లభిస్తున్న టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (TPS) రక్షణను రద్దు చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ, ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది ఒక్కసారిగా డిపోర్టేషన్ ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పును ట్రంప్ ప్రభుత్వం "చట్టానికి దక్కిన విజయం"గా అభివర్ణిస్తుండగా.. మానవ హక్కుల సంఘాలు మాత్రం "వేలాది మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయం" అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తీర్పు తర్వాత డిపోర్టేషన్ ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఈ పరిణామంపై న్యూయార్క్ మేమర్ మమ్దానీ తాజాగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. న్యూయార్క్ నగరం సాంక్చువరీ సిటీ విధానాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. ఫెడరల్ డిపోర్టేషన్ చర్యలకు నగర యంత్రాంగం సహకరించబోదని స్పష్టం చేశారు. హైతీ మరియు సిరియా వలసదారుల రక్షణకు కట్టుబడి ఉన్నామని బాంబు పేల్చారు. అవసరమైతే చట్టపరమైన పోరాటం చేస్తామని పేర్కొన్నారు. దీంతో, ఫెడరల్ ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాల మధ్య విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.సాంక్చువరీ సిటీ విధానం అంటే? అమెరికాలో వలసదారులపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో తరచుగా వినిపిస్తున్న పదం “సాంక్చువరీ సిటీ విధానం” (Sanctuary City Policy). ఇది ఫెడరల్ వలస అమలు సంస్థలతో సహకారాన్ని పరిమితం చేసి, వలసదారులకు స్థానిక స్థాయిలో కొంత రక్షణ కల్పించే విధానం. స్థానిక నగర ప్రభుత్వాలు అమలు చేసే విధానం ఇది. ఇందులో భాగంగా స్థానిక పోలీసులు వలస స్థితిని అడగరు. చిన్న కేసుల్లో వలస ఆధారంగా డిటైన్ చేయరు. ఫెడరల్ డిపోర్టేషన్ అభ్యర్థనలకు పూర్తిగా సహకరించరు. అయితే తీవ్రమైన నేరాల కేసుల్లో మాత్రం ఫెడరల్ ఏజెన్సీలకు సమాచారం ఇవ్వవచ్చు.TPS అంటే ఏంటంటే.. 1990లో అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, తీవ్ర రాజకీయ అస్థిరత లేదంటే మానవతా సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాల పౌరులకు అమెరికా తాత్కాలిక రక్షణ(Temporary Protected Status.. TPS) కల్పిస్తుంది. ఈ హోదా పొందిన వ్యక్తులను వారి స్వదేశాలకు బలవంతంగా పంపించరు. అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇది గ్రీన్కార్డు లేదంటే పౌరసత్వానికి మార్గం కాదు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ప్రభుత్వం ఈ హోదాను రద్దు చేయవచ్చు. అయితే 2010లో సంభవించిన భారీ భూకంపం తర్వాత హైతీ పౌరులకు టీపీఎస్ ఇచ్చారు. 2012లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడి ప్రజలకు కూడా ఈ రక్షణ కల్పించారు. అనంతరం ఆయా దేశాల్లో పరిస్థితులు పూర్తిగా మెరుగుపడకపోవడంతో వరుస ప్రభుత్వాలు ఈ గడువును పొడిగిస్తూ వచ్చాయి.ఎంతమందిపై ప్రభావమంటే.. ఈ తీర్పు తక్షణ ప్రభావం.. సుమారు 3.5 లక్షల మంది హైతీ పౌరులు, 6,100 మంది సిరియా పౌరులపై పడనుంది. వీరంతా ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ, కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. అయితే దీని ప్రభావం ఇంతటితో ఆగే అవకాశం లేదు. ప్రస్తుతం 17 దేశాలకు చెందిన సుమారు 13 లక్షల మంది టీపీఎస్ కింద అమెరికాలో నివసిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన తీర్పు ఆధారంగా.. భవిష్యత్తులో ఇతర దేశాల TPSలను కూడా రద్దు చేసే అవకాశాలు పెరిగాయని వలస నిపుణులు చెబుతున్నారు. -
మాట వినకపోతే లేపేస్తా..! ఇరాన్ కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక
-
వలసదారుల ఏరివేత.. రంగంలోకి ‘ట్రంప్ నమ్మిన బంటు’
లాస్ఏంజిల్స్: అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేతను మరింత ఉధృతం చేసేందుకు దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) తదుపరి డైరెక్టర్గా ఓక్లహోమాకు చెందిన సీనియర్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి ‘లాన్స్ ష్రోయర్’ను నామినేట్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తాత్కాలిక బాధ్యతల్లో ఉన్న డేవిడ్ వెంచురెల్లా స్థానంలో ష్రోయర్ రానున్నారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ష్రోయర్ ఒక నిజమైన దేశభక్తుడని, అక్రమ వలసదారులను దేశం నుంచి వెళ్లగొట్టడంలో ఆయనకు అపారమైన క్షేత్రస్థాయి అనుభవం ఉందని ప్రశంసించారు.ట్రంప్ నమ్మిన బంటు.. 29 ఏళ్ల సుదీర్ఘ అనుభవంలాన్స్ ష్రోయర్ ఓక్లహోమాలో దాదాపు 29 ఏళ్లకు పైగా లా ఎన్ఫోర్స్మెంట్ రంగంలో సేవలందించారు. అమెరికా మెరైన్ కార్ప్స్లో పనిచేసిన అనుభవం ఉన్న ఆయన ఆ తర్వాత ఓక్లహోమా హైవే పెట్రోల్లో ట్రూపర్, లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్గా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2016, 2020, 2024 దేశాధ్యక్ష ఎన్నికల్లో తాను ఓక్లహోమాలోని మొత్తం 77 కౌంటీల్లో విజయం సాధించానని గుర్తుచేసిన ట్రంప్.. అలాంటి రాష్ట్రంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ష్రోయర్, నేరస్థులైన అక్రమ వలసదారులను ఏరిపారేయడానికి సరైన వ్యూహకర్త అని కొనియాడారు.వలసల నియంత్రణలో కీలక వ్యూహకర్తలాన్స్ ష్రోయర్ కెరీర్లో అత్యంత ముఖ్యమైన అంశం ఇమ్మిగ్రేషన్ అమలు భాగస్వామ్యాలు. ఓక్లహోమాలో ‘287(జీ) ఒప్పందాల’ను విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ ఒప్పందాల ద్వారా స్థానిక పోలీసులకు ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేసే అధికారాలు లభిస్తాయి. ఇదే విషయాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ, ‘దారుణమైన నేరాలకు పాల్పడే క్రిమినల్స్, హంతకులు, అత్యాచార నిందితులు డ్రగ్స్ స్మగ్లర్లను ఎన్నడూ చూడని స్థాయిలో నిర్బంధించి, దేశం నుండి బహిష్కరించే సత్తా ష్రోయర్కు ఉంది’ అని స్పష్టం చేశారు. అలాగే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్వేన్ ముల్లిన్తో కలిసి ఆయన ఐసీఈ బృందాన్ని సమర్థవంతంగా నడిపిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.ఆందోళనల నడుమ నియామకంట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐసీఈ చర్యలపై తీవ్ర ప్రజా విమర్శలు, చట్టపరమైన చిక్కులు ఎదురవుతున్న సమయంలో ఈ నియామకం జరగడం గమనార్హం. గత 500 రోజుల్లో ఐసీఈ కస్టడీలో దాదాపు 52 మంది మరణించడం, నిర్బంధ కేంద్రాలలో వైద్య నిర్లక్ష్యం, రద్దీ వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మిన్నియాపాలిస్లో జరిగిన ఐసీఈ దాడుల సమయంలో ఇద్దరు అమెరికన్ పౌరులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. అయినప్పటికీ, విమర్శలను పక్కనబెట్టి అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇది కూడా చదవండి: ముడి చమురుకు బై బై.. భారత్లోకి జపాన్ మిథేన్ పవర్ -
ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..
ఇరాన్, అమెరికా యుద్ధం.. రెండోరోజు అప్డేట్స్.. యూఎస్, గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక.. 👉అమెరికా దాడులపై స్పందించిన ఇరాన్. ఇంకా దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా దళాలు ఇరాన్ లక్ష్యాలపై వైమానిక దాడులు చేయగా, దానికి ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు మరియు మిత్రదేశాలపై ప్రతిదాడులు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ అధికార వర్గాలు అమెరికా చర్యలను “ఉద్రిక్తత పెంచే దాడులు”గా అభివర్ణించాయి.👉ఇరాన్ ప్రకటనలో గల్ఫ్ దేశాలకు కూడా స్పష్టమైన హెచ్చరిక ఇచ్చింది. అమెరికా తమ భూభాగాన్ని లేదా సైనిక స్థావరాలను ఉపయోగిస్తే, దాని ఫలితాలు “విపరీతంగా ఉంటాయి” అని హెచ్చరించింది.👉ఇరాన్ హెచ్చరికల ముఖ్యాంశం గల్ఫ్ దేశాలపై కూడా దృష్టి సారించింది. అమెరికా సైనిక చర్యలకు సహకరిస్తే, ఆ దేశాలు కూడా పరిణామాలు ఎదుర్కొంటాయని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి.గల్ప్లో సైరన్ల మోత.. 👉పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్పై వైమానిక దాడులు నిర్వహించింది. దక్షిణ ఇరాన్లోని సిరిక్ (Sirik), బందర్-ఎ-లెంగెహ్ (Bandar-e Lengeh), ఖెష్మ్ (Qeshm) ద్వీపం ప్రాంతాల్లో ఉన్న సైనిక లక్ష్యాలపై దాడులు జరిగినట్లు అమెరికా అధికారులు తెలిపారు.👉అమెరికా దాడులు పునరావృతం కాకుండా అడ్డుకునేందుకు హార్మూజ్ జలసంధి తమకు కీలక వ్యూహాత్మక ఒత్తిడి సాధనమని ఇరాన్ స్పష్టం చేసింది. జలసంధిపై తమ ప్రభావాన్ని వదులుకుంటే, అమెరికా మరోసారి దాడులు చేసేందుకు అవకాశం కల్పించినట్టే అవుతుందని టెహ్రాన్కు చెందిన అబ్బాస్ అస్లానీ తెలిపారు.👉అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం బలప్రయోగం ద్వారా హార్మూజ్ జలసంధిలో పరిస్థితులను మార్చాలని ప్రయత్నిస్తోందని, అయితే అలాంటి చర్యలు టెహ్రాన్కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు.👉ఇజ్రాయెల్–లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్-గ్వీర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం హెజ్బొల్లాకు మళ్లీ ఊపిరి పోసినట్టేనని, ఆ సంస్థను పూర్తిగా నిర్మూలించాల్సింది పోయి కాల్పుల విరమణతో అవకాశం కల్పించారని విమర్శించారు. లెబనాన్ సైన్యం హెబ్బొల్లాను నియంత్రించగలదన్న వాదన ప్రమాదకర భ్రమే అని ఆయన వ్యాఖ్యానించారు.👉అమెరికా–ఇరాన్ తాజా ఘర్షణలతో టెహ్రాన్ ప్రజల్లో మళ్లీ యుద్ధ భయాలు పెరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఎంత సున్నితంగా ఉందో ఈ పరిణామాలు చూపిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 👉అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను హెచ్చరిస్తూ, దాడులు కొనసాగితే సైనికంగా పూర్తిగా ముగిస్తాం అంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని, అందుకే ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా పేర్కొంది.U.S. Navy and Air Force fighter jets conducted strikes tonight on 10 Iranian military targets at multiple locations in and near the Strait of Hormuz for Iran's drone attack on M/T Kiku. pic.twitter.com/Z0TLZRqmF6— U.S. Central Command (@CENTCOM) June 28, 2026👉ఇదిలా ఉండగా, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లతో అమెరికా మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది. బహ్రెయిన్లో వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగగా, కువైట్ తన గగనతల రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసి శత్రు డ్రోన్లు, క్షిపణులను ఎదుర్కొంటున్నట్లు ప్రకటించింది.👉బహ్రెయిన్పై డ్రోన్ దాడి జరిగినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. బహ్రెయిన్లో అమెరికా నౌకాదళానికి చెందిన ఫిఫ్త్ ఫ్లీట్ స్థావరం ఉండటంతో ఈ ఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది. దేశ సార్వభౌమాధికారంపై దాడిగా దీనిని బహ్రెయిన్ ఖండించింది.👉ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద భద్రతా పరిస్థితి మరింత దిగజారింది. అక్కడ ప్రయాణించే వాణిజ్య నౌకలకు ముప్పు పెరగడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.👉ప్రస్తుతం ఇరు దేశాలు మరిన్ని సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇవ్వడంతో, మధ్యప్రాచ్యంలో పరిస్థితి గంట గంటకూ ఉద్రిక్తంగా మారుతోంది. అంతర్జాతీయ సమాజం మాత్రం సంయమనం పాటించాలని ఇరు దేశాలకు పిలుపునిస్తోంది.👉ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో కొన్ని అమెరికా మిత్రదేశాల గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు సమాచారం. అయితే కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పూర్తి నష్టం, ప్రాణనష్టం వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. -
‘‘తనను ఫూల్ చేశారని అనుకుంటున్న ట్రంప్’’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏంచేస్తారో పూర్తిగా ఎవరూ ఊహించలేరని మాజీ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్ చెప్పారు. భారత్లో అత్యంత అనుభవజ్ఞులైన దౌత్యవేత్తల్లో తల్మీజ్ అహ్మద్ ఒకరు. పశ్చిమ ఆసియా, గల్ఫ్, ప్రపంచ వ్యూహాత్మక వ్యవహారాల్లో దశాబ్దాల అనుభవం ఉంది. తాజాగా, ఆయన ఓ ఇంటర్వ్యూలో ఇరాన్ యుద్ధం గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.ఇరాన్పై తక్కువ సమయంలో విజయం సాధిస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తప్పుదోవ పట్టించారని అన్నారు. చివరకు యుద్ధం ఊహించిన దానికంటే ఎక్కువ కాలం సాగిందని ఆయన చెప్పారు. అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు. ట్రంప్ ఇలా భావిస్తున్నారుట్రంప్ ఇప్పుడు ఇలా అనుకుంటున్నారని తాను భావిస్తున్నట్లు తల్మీజ్ అహ్మద్ చెప్పారు. ‘‘నెతన్యాహు తనను అందరి ముందు వెర్రివాడిని చేశానని ట్రంప్ అనుకుంటున్నారు. ఎల్ డొరాడో (అపార సంపద, అసాధ్యమైన గొప్ప విజయానికి ప్రతీకగా వాడే పదం) చూపిస్తానని హామీ ఇచ్చాడని, చివరికి తనకు ఏమీ ఇవ్వలేదని ట్రంప్ అనుకుంటుండొచ్చు. తన దేశంలోనే అవమానం ఎదుర్కొంటున్నానన్న భావన ట్రంప్లో ఉంది. అమెరికా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. తాను అగస్టస్ సీజర్లా ఉండాల్సిందని ట్రంప్ భావిస్తుండొచ్చు’’ అని అనుకుంటున్నారని తల్మీజ్ అహ్మద్ చెప్పారు.ట్రంప్ ఆశలు నెరవేరకుండా అడ్డొస్తే ఎవరిపై అయినా ఇలాంటి కోపమే బయటపడుతుందని తల్మీజ్ అహ్మద్ అన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్పై ఆయన చూపిన ఆగ్రహం గుర్తుందా? యుద్ధం ముగియడానికి ట్రంపే కారణమని చెప్పలేదని, తనకు గుర్తింపు ఇవ్వలేదని ఆయన మనపై నింద వేస్తున్నారు. మనం తనతో కలవకపోవడం వల్లే తనకు నోబెల్ బహుమతి రాలేదని ఆయన నమ్ముతున్నారు’’ అని తల్మీజ్ అహ్మద్ తెలిపారు.‘‘డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా ఎవరి ఊహకూ అందని విధంగా వ్యవహరించే వ్యక్తి. ఆయన ఎవరైనా ఇచ్చే సలహాలు తీసుకుంటారా లేదా అన్నది కూడా స్పష్టంగా తెలియదు.ఇప్పటి వరకూ ఆయన వైఖరి ఏమిటంటే... ఆయన బెంజమిన్ నెతన్యాహు ప్రభావానికి సులభంగా లోనయ్యారు. నెతన్యాహు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. అధ్యక్షుడి బలహీనతలను ఆయన చాకచక్యంగా ఉపయోగించుకున్నారు. మొదటి పదవీకాలంలోనూ ఆయన ఇదే చేశారు. అధ్యక్షుడి మనస్తత్వం ఆయనకు పూర్తిగా తెలుసు. ఎప్పుడు ఏ మాట చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. తన గొప్పతనంపై అతిగా నమ్మకం పెట్టుకుని, అసాధారణ విజయాలే సాధిస్తానని భావించే మానసిక ధోరణి ట్రంప్ది. ఇరాన్లో మీకు కొత్త పాలనను తీసుకొస్తాను. గత 40 ఏళ్లలో వరుసగా వచ్చిన అమెరికా అధ్యక్షులు సాధించలేనిది మీరు సాధిస్తారు అని అమెరికా అధ్యక్షుడికి నెతన్యూహు చెప్పారు. నెతన్యాహూ ఇజ్రాయెల్ నిఘా సంస్థ సేకరించిన అత్యంత సవివర పత్రాలను డొనాల్డ్ ట్రంప్ ముందు ఉంచారు. ఆ పత్రాల ప్రకారం, ఇరాన్ రహస్యంగా మరోసారి అణు ఆయుధాన్ని అభివృద్ధి చేసిందని, అది సిద్ధం కావడానికి ఇంకొన్ని వారాలే మిగిలి ఉన్నాయని చెప్పారు. ఇది వినడానికి నవ్వొచ్చే విషయం. ఎందుకంటే గత 20 ఏళ్లలో కనీసం 10 లేదా 15 సార్లు నెతన్యాహు ఇదే మాట చెప్పారు.ప్రతి సారి వరుసగా వచ్చిన అమెరికా అధ్యక్షులు ఆ వాదనను తిరస్కరించారు. అమెరికా నిఘా సంస్థల అంచనాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇరాన్ వద్ద ఎలాంటి ఆయుధ కార్యక్రమం లేదని అవి స్పష్టంగా చెప్పాయి. అయినా ఫిబ్రవరి 11న జరిగిన సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ను నెతన్యాహు నేరుగా ఒప్పించగలిగారు. అలా ఆయనను తన వైపు తిప్పుకున్నారు’’ అని తెలిపారు.అతనే ప్రమాదకరమైన శత్రువు మొదటి రోజే వారి అత్యున్నత నాయకుల్లో 40 మందిని (సుప్రీం లీడర్ సహా) హతమారుస్తానని, దాంతో పాలన మార్పునకు మార్గం సుగమమవుతుందని ట్రంప్నకు నెతన్యాహు తెలిపారని తల్మీజ్ అహ్మద్ అన్నారు. ‘‘4 లేదా 5 రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తుందని, దీర్ఘకాల ఘర్షణ ఉండదని అన్నారు. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకూ ఉన్న అత్యంత గొప్ప అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారని అన్నారు. జిమ్మీ కార్టర్ నుంచి ఇప్పటి వరకూ ఏ అమెరికా అధ్యక్షుడూ సాధించలేనిది సాధిస్తారని తెలిపారు. ప్రపంచ వేదికపై అమెరికా ఇచ్చిన అత్యంత గొప్ప సైనిక నాయకుడిగా, అత్యంత గొప్ప రాజనీతిజ్ఞుడిగా ట్రంప్ గర్వంగా నిలుస్తారని నెతన్యాహు అన్నారు. మీ ఎదుట మెగాలోమానియా (తన గొప్పతనంపై అతిగా నమ్మకం పెట్టుకుని అసాధారణ విజయాలే సాధిస్తానని భావించే మానసిక ధోరణి) ఉన్న వ్యక్తి ఉంటే, అతనే మీకు ఉండే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. ఎందుకంటే అతనిలో భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఆ అర్థంలో చూస్తే ఆయన హేతుబద్ధంగా ఆలోచించే సాధారణ మనిషి కాదు. ట్రంప్ మెగాలోమానియా ఉన్న వ్యక్తి. ఇప్పుడు జరిగినది కూడా అదే. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిలో రగులుతున్న కోపానికి కారణం ఇదే’’ అని తల్మీజ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. -
వచ్చే ఏడాది భారత్కు ట్రంప్
వాషింగ్టన్: భారత్, అమెరికా బంధంలో మరో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. వచ్చే ఏడాది (2027) ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో పర్యటించనున్నట్లు యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధికారికంగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం అత్యంత అద్భుతమైనదని కొనియాడిన రూబియో.. ఇరు దేశాల దౌత్య సంబంధాలు ‘ఫెంటాస్టిక్’ అంటూ అభివర్ణించారు. వాషింగ్టన్ డీసీలో ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన, ఈ మెగా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తాను ఈ ఏడాది చివరికల్లా భారత్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు.ఫైనల్ స్టేజ్లో ట్రేడ్ డీల్ట్రంప్ పర్యటన కేవలం ఒక విజిట్ మాత్రమే కాదు, దీని వెనుక భారీ వాణిజ్య వ్యూహం దాగి ఉంది. గత 16 నెలల్లో మొదటిసారిగా ఫ్రాన్స్లోని ఎవియాన్లో జరిగిన జీ7 (G7) సమ్మిట్ వేదికగా మోదీ, ట్రంప్ ఇరుపక్షాల మధ్య చర్చలు జరిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చివరి దశకు చేరుకుందని రూబియో పేర్కొన్నారు. ‘మేం ట్రేడ్ డీల్ను పూర్తి చేసేందుకు కేవలం అంగుళాల దూరంలో ఉన్నాం, ఇది చాలా సానుకూల పరిణామం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం పూర్తయితే రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో పెను మార్పులు రానున్నాయి.మోదీపై రూబియో ప్రశంసలుఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మార్కో రూబియో ఆకాశానికెత్తారు. తాను మోదీకి పెద్ద ‘ఫ్యాన్’ అని చెబుతూ, అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్టను మోదీ సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారని కొనియాడారు. ‘మోదీ భారతదేశాన్ని ఒక గ్లోబల్ పవర్గా (ప్రపంచ శక్తిగా) మార్చారు’ అని రూబియో వ్యాఖ్యానించారు. అలాగే, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత కీలకమైన ‘క్వాడ్’ (Quad) కూటమి తదుపరి సమావేశం కోసం ఇరు దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఎనర్జీ సెక్టార్లో మెగా పార్ట్నర్షిప్ఇక ఇంధన రంగం పరంగా భారత్ ప్రాధాన్యతను అమెరికా ప్రత్యేకంగా గుర్తించింది. ఇంధన సరఫరాను మరింత పెంచేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని రూబియో తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత భారీ క్రూడ్ ఆయిల్ (Heavy Crude)ను శుద్ధి చేసే అరుదైన సాంకేతిక సామర్థ్యం కలిగిన కొన్ని దేశాల్లో భారతదేశం ఒకటని ఆయన ప్రశంసించారు. ఒకవేళ వచ్చే ఏడాది ట్రంప్ భారత్కు వస్తే, 2020 ఫిబ్రవరి తర్వాత ఆయనకు ఇదే మొదటి భారత పర్యటన అవుతుంది. అలాగే రెండోసారి వైట్ హౌస్ బాధ్యతలు చేపట్టాక ఇదే తొలి విజిట్ కానుంది. -
తెలంగాణ ప్రభుత్వానికి ట్రంప్ కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఓ ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. యూఎస్ కాన్సులేట్ సమీపంలోని రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు.అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నానక్రామ్గూడలోని యూఎస్ కాన్సులేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో రహదారి నామఫలకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అమెరికా రాయబారి సెర్జియో గోర్, హైదరాబాద్లోని యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ సమక్షంలో అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం తన ‘ఎక్స్’ వేదికగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్..‘హైదరాబాద్లో కొత్తగా ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ ఏర్పాటు చేశారు. ఈ విధంగా గౌరవించబడిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిని నేనే. ధన్యవాదాలు!’ అని పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ నామకరణం ద్వారా భారత్–అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కార్యక్రమం అనంతరం అమెరికా ప్రతినిధులు కూడా ఈ నిర్ణయాన్ని సానుకూలంగా స్వాగతించినట్లు సమాచారం. -
‘ట్రంప్ కన్నా పుతిన్ బెటర్’.. తేల్చేసిన భారతీయులు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యవహారాలను చక్కదిద్దడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పైనే భారతీయులు ఎక్కువ నమ్మకం ఉంచారని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన తాజా గ్లోబల్ సర్వేలో వెల్లడయ్యింది. ఫిబ్రవరి 8 నుండి మే 13, 2026 మధ్య కాలంలో 36 దేశాల్లోని 42,151 మందిపై నిర్వహించిన ఈ అంతర్జాతీయ పోల్లో, ట్రంప్ నాయకత్వంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా అంతకుముందుతో పోలిస్తే భారతదేశంలో ట్రంప్ పట్ల నమ్మకం గణనీయంగా తగ్గడం గమనార్హం.రష్యా వైపే భారత్ మొగ్గు.. పుతిన్కు జైఈ సర్వే నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించగలరని 51 శాతం మంది భారతీయులు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరైన నిర్ణయాలు తీసుకోగలరని కేవలం 39 శాతం మంది భారతీయులు మాత్రమే నమ్మారు. గత ఏడాది సర్వేలో ట్రంప్కు భారతదేశంలో 51 శాతం మద్దతు ఉండగా, ఈసారి అది భారీగా పడిపోవడం అమెరికా విదేశాంగ విధానాలకు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.ట్రంప్ విధానాలపై భారతీయుల తీవ్ర అసంతృప్తిభారతదేశంలో ట్రంప్ గ్రాఫ్ పడిపోవడానికి ఆయన తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలే కారణమని సర్వే స్పష్టం చేసింది. అంతర్జాతీయ సుంకాలు, వెనిజువెలా, ఇరాన్ సంక్షోభాల విషయంలో ట్రంప్ తీరును మెజారిటీ భారతీయులు తప్పుపట్టారు. అలాగే అమెరికా అమలు చేస్తున్న కఠినమైన వలస విధానాలను కేవలం 32 శాతం మందే సమర్థించారు. అంతర్జాతీయ సహాయక సంస్థ అయిన ‘యూఎస్ఏఐడి’ని మూసివేయడం, గాజా స్ట్రిప్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలను డొనాల్డ్ ట్రంప్ డీల్ చేసిన విధానంపై కూడా భారతీయుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.ప్రపంచవ్యాప్తంగా ట్రంప్కు నిరాశే..భారత్లోనే కాకుండా ప్రపంచంలోని 16 దేశాల్లో ట్రంప్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. సర్వేలో పాల్గొన్న మొత్తం దేశాల్లో 76 శాతం మంది ట్రంప్ నాయకత్వంపై తమకు ఏమాత్రం నమ్మకం లేదని తేల్చి చెప్పారు. కేవలం 23 శాతం మంది మాత్రమే ఆయనను సమర్థించారు. జర్మనీ, ఫ్రాన్స్ వంటి ఐరోపా దేశాలతో పాటు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లోనూ ట్రంప్కు అతి తక్కువ రేటింగ్స్ వచ్చాయి. అయితే, ఇజ్రాయెల్లో మాత్రం అత్యధికంగా 66 శాతం మంది ట్రంప్ నిర్ణయాలను సమర్థించడం విశేషం.ఇది కూడా చదవండి: ట్రంప్ మరో హెచ్చరిక.. ఇక డిజిటల్ ట్యాక్స్ వంతు! -
‘క్లాడ్ 5’ విడుదలకు ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్
వాషింగ్టన్: అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థ ‘ఆంత్రోపిక్’ (Anthropic) అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన సైబర్ సెక్యూరిటీ మోడల్ ‘క్లాడ్ మైథోస్ 5’ (Claude Mythos 5) విడుదలకు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా విధించిన రెండు వారాల నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేస్తూ, దేశంలోని సుమారు 100కు పైగా భాగస్వామ్య సంస్థలకు దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు వాణిజ్య విభాగం అనుమతించింది.లూత్నిక్ లేఖతో వీడిన ఉత్కంఠఅమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లూత్నిక్, ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కంప్యూట్ ఆఫీసర్ టామ్ బ్రౌన్కు పంపిన అధికారిక లేఖ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఏఐ మోడల్కు సంబంధించి తగిన భద్రతా ప్రమాణాలు అమలులో ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జూన్ 12న జారీ చేసిన లేఖ తదనంతరం ఆంత్రోపిక్ సంస్థ ప్రభుత్వంతో కలిసి భద్రతా పరమైన లోపాలను సరిదిద్దడంలో గణనీయమైన పురోగతి సాధించిందని లూత్నిక్ వెల్లడించారు. ఈ అనుమతితో ఫార్చ్యూన్ 500 కంపెనీలతో పాటు వందకు పైగా ప్రతిష్టాత్మక సంస్థలు మైథోస్ 5 ని ఉపయోగించుకోనున్నాయి. అలాగే ఈ సంస్థల్లోని విదేశీ ఉద్యోగులు కూడా దీనిని యాక్సెస్ చేయడానికి అనుమతి లభించింది.అసలు నిషేధానికి కారణం ఏంటి?చైనాకు సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఒక దక్షిణ కొరియా టెలికాం కంపెనీకి ఆంత్రోపిక్ సంస్థ ఈ మైథోస్ మోడల్ యాక్సెస్ ఇవ్వడం అమెరికా ప్రభుత్వంలో తీవ్ర ఆందోళన కలిగించింది. దీంతో పాటు అమెజాన్, యూఎస్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ లు కూడా ‘ఫేబుల్ 5’ మోడల్ జైల్బ్రేక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ఈ జాతీయ భద్రతా కారణాల వల్లనే ట్రంప్ ప్రభుత్వం రెండు వారాల క్రితం ఆంత్రోపిక్ అత్యంత శక్తివంతమైన మోడళ్లపై ఎగుమతి నియంత్రణల కింద నిషేధం విధించింది. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఆంత్రోపిక్ తన సీనియర్ సైబర్ సెక్యూరిటీ, ఏఐ సేఫ్టీ బృందాలను వాషింగ్టన్కు పంపి ప్రభుత్వంతో చర్చలు జరిపింది.వినియోగదారులకు నిరాశేనా?ఈ తాజా నిర్ణయం ప్రకారం మైథోస్ 5 కేవలం సైబర్ రక్షకులు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థలకే పరిమితం కానుంది. సాధారణ వినియోగదారుల కోసం దీనిని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఆంత్రోపిక్ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు, ‘ఫేబుల్ 5’ మోడల్ను తిరిగి సాధారణ వినియోగంలోకి తీసుకురావడానికి వైట్ హౌస్తో చర్చలు కొనసాగుతున్నాయని ఆంత్రోపిక్ ప్రతినిధి ఎడ్వర్డో మైయా సిల్వా తెలిపారు. కాగా, ఈ పరిణామానికి సరిగ్గా ఒక రోజు ముందే, ఓపెన్ ఏఐ తన రాబోయే ‘జీపీటీ 5.6’ మోడల్ను నేరుగా కాకుండా ప్రభుత్వం ఆమోదించిన భాగస్వాములకు మాత్రమే విడతల వారీగా విడుదల చేయాలని ట్రంప్ సర్కార్ ఆదేశించడం గమనార్హం. -
వీడియోలతో అమెరికా కవ్వింపు.. గల్ప్ దేశాలపై ఇరాన్ పంజా
మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అమెరికా, ఇరాన్ మధ్య గత వారం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండగానే ఇరు దేశాలు పరస్పరం సైనిక చర్యలకు దిగడంతో ప్రాంతీయ భద్రతపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి, దానికి అమెరికా చేపట్టిన ప్రతీకార వైమానిక దాడులు, అనంతరం ఇరాన్ స్పందనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.సమాచారం ప్రకారం, హార్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న ఎవర్ లవ్లీ అనే వాణిజ్య నౌకపై ఇటీవల డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనకు ఇరాన్ మద్దతు ఉన్న బలగాలే కారణమని అమెరికా ఆరోపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఈ దాడి జరిగిందని పేర్కొంటూ, అమెరికా మరోసారి ఇరాన్ తీరప్రాంతంలోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ నిల్వ స్థావరాలు, రాడార్ వ్యవస్థలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కొన్ని కీలక సైనిక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి.అమెరికా దాడుల వీడియోలు విడుదల.. మరోవైపు.. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్పై నిర్వహించిన సైనిక దాడులకు సంబంధించిన వీడియోలను అధికారికంగా విడుదల చేసింది. ఈ వీడియోల్లో అమెరికా యుద్ధ నౌకల నుంచి క్షిపణులు ప్రయోగించడం, ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించడం, అనంతరం భారీ పేలుళ్లు సంభవించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ తీర ప్రాంతంలోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ నిల్వ స్థావరాలు, రాడార్ వ్యవస్థలు, ఇతర సైనిక మౌలిక సదుపాయాలపై ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించినట్లు CENTCOM తెలిపింది. ఈ వీడియోల్లో అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకల నుంచి వరుసగా క్షిపణులు దూసుకెళ్లడం, లక్ష్య ప్రాంతాలను తాకిన తర్వాత భారీ పేలుళ్లు చోటుచేసుకోవడం కనిపిస్తోంది. అంతర్జాతీయ సముద్ర మార్గాల భద్రతను కాపాడేందుకు, తమ బలగాల రక్షణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా పేర్కొంది.అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా దాడులు జరిపిందని ఆరోపించింది. అనంతరం, అమెరికా చర్యకు ప్రతిస్పందనగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, ఇతర అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ దాడుల వల్ల ఎంత మేర నష్టం జరిగిందనే విషయంపై అమెరికా ఇప్పటివరకు పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే తమ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది.ఈ పరిణామాలతో గత వారం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం హార్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతను కాపాడడం, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ జలసంధి గుండా రోజూ లక్షల బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతుంది. అందువల్ల అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు, ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. -
ట్రంప్ మరో హెచ్చరిక.. ఇక డిజిటల్ ట్యాక్స్ వంతు!
వాషింగ్టన్: అమెరికా సాంకేతిక రంగ దిగ్గజాల జోలికి వస్తే సహించేది లేదంటూ ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. యునైటెడ్ స్టేట్స్ కంపెనీలపై ఎవరైనా డిజిటల్ సేవల పన్ను (డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్) విధిస్తే, ఆయా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఏకంగా 100 శాతం టారిఫ్ (సుంకం) విధిస్తామని ఆయన ప్రకటించారు. శ్వేతసౌధం వేదికగా శనివారం వెలువడిన ఈ ప్రకటన ప్రపంచ వాణిజ్య రంగంలో కలకలం రేపుతోంది. అమెరికా టెక్ కంపెనీలను టార్గెట్ చేస్తూ పన్నులు విధించేందుకు సిద్ధమవుతున్న ఐరోపా దేశాలే లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.ఐరోపా దేశాలే టార్గెట్అమెరికన్ టెక్ కంపెనీలపై పన్నులు విధించేందుకు ఐరోపా దేశాలు త్వరలోనే చట్టాలు తీసుకురావాలని యోచిస్తున్న తరుణంలో ట్రంప్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. అమెరికాకు వస్తువులను పంపే ఏ దేశమైనా ఇలాంటి పన్నులు విధిస్తే, వాటిపై తక్షణమే 100 శాతం టారిఫ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ కొత్త నిబంధన గతంలో కుదుర్చుకున్న అన్ని వాణిజ్య ఒప్పందాల కంటే పైన ఉంటుందని, దేనినీ లెక్కచేయబోమని తేల్చి చెప్పారు. ఐరోపా సమాఖ్య (ఈయూ), అమెరికాల మధ్య జూలై 4 నాటికి ఖరారు కావాల్సిన టారిఫ్ ఒప్పందానికి ముందే ఈ హెచ్చరిక రావడం గమనార్హం.పాత ఒప్పందాలకు చెక్అమెరికా ఎగుమతులకు అడ్డుకట్ట వేసేలా ఐరోపా దేశాలు విధిస్తున్న కఠినమైన సాంకేతిక, పర్యావరణ నిబంధనలపై ట్రంప్ మొదటి నుంచీ ఆగ్రహంతో ఉన్నారు. ఈ నిబంధనలన్నీ అమెరికన్ టెక్నాలజీని వివక్షకు గురిచేసేందుకేనని గతంలోనే ఆయన ఆరోపించారు. ఫ్రాన్స్ వస్తువులైన వైన్, షాంపేన్లపై 100 శాతం పన్ను వేస్తానని ఈ నెల ప్రారంభంలోనే ట్రంప్ హెచ్చరించారు. ఫ్రాన్స్ ప్రభుత్వం 2019లోనే ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, గూగుల్ (ఆల్ఫాబెట్) వంటి అమెరికా దిగ్గజాల స్థానిక ఆదాయంపై 3 శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే.గ్లోబల్ ట్రేడ్ వార్?ట్రంప్ తాజా నిర్ణయంతో అంతర్జాతీయంగా మరోసారి వాణిజ్య యుద్ధం (ట్రేడ్ వార్) ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. డిజిటల్ పన్నుల అంశం అమెరికాకు, ఐరోపా దేశాలకు మధ్య ఎప్పటి నుంచో వివాదాస్పదంగా మారింది. అయితే, తాజాగా ట్రంప్ స్పష్టం చేసిన వంద శాతం సుంకాల హెచ్చరిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా మార్కెట్పై ఆధారపడే పలు దేశాలు ఇప్పుడు తమ డిజిటల్ పన్నుల విధానాలపై పునరాలోచనలో పడ్డాయి.ఇది కూడా చదవండి: బీజేపీ కీలక పదవిలో రాజ్నాథ్ చిన్న కుమారుడు -
హర్ముజ్లో మళ్లీ టెన్షన్.. టెన్షన్
ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మళ్లీ సంక్షోభంలో పడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ దాడులను కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధమని ఆరోపించిన అమెరికా, ఇరాన్లోని క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత రాడార్ వ్యవస్థలపై భారీ ప్రతీకార దాడులు నిర్వహించింది. మరోవైపు ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపిన వివరాల ప్రకారం.. గల్ఫ్లోని ఒక ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసినందుకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించింది. ఇరాన్ తీర ప్రాంతాల్లోని క్షిపణి నిల్వలు, డ్రోన్ స్థావరాలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని "శక్తివంతమైన దాడులు" నిర్వహించినట్లు పేర్కొంది.ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్ముజ్లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేయడం కాల్పుల విరమణ ఒప్పందానికే కాకుండా ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU)ను కూడా ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. ఇరాన్ "తెలివితక్కువ పని" చేసిందని వ్యాఖ్యానిస్తూ.. ఇటువంటి చర్యలకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసిందని, అమెరికా తన బాధ్యతలను పాటించిందని చెప్పారు. ఒప్పంద అమలుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, హింసకు హింసతోనే సమాధానం ఉంటుందని హెచ్చరించారు.అయితే అమెరికా ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికానే ఎప్పటిలాగే తన హామీలను ఉల్లంఘించిందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆరోపించింది. అమెరికా దాడులకు ప్రతిగా ప్రాంతంలోని అమెరికా బలగాల మోహరింపు ప్రాంతాలను తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో అమెరికా దాడులు పునరావృతమైతే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. అయితే.. అమెరికా స్థావరాలపై దాడులు ప్రారంభించినట్లు సమాచారం అందుతోంది.ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ చైర్మన్ ఎబ్రహీం అజిజీ కూడా ట్రంప్పై విమర్శలు గుప్పించారు. చర్చలు, కాల్పుల విరమణ సూత్రాల పట్ల ట్రంప్కు ఎలాంటి నిబద్ధత లేదని ఆరోపిస్తూ.. అమెరికా దాడులను నిర్లక్ష్యపూరిత చర్యగా అభివర్ణించారు. ఇదిలా ఉండగా, హర్ముజ్ జలసంధి చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై ఆందోళన పెంచుతున్నాయి. ఖతార్ ఎనర్జీకి చెందిన ఎల్ఎన్జీ ట్యాంకర్ ‘ఉమ్ స్లాల్’ హర్ముజ్ సమీపంలో తన ప్రయాణాన్ని మధ్యలోనే వెనక్కి మళ్లించగా, అంతకుముందు గ్యాస్లాగ్ షాంఘై నౌక కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఇరాన్ దక్షిణ ప్రాంతంలో పేలుళ్లు నమోదవడంతో గల్ఫ్ మార్గంలో ఎల్ఎన్జీ రవాణాపై మళ్లీ అనిశ్చితి నెలకొంది.ఇరాన్ మాత్రం హర్ముజ్ జలసంధిని తన అత్యంత కీలక వ్యూహాత్మక అస్త్రంగా భావిస్తోంది. ఈ జలసంధిపై తన ఆధిపత్యాన్ని వదులుకోవడం అంటే చర్చల్లో తన బలమైన ఒత్తిడి సాధనాన్ని కోల్పోవడమేనని టెహ్రాన్ భావిస్తోంది. అందుకే రాజకీయ నాయకులు, సైనికాధికారులు, ఐఆర్జీసీ నేతలు హర్ముజ్పై తమ నియంత్రణను కాపాడుకునేందుకు అవసరమైతే పోరాటానికైనా సిద్ధమని ప్రకటిస్తున్నారు. ఇటీవల జరిగిన యుద్ధం ప్రాంతీయ వ్యూహాత్మక పరిస్థితులను పూర్తిగా మార్చేసిందని, ఆ కొత్త వాస్తవాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని ఇరాన్ స్పష్టం చేస్తోంది.మరోవైపు, అమెరికా మాత్రం ఈ ప్రతీకార దాడులను పరిమితంగానే ఉంచినట్లు తెలుస్తోంది. ఇరాన్లోని క్షిపణి, డ్రోన్ స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించిన అమెరికా, విస్తృత సైనిక స్థావరాలను మాత్రం టార్గెట్ చేయలేదు. హర్ముజ్లో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని కాపాడుతూనే, దౌత్య చర్చలకు అవకాశం కొనసాగించాలనే ఉద్దేశంతోనే తమ సైనిక చర్యలను పరిమితం చేసినట్లు వాషింగ్టన్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇరు దేశాల పరస్పర ఆరోపణలు, ప్రతీకార చర్యలతో కాల్పుల విరమణ ఒప్పందం భవితవ్యంపై మరోసారి తీవ్ర అనిశ్చితి నెలకొంది.ఇదీ చదవండి: ఇరాన్ యుద్ధం.. వీళ్లకేమో కాసుల వర్షం! -
ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించింది: ట్రంప్
వాషింగ్టన్: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. హార్మూజ్ జలసంధిలో ఒక సరుకు రవాణా నౌకపై డ్రోన్ దాడి జరగడంపై ఆయన శుక్రవారం తీవ్రంగా స్పందించారు. కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ఇదొక మూర్ఖపు ఉల్లంఘన అని అభివరి్ణంచారు. డ్రోన్ దాడి వల్ల ఓడ పైభాగానికి నష్టం జరిగిందని తెలిపారు. అయితే, ఆ ఓడ ముందుకు సాగగలిగిందని చెప్పారు. మరో మూడు డ్రోన్లను తమ సైన్యం కూల్చివేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. గురువారం ఒమన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగిందని బ్రిటిష్ సైన్యం తెలిపింది. -
ఇరాన్ యుద్ధంలో బాంబులు పేలుతుంటే.. వీరిపై రూ.కోట్ల వర్షం
యుద్ధం అంటే ప్రాణనష్టం, ఆస్తినష్టం, దేశాల మధ్య ఉద్రిక్తత మాత్రమే అనుకుంటాం. కానీ ప్రతి యుద్ధం వెనుక మరో ఆర్థిక కోణం కూడా ఉంటుంది. ఒకవైపు ప్రజలు కష్టాలు పడుతుంటే, మరోవైపు కొన్ని రంగాలు మాత్రం భారీగా లాభపడతాయి. ఇరాన్-అమెరికా యుద్ధం కూడా అలాంటి పరిస్థితినే తీసుకొచ్చింది. ఈ యుద్ధం వల్ల అసలు ఎవరు ఎక్కువ లాభం పొందారు? ఎవరు నష్టపోయారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇరాన్-అమెరికా యుద్ధం కేవలం రణరంగానికే పరిమితం కాలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా భారీ ప్రభావం చూపింది. యుద్ధం తొలి నాలుగు రోజుల్లోనే అమెరికా నేతృత్వంలోని కూటమి 5,000కు పైగా ఆయుధాలు వినియోగించింది. మొత్తం యుద్ధ వ్యయం 35-40 బిలియన్ డాలర్ల వరకు చేరి ఉండొచ్చని అంచనా.యుద్ధం వల్ల లాభం పొందినవారుఆయుధాల తయారీ సంస్థలుటోమాహాక్ క్షిపణులు, పెట్రియట్ క్షిపణుల తయారీ కంపెనీలుద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) ఎగుమతి సంస్థలుముడి చమురు వ్యాపార సంస్థలుయుద్ధ పరిణామాలపై పందేలు కాసిన కొందరు పెట్టుబడిదారులుమరోవైపు రష్యా, చైనా దేశాలు కూడా భౌగోళిక రాజకీయాల పరంగా ప్రయోజనాలు పొందాయి. అయితే యుద్ధ భారం మాత్రం సాధారణ ప్రజలపై పడింది. ఇంధన ధరల పెరుగుదలతో పేద దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.ఇలా కాల్పుల మోతలో కాసుల వర్షం..! యుద్ధంలో టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను పెద్ద ఎత్తున ప్రయోగించారు. దీంతో వాటి తయారీ సంస్థలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక్కో టోమాహాక్ క్షిపణి ధర లక్షల డాలర్లలో ఉండటంతో ఆయుధ పరిశ్రమకు భారీ ఆదాయం లభించింది. పెరిగిన డిమాండ్ వల్ల తయారీ సమయం కూడా 2 నుంచి 3 సంవత్సరాల వరకు పెరిగింది.ఇరాన్ తక్కువ ధర కలిగిన షాహెద్ డ్రోన్లను వినియోగించగా, వాటిని కూల్చేందుకు అమెరికా అత్యంత ఖరీదైన పెట్రియట్ ఇంటర్సెప్టర్ క్షిపణులను ప్రయోగించింది. తక్కువ ఖర్చుతో దాడులు చేసిన ఇరాన్కు ఎదురుగా అమెరికా అత్యధిక వ్యయం చేయాల్సి వచ్చిన పరిస్థితి కనిపించింది.యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయుధ తయారీ సంస్థల అమ్మకాలు, ఆర్డర్లు, వాటాల విలువలు వేగంగా పెరిగాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీకి చెందిన ప్రముఖ రక్షణ సంస్థలు ఈ పరిణామాలతో భారీ లాభాలు పొందాయి.హార్మూజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ ద్రవీకృత సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితి అమెరికా గ్యాస్ ఎగుమతి సంస్థలకు అనుకూలంగా మారింది. ప్రపంచ మార్కెట్లో ధరలు పెరగడంతో అమెరికా నుంచి గ్యాస్ ఎగుమతి చేసే సంస్థలు భారీ ఆదాయాన్ని నమోదు చేశాయి.ముడి చమురు ధరలు కూడా యుద్ధ ప్రభావంతో ఒక్కసారిగా పెరిగాయి. దీంతో చమురు వ్యాపార సంస్థలు, వ్యాపారులు అధిక లాభాలు ఆర్జించారు. కొంతమంది సంస్థలకు యుద్ధం వల్ల కార్యకలాపాల్లో ఆటంకాలు ఎదురైనా, పెరిగిన ధరల కారణంగా గత ఎన్నో సంవత్సరాల్లో లేనంత లాభాలు నమోదయ్యాయి.యుద్ధం సమయంలో అమెరికా గల్ఫ్ దేశాలకు భారీ విలువైన ఆయుధాల విక్రయాలకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో రక్షణ వ్యయాన్ని మరింత పెంచే ప్రణాళికలూ ప్రకటించింది. ఈ వ్యయ భారం చివరకు అమెరికా పన్ను చెల్లింపుదారులపై పడే అవకాశం ఉంది.ఈ యుద్ధంలో మరో ఆసక్తికర అంశంగా ప్రిడిక్షన్ మార్కెట్. యుద్ధం, కాల్పుల విరమణ వంటి పరిణామాలపై ముందుగానే పందేలు కాసి కొందరు కోట్ల డాలర్ల లాభాలు పొందినట్లు పరిశోధనలో వెల్లడైంది. దీనిపై అమెరికా సెనెట్ దర్యాప్తునకు ఆదేశించింది.మొత్తంగా చూస్తే ఈ యుద్ధంలో అత్యధిక లాభం ఆయుధ తయారీ సంస్థలు, గ్యాస్ ఎగుమతిదారులు, చమురు వ్యాపారులు పొందారు. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాల ప్రజలు అధిక గ్యాస్ ధరల భారం భరించాల్సి వచ్చింది. తక్కువ ధర డ్రోన్లను అడ్డుకునేందుకు ఖరీదైన క్షిపణులు కొనుగోలు చేస్తున్న దేశాలపై కూడా తీవ్ర ఆర్థిక ఒత్తిడి పడింది. -
ట్రంప్కు భారీ ఊరట.. టీపీఎస్ రద్దుకు గ్రీన్సిగ్నల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ విజయం దక్కింది. వలస విధానాల విషయంలో ఆయన తీసుకున్న ఓ నిర్ణయాన్ని సమర్థించేలా అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో లక్షలాది మందిని వెనక్కి పంపించేందుకు(Deport) కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న ప్రయత్నాలకు మార్గం సుగమమైంది. ట్రంప్ సర్కార్కు అనుకూలంగా అమెరికా సుప్రీం కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. హైతీ, సిరియా దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులకు ఇప్పటివరకు లభిస్తున్న టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (TPS) రక్షణను రద్దు చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ, ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది ఒక్కసారిగా డిపోర్టేషన్ ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పును ట్రంప్ ప్రభుత్వం "చట్టానికి దక్కిన విజయం"గా అభివర్ణిస్తుండగా.. మానవ హక్కుల సంఘాలు మాత్రం "వేలాది మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయం" అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఏళ్లుగా.. లక్ష్యంగా.. డొనాల్డ్ ట్రంప్ తన తొలి అధ్యక్ష పదవీకాలం (2017-2021) నుంచే వలస విధానాలను కఠినతరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ పేరుతో అనేక మంది అమెరికాలో శాశ్వతంగా ఉండిపోతున్నారని అప్పటినుంచే ఆయన విమర్శిస్తున్నారు. తన మొదటి టర్మ్లోనే హైతీ, ఎల్సాల్వడోర్, నికరాగువా, సూడాన్ తదితర దేశాలకు ఇచ్చిన టీపీఎస్ను రద్దు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఫెడరల్ కోర్టులు పలుమార్లు ట్రంప్ నిర్ణయాలను నిలిపివేశాయి. 2021లో ఆయన పదవి వీడటంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.తిరిగి.. 2025 జనవరిలో రెండోసారి వైట్హౌస్లో అడుగుపెట్టిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం మళ్లీ అదే అజెండాను వేగవంతం చేసింది. ఇప్పటికే వెనెజువెలా వలసదారుల టీపీఎస్పై చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు హైతీ, సిరియాపై కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో వచ్చిన తాజా సుప్రీంకోర్టు తీర్పు ట్రంప్కు అత్యంత కీలక విజయంగా భావిస్తున్నారు.TPS అంటే ఏంటంటే.. 1990లో అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, తీవ్ర రాజకీయ అస్థిరత లేదంటే మానవతా సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాల పౌరులకు అమెరికా తాత్కాలిక రక్షణ(Temporary Protected Status.. TPS) కల్పిస్తుంది. ఈ హోదా పొందిన వ్యక్తులను వారి స్వదేశాలకు బలవంతంగా పంపించరు. అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇది గ్రీన్కార్డు లేదంటే పౌరసత్వానికి మార్గం కాదు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ప్రభుత్వం ఈ హోదాను రద్దు చేయవచ్చు.అయితే 2010లో సంభవించిన భారీ భూకంపం తర్వాత హైతీ పౌరులకు టీపీఎస్ ఇచ్చారు. 2012లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడి ప్రజలకు కూడా ఈ రక్షణ కల్పించారు. అనంతరం ఆయా దేశాల్లో పరిస్థితులు పూర్తిగా మెరుగుపడకపోవడంతో వరుస ప్రభుత్వాలు ఈ గడువును పొడిగిస్తూ వచ్చాయి.అసలు వివాదం ఎలా మొదలైంది?2025లో తిరిగి అధికారంలోకి వచ్చిన ట్రంప్.. వలసవాదుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నది చూస్తున్నదే. ఈ క్రమంలో ఈ హక్కును "తాత్కాలిక రక్షణ"గా కాకుండా "శాశ్వత వలస మార్గం"గా మార్చేశారని ఆరోపిస్తూ వస్తున్నారాయన. ఈ క్రమంలోనే హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ హైతీ, సిరియా దేశాలకు ఇచ్చిన TPSను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై వలసదారుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం.. హైతీలో గ్యాంగ్ హింస, కిడ్నాప్లు, రాజకీయ అరాచకాలు కొనసాగుతున్నాయని, సిరియాలో అంతర్యుద్ధం ప్రభావం పూర్తిగా తొలగిపోలేదని వాదించాయి. ఈ పరిస్థితుల్లో వారిని తిరిగి పంపడం ప్రాణాంతకమని పేర్కొన్నాయి. న్యూయార్క్, వాషింగ్టన్లోని ఫెడరల్ కోర్టులు కూడా ఇదే అభిప్రాయంతో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.సుప్రీంకోర్టు సంచలన తీర్పు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా.. 6-3 మెజార్టీతో ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జస్టిస్ శామ్యూల్ అలిటో తీర్పు ఇస్తూ.. టీపీఎస్ ఇవ్వాలా? రద్దు చేయాలా? అనేది పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయాలను కోర్టులు సమీక్షించే అధికారం చట్టం ఇవ్వలేదని పేర్కొన్నారు. అందువల్ల దిగువ కోర్టులు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేయడం సరైనది కాదని తేల్చిచెప్పారు.భిన్నాభిప్రాయంలో.. ఈ తీర్పుతో లిబరల్ న్యాయమూర్తులు ఎలీనా కేగన్, సోనియా సోటోమేయర్, కేతంజీ బ్రౌన్ జాక్సన్ తీవ్ర విభేదించారు. జస్టిస్ కేగన్ తన భిన్నాభిప్రాయంలో ట్రంప్ గతంలో హైతీ ప్రజలపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. హైతీ వలసదారులపై జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం చట్టబద్ధమైన ప్రక్రియను పాటించిందా లేదా అన్నది కోర్టులు పరిశీలించే హక్కు ఉందని అభిప్రాయపడ్డారు.ఎంతమందిపై ప్రభావమంటే.. ఈ తీర్పు తక్షణ ప్రభావం.. సుమారు 3.5 లక్షల మంది హైతీ పౌరులు, 6,100 మంది సిరియా పౌరులపై పడనుంది. వీరంతా ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ, కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. అయితే దీని ప్రభావం ఇంతటితో ఆగే అవకాశం లేదు. ప్రస్తుతం 17 దేశాలకు చెందిన సుమారు 13 లక్షల మంది టీపీఎస్ కింద అమెరికాలో నివసిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన తీర్పు ఆధారంగా.. భవిష్యత్తులో ఇతర దేశాల TPSలను కూడా రద్దు చేసే అవకాశాలు పెరిగాయని వలస నిపుణులు చెబుతున్నారు.మానవ హక్కుల సంఘాల తీవ్ర ఆందోళనఈ తీర్పుపై పలు మానవ హక్కుల సంస్థలు, వలసదారుల హక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. హైతీ, సిరియాలో పరిస్థితులు బాగోలేవని అంటున్నాయి. హైతీ వలసదారుల తరఫు న్యాయవాదులు.. "ఈ తీర్పు వేలాది మంది అమాయకుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది" అని హెచ్చరించారు. అమెరికాలోని ప్రముఖ పౌరహక్కుల సంస్థ NAACP కూడా ఈ తీర్పును తీవ్రంగా తప్పుబట్టడం గమనార్హం. అమెరికా అభివృద్ధికి ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న హైతీ కుటుంబాలను ఒక్కసారిగా అనిశ్చితిలోకి నెట్టివేయడం మానవతా దృక్పథానికి విరుద్ధమని పేర్కొంది. ఒహాయోలోని హైతీ సపోర్ట్ సెంటర్ ప్రతినిధులు కూడా "ఇప్పటికే వేలాది కుటుంబాలు భయాందోళనలో ఉన్నాయి. పిల్లలు పాఠశాలలకు వెళ్లాలా? ఉద్యోగాలకు వెళ్లాలా? లేక ఎప్పుడు డిపోర్ట్ చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.ట్రంప్ ప్రభుత్వం స్పందన ఇదే..అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఈ తీర్పును స్వాగతించింది. TPS అసలు ఉద్దేశాన్ని దుర్వినియోగం చేసి శాశ్వత వలస మార్గంగా మార్చేశారని పేర్కొంది. వైట్హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఈ తీర్పును "పదేళ్లుగా ఎదురుచూస్తున్న విజయం" గా అభివర్ణించారు. ఇప్పుడు హైతీ వలసదారులను స్వదేశాలకు పంపే ప్రక్రియ ముందుకు సాగుతుందని చెప్పారు.'బిగ్ రిలీఫ్' ఎందుకంటే..రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ అమలు చేస్తున్న కఠిన వలస విధానాలకు కోర్టుల్లో వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ఇటీవల వెనిజులా టీపీఎస్ కేసుతో పాటు, ఆశ్రయం కోరే వలసదారులపై పరిమితుల విషయంలోనూ సుప్రీంకోర్టు ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చింది. ఇప్పుడు హైతీ, సిరియా టీపీఎస్ కేసులో కూడా ట్రంప్కు మద్దతుగా తీర్పు రావడంతో ఆయన వలస విధానాలకు అత్యున్నత న్యాయస్థానం నుంచి మరోసారి బలమైన మద్దతు లభించినట్టైంది. అందుకే ఈ తీర్పును అమెరికా రాజకీయ వర్గాలు ట్రంప్కు బిగ్ రిలీఫ్ గా అభివర్ణిస్తున్నాయి. ఇక ఈ నిర్ణయం అమెరికా వలస విధానాల భవిష్యత్తును గణనీయంగా ప్రభావితం చేసే అవకాశముందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
డబుల్ ట్రబుల్లో ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధ వ్యవహారంలో.. తన సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. యుద్ధం సాగుతున్న తీరు, దాని వ్యయం, వ్యూహాత్మక లక్ష్యాలపై పెరుగుతున్న అసంతృప్తి మధ్య బుధవారం రిపబ్లికన్ పార్టీ ఎంపీలతో జరిగిన క్లోజ్డ్-డోర్ సమావేశంలో ట్రంప్, రిపబ్లికన్ సెనేటర్ బిల్ క్యాసిడీ Bill Cassidy మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం.సమావేశంలో క్యాసిడీ.. ఇరాన్తో కుదిరిన తాజా ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై ప్రశ్నలు లేవనెత్తారు. అమెరికా ప్రకటించిన లక్ష్యాలు నెరవేరకుండానే ఇరాన్కు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నారనే ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ప్రజలకు ఇప్పటివరకు చెప్పిన దానికంటే ఎక్కువ సమాచారం తెలుసుకునే హక్కు ఉంది’’ అని సమావేశం అనంతరం ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధ వ్యూహం మొదట ప్రకటించిన ప్రణాళిక ప్రకారమే కొనసాగుతోందా? లేదా? అన్నది స్పష్టంగా లేదని కూడా అన్నారు.ఒకవైపు.. ఈ ఘటన రిపబ్లికన్ పార్టీలో పెరుగుతున్న విభేదాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికన్ కాంగ్రెస్ నియంత్రణను నిర్ణయించే కీలక ఎన్నికలు(మధ్యంతర) సమీపిస్తున్న సమయంలో ఇరాన్ యుద్ధం ట్రంప్కు రాజకీయ భారం అవుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.బిల్ క్యాసిడీ.. అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ పార్టీ సెనేటర్. వృత్తిరీత్యా వైద్యుడు అయిన ఆయన.. 2015 నుంచి అమెరికా సెనెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2021లో ట్రంప్పై జరిగిన రెండో ఇంపీచ్మెంట్ విచారణలో ఆయన దోషిగా తేల్చాలని ఓటు వేసిన కొద్దిమంది రిపబ్లికన్ సెనేటర్లలో ఒకరు. మితవాద (Moderate) రిపబ్లికన్గా పేరున్న క్యాసిడీ, అవసరమైతే తన పార్టీ నాయకత్వాన్నీ బహిరంగంగా ప్రశ్నించే నేతగా గుర్తింపు పొందారు.ఇదిలా ఉండగా.. అమెరికా ప్రజల్లోనూ యుద్ధంపై అసంతృప్తి పెరుగుతున్నట్లు తాజా సర్వేలు సూచిస్తున్నాయి. యుద్ధం వల్ల వచ్చిన ఖర్చుకు తగిన ఫలితం లభించిందని కేవలం నలుగురిలో ఒకరు మాత్రమే భావిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ కూడా ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు తెలుస్తోంది.ఇంకోవైపు అమెరికా సెనెట్ ఆమోదించిన ఒక తీర్మానం కూడా ట్రంప్పై ఒత్తిడిని పెంచింది. ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని కోరుతూ తీసుకొచ్చిన ఆ తీర్మానానికి కొంతమంది రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతు ఇవ్వగా, వారిలో క్యాసిడీ కూడా ఒకరు. అయితే ఆ తీర్మానాన్ని ట్రంప్ “ప్రతీకాత్మక చర్య మాత్రమే” అంటూ కొట్టిపారేశారు. అలాంటి సందేశాలు ఇరాన్కు అమెరికా బలహీనంగా కనిపించేలా చేస్తాయని వ్యాఖ్యానించారు.మరోవైపు, ఈ అంతర్గత రాజకీయ ఉద్రిక్తతల మధ్యే ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్కు అదనంగా 70 బిలియన్ డాలర్ల యుద్ధ నిధుల కోసం విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఉన్న 867 బిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్కు ఇది అదనంగా కావడం గమనార్హం. దీంతో యుద్ధ ఖర్చులు, వ్యూహాత్మక దిశ, రాజకీయ ప్రభావంపై అమెరికాలో చర్చ మరింత వేడెక్కుతోంది. -
యుద్ధంతో ప్రయోజనమే లేదు
ఇరాన్తో అమెరికా మధ్యంతర శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. యుద్ధ సమయంలో ఓడరేవులపై విధించిన అమెరికా నావికా దిగ్బంధనాన్ని ఇరాన్ ముగించింది. దీంతో హార్మూజ్ జలసంధి తెరుచుకుంది. ఇరు దేశాలు శాశ్వత శాంతి కోసం కృషి చేస్తున్నాయి. ఇంతా చేసి ఈ నాలుగు నెలల యుద్ధంలో అమెరికా సాధించిందేమిటి? అగ్ర రాజ్యానికి 40 బిలియన్ డాలర్ల నష్టం మిగిల్చిన ఈ యుద్ధానికి తగిన ఫలితం వచ్చిందా? ఇదే విషయంపై రాయిటర్స్/ఇప్సోస్ జూన్ 18–22 మధ్య అమెరికాలో సర్వే నిర్వహించింది. ఇంతా చేస్తే అసలు ఈ సంఘర్షణకు విలువే లేదంటున్నారు సర్వేలో పాల్గొన్న సగం మంది అమెరికన్లు. యుద్ధానికి అయిన ఖర్చుకు తగిన ఫలితం సాధించిందని పావు వంతు అమెరికన్లు మాత్రమే నమ్ముతున్నారు. మరో పావు వంతు మాత్రం ఏమీ చెప్పలేమంటున్నారు. అమెరికా అగ్రరాజ్యం అంటే... ప్రపంచానికి పెద్దన్న పాత్ర. అలాంటి దేశానికి అధ్యక్షుడంటే ఎంతటి ప్రజామోదం ఉండాలి. కానీ.. యుద్ధ కాంక్షతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ తగ్గింది. రెండో పదవీకాలంలో అత్యల్ప స్థాయికి వచ్చింది. ఆయన ఆమోద రేటింగ్ 34%కి పడిపోయింది. ఇక, ప్రజల జీవన వ్యయంపై ట్రంప్కు ఆమోదం 22 శాతంగా ఉంది, ఇది ఆయన అధ్యక్ష పదవీకాలంలోనే అత్యల్ప స్థాయి. అంతేకాక, వైట్హౌస్లో ఆయనకు ముందున్న డెమొక్రటిక్ అధ్యక్షుడు జో బైడెన్ తన అధ్యక్ష పదవీకాలం చివరిలో పొందిన రేటింగ్ కంటే కూడా ఇది తక్కువ. బలహీన స్థితిలో అమెరికా ఇరాన్పై దాడులకు ఆదేశించడానికి ముందు ఉన్న దానికంటే అమెరికా ఇప్పుడు మరింత బలహీనమైన స్థితిలో ఉందని 35% మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. అయితే, యుద్ధానికి ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇరాన్తో అమెరికా మరింత బలమైన స్థితిలో ఉందని కేవలం 23% మంది అమెరికన్లు మాతమ్రే నమ్ముతున్నారు. వీరిలో ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్కి చెందినవారు సగం మంది మాత్రమే ఉండటం గమనార్హం. శాంతి ఒప్పందం నిలవదు.. మరి ఈ మధ్యంతర శాంతి ఒప్పందంపై మెజారిటీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఒప్పందమైనా ఎక్కువ కాలం నిలస్తుందా అంటే? కష్టమేనంటున్నారు. ఇక, ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందం జరిగే అవకాశం లేనే లేదని 63% మంది అమెరికన్లు చెబుతున్నారు. రిపబ్లికన్లలో దాదాపు సగం మంది, డెమొక్రాట్లలో ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే.. శాశ్వత శాంతి సాధ్యమవుతుందని 18 శాతం మంది నమ్ముతున్నారు. దీనిని విశ్వసించే వారిలో 34 శాతం రిపబ్లికన్లు, వీరిలో 10 శాతం డెమొక్రాట్లు ఉండటం గమనార్హం. పెరిగిన ద్రవ్యోల్బణం.. ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తానని, ఖరీదైన విదేశీ యుద్ధాలకు అమెరికాను దూరంగా ఉంచుతానని వాగ్దానం చేసి ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. కానీ, మే నెలలో అమెరికా వార్షిక ద్రవ్యోల్బణం రేటు 4.2 శాతం పెరిగింది. 2023 తర్వాత ఇదే అత్యధికం. ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలే జీవన వ్యయ పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి. మధ్యంతర శాంతి ఒప్పందం ప్రపంచ ముడి చమురు ధరలు తగ్గినా.. అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ముందున్న ధరతో పోలిస్తే, గ్యాసోలిన్ ధర ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. ఒక గ్యాలన్ సాధారణ పెట్రోల్ సగటు ధర 4.50 డాలర్లకు పైగా ఉన్న స్థాయి నుంచి 3.93 డాలర్లకు పడిపోయింది. అయితే, యుద్ధం ప్రారంభమవ్వడానికి ముందున్న ధరతో పోలిస్తే మాత్రం ఇది అధికమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్కు ఎదురుదెబ్బ
బోస్టన్: ఎన్నికల నిబంధనలను సమూలంగా మార్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కు బ్రేక్ పడింది. ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో పౌరసత్వ ఆధారాలను తప్పనిసరిగా చూపించాలనే నిబంధనతో కూడిన ట్రంప్ ఆదేశాల అమలును బోస్టన్లోని ఫెడరల్ కోర్టు బుధవారం శాశ్వతంగా నిషేధించింది. ట్రంప్ తెచ్చిన ఈ ఎన్నికల సంస్కరణలను తాత్కాలికంగా అడ్డుకుంటూ ఏడాది క్రితం ఇచ్చిన ఉత్తర్వులను.. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి డెనిస్ కాస్పర్ ఇప్పుడు శాశ్వత నిషేధంగా మారుస్తూ తుది తీర్పునిచ్చారు.ట్రంప్ మార్పులను సవాలు చేస్తూ డెమొక్రటిక్ పార్టీకి చెందిన స్టేట్ అటార్నీ జనరల్స్ దాఖలు చేసిన పిటిషన్ సమంజసమేనని కోర్టు అంగీకరించింది. నిబంధనలు ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి ఈ వ్యాజ్యం ముందస్తుదేనన్న ట్రంప్ ప్రభుత్వ వాదనను జడ్జి తిరస్కరించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నికలను క్రమబద్ధీకరించే పూర్తి అధికారం రాష్ట్రాలకు, కాంగ్రెస్ (పార్లమెంట్)కు మాత్రమే ఉంటుందని, ట్రంప్ విధించిన షరతులు ‘అధికారాల విభజన’సూత్రాన్ని ఉల్లంఘించడమేనని జడ్జి స్పష్టం చేశారు. ‘రాజ్యాంగం అధ్యక్షుడికి ఎన్నికలపై ఎలాంటి ప్రత్యేక అధికారాలను ఇవ్వలేదు’అని ఆమె తీర్పులో పేర్కొన్నారు. -
నయా పైసా చెల్లించలేదు.. రెచ్చిపోయిన ట్రంప్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ పరిహారం కింద ఇరాన్కు ఇప్పటి వరకూ తామూ నయాపైసా కూడా చెల్లించలేదని తెలిపారు. అదేవిధంగా హర్ముజ్లో ఎలాంటి టోల్ విధించబోమని ఇరాన్ ఇదివరకే తమకు స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. ఒకవేళ ఇరాన్ ఇచ్చిన ఈ సమాచారం అబద్ధమని తేలితే, ఆ దేశంతో జరుగుతున్న శాంతి చర్చలను తక్షణమే నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు.అయితే, ఇరాన్లో ఆహార కొరత తీవ్రంగా ఉన్నందున, వారి నిధులను పూర్తిగా అమెరికా నియంత్రణలోనే ఉంచి కేవలం అమెరికా రైతులకు సంబంధించిన మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్స్ వంటి ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి మాత్రమే వాటిని వాడేలా అనుమతిస్తామని వెల్లడించారు.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వేగంగా తగ్గుతున్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్ బంకుల్లో ధరలను తగ్గించకుండా వినియోగదారులను దోచుకుంటున్నారనే ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై వెంటనే దర్యాప్తు చేయాలని అమెరికా న్యాయశాఖను కోరినట్లు పేర్కొన్నారు. కాగా ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య 60 రోజుల మధ్యంతర ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా మరోసారి కలకలం రేపుతున్నాయి.కాగా గత సోమవారం స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల మధ్య 60 రోజుల మధ్యంతర ఒప్పందం కుదిరింది. ఒప్పందం షరతుల్లో భాగంగా ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా ఆర్థిక శాఖ ప్రకటించింది. దీని ప్రకారం ఇరాన్ చమురు ఉత్పత్తి, సరఫరా, విక్రయాలకు ఇకపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. ఈ వెసులుబాటు ఆగస్ట్ 21వ తేదీ వరకు అమల్లో ఉంటుందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. -
భారతీయులు ఖర్చు పెట్టరు.. వాన్స్ ప్రతిపాదనపై ట్రంప్ వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు చేసిన ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. పుతిన్-జెలెన్స్కీల మొండిపట్టుతో ఆ చర్చలు ముందుకు సాగడం లేదు. అయితే.. ఈ వ్యవహారానికి సంబంధించి వైట్హౌజ్లో జరిగిన ఓ ఆసక్తికర చర్చ ఇప్పుడు బయటకు వచ్చింది. యుద్ధ విరమణ ఒప్పందాన్ని పర్యవేక్షించేందుకు నాటో దేశాల బలగాల బదులుగా భారత సైన్యాన్ని వినియోగించవచ్చనే ప్రతిపాదన వచ్చిందట. దానికి ట్రంప్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చినట్లు ఇప్పుడు బయటకు వచ్చింది. జూన్ 23న విడుదలైన రిజిమ్ చేంజ్ (Regime Change) పుస్తకాన్ని జర్నలిస్టులు మ్యాగీ హాబర్మన్, జోనాథన్ స్వాన్ రచించారు. ఇందులో 2025 జనవరి 30న ఓవల్ ఆఫీస్లో జరిగిన సమావేశం గురించి వివరించారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన కేవలం పది రోజుల తర్వాత ఈ సమావేశం జరిగినట్లు పేర్కొన్నారు.ఆ సమావేశంలో.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ప్రత్యేక దూతగా నియమితులైన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెలాగ్ శాంతి ప్రణాళికను వివరించారు. ఆ ప్రణాళికలో యుద్ధ విరమణ అమలును పర్యవేక్షించేందుకు ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ వంటి యూరోపియన్ దేశాల బలగాలను ఉక్రెయిన్లో మోహరించే ప్రతిపాదన చేశారు.అయితే నాటో సభ్య దేశాల సైన్యం ఉక్రెయిన్లో ఉంటే రష్యా దానిని రెచ్చగొట్టే చర్యగా పరిగణించే అవకాశం ఉందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారట. అలా చేస్తే ఉద్రిక్తతలు మరింత పెరిగి యుద్ధం విస్తరించే ప్రమాదం ఉందని ఆయన భావించారట. దీంతో నాటోకు చెందని దేశాల బలగాలను ఉపయోగించవచ్చా? అని వాన్స్ ప్రశ్నించగా.. అప్పటి జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ వాల్ట్జ్ కూడా ఆ ఆలోచనకు సానుకూలంగా స్పందించారు. అనంతరం భారత్, సౌదీ అరేబియా వంటి దేశాల బలగాలను పరిగణనలోకి తీసుకోవచ్చని వాన్స్ సూచించారట.అయితే ట్రంప్ వెంటనే ఆ ప్రతిపాదనను తోసిపుచ్చినట్లు బిగ్గరగా నవ్వినట్లు.. రిజిమ్ చేంజ్ రచయితలు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, మోదీ తనను ఇష్టపడతారని చెప్పినప్పటికీ, "భారతీయులు అలాంటి వాటికి ఖర్చు పెట్టరు. వారు దీనికి డబ్బులు వెచ్చించరు" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించినట్లు పుస్తకంలో వెల్లడించారు.అమెరికాకు ఆర్థిక బాధ్యతలు పెరగకూడదనే అంశంపైనే ట్రంప్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పుస్తకం చెబుతోంది. బ్రిటన్ లేదంటే ఫ్రాన్స్ తమ సొంత నిర్ణయంతో బలగాలను పంపితే తనకు అభ్యంతరం లేదని, కానీ అమెరికా నేరుగా ఇందులో భాగస్వామి కాకూడదని ఆయన భావించినట్లు వివరించింది. అదే సమావేశంలో ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీపై కూడా తీవ్ర విమర్శలు చేసినట్లు పుస్తక రచయితలు పేర్కొన్నారు. జెలెన్స్కీని తట్టిపోయడమే కాకుండా.. ఉక్రెయిన్ను ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరమైన దేశాల్లో ఒకటిగా వ్యాఖ్యానించినట్లు వెల్లడించారు.అయితే ఇవన్నీ కొత్తగా విడుదలైన పుస్తకంలోని వాదనలు మాత్రమే. వైట్హౌస్ లేదంటే సంబంధిత వర్గాలు ఈ వివరాలపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయినప్పటికీ, ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా విదేశాంగ విధానం, భారత్తో ట్రంప్ సంబంధాలపై ఈ పుస్తకం కొత్త చర్చకు తెరలేపింది. -
అణు కేంద్రాలు తెరవకపోతే.. చర్చలే రద్దు!
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ముందుకు సాగుతున్న వేళ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అణు కేంద్రాల్లో అంతర్జాతీయ తనిఖీలకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా ప్రకటించగా.. కాసేపటికే టెహ్రాన్ వర్గాలు దానిని తోసిపుచ్చాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. “అది పూర్తిగా తప్పు” అంటూ ఇరాన్పై మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ అణు కార్యక్రమంపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తనిఖీలు తప్పనిసరి. ఇరాన్ అధికారులు తనిఖీల అంశాన్ని ఖండిస్తున్నప్పటికీ, తెర వెనుక వారు అంగీకరించారని ట్రంప్ పేర్కొన్నారు. "వాళ్లు తప్పు చెబుతున్నారు. నిజంగా అంగీకరించకపోతే ఈ క్షణమే చర్చలను రద్దు చేస్తాను" అని వ్యాఖ్యానించారు.జేడీ వాన్స్ ప్రకటనతో..అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) ఇటీవల స్విట్జర్లాండ్ చర్చల అనంతరం మాట్లాడుతూ.. ఇరాన్ చివరకు ఐఏఈఏ తనిఖీలకు అంగీకరించిందని ప్రకటించారు. ఇరు దేశాల ఒప్పందంలోనే దీనిని పెద్ద ముందడుగుగా అభివర్ణించారు. అయితే కొద్ది గంటల్లోనే ఇరాన్ ఆ ప్రకటనను ఖండించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ వాదన ఏమిటి?ఇరాన్ విదేశాంగ శాఖ మాత్రం అమెరికా ప్రకటనలను ఖండిస్తోంది. ఇటీవల స్విట్జర్లాండ్లో జరిగిన చర్చల్లో తనిఖీలపై ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు గురైన అణు కేంద్రాలను తనిఖీ చేయడానికి ప్రస్తుతం అనుమతించే యోచన లేదని తెలిపింది. అసలు వివాదం ఎందుకు కీలకం?ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించాలంటే తనిఖీలు అత్యంత కీలకమైన అంశం. గతంలో జరిగిన అణు ఒప్పందాలన్నింటిలోనూ IAEA పర్యవేక్షణ ప్రధాన షరతుగా ఉండేది. ఇప్పుడు కూడా అదే అంశాన్ని అమెరికా "నాన్-నెగోషియబుల్" షరతుగా చూస్తోంది. ట్రంప్ పరిపాలన అభిప్రాయం ప్రకారం, తనిఖీలు లేకుంటే ఇరాన్ నిజంగా అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపివేసిందో లేదో నిర్ధారించడం అసాధ్యం. అందుకే తనిఖీలు తప్పనిసరి అంటోంది. ట్రంప్ ప్రకారం, సరైన సమయంలో IAEA తనిఖీ బృందాలు ఇరాన్లోకి ప్రవేశిస్తాయని, అణు కార్యకలాపాలపై పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అణు తనిఖీలు లేకుండా ఎలాంటి ఒప్పందమూ ఉండదని.. అవసరమైతే చర్చలనే రద్దు చేస్తానని హెచ్చరించారు. దీంతో చర్చల భవిష్యత్తుపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. -
స్టూడెంట్ వీసాలకు ఎక్స్పైరీ డేట్
వాషింగ్టన్: భారతీయ టెక్ నిపుణులు అత్యధికంగా వినియోగించుకునే హెచ్–1బీ వంటి వీసాలపై కఠిన ఆంక్షలను తీసుకువచ్చిన అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం..విదేశీ విద్యార్థి వీసా విధానంలోనూ తీవ్ర మార్పులకు శ్రీకారం చుట్టింది. విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఉండే భారతీయ విద్యార్థులు వీటితో ఇబ్బందులు పడే అవకాశముంది. తాజా మార్పు ప్రకారం.. అంతర్జాతీయ విద్యార్థులు దేశంలో ఎంతకాలం ఉండేందుకు వీలుందో తెలియజేసే ఎక్ప్పైరీ తేదీని సైతం ముందుగానే నిర్ణయిస్తారు. ఇందుకు సంబంధించి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పంపిన ప్రతిపాదనపై అధ్యక్ష భవనం ఆమోదం తెలిపింది.ఈ నిర్ణయం త్వరలోనే అమల్లోకి రానుంది. దీని ప్రకారం విదేశీ విద్యార్థులు స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఇకపై గరిష్టంగా నాలుగేళ్లపాటు మాత్రమే ఉండేందుకు అవకాశముందని బ్లూమ్బర్గ్ పత్రిక తెలిపింది. ఎఫ్–1 స్టూడెంట్ వీసాదారులు, జె–1 ఎక్సే్ఛంజి విజిటర్ వీసాలు కలిగిన వారు, ఇతర వీసా కేటగిరీ వారు ఇందులోకి వస్తారు. ఈ మార్పు అత్యధిక సంఖ్యలో అమెరికాలో చదువులు కొనసాగించే భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. నాలుగేళ్లకు మించి కొనసాగే పీహెచ్డీ, పరిశోధక, ఇతర దీర్ఘకాల కోర్సుల్లో నమోదై ఉన్న భారతీయ విద్యార్థులకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశముంది. వీరి చదువు నిర్ణిత కాల పరిమితిని దాటినట్లయితే గడువు పొడిగించాలంటూ ఇమిగ్రేషన్ అధికారులను తప్పక కోరాల్సి ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్కు బదులుగా.. ప్రస్తుతమున్న ’డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ విధానాన్ని అనుసరించి అంతర్జాతీయ విద్యార్థులు తమ విద్యా కోర్సుల్లో కొనసాగుతూ, వీసా నిబంధనలను పాటిస్తున్నంత కాలం అమెరికాలో ఉండటానికి సాధారణంగానే అనుమతి లభిస్తుంది. దీనివల్ల విద్యార్థులు తమ చదువును పొడిగించుకోవడానికి, ఒక విశ్వవిద్యాలయం నుంచి మరో విశ్వవిద్యాలయానికి మారేందుకు, కోర్సుల మార్పునకు, డిగ్రీ నుంచి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సులువుగా ఉంది. కొత్తగా ప్రవేశ అనుమతి కాలపరిమితిని కోరకుండానే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ), స్టెమ్ ఓపీటీలను పూర్తి చేయడానికి అవసరమైన వెసులుబాటు వారికి దొరికేది. తాజా నిబంధన అమలైతే ఈ పాత పద్ధతి ముగియనుంది.బదులుగా విద్యార్థులు దేశంలో చట్టబద్ధంగా ఉండేందుకు ఇమిగ్రేషన్ విభాగం ఒక నిర్దేశిత కాలపరిమితిని మాత్రమే మంజూరు చేస్తుంది. ఈ నిబంధన ఇంకా అధికారికంగా అమల్లోకి రానప్పటికీ, ఇందుకు సంబంధించిన గత సూచనల ప్రకారం, చాలా మంది విద్యార్థులకు గరిష్టంగా నాలుగేళ్ల ప్రవేశ కాలపరిమితి మాత్రమే లభిస్తుందని అధికారులు అంటున్నారు. నాలుగేళ్ల పరిమితితో సాగే కోర్సులు చదివే విద్యార్థులు మాత్రమే దేశంలో చట్టబద్ధంగా ఉండటానికి ’యూఎస్ సిటిజన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్విసెస్’ (యూఎస్సీఐఎస్) నుంచి ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుంది.ఈ ప్రక్రియలో అదనపు పత్రాల సమర్పణ, బయోమెట్రిక్ నమోదు, మరింత కఠినమైన పరిశీలన, ప్రాసెసింగ్లో ఆలస్యం వంటి ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఈ కొత్త నిబంధన ఇప్పటికే వైట్ హౌస్లోని ’ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్’ సమీక్షను పూర్తి చేసుకుంది. అధికారిక ప్రచురణ, పూర్తిస్థాయి అమలుకు ముందు చివరి విధానపరమైన దశల్లో ఇదొకటి. 30 శాతం మంది భారతీయ విద్యార్థులే ఈ మార్పు భారతీయ విద్యార్థులపై గణనీయమైన ప్రభావం చూపనుంది. అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే. 2023–24 విద్యా సంవత్సరంలో అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో 3.31లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నట్లు ఓపెన్ డోర్స్ సంస్థ తన నివేదికలో తెలిపింది. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయుల వాటా ఏకంగా 30 శాతం వరకు ఉండటం గమనార్హం.వీరిలో చాలా మంది విద్యార్థులు డాక్టోరల్ డిగ్రీలు, విస్తృత పరిశోధనలతో కూడిన మాస్టర్స్ ప్రోగ్రాంలు, కొన్ని రకాల ప్రొఫెషనల్ కోర్సులతో కలిపి సాధారణంగా నాలుగేళ్లకు మించి సాగే విద్యా కోర్సుల్లోనే నమోదై ఉన్నారు. కొత్త నిబంధనల ప్రకారం, వీరంతా తమ చదువును నిరంతరాయంగా కొనసాగించాలంటే అదనపు ధ్రువీకరణలను, ఇమిగ్రేషన్ అధికారుల కఠినమైన పరిశీలనను ఎదుర్కోవాల్సి రావచ్చు. అనిశ్చితిని సృష్టిస్తుంది: ఏఏయూఅసోసియేషన్ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీస్ (ఏఏయూ), అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ (ఏసీఈ), ఎన్ఏఎఫ్ఎస్ఏ వంటి ప్రముఖ విద్యా సంస్థల కూటములు ప్రభుత్వ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చదువు, పరిశోధనల సమయం తరచూ మారుతూ ఉండే కోర్సుల విద్యార్థుల విషయంలో నిర్దేశిత కాలపరిమితి విధానం తీవ్రమైన అనిశ్చితిని సృష్టిస్తుందని ఈ గ్రూపులు వాదిస్తున్నాయి.అలాగే, ఇది వర్సిటీల పరిపాలనా పరమైన భారాన్ని పెంచుతుందని, సుదీర్ఘ రీసెర్చ్, పీహెచ్డీ కోర్సుల విద్యార్థులు చట్టబద్ధమైన హోదాను కాపాడుకోవడం మరింత కష్టతరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పైపెచ్చు, విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో పని అనుభవాన్ని పొందేందుకు వీలు కల్పించే ’ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్’(ఓపీటీ పైనా ప్రభావం చూపుతుంది. వీసా గడువు పొడిగింపునకు అధికారులు ఆమోదం తెలపడంలో ఏమాత్రం ఆలస్యమైనా అది విద్యార్థులు తమ చదువు ముగించుకుని ఉద్యోగంలోకి మారే ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తుంది. గడువు ముగిస్తే అక్రమంగా ఉంటున్నట్లేవైట్హౌస్ ఆమోదించిన ప్రతిపాదనల్లో మరో ఆందోళనకరమైన అంశం ఉంది. దీని ప్రకారం..విద్యార్థులకు అనుమతించిన కాలపరిమితి ముగిసిన వెంటనే వారు దేశం విడిచి వెళ్లిపోవడం తప్పనిసరి. లేకుంటే దేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లే లెక్క. ప్రభుత్వ విభాగాల్లో పరిపాలనాపరమైన ఆలస్యం, దరఖాస్తుల పెండింగ్, ఇతర చిన్నపాటి పొరపాట్ల వల్ల విద్యార్థులు ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల, జరిమానాలను చెల్లించాల్సి రావడంతోపాటు భవిష్యత్తులో అమెరికాకు తిరిగి రాకుండా ప్రయాణ ఆంక్షలు వంటి కఠినమైన శిక్షలను ఎదుర్కోవాల్సి రావచ్చు.గతంలోనే తెచ్చినా అమలు కాలేదుహోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ ప్రతిపాదనను మొదటగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి పదవీకాలంలోనే తీసుకువచ్చింది. కానీ, అప్పట్లో ఇది అమలు కాలేదు. ట్రంప్ మళ్లీ బాధ్యతలు చేపట్టాక ఈ ఆలోచనను 2025లో మళ్లీ తెరపైకి తెచ్చారు. ఇప్పుడు వైట్ హౌస్ ఆమోదం కూడా లభించడంతో, ఇది త్వరలోనే అధికారిక విధానంగా మారేందుకు అవకాశమేర్పడింది. ప్రస్తుతానికి పాత నిబంధనల్లో ఎలాంటి మార్పూ లేదు. అంతర్జాతీయ విద్యార్థులు ప్రస్తుత డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానంలో భాగంగానే అమెరికాలో కొనసాగవచ్చు. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే గత కొన్ని దశాబ్దాలలో యూఎస్ స్టూడెంట్ వీసా వ్యవస్థలో వచ్చిన అతిపెద్ద మార్పుల్లో ఒకటిగా నిలుస్తుంది. -
ట్రంప్ కొత్త నిర్ణయం.. లక్షల మంది ఇండియన్లకు షాక్
-
వాన్స్ను ముందుకు నెట్టి.. ట్రంప్ సేఫ్ గేమ్?
స్విట్జర్లాండ్లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చల సందర్భంగా ఇరాన్ ప్రతినిధి బృందం అకస్మాత్తుగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదనే ప్రచారం వైరల్ కాగా.. మరోవైపు, ఇరాన్తో కుదురుతున్న వివాదాస్పద ఒప్పందం విజయవంతమైతే కీర్తి ట్రంప్దే, విఫలమైతే నింద మాత్రం వాన్స్పైనే పడేలా రాజకీయ వ్యూహం నడుస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.స్విట్జర్లాండ్లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చల్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ సమావేశ మందిరంలోకి వచ్చి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్తో మాట్లాడి, అనంతరం అమెరికా ప్రతినిధుల వైపు చూడకుండానే వెనుదిరగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దీనిని చాలామంది అమెరికాకు, ముఖ్యంగా జేడీ వాన్స్కు జరిగిన దౌత్యపరమైన అవమానంగా అభివర్ణించారు.అయితే వాన్స్ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. "నన్ను అవమానించారనే భావన నాకు లేదు. ఇరానీయన్లు చర్చల్లో కొన్నిసార్లు చాలా గందరగోళంగా వ్యవహరిస్తారు. కానీ ఆ ఘటన తర్వాత కూడా మేము దాదాపు తొమ్మిది గంటలపాటు చర్చలు కొనసాగించాం" అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కనిపించిన దృశ్యాల కంటే, చర్చల గదిలో జరిగిన పరిణామాలే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.ఇరాన్ మీడియా కథనాల ప్రకారం.. అమెరికా ప్రతినిధులతో కలిసి ఫొటో దిగాలన్న ప్రతిపాదనపై, అలాగే అదే సమయంలో ట్రంప్ చేసిన హెచ్చరికలపై అసంతృప్తితో ఇరాన్ ప్రతినిధులు కొద్దిసేపు సమావేశం నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. లెబనాన్లోని హెజ్బొల్లా కార్యకలాపాలపై ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేయడాన్ని కూడా టెహ్రాన్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.అయితే అసలు రాజకీయ చర్చ ఇప్పుడు మరో కోణంలో సాగుతోంది. ఇరాన్తో కుదురుతున్న తాత్కాలిక శాంతి ఒప్పందానికి అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చమురు ఆంక్షల సడలింపు, స్తంభింపజేసిన నిధుల విడుదల, ఇరాన్ పునర్నిర్మాణానికి భారీ ఆర్థిక సహకారం వంటి అంశాలు రిపబ్లికన్ పార్టీలోని కొందరికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ తనను పక్కన పెట్టి, ఒప్పందం ముఖచిత్రంగా జేడీ వాన్స్ను ముందుకు నెట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చర్చలకు వాన్స్నే నాయకత్వం వహించడమే కాకుండా, ఇరాన్ ఒప్పందాన్ని సమర్థించే బాధ్యత కూడా ఆయన భుజాలపై పడింది. విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ శాఖ నేతలు వెనుకకు తగ్గిన వేళ.. విమర్శలన్నింటినీ ఎదుర్కొంటున్నది వాన్స్ కావడం గమనార్హం.ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూర్చాయి. "ఒప్పందం విజయవంతమైతే క్రెడిట్ నాదే.. విఫలమైతే నింద జేడీదే" అంటూ ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ట్రంప్ కావాలనే వాన్స్ను ముందుకు నెట్టి, తాను సురక్షిత దూరంలో నిలిచారని అమెరికా మీడియా విశ్లేషిస్తోంది.రిపబ్లికన్ వర్గాల్లో కూడా ఈ ఒప్పందాన్ని ఇప్పటికే "వాన్స్ డీల్"గా పిలవడం మొదలైంది. ఒప్పందం కుదిరితే 2028 అధ్యక్ష ఎన్నికల రేసులో వాన్స్కు భారీ రాజకీయ లాభం కలిగే అవకాశం ఉంది. కానీ చర్చలు విఫలమైతే లేదంటే ఇరాన్ మరోసారి అమెరికాను ఇబ్బందుల్లోకి నెడితే.. ఆ రాజకీయ దెబ్బ కూడా ముందుగా వాన్స్కే తగిలే ప్రమాదం కనిపిస్తోంది. -
అమెరికా డీల్ను నెతన్యాహు చెడగొడుతున్నారా?
జెరూసలెం: వాషింగ్టన్ వేదికగా అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విచ్ఛిన్నం చేయకుండా ఎలా అడ్డుకుంటారన్న రిపోర్టర్ల ప్రశ్నకు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘బీబీ’గా పిలిచే నెతన్యాహుతో సహా ఎలాంటి సమస్యనైనా తాను చాలా వేగంగా పరిష్కరించగలనని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇరాన్-అమెరికా ఒప్పందంలో కీలకమైన 14 సూత్రాల ప్రతిపాదనల్లో లెబనాన్ సంక్షోభం ఒకటైనప్పటికీ, ఇజ్రాయెల్ అక్కడ తన దాడులను ఆపకపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.నెతన్యాహును ట్రంప్ నిలువరించగలరా?శ్వేతసౌధంలో జరిగిన విలేకరుల సమావేశంలో డోనాల్డ్ ట్రంప్ తన వ్యూహాత్మక నైపుణ్యాలను చాటుకున్నారు. ‘నేను ఏం చేయబోతున్నానో ఇప్పుడే చెప్పను. కానీ ఈ సమస్య పరిష్కారమవుతుంది. నేను సమస్యలను పరిష్కరించే వ్యూహకర్తను. బీబీతో ముడిపడి ఉన్న విషయాలతో సహా ఎలాంటి కఠినమైన సమస్యలనైనా నేను చాలా వేగంగా సర్దుబాటు చేయగలను’ అని ట్రంప్ అన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని నెతన్యాహు సబోటాజ్ (విధ్వంసం) చేయకుండా చూసేందుకు తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని ఆయన పరోక్షంగా సూచించారు.లెబనాన్లోనే ఉంటాం: ఇజ్రాయెల్ పట్టుట్రంప్ వ్యాఖ్యలు ఇలా ఉంటే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం లెబనాన్ విషయంలో అస్సలు తగ్గేదే లేదని స్పష్టం చేశారు. తమ సరిహద్దుల్లో ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నంత కాలం దక్షిణ లెబనాన్లోని భద్రతా వలయంలో ఇజ్రాయెల్ దళాలు కొనసాగుతాయని ఆయన తేల్చి చెప్పారు. శాంతి చర్చల్లో ఏం జరిగినా, ఒప్పందాలు కుదిరినా, కుదరకపోయినా సరే.. తాను అధికారంలో ఉన్నంత కాలం ఇరాన్ను అణ్వాయుధ దేశంగా ఎదగనివ్వబోనని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు.అమెరికాను ప్రశ్నించిన నెతన్యాహుతమ దేశ చర్యలను గట్టిగా సమర్థించుకుంటూ నెతన్యాహు అమెరికాకే ఒక సూటి ప్రశ్న విసిరారు. ‘ఒకవేళ అమెరికా సరిహద్దుల్లో వేలాది మంది ఉగ్రవాదులు చేరి, రాకెట్లు, బాలిస్టిక్ క్షిపణులు, కిల్లర్ డ్రోన్లతో దాడి చేస్తూ, పౌరులను, పిల్లలను చంపుతుంటే అమెరికా ఊరుకుంటుందా? చేతులు ముడుచుకుని కూర్చుంటుందా? కచ్చితంగా కూర్చోదు. సరిహద్దు దాటి వెళ్లి, భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, ఆ ముప్పును పూర్తిగా తొలగించే వరకు ఉగ్రవాదులను ఏరిపారేస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నది కూడా సరిగ్గా అదే’ అని నెతన్యాహు ఘాటుగా వ్యాఖ్యానించారు. -
డీల్పై కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ను మళ్లీ రెచ్చగొట్టిన ట్రంప్
అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందంలోని నిబంధనలను ఇరాన్ పాటించకపోతే తాను అవసరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో కాస్త ఘాటు హెచ్చరికలే జారీ చేశారు."ఇరాన్ తమ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. ఒప్పందం పట్ల వాళ్లు సక్రమంగా ప్రవర్తించాల్సిందే. లేకుంటే నేను చేయాల్సింది నేను చేస్తా. ఊరుకుంటానుకుంటే ఆ దేశం పొరపాటే" అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ.. గత వారం ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాత్కాలిక ఒప్పందం(MoU)పై డిజిటల్ సంతకాలు చేశారు. ప్రత్యక్ష చర్చల్లో భాగంగా.. మొన్న ఆదివారం ఇరాన్, అమెరికా, మధ్యవర్తిత్వ ప్రతినిధులు స్విట్జర్లాండ్లో చర్చలు మొదలుపెట్టారు. దీంతో 60 రోజుల్లో ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందం కుదరాల్సి ఉంటుంది. అయితే.. స్విస్ చర్చలు జరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ను కవ్వించేలా మాట్లాడారు. ఒప్పందం కుదుర్చుకోకపోతే భీకర దాడులు.. అదీ గతంలో కంటే దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగానే ఇరాన్ ప్రతినిధులు చర్చల మధ్య నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో ఇరాన్ అధికార ప్రతినిధులు ట్రంప్ వార్నింగ్పై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ తరుణంలో.. ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్కు ఇరాన్ నుంచి కౌంటర్ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. నిధుల వినియోగంపైనా ఓ క్లారిటీఇదిలా ఉంటే.. ఇరాన్కు చెందిన స్తంభింపజేసిన నిధులను విడుదల చేసే అంశంపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. విడుదలయ్యే డబ్బు మొత్తం అమెరికా నుంచే ఆహార పదార్థాల కొనుగోలుకు వినియోగించాల్సి ఉంటుందని చెప్పారు. "విడుదల చేసే డబ్బంతా తిరిగి అమెరికా రైతులకే చేరుతుంది. ఎందుకంటే ఆ నిధులతో ఇరాన్ అమెరికా నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సుమారు 9.1 కోట్ల జనాభాకు సరిపడా ఆహారాన్ని ఇరాన్ ఉత్పత్తి చేయలేకపోతోంది" అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో ఇరాన్కు నిధుల విడుదల అనేది నేరుగా నగదు సాయం కాదని, నియంత్రిత వినియోగంతో కూడిన ఆర్థిక వ్యవస్థలో భాగమని అమెరికా సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.యుద్ధ ప్రభావం ఇంకా కొనసాగుతూనే..అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు ఇరాన్ యుద్ధం ప్రపంచ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అయితే తాజా ఒప్పందం శాంతికి మార్గం వేస్తుందా? లేదంటే ఇరాన్ ఒప్పంద నిబంధనల అమలుపై కొత్త వివాదాలకు దారితీస్తుందా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక చర్చగా మారింది.ఇదీ చదవండి: ఇదెక్కడి ఫిట్టింగ్?.. పే చేయాల్సింది గల్ఫ్ దేశాలేనా! -
ట్రంప్-ఇరాన్ డీల్.. గల్ఫ్ దేశాల్లో గుబులు!
అమెరికా-ఇరాన్ ఒప్పందంపై గల్ఫ్ దేశాల గుబులు.. డబ్బు, భద్రత, హర్ముజ్పై పెరుగుతున్న ప్రశ్నలు. ఇరాన్ పునర్నిర్మాణానికి 300 బిలియన్ డాలర్లు ఇస్తే.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చెల్లిస్తారు?. ప్రస్తుతం గల్ఫ్ దేశాలను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) తర్వాత ఈ అంశం ఆ రీజియన్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో (Marco Rubio) మూడు రోజుల పర్యటనలో భాగంగా యూఏఈ, కువైట్, బహ్రెయిన్ దేశాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల నేతలు ఇరాన్కు ప్రతిపాదిస్తున్న భారీ ఆర్థిక ప్యాకేజీ, భద్రతా హామీలు, ఆంక్షల సడలింపులపై స్పష్టత కోరే అవకాశం ఉంది.300 బిలియన్ డాలర్ల ప్యాకేజీ..అమెరికా-ఇరాన్ అవగాహన ఒప్పందం ప్రకారం, ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25 లక్షల కోట్లు) విలువైన ప్రణాళికను ప్రాంతీయ భాగస్వాములతో కలిసి రూపొందించాలని అమెరికా అంగీకరించింది. ఈ నిధుల అమలు విధానాన్ని 60 రోజుల్లో ఖరారు చేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు.అయితే ఈ భారీ నిధులు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, దాని సైనిక సామర్థ్యాలను కూడా పెంచే ప్రమాదం ఉందని గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై ఒప్పందంలో స్పష్టమైన ప్రస్తావన లేకపోవడం వారికి మరింత కలవరపెడుతోంది.గల్ఫ్ దేశాల భద్రతా ఆందోళనలుసౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్ దేశాలు అమెరికా భద్రతా వ్యవస్థలో కీలక భాగస్వాములు. ఇటీవల జరిగిన యుద్ధ సమయంలో ఈ దేశాల్లోని అమెరికా స్థావరాలు, పౌర మౌలిక వసతులు ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడుల ముప్పును ఎదుర్కొన్నాయి. అందుకే యుద్ధం ఆగడాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, ఇరాన్కు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తున్నారో తెలుసుకోవాలని గల్ఫ్ దేశాలు కోరుతున్నాయి.స్తంభింపజేసిన ఆస్తులపై కొత్త ఫార్ములా!చర్చల్లో మరో కీలక అంశం ఇరాన్కు చెందిన విదేశీ ఆస్తులు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ JD Vance వెల్లడించిన వివరాల ప్రకారం, ఆంక్షల సడలింపు తర్వాత విడుదలయ్యే నిధుల వినియోగంపై అమెరికా, ఖతార్ సంయుక్త పర్యవేక్షణ ఉండేలా ప్రతిపాదన సిద్ధమైంది.అంటే విడుదలైన డబ్బును ఇరాన్ నేరుగా వినియోగించకుండా, అమెరికా గోధుమలు, మొక్కజొన్న వంటి అవసరమైన వస్తువుల కొనుగోలుకు మాత్రమే ఉపయోగించే విధంగా వ్యవస్థను రూపొందించాలని భావిస్తున్నారు. ఈ ఆలోచనను ట్రంప్ అల్లుడు(ఇవాంక భర్త), మాజీ వైట్హౌస్ సలహాదారు జారెడ్ కుష్నర్ Jared Kushner ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.వందల బిలియన్ల డాలర్లు పణంగా..ప్రారంభ చర్చల్లో 6 నుంచి 25 బిలియన్ డాలర్ల మధ్య ఉన్న స్తంభింపజేసిన నిధుల గురించే చర్చ జరిగినప్పటికీ, వివిధ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్కు చెందిన 100 నుంచి 120 బిలియన్ డాలర్ల వరకు ఆస్తులు ఆంక్షల కారణంగా నిలిచిపోయి ఉన్నాయి. అయితే ఆ నిధుల వినియోగంపై తుది నిర్ణయం తమదే కావాలని ఇరాన్ స్పష్టం చేస్తోంది.హర్ముజ్ జలసంధిపై దృష్టిరుబియో పర్యటనలో మరో కీలక అంశం హర్ముజ్ జలసంధి Strait of Hormuz. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాల్లో కీలక పాత్ర పోషించే ఈ జలసంధి ఇటీవల యుద్ధంతో ఉద్రిక్త ప్రాంతంగా మారింది. యుద్ధానికి ముందు రోజుకు 100 నుంచి 131 నౌకలు ఈ మార్గంలో ప్రయాణించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 71కు పడిపోయింది. 60 రోజుల చర్చల కాలంలో రవాణాపై అదనపు రుసుములు విధించబోమని ఒప్పందంలో ఉన్నప్పటికీ, ఆ గడువు ముగిసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్నదానిపై అనిశ్చితి కొనసాగుతోంది.కీలక ప్రశ్న మాత్రం అదే..ఇరాన్తో శాంతి ఒప్పందం, పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి అన్నీ బాగానే ఉన్నా... 300 బిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అమెరికానా? గల్ఫ్ దేశాలా? లేదంటే అంతర్జాతీయ భాగస్వాములా?** అనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. అందుకే ప్రస్తుతం పశ్చిమాసియా రాజకీయాల్లో అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే... ఆ బిల్లు చివరికి ఎవరు చెల్లించాలి?. -
ఆగని 'గ్రేటర్ ఇజ్రాయెల్' పథకం
ప్రపంచం దృష్టి ఇరాన్, లెబనాన్ వైపు; అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ పూట ఏమంటారనే దానిపై కేంద్రీకరించి ఉండగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మాత్రం తమ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ పథకాన్ని ముందుకు తీసుకుపోతూనే ఉన్నారు. ఆ చర్యలన్నీ తమ దీర్ఘకాలిక పశ్చిమాసియా వ్యూహానికి అనుగుణమై నవే అయినందున అమెరికా ఆ విషయమై ఏమీ మాట్లాడటం లేదు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమెరికా చొరవతో 2025 అక్టోబర్లో జరిగింది. ఆ మేరకు కాల్పుల విరమణ అయితే అమలుకు వచ్చిందిగానీ, ఇజ్రాయెలీ సైన్యం గాజా నుంచి పూర్తిగా ఉపసంహరించుకోలేదు. కొన్ని జోన్లకు పరిమితమై కొనసాగుతుందనీ, ఒప్పందంలోని ఆ యా అంశాలు అమలైనకొద్దీ క్రమంగా ఉపసంహరించుకుంటుందనే మాట ఆ పత్రంలో ఉన్నందున ఆ ప్రకారం అంతా జరుగుతుందనీ భావించారు. కానీ అటు వంటి ఉద్దేశాలు ఇజ్రాయెల్కు గానీ, అమెరికాకు గానీ లేవని త్వరలోనే స్పష్టం కాసాగింది.70 శాతం భూమి పోతుందా?ట్రంప్ తను అట్టహాసంగా ప్రకటించిన 20 అంశాల ‘శాంతి పథకం’వైపుగానీ, నియమించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ వైపుగానీ కన్నెత్తి చూడలేదు. మధ్యవర్తులు, బోర్డు సభ్యులు అయిన దేశాలు అదేమి టని అడగలేదు. ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం గాజా, వెస్ట్ బ్యాంక్ లను మించిన ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ అయినందున వారికి ఈ పరిస్థితి కలిసి వచ్చింది. గాజాలో ఉత్తరం నుంచి దక్షిణానికి గీసిన కాల్పుల విరమణ రేఖను ఉల్లంఘిస్తూ కొత్త ఆక్రమణలు మొదలు పెట్టారు. హమాస్ను వ్యతిరేకించే పాలస్తీనియన్ వర్గాలను, నేరస్థులను ప్రోత్సహించి అక్కడి ప్రజలను పారదోలటం ఈ ఎనిమిది నెలలుగా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నది.పోయిన నెల చివరిలో ఒక బహిరంగ కార్యక్రమంలో నెతన్యాహూ మాట్లాడుతూ, కాల్పుల విరమణ జరిగిన 2025 అక్టోబర్లో, గాజా భూభాగంలో 53 శాతం తమ ప్రత్యక్ష నియంత్రణలో ఉండేదనీ, అది 2026 మే చివరిలో 60 శాతానికి చేరిందనీ, దానిని 70 శాతానికి తీసుకుపోవలసిందిగా తమ సైన్యానికి ఆదే శాలు జారీ చేశాననీ ప్రకటించారు. అనగా, కాల్పుల విరమణ నాటి నుంచి మరొక 17 శాతం భూభాగాన్ని; గాజాపై ఇజ్రాయెల్ దాడులు 2023 అక్టో బర్లో మొదలైనప్పటినుంచి 2026 అక్టోబర్ వచ్చేసరికి మూడేళ్లలో మొత్తం 70 శాతాన్ని కోల్పోతుందన్నమాట. అప్పుడు, మొత్తం 365 చ.కి.మీ.ల విస్తీర్ణంగల గాజాలో అక్కడి ప్రజలకు మిగిలేది 110 చ.కి.మీ.లు. విషయం ఇంతటితో ముగియబోవటం లేదు. నెతన్యాహూ రక్షణ మంత్రి కట్జ్తో పాటు సైన్యాధికారులు, గాజాలోని పాలస్తీని యులందరూ అక్కడి నుంచి ‘స్వచ్ఛందంగా ఖాళీ చేసి’ వేరే దేశాలకు వెళ్లిపోవలసిందేనని హెచ్చరిస్తున్నారు. గాజాపై దాడులు మొదలైన కొత్తలో నెతన్యాహూ, ట్రంప్ చేసిన ప్రకటనలను బహుశా ఎవరూ మరిచి ఉండరు. అక్కడినుంచి స్థానికులను వెళ్లగొట్టి ‘అందమైన రిసార్టులు, వ్యాపార కేంద్రాలు’ నిర్మిస్తామన్నారు.ఆగని సెటిల్మెంట్లు!పాలస్తీనాలో మరొకవైపున గల వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేంలను చూస్తే ఇటువంటి పరిస్థితే కనిపిస్తుంది. వీటి గురించి అసలు వివాదమే లేదనీ, అదంతా తమ దేశంలో భాగమనీ ఇజ్రాయెల్ ఎన్నడో ప్రకటించింది. తమ రాజధాని టెల్ అవీవ్కు అదనంగా ఈస్ట్ జెరూసలేం ఉమ్మడి రాజధాని అన్నది. ఆ ప్రకటనలను ఐక్యరాజ్యసమితి తిరస్కరించగా, రాజధాని విషయాన్ని ట్రంప్ తన మొదటి హయాంలోనే అధికారికంగా గుర్తించారు. ఈ పరిస్థితుల మధ్య జరుగుతున్నది ఇజ్రాయెల్ సేనలు, యూదులు వెస్ట్ బ్యాంక్ను, ఈస్ట్ జెరూసలేం నగరాన్ని ఆక్రమించు కోవడం. ఈ పని కొంతకాలం క్రితమే మొదలు కాగా, నిరుటినుంచి వేగాన్ని అందుకున్నది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ నెల రెండవ వారంలో ఒక నివేదిక విడుదల చేస్తూ, వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనియన్లపై ‘జాతి నిర్మూలన’ కార్యక్రమం జరుగుతున్నట్లు హెచ్చరించింది. యూదు సెటిలర్లు, ఇజ్రాయెలీ సైనికులు కలిసి ఆ పని చేస్తున్నారన్నది. అదే వారంలో అమెరికన్ వార్తా సంస్థ అసోసి యేటెడ్ ప్రెస్ (ఏపీ), బ్రిటిష్ వార్తా సంస్థ బీబీసీ ఆ ప్రాంతాలలో పర్యటించి ఇవే విషయాలను ధ్రువీకరించి చెప్పాయి. అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు విరుద్ధమని ప్రపంచమంతా ఖండించినా లెక్క చేయని ఇజ్రాయెల్ ఇప్పటికే ఏడు లక్షల మంది యూదులను అక్కడ సెటిల్ చేసింది. వారి కాలనీల కోసం కొత్త బడ్జెట్లోనూ వందల మిలియన్ల డాలర్లు కేటాయించింది. కొత్త పరిణామం ఏమంటే, ట్రంప్ విన్యాసాల వైపు ప్రపంచం మళ్లి ఉండగా, ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ లక్ష్యాన్ని సాధించుకొనచూడటం.ఎన్ని దేశాల్లోకి చొచ్చుకుపోతారు?ఇంతకూ ‘గ్రేటర్’ పరిధి ఎంత? అది గాజా, వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేంలకు పరిమితమైనది కాదంటే ఆశ్చర్యం కలగవచ్చు. యూదుల జియోనిస్టు సిద్ధాంతకర్తల ఒరిజినల్ సూత్రీకరణల ప్రకారం స్థూలంగా మధ్యధరా సముద్రం, పశ్చిమాన ఈజిప్టులోని నైలు నది, తూర్పున యూప్రటీస్ నది, దక్షిణాన పలు అరబ్ భూభాగాల మధ్య ప్రాంతమంతా ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ అవుతుంది. అందులోకి ప్రస్తుత ఇజ్రాయెల్, గాజా, వెస్ట్ బ్యాంక్, మొత్తం జోర్డాన్, మొత్తం లెబనాన్, సిరియా, ఇరాక్లతో పాటు సౌదీ భూభాగాలు అనేకం వస్తాయి. ఇటువంటి పటాన్ని నిరుడు తమ దేశంలో స్వయంగా ఎత్తిచూపిన నెతన్యాహూ, ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ ఆలోచనకు తాను బలంగా కట్టుబడి ఉన్నాననీ, ఆ ‘చారిత్రకమైన స్పిరిచ్యువల్ మిషన్లో తనను తాను ఒక భాగంగా భావిస్తా’ననీ ప్రకటించటం గమనించదగ్గది.ఇంత విస్తారమైన ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ అసాధ్యమేగానీ, అదే సమయంలో అర్థం చేసుకోవలసినవి కొన్నున్నాయి. పాలస్తీనా విషయంలో జరుగుతున్నది ఎవరూ ఆపలేకపోతున్నారు. కనీసం వర్తమానంలో. అరబ్ పాలకులు మొక్కుబడిగా ఏమి మాట్లాడినా, ఈజిప్టు నాయకుడు అబ్దుల్ నాసర్ మరణం (1970) తర్వాత పాన్– అరబిజం బలహీనపడటం, అరబ్ నాయకులంతా ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ఇజ్రాయెల్, అమెరికాలతో రాజీపడటం, ఇజ్రాయెల్ పథకానికి ఒక మేరకు మార్గాన్ని సుగమం చేస్తున్నాయి. సిరియా నుంచి ఆక్రమించిన గోలన్ హైట్స్ను తమతో విలీనం చేసు కోవటం, జోర్డాన్, లెబనాన్ భాగాల ఆక్రమణలు, మరొకవైపు అమె రికా ఒత్తిడితో కొందరు అబ్రహామిక్ ఒప్పందాల పేర ఇజ్రాయెల్తో రాజీ పడటం వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇజ్రాయెల్ పథ కాన్ని రాజీ లేకుండా వ్యతిరేకిస్తున్న ఏకైక రాజ్యం ఇరాన్ను లొంగ దీసే ప్రయత్నాలు కనిపిస్తూనే ఉన్నాయి. అటువంటి ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో అబ్రహామిక్ ఒప్పందం చేసుకుంటే సంతోషిస్తానన్న ట్రంప్ ఇటీవల అందరికీ వింత గొలపటం వేరే విషయం!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా
లండన్: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. స్టార్మర్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడి 24గంటల్లో కీర్ స్టార్మర్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. 2024లో బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ ప్రధానిగా రాజీనామా చేశారు. కీర్ స్టార్మర్తో కలిపి పదేళ్లలో ఆరుగురు ప్రధానులు తమ పదవికి రాజీనామా చేయడం గమనార్హం.రాజీనామాకు ముందు స్టార్మర్ తన భార్యతో కలిసి 10డౌనింగ్ స్ట్రీట్ నుంచి బయటకు వచ్చారు. అక్కడ ఆయన మద్దతు దారులు హర్షధ్వానాలు, చప్పట్లుతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెండు సంవత్సరాల క్రితం డౌనింగ్ స్ట్రీట్లో అడుగుపెట్టిన క్షణాన్ని తన జీవితంలో అత్యంత గర్వించదగిన క్షణంగా కీర్ స్టార్మర్ గుర్తుచేసుకున్నారు.స్టార్మర్ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రజల జీవితాలను మార్చాలనే లక్ష్యంతో ప్రారంభించానని పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ సాధించిన అఖండ విజయాన్ని గుర్తుచేసుకుంటూ, తన ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న వేతనాలు, పెరిగిన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, తగ్గుతున్న ఎన్హెచ్ఎస్ నిరీక్షణ జాబితాలు, కార్మికులు, అద్దెదారుల హక్కులు, రక్షణ వ్యయం పెరుగుదల వంటి అంశాలను వివరించారు.నేను తీసుకున్న ప్రతి నిర్ణయం తొలి ప్రాధాన్యత దేశానికే. మా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. అభివృద్ధిలో మా సహచర దేశాల కంటే వేగంగా వృద్ధి సాధించాం. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి నెలా ద్రవ్యోల్బణం కంటే వేగంగా వేతనాలు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో తమ విధానాల వల్ల ఐదు లక్షల మంది పిల్లలను పేదరికం నుండి బయటకు తీసుకువచ్చామని కూడా పేర్కొన్నారు.అయితే, వరుస వివాదాలు, విధాన మార్పులు, తగ్గుతున్న ప్రజా మద్దతు కారణంగా స్టార్మర్ ప్రధాని పదవి నుంచి వైదొలగాలనే డిమాండ్లు వినిపిస్తూ వచ్చాయి. 2024 ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన జీవన ప్రమాణాల మెరుగుదలను అందించడంలో ఆయన ప్రభుత్వం విఫలమైందని అంతర్గతంగా లేబర్ పార్టీలో విమర్శలు వెల్లువెత్తాయి.దీనికితోడు లేబర్ పార్టీ ప్రత్యర్థి ఆండీ బర్న్హామ్ పార్లమెంటరీ సీటు గెలుచుకోవడంతో కీర్ రాజీనామాపై మరింత ఒత్తిడి పెరిగింది. హౌస్ ఆఫ్ కామన్స్లో 100 మందికి పైగా లేబర్ చట్టసభ్యులు ఆయన రాజీనామా చేయాలని లేదా ఆయన నిష్క్రమణకు స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని బహిరంగంగా పిలుపునిచ్చారు.ప్రజా సేవలపై ఒత్తిడి, ఆర్థిక ఆందోళనలు, అక్రమ వలసలు వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో వరుస ప్రభుత్వాల అసమర్థతపై పెరుగుతున్న ప్రజా అసంతృప్తిని ఈ తరచూ జరుగుతున్న మార్పులు ప్రతిబింబిస్తున్నాయి. -
మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!
మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో! -
ఇరాన్ అజేయం.. ట్రంప్నకు కునుకు కరువు!
ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు.. మరోవైపు ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న హెచ్చరికలు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా గడ్డపై అడుగుపెట్టడమే సవాల్గా మారిన ఇరాన్ ఫుట్బాల్ జట్టు.. ఇప్పుడు వరల్డ్కప్లో అజేయంగా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. మైదానంలో ఇరాన్ పోరాటం ఎంత చర్చనీయాంశమవుతుందో.. సోషల్ మీడియాలో ట్రంప్పై వస్తున్న మీమ్స్ కూడా అంతే వైరల్గా మారుతున్నాయి.2026 ఫిఫా వరల్డ్కప్లో ఇరాన్ జట్టు కేవలం ఆటతోనే కాదు.. తమ పట్టుదల, సహనంతో కూడా వార్తల్లో నిలుస్తోంది. గ్రూప్-జీలో తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో 2-2తో డ్రా చేసిన ఇరాన్.. తాజాగా బెల్జియంతో జరిగిన మ్యాచ్లో 0-0తో సమం చేసి రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి లేకుండా నిలిచింది.అయితే ఈ ఫలితాల కంటే ఎక్కువగా చర్చకు కారణమైనది ఇరాన్ జట్టు ఎదుర్కొన్న అసాధారణ పరిస్థితులే. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా పరిమితుల కారణంగా జట్టుకు అమెరికాలో పూర్తిస్థాయిలో బస చేసే అవకాశం లేకపోయింది. దీంతో ఇరాన్ జట్టు మెక్సికోలోనే క్యాంప్ ఏర్పాటు చేసుకుని, ప్రతి మ్యాచ్ కోసం సరిహద్దు దాటి అమెరికాకు ప్రయాణించాల్సి వచ్చింది. అయితే..కఠిన భద్రతా తనిఖీలు, ప్రయాణ ఇబ్బందులు, యుద్ధ ఉద్రిక్తతల మధ్య కూడా ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నారు. అందుకే బెల్జియంతో మ్యాచ్ ముగిసిన తర్వాత లాస్ ఏంజెలెస్ స్టేడియం లాకర్రూమ్లో ఆటగాళ్లు వదిలి వెళ్లిన ఓ భావోద్వేగ లేఖ వైరల్గా మారింది. “మేం గౌరవంగా బయలుదేరుతున్నాం” అంటూ అందులో పేర్కొన్న సందేశం అభిమానులను కదిలించింది.ఇరాన్ ప్రధాన కోచ్ అమీర్ ఘాలెనోయీ కూడా జట్టు పరిస్థితిని వివరించారు. “గత ఆరు నెలలు యుద్ధ వాతావరణంలో గడిచాయి. దేశీయ లీగ్ సక్రమంగా జరగలేదు. అనేక జట్లు మాతో స్నేహపూర్వక మ్యాచ్లు ఆడటానికి కూడా ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచకప్కు వచ్చి రెండు మ్యాచ్ల్లో ఓడిపోకుండా నిలవడం గొప్ప విజయమే” అని వ్యాఖ్యానించారు.pic.twitter.com/kQUwdEcCR4— BeeCeeForty5 🐐 (@BeeCeeForty5) June 21, 2026ఇక సోషల్ మీడియాలో అయితే ఈ విజయానికి మరో కోణం జత అయ్యింది. అమెరికాతో రాజకీయ ఘర్షణలు కొనసాగుతున్న వేళ.. “అమెరికా గడ్డపై ఇరాన్ అజేయం”, “ట్రంప్కు నచ్చని రికార్డు ఇదే”, “ఇరాన్ అమెరికా నేలపై ఓటమి తెలియని జట్టు”, ‘‘ఆయనకు ఈ వార్త నచ్చదేమో’’ అంటూ నెటిజన్లు మీమ్స్తో హల్చల్ చేస్తున్నారు.ప్రస్తుతం రెండు మ్యాచ్ల్లో రెండు పాయింట్లతో ఉన్న ఇరాన్.. నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తదుపరి మ్యాచ్ల్లో ఏమవుతుందో పక్కనపెడితే.. అన్ని అవరోధాల మధ్య అమెరికా గడ్డపై అజేయంగా నిలవడం ద్వారా ఈ ప్రపంచకప్లో ఇరాన్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.donald trump writing a felony against iran pic.twitter.com/yyvpw9UjBy— 𝖔𝖗𝖊. (@oretrafford) June 21, 2026Iran just made the host country's soil their personal playground lmaoo this is too funny 😭 pic.twitter.com/jtSmaFGtJR— ColdRevs 🏎️ (@ColdRevs) June 21, 2026రాజకీయంగా ఒత్తిళ్లు, భద్రతా సవాళ్లు, ప్రయాణ కష్టాలు.. అన్నింటినీ అధిగమించి ఇరాన్ జట్టు వరల్డ్కప్లో నిలబడిన తీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మైదానంలో సాధించిన ఈ ‘అజేయ’ ప్రయాణం.. ట్రంప్ను టార్గెట్ చేసిన సోషల్ మీడియా సెటైర్లకు కూడా కారణమవుతోంది. ఇరాన్ తదుపరి మ్యాచ్లో ఏమి చేస్తుందన్నదానికంటే.. ఇక్కడివరకు ఎలా వచ్చిందన్నదే ఇప్పుడు పెద్ద కథగా మారింది. -
జాగ్రత్తగా మాట్లాడండి.. మా సైన్యం సిద్ధంగానే ఉంది
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కీలక మలుపు తిరిగాయి. స్విట్జర్లాండ్ వేదికగా చర్చలు మొదలు కాగా.. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు, హర్ముజ్ జలసంధి మూసివేత, ఆర్థిక ఆంక్షలు ప్రధాన అడ్డంకులుగా మారాయి. చర్చలు కొనసాగుతుండగానే మరోసారి దాడులు చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించగా.. ఇరాన్ అందుకు ధీటుగానే స్పందిస్తూ వాకౌట్ చేసింది. ఈ పరిణామాలు మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతల వేడిని మరింత పెంచేలా కనిపిస్తున్నాయి.అత్యంత విలాసవంతమైన బర్గెన్స్టాక్ రిసార్ట్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య ఆదివారం తొలి విడత శాంతి చర్చలు జరిగాయి. గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మధ్య కుదిరిన తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ సమావేశాల ప్రధాన లక్ష్యం. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొనగా.. ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ప్రధాన చర్చాకర్త మొహమ్మద్ బాఘేర్ ఘాలిబఫ్ హాజరయ్యారు. పాకిస్తాన్, ఖతర్ ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి.అయితే.. చర్చలకు ముందు ఘాలిబఫ్ ఖతర్, పాకిస్తాన్ ప్రతినిధులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత నాలుగు పక్షాల చర్చలు ప్రారంభమయ్యాయి. సుమారు 80 నిమిషాల పాటు సాగిన తొలి విడత సమావేశంలో యుద్ధ విరమణ అమలు, ఆర్థిక ఆంక్షల సడలింపు, ఇరాన్కు చెందిన విదేశీ నిధుల విడుదల, చమురు ఎగుమతులపై పరిమితుల తొలగింపు వంటి అంశాలపై చర్చ జరిగింది.అయితే చర్చల ఆరంభంలోనే.. లెబనాన్ అంశం ప్రధాన అడ్డంకిగా మారింది. తాత్కాలిక ఒప్పందంలోని మొదటి నిబంధన అయిన "అన్ని రంగాల్లో కాల్పుల విరమణ"ను అమెరికా అమలు చేయలేదని ఇరాన్ ఆరోపించింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. లెబనాన్పై దాడులు ఆగేంత వరకు ఇతర అంశాలపై చర్చలు ముందుకు సాగబోవని ఇరాన్ చర్చల బృందంలోని సభ్యులు స్పష్టం చేశారు.ఇదే సమయంలో హర్ముజ్ జలసంధి అంశం కూడా చర్చల్లో ఉద్రిక్తతను పెంచింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ సముద్ర మార్గాన్ని ఇరాన్ తాజాగా మళ్లీ మూసేసిన సంగతి తెలిసిందే. లెబనాన్లో యుద్ధ పరిస్థితులు కొనసాగుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇరాన్ వివరణ ఇచ్చింది. అయితే హర్ముజ్ తెరిచి ఉంచడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని అమెరికా స్పష్టం చేసింది.ఈ పరిస్థితుల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చలను మరింత సంక్లిష్టం చేశాయి. లెబనాన్లోని తమ అనుకూల బలగాలు, ముఖ్యంగా హెజ్బుల్లాను ఇరాన్ అదుపులో పెట్టాలని, లేదంటే గతవారం చేసిన దాడుల కంటే మరింత తీవ్రంగా దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఇరాన్ ప్రతినిధులు కొద్దిసేపు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు ఇరానియన్ మీడియా వెల్లడించింది.BREAKING: Peace talks in Switzerland with Iran are falling apart already. Iran walks out. More of the same. Eff them. pic.twitter.com/N6WTYKGz34— Buzz Patterson (@BuzzPatterson) June 21, 2026అనంతరం స్పందించిన ఘాలిబఫ్.. అమెరికా బెదిరింపులను ఇరాన్ ఏమాత్రం పట్టించుకోదని, బెదిరింపులు పనిచేసి ఉంటే అమెరికా ఈ స్థాయికి వచ్చేదే కాదని వ్యాఖ్యానించారు. తమ సాయుధ బలగాలు అవసరమైతే భిన్నమైన రీతిలో ప్రతిస్పందించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.అయితే పరిస్థితిని చల్లబరచే ప్రయత్నం చేసిన జేడీ వాన్స్.. ఇలాంటి చర్చల్లో విభేదాలు సహజమని, ప్రక్రియ కొంత గందరగోళంగా కనిపించినా పురోగతి కొనసాగుతోందని చెప్పారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని, ఇరాన్తో సంబంధాలను కొత్త దిశగా తీసుకెళ్లాలని ట్రంప్ సూచించారని పేర్కొన్నారు.చర్చల సందర్భంగా ఇరాన్కు చెందిన స్తంభింపజేసిన నిధుల విడుదలపై కార్యాచరణను ఖరారు చేసే దిశగా చర్చలు జరిగాయి. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షల సడలింపుకు సంబంధించిన ప్రాథమిక ముసాయిదా కూడా సిద్ధమైనట్లు ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే అణు కార్యక్రమం సహా మిగిలిన కీలక అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఇక చర్చల మధ్యలో అమెరికా ప్రతిపాదించిన ఉమ్మడి ఫొటో, కరచాలన కార్యక్రమాన్ని కూడా ఇరాన్ తిరస్కరించింది. దానిని అమెరికా మీడియా ప్రదర్శనగా అభివర్ణిస్తూ.. ఘాలిబఫ్, అరాఘ్చీ పాల్గొనలేదు.మరోవైపు లెబనాన్లో రెండు రోజుల తీవ్ర ఘర్షణల తర్వాత పరిస్థితి కొంత ప్రశాంతంగా కనిపించినప్పటికీ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం దక్షిణ లెబనాన్లో ఏర్పాటు చేసిన భద్రతా మండలిని అవసరమైనంత కాలం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గే సూచనలు కనిపించడం లేదు.స్విట్జర్లాండ్లో శాంతి కోసం చర్చలు జరుగుతున్నా.. లెబనాన్లో యుద్ధం, హర్ముజ్లో ఉద్రిక్తతలు, ట్రంప్ హెచ్చరికలు, ఇరాన్ ప్రతిస్పందనలు చర్చల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయి. తొలి విడత చర్చలు నిలిచిపోయినా.. ముగియలేదని ఇరాన్ చెబుతోంది. ఇప్పుడు రెండో విడత చర్చలు మిడిల్ఈస్ట్లో శాంతిని తీసుకువస్తాయా? లేక మరోసారి యుద్ధానికి దారితీస్తాయా? అన్నదే ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. -
ఒప్పందానికి రాకపోతే ఖబడ్దార్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమతో 60 రోజుల్లోగా తుది ఒప్పందం కుదుర్చుకోకపోతే హార్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామని, అక్కడ నౌకలపై సుంకాలు విధిస్తామని శనివారం తేల్చిచెప్పారు. ఇటీవల సంతకాలు జరిగిన అవగాహనా ఒప్పందం ప్రకారం.. హార్మూజ్ జలసంధిని ఇరాన్ బేషరతుగా తెరవాలని, రానున్న 60 రోజుల పాటు ఎలాంటి సుంకాలు లేకుండా నౌకల రాకపోకలకు వీలు కల్పించాలని వెల్లడించారు. ‘‘ఒకవేళ అమెరికా–ఇరాన్ మధ్య శాశ్వత ఒప్పందం కుదరని పక్షంలో.. 60 రోజుల గడువు ముగిసిన తర్వాత అమెరికా తరఫున విధిస్తే తప్ప హార్మూజ్లో ఎటువంటి సుంకాలు ఉండవు’’అని స్పష్టంచేశారు. ఇరాన్ తమ దారికి రాకపోతే హార్మూజ్ వారి(ఇరాన్) ఆ«దీనంలో ఉండదని ట్రంప్ సంకేతాలిచ్చారు. మధ్యప్రాచ్య దేశాలకు సంరక్షణ సేవలు అందించింనందుకు ఆ ఖర్చులను హార్మూజ్లో టోల్ ఫీజుల రూపంలో వసూలు చేసుకుంటామని వివరించారు. హెజ్బొల్లాను అదుపు చేయాలి లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ను తక్షణమే అదుపు చేయాలని ఇరాన్కు ట్రంప్ తేల్చిచెప్పారు. లేకపోతే ఇరాన్పై మళ్లీ సైనిక చర్యకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ట్రూత్ సోషల్లో పోస్టుచేశారు. స్విట్జర్లాండ్లో అమెరికా–ఇరాన్ చర్చలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ట్రంప్ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. ‘‘ఇరాన్ అండదండలతో లెబనాన్లో ఇబ్బందులు సృష్టిస్తున్న మిలిటెంట్ గ్రూప్లను ఇరాన్ ప్రభుత్వం వెంటనే అదుపు చేయాలి. వారు(ఇరాన్) అందుకు అంగీకరించకపోతే గతవారం చేసినట్లే ఈసారి మరింత తీవ్రంగా ఇరాన్పై దాడి చేస్తాం’’ అని ట్రంప్ తేల్చిచెప్పారు. -
ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
ఇరాన్కు మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు చేస్తామని.. గత వారం కంటే ఈసారి దాడులు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు. డీల్ కుదరకపోతే హర్మూజ్ను ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. హర్ముజ్ను క్లోజ్ చేస్తే మీకు దేశం లేకుండా చేస్తామన్న ట్రంప్.. హిజ్బొల్లాను అదుపు చేయకపోతే ఇరాన్పై మళ్లీ దాడులు చేస్తామన్నారు.లెబనాన్లో సమస్యలు సృష్టిస్తున్న ప్రాక్సీలను ఇరాన్ వెంటనే నియంత్రించాలని తన 'ట్రూత్ సోషల్' పోస్ట్లో రాసుకొచ్చారు. 60 రోజుల్లో ఇరాన్తో ఒప్పందం కుదరకపోతే హర్మూజ్లో టోల్స్ వసూలు చేస్తామన్నారు. మరో వైపు, పశ్చిమ ఆసియాలో నెలల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో కీలక చర్చలు ప్రారంభమయ్యాయి.ఇటీవల కుదిరిన చారిత్రాత్మక ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’ ఆధారంగా ఈ ఉన్నత స్థాయి దౌత్య సమావేశం జరుగుతోంది. కతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తుండగా, స్విస్ దౌత్యవేత్తలు ఈ వేదిక సిద్ధం చేశారు. రాబోయే 60 రోజుల్లో సమగ్ర అణు ఒప్పందాన్ని ఖరారు చేయడం, ప్రాంతీయ శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా ఇరు దేశాల ప్రతినిధులు ఈ చర్చల్లో పాలుపంచుకుంటున్నారు. -
అమెరికాకు భారీ షాక్.. ట్రంప్కు కోలుకోలేని దెబ్బ!
యుద్ధాలు కేవలం యుద్ధభూములకే పరిమితం కావు. అవి దేశాల ఆర్థిక వ్యవస్థలను, ప్రజల జీవన ప్రమాణాలను, అంతర్జాతీయ మార్కెట్లను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దీనికి తాజా ఉదాహరణ అమెరికా-ఇరాన్ ఘర్షణ. కేవలం కొన్ని వారాల పాటు సాగిన ఈ యుద్ధం అమెరికాకు ఇప్పటికే 132 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11 లక్షల కోట్లకు పైగా) ఆర్థిక భారం మోపినట్లు ప్రముఖ ఆర్థిక సంస్థ మూడీస్ అనలిస్టిక్స్ ‘Moody’s Analytics’ అంచనా వేసింది. అయితే ఇది కేవలం అమెరికా నష్టమే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ మిలీషియా గ్రూపులకు మద్దతు, ఇజ్రాయెల్ భద్రత వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. పరిస్థితి మరింత దిగజారడంతో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్కు చెందిన వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు ప్రారంభించాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణి దాడులు, ప్రాంతీయ సైనిక చర్యలతో స్పందించింది. యుద్ధం పూర్తిస్థాయి ప్రాంతీయ సంక్షోభంగా మారుతుందేమోనన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమైంది. ముఖ్యంగా చమురు సరఫరాకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం ప్రపంచ మార్కెట్లను వణికించింది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ..ప్రపంచ చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు హార్మూజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయవచ్చనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లకు పైగా చేరుకునే పరిస్థితి ఏర్పడింది. చమురు ధరలు పెరగడం అంటే కేవలం పెట్రోల్, డీజిల్ ఖరీదు పెరగడమే కాదు. విమాన ప్రయాణాలు, సరుకు రవాణా, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల ఖర్చులు, ఆహార ధరలు ఇలా ప్రతి రంగంపైనా ప్రభావం పడింది. అందుకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఒత్తిడిలోకి వెళ్లింది.అమెరికాపై ఎఫెక్ట్ ఎలా?Moody’s Analytics లెక్కల ప్రకారం యుద్ధం వల్ల అమెరికాలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. గ్యాలన్ పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో కుటుంబాల నెలవారీ ఖర్చులు పెరిగిపోయాయి. ట్రక్కింగ్, విమానయాన, తయారీ రంగాలపై అదనపు భారం పడింది. ఫలితంగా వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ఇలా ప్రతి అమెరికా కుటుంబం సగటున వందల డాలర్ల అదనపు ఖర్చును భరించాల్సి వచ్చినట్లు అంచనా. మరోవైపు ప్రభుత్వం సైనిక చర్యలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, నౌకాదళ మోహరింపు, మధ్యప్రాచ్యంలోని సైనిక స్థావరాల నిర్వహణ కోసం భారీ మొత్తాలను ఖర్చు చేసింది. మరోవైపు.. అమెరికా ఇప్పటికే 40 ట్రిలియన్ డాలర్లకు చేరువలో ఉన్న జాతీయ రుణంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో మరో భారీ సైనిక ఘర్షణ ఫెడరల్ బడ్జెట్పై అదనపు ఒత్తిడిని పెంచిందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, అమెరికాలో పెట్రోల్ ధరలు పెరగడం రాజకీయంగా కూడా పెద్ద అంశం. సాధారణంగా గ్యాస్ ధరలు పెరిగితే అధికార ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. అందుకే యుద్ధం ప్రభావం అమెరికా అంతర్గత రాజకీయాలపై కూడా పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.యుద్ధభూమిలోనే కాదు.. మార్కెట్లలో కూడా నష్టంఈ యుద్ధం ప్రభావం స్టాక్ మార్కెట్లపైనా పడింది. పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి వెనక్కి తగ్గడంతో ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకులు కనిపించాయి. బంగారం, డాలర్ వంటి సురక్షిత పెట్టుబడుల వైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపారు. యూరప్లో ఇప్పటికే మందగమనం ఎదుర్కొంటున్న పరిశ్రమలకు ఇంధన ఖర్చుల పెరుగుదల మరింత దెబ్బతీసింది. ఆసియా దేశాల్లో దిగుమతి ఖర్చులు పెరగడంతో ద్రవ్యోల్బణ ఒత్తిడి మళ్లీ పెరిగింది.భారత్పై ప్రభావం?భారత్ ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటి. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి భారత్కు ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. చమురు ధరలు పెరిగితే దిగుమతి బిల్లు పెరుగుతుంది. రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల పరిస్థితులు కొంత సద్దుమణగడంతో మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. అయినప్పటికీ జలసంధి ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగితే ప్రభావం భారత్పైనా గణనీయంగానే ఉండే అవకాశం ఉంది.యుద్ధం ముగిసినా..ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష ఘర్షణలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఆర్థిక ప్రభావం మాత్రం వెంటనే తగ్గే పరిస్థితి లేదు. చమురు సరఫరా గొలుసులు సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా కొన్ని నెలల పాటు కొనసాగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం ఈ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చి ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2 నుంచి 3.5 ట్రిలియన్ డాలర్ల వరకు నష్టం సంభవించే అవకాశం ఉండేదని అంచనా.కాగా, యుద్ధాలు గెలుపు-ఓటముల గురించి మాత్రమే కావు. వాటి అసలు ఖరీదు ఆర్థిక వ్యవస్థలు, సాధారణ ప్రజలు, ప్రపంచ మార్కెట్లు చెల్లిస్తాయి. అమెరికా-ఇరాన్ ఘర్షణ కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. యుద్ధం కొన్ని వారాల్లో ముగిసినా, దాని ఆర్థిక ప్రతిధ్వనులు మాత్రం నెలలు, సంవత్సరాల పాటు వినిపించే అవకాశముంది. మిసైళ్లు కొన్ని నిమిషాల్లో పేలిపోతాయి... కానీ వాటి ఆర్థిక ప్రభావం మాత్రం ఏళ్ల తరబడి దేశాలను వెంటాడుతుంది. అమెరికాకు 132 డాలర్ల బిలియన్ల బిల్లు, ప్రపంచానికి ట్రిలియన్ల డాలర్ల భయం మిగిల్చిన ఘర్షణగా ఈ యుద్ధం చరిత్రలో నిలిచిపోనుంది. -
మెలోనిపై మరోసారి మండిపడ్డ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని మెలోని మధ్య వైరం రోజురోజుకు ముదురుతుంది. తాజాగా మెలోని వ్యాఖ్యలకు ట్రంప్ కౌంటరిచ్చారు. ఇటలీలో ఆమె పనులు సరిగ్గా లేవని అందుకే ఆమె.. తనను విమర్శిస్తూ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. అయితే దీనికి మెలోనీ సైతం కౌంటరిచ్చింది. తన ప్రజాదారణతో మీకేం పని అని ట్రంప్ను ప్రశ్నించింది. డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఇటలీ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య అగ్గి రాజేస్తున్నాయి.. ట్రంప్ వ్యాఖ్యలను మెలోని ఇదివరకే ఖండించగా మరోసారి సోషల్ మీడియా వేదికగా ట్రంప్ రెచ్చిపోయారు.తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా స్పందిస్తూ.."ఇటలీలో మెలోని ప్రజాదరణ చాలా బలహీనంగా ఉంది. ఇరాన్ అణుబాంబు తయారీని అడ్డుకునే విషయంలో ఆమె అమెరికాకు మద్దతు ఇవ్వకపోవడమే దీనికి కారణం కావచ్చు. నిజానికి ఇటలీని అమితంగా ప్రేమించేది, రక్షించేది అమెరికా మాత్రమే ఆ మాటకు వస్తే నాటో కూడా ఇరాన్ విషయంలో అలాగే వ్యవహరించింది" అని రాసుకొచ్చారు.అదేవిధంగా యుద్ధ సమయంలో ఇటలీకి చెందిన రన్వేలను లేదా ల్యాండింగ్ స్ట్రిప్స్ను అమెరికా వాడుకోకుండా మెలోని అడ్డుకున్నారని ఆరోపించారు. ఇటలీతో పాటు ఇతర నాటో కూటమి దేశాల రక్షణ కోసం అమెరికా ప్రతిటా వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ మెలోని కనీసం మా విమానాలు ల్యాండ్ అవ్వడానికి కూడా అనుమతించలేదు. ఇది మాకు తీవ్రమైన రవాణా ఇబ్బందిని కలిగించిందని.. ఇప్పుడు తన ప్రజాదరణ రేటింగ్లను పెంచుకోవడం కోసమే ఆమె నాతో స్నేహం నటిస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు.మెలోని స్పందనట్రంప్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అంతే తీవ్రంగా స్పందించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె ట్రంప్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. "ఇలాంటి కారణం లేని, నిరంతర దాడులు అర్థరహితమైనవి. మీతో స్నేహం చేయడం వల్ల నా ప్రజాదరణ పెరిగిందేమీ లేదు, అది మీతో ఉండే సంబంధాలపై ఆధారపడి కూడా లేదు. ఇటలీ జాతీయ ప్రయోజనాలను కాపాడటంలో నాకున్న సామర్థ్యంపైనే నా ప్రజాదరణ ఆధారపడి ఉంటుంది. నేను ఎప్పుడూ దాన్నే చేస్తూ వచ్చాను" అని మెలోని స్పష్టం చేశారు.ఏది ఏమైనప్పటికీ, నా ప్రజాదరణ గురించి మీకేం అవసరం లేదు. దానికి బదులు మీ పాపులారిటీపై మీరు దృష్టి పెడితే మంచిదని నా సూచన అంటూ మెలోని ట్రంప్పై విరుచుకుపడ్డారు.వివాదం ఎలా మెుదలైందంటే..ట్రంప్ మాట్లాడుతూ " నేను మెలోనితో మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆమె నాతో ఫోటో దిగాలని ఎంతగానో తపించింది. నేను అసలు ఫోటో దిగకూడదనే అనుకున్నాను, కానీ ఆమెను చూసి జాలిపడి మాట్లాడాను. నాతో మాట్లాడినందుకు ఆమె ఇప్పుడు సంతోషంగానే ఉండి ఉంటుంది" అని అన్నారు. దీనికి ఘాటుగా బదులిచ్చిన మెలోని "డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా కల్పితాలు, ఈ ప్రవర్తన నన్ను ఆశ్చర్యపరిచింది. అమెరికా అధ్యక్షుడు తన సొంత మిత్రదేశాల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదు. అయితే పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల, అమెరికా శత్రువుల పట్ల ఆయన ఇంత పట్టుదల చూపించకపోవడం విచారకరం. నేను గానీ, నా దేశం ఇటలీ గానీ ఎవరిముందూ ఎన్నటికీ మోకరిల్లం, బతిమాలం" అని మెలోని తేల్చిచెప్పారు. -
హార్మూజ్పై ట్రంప్ కొత్త ఎత్తుగడ.. చమురు ప్రపంచానికి షాక్?
వాషింగ్టన్: మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా చల్లారకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం 60 రోజుల తర్వాత శాశ్వత ఒప్పందంగా మారకపోతే, ప్రపంచ ఇంధన సరఫరాలకు ప్రాణాధారంగా భావించే హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్లే నౌకలపై అమెరికా టోల్లు (రుసుములు) విధించే అవకాశాన్ని ఆయన ప్రస్తావించారు.ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికలో చేసిన పోస్టులో.. ప్రస్తుతం అమలులో ఉన్న 60 రోజుల కాల్పుల విరమణ (Ceasefire) సమయంలో ఎలాంటి టోల్లు ఉండవని స్పష్టం చేశారు. అయితే చర్చలు విఫలమై తుది ఒప్పందం కుదరకపోతే, మధ్యప్రాచ్య దేశాలకు అమెరికా ‘Guardian Angel’గా అందించిన భద్రతా సేవలకు ప్రతిఫలంగా అమెరికానే టోల్లు విధించవచ్చని పేర్కొన్నారు. గతం, వర్తమానం, భవిష్యత్తులో అందించిన భద్రతా సేవల ఖర్చులకు ఇది పరిహారం అని ఆయన వ్యాఖ్యానించారు.There will be NO TOLLS in the Hormuz Strait for 60 days during the Cease Fire Period, and there will be NO TOLLS after the 60 day period has expired, unless they are imposed by and for the United States of America, should the deal not be completed, for services rendered as the… pic.twitter.com/f2DtGeiLUf— Commentary Donald J. Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) June 20, 2026ఇరాన్ వాదన.. అమెరికా ఖండనఇదిలా ఉండగా, తాజాగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య లెబనాన్లో కొనసాగుతున్న ఘర్షణలు కాల్పుల విరమణకు విరుద్ధమని ఆరోపించింది. అయితే, అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ వాదనను ఖండించింది. జలసంధి తెరిచే ఉందని, ఒక్కరోజులోనే 55 వాణిజ్య నౌకలు 17 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురుతో ప్రయాణించాయని వెల్లడించింది.స్విట్జర్లాండ్లో కీలక చర్చలుఈ వివాదాల మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం, ఇరాన్ మహ్మద్ బాకిర్ క్వాలిబాఫ్ నేతృత్వంలోని ప్రతినిధులతో స్విట్జర్లాండ్లో కీలక చర్చలు జరుపుతోంది. ఈ చర్చల్లో అణు కార్యక్రమం, హార్మూజ్ భవిష్యత్ నిర్వహణ, ప్రాంతీయ భద్రత వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?ట్రంప్ తాజా వ్యాఖ్యలు కేవలం రాజకీయ హెచ్చరికలు మాత్రమే కావు. హార్మూజ్పై టోల్లు లేదా కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తే ప్రపంచ చమురు ధరలు, రవాణా వ్యయాలు, ఇంధన మార్కెట్లు తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం శాంతి చర్చల ఫలితాలపైనే ప్రపంచ ఇంధన మార్కెట్ల దృష్టి కేంద్రీకృతమైంది. ఇప్పుడు అందరి దృష్టి స్విట్జర్లాండ్లో జరుగుతున్న అమెరికా-ఇరాన్ చర్చలపైనే ఉంది. -
ఒప్పందం ఉత్తదేనా?
జెరూసలేం: దక్షిణాసియాలో శాంతి సాధనే ధ్యేయoగా అమెరికా–ఇరాన్ల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందానికి ఏ విలువా లేకుండాపోతోంది. ఇరుదేశాల అధ్యక్షులు స్వయంగా సంతకాలు చేసిన ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఏమాత్రం లేక్కచేయడం లేదు. దాంతో తమకు సంబంధమే లేదన్నట్లుగా లెబనాన్పై భీకర దాడులకు దిగుతోంది. గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగిన వైమానిక, డ్రోన్ దాడుల్లో 47 మంది మరణించగా, ఇజ్రాయెల్ సైన్యం శనివారం సైతం దాడుల పరంపర కొనసాగించింది. దక్షిణ లెబనాన్పై జరిగిన తాజా దాడుల్లో ఇద్దరు చిన్నారులు సహా కనీసం 16 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. నబాతియే నగరంతోపాటు పరిసర గ్రామాలు బాంబుల మోతతో దద్దరిల్లాయి. పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీసం ఏడుగురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు లెబనాన్ జాతీయ వార్తా సంస్థ తెలియజేసింది. స్థానికులు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నట్లు సమాచారం. ఇరాన్ అండదండలతో లెబనాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హెజ్బోల్లా మిలిటెంట్ గ్రూప్ను అంతం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ చెబుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇజ్రాయెల్, హెజ్బోల్లా అంగీకరించినట్లు శుక్రవారం వార్తలొచ్చాయి. కానీ, అందులో నిజం లేదని శనివారం నాటి దాడులతో తేలిపోయింది. ఉద్రిక్తతలకు ఇజ్రాయెల్ కారణం: హెజ్బోల్లా దక్షిణ లెబనాన్లో ఉన్న తమ సైన్యంపై హెజ్బొల్లా గ్రూప్ తొలుత దాడులకు పాల్పడిందని, 50కి పైగా క్షిపణులను ప్రయోగించిందని, దాంతో తమ సైన్యం ఎదురుదాడికి దిగినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. దక్షిణ లెబనాన్లో హెజ్బొల్లా రాకెట్ ప్రయోగ స్థావరాలు, కమాండ్ సెంటర్లతో సహా డజన్ల కొద్దీ లక్ష్యాలు, మిలిటెంట్లపై దాడి చేసినట్లు ప్రకటించింది. ఈ ఉద్రిక్తతలకు ముమ్మాటికీ ఇజ్రాయెల్ కారణమని హెజ్బోల్లా ఆరోపించింది. కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. అయితే, శుక్రవారం రాత్రి కాల్పుల విరమణను ఇజ్రాయెల్ పలుమార్లు ఉల్లంఘించినట్లు విమర్శించింది. ఒప్పందానికి ముప్పు? మధ్యంతర (అవగాహనా) ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూదు పెజెష్కియాన్ సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. లెబనాన్లో తక్షణమే సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని, ఆ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలన్న షరతును ఈ ఒప్పందంలో చేర్చారు. కానీ, దీనిపై ఇజ్రాయెల్ గానీ, హెజ్బొల్లా గానీ సంతకాలు చేయలేదు. అందులో భాగస్వామిగా చేరలేదు. రెండు పక్షాల దాడులు, ప్రతిదాడులు ఇలాగే కొనసాగితే మధ్యంతర ఒప్పందానికి ముప్పు వాటిల్లినట్లేనని, పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్కు ముప్పు తొలగిపోయే వరకు దక్షిణ లెబనాన్లో తమ బలగాలను కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టంచేశారు. లెబనాన్ నుంచి వైదొలగడానికి ఇజ్రాయెల్ ఒప్పుకుంటే తప్ప తాము దాడులను ఆపలేమని హెజ్బోల్లా చెబుతోంది. లెబనాన్ ప్రభుత్వం, ఇజ్రాయెల్ మధ్య తదుపరి విడత చర్చలు వచ్చేవారం వాషింగ్టన్లో జరుగుతాయని సమాచారం. -
మోదీ మొండిఘటం
వాషింగ్టన్: ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగే మొండిఘటం మోదీ అంటూ ప్రధానిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఫ్రాన్స్లో జీ7 శిఖరాగ్ర సదస్సు వేళ ప్రధాని మోదీని పొగిడిన మూడ్రోజులకే మరోసారి మోదీని ట్రంప్ పొగడటం విశేషం. శనివారం యాక్సియస్ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ప్రస్తావన వచ్చినప్పుడు ఆయనను ట్రంప్ కొనియాడారు. ‘‘ మోదీ ఎంతో మంచి వ్యక్తి. అది నిజం. ఎన్నో అంశాల్లో మోదీ మెరుగ్గా ఉన్నారు. యుద్ధాలను దూరంగా ఉన్నారు. అది నిజంగా తెలివైన నిర్ణయం. ఆయనకు ఏకంగా 150 కోట్ల మంది జనం అండగా ఉన్నారు. ఇన్ని కోట్ల మంది మద్దతుతో బడానేతగా ఎదిగారు. వాస్తవానికి భారత్ అతిపెద్దది. మోదీ గొప్ప నాయకుడు. భారత్తో మేం పెద్ద మొత్తంతో వాణిజ్యకార్యకలాపాలు కొనసాగిస్తున్నాం. గతంలో భారత్ మాతో తక్కువ వ్యాపారం చేసేది. ఇప్పుడు మరింతగా, అత్యంత పారదర్శకంగా వాణిజ్యం జరుపుతున్నాం’’ అని అన్నారు. అధికారం, మధ్యవర్తిత్వం, దౌత్యం నెరిపే ఒడుపు, సత్ఫలితాలను సాధించే సత్తా ఉన్న ఇద్దరు గొప్ప నేతల పేర్లు చెప్పండి అని యాక్సియస్ సంస్థ ప్రతినిధి అడగ్గా.. ‘‘అధికారం, అవతలి దేశాన్ని ప్రభావితంచేసే శక్తియుక్తులు, తాము అనుకున్నది రాబట్టే సత్తా విషయంలో నాకు మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నచ్చు తారు. వీళ్ల ఇద్దరి ఘనతను చాటేలా ఒక సినిమా తీయాలంటే మాత్రం అచ్చం వీళ్లలా వేషభాషలు, హావభావాలు పలికించే అద్భు త నటుడు హాలీవుడ్లో లేనేలేడు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘మోదీ అంటే నాకెంతో గౌరవం. పైకి ఎంతో సౌమ్యంగా మాట్లాడే మోదీ నిజానికి ఎంతో ఘటికుడు. అనుకున్న ది సాధించేదిదాకా వదలరు. గతంలో ఆయ న గురించి నాకు అంతగా తెలియదు. తర్వా త తెల్సుకున్నా’’ అని అన్నారు. ‘‘భారత్ను దశాబ్దాలుగా గమనిస్తున్నా. అప్పట్లో భారత్ లో ప్రభుత్వాలు వెనువెంటనే మారిపోయేవి. ఆరు నెలలు, ఏడాదికే ప్రధాని మారిన సందర్భాలున్నాయి. ఇదంతా ఒక్కసారిగా మారిపోయింది. ఈ మార్పులు మోదీ చరమగీతం పాడారు. ఆయన వచ్చాక 12 ఏళ్లుగా ఆయనే పరిపాలిస్తున్నా. స్థిరమైన పాలన చూపించారు. చూడ్డానికి ఎంతో శాంతంగా కన్పిస్తారు. కానీ ఆయన దృఢమైన వ్యక్తి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంటే కూడా తనకు ఇష్టమని ట్రంప్ తెలిపారు. -
కొత్త ఎయిర్ఫోర్స్వన్
వాషింగ్టన్: స్నేహపూర్వక సంబంధాలకు గుర్తుగా ఖతర్ పాలకులు తనకు బహూకరించిన అత్యంత విలాసవంత విమానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం వాషింగ్టన్లోని జాయింట్ బేసి ఆండ్రూస్ స్థావరంలో ఆవిష్కరించారు. బోయింగ్ కంపెనీ తయారుచేసిన 747–8ఐ రకం లగ్జరీ విమానాన్ని ఇకపై ట్రంప్ అధికార పర్యటనల కోసం ‘ఎయిర్ఫోర్స్ వన్’గా ఉపయోగించనున్నారు. త్వరలో ఇది అధ్యక్షుని అధికార విధుల్లో చేరనుంది. నాలుగు దశాబ్దాలపాటు సేవలందించి పాతబడిపోయిన బోయింగ్ 747 రకం ఎయిర్ఫోర్స్వన్ విమానం జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ మొదలు ఎందరో అమెరికా అధ్యక్షులకు సేవలందించింది. తాను బహుమతిగా అందుకున్న విమానాన్ని ట్రంప్ ఎగిరే వైట్హౌజ్గా అభివర్ణించారు. ‘‘పాత విమానాన్ని రాబిన్ ఎగ్ బ్లూ ఎక్స్టీరియర్ ఉండగా కొత్త విమానం ఎరుపు, తెలుపు, బ్లూ రంగుల్లో ఎంతో ఆకర్షిణీయంగా కన్పిస్తోంది. గతంలో మనం బేబీ బ్లూ ఇష్టపడే వాళ్లం. ఇప్పుడు మారాల్సిన సమయం వచ్చింది. అమెరికా జాతీయ జెండాలోని రంగులతో విమానం కొత్త సొబగులు అద్దుకుంది’’అని ట్రంప్ తెలిపారు. ట్రంప్ ప్రయాణించడానికి ముందు 2, 3 వారాల పాటు దీనిని పరీక్షించి అంతా సవ్యంగా ఉందని నిర్ధారించుకున్నాక ట్రంప్ కోసం కొత్త ఎయిర్ఫోర్స్వన్ను కేటాయిస్తారు. ఇప్పటికే అధునాతన విమానాన్ని సిద్ధంచేసి ఇవ్వాలని బోయింగ్ కంపెనీకి అమెరికా ప్రభుత్వం ఆర్డర్ఇచ్చింది. అయితే అవి మరో రెండేళ్లు ఆలస్యంకానున్న నేపథ్యంలో అప్పటిదాకా ఖతర్ బహూకరించిన 40 కోట్ల డాలర్ల విలువైన ఈ విమానాన్నే ఎయిర్ఫోర్స్వన్గా ట్రంప్ ప్రపంచ పర్యటనలకు ఉపయోగించనున్నారు. జూలై 4వ తేదీన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో బోయింగ్ 747–8ఐ లగ్జరీ జెట్ సైతం ఫ్లై–పాస్ట్లో పాల్గొననుందని తెలుస్తోంది. జూలైలో తుర్కియేలో జరగబోయే నాటో సదస్సుకు కొత్త విమానంలోనే వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. గత వారం ఫ్రాన్స్లో జీ7 శిఖరాగ్ర సదస్సు కోసం ట్రంప్ చేసిన ప్రయాణమే పాత ఎయిర్ఫోర్స్వన్లో చేసిన చివరి అధికారిక పర్యటనగా నిలిచిపోనుంది. కొత్త సాఫ్ట్వేర్, హార్డ్వేర్కు 3,774 కోట్లు.. ‘‘ఈ విమానం రెండేళ్ల తర్వాత రాబోయే ఎయిర్ఫోర్స్వన్కు వారధిగా సేవలందించనుంది. దీనిని సాంకేతికంగా వీసీ–25బీ బ్రిడ్జ్ ఎయిర్క్రాఫ్ట్గా పేర్కొంటాం’’అని వాయుసేన చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ కెన్ విల్స్బాక్ వ్యాఖ్యానించారు. ఖతర్ నుంచి స్వీకరించాక అమెరికా అధ్యక్షుడికి అసాధారణ రక్షణ కల్పించేలా ఈ విమానంలో సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ వ్యవస్థసహా ఎన్నో భద్రత ఏర్పాట్లు మార్చారు. వీటి కోసం ఏకంగా దాదాపు రూ.3,774 కోట్లు ఖర్చయిందని కెన్ వెల్లడించారు. అందంగా కన్పించేందుకు విమానం తోక వద్ద అమెరికా జెండా గుర్తును ముద్రించారు. విమానం లోపల ఎంతో ఆహ్లాదకరంగా కన్పించేలా ఇంటీరియల్స్ను డిజైన్చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విమానం అని స్థావరం హ్యాంగర్ వద్ద ట్రంప్ ప్రసంగించారు. దీనిని ఇంత అందంగా రూపుదిద్దిన కారి్మకులకు హ్యాట్సాఫ్. మీ కారణంగా ఈ విమానం చరిత్రలో ఎవ్వరూ చూడనంత లగ్జరీగా మారింది. ఇది ఎగిరే శ్వేతసౌధం. నాణ్యమైన కలప, నాణ్యమైన మెటీరియల్స్, నాణ్యమైన ఇంజిన్లు. చక్కటి విమానం ఇచ్చినందుకు ఖతర్కు కృతజ్ఞతలు’’అని అన్నారు. లెదర్ సీట్లు, బంగారు వర్ణాన్ని తలపించే లేత గోధుమ రంగు గోడలు, సుతిమెత్తని కార్పెట్లు, సరస్సులో ఈదే బాతు పెయింటింగ్లతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు’’అని ట్రంప్ తెలిపారు. -
చైనా ముప్పు మరింత పెరిగింది
వాషింగ్టన్: చైనా నుంచి బెడద తమకు మరింతగా పెరిగిందని తైవాన్ అంటోంది. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం తక్షణమే అమెరికా ఆయుధాలను అందించాలని కోరుతోంది. అదేసమయంలో, తమ విషయంలో అమెరికా విధానంలో మార్పు వచ్చినట్లుగా ఎటువంటి చాయలు కనిపించడం లేదని తెలిపింది. అమెరికాలోని తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ రిప్రజెంటేటివ్ కార్యాలయం చీఫ్ అలెగ్జాండర్ యుయి టాహ్ రే ఇటీవల వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడారు. తైవాన్ విషయంలో గత ప్రభుత్వాల విధానాలకు భిన్నంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యలు చేయడం తెల్సిందే. అమెరికా ప్రధాన భూభాగానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తైవాన్ను రక్షించడం తమవల్ల కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో తైపీలోని నేతలు షాకయ్యారు. తైవాన్ రక్షణ బాధ్యత ఆ దేశ ప్రజలే చూసుకోవాలని కూడా అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎకనామిక్ అండ్ కల్చరల్ రిప్రజెంటేటివ్ కార్యాలయం చీఫ్ అలెగ్జాండర్ యుయి టాహ్ రే తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.అమెరికా కోసం ఎదురు చూడలేం ‘ఆత్మరక్షణ కోసం మాకు ఆయుధాలు కావాలి. రక్షణ బడ్జెట్ను పెంచుకుంటున్నాం. సంక్షోభాన్ని తట్టుకుని, మమ్మల్ని మేం రక్షించుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం’అని అలెగ్జాండర్ చెప్పారు. ‘మా భద్రతకు మాదే బాధ్యత. అమెరికా సైన్యం వచ్చి మమ్మల్ని కాపాడుతుందని ఎదురు చూస్తూ ఉండలేం. ఆ దేశ సైన్యంపై ఆధారపడలేం. అందుకే మమ్మల్ని మేం మరింత బలోపేతం చేసుకోవ డానికి అమెరికా నుంచి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’అని ఆయన అన్నారు. చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు స్థాయికి తగినట్లుగా ఆయుధాల విక్రయం ఉండాలన్న ఆయన.. ప్రస్తుతం చైనా నుంచి ముప్పు వాస్తవానికి చాలా ఎక్కువగానే ఉందని వ్యాఖ్యానించారు. ‘మేం దురాక్రమణదారులం కాదు. చైనా మాత్రమే నిరంతరం యుద్ధ విమానాలను, నౌకలను మా వైపునకు పంపుతూ కయ్యానికి కాలు దువ్వుతోంది. తైవాన్లో మాకున్న స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నది కూడా చైనాయే’అని ఆయన ఆరోపించారు.రుబియో చెప్పిందదే..తైవాన్ విషయంలో అమెరికా విధానంలో మార్పు వచ్చినట్లు తమకు కనిపించడం లేదని అలెగ్జాండర్ చెప్పారు. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కొన్ని ప్రకటనలను తమ ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. తమకు ఆయుధాల విక్రయం విషయంలో ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో కాంగ్రెస్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆయన ప్రస్తావించారు. తైవాన్కు ఆయుధాల విక్రయం అంశంపై చైనాతో సంప్రదింపులు, చర్చలు జరపలేదని రుబియో చెప్పారన్నారు. ఆయు ధాల ప్యాకేజీని నిలిపివేయలేదు, ఆయుధాల నిల్వలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్యాకేజీపై సమీక్ష మాత్రమే చేపట్టామని రుబియో తెలిపారని అలెగ్జాండర్ గుర్తు చేశారు. చైనా దాడి చేసిన పక్షంలో తైవాన్కు కాపాడేందుకు సైన్యాన్ని పంపేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు గత అధ్యక్షుడు జో బైడెన్ పలుమార్లు ప్రకటించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పసిఫిక్ సముద్రంలోని తైవాన్ తదితర ద్వీపాలపై చైనా పెత్తనాన్ని నిలువరించేందుకు రక్షణ వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేయాలని రక్షణ శాఖ నివేదిక సైతం పేర్కొంది.మాట మార్చిన ట్రంప్చైనాను నిలువరించేందుకు తైవాన్కు 1,400 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు ఉద్దేశించిన భారీ ప్యాకేజీపై ఈ ఏడాది ఆరంభంలో అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. అప్పట్లో ట్రంప్ దీనిని ‘చైనాతో అత్యుత్తమమైన బేరసారాల చిప్’గా అభివర్ణించారు. కాగా, మేలో చైనా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్తో కుదిరిన ఒప్పందం మేరకు తైవాన్కు వాగ్దానం చేసిన 1,400 కోట్ల డాలర్ల ఆయుధ ప్యాకేజీని పక్కన బెడుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీనిపై తైవాన్తోపాటు అమెరికా ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.తైవాన్పై తీవ్ర ఒత్తిడులుతైవాన్ తమ భూభాగమేనని, ఎప్పటికైనా తాము కలిపేసుకుంటామని చైనా గట్టిగా చెబుతోంది. చైనా ఒత్తిళ్లతో అమెరికా సహా చాలా దేశాలు తైవాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించలేదు. తైవాన్ సాధారణ దౌత్య సంబంధాలను కొనసాగించకుండా చైనా అడ్డుతగులుతోంది. అదే సమయంలో, అమెరికా ఆయుధాలను అందజేస్తూ గట్టి మద్దతుదారుగా ఉంటోంది. అలెగ్జాండర్ అధికారికంగా తైవాన్ రాయబారి కాదు, ఉన్నత స్థాయి ప్రతినిధి మాత్రమే . చైనా దురాక్రమణను నిరోధించేందుకు తైవాన్కు అవసరమైన ఆయుధాలను అందజేయాలన్నది అమెరికా విధానంగా ఉంటూ వస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో తైవాన్ చుట్టూ చైనా పలుమార్లు పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలను నిర్వహించింది. దాదాపు నిత్యం తైవాన్ సరిహద్దులకు సమీపంలోకి యుద్ధనౌకలను, సైనిక విమానాలను పంపుతోంది. -
రూ. 3,800 కోట్ల గిఫ్ట్ : మురిసిపోయిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ఖతార్ దేశం బహుమతిగా ఇచ్చిన, అమెరికా అధ్యక్షుడి కొత్త 'ఎయిర్ ఫోర్స్ వన్' (Air Force One) విమానాన్ని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఆవిష్కరించారు. సరికొత్త బోయింగ్ 747-8ను ఒక "ఫ్లయింగ్ వైట్ హౌస్" (గాల్లో ఎగిరే శ్వేతసౌధం)గా అభివర్ణించారు.అధ్యక్షుడు ట్రంప్ యూఎస్ ఎయిర్ ఫోర్స్ సరికొత్త విమానం 'వీసీ-25బి బ్రిడ్జ్' (VC-25B Bridge)ను జాయింట్ బేస్ ఆండ్రూస్లో ఈ విమానాన్ని పరిశీలించిన అనంతరం ఆవిష్కరించారు. విమాన హ్యాంగర్ (విమానశ్రయ షెడ్)లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, ఇది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విమానం అని ప్రకటించారు. ఇంతటి అద్భుతమైన విమానాన్ని అందించినందుకు ఖతార్ దేశాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. దాదాపు 35 ఏళ్ల నాటి పాత అధ్యక్ష విమానాల స్థానంలో, అమెరికా అగ్రరాజ్య శక్తికి ప్రతీకగా ఈ కొత్త విమానం నిలుస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. శాశ్వత నెక్స్ట్-జనరేషన్ 'ఎయిర్ ఫోర్స్ వన్' ప్రోగ్రామ్ పూర్తయ్యే దాకా, బోయింగ్ 747 తాత్కాలిక అధ్యక్ష విమానంగా సేవలు అందిస్తుందని ట్రంప్ ప్రకటించారు. ఇదీ చదవండి : రూ. 18 కోట్ల మేయర్ కిడ్నాప్ డ్రామా : సంచలన ఆరోపణలువిమానం ప్రత్యేకతలపై ట్రంప్ వ్యాఖ్యలుఅమెరికా అధ్యక్షుడు ఈ విమానంలో ప్రయాణించేటప్పుడు అధికారికంగా దీనిని 'ఎయిర్ ఫోర్స్ వన్' అని పిలుస్తారు. ఈ విమానం లోపలి భాగాన్ని పరిశీలించిన ఒక జర్నల్ కథనం ప్రకారం, అధునాతన లెదర్ సీట్లు, ఖరీదైన తివాచీలు (కార్పెట్లు), చెక్క ప్యానెలింగ్ , బంగారం రంగుల షేడ్స్తో కూడిన గోడలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వాషింగ్టన్ ల్యాండ్మార్క్ రిఫ్లెక్టింగ్ పూల్'లో ఒక బాతు ఈదుతున్నట్లు ఉన్న ఫ్రేమ్డ్ పెయింటింగ్తో పాటు దేశభక్తిని ప్రతిబింబించే చిత్రాలను గోడలపై అలంకరించారు. అద్భుతమైన వేగంతో ఇది దూసుకుపోతుంది. అలాగే ఇప్పటివరకు ఉన్న పాత విమానం నీలం మరియు తెలుపు రంగులో ఉండేది. కానీ కొత్త విమానం కింది భాగం 'నేవీ బ్లూ', మధ్యలో ఒక 'ఎరుపు గీత' , పైభాగం 'తెలుపు' రంగుతో సరికొత్తగా రూపొందించారు..@POTUS makes the inaugural exit from the BRAND NEW AIR FORCE ONE! 🔥🇺🇸 pic.twitter.com/jBciB2atAV— Rapid Response 47 (@RapidResponse47) June 19, 2026> ఇప్పటివరకు ఉన్న అన్ని ఎయిర్ ఫోర్స్ వన్ విమానాల కంటే చాలా వేగంగా, చాలా దూరం ప్రయాణించగలదని అని ట్రంప్ ప్రశంసించారు. జూలై 4న జరిగే అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కొత్త విమానం ఫ్లైఓవర్ (గగన విన్యాసాలు) లో పాల్గొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు.మరోవైపు వందల మిలియన్ల డాలర్ల విలువైన ఈ విమానాన్ని ఖతార్ బహుమతిగా ఇవ్వడంపై అమెరికాలో నైతిక, రాజ్యాంగపరమైన భద్రతా పరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ బహుమతిని తిరస్కరించడం మూర్ఖత్వం అవుతుందని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు, భవిష్యత్తులో ఈ విమానాన్ని తన ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి విరాళంగా ఇస్తానని చెప్పడం మరింత చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరంకాగా 1990ల నుండి సేవల్లో ఉన్న పాత విమానాలను మార్చాలనేది ట్రంప్ మొదటి విడత పదవీకాలం నాటి నుండి ఉన్న బలమైన కోరిక. అధ్యక్షుడి విమాన శ్రేణి కోసం రెండు కొత్త 747-8 విమానాలను సరఫరా చేయడానికి అమెరికా ప్రభుత్వం గతంలో 'బోయింగ్' సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో పాటు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ తరుణంలో ఖతార్ ఇచ్చిన విమానాన్ని ట్రంప్ ఆవిష్కరించడం గమనార్హం.ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీ -
అమెరికా లేకుంటే.. ఇజ్రాయెల్ పరిస్థితి ఇదేనా?
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్-ఇజ్రాయెల్ విభేదాలు, హెజ్బొల్లా-హమాస్ ముప్పుల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇరాన్తో అమెరికా అవగాహన ప్రయత్నాలను ఇజ్రాయెల్ విమర్శిస్తున్న వేళ.. ఇజ్రాయెల్కు మిగిలిన ఏకైక శక్తివంతమైన మిత్రదేశం అమెరికానే అని వాన్స్ వ్యాఖ్యానించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రశ్న మరోసారి చర్చనీయాంశంగా మారింది. అమెరికా మద్దతు లేకుండా ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోగలదా?. రక్షణ నిపుణులు, వ్యూహాత్మక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దీనికి సరళమైన సమాధానం లేదు. స్వల్పకాలిక యుద్ధాలు, పరిమిత దాడులను ఇజ్రాయెల్ స్వయంగా ఎదుర్కోగలిగినా, దీర్ఘకాలిక ప్రాంతీయ యుద్ధంలో అమెరికా సహకారం కీలకంగా మారుతుందని వారు చెబుతున్నారు.అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఒకటిఇజ్రాయెల్ భౌగోళికంగా చిన్న దేశమే అయినప్పటికీ, సైనిక పరంగా అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశంలో తప్పనిసరి సైనిక సేవా విధానం ఉండటంతో భారీ స్థాయిలో శిక్షణ పొందిన రిజర్వ్ బలగాలు అందుబాటులో ఉంటాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాల వద్ద అత్యాధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు, సైబర్ యుద్ధ సామర్థ్యాలు, అత్యున్నత నిఘా సాంకేతికత ఉన్నాయి. అలాగే మోసాద్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన భద్రతా సంస్థలుగా గుర్తింపు పొందాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రక్షణ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, సాధారణ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ తన సరిహద్దులను రక్షించుకోవడానికి అవసరమైన సామర్థ్యాన్ని పూర్తిగా కలిగి ఉంది.అమెరికా ఎందుకు ముఖ్యమైంది?ఇజ్రాయెల్ బలమైన దేశమే అయినప్పటికీ, అమెరికాతో దాని సంబంధం కేవలం మిత్రదేశ స్థాయిలో మాత్రమే లేదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థకు ప్రధాన ఆధారంగా మారింది. ప్రతీ సంవత్సరం అమెరికా ఇజ్రాయెల్కు బిలియన్ల డాలర్ల విలువైన సైనిక సహాయాన్ని అందిస్తోంది. ఇందులో ఆధునిక యుద్ధ విమానాలు, ఖచ్చిత లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ సాంకేతికత, గూఢచార సమాచార సహకారం ఉంటాయి. ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐరన్ డోమ్ వ్యవస్థ అభివృద్ధి, నిర్వహణలో అమెరికా ఆర్థిక సహకారం కీలక పాత్ర పోషించింది. గాజా, లెబనాన్ ప్రాంతాల నుంచి వచ్చే రాకెట్లను అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ ప్రధాన రక్షణ కవచంగా నిలుస్తోంది.ఇరాన్తో ప్రత్యక్ష యుద్ధం వస్తే..ఇటీవలి కాలంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీలు, ఇతర ప్రాంతీయ మిత్ర బలగాలు ఉండటం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. రక్షణ నిపుణుల అంచనా ప్రకారం, ఒకేసారి ఇరాన్, హెజ్బొల్లా, హమాస్ వంటి పలు వర్గాల నుంచి దాడులు జరిగితే ఇజ్రాయెల్పై భారీ ఒత్తిడి పడుతుంది. క్షిపణి నిరోధక వ్యవస్థల నిల్వలు వేగంగా ఖాళీ కావడం, ఆయుధాల వినియోగం పెరగడం, ఆర్థిక వ్యయం విపరీతంగా పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో అమెరికా నుంచి ఆయుధాలు, విడిభాగాలు, ఇంటర్సెప్టర్ క్షిపణులు, గూఢచార సమాచారం నిరంతరం అందడం ఇజ్రాయెల్కు కీలక బలంగా మారుతుంది.అయితే, అమెరికా నుంచి ఇజ్రాయెల్కు లభించే అతిపెద్ద మద్దతు కేవలం సైనిక సహాయం మాత్రమే కాదు. అంతర్జాతీయ వేదికలపై అమెరికా రాజకీయ అండ కూడా అత్యంత కీలకం. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో ఇజ్రాయెల్పై విమర్శలు లేదా చర్యలకు సంబంధించిన అనేక తీర్మానాలను అమెరికా గతంలో వీటో చేసింది. అమెరికా మద్దతు తగ్గితే ఇజ్రాయెల్పై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.వాన్స్ అసలు సందేశం ఇదేనా?జేడీ వాన్స్ వ్యాఖ్యలను కేవలం రక్షణ అంశంగా మాత్రమే కాకుండా రాజకీయ సంకేతంగా కూడా విశ్లేషిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, అవసరమైతే వాషింగ్టన్ తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుందని ట్రంప్ ప్రభుత్వ వర్గాలు పరోక్షంగా తెలియజేస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇరాన్ విషయంలో దౌత్యపరమైన పరిష్కారాలను అమెరికా ప్రాధాన్యంగా చూస్తున్న సమయంలో, ఇజ్రాయెల్ మరింత కఠిన వైఖరిని అవలంబిస్తే రెండు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు మరింత పెరిగే అవకాశముందని వారు చెబుతున్నారు.మొత్తానికి.. ఇజ్రాయెల్ స్వయంగా తనను తాను రక్షించుకునే శక్తి కలిగిన దేశమే. కానీ మధ్యప్రాచ్య స్థాయిలో దీర్ఘకాలిక, బహుముఖ యుద్ధం ఎదురైతే అమెరికా సహాయం దాని సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. అందుకే నిపుణులు చెబుతున్న మాట ఒక్కటే.. ఇజ్రాయెల్కు అమెరికా అవసరం మనుగడ కోసం కాదు.. ఆధిపత్యం కొనసాగించడానికి అని తెలుస్తోంది.ఇజ్రాయెల్ వద్ద సైన్యం..దాదాపు 1.7 లక్షల యాక్టివ్ సైనికులు4 లక్షలకుపైగా రిజర్వ్ దళాలువందల సంఖ్యలో ఆధునిక యుద్ధవిమానాలుఅధునాతన డ్రోన్లుసైబర్ యుద్ధ సామర్థ్యాలుప్రపంచంలోనే అత్యుత్తమ గూఢచారి వ్యవస్థల్లో ఒకటైన మోసాద్అణ్వాయుధ సామర్థ్యం (అధికారికంగా అంగీకరించకపోయినా)అమెరికా నుంచి వచ్చే సహాయంలో..అత్యాధునిక ఆయుధాలుF-35 యుద్ధవిమానాలుక్షిపణి నిరోధక వ్యవస్థల కోసం నిధులురాడార్, నిఘా సాంకేతికతవిడిభాగాలు, మందుగుండు సామగ్రి -
‘హాలీవుడ్లో కూడా..’.. మోదీపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వేదికపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లపై ప్రశంసల వర్షం కురిపించారు. 'ది యాక్సియోస్ షో' ఇంటర్వ్యూలో తాను ఎంతగానో అభిమానించే ఇద్దరు ప్రపంచ నాయకుల పేర్లను అడుగుగా, ఆయన ఏమాత్రం తడుముకోకుండా మోదీ, జిన్పింగ్ పేర్లను వెల్లడించారు. ఈ ఇద్దరు నేతల రాజకీయ వ్యూహాలు, వారికున్న అంతర్జాతీయ పలుకుబడిని ట్రంప్ కొనియాడారు. హాలీవుడ్ సినిమాలు తీసినా వీరిలాంటి వ్యక్తులు దొరకరంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.హాలీవుడ్ సినిమాల్లో కూడా దొరకరుప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల నాయకత్వ పటిమపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పీఎం మోదీ అద్భుతమైన నాయకుడు. ప్రెసిడెంట్ షీ కూడా అంతే గొప్ప లీడర్. వీరంతా క్లాసిక్ లీడర్స్. ఒకవేళ వీరిద్దరి జీవితాలపై హాలీవుడ్లో సినిమా తీయాలనుకున్నా, వీరిలాంటి పాత్రలు పోషించే వ్యక్తులు అక్కడ కూడా దొరకరు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మోదీ చాలా తెలివైన వారని, అనవసరమైన యుద్ధాలకు దూరంగా ఉంటూ 150 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు. భారత్తో ప్రస్తుతం అమెరికా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్సంబంధాలతో వ్యాపారం చేస్తోందని ఆయన అన్నారు.స్థిరమైన నాయకత్వం.. 12 ఏళ్ల పాలనభారతదేశంలో గతంలో ఉన్న రాజకీయ అనిశ్చితిని, ప్రస్తుత స్థిరత్వాన్ని ట్రంప్ పోల్చి చూశారు. ‘నేను నా జీవితకాలంలో భారతదేశాన్ని గమనిస్తూనే ఉన్నాను. అక్కడ గతంలో ప్రభుత్వాలు నిరంతరం మారుతూనే ఉండేవి. ఎవరో ఒకరు రావడం, ఆరు నెలలు లేదా ఏడాదిలోనే మారిపోవడం జరిగేది. కానీ, ప్రధాని మోదీ వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. ఆయన గత 12 ఏళ్లకు పైగా అత్యంత స్థిరంగా దేశాన్ని పాలిస్తున్నారు. ఎంతో ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటూనే ఆయన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు’ అని ట్రంప్ పేర్కొన్నారు.దేవదూతలా కనిపిస్తారు కానీ చాలా కఠినంఇటీవల ఫ్రాన్స్లో జరిగిన జీ7 (G7) సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో జరిగిన భేటీని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. మోదీ చర్చలు జరిపే విధానంపై ప్రశంసలు కురిపిస్తూ.. ‘మోదీ చాలా సీరియస్గా చర్చలు జరుపుతారు. ఆయనను చూస్తే చాలా ప్రశాంతంగా, ఒక దేవదూతలా కనిపిస్తారు. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో, దేశ ప్రయోజనాల విషయంలో ఆయన అంతకంటే కఠినంగా వ్యవహరిస్తారు. చూడ్డానికి చాలా సౌమ్యంగా ఉంటారు. అందుకే ఆయన వ్యూహాలు ప్రత్యర్థులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి’ అని ట్రంప్ అభివర్ణించారు.ఇది కూడా చదవండి: తేజ్ ప్రతాప్ యాదవ్ హత్యకు కుట్ర? -
ట్రంప్–మెలోనీ.. ఎక్కడ చెడింది?.. ఆ ఐదే కారణమా?
మొన్నటిదాకా జార్జియా మెలోనీ.. డొనాల్డ్ ట్రంప్కు యూరప్లో అత్యంత సన్నిహిత మిత్రురాలిగా గుర్తింపు పొందారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆయనకు అత్యంత నమ్మకమైన యూరోపియన్ భాగస్వామిగా నిలిచారు. ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకోవడం, బహిరంగ వేదికలపై పరస్పరం సరదా వ్యాఖ్యలు చేసుకోవడం కనిపించింది. అలాంటిది ఈ ఇద్దరి మధ్య అకస్మాత్తుగా మాటల యుద్ధం మొదలవడం, అది వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకోవడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అసలు ట్రంప్–మెలోనీ స్నేహానికి ఎక్కడ బీటలు వారాయో గమనిస్తే..ట్రంప్–మెలోనీ బంధం కేవలం రాజకీయ అనుబంధం మాత్రమే కాదు. కుడిపక్ష(రైట్వింగ్) భావజాలం, వలసల నియంత్రణ, జాతీయవాద విధానాలు వంటి అనేక అంశాల్లో ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండేవి. అందుకే యూరప్లో ట్రంప్కు అత్యంత సన్నిహిత మిత్రురాలిగా మెలోనీకి గుర్తింపు లభించింది. అయితే ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఈ స్నేహంపై ప్రభావం చూపినట్లు కనిపిస్తున్నాయి. ఇది ఒక్క ఫొటో వివాదం కాదు. గత కొన్ని నెలలుగా పేరుకుపోతున్న రాజకీయ విభేదాల ఫలితంగా కనిపిస్తోంది. ఆ ఐదు కారణాలివే..1. మొదటి చిచ్చు.. యుద్ధమే!ట్రంప్కు మెలోనీ ఎంత సన్నిహితురాలో చెప్పడానికి ఒక ఉదాహరణ చాలనిపిస్తుంది. 2025లో ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వేడుకకు హాజరైన ఏకైక యూరోపియన్ నాయకురాలు కూడా ఆమెనే. ఆ తర్వాత గాజా శాంతి చర్చల సందర్భంగా మెలోనీపై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘అందం, తెలివితేటలు రెండూ ఉన్న నాయకురాలు’ అంటూ కొనియాడారు. కానీ ఇరాన్ యుద్ధం తర్వాత పరిస్థితి మారడం మొదలైంది. హర్ముజ్ జలసంధి భద్రత, ఇరాన్పై ఒత్తిడి వంటి అంశాల్లో అమెరికా వైఖరికి ఇటలీ పూర్తి మద్దతు ఇవ్వలేదు. యుద్ధంలో పాల్గొనేందుకు మెలోనీ నిరాకరించడంతో ట్రంప్లో అసంతృప్తి పెరిగింది. ఆ అసంతృప్తి క్రమంగా బహిరంగ విమర్శలకు దారితీసింది. మెలోనీకి ధైర్యం లేదని, అంతర్జాతీయ సంక్షోభాల విషయంలో ఆమె సరైన నాయకత్వం చూపడం లేదంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం ఇద్దరి మధ్య విభేదాలు ఎంత దూరం వెళ్లాయో చెప్పకనే చెబుతోంది.2. పోప్ లియో వివాదంఇరాన్ యుద్ధంపై పోప్ లియో XIV శాంతి సందేశం ఇవ్వడం కూడా ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచింది. యుద్ధం విస్తరించకుండా చర్చల ద్వారానే పరిష్కారం వెతకాలని పోప్ పిలుపునివ్వగా.. ట్రంప్ మాత్రం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. అంతర్జాతీయ భద్రతా అంశాలపై పోప్ మాట్లాడటం తగదన్నట్లుగా వ్యాఖ్యానించారు. అయితే కాథలిక్ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చే ఇటలీ ప్రధాని మెలోనీ మాత్రం పోప్కు బహిరంగంగా అండగా నిలిచారు. ట్రంప్ వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావని, పోప్ అభిప్రాయాలను గౌరవించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.ఈ పరిణామం ట్రంప్కు ఏమాత్రం నచ్చలేదని చెబుతున్నారు. అప్పటివరకు మిత్రురాలిగా భావించిన మెలోనీ.. తనకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతున్నారనే భావన ఆయనలో ఏర్పడింది. దీంతో మాటల యుద్ధం మరింత ముదిరింది. ఒక దశలో పోప్ కంటే మెలోనీనే పరిస్థితులను సరిగా అర్థం చేసుకోవడం లేదంటూ ట్రంప్ సెటైర్లు వేయగా.. మెలోనీ కూడా వెనక్కి తగ్గకుండా తన వైఖరిని సమర్థించుకున్నారు. దీంతో విధానపరమైన విభేదం క్రమంగా వ్యక్తిగత స్థాయికి చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.3. G7లో బహిరంగ విభేదాలుఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులోనే ఇద్దరి మధ్య విభేదాలు మొదటిసారి బహిరంగంగా బయటపడ్డాయి. ఇరాన్ యుద్ధం, నాటో బాధ్యతలు, పశ్చిమ దేశాల పాత్ర వంటి అంశాలపై జరిగిన చర్చల్లో ట్రంప్ తన అసంతృప్తిని దాచుకోలేదు. యూరప్ అమెరికాను ఒంటరిగా వదిలేసిందని, నాటో మిత్రదేశాలు తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మెలోనీ ఈ వ్యాఖ్యలను నేరుగా సవాలు చేసినట్లు దౌత్య వర్గాలు చెబుతున్నాయి. అమెరికా–యూరప్ భాగస్వామ్యం ఇప్పటికీ బలంగానే ఉందని, పశ్చిమ దేశాల మద్దతును తక్కువ చేసి చూపడం సరైంది కాదని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం.ఇద్దరూ ఒకే సోఫాపై కూర్చొని చర్చిస్తున్న దృశ్యాలు బయటకు కనిపించినా.. ఆ సమావేశాల్లో వాతావరణం అంత స్నేహపూర్వకంగా లేదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ట్రంప్ తరచూ చేస్తున్న ‘యూరప్ మమ్మల్ని వదిలేసింది’ అన్న వ్యాఖ్యలను మెలోనీ ఖండించగా.. ట్రంప్ కూడా తన వైఖరి నుంచి వెనక్కి తగ్గలేదని చెబుతున్నారు. దీంతో ఇంతకాలం తెరవెనుక మాత్రమే ఉన్న విభేదాలు G7 వేదికగా అందరికీ కనిపించే స్థాయికి చేరుకున్నాయి. చాలా మంది విశ్లేషకుల దృష్టిలో ఇదే ఇద్దరి బంధంలో కీలక మలుపుగా నిలిచింది.4. ఫొటో వ్యాఖ్యలతో మరింత దూరంఇద్దరి మధ్య పెరుగుతున్న దూరానికి ప్రతీకగా నిలిచింది ఈ ఫొటో వివాదం. G7 సమావేశం సందర్భంగా మెలోనీ తనతో ఫొటో దిగేందుకు "బతిమాలిందని", "ఆమెపై జాలిపడి ఫొటో ఇచ్చానని" ట్రంప్ వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోని మెలోనీ ఈసారి మాత్రం వెంటనే స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా కల్పితమని, తాను గానీ, ఇటలీ గానీ ఎప్పుడూ ఎవ్వరినీ బతిమాలుకోదని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.అంతటితో ఆగకుండా, పశ్చిమ దేశాల మిత్రుల పట్ల ట్రంప్ చూపుతున్న వైఖరిపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా మిత్రదేశాల కంటే ప్రత్యర్థి దేశాల నేతల పట్ల ఆయన మరింత మర్యాదగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా విమర్శించారు. మరోవైపు ట్రంప్ కూడా వెనక్కి తగ్గలేదు. ఒకప్పుడు మెలోనీ తన అభిమానుల్లో ఒకరని, కానీ ఇప్పుడు ఆమె తనకు అభిమానిగా ఉండటం ఇష్టం లేదంటూ మరోసారి వ్యాఖ్యానించారు. దీంతో రాజకీయ విభేదాలుగా మొదలైన ఈ ఘర్షణ.. వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్న ఇద్దరు నేతలు ఇప్పుడు బహిరంగంగానే పంచులు వేసుకోవడం పరిస్థితి ఎంత మారిపోయిందో చెబుతోంది.5. మెలోనీ శిబిరం నుంచి ఎదురుదాడిఈ వివాదంలో అత్యంత గమనార్హమైన అంశం మెలోనీ చుట్టూ ఉన్న నాయకుల స్పందన. సాధారణంగా ట్రంప్పై నేరుగా విమర్శలు చేయడానికి దూరంగా ఉండే మెలోనీ శిబిరం ఈసారి మాత్రం అసాధారణంగా ఘాటుగా స్పందించింది. ప్రధాని కార్యాలయంలో అత్యంత ప్రభావశీల వ్యక్తిగా భావించే జియోవాన్బట్టిస్టా ఫజ్జోలారి ఏకంగా ట్రంప్ అమెరికా–యూరప్ చారిత్రక సంబంధాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలతో యూరప్ అంతటా అమెరికా వ్యతిరేక భావన పెరిగేలా చేస్తున్నారని కూడా విమర్శించారు.ఇంతటితో ఆగకుండా, ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ తన అమెరికా పర్యటనను రద్దు చేసుకోవడం మరింత చర్చకు దారి తీసింది. దీనితో పాటు అమెరికాలో జరగాల్సిన ఇటలీ–అమెరికా వ్యాపార సదస్సు కూడా వాయిదా పడింది. ఈ వివాదాన్ని కేవలం ట్రంప్–మెలోనీ మధ్య వ్యక్తిగత ఘర్షణగా చూడలేం. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా–యూరప్ సంబంధాలు, నాటో బాధ్యతలు, ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి భద్రత వంటి అంశాలపై ఇరువైపులా పెరుగుతున్న భిన్నాభిప్రాయాలకు ఇది తాజా ప్రతిబింబంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ట్రంప్కు యూరప్లో అత్యంత విశ్వసనీయ మిత్రురాలిగా భావించిన మెలోనీ సైతం ఇప్పుడు బహిరంగంగానే విభేదించడం పరిస్థితి ఎంత మారిపోయిందో సూచిస్తోంది. అందుకే ఈ మాటల యుద్ధం ఇద్దరు నేతలకే పరిమితమవుతుందా? లేక అమెరికా–యూరప్ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక దూరానికి, అట్లాంటిక్ మిత్రబంధంలో కొత్త సమీకరణాలకు నాంది పలుకుతుందా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. -
నెతన్యాహు.. కాస్త బుర్ర వాడండి: ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య మళ్లీ ముదురుతున్న ఘర్షణలను ఆపేందుకు తానే నేరుగా జోక్యం చేసుకున్నానని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ నాయకత్వానికి "Calm down and use your head" (శాంతించండి... కాస్త ఆలోచించండి) అని చెప్పి కాల్పుల విరమణకు ఒప్పించానని ట్రంప్ వెల్లడించారు.కాగా, ఇటీవల లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపగా, ప్రతిగా హెజ్బొల్లా కూడా రాకెట్ దాడులకు దిగింది. దీంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారి యుద్ధం ప్రాంతమంతా వ్యాపించే అవకాశాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగాయి. ఇరాన్ కూడా పరోక్షంగా సహకరించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. చివరకు శుక్రవారం సాయంత్రం నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు.అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుతో నేరుగా చర్చించినట్టు తెలిపారు. ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలకు దూరంగా ఉండాలని సూచించానని, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అమెరికా తీవ్ర దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పారు. కొన్నిసార్లు ఇజ్రాయెల్ నాయకత్వాన్ని "కాస్త సెన్స్తో వ్యవహరించేలా చేయాల్సి వస్తోంది" అంటూ వ్యాఖ్యానించారు.అంతకుముందు జూన్ ప్రారంభంలో కూడా ట్రంప్, నెతన్యాహూతో మాట్లాడి బీరూట్ వైపు సాగుతున్న ఇజ్రాయెల్ సైనిక చర్యలను నిలిపివేయించానని ప్రకటించారు. అదే సమయంలో మధ్యవర్తుల ద్వారా హెజ్బొల్లాతోనూ సంప్రదింపులు జరిగాయని, ఇరు పక్షాలు కాల్పులు తగ్గించేందుకు అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రకటించిన పలు ఒప్పందాలు కొద్ది రోజులకే విఫలమయ్యాయి. తాజా ఒప్పందం కూడా ప్రాంతీయ శాంతి చర్చలు, అమెరికా-ఇరాన్ చర్చల భవిష్యత్తుకు కీలకంగా మారింది -
నాతో ఫొటో కోసం మెలోనీ అడుక్కున్నారు
రోమ్: గొప్పలు చెప్పుకోవడంలో తనకు తానే సాటి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిరూపించుకున్నారు. పలుమార్లు భంగపాటు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఫ్రాన్స్లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా తనతో ఫొటో కోసం ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ యాచించారని ఆయన శుక్రవారం ఉదయం ప్రసారమైన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఉక్రెయిన్ అంశంపై ప్రశ్నించగా, ట్రంప్ మాత్రం హఠాత్తుగా సందర్భం లేకుండా మెలోనీ ప్రస్తావన తీసుకొచ్చారు. తనతో ఫొటో కోసం ఆమె ‘అడుక్కున్నారని’చెప్పారు. నిజానికి ఆమెతో ఫోటో దిగడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని.. కానీ జాలిపడి అంగీకరించానని అన్నారు. చివరకు దయతలచి మెలోనీతో ఫొటో దిగినట్లుగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి జీ7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్, మెలోనీ పలు సందర్భాల్లో పక్కపక్కనే కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఫొటో కోసం ఆమె ట్రంప్ను ప్రాధేయపడినట్లుగా ఎక్కడా కనిపించలేదు. అవి బుద్ధిలేని మాటలు ట్రంప్ వాచాలత్వం పట్ల జార్జియా మెలోనీ తీవ్రంగా స్పందించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. తాను గానీ, ఇటలీ గానీ ఏనాడూ ఒకరి ముందు చెయ్యి చాచబోమని తేల్చిచెప్పారు. ట్రంప్ మాటలు పూర్తిగా కల్పితమని కొట్టిపారేశారు. అయినా ఒక మిత్రదేశం గురించి ఆయన అలాంటివి ఎలా సృష్టించగలుగుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని విషయాల్లో తక్షణమే స్పందించాల్సి ఉంటుంది కాబట్టి తాను స్పందిస్తున్నానని వివరించారు. ట్రంప్ నోటిదురుసు చూసి తాను దిగ్భ్రాంతి చెందానని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. ఏదేమైనా ఆయన ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదని గుర్తుచేశారు. ‘‘పశ్చిమ దేశాల శత్రువుల పట్ల, అమెరికా శత్రువుల పట్ల ట్రంప్ అదే దృఢ సంకల్పాన్ని చూపకపోవడం సిగ్గుచేటు అని మాత్రమే నేను చెప్పగలను. ఒక్క విషయం మాత్రం ట్రంప్ గుర్తుంచుకోవాలి. నేను గానీ, ఇటలీ గానీ ఏనాడూ ఒకరి ముందు యాచించం’’అని మెలోనీ స్పష్టంచేశారు. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలను ఇటలీ మంత్రులు, ప్రభుత్వ అధికారులు కూడా ఖండించారు. అవి బుద్ధిలేని మాటలు అంటూ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ అన్నారు. అంతేకాకుండా తన అమెరికా పర్యటనను రద్దుచేసుకున్నారు. అయితే, ట్రంప్ మాటల పట్ల జార్జియా మెలోనీ ప్రతిస్పందనపై అమెరికా ఇంకా బదులివ్వలేదు. అందుకేనా వ్యతిరేకత? అమెరికా, ఇటలీ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అమెరికాతో బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మెలోనీ ప్రయతి్నస్తున్నారు. అయితే, ఇటలీపై అమెరికా–ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధాన్ని తప్పుపట్టారు. ఇది చట్టవిరుద్ధమని తేల్చిచెప్పారు. అమెరికా చర్యను ఆక్షేపించారు. ఇరాన్పై యుద్ధం చేస్తున్న అమెరికాకు సహకరించేందుకు నిరాకరించారు. దాంతో ఆమె పట్ల ట్రంప్ వ్యతిరేకత పెంచుకున్నట్లు కనిపిస్తోంది. -
అమెరికా అమిత్ర వైఖరి
ఒకసారంటూ పొరపొచ్చాలు వచ్చాక ఎంత సన్నిహిత మిత్రుల మధ్యనైనా తిరిగి సాధారణ సంబంధాలు ఏర్పడటం అంత సులభం కాదు. ఫ్రాన్స్లో జరిగిన జీ–7 దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య బుధవారం జరిగిన ద్వైపాక్షిక సమావేశం తీరుతెన్నులు గమనిస్తే ఈ సంగతి సులభంగా అర్థమవుతుంది. ట్రంప్ గత 16 నెలలుగా అనుసరిస్తున్న అమిత్ర వైఖరి ఇందుకు కారణం. మిత్ర దేశాలని లేదు, ప్రత్యర్థి దేశాలని లేదు – అందరినీ ఒకే గాటన కడుతూ, ఒక దేశాధినేతకు ఉండాల్సిన కనీస ఔచిత్యాన్ని మరిచి ఇష్టానుసారం మాట్లా డటం ఆయనకు అలవాటుగా మారింది. అంతేకాదు – ఎడాపెడా అధిక సుంకాలు విధించటం, తమ సరుకుపై సుంకాలు తగ్గించాలని కోరడం వంటివి మన దేశాన్ని చీకాకు పరి చాయి. ఇలాంటì చేదు అనుభవాలు ఎన్ని ఎదురైనా మన దేశం సంయమనం పాటించింది. నిజానికి మొన్న భారత నావికులు ముగ్గుర్ని హార్మూజ్ జలసంధి వద్ద హత్య చేసిన ఉదంతంతోసహా ఈ 16 నెలల పొడవునా మన దేశం పరుషంగా మాట్లాడింది ఎప్పుడూ లేదు. నోబెల్ శాంతి బహుమతి యావలో భారత్–పాక్ యుద్ధాన్ని తానే ఆపాననీ, ఇద్ద రినీ తీవ్రంగా బెదిరించాననీ మాట్లాడినప్పుడు అందులో ఏమాత్రం నిజం లేదని మన దేశం చెప్పింది. ఆయన ఇలా డప్పుకొట్టుకుంటున్నప్పుడల్లా మొదట్లో ఖండిస్తూనేవచ్చింది. కానీ దీన్ని ఆయన ఒక అలవాటుగా మార్చుకున్నారని తేలాక మిన్నకుండి పోయింది. అయినా ట్రంప్లో ఆగ్రహావేశాలు తగ్గలేదని తాజా సమావేశం రుజువు చేసింది. మాటలకేం... ట్రంప్ చాలా మాట్లాడారు. 55 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశం అనంతరం ‘మోదీ మంచిగా కనబడతారు. బాగుంటారు. దేవదూత. కానీ ‘కిల్లర్’. వాణిజ్య, వ్యాపార చర్చల్లో చాలా కఠినంగా, నిక్కచ్చిగా ఉంటారు’ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం ఎవరైనా భారత్వైపు కన్నెత్తి చూస్తే వాళ్ల అంతు చూస్తామని కూడా చెప్పారు. వాణిజ్య ఒప్పందం విషయంలో చాలా దగ్గరగా వచ్చేశామని కూడా అన్నారు. కానీ చేతలు చూస్తే అందుకు అనుగుణంగా లేవు. తన ఆధ్వర్యంలోని కమాండ్లలో ఒకటైన ఇండో–పసిఫిక్ కమాండ్కు ఆ పేరు పెట్టింది ఆయన ఏలుబడిలోని అమెరికాయే. తిరిగి ఆయనే ఎనిమిదేళ్లనాటి ఆ పేరులో భారత్నుసూచించే ‘ఇండో’ తొలగించి ఇప్పుడు యూఎస్–పసిఫిక్ కమాండ్గా మార్చటం, అది కూడా ఈ సమావేశానికి కొంచెం ముందుగా చేయటం యాదృచ్ఛికమేమీ కాదు. ఇటీవల యూఎస్–పసిఫిక్ కమాండ్లో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను పాకిస్తాన్లో అంతర్భాగంగా చూపటంలోనూ అమెరికా దురుద్దేశం స్పష్టమే. పాకిస్తాన్ పాలకులతో ట్రంప్కి ఏర్పడిన కొత్త చుట్టరికం అందరికీ తెలుసు. తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో చైనా దూకుడునూ, ఆధిపత్య ధోరణుల్నీ ఎదుర్కొనటానికి ఆ దేశంతో సమస్యలున్న భారత్ను కలుపుకోవాలని నిర్ణయించి 2007లో క్వాడ్కు అంకురార్పణ చేసింది అమెరికాయే. హిందూ మహా సముద్రప్రాంతంలో చైనా విస్తరణవాద వైఖరిని ఎదుర్కొనటానికి క్వాడ్, దాంతోపాటు ఇండో– పసిఫిక్ కమాండ్ తోడ్పడతాయని కూడా అప్పట్లో తెలిపింది. కానీ స్వప్రయోజనాలే తప్ప మరేమీ పట్టని అమెరికాను నమ్ముకుని ముందడుగు వేయొద్దని అనేకమంది నిపుణులు అప్పట్లోనే మన దేశాన్ని హెచ్చరించారు. ఇవాళ చైనాతో అంటకాగటానికి రెడీ అయి, ఆ కమాండ్ పేరే మార్చిన అమెరికా కీలక సమయాల్లో ఎలా ఉండగలదో సులభంగానే ఊహించుకోవచ్చు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కిన వెంటనే అందరికన్నా ముందు ఆయనతో వాణిజ్య ఒప్పందంపై చర్చించింది మనమే అయినా... మన తర్వాత వచ్చిన దేశాలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మనం కూడా బ్రిటన్, యూరోపియన్ యూని యన్ (ఈయూ), కెనడాలతో వాణిజ్య ఒప్పందాలు ఖరారు చేసుకోగలిగాం. వీటిపైలాంఛనంగా సంతకాలు చేయటమే మిగిలివుంది. మనకి నచ్చని అంశాలున్నప్పుడూ, అన్యాయమైన షరతులు పెడుతున్నప్పుడూ వ్యతిరేకించటం, కొంత జాప్యం జరిగినా ఈ విషయంలో మన ప్రయోజనాల పరిరక్షణకే ప్రాముఖ్యతనివ్వటం సరైన వైఖరి. ఉత్త మాటలతో ఎవరినీ నమ్మించలేమని ట్రంప్ గ్రహించేలా చేయటం అవసరం. -
"మెలోని నాతో ఫోటో కోసం ప్రాధేయపడింది"
రోమ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం చాలా కష్టం.. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వివాదాస్పదంగా మారాయి. ఇటలీ ప్రధాని తనతో ఫోటో దిగడం కోసం "ప్రాధేయపడ్డారని ట్రంప్ అనడం ఇప్పుడు ఇరు దేశాల మధ్య నిప్పు రాజేస్తోంది.. తాజాగా దీనిపై మెలోని స్పందించారు.ఫ్రాన్స్ వేదికగా ఇటీవల జీ7 సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. అయితే దాని అనంతరం ట్రంప్ ఒక టీవీ ఛానెల్కు ఇంటర్వ్యుూ ఇచ్చారు. అందులో తాను మాట్లాడుతూ "ఇటలీ ప్రధాని తనతో ఫోటో దిగడం కోసం ప్రాధేయపడ్డారు మెలోనికి తనతో ఫోటో దిగాలని ఎంతో బలంగా ఉందని ఆమెపై జాలిపడి మాత్రమే తాను ఫోటోకు అంగీకరించాను. ఆమె నాతో మాట్లాడినందుకు సంతోషంగా ఉండి ఉంటుంది. నేనేమీ ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పక్కన నిలబడి ఫోటో దిగాలని ఆమె నన్ను బతిమిలాడారు. నేను ఫోటో దిగేవాడిని కాదు, కానీ ఆమెను చూసి జాలి వేసింది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.అయితే ఈ వ్యాఖ్యలపై మెలోని మండిపడింది. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం, కల్పితం. ఆయన మాటలు నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. అమెరికా అధ్యక్షుడు తన సొంత మిత్రదేశాల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల, అమెరికా శత్రువుల పట్ల ఎంత మృదువుగా ఉంటారో, మిత్రదేశాల పట్ల కూడా అలా ఉంటే బాగుంటుంది. అయితే ఆయన ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి: నేను కానీ, ఇటలీ దేశం కానీ ఎవరి ముందూ ఎన్నటికీ ప్రాధేయపడవు" అని మెలోని స్పష్టం చేశారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపైనా ప్రభావం చూపుతున్నాయి. అమెరికా పర్యటించాల్సిన ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తన ప్రతిపాదిత అమెరికా పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. మెలోనిని ఉద్దేశించి ట్రంప్ అన్న అనుచిత మాటలు మొత్తం ఇటలీ దేశాన్ని అవమానించడమేనని ఆయన ఎక్స్ (X) లో పేర్కొన్నారు. జూన్ 21, 22 తేదీల్లో ఆయన అమెరికాలో పర్యటించాల్సి ఉంది.ఇటలీ మంత్రుల ఆగ్రహంప్రధానమంత్రి కార్యాలయ అండర్ సెక్రటరీ గియోవన్ బాటిస్టా ఫజ్జోలారి స్పందిస్తూ.. "ట్రంప్ కావాలనే చేస్తున్నారో లేదా చేతగాక చేస్తున్నారో తెలియదు కానీ, అమెరికా-యూరప్ మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాలను నాశనం చేస్తున్నారు. తన అనుచిత వ్యాఖ్యల ద్వారా యూరప్ ఖండంలో అమెరికా ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా, అమెరికాకు కూడా తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు" అని విమర్శించారు.ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో కూడా ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. మెలోని ఎవరినైనా ఫోటో కోసం బతిమిలాడుతుందంటే తాను నమ్మనని, బెదిరించినా ఆమె అలా చేయదు" అని అన్నారుద్వైపాక్షిక సంబంధాలపై ఎఫెక్ట్ట్రంప్ రెండోసారి పదవిలోకి వచ్చినప్పుడు మెలోని అమెరికా-ఇటలీ బంధాన్ని మరింత బలోపేతం చేయాలని భావించినప్పటికీ, ఇటీవల పోప్ లియోపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ ఘర్షణలను ఖండిస్తూ పోప్ లియో చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ మండిపడటాన్ని మెలోని ఈ ఏడాది విమర్శించారు. దానికి బదులుగా అమెరికా అధ్యక్షుడు మెలోనిని ఉద్దేశించి ఆమెకు ధైర్యం లేదు అని ఘాటుగా విమర్శించారు. కాగా ఈ తాజా వివాదం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. -
ఇరాన్–అమెరికా శాంతి చర్చలకు బ్రేక్!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు శాశ్వత తెర పడే ప్రయత్నాలకు విఘాతం కలిగింది. అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి ఒప్పందం తాలుకా కీలక సమావేశం వాయిదా పడింది. శుక్రవారం స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ పర్వత రిసార్ట్లో జరగాల్సిన ఈ భేటీ చివరి నిమిషంలో రద్దైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో.. తాత్కాలిక కాల్పుల విరమణ (ట్రూస్) భవిష్యత్తుపై భారీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.శాంతి ఒప్పందానికి అవసరమైన పరస్సర అవగాహన ఒప్పందంపై అమెరికా, ఇరాన్ అధ్యక్షులు సంతకాలు కూడా చేశారు. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం స్విట్జర్లాండ్లో ఇవాళ భేటీ జరగాల్సి ఉంది. దీనికి ఇరాన్-అమెరికా విదేశాంగ అధికారులతో పాటు పశ్చిమాసియా ప్రతినిధులు ఈ భేటీకి హాజరవుతారని అంతా భావించారు. అయితే.. ఇంతలోనే ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏర్పాట్లలో సమస్యలు తలెత్తడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ స్విట్జర్లాండ్ పర్యటన రద్దు చేసుకున్నారు. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండడంతోనే చర్చలు ఆగాయని ఇరాన్ ప్రకటించింది. దీంతో మరోసారి చర్చలకు బ్రేక్ పడింది. ఇప్పటికే ఇరాన్–అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక 60 రోజుల ఒప్పందాన్ని కుదిరింది. ఈ కాలంలోనే శాంతి చర్చలు పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే ఒప్పందం అమలు చేసే దశలో కీలకమైన ఈ భేటీ రద్దు కావడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.వైట్ హౌస్ ప్రకారం.. చర్చలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, సమన్వయం, ప్రయాణాలు, షెడ్యూల్ వంటి విషయాలు(లాజిస్టిక్స్) అనూహ్యంగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అలాగే అమెరికా అధికారులు మాత్రం ఈ ఒప్పందం ఇంకా పూర్తిగా రద్దు కాలేదని, భవిష్యత్తులో చర్చలు కొనసాగవచ్చని సంకేతాలు ఇచ్చారు. ఇదే సమయంలో ఇరాన్ మాత్రం అమెరికా ముందుగా ఒప్పందాన్ని అమలు చేయాలన్న స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చర్చలకు షరతులు విధిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా అమెరికా అధిక డిమాండ్లు చేస్తే ఒప్పుకోబోమని హెచ్చరించారు.ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు వేలాది మంది మరణించగా, ఎనర్జీ ధరలు పెరిగి ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. తాజా ఒప్పందం కింద ఇరాన్కు ఆర్థిక ఆంక్షల సడలింపు, ఆస్తుల విడుదల వంటి అంశాలు ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ ఈ చర్చల్లో భాగం కాకపోవడం వివాదంగా మారింది.అదే సమయంలో లెబనాన్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 16 మంది మరణించగా, పలు ప్రాంతాల్లో భీకర బాంబు దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్ మధ్య కూడా ఈ యుద్ధ విధానంపై అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి. కొన్నిగంటల ముందు ఇజ్రాయెల్ను ఉద్దేశించి జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన ఈ యుద్ధ లక్ష్యాలు.. ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా నిలిపివేయడం, ప్రాంతీయ దాడులను ఆపడం. అయితే ఈ రెండూ ఇప్పటివరకు పూర్తిగా సాధ్యం కాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ కొత్త ఒప్పందంలో ఆర్థిక సడలింపులు, పునర్నిర్మాణ నిధులు వంటి అంశాలు ఉండటం చర్చలకు కొత్త మలుపు ఇచ్చాయి.చర్చలు ప్రస్తుతానికి రద్దు కావడంతో మిడిల్ ఈస్ట్లో శాంతి ఆశలు మరోసారి అనిశ్చితిలో పడిపోయాయి. రాబోయే రోజుల్లో ఇరాన్–అమెరికా మళ్లీ చర్చల టేబుల్కి వస్తాయా? అనేది ప్రపంచ రాజకీయాల్లో కీలక ప్రశ్నగా మారింది. -
మొజ్తాబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు
అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తొలిసారి స్పందించారు. ఇరాన్ ప్రయోజనాలు, "రెసిస్టెన్స్ ఫ్రంట్" హక్కులు కాపాడతామనే హామీతోనే తాను ఈ ఒప్పందానికి అంగీకరించానని అన్నారాయన. ఈ క్రమంలోనే ట్రంప్ తీరుపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరిన తర్వాత ప్రజలను ఉద్దేశించి విడుదల చేసిన సందేశంలో మొజ్తబా ఖమేనీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం కోసం తామేమీ ప్రయత్నించలేదని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే తీవ్రంగా ఆరాటపడ్డారని.. ఈ క్రమంలో "అన్ని రకాల ఒత్తిళ్లు, ఎత్తుగడలు" ఉపయోగించారని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..తొలుత తాను ఈ ఒప్పందాన్ని సూత్రప్రాయంగా వ్యతిరేకించానని.. అయితే ఈ విషయంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, జాతీయ భద్రతా మండలి సభ్యులు తనను ఒప్పించారని అన్నారు. ఇరాన్ ప్రయోజనాలు దెబ్బతినవని హామీ ఇవ్వడంతోనే ఆమోదం తెలిపినట్లు చెప్పారు. "ఈ ఒప్పందం కోసం ఇరాన్ అధికారులు నిజాయితీగా కృషి చేశారు. కానీ దీనిని సాధించేందుకు అన్ని రకాల ఒత్తిళ్లు ఉపయోగించిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడే. నిరాశతోనే ఈ డీల్ను ముందుకు తీసుకొచ్చాడు" అని ఖమేనీ వ్యాఖ్యానించారు.భవిష్యత్తులో అమెరికా ఒప్పంద పరిధిని దాటి అదనపు షరతులు విధించాలనుకుంటే వాటికి తాము లొంగబోమని అధ్యక్షుడు తనకు స్పష్టంగా చెప్పారని ఖమేనీ వెల్లడించారు. ఇరాన్ హక్కులు, స్వాతంత్ర్యం, గౌరవం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్తులో అమెరికాతో ముఖాముఖి చర్చలు జరగడం అంటే.. అమెరికా వైఖరిని అంగీకరించినట్లు కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా ఫిబ్రవరి 28వ తేదీన యుద్దం ప్రారంభించాయి. ఆ దాడుల్లో ఆనాడు ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అదే దాడిలో తీవ్రంగా గాయపడిన మొబ్తాబా ఖమేనీ.. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ మధ్యలో నాయకత్వ బాధ్యతలు ఇరాన్లో తీవ్ర చర్చలు జరిగాయి. చివరకు.. మత, భద్రతా వర్గాల మద్దతుతో మొజ్తాబానే కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికయ్యారు. తాజాగా అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.ఖమేనీకి మద్దతుగా విదేశాంగ మంత్రిఖమేనీ ప్రకటనతో.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఏకీభవించారు. సుప్రీం లీడర్ మార్గదర్శకాల ప్రకారమే చర్చలు కొనసాగుతాయని పేర్కొన్నారు. చర్చల తదుపరి దశలో దేశ ప్రయోజనాలు, గౌరవం, స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు తమ పూర్తి సామర్థ్యాన్ని వినియోగిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగించే ఒప్పంద తాలుకా ఎంవోయూపై ఇరు దేశాల అధినేతలు డిజిటల్ సంతకాలు చేశారు. ఒప్పందం కుదిరిన వెంటనే తొలి చర్యలు ప్రారంభమయ్యాయి. హర్ముజ్ జలసంధి పరిసరాల్లో అమలు చేస్తున్న సముద్ర నిర్బంధ చర్యలను అమెరికా సెంట్రల్ కమాండ్ నిలిపివేసింది. ఇకపై ఇరాన్ నౌకాశ్రయాలకు వచ్చీపోయే వాణిజ్య నౌకలపై ఆంక్షలు ఉండవని ప్రకటించింది.మరోవైపు హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య రవాణాను పునరుద్ధరించేందుకు ఇరాన్ చర్యలు ప్రారంభించింది. వచ్చే 60 రోజుల పాటు నౌకలకు వేగవంతమైన అనుమతులు, జలసంధి రుసుముల మినహాయింపు కల్పిస్తామని వెల్లడించింది.ఒప్పందంలో అసలు ఏముంది?"ఇస్లామాబాద్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్" పేరుతో కుదిరిన ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు సైనిక చర్యలను నిలిపివేయాలి. హర్ముజ్ జలసంధిలో సాధారణ రవాణా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి. అలాగే 60 రోజుల వ్యవధిలో పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కోసం చర్చలు జరపాలి. ఆ చర్చల్లో ఆంక్షల ఎత్తివేత, ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇక..ఇటు స్విట్జర్లాండ్లో జరగాల్సిన కీలక సమావేశం యథాతథంగా జరగనుంది. అమెరిరా, ఇరాన్తో పాటు పశ్చిమాసియా ప్రతినిధులు ఈ భేటీకి హాజరు కానున్నారు. అవగాహన ఒప్పందం అమలుతో పాటు తుది ఒప్పందం విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది. -
తుది ఒప్పందం కుదరకుంటే పశ్చిమాసియా మళ్లీ రక్తసిక్తమే!
ఎవియన్–లెస్–బెయిన్స్/దుబాయ్/వాషింగ్టన్: ప్రపంచ దేశాలను అష్టకష్టాలకు గురిచేస్తున్న పశ్చిమాసియా యుద్ధం ముగిసిపోయింది. యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకాలు చేశారు. ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఇరుపక్షాలు ప్రకటించాయి.దీనికి ‘ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆప్ ఇరాన్’అని పేరుపెట్టారు. నిజానికి ఇదొక మధ్యంతర ఒప్పందమే. దీని ప్రకారం.. అమెరికా, ఇరాన్ల మధ్య దాడులు ప్రతిదాడులు పూర్తిగా నిలిచిపోతాయి. ఇరాన్ అణ్వాయుధ ప్రయోగాల నిలిపివేతపై తుది ఒప్పందం కుదుర్చుకునేందుకు రాబోయే 60 రోజులపాటు చర్చలు జరుగుతాయి. తుది ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై దాడులు మళ్లీ ప్రారంభించే వెసులుబాటును ట్రంప్ తన గుప్పిట పెట్టుకున్నారు. ఇక స్వేచ్ఛగా చమురు విక్రయాలు షెడ్యూల్ ప్రకారం స్విట్జర్లాండ్లోని జెనీవాలో శుక్రవారం సంతకాలు జరగాల్సి ఉండగా, స్థానిక కాలమానం ప్రకారం బుధవారమే ఫ్రాన్స్లో ట్రంప్ సంతకాలు చేశారు. రాజధాని పారిస్లోని వెర్సెయిల్స్ ప్యాలెస్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ ఇచ్చిన విందు సందర్భంగా అవగాహనా ఒప్పందం భౌతిక ప్రతిపై(ఫిజికల్ కాపీ) ట్రంప్ లాంఛనంగా సంతకం చేశారు. అదే సమయంలో ఇరాన్లో అధ్యక్షుడు పెజెష్కియాన్ ఒప్పందం ప్రతిపై సంతకం పెట్టారు. రెండు సంతకాలతో కూడిన పత్రాన్ని పెజెష్కియాన్ ప్రదర్శిస్తున్న చిత్రాన్ని ఇరాన్ మీడియా విడుదల చేసింది.ఒప్పందం పూర్తి వివరాలను అమెరికా, ఇరాన్లు ఇంకా అధికారికంగా బయటపెట్టలేదు. ఇరుదేశాలు విడుదల చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇరాన్ తన వద్ద ఉన్న అత్యంత శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తగ్గించుకోవాలి. ఆ దేశంపై ఆంక్షలను అమెరికా తొలగిస్తుంది. ఇరాన్ తన ముడి చమురును తక్షణమే స్వేచ్ఛగా విక్రయించుకోవచ్చు. యుద్ధంలో దెబ్బతిన్న ఇరాన్ పునరి్నర్మాణం కోసం కనీసం 300 బిలియన్ డాలర్లను అమెరికా అందిస్తుంది. ఈ అగ్రిమెంట్ను జాగ్రత్తగా గమనిస్తే ఇరాన్కు ఎక్కువ, అమెరికాకు తక్కువ లబ్ధి చేకూరేలా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడే సంతకం పూర్తయ్యింది: ట్రంప్ ట్రంప్ సంతకం చేసిన వీడియోను వైట్హౌస్ సిబ్బంది ఆన్లైన్లో షేర్ చేశారు. ఇందులో ట్రంప్, మేక్రాన్ పక్కపక్కనే కూర్చున్నారు. ఫిజికల్ కాపీపై సంతకం పూర్తయిన తర్వాత ట్రంప్ ఆ డాక్యుమెంట్ను, సంతకం చేయడానికి ఉపయోగించిన పెన్నును అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు అందజేశారు. ఆ గదిలో ఉన్నవారంతా చప్పట్లతో హర్షం వ్యక్తంచేశారు. సంతకం కంటే ముందు ట్రంప్ మాట్లాడారు. ‘ఇది అంత సులభం కాదు’అని వ్యాఖ్యానించారు. సంతకం చేసిన తర్వాత వెర్సెయిల్స్లో విందు ముగించుకొని బయటకు వస్తూ మీడియాతో మాట్లాడారు.‘ఇరాన్తో కుదిరిన అవగాహనా ఒప్పందంపై ఇప్పుడే సంతకం పూర్తయ్యింది’అని చెప్పారు. ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గత ఆదివారం డిజిటల్ విధానంలో సంతకాలు చేశారని అమెరికా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా ఒప్పందంపై సంతకం చేశారు. ట్రంప్, పెజెష్కియాన్ సంతకాలతో కూడిన ఒప్పంద పత్రాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఇదిలా ఉండగా, డిజిటల్ సంతకంతో కూడిన ఒప్పందం, భౌతిక సంతకంతో కూడిన ఒప్పందం మధ్య వ్యత్యాసం ఏమిటన్న దానిపై అమెరికా ఇంకా స్పందించలేదు. అధికారిక హామీదారుగా షెహబాజ్ షరీఫ్ డొనాల్డ్ ట్రంప్, పెజెష్కియాన్ సంతకాలు చేసిన తర్వాత.. యుద్ధాన్ని ముగించే ఈ అవగాహనా ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. రెండు దేశాల మధ్య ఇన్నాళ్లూ ఆయన మధ్యవర్తిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీన్ని ‘ఇస్లామాబాద్ అవగాహనా ఒప్పందం’గా ఆయన అభివరి్ణంచారు. పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించినందుకు ట్రంప్, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీలను షరీఫ్ ప్రశంసించారు. హార్మూజ్ జలసంధి వెంటనే తిరిగి తెరుచుకుంటుందని, ఇరాన్ ఓడరేవుపై దిగ్బంధనాన్ని అమెరికా తక్షణమే ఎత్తివేస్తుందని ప్రకటించారు.ఒప్పందం విషయంలో తమకు సహకరించిన సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ, ఈజిప్ట్ వంటి పశ్చిమాసియా దేశాలకు షరీఫ్ ధన్యవాదాలు తెలియజేశారు. ‘‘దౌత్యం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఉన్న దృఢమైన నిబద్ధత, శాంతియుత పరిష్కారానికి ఆయన చూపిన చొరవ పశ్చిమాసియాలో వినాశకరమైన పరిణామాలకు అడ్డుకట్ట వేశాయి’’అని ఉద్ఘాటించారు.అమెరికా, ఇరాన్ల అత్యున్నత దౌత్య బృందం కృషి వల్లే ఒప్పందం సాకారమైందని కొనియాడారు. ఈ అవగాహన ఒప్పందం పశ్చిమాసియాలో శాంతి, శ్రేయస్సుకు శాశ్వత పునాదిగా నిలవాలని ఆకాంక్షించారు. పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం కుదిరిన ‘ఇస్లామాబాద్ అవగాహనా ఒప్పందం’పై షెహబాజ్ షరీఫ్ కీలక మధ్యవర్తిగా గురువారం సంతకం చేశారని ఆయన కార్యాలయం ప్రకటించింది. అధికారికంగా హామీదారుగా షరీఫ్ సంతకం చేసినట్లు సమాచారం. స్విట్జర్లాండ్ సమావేశం యథాతథం! స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఈ నెల 19న ఒప్పందంపై సంతకాలు చేయడానికి అమెరికా, ఇరాన్లు అంగీకరించాయి. అయితే, షెడ్యూల్ కంటే ముందే సంతకాల కార్యక్రమం ముగిసింది. అయినప్పటికీ స్విట్జర్లాండ్ సమావేశం శుక్రవారం యథాతథంగా జరుగుతుందని సమాచారం. అమెరికా, ఇరాన్లతోపాటు పశ్చిమాసియా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. అవగాహనా ఒప్పందం అమలుతోపాటు తుది ఒప్పందం విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది. ఎవరికెంత లాభం? అవగాహనా ఒప్పందంపై సంతకాలు పూర్తి కావడంతో ఎవరికెంత లాభం అనే చర్చ మొదలైంది. హార్మూజ్ జలసంధి దాదాపు తెరుచుకున్నట్లే. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరుపక్షాలు చర్చలు ప్రారంభించబోతున్నాయి. తక్షణ లాభం మాత్రం ఇరాన్కే అని చెప్పొచ్చు. ఆ దేశం తమ చమురును ప్రపంచ దేశాలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా విక్రయించుకోనుంది. భారీగా ఆదాయం గడించనుంది. ఆంక్షలు లేవు కాబట్టి బహిరంగంగానే వ్యాపారం చేసుకోవచ్చు. కొత్త మార్కెట్లకు చమురును సరఫరా చేయొచ్చు. ధరలు కూడా పెంచే వీలుంది.మరోవైపు ప్రపంచ దేశాలు కూడా ఎంతోకొంత లబ్ధి పొందబోతున్నాయి. హార్మూజ్ జలసంధి తెరుచుకోవడంతో ఎలాంటి సుంకాలు లేకుండా నౌకలు రాకపోకలు సాగిస్తాయి. దాంతో చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఉండవు. అయితే, ఎనిమిది ఏళ్ల క్రితం తాను రద్దు చేసిన 2015 నాటి అణు ఒప్పందం కంటే మెరుగైన ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ సాధించగలరా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అణ్వాయుధాలు సొంతం చేసుకోకుండా ఇరాన్ను కట్టడి చేయగలరా? అనే అనుమానాలున్నాయి. ఇరాన్పై యుద్ధంతో ట్రంప్ కొత్తగా సాధించింది ఏమిటో చెప్పాలని అమెరికన్లు ప్రశి్నస్తుండడం గమనార్హం. హార్మూజ్లో మళ్లీ నౌకల సందడిప్రారంభమైన రాకపోకలు న్యూయార్క్: అవగాహనా ఒప్పందంపై అమెరికా, ఇరాన్లు సంతకాలు చేయడంతో హార్మూజ్ జలసంధిలో మళ్లీ నౌకల సందడి మొదలైంది. ప్రధాన షిప్పింగ్ కంపెనీలు హార్మూజ్ గుండా తమ నౌకలను తరలించడం ప్రారంభించాయని సముద్రయాన డేటా సంస్థ లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జలసంధిలో చిక్కుకుపోయిన ప్రముఖ కంపెనీల నౌకలు.. 110 రోజుల తర్వాత మొదటిసారిగా అక్కడి నుంచి ప్రయాణం ఆరంభించాయని లాయిడ్స్ లిస్ట్ ప్రధాన సంపాదకుడు రిచర్డ్ మీడ్ చెప్పారు.పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ఈ జలసంధిని ఇరాన్ మూసివేసింది. నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించింది. గురువారం ఆంక్షలు తొలగిపోయాయి. ప్రధాన షిప్పింగ్ కంపెనీలైన గ్రిమాల్డి గ్రూప్, కోస్కో, నట్సెన్, ఎన్వైకే నియంత్రణలో ఉన్న ట్యాంకర్లు జలసంధి గుండా ప్రయాణించాయి. ఇరాన్ జెండా కలిగిన, నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీ యాజమాన్యంలోని రెండు ముడి చమురు ట్యాంకర్లు జలసంధిలోకి ప్రవేశించాయి. అయితే, హార్మూజ్పై ఇరాన్ అమర్చిన జల మందుపాతరలను ఇంకా వెలికితీయలేదు. దాదాపు 80 మందుపాతరలను వెలికి తీయాల్సి ఉందని చెబుతున్నారు. హార్మూజ్ గుండా మరింత చమురు: వాన్స్ ఇరాన్ ఓడరేవులపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తేశామని జేడీ వాన్స్ గురువారం చెప్పారు. పదుల సంఖ్యలో నౌకలు ఇరాన్ ఓడరేవులకు చేరుకోవడానికి తమ సైన్యం అనుమతించిందని అన్నారు. హార్మూజ్ జలసంధి గుండా ఇప్పుడు మరింత చమురు ప్రవహిస్తోందని చెప్పారు.దక్షిణ లెబనాన్లోనే ఇజ్రాయెల్ సైన్యం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుజెరూసలేం: లెబనాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకొనే ఆలోచన లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ప్రస్తుతం దక్షిణ లెబనాన్లో ఉన్న తమ సైన్యం ఇకపైనా అక్కడే ఉంటుందని గురువారం ప్రకటించారు. అవగాహనా ఒప్పందంపై అమెరికా, ఇరాన్లు సంతకం చేసిన తర్వాత ఆయన తొలిసారి స్పందించారు.సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల వరకు లెబనాన్ భూభాగంలో ఇజ్రాయెల్ సైన్యం తిష్టవేసింది. దక్షిణ లెబనాన్లో ఒక సెక్యూరిటీ జోన్ను ఏర్పాటు చేయాలని, ఇజ్రాయెల్ భద్రతా అవసరాలకు అది అవసరమైనంత కాలం అక్కడి నుంచి సైన్యం వైదొలగకూడదని నెతన్యాహు అన్నారు. లెబనాన్లో సైతం దాడులు ఆపాలని ఒప్పందం నిర్దేశిస్తోంది. అందుకు సిద్ధంగా లేమని నెతన్యాహు సంకేతాలిస్తున్నారు. -
ఎట్టకేలకు శాంతి దిశగా...
అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఖరారు దిశగా తొలి అడుగు పడింది. ఫ్రాన్స్లోని ప్యాలెస్ ఆఫ్ వెర్సాయ్లో ఈ ఒప్పందానికి సంబంధించిన అవగాహన పత్రం (ఎంఓయూ)పై స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకాలు చేశారు. ఇద్దరూ పరస్పరం వేల కిలోమీటర్ల దూరంలో ఉండి ఈ తంతు ముగించడాన్నిబట్టే ఆ రెండు దేశాలమధ్యా ఉన్న వైషమ్యాల తీవ్రతేమిటో తెలుస్తుంది. మొదట ట్రంప్ సంతకం చేసి ఆన్లైన్లో పంపిన ఎంఓయూ నకలు తీసుకుని దానిపై పెజెష్కియాన్ సంతకం చేశారు. ఈ వారం ఆఖరులో జెనీవాలో ఈ సంతకాల కార్యక్రమం ఉంటుందని తొలుత ప్రకటించినా, ఎందుకనో అంతా మారింది. అనుసరించిన విధానం ఏమైనా, ఇకపై పశ్చిమాసియా ప్రశాంతంగా ఉంటే అదే పదివేలని ప్రపంచ ప్రజానీకమంతా ఆరాట పడుతున్నది. తుది ఒప్పందానికి రావటం కోసం రాగల అరవై రోజుల వ్యవధిలో అమెరికా, ఇరాన్ రెండూ ఏమేం చేయాలో ఈ 14 అంశాల ఎంఓయూలో ఉంది. ఇతరత్రా అంశాల మాటెలావున్నా హార్మూజ్ ప్రతిష్ఠంభనకు తెరపడటం, అణ్వాయుధాల జోలికిపోనని ఇరాన్ హామీ ఇవ్వటం ప్రధానమైనవి. లెబనాన్లో ఇజ్రాయెల్ సాగించే హత్యాకాండను ఆపటంతోసహా అన్ని రకాల యుద్ధాలూ పరిసమాప్తం చేయటం, ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా, ఈ ప్రాంత భాగస్వామ్య దేశాలూ 30,000 కోట్ల డాలర్ల నిధిని సమకూర్చటం, ఇరాన్ చమురు విక్రయాలపై అమెరికా ఆంక్షల తొలగింపుపై విధివిధానాలు వెల్లడించటం కూడా ఇందులో భాగమే. 30 రోజుల్లో ఇరాన్ సమీపంలోని అమెరికా నౌకలన్నీ నిష్క్రమిస్తాయనీ, యుద్ధ ప్రారంభానికి ముందున్న పరిస్థితులు పునరుద్ధరిస్తారనీ ఎంఓయూ చెబుతోంది. అయితే ఇప్పటికే 60 శాతం అభివృద్ధి చేసిన యురేనియం విషయంలో ఇరాన్ ఏం చేయాలో ఇరు దేశాలూ చర్చించుకుంటాయి. ఇజ్రాయెల్తో కుమ్మక్కయి అకారణంగా, ఏకపక్షంగా ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ఎటు తీసుకుపోవాలో, ‘గౌరవప్రదంగా’ ఎలా బయటపడాలో దిక్కుతోచని అమెరికాకు ఇప్పుడు అన్నివిధాలా గర్వభంగమైంది. చిత్రమేమంటే... ఒకే లక్ష్యంతో ఈ ఊబిలోకి దిగిన మిత్రులు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూలిద్దరికీ కొద్ది రోజుల్లోనే మార్గాలు వేరయ్యాయి. ఈ యుద్ధాన్ని తక్షణం వదుల్చుకుంటే తప్ప ఏడాది ఆఖరుకల్లా దేశంలో జరిగే మధ్యంతర ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవటం ఖాయమని ట్రంప్కు అర్థమైతే... ఇది కొనసాగుతుంటే తప్ప ఏడాది చివరన జరిగే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు అసాధ్యమని నెతన్యాహూ లెక్కలేసుకున్నారు. ఆయన సమస్యేమిటో ట్రంప్కు తెలియకపోలేదు. కానీ మిత్రత్వం కంటే స్వీయ పీఠ సంరక్షణే ప్రధానమని ఆయన గ్రహించారు. అందుకే విధి లేని స్థితిలో ఈ ఒప్పందానికొచ్చారు. హార్మూజ్ మూతతో అమెరికాలో గ్యాసోలిన్ ధరలు మిన్నంటాయి. ద్రవ్యోల్బణం హద్దులు దాటింది. సరుకుల కొరత ఏర్పడింది. ఒబామా హయంలో ఇంతకంటే మెరుగ్గా కుదిరిన ఒప్పందాన్ని బుట్టదాఖలు చేసిన ట్రంప్, దీనికెలా అంగీకరించారన్న కథనం ఆసక్తికరమైనది. దౌత్యంలో దేశాల అధినేతలు అవతలి పక్ష సైనిక, ఆర్థిక, భౌగోళిక రాజకీయ స్థితిగతుల్ని విశ్లేషించగల నిపుణుల సాయం తీసుకుంటారని చెబుతారు. కానీ ఇరాన్ మరో అడుగు ముందుకేసి మానసిక ఆరోగ్య నిపుణుల్ని కూడా ఇందులో చేర్చిందంటున్నారు. ట్రంప్ ప్రకటనల్ని, క్షణక్షణానికి మారే ఆయన వైఖరుల్ని గమనిస్తూ ఎలా మాట్లాడితే బోధపరుచుకుని సానుకూలంగా స్పందిస్తాడో వారు సలహాలిచ్చారని దాని సారాంశం. ట్రంప్ తీరుతెన్నులు గమనిస్తే అది నిజమే అనిపిస్తుంది. తన కనుసన్నల్లో ఖరారైన ఎంఓయూ తనకి నచ్చకుంటే మళ్లీ బాంబులేయటానికి వెనకాడనని ఆయనే చెప్పటాన్ని గమనిస్తే ట్రంప్ను ఇరాన్ సరిగానే అంచనా వేసిందనుకోవాలి. పారిస్ వెలుపలనున్న ప్యాలెస్ ఆఫ్ వెర్సాయ్ రాచరిక ఉత్థాన పతనాలు చూసింది. ఫ్రెంచ్ విప్లవాన్నీ, దానిలోని ప్రజాస్వామిక ఆకాంక్షలనూ గమనించింది. 1783లో బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ల సరిహద్దు తగాదాలపై ఒడంబడికకు సాక్షిగా నిలిచింది. జర్మనీని అవమానకరమైన ఒప్పందంతో శాసించి, 1919లో మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించిందీ ఇక్కడే. కానీ అమెరికాకు ఇప్పుడెదురైన అవమానం స్వచ్ఛందం, స్వయంకృతం. ఇన్నింటికి వేదికైన చోట కుదిరిన ఈ ఎంఓయూను ట్రంప్ గౌరవిస్తారని ఆశించాలి. -
దిగ్బంధం ఎత్తివేత.. హర్మూజ్లో ఊపందుకున్న చమురు రవాణా
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాజా అవగాహన ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇరాన్ పోర్టులపై విధించిన దిగ్బంధాన్ని ఎత్తివేసినట్లు అమెరికా ప్రకటించింది. దీంతో హర్మూజ్లో చమురు రవాణా ఊపందుకుంది. 60 రోజుల చర్చల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు.అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఎలక్ట్రానిక్ విధానంలో యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహన పత్రంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది.అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ అత్యున్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఒప్పందంపై తనకు మొదట భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ, ఇరాన్ హక్కులు మరియు రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రయోజనాలను కాపాడుతామని అధ్యక్షుడు హామీ ఇవ్వడంతో అనుమతి ఇచ్చినట్లు ఖమేనీ పేర్కొన్నారు.ఓ పక్క అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందాలు అమల్లోకి వస్తుండగా.. ఇజ్రాయెల్.. దక్షిణ లెబనాన్పై సైనిక చర్యలు కొనసాగిస్తూనే ఉంది. తాజా దాడుల్లో ముగ్గురు హెజ్బోల్లా సైనికులు మరణించినట్లు సమాచారం. ఈ దాడిని పక్కన పెడితే హెజ్బోల్లా నేత నైమ్ ఖాస్సెమ్ అమెరికా–ఇరాన్ ఒప్పందాన్ని అతి పెద్ద విజయంగా అభివర్ణించారు. -
శాంతి ఒప్పందం వెనుక ట్రంప్ మాస్టర్ ప్లాన్
-
బీబీకి దొరికిన ‘బెస్ట్ డీల్’ ఇదేనా!?
ఇజ్రాయెల్ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. ఇరాన్తో కుదిరిన తాజా శాంతి ఒప్పందం అనేది ఇజ్రాయెల్కు దక్కిన బెస్ట్ డీల్ అని.. ఇంతకు మించి ఆ దేశానికి ఇంకేది అక్కర్లేదని.. ఇదే విషయాన్ని తాను నెతన్యాహుకి చెప్పానని అన్నారాయన.ఇరాన్–అమెరికా మధ్య తాజాగా కుదిరిన శాంతి ఒప్పందం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందానికి ముందు తాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్లు చెప్పారు. అలాగే ఈ ఒప్పందం వల్ల ఇజ్రాయెల్కు ఉన్న అత్యంత పెద్ద భద్రతా ముప్పు తొలగిపోయిందని ఆయన అన్నారు. ఆ సంభాషణలో “ఆలోచించు బీబీ(నెతన్యాహుని ఉద్దేశించి.. ఆయన ముద్దు పేరు, పైగా రాజకీయ వర్గాల్లో అలానే పిలుస్తారు).. నీకు ఇది బెస్ట్ డీల్. ఇకపై ఇజ్రాయెల్పై అణు దాడి ప్రమాదం ఉండదు” అని చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండే ప్రమాదమే ఇజ్రాయెల్కు అతిపెద్ద భయం అని, ఈ ఒప్పందంతో ఆ ముప్పు తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. “ఇజ్రాయెల్ కోరుకున్న అత్యంత కీలకమైన భద్రతా హామీ ఇదే” అని నెతన్యాహుకు చెప్పినట్లు వెల్లడించారు.ఫ్రాన్స్ ఈవియన్-లెస్-బెయిన్స్లో G7 సమావేశం జరిగింది. దీనికి హాజరైన ట్రంప్ పారిస్లోని ఓ హోటల్లో ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇచ్చిన విందుకు ట్రంప్ హాజరయ్యారు. అక్కడే ఆయన ఇరాన్తో ఒప్పందానికి సంబంధించిన ఎంవోయూ మీద సంతకం చేశారు. ఆ సమయంలోనే ఆయన పై వ్యాఖ్యలు చేశారు.మరోవైపు అమెరికా-ఇరాన్ ఒప్పందంపై పూర్తి స్పష్టత ఇంకా లేదు. ఎంవోయూ ప్రకారం.. ఇరాన్ తన అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించాల్సి ఉంటుందని, అలాగే కొన్ని ఆంక్షల సడలింపు అంశాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇదే సమయంలో లెబనాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు, హెజ్బొల్లా గ్రూపుల అంశం వంటి సున్నిత విషయాలు కూడా ఈ ఒప్పంద చర్చల్లో భాగమయ్యాయి.అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్పై దాడికి దిగడంతోనే పశ్చిమాసియా యుద్ధం మొదలైందన్న సంగతి తెలిసిందే. అయితే మధ్యలో కాల్పుల విరమణకు ఇరు వర్గాలు అంగీకరించినప్పటికీ.. హెజ్బొల్లాను తుడిచిపెట్టే ఉద్దేశంతో లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకుని వద్దని వారించినా.. నెతన్యాహు మాత్రం పరిమిత దాడులు కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో లెబనాన్లో భారీగా ప్రాణ నష్టం(దాదాపు 5 వేలమంది) సంభవించింది. అయితే ఇరాన్-అమెరికా ఒప్పందంలో లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో సైనికచర్యలు నిలిపి వేయాలనే ప్రతిపాదన ఉంది.ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం తమ భద్రత కోసం చేపట్టే చర్యల నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ రాజకీయ వర్గాల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలతో పాటు సొంత వర్గంలోని కొందరు మాజీ నేతలు నెతన్యాహుపై ఒత్తిడిని పెంచే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద, ఇరాన్–అమెరికా ఒప్పందం కేవలం ప్రాంతీయ రాజకీయాలకే కాకుండా, ఇజ్రాయెల్ భద్రతా సమీకరణాలపై కూడా పెద్ద ప్రభావం చూపేలా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. -
భారత్ జోలికొస్తే ఖబర్దార్.. ట్రంప్ బిగ్ వార్నింగ్
వాషింగ్టన్: ఫ్రాన్స్లో జరిగిన జీ-7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన మిత్రుడు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండగా ఎవరైనా భారత్పై దాడి చేయడానికి సాహసిస్తే తాము వెంటనే రంగలోకి దిగి వారి అంతు చూస్తామని ట్రంప్ హెచ్చరించారు. భారత్కు అండగా ఉంటామని కీలక హామీ ప్రకటించారు. మోదీ పదవిలో ఉండగా భారత్ వైపు కన్నెత్తి చూడొద్దని ముష్కరులను హెచ్చరించారు. భారత్తో తమకు అధికారికంగా రక్షణ ఒప్పందం లేకపోయినప్పటికీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటామన్నారు.ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్, అమెరికాల మధ్య అద్భుతమైన స్నేహ సంబంధాలు ఉన్నాయి. మోదీ నాకు గొప్ప మిత్రుడు. మా మధ్య ఇంతకంటే సన్నిహిత సంబంధం ఉండడం అసాధ్యం. మోదీ ఉన్నంతకాలం భారత్కు నా మద్దతు ఉంటుంది. మోదీ స్థానంలో ఎవరైనా కొత్త నాయకుడు వస్తే ఆప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు. మోదీ నాయకత్వంలో భారతదేశం మరింతగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆయన నాయకుడిగా ఉన్నంత కాలం భారత్ అద్భుతంగా రాణిస్తుంది’ అని స్పష్టంచేశారు. ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన సంకేతంగా భావిస్తున్నప్పటికీ, ట్రంప్ వ్యాఖ్యల్లో మోదీ వ్యక్తిగత నాయకత్వంపై ప్రత్యేక ప్రశంసలు కనిపించడం విశేషంగా మారింది.ఇక, అంతకుముందు.. భారత ప్రధాని మోదీతో అద్భుతమైన సమావేశం జరిగిందని డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. సమీప భవిష్యత్తులో భారత్లో పర్యటిస్తానని చెప్పారు. ‘‘మోదీ చాలా మంచి మనిషి, సౌమ్యుడు, నెమ్మదస్తుడు అని అంటుంటారు. మోదీ అత్యంత అందమైన వ్యక్తి. చూడ్డానికి చాలా బాగుంటారు. మోదీని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. కానీ, నిజానికి నా దృష్టిలో ఆయన చాలా కఠినమైన వ్యక్తి, ఒక కిల్లర్. వ్యాపారం, వాణిజ్య చర్చల్లో మోదీ చాలా కఠినంగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. ఆయనకు భారతీయ ప్రజలంటే ఇష్టం, అలాగే అమెరికా అంటే కూడా ఇష్టమే’ అని వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని ఒక ప్రధాన ప్రపంచ శక్తిగా అభివర్ణించారు. భారత్ ఒక పెద్ద పాత్రను పోషించబోతోంది’ అని అన్నారు. -
తలెగరేస్తే మళ్లీ బాంబులేస్తాం... ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
-
అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది: ఇరాన్
పశ్చిమాసియాలో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు తెర పడింది. అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో కీలక అడుగు పడింది. డీల్కు సంబంధించిన అవగాహన ఒప్పందంపై అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకాలు చేశారు. దీంతో యుద్ధం అధికారికంగా ముగిసినట్లైంది. అయితే ఈ ఎంవోయూపై ఇప్పుడు ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. జీ7 సదస్సు అనంతరం పారిస్లోని వెర్సైల్స్ ప్యాలెస్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విందు ఇచ్చారు. దీనికి హాజరైన ట్రంప్ ఒప్పంద పత్రంపై(MoU) సంతకం చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇటు ఇరాన్ కూడా డీల్ను కన్ఫర్మ్ చేసింది. తమ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకం చేసినట్లు వెల్లడించింది. అయితే ఒప్పందం కుదరడం కంటే.. దాన్ని అమలు చేయడమే ఇప్పుడు అసలు పరీక్ష అని టెహ్రాన్ అంటోంది.ఇక ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయెల్ బఘాయ్ Esmaeil Baqaei మాట్లాడుతూ.. "ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం (Memorandum of Understanding)పై ఇరు దేశాధినేతల సంతకాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఒప్పందం అమలును పరీక్షించే సమయం వచ్చింది. ఇది ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి" అంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనను ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది."అమెరికా సంయుక్త రాష్ట్రాలు – ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం" పేరుతో రూపొందించిన ఈ పత్రంలో పలు కీలక అంశాలు ఉన్నాయి. లెబనాన్ సహా అన్ని రంగాల్లో సైనిక చర్యలను వెంటనే, శాశ్వతంగా నిలిపివేయాలని ఇందులో పేర్కొన్నారు.ఒప్పందం ప్రకారం అమెరికా 30 రోజుల్లో ఇరాన్పై అమలు చేస్తున్న నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి. అదే సమయంలో యుద్ధానికి ముందు ఉన్న స్థాయిలో వాణిజ్య నౌకల రాకపోకలు పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలి. తుది ఒప్పందం కుదిరిన తర్వాత 30 రోజుల్లో ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా బలగాలు వైదొలగాలని కూడా ఇందులో పేర్కొన్నారు.మరోవైపు, వాణిజ్య నౌకలకు 60 రోజుల పాటు ఎలాంటి రుసుము లేకుండా సురక్షిత ప్రయాణం కల్పించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.సంతకాలు పూర్తవడంతో ఇకపై 60 రోజులపాటు అమెరికా–ఇరాన్ ప్రతినిధులు తుది ఒప్పందానికి సంబంధించిన నిబంధనలపై చర్చలు జరపనున్నారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే పశ్చిమాసియాలో దీర్ఘకాలిక స్థిరత్వానికి మార్గం సుగమం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా–ఇరాన్ ఎంవోయూలో కీలక అంశాలులెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో అమల్లోకి కాల్పుల విరమణ60 రోజుల్లో తుది ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలుపరస్పర అంగీకారంతో గడువు పొడిగింపునకు అవకాశం30 రోజుల్లో ఇరాన్పై అమెరికా నౌకాదళ దిగ్బంధనానికి ముగింపుయుద్ధానికి ముందు స్థాయిలో నౌకల రాకపోకల పునరుద్ధరణతుది ఒప్పందం తర్వాత 30 రోజుల్లో ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ60 రోజుల పాటు వాణిజ్య నౌకలకు ఉచిత, సురక్షిత రాకపోకలకు ఇరాన్ హామీహర్ముజ్ జలసంధిలో నౌకాయానానికి ఎలాంటి రుసుములు లేకుండా ఏర్పాట్లుఅణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని ఇరాన్ అంగీకారంఐఏఈఏ పర్యవేక్షణలో యురేనియం(శుద్ధి చేసిన) నిర్వహణకు ఒప్పుకోలుఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధికి కనీసం 300 బిలియన్ డాలర్ల నిధి ఏర్పాటుఆ నిధిలో అమెరికాతో పాటు ప్రాంతీయ భాగస్వామ్య దేశాల భాగస్వామ్యంఇరాన్పై ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయడానికి అమెరికా అంగీకారంఆంక్షల ఎత్తివేతకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ తుది ఒప్పందంలో ఖరారుఅయితే.. అధికారిక సంతకాల కార్యక్రమం మొదట స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరగాల్సి ఉన్నప్పటికీ, ఒప్పందంపై ఇప్పటికే డిజిటల్ సంతకాలు పూర్తయ్యాయని స్పష్టమవుతోంది. అయినప్పటికీ.. ఫిజికల్ సంతకాల కోసం జెనీవా సమావేశం యథావిధిగా కొనసాగవచ్చని ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం జరగబోయే ఈ భేటీలో అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొంటుండగా.. ఇరాన్ నుంచి పార్లమెంట్ స్పీకర్ హాజరు కావొచ్చని తెలుస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్పై దాడులు ప్రారంభించిన తర్వాత సుమారు 110 రోజుల పాటు కొనసాగిన ఘర్షణలకు ఈ ఒప్పందం ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టెహ్రాన్ చెప్పినట్లే, ఒప్పందం కుదరడం ఒక దశ అయితే, దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడమే అసలు సవాలుగా మారింది.ఇదీ చదవండి: ట్రంప్ సంతకం.. డీల్లో మ్యాటర్ ఏంటంటే.. -
ఇరాన్తో యుద్ధానికి ముగింపు.. ఒప్పంద పత్రంపై ట్రంప్ సంతకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో రూపొందించిన అవగాహన ఒప్పందం (MoU)పై బుధవారం సంతకం చేశారు. ఈ విషయాన్ని వైట్హౌస్కు చెందిన ఓ అధికారి వెల్లడించినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఈ ఒప్పంద పత్రంలో 14 కీలక అంశాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది.వీటిలో కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిలో వాణిజ్య రవాణా పునరుద్ధరణ, ఇరాన్ అణు కార్యక్రమంపై భవిష్యత్ చర్చలు వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.ఒప్పందంలోని 14 అంశాలు (అంచనా):1. తక్షణ కాల్పుల విరమణఇరాన్, అమెరికా అనుబంధ బలగాలు పాల్గొంటున్న అన్ని యుద్ధ చర్యలను వెంటనే నిలిపివేయాలి. లెబనాన్లోని ఘర్షణలు కూడా ఇందులో భాగం.2. పరస్పర సార్వభౌమాధికారానికి గౌరవంఇరు దేశాలు ఒకదాని అంతర్గత వ్యవహారాల్లో మరొకటి జోక్యం చేసుకోకూడదని అంగీకరించాయి.3. 60 రోజుల్లో తుది ఒప్పందంగరిష్టంగా 60 రోజుల్లో శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. అవసరమైతే పరస్పర అంగీకారంతో గడువు పొడిగించవచ్చు.4. హర్మూజ్ జలసంధిపై ఆంక్షల ఎత్తివేతఅమెరికా 30 రోజుల్లో హర్మూజ్ జలసంధిపై విధించిన నౌకాదళ నిర్బంధాన్ని పూర్తిగా ఎత్తివేస్తుంది. తుది ఒప్పందం తర్వాత ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ కూడా ఉంటుంది.5. ఉచిత నౌకా రవాణాఇరాన్ హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఎలాంటి రుసుము లేకుండా భద్రత కల్పిస్తుందని హామీ ఇచ్చింది.6. 300 బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ ప్రణాళికఇరాన్ ఆర్థిక పునర్నిర్మాణం కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల విలువైన అభివృద్ధి ప్రణాళిక రూపొందించేందుకు అమెరికా సహకరిస్తుంది. అయితే నేరుగా అమెరికా నిధులు ఇవ్వబోదని అధికారులు స్పష్టం చేశారు.7. ఆంక్షల ఎత్తివేతతుది ఒప్పందం కుదిరిన తర్వాత ఇరాన్పై ఉన్న అమెరికా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలను తొలగించేందుకు అమెరికా అంగీకరించింది.8. అణ్వాయుధాలకు నోఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదని మరోసారి హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న అధిక సాంద్రత కలిగిన యురేనియం నిల్వలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో తొలగించేందుకు అంగీకరించింది.9. ప్రస్తుత పరిస్థితుల కొనసాగింపుతుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా సైనిక మోహరింపుల విషయంలో కొత్త మార్పులు ఉండవు.10. ఇరాన్ చమురు ఎగుమతులకు అనుమతిఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా మినహాయింపులు ఇస్తుంది. బ్యాంకింగ్, బీమా, రవాణా సేవలపైనా సడలింపులు ఉంటాయి.11. స్తంభింపజేసిన నిధుల విడుదలఒప్పందం విజయవంతంగా అమలైతే ఇరాన్కు చెందిన కొన్ని విదేశీ ఆస్తులు, నిధులను విడుదల చేస్తారు.12. పర్యవేక్షణ వ్యవస్థఒప్పంద అమలు, భవిష్యత్ నిబంధనల పాటింపును పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు.13. తుది ఒప్పందంపై చర్చలుMoUపై సంతకం అనంతరం శాశ్వత ఒప్పందానికి సంబంధించిన చర్చలు ప్రారంభమవుతాయి.14. ఐరాస భద్రతా మండలి ముద్రతుది ఒప్పందానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఆమోదం తీసుకుని, బైండింగ్ తీర్మానం రూపంలో అమలు చేస్తారు.ఈ ఒప్పందం అమలైతే హర్మూజ్ జలసంధి మళ్లీ తెరుచుకోనుంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం సాధారణ స్థితికి రావడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. -
కమాండ్ నుంచి ఇండో తొలగింపు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. యూఎస్ ఇండో–పసిఫిక్ కమాండ్ పేరును యూఎస్ పసిఫిక్ కమాండ్గా మార్చేసింది. ఈ నిర్ణయాన్ని అమెరికా రక్షణ శాఖ మంగళవారం ప్రకటించింది. 1947లో అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ స్థాపించిన ఈ కమాండ్కు సంబంధించిన లోతైన చారిత్రక మూలాలను గౌరవించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అమెరికా పసిఫిక్ కమాండ్ పరిధి అమెరికా పశ్చిమ తీరం నుంచి భారతదేశ పశ్చిమ సరిహద్దు వరకు విస్తరించి ఉంది. ‘‘వాస్తవానికి 1947 జనవరి 1న అధ్యక్షుడు హ్యారీ ఎస్.ట్రూమన్ ఈ కమాండ్ను స్థాపించారు.70 ఏళ్లకు పైగా యూఎస్ పసిఫిక్ కమాండ్ పేరుతో పనిచేసింది. యునైటెడ్ స్టేట్స్ ఏకీకృత పోరాట కమాండ్లలో పురాతనమైనదిగా, అతిపెద్దదిగా ఘనత సాధించింది’’అని రక్షణ శాఖ ఒకప్రకటనలో వెల్లడించింది. పేరు మారినప్పటికీ ఈ కమాండ్ బాధ్యతల్లో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొంది. కమాండ్ ప్రాథమిక లక్ష్యంలో, ప్రాంతీయ మిత్రదేశాలు, భాగస్వాములతో కలిసి స్వేచ్ఛాయుత పరిస్థితులను కొనసాగించాలన్న నిబద్ధతలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ‘‘యూఎస్ పసిఫిక్ కమాండ్ తిరిగి వచి్చంది’’అంటూ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు.. యూఎస్ పసిఫిక్ కమాండ్ పేరును 2018లో యూఎస్ ఇండో–ఫసిఫిక్ కమాండ్గా మార్చారు. అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాల మధ్య పెరుగుతున్న అనుసంధానతను గుర్తించి, ఈ కమాండ్ పేరును ఇండో–పసిఫిక్ కమాండ్గా మార్చినట్లు 2018లో అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ వెల్లడించారు.ఈ కమాండ్ పరిధి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు, పెంగి్వన్ల నుంచి ధ్రువపు ఎలుగుబంట్ల వరకు విస్తరించి ఉందని చమత్కరించారు. అమెరికా జాతీయ రక్షణ వ్యూహంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అయితే, ఎనిమిదేళ్ల తర్వాత పాత పేరును పునరుద్ధరించడం గమనార్హం. ఫ్రాన్స్లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ సమావేశం అవుతున్న సమయంలోనే కమాండ్ నుంచి ఇండియా పేరును హఠాత్తుగా తొలగించడం చర్చనీయాంశంగా మారింది. చైనా ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్న ట్రంప్? ఇండో–యూఎస్ పసిఫిక్ కమాండ్ పేరు మార్పు వెనుక అమెరికా వ్యూహం ఏమిటన్నదానిపై చర్చ మొదలైంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకోవాలన్న తమ ప్రణాళికలను అమెరికా విరమించుకుంటోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా విషయంలో అమెరికా వైఖరిలో ఇటీవల మార్పు వస్తోంది. బలమైన చైనా బారి నుంచి తైవాన్ను రక్షించలేమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. దాదాపుగా ఆయన చేతులెత్తేశారు. చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ‘క్వాడ్’కూటమిని కూడా ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇండో–యూఎస్ పసిఫిక్ కమాండ్ పేరును మార్చేసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ విషయానికొస్తే ఈ పరిణామం పేరు మార్పునకు సంబంధించిన విషయం కంటే కూడా మారుతున్న అమెరికా ప్రాధాన్యతల గురించి తెలియజేసే అంశంగా భావించాల్సి ఉంటుంది. అమెరికా జాతీయ రక్షణ వ్యూహాన్ని ఈ ఏడాది జనవరి 23న బహిర్గతం చేశారు. ‘‘ఉమ్మడి రక్షణ భారాన్ని మిత్రదేశాలు కూడా పంచుకోవాలి. భాగస్వామ్య దేశాల భద్రతకు దశాబ్దాలుగా మోస్తున్న ఆర్థిక భారాన్ని ఇకపై మోయలేం’’అని ఇందులో స్పష్టం చేశారు.ఈ పరిణామాలను గమనిస్తే అమెరికా దృష్టిలో ఇండియాలో స్థానంపై సహజంగానే ప్రశ్నలు తలెత్తుతున్నాయని అంటున్నారు. చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంతోపాటు ఈ ప్రాంతంలో పాకిస్తాన్కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలన్నదే ట్రంప్ వ్యూహంగా అంచనా వేస్తున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని ట్రంప్ పరోక్షంగా ఆమోదిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. పేరు మార్పుపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా స్పందించారు. ‘‘క్వాడ్ పతనానికి ఇది మరో అడుగు లాంటిదా?’’అని ‘ఎక్స్’లో ప్రశ్నించారు. పాకిస్తాన్లో అంతర్భాగం పీఓకే పసిఫిక్ కమాండ్ మ్యాప్పై వివాదం యూఎస్ పసిఫిక్ కమాండ్ వెబ్సైట్లోని ‘బాధ్యతాయుత ప్రాంతం’మ్యాప్ భారతదేశ సరిహద్దులను తప్పుగా చూపిస్తుండడం రాజకీయంగా వివాదాస్పదంగా మా రింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే), అక్సాయ్ చిన్లు భారతదేశంలో అంతర్భాగం కాదన్నట్లుగా ఈ మ్యాప్ను రూపొందించారు. పీఓకేను పాకిస్తాన్లో అంతర్భాగంగా చిత్రీకరించారు. తప్పులతడక మ్యాప్ ఉన్న వెబ్సైట్లో సంబంధిత వెబ్ పేజీని చివరిసారిగా మార్చి నెలలో అప్డేట్ చేశారన్న సమాచారం కనిపిస్తోంది. 1947లో జమ్మూకశ్మీర్ భారతదేశంలో విలీనం కావడం అనేది సంపూర్ణమైన, చట్టబద్ధమైన, తిరుగులేని ప్రక్రియ అని భారత్ చెబుతోంది.జమ్మూకశ్మీర్, లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు తమ దేశంలో అంతర్భాగమని, వాటిని వేరు చేయలేమని స్పష్టం చేస్తోంది. తాజా పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా తీవ్రంగా స్పందించారు. భారత్కు, భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే అలవాటు నరేంద్ర మోదీ గారి మిత్రులకు ఉందని విమర్శించారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి దేశాన్ని ఇలాంటి ప్రతికూల స్నేహబంధాల్లోకి నెట్టినప్పుడు, ఏ దేశానికైనా శత్రువుల అవసరం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. -
తలెగరేస్తే మళ్లీ బాంబులేస్తాం
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని, ఇక యుద్ధం ఆగిపోతుందని, చమురు, గ్యాస్ ధరలు దిగొస్తాయని ఆశపడిన ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చారు. ఇరాన్తో కేవలం అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) మాత్రమే కుదిరిందని, అది తుది ఒప్పందం కాదని తేలి్చచెప్పారు. ఇరాన్ ఇకనుంచి సరిగ్గా ప్రవర్తించకపోతే మళ్లీ బాంబు దాడులు చేస్తామని హెచ్చరించారు. తద్వారా ఇరాన్ తమ దారికి రాకపోతే యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం కావొచ్చని సంకేతాలిచ్చారు. ఫ్రాన్స్లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ మాట్లాడారు.ఒప్పందంపై అమెరికా, ఇరాన్లు శుక్రవారమే సంతకాలు చేయబోతున్నారు. స్విట్జర్లాండ్లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇంతలోనే ఇరాన్కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం చూస్తే ఆ ఒప్పందం అనుకున్నంత దృఢంగా లేదని స్పష్టమవుతోంది. ‘‘ఇరాన్తో కుదుర్చుకున్నది తుది ఒప్పందం కాదు. కేవలం ఒక అవగాహన ఒప్పందం మాత్రమే.ఒకవేళ ఇది నాకు నచ్చకపోయినా లేదా ఇరాన్ సరిగ్గా ప్రవర్తించకపోయినా, మేము వెంటనే వారి తలలపైనే బాంబులు కురిపిస్తాం. మళ్లీ కాల్పులు ప్రారంభిస్తాం. ఎందుకంటే గత 47 ఏళ్లుగా వారు(ఇరాన్) దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు’’ అని ట్రంప్ ఆక్షేపించారు. అవగాహనా ఒప్పందంలో ఏవైనా మార్పులు చేసినా లేదా దానిని పాటించడంలో విఫలమైనా తక్షణమే సైనిక చర్యను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ను హెచ్చరించారు. ఇదీ ఒప్పందం ముసాయిదావాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం తాలూకు ముసాయిదా పత్రంలోని 14 అంశాలను అమెరికా ఉన్నతాధికారులు బుధవారం బహిర్గతంచేశారు. ఆ అధికారులు చెప్పిన ఆ అంశాలు.. 1. లెబనాన్, ఇరాన్, హార్మూజ్ జలసంధి సముద్రజలాలు సహా పశి్చమాసియాలో అన్ని చోట్ల అమెరికా తన సైనిక, వైమానిక దాడులను తక్షణం నిలిపేస్తుంది 2. అమెరికా, ఇరాన్ను పరస్పరం ఆయా దేశాల సార్వ¿ౌమత్వాలను గౌరవించుకుంటాయి 3. ఉమ్మడి ఏకాభిప్రాయంతో 60 రోజుల్లోపు చర్చలను ఫలవంతంగా ముగిస్తాయి 4. అవగాహన ఒప్పందంపై సంతకాలుచేశాక 30 రోజుల్లోపు హార్మూజ్ దిగ్బంధనాన్నిఅమెరికా పూర్తిగా ఎత్తేస్తుంది 5. సంతకాలు పూర్తయ్యాక 60 రోజులపాటు సుంకాల్లేకుండా హార్మూజ్ గుండా నౌకల రాకపో కలకు ఇరాన్ సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తుంది 6. ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధికి మిత్రదేశాలతో కలిసి అమెరికా 300 బిలియన్ డాలర్ల నిధులు సమకూరుస్తుంది 7. ఇరాన్పై ఐరాస భద్రతా మండలి, అంతర్జాతీయ అణుఇంధన సంస్థ సహా అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అన్నిరకాల ఆంక్షలను ఎత్తేసేందుకు అమెరికా కృషిచేస్తుంది 8. అణ్వ్రస్తాలను ఇరాన్ తయారుచేయకూడదు, కొనుగోలుచేయకూడదు. ఇప్పటికే అత్యంత శుద్ధిచేసిన యురేనియం నిరీ్వర్యంపై ఇరాన్, అమెరికా ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటాయి 9. అణుకార్యక్రమం ఇప్పుడు ఏ దశలోఉందో అదే యథాతథస్థితి కొనసాగించేందుకు ఇరాన్కు హక్కు ఉంటుంది. ఇరాన్పై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించబోదు, బలగాలను దింపబోదు 10. ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం వస్తూత్పత్తుల ఎగుమతులకు ఊతమిచ్చేలా అమెరికా ఆర్థిక శాఖ సబ్సిడీలు, రాయితీల రూపంలో సాయపడుతుంది. బ్యాంకింగ్, బీమా, రవాణా పరంగానూ సాయపడనుంది 11. విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాక్కు చెందిన ఖాతాల నుంచి పెద్దమొత్తంలో నగదు ఉపసంహరణకు అవకాశం 12. అవగాహన ఒప్పందం సవ్యంగా, సమర్థవంతంగా అమలయ్యేలా ఒక ప్రత్యేక కార్యనిర్వాహణ వ్యవస్థను కొలువుతీర్చి దానిని పర్యవేక్షించడం 13. సంతకాలు చేయగానే 1, 4, 5, 10, 11 పేరాల్లోని అంశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. అందుకే మిగతా పేరాల్లోని అంశాల మీదనే చర్చలు జరుగుతాయి. 14. ఐరాస భద్రతా మండలి నిబంధనలకు లోబడి తుది ఒప్పందం కుదుర్చుకోవాలి -
భారత నావికుల భద్రతే ముఖ్యం
ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్య మార్గాల్లో లక్షలాది మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారు. అమెరికా, ఇరాన్ ఒప్పందంతో వారి భద్రతకు కచ్చితమైన హామీ లభిస్తుందని ఆశిస్తున్నా. – మోదీనా దృష్టిలో మోదీ చాలా కఠినమైన వ్యక్తి, ఒక కిల్లర్. నా మిత్రుడు మోదీ ప్రధానిగా ఉండగా ఎవరైనా భారత్పై దాడి చేయడానికి సాహసిస్తే వెంటనే వారి అంతు చూస్తాం. – ట్రంప్ఎవియన్–లెస్–బెయిన్స్: హార్మూజ్ జలసంధి సహా అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గాల్లో భారత నావికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. బుధవారం ఫ్రాన్స్లో జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నావికుల భద్రత అంశాన్ని మోదీ ప్రస్తావించారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఆ ప్రాంతంలో భారత నావికులకు ఎదురవుతున్న ఇబ్బందులను ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు.వారికి భద్రత కల్పించే అంశాన్ని ఇరాన్తో ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో చేర్చాలని కోరారు. ఇటీవల ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం వైమానిక దాడులకు పాల్పడడంతో ముగ్గురు భారతీయులు మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అమెరికా దుశ్చర్యను ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు.అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి చెందితే మోదీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భారత నావికుల భద్రత గురించి ట్రంప్తో భేటీలో మోదీ ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వారిద్దరూ భారత్, అమెరికా సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హార్మూజ్ జలసంధిని తెరవాల్సిందే పశ్చిమాసియా సంఘర్షణను ముగించడానికి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కృషిని ప్రధాని మోదీ అభినందించారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరే శాంతి ఒప్పందంలో భారత నావికుల భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని స్పష్టంచేశారు. అక్కడ ఎల్లప్పుడూ స్వేచ్ఛాయుత నౌకాయానికి అనుకూల పరిస్థితులు ఉండాలని చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్య మార్గాల్లో లక్షలాది మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారని, వారి భద్రత తమ అత్యంత కీలకమని వివరించారు. అమెరికా, ఇరాన్ ఒప్పందంతో వారి భద్రతకు కచ్చితమైన హామీ లభిస్తుందని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాల్లో ద్వైపాక్షిక సహకారం విషయంలో సాధించిన పురోగతిని తాము సమీక్షించామని వెల్లడించారు. మోదీ చాలా కఠినమైన వ్యక్తి, కిల్లర్ భారత ప్రధాని మోదీతో అద్భుతమైన సమావేశం జరిగిందని డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. సమీప భవిష్యత్తులో భారత్లో పర్యటిస్తానని చెప్పారు. ‘‘మోదీ చాలా మంచి మనిíÙ, సౌమ్యుడు, నెమ్మదస్తుడు అని అంటుంటారు. మోదీ అత్యంత అందమైన వ్యక్తి. చూడ్డానికి చాలా బాగుంటారు. అచ్చం దేవదూతలా కనిపిస్తారు. మోదీని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. కానీ, నిజానికి నా దృష్టిలో ఆయన చాలా కఠినమైన వ్యక్తి, ఒక కిల్లర్. వ్యాపారం, వాణిజ్య చర్చల్లో మోదీ చాలా కఠినంగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తారు.ఆయనకు భారతీయ ప్రజలంటే ఇష్టం, అలాగే అమెరికా అంటే కూడా ఇష్టమే’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని ఒక ప్రధాన ప్రపంచ శక్తిగా అభివరి్ణంచారు. ‘‘మోదీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం ప్రతి విషయంలోనూ భారత్ కీలక పాత్ర పోషిస్తుందని నేను భావిస్తున్నా. భారత్ ఒక పెద్ద పాత్రను పోషించబోతోంది. నేను వైట్హౌస్లో ఉన్నంత కాలం అమెరికాలో భారత్కు ఒక మంచి మిత్రుడు(ట్రంప్) ఉంటారు. ఒమన్ తీరంలో జరిగిన దాడుల్లో ముగ్గురు భారత నావికులు మరణించిన విషయం నాకు తెలిసింది. వారికి నా సంతాపం తెలియజేస్తున్నా.అది చాలా కఠినమైన వృత్తి, అందులో ఎలాంటి సందేహం లేదు. భారత్తో మేము కలిసి పనిచేస్తాం. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో మేము చాలా సమీపంలోకి వచ్చేశాం. ఉద్యోగాలు, ఉపాధి విషయంలోనూ రెండు దేశాలు చక్కగా సహకరించుకుంటున్నాయి’’అని ట్రంప్ వివరించారు. 2020లో భారత్లోని అహ్మదాబాద్లో తనకు లభించిన గౌరవాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. తనను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారని, అది తనకు ‘గొప్ప సమయం’అని చెప్పారు.వచ్చే నెల అమల్లోకి ట్రేడ్ డీల్ మోదీ, స్టార్మర్ ప్రకటన ఎవియన్–లెస్–బెయిన్స్: భారత్, యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం జూలై 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ బుధవారం ప్రకటించారు. వారు ఫ్రాన్స్లో జీ7 భేటీ సందర్భంగా సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలతోపాటు ఒప్పందం అమలుపై చర్చించారు. ఈ ట్రేడ్ డీల్ భారత్–యూకే సంబంధాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయి అని మోదీ అభివరి్ణంచారు. ఇది వచ్చే నెల 15న అమల్లోకి రానుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఫ్రెడరిక్ మెర్జ్తో భేటీ ప్రధాని మోదీ జర్మన్ చాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్తో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. పశ్చిమాసియాలోని పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణపై కూడా ఇద్దరు నాయకులు అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్, జర్మనీలు కేవలం వాణిజ్య రంగంలోనే కాకుండా, భవిష్యత్తుకు సంబంధించిన వివిధ అత్యాధునిక సాంకేతిక రంగాల్లో కూడా సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని మోదీ వివరించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఎఫ్టీఏపై సంతకాలు యూరోపియన్ యూనియన్ అగ్రనేత ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ప్రధాని మోదీ కూడా సమావేశమయ్యారు. రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆఖరి నాటికి భారత్, యూరోపియన్ యూనియన్లు ప్రతిష్టాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)పై సంతకం చేయనున్నాయని లేయెన్ తెలిపారు. ఎల్లప్పుడూ శాంతి పక్షాన భారత్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ భేటీ అయ్యారు. మానవతా విలువలకు భారత్ ప్రా ధాన్యం ఇస్తోందని మోదీ చెప్పారు. తాము శాంతి పక్షాన నిలుస్తామని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన అంశాలను తాము సమీక్షించామని పేర్కొన్నారు. -
పుతిన్, జిన్పింగ్కు ధన్యవాదాలు తెలిపిన ట్రంప్
ఫ్రాన్స్లో జరిగిన జీ7 సదస్సు అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తటస్థ వైఖరి అవలంబించారని, అందుకు తాను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా చేపట్టిన చర్యలకు బీజింగ్, మాస్కో అడ్డంకులు సృష్టించలేదని పేర్కొన్నారు. అవసరమైతే వారు పరిస్థితిని మరింత క్లిష్టం చేయగలిగేవారు. కానీ అలా చేయలేదు. అందుకే వారికి ధన్యవాదాలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి జిన్పింగ్ను ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తాడు.ఓ పక్క చైనా, రష్యా అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపిన ట్రంప్, తమ మిత్రదేశాలైన జపాన్, కొన్ని యూరోపియన్ దేశాలు హోర్ముజ్ జలసంధి సంక్షోభ సమయంలో తగిన సహకారం అందించలేదని విమర్శించారు.ఇరాన్–అమెరికా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా చైనా, రష్యాలపై తరచూ విమర్శలు గుప్పించే ట్రంప్, ఈసారి వారిని బహిరంగంగా ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. -
నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ భేటీ
పారిస్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. రక్షణ, వాణిజ్యం, పశ్చిమ ఆసియాలోని ఘర్షణపై ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. సుంకాలు, వాణిజ్యం, ఇరాన్తో కొనసాగుతున్న ఘర్షణ కారణంగా భారత్-అమెరికా సంబంధాల్లో నెలకొన్న ఆందోళనల మధ్య ఈ భేటీ జరుగుతోంది. జీ7 సదస్సు-2026 ఫ్రాన్స్లోని ఎవియన్ స్పా పట్టణంలో జరుగుతోంది. ఇందులో భాగంగా మోదీ, ట్రంప్ సమావేశయ్యారు. నౌకా సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి..ప్రపంచ సముద్ర మార్గాల్లో నౌకాయాన స్వేచ్ఛ కొనసాగడం, నౌకా సిబ్బంది భద్రతకు భరోసా ఉండడం అత్యంత ముఖ్యమని ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో లక్షలాది మంది భారతీయ నౌకా సిబ్బంది సముద్ర వాణిజ్యంలో పనిచేస్తూ, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ నిరంతరంగా సాగేందుకు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య నౌకా సిబ్బంది సంక్షేమం, భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఉండాలని మోదీ అన్నారు. ఇరాన్కు సంబంధించిన ప్రతిపాదిత ఒప్పందంపై ఆశాభావం వ్యక్తం చేసిన మోదీ.. నౌకా కార్మికుల భద్రతతో పాటు ప్రపంచ నౌకాయాన మార్గాల నిర్వహణకు తగిన రక్షణ లభిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వం అద్భుతం“నరేంద్ర మోదీ నాయకత్వం కొనసాగినంత కాలం భారత్ ఎంతో బాగా పురోగమిస్తుంది” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక సమావేశంలో అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని “దేవదూత”గా ట్రంప్ అభివర్ణించారు. ‘‘ప్రధాని మోదీ నాకు చిరకాల మిత్రుడు. త్వరలో భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుంది. బేరసారాల్లో మోదీన నిక్కచ్చిగా ఉంటారు. భారత్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. అమెరికా భారత పెట్టుబడులకు మోదీ సహకరిస్తున్నారు. భారత్కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం’’ అని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. తాను 8 యుద్ధాలకు ఆపానంటూ మరోసారి చెప్పారు. ఇరాన్ 48 ఏళ్లుగా ప్రపంచాన్ని ఉపయోగించుకుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, జీ7 సదస్సులో యూకే, అమెరికా, ఇటలీ, జపాన్, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్ దేశాల నాయకులు పాల్గొని ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఘర్షణ, ఇతర కీలక అంశాలపై చర్చించారు. జీ7 దేశాలతో పాటు భారత్, బ్రెజిల్, కెన్యా, దక్షిణ కొరియా ప్రతినిధులకు కూడా ఈ కీలక సదస్సుకు ఆహ్వానం అందింది. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పంద ప్రకటనను జీ7 దేశాలు స్వాగతించాయి. ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. -
లేట్ గా వచ్చిన లేటెస్ట్గా.. నేనే బాస్.. G7లో ట్రంప్
పారిస్ : ఫ్రాన్స్లో జరిగిన 52వ జీ7 శిఖరాగ్ర సమావేశంలో బుధవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశానికి ఆలస్యంగా హాజరయ్యారు. ఆయన ప్రవేశిస్తుండగా సభికులు లేచి నిలబడి చప్పట్లతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. దీంతో నేనే ఇక్కడ బాస్ అంటూ ఆయన సరదాగా మాట్లాడారు.అనంతరం ఆయన జీ7 ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు."మనం నిజంగా అంతర్జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలనుకుంటే, ఈ సంక్షోభాల భారాన్ని అత్యంత బలహీన దేశాలు ఒంటరిగా మోయకూడదు. నేడు అనేక సమాజాలు వృద్ధాప్యం వైపు పయనిస్తుండగా, భారతదేశం మరియు గ్లోబల్ సౌత్లోని ఇతర దేశాలు యువ ప్రతిభ, నైపుణ్యాలతో ఉప్పొంగుతున్నాయి.అని భారత్ను ప్రశంసిస్తూ మాట్లాడారు.అంతకుముందు సమావేశంలో మాట్లాడిన భారత ప్రధాని 'పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఇంధనం, ఎరువులు, ఆహార సరఫరా గొలుసులలో ఏర్పడిన అంతరాయాలు గ్లోబల్ సౌత్పై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని మోదీ అన్నారు. కాగా జీ 7 దేశాలలో భారత్ సభ్య దేశంగా లేదు. అయినప్పటికీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు సదస్సులో పాల్గొనడానికి మోదీ ఫ్రాన్స్ వెళ్లారు.కాగా ఈ రోజు సాయంత్రం ట్రంప్తో, మోదీ భేటి జరగనుంది. వాణిజ్య ఒప్పందంతో సహా పలు అంశాలపై ఈ ఇద్దరు నాయకులు చర్చించే అవకాశం ఉంది. వీరు చివరిసారిగా 16 నెలల క్రితం, 2025 ఫిబ్రవరిలో వాషింగ్టన్లో సమావేశమయ్యారు. -
ఇరాన్పై బాంబులు వేస్తా : ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధం ముగింపుకు శ్రీకారం చుడుతూ.. ఈనెల 19న అమెరికా-ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదరబోతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య మరో రెండు రోజుల్లో శాంతి ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయని, ఆ ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై బాంబులు వేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాయి. వంద రోజులకు పైగా యుద్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలో జూన్ 19న స్విట్జర్లాండ్లోని జెనీవాలో అమెరికా-ఇరాన్ల మధ్య అవగాహన ఒప్పందం జరగనుంది. మధ్యవర్తులుగా పాకిస్థాన్, ఖతర్ వ్యవహరిస్తున్నాయి. రెండు రోజులలోనే ఒప్పందంపై సంతకాలు జరగనున్న తరుణంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.‘ఒప్పందం కుదిరిన వెంటనే హర్మూజ్ జలసంధి అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ ఒప్పందానికి అణు ఆయుధాలే సాక్షాలు. ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగవు’ అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణు ప్రోగ్రామ్ నిలిపివేయాలని, యురేనియం నిల్వలను తొలగించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. అందుకు ఒప్పుకుంటూ ఇరాన్ ఒప్పందంపై సంతకాలు చేయాలి. లేదంటే ఆ దేశంపై బాంబులు వేయిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందిస్తూ.. ‘ఎంఓయూ కేవలం ప్రారంభం మాత్రమే. అణు ప్రోగ్రామ్పై భవిష్యత్ చర్చలు కొనసాగుతాయి అని అన్నారు. ఒప్పందం కుదిరిన వెంటనే యుద్ధం నిలిచిపోతుందని, హర్మూజ్ జలసంధిలో కార్యకలాపాలు ఇరాన్-ఒమాన్ ఆధ్వర్యంలో కొనసాగుతాయని ఆయన తెలిపారు.ఇరాన్ జాతీయ భద్రతా మండలి కూడా లెబనాన్తో సహా అన్ని ఫ్రంట్లలో యుద్ధం తక్షణమే నిలుస్తుందని, నావికాదళ ఆంక్షలు తొలగించబడతాయని ప్రకటించింది. ప్రపంచ చమురు రవాణాకు హర్మూజ్ జలసంధి కీలకమని, ఒప్పందం తర్వాత చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ యుద్ధంలో ధ్వంసమైన గ్యాస్, ఆయిల్ ఫీల్డ్స్ పునరుద్ధరణకు నెలలు పట్టవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. -
ఆంక్షలతో అల్లాడిన జీవితాలు.. ఇరానీల మౌన వేదన
టెహ్రాన్ ‘విజయం’ అంటోంది.. కానీ ఇరాన్ ప్రజలు ‘ఉపశమనం’ అంటున్నారు. అమెరికాతో ఒప్పందాన్ని ప్రభుత్వం రాజకీయ గెలుపుగా చూపిస్తుండగా, సంక్షోభంలో కూరుకుపోయిన ప్రజలు మాత్రం తమ జీవితం మెరుగుపడుతుందా?.. ధరలు తగ్గుతాయా? ఉద్యోగాలు వస్తాయా? పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? అనే దానిపైనే దృష్టి పెట్టారు. ఆర్థిక కష్టాలు, యుద్ధ భయాలే ఈ ఒప్పందానికి అసలు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణ ప్రజలు మాత్రం దాన్ని తమ జీవితాల్లో కొంత వెలుగు నింపే అవకాశంగా చూస్తున్నారు.గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. దేశ ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులపై పరిమితులు విధించడంతో విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఫలితంగా ఇరానియన్ రియాల్ విలువ క్షీణించింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఒకప్పుడు మధ్యతరగతికి అందుబాటులో ఉన్న అనేక వస్తువులు ఇప్పుడు విలాసంగా మారిపోయాయి.టెహ్రాన్కు చెందిన 45 ఏళ్ల ఉపాధ్యాయుడు అలీ రెజా మాటల్లో చెప్పాలంటే.. మాకు రాజకీయ విజయాలు అవసరం లేదు. మార్కెట్కు వెళ్లినప్పుడు సరుకులు కొనగలిగితే అదే విజయం.. ఈ భావన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రజల దృష్టిలో అమెరికాతో ఒప్పందం అంటే అంతర్జాతీయ రాజకీయాల్లో గెలుపు కాదు.. కుటుంబ ఖర్చులు తగ్గే అవకాశం అని భావిస్తున్నారు.ఆంక్షల అసలు ప్రభావం ప్రజలపైనే.. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్లో కేవలం చమురు ఆదాయం మాత్రమే తగ్గలేదు. విదేశీ బ్యాంకింగ్ వ్యవస్థలతో సంబంధాలు దెబ్బతినడంతో మందులు, వైద్య పరికరాలు, పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకుల దిగుమతులు కూడా కష్టతరమయ్యాయి. క్యాన్సర్, అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు దొరకక చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.ఇరాన్ యువత పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. నిరుద్యోగం, తక్కువ వేతనాలు, విదేశాల్లో అవకాశాల కొరత కారణంగా వేలాది మంది యువకులు నిరాశలో ఉన్నారు. చాలా మంది ఉన్నత విద్య పూర్తిచేసినా సరైన ఉద్యోగాలు దొరకడం లేదు. ఆర్థిక ఆంక్షల కారణంగా విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడంతో పరిశ్రమలు కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. అందుకే అమెరికాతో ఒప్పందం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని యువత ఆశిస్తోంది.మహిళల ఆశలుఇటీవలి సంవత్సరాల్లో ఇరాన్లో మహిళల హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే సమాజంలో మరిన్ని సంస్కరణలు వస్తాయనే ఆశ కొంతమంది మహిళల్లో ఉంది. అయితే ఒప్పందం వల్ల రాజకీయ స్వేచ్ఛలు పెరుగుతాయా అనే విషయంలో మాత్రం సందేహాలు ఉన్నాయి. అలాగే ఇరాన్లో మహిళల విద్యా స్థాయి గణనీయంగా పెరిగినా, ఉద్యోగ అవకాశాలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే ప్రైవేట్ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయని, మహిళల ఉపాధి పెరుగుతుందని చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా యువతులు ఈ ఒప్పందాన్ని ఉపాధి, ఆర్థిక స్వావలంబన దిశగా ఒక అవకాశంగా చూస్తున్నారు. మరోవైపు, 2022లో జరిగిన Mahsa Amini protests తర్వాత మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛల అంశాలు ఇరాన్లో ప్రధాన చర్చగా మారాయి. ఆర్థికంగా ప్రపంచంతో సంబంధాలు పెరిగితే సమాజంలో మరింత తెరవెనుకత, సంస్కరణలకు అవకాశం ఏర్పడుతుందనే ఆశ కొందరు మహిళల్లో ఉంది. ప్రజల్లో ఆందోళన..మరో ముఖ్యమైన అంశం యుద్ధ భయం. గత కొంతకాలంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్తో పెరిగిన ఘర్షణలు ప్రజల్లో ఆందోళన పెంచాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత విస్తరిస్తే తమ జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చాలామంది భావిస్తున్నారు. అందుకే ఈ ఒప్పందం ద్వారా ఉద్రిక్తతలు తగ్గితే అదే తమకు పెద్ద ఊరట అని చెబుతున్నారు. అయితే ఆశలతో పాటు అనుమానాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందాలు కుదిరినా తరువాత అవి నిలవలేదు. అందుకే ‘ఈసారి నిజంగా మార్పు వస్తుందా?’ అనే సందేహం చాలా మందిలో కనిపిస్తోంది. ఒప్పందం కుదిరిందనే వార్త కంటే, దాని ఫలితాలు తమ జేబుల్లో కనిపిస్తాయా లేదా అన్నదే వారికి ముఖ్యం.రాజకీయంగా చూస్తే టెహ్రాన్ దీనిని విజయగాథగా చెప్పుకోవచ్చు. కానీ సాధారణ ఇరానీయులకు ఇది విజయోత్సవాల విషయం కాదు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు తగ్గడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం, యుద్ధ భయం తగ్గడం, పిల్లలకు మెరుగైన భవిష్యత్తు దొరకడం వారికి అసలైన విజయం అదే. అందుకే అమెరికాతో కుదిరిన ఈ ఒప్పందాన్ని ఇరాన్ ప్రజలు ‘గెలుపు’గా కాదు, ‘బతుకును నిలబెట్టే ఆశాకిరణం’గా చూస్తున్నారు. దీంతో, ఈ ఒప్పందం నిజంగా ఇరాన్ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తుందా? లేక రాజకీయ ప్రచారానికే పరిమితమవుతుందా? అన్నది రాబోయే నెలల్లో తేలనుంది. -
‘‘భారతీయులూ బలయ్యారు’’.. ట్రంప్ ఎదుటే మోదీ ఆవేదన
పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదని, భారతీయులు కూడా దాని మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర వాణిజ్య మార్గాల భద్రతపై భారత్ తరఫున ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. హర్ముజ్ జలసంధి ఉద్రిక్తతల కారణంగా భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని జీ7 సదస్సు వేదికగా ప్రపంచ నేతల దృష్టికి తీసుకెళ్లారు.ఫ్రాన్స్లోని ఎవియన్లో జరిగిన జీ7 సదస్సులో భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “కొత్త భాగస్వామ్యాలు – అంతర్జాతీయ ఐక్యత పునర్నిర్మాణం” అంశంపై మాట్లాడిన మోదీ, పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు ముందుకు సాగడం స్వాగతార్హమని అన్నారు. అయితే ఆ ఘర్షణల వల్ల మిత్రదేశాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య రవాణా అంతరాయంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని పేర్కొన్నారు.“భారతీయ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దేశాలను అనుసంధానించే సముద్ర వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే నావికుల భద్రతను నిర్ధారించడం మనందరి బాధ్యత. సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి” అని మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.మోదీ వ్యాఖ్యల వెనుక కారణం ఇదేకొద్ది రోజుల క్రితం గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ప్రయాణిస్తున్న సెట్టెబెల్లో అనే చమురు ట్యాంకర్పై అమెరికా బలగాలు దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. మొత్తం 28 మంది సిబ్బందిలో 24 మంది భారతీయులే ఉన్నారు. అమెరికా ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఇరాన్ చమురును తరలిస్తున్నారనే అనుమానంతో ఆ నౌకపై చర్యలు తీసుకున్నట్లు అమెరికా తెలిపింది.ఇది ఒక్కటే కాదు. మారివెక్స్, జల్వీర్ అనే మరో రెండు నౌకలపైనా అమెరికా సైన్యం చర్యలు చేపట్టింది. ఈ మూడు నౌకల్లోనూ భారతీయ సిబ్బంది ఉండటం భారత్ ఆందోళనకు కారణమైంది.అమెరికా చర్యలపై భారత్ తీవ్ర అభ్యంతరంఈ ఘటనలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మీక్స్ను విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిపించి అధికారిక నిరసన (డిమార్ష్) అందజేసింది. భారతీయ నావికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, ఇటువంటి దాడులు వెంటనే ఆగాలని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, “సెట్టెబెల్లోపై దాడి జరిగిన వెంటనే అమెరికా ప్రభుత్వానికి బలమైన నిరసన తెలియజేశాం. భారతీయ నావికుల ప్రాణ భద్రతపై మా ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేశాం” అని వెల్లడించారు.ప్రపంచానికి భారత్ సందేశంజీ7 వేదికగా మోదీ చేసిన వ్యాఖ్యలు కేవలం భారతీయుల ప్రాణనష్టంపై ఆవేదన మాత్రమే కాదు. హర్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరా, ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ సమక్షంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా భారతీయుల భద్రత విషయంలో రాజీ ఉండదనే సంకేతాన్ని కూడా మోదీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.17 నెలల తర్వాత.. ఫ్రాన్స్ వేదికగా జీ7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధాని మోదీ కరచాలనం చేశారు. ఈ ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. గతేడాది ఫిబ్రవరి తర్వాత వీరిద్దరూ ప్రత్యక్షంగా పలకరించుకోవడం ఇదే మొదటిసారి. ఈ మధ్యకాలంలో టారిఫ్ వార్, ఆపరేషన్ సిందూర్ పరిణామాల నడుమ.. కీలక సదస్సులోనూ ఈ ఇద్దరూ ఒక్కచోట కనిపించలేదు. ఈ వ్యవహారం అంతర్జాతీయంగానూ ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే ఫోన్తో పాటు సోషల్ మీడియాలో ట్వీట్లతో సంభాషించుకున్నారు. జీ7 సదస్సులో భాగంగా.. బుధవారం ఇరు దేశాధినేతలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. -
నావికులకు భద్రత కల్పించాలి!
ఎవియన్–లెస్–బెయిన్స్: సముద్ర రవాణా మార్గాలు సురక్షితంగా ఉండేలా, నావికులు నిర్భయంగా తమ విధులను నిర్వర్తించేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. సముద్ర వాణిజ్యం ద్వారా అన్ని దేశాలను అనుసంధానించే నావికులకు తగిన భద్రత కచ్చితంగా కల్పించాలన్నారు. మంగళవారం ఫ్రాన్స్లో జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. నౌకల్లో విధులు నిర్వర్తించే నావికుల భద్రత గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల ఒమన్ తీరంపై వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేయడంతో ముగ్గురు భారతీయులు మరణించిన సంగతి తెలిసిందే. అమెరికా దుశ్చర్యను భారత్ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. హార్మూజ్ జలసంధిలో సముద్ర వాణిజ్యానికి కలిగిన అంతరాయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించాయని మోదీ తెలిపారు. పశ్చిమాసియా సంఘర్షణలో పలువురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. సంఘర్షణలకు శాశ్వత పరిష్కార మార్గాలను చర్చలు, దౌత్యం, అంతర్జాతీయ సహకారం ద్వారా మాత్రమే కనుగొనాలని చెప్పారు. ప్రపంచం ‘దాత–గ్రహీత’ అనే విధానం నుంచి సంఘీభావం, సమానత్వంపై ఆధారపడిన భాగస్వామ్యాల వైపు పయనించాలని మోదీ చెప్పారు. పరస్పర అనుసంధానం వేగంగా పెరుగుతున్న నేటి ప్రపంచంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందించడంలో ‘విశ్వాసం’అత్యంత కీలకమని స్పష్టంచేశారు. ‘ఒకరు దాత, మరొకరు గ్రహీత’ అనే విధానాన్ని వదులుకోవాలని, మనమంతా సమాన భాగస్వాములుగా పనిచేయాలని వ్యాఖ్యానించారు. మనం కేవలం ఒకరి పక్కన ఒకరు నడవడమే కాకుండా.. కలిసి నడవాలన్నారు. భాగస్వామ్యాలు గౌరవంతో ముడిపడి ఉండాలి తప్ప పరా«దీనతతో కాదని తేల్చిచెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి: ట్రంప్ మూడున్నర నెలలుగా కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇకపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించడంపై దృష్టి పెడతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ అంశం కంటే ఇరాన్ వివాదమే ఎక్కువగా చర్చనీయాంశమైంది. ఇరాన్ వ్యవహారం ఇక వెనక్కి వెళ్లిపోయినట్లేనని ట్రంప్ అన్నారు. రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణను ముగించడానికి తాను చేయల్సిందంతా చేస్తానని వెల్లడించారు. జీ7 సదస్సులో ట్రంప్తోపాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం పాల్గొన్నారు. ఉదయం వర్కింగ్ సెషన్ 75 నిమిషాల్లోనే ముగిసింది. రష్యా చమురు, సహజ వాయువు రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షల ద్వారా ఆ దేశంపై ఒత్తిడిని పెంచడానికి ట్రంప్తో సహా జీ7 దేశాల నాయకులు అంగీకరించినట్లు సమాచారం. ఈ సదస్సులో ఉక్రెయిన్ అంశంపై చాలా ఫలవంతమైన సంభాషణ జరిగిందని ఓ దౌత్యవేత్త చెప్పారు. అదనపు వైమానిక రక్షణ సామర్థ్యాలు, ఇతర రక్షణలు సమకూర్చడం ద్వారా ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడంపైనా నాయకులు అంగీకారానికి వచ్చారని తెలిపారు. కెనడా ప్రధానితో మోదీ భేటీ ప్రధాని మోదీ మంగళవారం కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. వాణిజ్యం, ఇంధనం, ఆవిష్కరణలు, విద్య, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాల ద్వారా బలమైన భాగస్వామ్యాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. ఫ్రాన్స్లో జీ7 సదస్సు సందర్భంగా ఈ భేటీ జరిగింది. భారత్, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిని సమీక్షించారు. హలో మై ఫ్రెండ్ జీ7 సదస్సు వేదిక వద్ద మోదీ, ట్రంప్ ఆత్మీయ సంభాషణ 16 నెలల తర్వాత ముఖాముఖి నేడు పూర్తిస్థాయి ద్వైపాక్షిక సమావేశం ఎవియన్–లెస్–బెయిన్స్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 16 నెలల తర్వాత ముఖాముఖి కలుసుకున్నారు. ఫ్రాన్స్లోని ఎవియన్–లెస్–బెయిన్స్లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మంగళవారం వారిద్దరూ ఆప్యాయంగా కరచాలనం చేసుకుని, ఆ తర్వాత కాసేపు సంభాషించారు. క్లుప్తంగా చర్చించుకున్నారు. వారు సంభాషణకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఇరువురు నేతల మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక చర్చలు బుధవారం జరుగుతాయి. పశ్చిమాసియా సంక్షోభం, రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణ, భారత్–అమెరికా సంబంధాలు సహా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకొనే అవకాశం ఉంది. మోదీ గత ఏడాది ఫిబ్రవరిలో అమెరికా రాజధాని వాషింగ్టన్లో పర్యటించారు. అప్పట్లో ట్రంప్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇద్దరు నాయకులు ఫోన్లో పలుమార్లు మాట్లాడుకున్నప్పటికీ ముఖాముఖి కలుసుకొని చర్చించుకోవడం ఇదే మొదటిసారి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, అమెరికా మధ్య సంబంధాలు కొంత బలహీనపడ్డాయి. ఇరుదేశాల మధ్య కొన్నాళ్లు టారిఫ్ల యుద్ధం సాగింది. చమురు కొనుగోలు విషయంలోనూ భారత్పై ఆంక్షలు విధించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. భారత్, అమెరికా మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని ట్రంప్ ప్రకటించడం భారత్కు ఇబ్బందికరంగా మారింది. ఆపరేషన్ సింధూర్ను నిలిపివేయడం వెనుక ట్రంప్ ప్రమేయం లేదని భారత్ పలుమార్లు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అలాగే ట్రంప్ తీసుకొచ్చిన నూతన వలస విధానం, హెచ్–1బీ వీసా రుసుమును పెంచడం వంటి నిర్ణయాలు భారత్–అమెరికా సంబంధాలపై ఒత్తిడి పెంచాయి. -
ఆగిన యుద్ధం ఆగినట్టేనా?
ఎంతమాత్రం అవసరం లేని దుర్మార్గపు యుద్ధాన్ని 108 రోజులపాటు సాగించి ఇరాన్కే గాక ప్రపంచానికంతా తీవ్ర నష్టాలు కలిగించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, తానిక ఏమీ చేయలేనని గ్రహించి కావచ్చు యుద్ధ విరమణకు ‘అవగాహనా పత్రం’ ఒకటి ఇరాన్తో పాటు ప్రకటించారు. ఆ పత్రంపై ఈ నెల 19న జెనీవాలో జరగగలవంటున్న సంతకాలకు ట్రంప్ సహచర యుద్ధవీరుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ నుంచి కొత్త విఘాతాలు ఏర్పడని పక్షంలో, మరొక రెండు మాసాలకు మలివిడత చర్చలు జరుగుతాయి. అంతవరకు అందరం మధ్యంతర ఊపిరి పీల్చుకున్నా, తదనంతర పరిస్థితిపై ఇంకా ఊపిరి బిగబట్టవలసిందే.కుదిరినట్టేనా ‘అవగాహన’?ఆ ‘పత్రం’లో ఏమున్నదనే వివరాలు జెనీవాలో సంతకాల తర్వాతే ప్రకటిస్తామని అంటున్నారు. ఇంతవరకు ట్రంప్ చెప్పిన దానినిబట్టి, అన్ని క్షేత్రాలలో కాల్పులు వెంటనే ఆగిపోతాయి. ఇరాన్ రేవులపై దిగ్బంధాన్ని అమెరికా, హార్మూజ్పై దిగ్బంధాన్ని ఇరాన్ ఎత్తివేస్తాయి. ఓడలపై ఇరాన్ సుంకాలు విధించదు. చమురు రవాణా మునుపటి వలె స్వేచ్ఛగా సాగవచ్చు. ట్రంప్ చేసిన ప్రకట నను ఇరాన్ ఖండించలేదు. చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పిన దాని ప్రకారం, యుద్ధం అన్ని క్షేత్రాలలో వెంటనేగాక శాశ్వతంగా కూడా నిలిచిపోతుంది. ఇంకా ఇతరత్రా వెల్లడవుతున్న వివరాల ప్రకారం, అమెరికా స్తంభింపజేసిన 24 బిలియన్ డాలర్ల నిధులలో మొదట సగం మేర విడుదల చేస్తారు. ఇరాన్ పునర్ నిర్మాణానికి అమెరికా మిత్ర దేశాలతో కలిసి 300 బిలియన్లు సమకూర్చుతారు. అవగాహనా పత్రంలో ఇరాన్ యురేనియం నిల్వలు, క్షిపణులు, హమాస్, హెజ్బొల్లా, హౌతీల వంటి మిలిటెంట్ సంస్థల ప్రస్తావనలు లేవు. ఈ చర్చలు మలిదశలో ఉండగలవన్నది సూచన.ఇరాన్ రేవుల దిగ్బంధాల ఎత్తివేత 19 లోగా పూర్తిగా జరిగితేనే తాము అవగాహనా పత్రంపై సంతకాలు చేయగలమని ఇరాన్ వెంటనే స్పష్టం చేసింది. ఇందులోని మెలిక ఏమంటే, అమెరికా తాను చేయగలిగింది తాను చేయవచ్చుగాక. కానీ, లెబనాన్పై, అక్కడి హెజ్బొల్లాపై దాడులను కొనసాగిస్తున్న ఇజ్రాయెల్, ఇపుడు ఆపుతుందా అన్నది పెద్ద ప్రశ్న. చివరకు ఆదివారం రాత్రి తన ప్రక టనకు కొద్ది గంటల ముందు కూడా నెతన్యాహూను ట్రంప్ పరుషమైన భాషలో హెచ్చరించవలసి వచ్చింది. ఆ మీదట నెతన్యాహూతో పాటు ఆయన రక్షణ మంత్రి కట్జ్ అసాధారణమైన రీతిలో సంయుక్త ప్రకటన చేస్తూ, తాము దాడులు చేస్తున్నది హెజ్బొల్లాపై తప్ప లెబనాన్పై కాదని వివరించబూనారు. అది నిజం కాదని అందరికీ తెలుసు. గ్రేటర్ ఇజ్రాయెల్ సృష్టి దీర్ఘకాలిక లక్ష్యంగా గల ఇజ్రాయెల్, అందుకోసం పాలస్తీనా, జోర్డాన్లతో పాటు లెబనాన్ తదితర అరబ్ దేశాల భూభాగాలను ఆక్రమించటం ఒక కార్యక్రమంగా నేటికీ కొనసాగిస్తున్నది. ఆ మేరకు జియోనిస్టు సిద్ధాంత కర్తలు ప్రతిపాదించిన ఒక మ్యూపును నెతన్యాహూ నిరుడు విడుదల చేస్తూ, తానందుకు కట్టుబడి ఉన్నాన న్నారు. పాలస్తీనాను మొత్తంగా ఇజ్రాయెల్లో భాగంగా చూపే మ్యాపును ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలోనే ప్రదర్శించారు.‘గ్రేటర్ ఇజ్రాయెల్’ ఆగుతుందా?నిజానికి ప్రస్తుత యుద్ధాన్ని అణ్వాయుధాల సాకుతో అమె రికాతో కలిసి మొదలుపెట్టడంలోని రహస్యోద్దేశం కూడా పాలస్తీనా ఆక్రమణకు, పశ్చిమాసియాలో ఆధిపత్యానికి అడ్డంకిగా గల ఇరాన్ను విచ్ఛిన్నం చేయటమేనన్నది రహస్యం కాదు. అందుకే, ప్రస్తుత యుద్ధంలో శాంతి ప్రయత్నాలకు ప్రతిసారి విఘాతం కలి గిస్తూ వస్తున్న ఇజ్రాయెల్, అవగాహనా పత్రం అమలును మరొక మారు భంగపరచబోదన్న హామీ లేదు. అందుకే కావచ్చు ఇరాన్ నాయకత్వం, అవగాహన అంటూ కుదిరినా తమ వేళ్లు ఎల్లప్పుడూ ట్రిగ్గర్పైనే ఉంటాయని ఆ వెంటనే ప్రకటించింది.సమస్యలలో సులభమైన వాటిపై ప్రస్తుతానికి రాజీ కుదురు తున్నది. జరుగుతున్న దాడుల నిలిపివేత, నౌకా దిగ్బంధాల ఎత్తివేత వంటివి తేలికైన విషయాలు. అందువల్ల చమురు, సరకుల రవాణాలు సాఫీగా జరిగి ఇరాన్, గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచాని కంతా ఉపయోగకరమవుతుంది. తమకిచ్చిన హామీలు జెనీవా సంతకాల తర్వాత 60 రోజులపాటు సక్రమంగా అమలైతేనే మలి విడత చర్చలు జరప గలమని ఇరాన్ స్పష్టం చేసింది. అంతా అదే ప్రకారం జరుగుతుందనీ, మొదట ఈ నెల 19 వరకూ, తర్వాత 60 రోజుల వరకూ ఇజ్రాయెల్ను ట్రంప్ పూర్తి నియంత్రణలో ఉంచ గలరనీ, మరొకవైపు హెజ్బొల్లాను ఇరాన్ నియంత్రించగలదనీ భావించినా, ఆ మలి విడత చర్చలు ఎంత మాత్రం తేలిక కాబోవు. అప్పటి అజెండా క్లిష్టమైనది కాగలదు.వాటిలో అన్నింటికన్న ప్రధానమైనది ఇరాన్ అణుశక్తి కార్య క్రమం. ఆదివారం రాత్రి ట్రంప్ తమ ఒప్పందాన్ని ప్రకటిస్తూ,అంతా సాధారణ పరిస్థితికి చేరినాక తాము ఇరాన్లో ప్రవేశించి యురేనియంను స్వాధీనపరచుకుని, అమెరికాకు తెచ్చి నిరుపయో గంగా మార్చగలమన్నారు.ఆ పని చేయటంవల్ల ఇజ్రాయెల్కు అణుముప్పు తొలగిపోతుందని, కనుక ప్రస్తుతానికి మౌనంగా ఉండాలంటూ నెతన్యాహూను ఒప్పించినట్లు వార్తలు చెప్తున్నాయి. కానీ, ఇరాన్ వార్తలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. శాంతియుత ఉప యోగం తమ అంతర్జాతీయ హక్కు అని మొదటినుంచి ప్రకటిస్తున్న ఇరాన్, అది ఎప్పటికీ వదలుకోబోమనీ, యురేనియం శుద్ధి శాతాన్ని ప్రస్తుత 60 శాతం నుంచి గణనీయంగా తగ్గించి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీలు మరింత పెరిగేందుకు అనుమతించగల మనీ చెప్తున్నది. తమ క్షిపణులు ఆత్మరక్షణకు తప్పనిసరి గనుక వాటి పరిధి తగ్గింపు ఆమోదయోగ్యం కాదనీ, మిలిటెంట్ సంస్థలు ప్రధా నంగా ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి స్వతంత్రంగా పని చేస్తాయి గనుక, వాటిని నిరోధించే శక్తి తమకు లేదనీ అంటున్నది. ఏం సాధించినట్టు?ఇంతకూ, ఫిబ్రవరి 28న ఆరంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో అమెరికా, ఇజ్రాయెల్ సాధించిందేమిటి? ఇరాన్తో చర్చలు ఒక కొలిక్కి వస్తుండగా దాడులకు పాల్పడ్డ అమెరికా తన విశ్వసనీయతను కోల్పోవటం మొదటి ఘనత. ఇస్లామిక్ వ్యవస్థ మార్పు (రెజీమ్ ఛేంజ్), అణుశక్తి సామర్థ్య నిర్మూలన, బాలిస్టిక్ క్షిపణుల ధ్వంసం, మిలిటెంట్ మిత్రుల అంతం అనే లక్ష్యాలలో ఏ ఒక్కటీ నెరవేరక పోవటం రెండవ ఘనత. అగ్రనేత ఖొమెనేయ్ని కుటుంబంతో సహా మొదటి రోజునే ప్రాణాలు తీసినా ఇరానీ నాయ కత్వం, జాతి మొత్తం ఏకమై నిలిచి నెలల తరబడి ప్రతిఘటించేట్లు చేయటం మూడవ ఘనత. ఇరాన్ ప్రతిఘటనతో స్వయంగా తమ స్థావరాలతో పాటు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు తీవ్ర నష్టాలకు గురి కావటం నాల్గవ ఘనత. చమురు, గ్యాస్ సమస్యలతో ప్రపంచం అతలాకుతలం కావటం అయిదో ఘనత. ఇరాన్ ‘బేషరతుగా లొంగిపోవాలన్న డిమాండ్ ఏమైందో అమెరికా అధ్యక్షుడే చెప్పాలి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
జీ 7 సదస్సులో మోదీ, ట్రంప్ షేక్హ్యాండ్.. ఇద్దరి భేటీకి డేట్ ఫిక్స్
పారిస్: ఫ్రాన్స్లోని ఎవియన్లో జరుగుతున్న జీ 7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. గత 16 నెలల తర్వాత ఇద్దరూ బహిరంగంగా కలుసుకున్న తొలి సందర్భం ఇదే.ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఆతిథ్యం ఇచ్చిన ఈ శిఖరాగ్ర సమావేశానికి ప్రపంచ నాయకులు హాజరయ్యారు. కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు ప్రారంభం కావడానికి ముందు మాక్రోన్ సమావేశ వేదిక వద్ద ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. కాగా, బుధవారం (జూన్ 17)న మోదీ, ట్రంప్ భేటీ కానున్నారు. జీ7 సదస్సుకు ప్రపంచ దేశాల నాయకులు హాజరయ్యారు. అమెరికా కుదుర్చుకున్న ఇరాన్ ఒప్పందంపై నేతల మధ్య బహిరంగంగా, స్పష్టమైన చర్చలు జరిగినట్లు సోర్సెస్ తెలిపాయి. ట్రంప్, ముగ్గురు అరబ్ దేశాల నాయకులతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కూడా సమావేశం కానున్నారు.ఇరాన్తో కుదిరిన ఒప్పందం పూర్తి వివరాలను మరో 2 రోజుల్లో బహిరంగంగా విడుదల చేస్తానని ట్రంప్ తెలిపారు. అవసరమైతే ఆ పత్రాన్ని కెమెరాల ముందే చదివి వినిపిస్తానని కూడా వ్యాఖ్యానించారు. అలాగే ఆ ఒప్పందాన్ని పరిశీలన కోసం అమెరికా కాంగ్రెస్కు పంపుతానని చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన క్లిష్టమైన అంశాల పరిష్కారానికి జరగనున్న తదుపరి దశ చర్చలు మరింత సులభంగా ఉంటాయని ట్రంప్ గతంలో పేర్కొన్నారు. #WATCH | Prime Minister Narendra Modi and other G7 world leaders stand together for a group photo at the G7 Summit, in Evian, France.(Video: DD News) pic.twitter.com/MI5YiAys44— ANI (@ANI) June 16, 2026 -
ఇజ్రాయెల్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా లేకుంటే ఇజ్రాయెల్ ఉండేది కాదంటూ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాన్ని రక్షించిన ఘనత తనదేనంటూ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ మనుగడ, భద్రత.. అమెరికా మద్దతుపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ఈ వాఖ్యలు చేశారు. ఆ దేశాన్ని రక్షించడంలో తన సొంత విధానాలే నిర్ణయాత్మక పాత్ర పోషించాయన్నారు. తాను చేసిన పనులను చేయడానికి మరే ఇతర అధ్యక్షుడూ సిద్ధంగా లేరన్నారు.ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో తనకున్న సంబంధాలు బలంగా ఉన్నాయని వివరిస్తూనే.. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్య పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్.. లెబనాన్ విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందంటూ పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రముఖ నిపుణులకు నిలయంగా ఉన్న లెబనాన్.. కాలక్రమేణా తీవ్రంగా క్షీణించిపోవడంపై ట్రంప్ విచారం వ్యక్తం చేశారు.లెబనాన్, హెజ్బొల్లా విషయంలో ఇజ్రాయెల్ వ్యవహరించిన తీరుపై తాను సంతృప్తిగా లేనన్నారు. ఈ ఘర్షణ చాలా కాలంగా సాగుతోందని.. ఇది ఇరాన్తో ఇటీవలే కుదిరిన ఒప్పందాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు. ఇజ్రాయెల్కూడా శాంతి ఒప్పందానికి ఒప్పుకోవాలి. శుక్రవారం లోపు హర్మూజ్ పూర్తి ఓపెన్ అవుతుంది. ఇకపై హర్మూజ్లో టోల్ ఫీజు ఉండదన్న ట్రంప్.. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదన్నారు.కాగా, దాదాపు 107 రోజులుగా హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో నెలకొన్న అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ముగింపు పలుకుతూ, పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను ఆర్పేస్తూ అమెరికా, ఇరాన్ చరిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం సమష్టిగా ముందుకొచ్చాయి. పరస్పర షరతులకు సమ్మతి తెలుపుతూ జూన్ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు అటు అమెరికా, ఇటు ఇరాన్ ప్రకటించాయి.ఈ నేపథ్యంలో నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తనకు కొన్నిసార్లు విభేదాలు వస్తుంటాయని.. అయితే, అమెరికాతో సంబంధాల విషయంలో ఇజ్రాయెల్ తన సొంత ప్రయోజనాలకే కట్టుబడి ఉందని.. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేకుండా చూడటమే తమ లక్ష్యమంటూ మరోసారి తేల్చి చెప్పారు. -
ట్రంప్ బిగ్ గేమ్! అమెరికా రాజకీయాల్లో ఇజ్జత్ కా సవాల్
అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభావం ఇప్పటికీ బలంగానే కొనసాగుతోంది. ఆయన మద్దతు లభిస్తే ఎన్నికల్లో విజయం దాదాపు ఖాయమనే (స్ట్రయిక్ రేటు ఎక్కువ) అభిప్రాయం రిపబ్లికన్ పార్టీలో గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టెక్సాస్ సెనేట్ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి. ట్రంప్ మద్దతు పొందిన కెన్ పాక్స్టన్ ప్రైమరీలో తొలి అడ్డంకిని దాటి, ఇప్పుడు ప్రధాన ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ట్రంప్ తీసుకునే తదుపరి రాజకీయ నిర్ణయం పై అందరి దృష్టి నిలిచింది. టెక్సాస్ చాలా కాలంగా రిపబ్లికన్ పార్టీకి బలమైన కోటగా ఉంది. ఇటీవల జరిగిన రిపబ్లికన్ ప్రైమరీలో ట్రంప్ మద్దతుతో రాష్ట్ర అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్, సీనియర్ సెనేటర్ జాన్ కార్నిన్ను ఓడించి అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. అయితే ప్రైమరీలో గెలవడం ఒక విషయం అయితే, సాధారణ ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకోవడం మరో విషయం.ఈ పరిస్థితుల్లో కెన్ పాక్స్టన్కు ఎదురవుతున్న గట్టి పోటీని రిపబ్లికన్ పార్టీ కీలక పరీక్షగా చూస్తోంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున జేమ్స్ టలారికో నుంచి పెరుగుతున్న సవాల్, ఆయన బలమైన ఫండ్రైజింగ్, అలాగే పాక్స్టన్పై ఉన్న పాత అవినీతి ఆరోపణలు రిపబ్లికన్లకు రాజకీయంగా ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్సాస్ సెనేట్ పోరు రిపబ్లికన్ పార్టీకి “ఇజ్జత్ కా సవాల్”గా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.తన మద్దతుతో అభ్యర్థిగా నిలిచిన కెన్ పాక్స్టన్ను గెలిపించేందుకు ట్రంప్ తన వద్ద ఉన్న అత్యంత భారీ ఎన్నికల నిధిని ఖర్చు చేస్తారా లేదా? ఇదే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో చర్చకు దారితీసిందిరిపబ్లికన్లకు ట్రంప్ వద్ద ఉన్న నిధి కీలకంగా కనిపిస్తోంది. అమెరికాలో ఎన్నికలు అత్యంత ఖరీదైన రాజకీయ ప్రక్రియల్లో ఒకటి. టెలివిజన్ ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారం, ప్రజా సమావేశాలు, ప్రచార బృందాలు, ఓటర్లను చేరుకునే కార్యక్రమాల కోసం కోట్లాది డాలర్లు అవసరమవుతాయి. అందుకే రాజకీయ నాయకులు, పార్టీలు ముందుగానే భారీ మొత్తంలో విరాళాలు సేకరిస్తుంటాయి.ట్రంప్కు అనుబంధంగా ఉన్న మాగా (MAGA Inc), సూపర్ పాక్(PAC) వద్ద ప్రస్తుతం 356 మిలియన్ డాలర్ల(సుమారు రూ.3,000 కోట్లు) నిధి ఉంది. ఇది అమెరికా రాజకీయాల్లో అత్యంత భారీ ఎన్నికల నిధుల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ డబ్బు ప్రధానంగా ట్రంప్ అభిమానులు, వ్యాపారవేత్తలు, పార్టీ మద్దతుదారుల విరాళాల ద్వారా సమీకరించబడింది. అయితే.. 👉ట్రంప్ ఈ డబ్బును టెక్సాస్ కోసం పాక్స్టన్ కోసం ఖర్చు చేస్తే ఏమవుతుంది?.. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, భారీ ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలు, ప్రత్యర్థులపై రాజకీయ దాడులు చేపట్టేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో పాక్స్టన్కు ఎన్నికల్లో స్పష్టమైన ఊతం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా టలారికో ఆర్థిక బలాన్ని ఎదుర్కోవడానికి ఇది ఉపయోగపడవచ్చు.👉అయితే ట్రంప్ ఈ నిధిని ఖర్చు చేయకుండా దాచిపెడితే పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు. పాక్స్టన్ తన సొంత నిధులతోనే ఎన్నికల పోరాటం చేయాల్సి వస్తుంది. ఒకవేళ టెక్సాస్ వంటి కీలక రాష్ట్రంలో రిపబ్లికన్లు ఓడిపోతే, అమెరికా సెనేట్లో పార్టీ బలం తగ్గే అవకాశం ఉంటుంది. అలా జరిగితే భవిష్యత్తులో ట్రంప్ రాజకీయ అజెండాను అమలు చేయడంలో కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు.👉అలాగే.. ట్రంప్ నిధిని వెంటనే ఖర్చు చేయకూడదని భావించే వర్గాలు కూడా ఉన్నాయి. 2026 మధ్యంతర ఎన్నికలతో పాటు రాబోయే జాతీయ రాజకీయ పోరాటాల కోసం ఈ డబ్బును నిల్వ ఉంచడం వ్యూహాత్మకంగా మంచిదని వారు వాదిస్తున్నారు. అందుకే ట్రంప్ ఇప్పటివరకు తన తుది నిర్ణయాన్ని వెల్లడించలేదు.మొత్తంగా చూస్తే, టెక్సాస్ ఎన్నిక ఇప్పుడు కేవలం ఒక సెనేట్ సీటు కోసం జరిగే పోటీ కాదు. ట్రంప్ రాజకీయ ప్రభావం, ఆయన ఆర్థిక శక్తి, అలాగే రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలకు సంబంధించిన కీలక పరీక్షగా మారింది. ట్రంప్ తన ‘రూ.3,000 కోట్ల’ రాజకీయ నిధిని తెరపైకి తీసుకొస్తారా? లేదంటే సరైన సమయం కోసం దాచిపెడతారా?.. ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ఈ బిగ్ గేమ్ హాట్ టాపిక్గా మారింది. -
డీల్పై ట్రంప్ ఒక మాట.. ఇరాన్ మరో మాట!
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ.. తమ మధ్య ఓ కీలక అవగాహన ఒప్పందం కుదిరినట్టు అమెరికా–ఇరాన్లు ప్రకటించాయి. అయితే ఈ ఒప్పందంలో నిజంగా ఏముంది? ప్రచారంలో వినిపిస్తున్నట్లుగా 14 ప్రతిపాదనల ప్యాకేజీ నిజమేనా? అణు కార్యక్రమంపై ఇరాన్ ఎలాంటి హామీలు ఇచ్చింది? ఈ చర్చల్లో అమెరికా ఎక్కడైనా వెనక్కి తగ్గిందా? ఇరాన్ నిజంగానే అణ్వస్త్రాల అభివృద్ధికి శాశ్వతంగా స్వస్తి చెప్పిందా?.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలతో అంతర్జాతీయ సమాజంలో మరింత గందరగోళం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలను కలిగి ఉండబోదని అంగీకరించింది. ఈ మేరకు స్పష్టమైన హామీని కూడా ఇచ్చింది’’ అని అన్నారాయన. అలాగే గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న ఆర్థిక ప్యాకేజీ ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు. ‘‘అమెరికా ఇరాన్కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తోందన్న వార్త పూర్తిగా అబద్ధం" అని స్పష్టం చేశారాయన. అయితే ఇరాన్ మాత్రం పాత పాటే పాడింది. అవును.. మేం అణ్వాస్త్రాలు వదిలేశాం అని చెప్పడం లేదు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ స్పందిస్తూ.. ప్రాథమిక అవగాహన ఒప్పందాన్ని "ఒక ముఖ్యమైన ముందడుగు"గా అభివర్ణించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. అలాగే ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధులు కూడా ‘‘చర్చలు ముందుకు వెళ్తున్నాయి.. కీలక పురోగతి చోటు చేసుకుంది.. ముసాయిదా ఒప్పందాలు ఉన్నాయి’’అని చెబుతున్నారే తప్ప.. తుది నిర్ణయం తీసుకున్నట్లు ఎక్కడా చెప్పడం లేదు. దీంతో అణు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, ఆంక్షల సడలింపు వంటి కీలక అంశాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాగే ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య కుదిరింది పూర్తి శాంతి ఒప్పందం కాదు. ఇరు దేశాలు ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం (MoU)పై అంగీకరించాయి. అదీ నెలల తరబడి జరిగిన చర్చల తర్వాతే. అయితే ఖతార్ సమక్షంలో ఎంవోయూపై డిజిటల్ సంతకాలు కూడా పూర్తయ్యాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. తుది సంతకాల కార్యక్రమం మాత్రం ఈ వారం(19న) జెనీవా( స్విట్జర్లాండ్)లో జరగనుంది. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరయ్యే అవకాశం ఉంది. ట్రంప్ హాజరుపై స్పష్టత లేదు.ఈ అవగాహన ఒప్పందంలో అత్యంత కీలక అంశం హర్ముజ్ జలసంధి పునఃప్రారంభం. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మళ్లీ పూర్తిస్థాయిలో తెరుచుకుంటే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు ఊరట లభించనుంది. ఇప్పటికే చమురు ధరలపై ఒత్తిడి తగ్గినట్లు అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు చెబుతున్నాయి.అలాగే ఇరాన్పై విధించిన కొన్ని ఆంక్షల సడలింపుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇరాన్కు నేరుగా నగదు బదిలీ చేయబోమని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించడం, అంతర్జాతీయ తనిఖీలకు అంగీకరించడం వంటి షరతులు నెరవేర్చిన తర్వాతే ఆంక్షల సడలింపు అమల్లోకి వస్తుందని ఆయన చెబుతున్నారు.ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ట్రంప్ "ఇరాన్ అణ్వస్త్రాలు కలిగి ఉండదు" అని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు బయటకు వచ్చిన వివరాల ప్రకారం అణు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుత అవగాహన ఒప్పందం కేవలం చర్చలకు మార్గం సుగమం చేసే ఫ్రేమ్వర్క్ మాత్రమేనని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అణు కార్యక్రమం, యురేనియం నిల్వలు, ఆంక్షల పూర్తి ఎత్తివేత వంటి అంశాలపై తదుపరి చర్చలు జరగాల్సి ఉంది.లేటెస్ట్ అప్డేట్స్:* అమెరికా, ఇరాన్ మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరింది.* జెనీవాలో ఈ వారం తుది సంతకాల కార్యక్రమం జరగనుంది.* హర్ముజ్ జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకునే అవకాశం ఉంది. * ఇరాన్కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తున్నారన్న వార్తలను ట్రంప్ ఖండించారు. * అణు కార్యక్రమంపై తుది ఒప్పందం ఇంకా పెండింగ్లోనే ఉంది. ట్రంప్ దీనిని చారిత్రాత్మక విజయంగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. అసలు పరీక్ష ఇప్పుడు మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ నిజంగానే అణ్వస్త్రాల దిశగా అడుగులు ఆపుతుందా? అమెరికా వాగ్దానం చేసిన ఆంక్షల సడలింపు ఎంతవరకు అమలవుతుంది? జెనీవా సమావేశం తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత రానుంది. -
డీల్ ఓకే.. ఎట్టకేలకు శాంతి వీచికలు
ఇస్లామాబాద్/వాషింగ్టన్/టెల్ అవీవ్: దాదాపు 107 రోజులుగా హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో నెలకొన్న అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ముగింపు పలుకుతూ, పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను ఆర్పేస్తూ అమెరికా, ఇరాన్ చరిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం సమష్టిగా ముందుకొచ్చాయి. పరస్పర షరతులకు సమ్మతి తెలుపుతూ జూన్ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు అటు అమెరికా, ఇటు ఇరాన్ ప్రకటించాయి. స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో అమెరికా, ఇరాన్ల మధ్య సంతకాల కార్యక్రమాన్ని తమ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నట్లు పాకిస్తాన్ సోమవారం ప్రకటించింది. శాంతి ఒప్పందంలో ఏఏ వివరాలను పొందుపర్చబోతున్నారనే సమాచారం ఇంకా వెల్లడికాలేదు. ప్రపంచ మార్కెట్లపై యుద్ధ్దకుంపట్లను రాజేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ అమెరికా కాలమానంప్రకారం ఆదివారం రాత్రి ఇరాన్తో డీల్పై ప్రకటన చేశారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్సోషల్లో ఒక పలు పోస్ట్లు పెట్టారు. ‘‘ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరింది. అందరికీ అభినందనలు. ఇకపై ఎలాంటి సుంకాల్లేకుండా హార్మూజ్ తెరుచుకోబోతుంది. హార్మూజ్ వద్ద అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని ఎత్తేస్తున్నాం. ప్రపంచ నౌకలకు ఇదే నా పిలుపు. ఇంజిన్లు స్టార్ట్ చేయండి. చమురు సరఫరాను సముద్రమార్గంలో ఉరకలెత్తించండి. గొప్పదైన ఈ ఒప్పందంలో పశ్చిమాసియాలో శాంతి, భద్రత నెలకొంటాయి. ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవాలని గతంలో ఎంతో మంది అమెరికా అధ్యక్షులు ప్రయత్నించి విఫలమయ్యారు. తొలిసారిగా నేను శాంతి పవనాలు వీచేలా చేశా. శుక్రవారం సంతకాలు పూర్తయ్యాక హార్మూజ్ తెరుచుకుంటుంది. సముద్ర మందుపాతరల తొలగింపు ప్రక్రియ మొదలవుతుంది. హార్మూజ్ జలసంధికి ఇరువైపులా చమురు నౌకల రాకపోకలు ఆరంభమవుతాయి’’అనిట్రంప్ తెలిపారు. 60 రోజుల సంప్రదింపుల వ్యవధి! ‘‘ఇరు వైపుల ప్రతినిధి బృందాలు వచ్చాక శుక్రవారం స్విట్జర్లాండ్లో సంతకాలు చేస్తారు. అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాక 60 రోజులపాటు సంప్రదింపుల వ్యవధి ఉంటుంది. యురేనియంను అత్యంత నాణ్యత స్థాయికి శుద్ధిచేయడం, ఇప్పటికే శుద్ధచేసిన యురేనియంను నిర్వీర్యంచేయడం, ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు, రెండో దశ ఆంక్షలు, అంతర్జాతీయ ఆంక్షల ఎత్తివేతపై చర్చలు జరుగుతాయి’’అని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాసిం ఘరిబాబాడీ వెల్లడించారు. మరోవైపు ఒప్పందానికి అంగీకరించిన అమెరికాకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. మధ్యవర్తిత్వం వహించిన ఖతర్, తుర్కియే, సౌదీ అరేబియాలను షెహబాజ్ అభినందించారు. దాడి చేస్తే ప్రతిదాడి: ఇజ్రాయెల్ ఓవైపు శాంతి ఒప్పందానికి అమెరికా ముందడుగేస్తుంటే మిత్రదేశం ఇజ్రాయెల్ మాత్రం అదే యుద్ధధోరణిని మళ్లీ కనబర్చింది. ‘‘ఇరాన్ గనక మళ్లీ మాపై దాడులకు దిగితే మేం యుద్ధాన్ని కొనసాగిస్తాం. ఇప్పటిదాకా గాజా స్ట్రిప్, సిరియా, లెబనాన్లో మేం ఆక్రమించుకున్న సరిహద్దు ప్రదేశాలకు ఖాళీచేసేదే లేదు’’అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. శాంతి ఒప్పందంలో లెబనాన్నూ చేర్చాలని ఓవైపు ఇరాన్ పట్టుబడుతుంటే అదే లెబనాన్పై దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్ సోమవారం సైతం స్పష్టంచేయడంతో శాంతి ఒప్పందం ఏ మేరకు సవ్యంగా అమలవుతుందనే కొత్త అనుమానాలు బయల్దేరాయి. గత రెండున్నరేళ్లలో సిరియా, లెబనాన్, గాజా స్ట్రిప్లో మొత్తంగా 1,000 చదరపు కిలోమీటర్ల భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఇది దాదాపు అమెరికాలోని న్యూయార్క్ సిటీ అంత ఉంటుంది. ‘‘కొత్త ఒప్పందాన్ని సమర్థవంతంగా అమలుచేయాల్సిన బాధ్యత అమెరికాదే. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను అమెరికా నిలువరించాల్సిందే’’అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టంచేశారు. ఖమేనీ మృతి నుంచి ఒప్పందం దాకా.. వాషింగ్టన్/ఇస్లామాబాద్: ఇరాన్తో మూడ్రోజుల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ప్రకటించడంతో ఇన్నాళ్లూ ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్పై అమెరికా కాల్పులు మొదలెట్టి తాజాగా చర్చలు మొదలెట్టిన దాకా జరిగిన క్రమంలో కీలక పరిణామాలు కొన్ని... ఫిబ్రవరి 28: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడులు. దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా సయీద్ అలీ ఖమేనీ సహా పలువురు టాప్ కమాండర్ల దుర్మరణం మార్చి 1: దూరంగా ఉన్న అమెరికా భూభాగాలకు బదులు అమెరికా స్థావరాలున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై ఇరాన్ దాడులు మార్చి 2: పొరపాటున అమెరికా యుద్ధవిమానాలను నేలకూల్చిన కువైట్ మార్చి 4: ఇరాన్ యుద్దనౌక ఐఆర్ఎస్ డేనాను హిందూమహాసముద్రంలో టోర్పెడోతో దాడిచేసి ముంచేసిన అమెరికా మార్చి 8: సౌదీ అరేబియాపై ఇరాన్ దాడి. శకలాలు పడి భారతీయుడు మృతి మార్చి 9: తండ్రి స్థానంలో ఇరాన్ సుప్రీంనేతగా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ మార్చి 17: అమెరికా దాడిలో ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ అంతం మార్చి 18: సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రంపై అమెరికా భీకర దాడులు మార్చి 21: చమురు సంక్షోభం పెరగడంతో సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడిచమురు విక్రయానికి అమెరికా తాత్కాలిక అనుమతి మార్చి 27: ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా బాంబర్ విమానాల దాడి మార్చి 31: ఐదు అంశాలతో శాంతి ప్రతిపాదనలను తెచ్చిన చైనా, పాకిస్తాన్ ఏప్రిల్ 3: తొలిసారిగా అమెరికా యుద్ధవిమానాన్ని కూల్చేసిన ఇరాన్ ఏప్రిల్ 8: రెండు వారాల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఓకే చెప్పిన అమెరికా, ఇరాన్ ఏప్రిల్ 11: పాక్ వేదికగా తొలిసారిగా చర్చలకొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏప్రిల్ 12: చర్చలు విఫలమైనట్లు అమెరికా ప్రకటనఏప్రిల్ 15: ఇరాన్లో పర్యటించిన అగ్రనాయకత్వంతో చర్చించిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఏప్రిల్17: హార్మూజ్ను తెరుస్తున్నామన్న ఇరాన్. తాము దిగ్బంధించామన్న అమెరికా ఏప్రిల్ 20: ఇరాన్ జెండాతో రాకపోకలు సాగించే నౌకలను అడ్డుకోవడం మొదలెట్టిన అమెరికా ఏప్రిల్ 22: హార్మూజ్లో మూడు నౌకలపై దాడిచేసి రెండింటిని స్వా«దీనంచేసుకున్న ఇరాన్ ఏప్రిల్ 24: తమ ప్రతిపాదనలు తెలియజేసేందుకు పాక్లో పర్యటించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబాŠబ్స్ అరాఘ్చీ ఏప్రిల్ 27: అమెరికా దిగ్బంధాన్ని ఎత్తేస్తే హార్మూజ్ను తెరుస్తామని తొలిసారిగా ప్రకటించిన ఇరాన్ మే 6: విదేశీ నౌకలు హార్మూజ్ను సురక్షితంగా దాటేందుకు ఇకపై అమెరికా యుద్దనౌకలు రక్షణగా రాబోవని ప్రకటించిన ట్రంప్ మే 13: ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి మే 18: చర్చలు కీలకదశలో ఉండటంతో దాడులు తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు అమెరికా ప్రకటన జూన్ 1: తమ ఎంక్యూ–1 ప్రిడేటర్ డ్రోన్ను కూల్చినందుకు ఇరాన్పై భీకర దాడులు మొదలెట్టినట్లు ట్రంప్ వెల్లడి జూన్ 3: కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడిలో భారతీయుడి దుర్మరణం జూన్ 6: బహ్రెయిన్, కువైట్లపై బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించిన ఇరాన్ జూన్ 7: చర్చల ప్రక్రియలో కదలిక తెచ్చిన పాక్ జూన్ 8: కాల్పుల విరమణకు తూట్లుపొడుస్తూ పరస్పర దాడులకు దిగిన ఇజ్రాయెల్, ఇరాన్ జూన్ 9: అమెరికా ఆర్మీ హెలికాప్టర్ను కూల్చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటానన్న ట్రంప్ జూన్ 10: పలావూ జెండాతో ఉన్న నౌకపై అమెరికా దాడిలో ముగ్గురు భారతీయుల దుర్మరణం జూన్ 15: కాల్పులకు ముగింపు పలుకుతూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ప్రకటన ఒప్పందంలో ఏముంది ? మరో మూడ్రోజుల్లో ముసాయిదా ఒప్పందంపై అమెరికా, ఇరాన్లు సంతకాలుచేసి తదుపరి సమగ్రమైన సంప్రదింపుల ప్రక్రియకు తెరలేపనున్నారనే వార్తల నేపథ్యంలో అసలు ఈ ముసాయిదా ఒప్పందంలో ఏమేం అంశాలను పొందుపరిచారనే ఆసక్తి ప్రపంచ దేశాల్లో ఎక్కువైంది. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సుంకాలు విధిస్తారా? అణ్వాయుధం తయారీ కోసం ఇప్పటికే అత్యంత నాణ్యమైన యురేనియం శుద్ధికి సాహసించిన ఇరాన్ను ఆ దిశగా మరో అడుగు ముందుకువేయకుండా అమెరికా షరతు విధించింది? అనే పలు సందేహాల నడుమ ఇరాన్ మీడియా ఈ ముసాయిదాలోని 14 అంశాలను సంపాదించిందని కథనాలు వెలువడ్డాయి. సైనిక, ఆర్థిక, అణు అంశాలతో ఈ ముసాయిదాను సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాల గురించి క్లుప్తంగా...1. అమెరికా, ఇరాన్ దశాబ్దాల శత్రుత్వాలకు ఇకనైనా ముగింపు పలకడం 2. ముడి చమురు సహా వాణిజ్య వస్తూత్పత్తుల సరఫరా కోసం నౌకల రాకపోకల నిమిత్తం హార్మూజ్ తెరవడం 3. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన ఆంక్షలు, అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని ఎత్తేయడం 4. చర్చలు ఓవైపు జరుగుతుండగా ఒప్పందం తమకు అనుకూలంగా కుదిరేలా ఇరాన్పై ఒత్తిడి పెంచేలా ఆ దేశంపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించకపోవడం 5. ఈలోపు ఇరాన్ ముడి చమురు ఎగుమతులపై తక్షణం ఆంక్షలు ఎత్తేయడం 6. విదేశీ బ్యాంకుల ఖాతాల్లో అమెరికా, మిత్రదేశాలు స్తంభింపజేసిన ఇరాన్ ప్రభుత్వానికి చెందిన వేల కోట్ల డాలర్ల నిధులను విడుదలచేయడం 7. కనీసం 60 రోజులపాటు నిరాటంకంగా సవ్యంగా సంప్రదింపులు జరపడం 8. ఇరాన్ ఇకపై అణ్వస్త్ర సమీకరణ కోసం ప్రయత్నాలను విరమించుకోవడం 9. ఇరాన్ ఇకపై మిలటరీ గ్రేడ్లో నాణ్యత స్థాయికి యురేనియంను శుద్ధిచేయకుండా మిన్నకుండిపోవడం 10. అణు కేంద్రాల విస్తరణ ప్రతిపాదనలను ఇరాన్ పక్కనపడేయడం 11. అణుకేంద్రాలపై అమెరికా బాంబర్ దాడులతో భూస్థాపితమైన శుద్ధయురేనియం అప్పగింత లేదా నిర్వీర్యంచేయడంపై చర్చలు జరపడం 12. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిందని స్పష్టమయ్యేలా ఇరాన్ సైనిక చర్యలను ఉపసంహరించుకోవడం 13. ఆర్థికపర ఆంక్షలను అమెరికా ఎత్తేయడంతోపాటు ఇరాన్ పునర్నిర్మాణ కార్యక్రమానికి కృషిచేయడం 14. సమగ్రమైన తుది ఒప్పందం కోసం కృషిచేయడంతెరమీదకు మరికొన్ని అంశాలు! ఇవిగాక మరిన్ని ప్రతిపాదనలు ముసాయిదా ఒప్పందంలో ఉన్నాయని మీడియాలో వార్తలొచ్చాయి. ఇరాన్కు 300 బిలియన్ డాలర్లతో ఆర్థికాభివృద్ధి ప్యాకేజీని ట్రంప్ అందించడం, ఇరాన్లో అమెరికా సంస్థలు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టి ఇరాన్ పునరుజ్జీవనానికి పాటుపడటం, ఆర్థికసహకారం, రుణాలు అందివ్వడం, భవిష్యత్లో ఉద్రిక్తతలు తలెత్తకుండా తగు పరస్పర సహకార విభాగాలను ఏర్పాటుచేయడం, గ్లోబల్ మార్కెట్లతో ఇరాన్ను మరింతగా అనుసంధానం చేయడం వంటివీ ఇందులో ఉన్నాయని వార్తలొచ్చాయి. పరస్పర దాడులు ఆపేస్తే సరిపోదని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ‘‘ఇరాన్ యుద్ధంలో కీలకమైన నాలుగు అంశాలు దాగి ఉన్నాయి. చమురు సంక్షోభం భవిష్యత్లో తలెత్తకుండా సుంకాల్లేకుండా చమురు నౌకల రాకపోకలను శాశ్వతంచేయడం, దెబ్బతిన్న ఇరాన్ ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకునేలా పలు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందివ్వడం, అణ్వస్త్ర సామర్థ్యంలేకపోవడంతోనే తమపై అగ్రదేశాలు దాడులుచేస్తున్నాయనే భావన ఇరాన్లో లేకుండా చేయడం, తద్వారా ఇరాన్.. లెబనాన్(హెజ్»ొల్లా), యెమెన్(హూతీ), గాజా(హమాస్)లో పరోక్ష సైన్యాలను పెంచిపోషించకుండా అడ్డుకోవడం వంటివి చేయగలిగితేనే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి సుసాధ్యమవుతుంది’’అని నిపుణులు విశ్లేషించారు. తర్వాత ఏం జరగొచ్చు? ప్రతిపాదిత ముసాయిదా ఒప్పందం అమల్లోకి వచ్చాక తొలి 60 రోజులపాటు హార్మూజ్ తెరుచుకోవడంతో చమురు సంక్షోభం తాత్కాలికంగా సద్దుమణిగే ఆస్కారముంది. అయితే ఈ 60 రోజుల్లో సమగ్ర శాంతి ఒప్పందం కుదిరితే అందరికీ లాభమే. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే సమస్య మళ్లీ మొదటికొస్తుంది. ఏళ్ల తరబడి ఇరాన్పై అమెరికా సహా ఏ దేశమూ ఆంక్షలు విధించకుండా చూసుకోవడం, ఒప్పందాన్ని సమగ్రస్థాయిలో అమలుచేసే వ్యవస్థను కొలువుతీర్చడం, ఇరాన్ దొంగచాటుగా యురేనియంను శుద్ధిచేయకుండా అడ్డుకోవడం వంటివి కీలకంగా మారనున్నాయి. 14 అంశాలపై ఇరుదేశాలు ఉమ్మడిగా ఏకాభిప్రాయానికొస్తే చరిత్రాత్మక శాంతి ఒప్పందానికి ఈ 14 అంశాలే మూలస్తంభాలుగా నిలుస్తాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న లేదా మూడో ప్రపంచ దేశాలుగా పిలిచే దేశాల నుంచి భారీ స్థాయిలో వలసదారులను అనుమతిస్తే, అమెరికా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు.తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో స్పందిస్తూ.. మూడో ప్రపంచ దేశాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటే, చాలా త్వరగా మన దేశం కూడా మూడో ప్రపంచ దేశంలా మారిపోతుంది. దాన్ని ఆపడానికి మనమేమీ చేయలేమని పేర్కొన్నారు. అలాగే తన రాజకీయ నినాదమైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA)ను ప్రస్తావించారు.కాగా, ట్రంప్ రాజకీయ ప్రయాణంలో వలసల నియంత్రణ, జాతీయ గుర్తింపు, సరిహద్దు భద్రత వంటి అంశాలు కీలక అజెండాలుగా కొనసాగుతున్నాయి. తాజా వ్యాఖ్యలు కూడా అదే దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి.ఇటీవల హెచ్-1బీ వీసాలకు లక్ష డాలర్ల ఫీజు విధించే తన ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు రద్దు చేయడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండా ఆ ఫీజు విధించడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది.దీనిపై స్పందించిన ట్రంప్, ఫెడరల్ న్యాయమూర్తులు మా ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. న్యాయవ్యవస్థలో జరుగుతున్నది ఆశ్చర్యకరం. ఇది దేశానికి నష్టం చేస్తోందని విమర్శించారు.మరోవైపు, జన్మహక్కు పౌరసత్వం (Birthright Citizenship) అంశంపై కూడా ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అమెరికాలో ప్రసవం ద్వారా పిల్లలకు పౌరసత్వం లభించే విధానాన్ని కొందరు వలసదారులు దుర్వినియోగం చేస్తున్నారనే వాదనలకు ఆయన మద్దతు పలికారు.ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికాలో వలస విధానాలపై మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. ట్రంప్మద్దతుదారులు దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల కోసమే ఆయన మాట్లాడుతున్నారని చెబుతుండగా, విమర్శకులు మాత్రం ఈ వ్యాఖ్యలను వలసదారులపై ప్రతికూల అభిప్రాయాలను ప్రోత్సహించేవిగా అభివర్ణిస్తున్నారు. -
యుద్ధానికి స్వస్తి?
ప్రపంచాన్ని పలుమార్లు అంతిమ ఘడియల అంచులవరకూ తీసుకెళ్లిన పశ్చిమాసియా యుద్ధం పరిసమాప్తమైంది. ఘర్షణలు నిలిచిపోయాయని ఈ 107 రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపే స్వయంగా ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి గనుక, యుద్ధం ఆగిందంటే ఎవరూ నమ్మలేదు. చివరకు ఇరాన్ ధ్రువీకరించాకే ట్రంప్ మాటను అందరూ విశ్వసించారు. దీన్ని భగ్నం చేసితీరాలన్న కాంక్షతో ఇజ్రాయెల్ చెలరేగిపోతోంది. లెబనాన్పై క్షిపణి దాడులు చేస్తోంది. హార్మూజ్ జలసంధి దగ్గర ప్రస్తుతం 800 నౌకలు నిలిచిపోయాయి. వీటిల్లోని 20,000 మంది సిబ్బంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంతక్రితం మాటెలా వున్నా ట్రంప్ రెండో ఏలుబడిలో అమెరికా, ఇజ్రాయెల్ అవిభక్త కవలల్లా ప్రవర్తించటం మొదలెట్టాయి. సకల వ్యవస్థల్లో ఇజ్రాయెల్ చాపకింద నీరులా విస్తరిస్తున్న తీరుపై అమెరికా ఉన్నతాధికార యంత్రాంగంలోనే భయాందోళనలు అలుముకున్నాయి. నిరుడు సెప్టెంబర్లో ట్రంప్ వీరాభిమాని, మాగా ఉద్యమ సారథుల్లో ఒకరైన చార్లీ కిర్క్ను దుండగుడు కాల్చిచంపిన ఉదంతంలో ఇజ్రాయెల్ హస్తముందని ఆ ఉద్యమకారులే ఆరోపించారు. అతను ఇరాన్పై యుద్ధానికి బద్ధవ్యతిరేకి. ఒబామా హయాంలో ఇరాన్తో కుదిరిన అణు ఒప్పందాన్ని గత ఏలుబడిలోనే రద్దుచేసిన ట్రంప్... దాన్ని తలదన్నేలా కొత్త ఒప్పందం సాధించితీరతానని శపథం చేశారు. తాజా ఒప్పందం వివరాలు తెలియాల్సేవున్నా, ఇరు దేశాలమధ్యా కుదిరిందంటున్న అవగాహన గమనిస్తే ఆ శపథం నీరుగారినట్టే. తననూ, పార్టీనీ, దేశాన్నీ అధః పాతాళానికి నెట్టేసిన ఈ యుద్ధం నుంచి బయటపడాలని మొదటి వారానికే ట్రంప్ తహతహలాడారు. కానీ దోవ దొరకలేదు. దీనికి ప్రపంచం భారీ మూల్యం చెల్లించింది. క్షిపణి దాడుల్లో దాదాపు 4,000 మంది ఇరాన్ పౌరులు చనిపోగా, అమెరికావైపు 13 మంది సైనికులు మరణించారు. ఇరాన్లో 240 వైద్య ఆరోగ్య కేంద్రాలు ధ్వంసంకాగా, 20 పాఠశాలలు శిథిలాలయ్యాయి. ప్రపంచ పురావస్తు సంపదగా గుర్తించిన అయిదు ప్రాంతాలు, 54 మ్యూజియంలు నాశనమయ్యాయి. చివరకు హార్మూజ్లో భారత్ వస్తున్న నౌకపై దాడి జరిగి మన నావికులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విమాన ఇంధన ధరలు రెట్టింపు కావటంతో పలు సంస్థలు వేలాది విమాన సర్వీసుల్ని రద్దు చేశాయి. చమురు ధరలు పైపైకి ఎగబాకి ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ యుద్ధంతో మూడున్నర కోట్లమంది పేదరికంలోకి జారుకున్నారని ఏప్రిల్ నెలాఖరున ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. అమెరికా యుద్ధ వ్యయం లక్ష కోట్ల డాలర్లు ఉండొచ్చని హార్వర్డ్ ఆర్థికవేత్త లిండా బిల్మ్స్ అంచనా. విదేశీ యుద్ధాల్లో అమెరికా ప్రమేయం ఉండబోదని హామీ ఇచ్చి అధికారంలోకొచ్చిన ట్రంప్... దేశాన్ని యుద్ధం ఊబిలోకి నెట్టారు. యుద్ధం మొదలెడుతూనే ఆయతుల్లా అలీ ఖమేనీతోసహా పలువురు అగ్రనాయకుల్ని హతమార్చి అమెరికా చాలా నష్టపోయింది. ఉన్నంతలో మధ్యేవాద దృక్పథంతో ఉండే ఆ నాయకత్వంతో పోలిస్తే ఇప్పుడున్నవారంతా అత్యంత కఠినంగా వ్యవహరించే రకం. అందుకే ‘బేషరతు లొంగుబాటు’ తప్ప దేనికీ అంగీకరించబోనని మొదట్లో బీరాలు పలికిన ట్రంప్, చివరకు రాజీకోసం కాళ్లావేళ్లా పడాల్సివచ్చింది. ఇంతకూ తనదగ్గరున్న శుద్ధి చేసిన యురేనియంను ఇవ్వ డానికీ, బాలిస్టిక్ క్షిపణుల తయారీని ఆపటానికీ, హార్మూజ్ వద్ద యథాపూర్వస్థితి పునరుద్ధరణకూ ఇరాన్ అంగీకరించిందా? మరో నాలుగు రోజుల్లో ఆ సంగతి తేలాక ట్రంప్ పరువు మరింత దిగజారుతుంది. వచ్చే నవంబర్ మధ్యంతర ఎన్నికలనాటికి ఆర్థికవ్యవస్థ ఎంతో కొంత మెరుగు పడితేనే రిపబ్లికన్ పార్టీకి ఓట్లు రాలతాయనీ, లేదంటే అమెరికన్ కాంగ్రెస్పై పట్టు కోల్పోవటం ఖాయమనీ ట్రంప్ బెంగపడుతున్నారు. కానీ ఇంతవరకూ వెల్లడైన వివరా లకే అన్ని వర్గాలూ ఆయన్ను దుయ్యబడుతున్నాయి. ఇరాన్ ముందు సాగిలపడ్డారని విమర్శిస్తున్నాయి. ఆర్థికంగా, సైనికంగా నష్టపోయినా తనకున్న అరకొర బలంతోనే చివరివరకూ దృఢంగా పోరాడి ఇరాన్ తన పంతం నెగ్గించుకుంది. ఏదేమైనా యుద్ధంలో ఆయుధ సంపత్తి కాదు... సంకల్ప బలమే విజేతను నిర్ణయిస్తుందన్న పురాతన చైనా యుద్ధ వీరుడు సన్ జూ మాట మరోమారు రుజువైంది. -
అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘ట్రంప్’ పేరు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ పేరిట నామకరణం చేశారు. గత ఏడాది డిసెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేసిన ఈ రోడ్డును ఈ నెల 23న సీఎం అధికారికంగా ప్రారంభిస్తారు. భారతదేశంలో అమెరికా రాయ బారి సెర్జియో గోర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. జూలై 4న జరిగే అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ నెల 23న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.హైదరాబాద్ను ప్రపంచ స్థాయి ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన అంతర్జాతీయ సంస్థలను గౌరవించే సాంప్రదాయంలో భాగంగా ట్రంప్ పేరిట నా మకరణం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించా యి. ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక సంస్థల సేవల ను గుర్తిస్తూ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల పేర్లతో కూడా రహదారులకు నామకరణం చేసే ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తు న్నట్లు సమాచారం.తెలంగాణను ఆవిష్కరణల కు కేంద్రంగా, ప్రపంచ ఐటీ రంగానికి ప్రతీకగా నిలబెట్టడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమ ని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది ఢిల్లీలో జరిగిన యూఎస్–ఇండియా వ్యూహాత్మ క భాగస్వామ్య వేదిక (యూఎస్ఐఎస్పీఎఫ్) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనను వెల్లడించారు. -
హర్మూజ్పై ట్రంప్ కీలక ప్రకటన
పశ్చిమాసియాలో గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో శాంతి ఒప్పందం పూర్తయ్యిందని, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి శుక్రవారం నుంచి పూర్తిగా తెరుచుకోనుందని వెల్లడించారు.సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్.. "ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో ఒప్పందం పూర్తయ్యింది. అందరికీ అభినందనలు. హర్మూజ్ జలసంధిని ఎలాంటి టోల్ లేకుండా తెరవడానికి అనుమతి ఇస్తున్నాను. అదే సమయంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని కూడా వెంటనే ఎత్తివేస్తున్నాను. ప్రపంచ దేశాల నౌకలు తమ ప్రయాణాలను ప్రారంభించవచ్చు. చమురు మళ్లీ స్వేచ్ఛగా ప్రవహించనివ్వండి" అని పేర్కొన్నారు.అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ మాత్రం జాగ్రత్తగా స్పందించింది. ప్రస్తుతం కుదిరింది కేవలం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) మాత్రమేనని, అసలు ఒప్పందంపై చర్చలు ఆ తర్వాత అమల్లోకి వచ్చే 60 రోజుల కాల్పుల విరమణ సమయంలో జరగనున్నాయని స్పష్టం చేసింది. అమెరికాపై తమకు ఇంకా అపనమ్మకం కొనసాగుతోందని మరోసారి పేర్కొంది.కాగా, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయోతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ముందు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 4న టెహ్రాన్లోని ఇమామ్ ఖమేనీ మొసల్లా ప్రార్థనా మందిరంలో వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం టెహ్రాన్, ఖోమ్ నగరాల్లో అంతిమయాత్రలు సాగనున్నాయి. చివరి అంత్యక్రియలు జూలై 9న మష్హద్లో నిర్వహించి, అదే రోజు ఇమామ్ రిజా పవిత్ర స్థలంలో ఖమేనీకి ఖననం చేయనున్నట్లు ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. -
ప్రమాదంలో ఇరాన్–అమెరికా డీల్?!
పశ్చిమాసియా సంక్షోభం మరో కీలక మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యుద్ధం ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే ఇజ్రాయెల్ వైఖరి కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. భద్రతా విషయంలో తగ్గేదేలే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెబుతుండడం.. లెబనాన్పై కొనసాగుతున్న భీకర దాడులు శాంతి చర్చలపై తీవ్ర ప్రభావం చూపొచ్చన్న ఆందోళనలు పెంచుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య నెలల తరబడి సాగిన శాంతి చర్చలు తుది దశకు చేరుకుంటున్న సమయంలోనే మిడిల్ఈస్ట్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డీల్కు ససేమీరా చెబుతూ.. లెబనాన్పై ఇజ్రాయెల్ చర్యలకు దిగింది. లెబనాన్ రాజధాని బీరూట్తో పాటు దక్షిణ ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగినట్లు లెబనాన్ మీడియా తెలిపింది. కఫర్ టెబ్నిట్ ప్రాంతంలో కూడా డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఆదివారం హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇవి జనావాసాలను కూడా ప్రభావితం చేస్తున్నాయని లెబనాన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ, అంతర్జాతీయ జోక్యం కోరుతున్నారు. డీల్ కుదిరిందని ట్రంప్ ప్రకటించిన వేళ.. ఇజ్రాయెల్ వైపు నుంచి మరింత కఠిన వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ‘‘ట్రంప్ నిర్ణయాలు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. లెబనాన్పై దాడులు కొనసాగిస్తాం. భద్రతా విషయంలో రాజీ పడేది లేదు’’ అని నెతన్యాహు చెప్పినట్లు అంతర్జాతీయా మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఇక ట్రంప్ కుదిర్చిన ఒప్పందం తమను కట్టిపడేయదని ఇజ్రాయెల్ మంత్రి ఇత్మార్ బెన్ గ్విర్ వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. “భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు” అనే సందేశాన్ని ఇజ్రాయెల్ స్పష్టంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, ప్రధాని నెతన్యాహుతో కలిసి తాము స్పష్టమైన భద్రతా విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. లెబనాన్, సిరియా, గాజా ప్రాంతాల్లో భద్రతా జోన్లలో ఇజ్రాయెల్ సైన్యం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఒత్తిడులున్నప్పటికీ తమ వైఖరిలో మార్పు ఉండదని, దేశ భద్రతే ప్రధాన ప్రాధాన్యమని ఆయన తేల్చిచెప్పారు. లెబనాన్ పరిణామాల కారణంగా ఇరాన్ దాడి చేస్తే తక్షణ ప్రతిచర్య తప్పదని ఆయన హెచ్చరించారు.🔴 Israel’s Defense Minister Israel Katz says that along with Prime Minister Benjamin Netanyahu, he is leading a clear policy that states that the Israeli army will remain in the security zones in Lebanon, Syria and Gaza🔴 Katz says that Israel opposes the Israeli army’s… pic.twitter.com/dYPahEDsTE— Al Arabiya English (@AlArabiya_Eng) June 15, 2026అంతకు ముందు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, నెతన్యాహు చాలా కఠినమైన నాయకుడని, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు శాంతి చర్చలను క్లిష్టం చేశాయని వ్యాఖ్యానించారు. బీరూట్ ఘటనలు అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు కూడా ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం పరిణామాలను చూస్తే, ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు లెబనాన్ కేంద్రంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ చర్యలు ఆ ప్రక్రియకు ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ గనుక ఈ దాడులకు ప్రతిస్పందిస్తే.. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు మళ్లీ ప్రమాదంలో పడిన పరిస్థితి నెలకొంది. -
నెతన్యాహుపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుపై చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికా–ఇరాన్ మధ్య నెలల తరబడి సాగిన రహస్య చర్చల ఫలితంగా కుదిరిన శాంతి ఒప్పందం చివరి దశలో ఉండగా, లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి.. మొత్తం ప్రక్రియను దాదాపు పట్టాలు తప్పించిందని ట్రంప్ ఆరోపించారు. నెతన్యాహు చాలా కఠినమైన వ్యక్తి అంటూ మండిపడ్డారు. ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని నెతన్యాహు దాదాపు చెడగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..‘నెతన్యాహూ చాలా కఠినమైన వ్యక్తి. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు చర్చల ప్రక్రియను మరింత క్లిష్టం చేశాయి’ అని వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇజ్రాయెల్కు బలమైన మద్దతుదారుడిగా గుర్తింపు పొందిన ట్రంప్ నేరుగా నెతన్యాహూను విమర్శించడం విశేషంగా మారింది.అయితే, ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినందుకు ఇజ్రాయెల్ తమకు ఎంతో కృతజ్ఞతతో ఉండాలని ట్రంప్ అన్నారు. ఒకవేళ ఇరాన్ చేతికి గనుక అణ్వాయుధం చిక్కి ఉంటే, రెండు గంటల్లో ఇజ్రాయెల్ భూమిమీద లేకుండా ఉండేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న సమయంలో బీరూట్పై ఇజ్రాయెల్ దాడి చేయడం పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. కాగా.. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పంద చర్చల్లో ఇజ్రాయెల్ ప్రత్యక్ష భాగస్వామిగా లేకపోవడం గమనార్హం. దీంతో ఒప్పందంలోని కొన్ని అంశాలను ఇజ్రాయెల్ అంగీకరించడం కష్టమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా-ఇరాన్ ఒప్పందంపై వార్తలు వెలువడిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. మరోవైపు ఇరాన్, హెజ్బొల్లా వంటి మిత్ర బలగాలపై కొనసాగుతున్న పోరాటాన్ని నిలిపివేయడానికి నెతన్యాహుపై అంతర్గత రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.అమెరికా–ఇజ్రాయెల్ మధ్య విభేదాలా?ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలపై కొత్త చర్చ మొదలైంది. ఇరాన్ అంశంలో ఇరు దేశాల తుది లక్ష్యం ఒకటే అయినప్పటికీ, దాన్ని సాధించే మార్గాల విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నట్లు కనిపిస్తోంది. దౌత్య చర్చలు, ఒప్పందాలు, ఆంక్షల సడలింపులతో సమస్య పరిష్కారం చేయాలని అమెరికా భావిస్తుండగా.. కఠిన భద్రతా చర్యలు, సైనిక ఒత్తిడి, ముందస్తు దాడుల ద్వారా ఇరాన్ను నియంత్రించాలని ఇజ్రాయెల్ అనుకుంటోంది. ఈ రెండు విధానాల మధ్య ఉన్న తేడాలు ఇప్పుడు బహిరంగంగా బయటపడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. -
‘మేము ఆడేందుకు వచ్చాం.. ట్రంప్తో మాకు అనవసరం’
అమెరికా, ఇరాన్ మధ్య కొన్ని నెలలుగా సాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఫిఫా ప్రపంచకప్కు కూడా పాకిన విషయం తెలిసిందే. ఆటగాళ్ల వీసాల విషయంలో అనిశ్చితి, జట్టు అధికారుల్లో కొందరికీ ఎంట్రీ నిరాకరించడం, ఇరాన్ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను అమెరికా రద్దు చేయడం, అమెరికాలో ఏర్పాటు చేసుకున్న తమ బేస్ క్యాంప్ను కూడా అరిజోనాలో కాకుండా మెక్సికోలోని టిజువానాకు తరలించుకోవడం చూసి అసలు ఇరాన్ ఫిఫా ప్రపంచకప్ ఆడుతుందా లేదా అనే సందిగ్ధం నెలకొంది. కానీ వాటన్నింటికీ తెర దించుతూ ఇరాన్ ఫుట్బాల్ జట్టు ఫిఫా ప్రపంచకప్ ఆడేందుకు అమెరికాలో ల్యాండ్ అయింది. ఇవాళ రాత్రి లాస్ ఏంజిల్స్ వేదికగా న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచకప్కు ఆతిథ్యమిస్తున్న అమెరికా యుద్ధంలో ఉండడం, అదే యుద్ధంలో ఉన్న ఇరాన్కు ఆతిథ్యం ఇవ్వనుండడం చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. ఇక అమెరికాలో అడుగుపెట్టిన ఇరాన్ ఫుట్బాల్ జట్టు మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇరాన్ ఫుట్బాల్ కోచ్ అమీర్ ఘలేనోయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మేము ఇక్కడికి మ్యాచ్లు ఆడేందుకు వచ్చాం. మా చుట్టూ జరుగుతున్న హడావిడి, ఇతర విషయాల గురించి పట్టించుకోము. ట్రంప్తో మాకు అనవసరం. ఆ దేశంతో చర్చలు, ఒప్పందాలు అనేవి రాజకీ అంశాలు.ఇప్పుడు మా దృష్టంతా ఫిఫా ప్రపంచకప్పైనే ఉంది. సహజంగానే ప్రతీ జట్టుకు వారి దేశంలో అనేక సమస్యలు ఉంటాయి. అంతేకాదు అవి ఆటకు సంబంధం లేకుండా ఉంటాయి. అమెరికా, ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ నెలకొని ఉండొచ్చు. కానీ అవి ఆటతో ముడిపెట్టలేం. మేము రాజకీయ వ్యక్తులం కాదు.. ఫుట్బాల్ ఆటగాళ్లం.' అని చెప్పుకొచ్చాడు. ఇక ఫిఫా ప్రపంచకప్లో ఇరాన్ ఎన్నడూ నాకౌట్ రౌండ్కు చేరలేదు. గ్రూప్-జిలో ఉన్న ఇరాన్కు న్యూజిలాండ్, బెల్జియం, ఈజిప్ట్ రూపంలో గట్టి ప్రత్యర్థులే ఉన్నాయి. అయితే ఫిఫా ప్రపంచకప్ ప్రారంభానికి ముందు అమెరికా తమపై దాడులు చేస్తున్న కారణంగా తొలుత ఫిఫా ప్రపంచకప్ ఆడబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. ఆ తర్వాత మనసు మార్చుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తమ దేశానికి వస్తే ఆటగాళ్ల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. అయితే తాజాగా అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిందని రెండు దేశాలు అధికారిక ప్రకటన విడుదల చేయడంతో కొంత సానుకూలాంశం. ఇరాన్ స్వేచ్ఛగా మ్యాచ్లు ఆడేందుకు ఇది అవకాశం కల్పించనుంది.ఇరాన్ తరఫున ఆ దేశ సుప్రీం మోజ్తబా ఖమేనీ మార్గదర్శకత్వంలో డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. చర్చలను విజయవంతం చేసిన ఖతార్కు ఇరు వర్గాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. పాకిస్తాన్ కూడా ఈ పరిణామాన్ని స్వాగతించింది. ఇరు దేశాలకు అభినందనలు తెలిపింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు అధికారిక శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. చదవండి: ‘మ్యాచ్ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’ -
యుద్ధానికి బ్రేక్.. అసలు ముప్పు పొంచి ఉందా?
గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాజా అవగాహన ఒప్పందం (Framework Agreement)తో యుద్ధ భయాలు కొంత మేర తగ్గాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్లు, మధ్యప్రాచ్య భద్రతపై నెలకొన్న అనిశ్చితికి ఇది ఉపశమనం కలిగించినప్పటికీ, సంక్షోభం పూర్తిగా ముగిసిందని చెప్పేందుకు ఇంకా సమయం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభమైన ఘర్షణలతో ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్పై అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయి. దీంతో ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ అధికారుల ప్రకారం, ఈ ముసాయిదా ఒప్పందంలో ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలకు సడలింపులు, విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన సుమారు 25 బిలియన్ డాలర్ల ఇరానియన్ ఆస్తుల విడుదల, కొత్త ఆంక్షలు విధించకుండా ఉండటం వంటి అంశాలు ఉన్నాయి. ప్రతిగా ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని, తన అణు కార్యక్రమ విస్తరణను తాత్కాలికంగా నిలిపివేస్తామని అంగీకరించినట్లు సమాచారం.డాలర్ బలహీనం.. అయితే అసలు సమస్య ఇక్కడే ఉందని నిపుణులు చెబుతున్నారు. అణు కార్యక్రమంపై అమెరికా, ఇరాన్ వేర్వేరు వ్యాఖ్యానాలు చేస్తుండటంతో ఒప్పందం అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందంలోని కొన్ని అంశాలపై ఇరాన్, అమెరికా అధికారులు భిన్న ప్రకటనలు చేయడం కూడా అనిశ్చితిని పెంచుతోంది. ముఖ్యంగా శుద్ది చేసిన యురేనియం నిల్వలు, ఆంక్షల ఎత్తివేత విధానం, ఆస్తుల విడుదల వంటి అంశాలు ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. ఈ ఒప్పందం వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు ధరలు నాలుగు శాతానికి పైగా పడిపోగా, ప్రపంచ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అదే సమయంలో డాలర్ బలహీనపడటంతో బంగారం ధరలు పెరిగాయి. యుద్ధ భయాలు తగ్గడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఒత్తిడి కొంత మేర తగ్గిందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.ముప్పు తప్పలేదు.. కాగా, ఒప్పందం కుదిరిందనే కారణంతో ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని చెప్పలేమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హార్మూజ్ జలసంధిని మూసివేసే సామర్థ్యం ఇరాన్ వద్ద ఇప్పటికీ ఉంది. అలాగే లెబనాన్, ఇజ్రాయెల్కు సంబంధించిన ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల కార్యకలాపాలు, అణు చర్చల భవిష్యత్తు వంటి అంశాలు మళ్లీ పరిస్థితిని సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం కుదిరింది కేవలం ఒక ప్రాథమిక అవగాహన మాత్రమే. తుది ఒప్పందం కోసం రాబోయే 60 రోజుల్లో మరిన్ని చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత, ప్రాంతీయ భద్రత వంటి అత్యంత కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.ఇజ్రాయెల్ అంశం.. ఇజ్రాయెల్ అంశం కూడా అత్యంత కీలకంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ చాలా కాలంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. తాజా ఒప్పందం ఇరాన్కు మరింత ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తుందని భావిస్తే, ఇజ్రాయెల్ నుంచి రాజకీయ, దౌత్య లేదా భద్రతాపరమైన ప్రతిస్పందనలు వచ్చే అవకాశముంది. ప్రస్తుతానికి యుద్ధ మేఘాలు కొంతవరకు చెదిరినప్పటికీ, మధ్యప్రాచ్య సంక్షోభానికి పూర్తిస్థాయి ముగింపు లభించిందని చెప్పడానికి ఇంకా సమయం ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు అమెరికా–ఇరాన్ తదుపరి అడుగుల వైపే ఆసక్తిగా ఎదురుచూస్తోంది.అలాగే, ప్రాంతీయ భద్రత కూడా మరో ప్రధాన సమస్యగా ఉంది. లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్ మరియు సిరియాలోని ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపుల కార్యకలాపాలు అమెరికా, దాని మిత్రదేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ గ్రూపుల చర్యలు భవిష్యత్తులో ఒప్పందంపై ప్రభావం చూపే అవకాశాన్ని నిపుణులు కొట్టిపారేయడం లేదు. -
ముగిసిన ఇరాన్-అమెరికా యుద్ధం
పశ్చిమాసియా సంక్షోభానికి ఎట్టకేలకు తెర పడింది. మూడు నెలలుగా జరుగుతున్న ఇరాన్-అమెరికా యుద్దం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు.. ఇటు ఇరాన్ జాతీయ భద్రతా మండలి కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. దీంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.లెబనాన్ సహా అన్ని సరిహద్దు ఫ్రంట్లలో తక్షణమే సైనిక చర్యలు నిలిపివేయాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. ఈ అంగీకారంతో 60 రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. ఈ కాలంలో ఇరు దేశాలు మరిన్ని శాంతి చర్చలు నిర్వహించి దీర్ఘకాలిక పరిష్కారానికి మార్గం సుగమం చేయనున్నాయి. అయితే ఈ డీల్ తాలుకా మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఖతార్ మధ్యవర్తిత్వంతోనే ఈ ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది. డీల్ కుదిరిన నేపథ్యంలో.. ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకా దళ దిగ్భంధనం తక్షణమే రద్దు కానుంది. శాంతి ఒప్పందం పూర్తైందని.. ఇరాన్పై ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. హర్ముజ్ను వెంటనే తెరవాలంటూ సోషల్ మీడియాలో ఆయనో పోస్ట్ చేశారు. ప్రపంచంలోని నౌకలు హర్ముజ్లో ఇంజిన్లు ప్రారంభించాలని.. తమ ప్రయాణాలను తిరిగి ప్రారంభించాలని.. చమురు సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి రావాలని ట్రంప్ పేర్కొన్నారు.ఇటు ఇరాన్ తరఫున ఆ దేశ సుప్రీం మోజ్తబా ఖమేనీ మార్గదర్శకత్వంలో డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. చర్చలను విజయవంతం చేసిన ఖతార్కు ఇరు వర్గాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. పాకిస్తాన్ కూడా ఈ పరిణామాన్ని స్వాగతించింది. ఇరు దేశాలకు అభినందనలు తెలిపింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు అధికారిక శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ట్రంప్ పుట్టినరోజు సమయంలోనే(జూన్ 14) డీల్ కుదరడం విశేషమంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వ్యాఖ్యానించారు. భారీ మూల్యం అయితే ఈ మూడు నెలల యుద్ధం ఇరు దేశాలనే కాదు.. పలు దేశాల్ని సైతం భారీ మూల్యం చెల్లించుకునేలా చేసింది. అమెరికా వైమానిక దాడులు, క్షిపణి దాడులతో ఇరాన్లోని పలు సైనిక స్థావరాలు, చమురు నిల్వ కేంద్రాలు, కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హర్ముజ్లో అమెరికా బ్లాకేడ్ వల్ల వాణిజ్య నౌకలు ఆగిపోయాయి. మరోవైపు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల దాడుల కారణంగా అమెరికా సైనిక స్థావరాలు, ఆయుధ సంపత్తి నాశనం అయ్యాయి. ఇరువైపులా తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది.యుద్ధ ప్రభావంతో పశ్చిమాసియాలోని అనేక ప్రాంతాల్లో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. వేలాది మంది ప్రజలు తమ నివాస ప్రాంతాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ ఇంధన మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. హర్ముజ్ జలసంధి మూతపడే ప్రమాదం నెలకొనడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. సముద్ర రవాణా వ్యయాలు పెరగడంతో.. ప్రపంచ వాణిజ్యంపై కూడా ప్రభావం పడింది. ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరా వ్యవస్థలపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
ఇకపై దాడులొద్దు
జెరూసలేం: ఇకపై ఎలాంటి దాడులు చేసుకున్నా సహించేది లేదని ఇజ్రాయెల్, ఇరాన్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లలో హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన తాజా దాడులపై ఆయన ఆదివారం స్పందించారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి తరుణంలో దాడులు, ప్రతిదాడులకు దిగితే పరిస్థితి సంక్లిష్టంగా మారుతుందని, శాంతి యత్నాలకు విఘాతం కలుగుతుందని స్పష్టంచేశారు.అందుకే సంయమనం పాటించాలని ఇజ్రాయెల్, ఇరాన్లకు తేల్చిచెప్పారు. ఇలాంటి ఉద్రిక్తతల వల్ల శాంతి ఒప్పందంపై సంతకాలు ఆలస్యమవుతున్నాయని అన్నారు. బీరూట్పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో పలువురు మరణించారు. శిథిలాల నుంచి ఇప్పటిదాకా మూడు మృతదేహాలను, ఆరుగురు క్షతగాత్రులను వెలికితీసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. బీరూట్పై ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ప్రతీకార దాడులు తప్పవని సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియాలో స్పందించారు. పశ్చిమాసియాలో శాంతి సాధనే లక్ష్యంగా ఒప్పందానికి అత్యంత చేరువలోకి వచ్చామని పేర్కొన్నారు. ఇకపై ఎవరూ ఎలాంటి దాడులు చేసుకోవద్దని స్పష్టంచేశారు. ఒప్పందంపై నెతన్యాహు అసంతృప్తి! శాంతి ఒప్పందంపై ఆదివారం సంతకాలు జరిగే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒప్పందంలోని అంశాలు ఆయనకు తీవ్ర నిరాశను కలిగించినట్లు తెలుస్తోంది. అందుకే హఠాత్తుగా బీరూట్పై దాడికి దిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఉత్తర ఇజ్రాయెల్ హెజ్బొల్లా మిలిటెంట్లు దాడికి దిగారని, అందుకే ప్రతిస్పందనగానే తాము బీరూట్పై దాడులు చేసినట్లు నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది.ఇజ్రాయెల్ దుశ్చర్యపై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలిబాఫ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పశ్చిమాసియాలో శాంతిని స్థాపించాలన్న సంకల్పం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు లేదన్నారు. హెజ్బొల్లాకు ఇరాన్ మద్దతిస్తోంది. ఆయుధాలు, ఆర్థిక సాయం అందజేస్తోంది. అమెరికా–ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయాలన్న అంశాన్ని కూడా చేర్చాలని ఇరాన్ పట్టుబడుతోంది. -
పశ్చిమాసియా యుద్ధంలో బిగ్ ట్విస్ట్..?
-
మా యురేనియం మా వద్దే.. దాచి పెట్టిన ఇరాన్
-
ట్రంప్నకు షాకిచ్చిన నెతన్యాహు
జెరూసలేం: అమెరికా–ఇరాన్ మధ్య అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలువరించకుండా కుదిరే ఏ ఒప్పందమైనా మధ్యప్రాచ్య భద్రతకు ముప్పుగా మారుతుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరించింది. అమెరికా దౌత్యపరమైన పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తుండగా, ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్పై కఠినమైన ఒత్తిడి కొనసాగించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా తీరుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇరాన్ డిమాండ్లకు ట్రంప్ తలొగ్గిందంటూ విమర్శలు చేస్తున్నారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమంపై పరిమితులు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తనిఖీలు, ఆర్థిక ఆంక్షల సడలింపు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్కు ఆర్థిక ఉపశమనం కల్పించే ఒప్పందం కుదిరితే, ఆ దేశం తన ప్రాంతీయ ప్రభావాన్ని మరింత విస్తరించుకునే అవకాశం ఉందని ఇజ్రాయెల్ భావిస్తోంది.ఇజ్రాయెల్ ఆందోళన..ఇజ్రాయెల్ భద్రతా వర్గాల అభిప్రాయం ప్రకారం.. ఆంక్షల సడలింపుతో ఇరాన్కు భారీగా విదేశీ మారకద్రవ్య నిల్వలు అందుబాటులోకి వస్తాయి. ఆ నిధులను ఇరాన్ తన సైనిక సామర్థ్యాలను పెంచుకోవడానికి, అలాగే ప్రాంతంలోని తన మిత్ర వర్గాలకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించవచ్చని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా లెబనాన్లోని హెజ్బొల్లా, గాజాలోని హమాస్, యెమెన్లోని అన్సర్ అల్లాహ్ వంటి ఇరాన్ అనుకూల శక్తులకు మరింత బలం చేకూరే ప్రమాదం ఉందని పేర్కొంటోంది. ఇదే సమయంలో ఇరాన్కు అమెరికా లొంగిపోయిదంటూ ఇజ్రాయెల్ తాజాగా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా తీరుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.చర్చలే ముఖ్యం.. ఇక అమెరికా మాత్రం దౌత్య చర్చల ద్వారానే ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించవచ్చని నమ్ముతోంది. యుద్ధం లేదా ప్రత్యక్ష ఘర్షణల కంటే చర్చల ద్వారా అణు విస్తరణను అడ్డుకోవడం అంతర్జాతీయ భద్రతకు మేలు చేస్తుందని అమెరికా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ అణు ఆయుధాల అభివృద్ధికి అవసరమైన స్థాయిలో యురేనియం శుద్ధి చేయకుండా నిరోధించడం, అంతర్జాతీయ తనిఖీలను పునరుద్ధరించడం చర్చల ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. అయితే ఇజ్రాయెల్ ఈ హామీలతో సంతృప్తి చెందడం లేదు. గతంలో కుదిరిన అణు ఒప్పందాల వల్ల ఇరాన్ అణు కార్యక్రమం పూర్తిగా ఆగలేదని, కేవలం ఆలస్యమైందే తప్ప మూల సమస్య పరిష్కారం కాలేదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. అందువల్ల ఇరాన్ అణు మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్వీర్యం చేసే కఠినమైన ఒప్పందం తప్ప మరో మార్గం లేదని భావిస్తోంది.ఇటీవలి నెలల్లో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. గాజా యుద్ధం, లెబనాన్ సరిహద్దు ఘర్షణలు, సిరియా మరియు ఇరాక్లో ఇరాన్ అనుకూల బలగాల కార్యకలాపాలు, ఎర్ర సముద్ర ప్రాంతంలో హౌతీల దాడులు వంటి పరిణామాలు ఇప్పటికే ప్రాంతీయ భద్రతా పరిస్థితిని సంక్లిష్టంగా మార్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా–ఇరాన్ ఒప్పందం కుదిరితే అది మొత్తం మధ్యప్రాచ్య శక్తి సమతుల్యతపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.అమెరికా లెక్కలు వేరుఅమెరికా మాత్రం పరిస్థితిని మరో కోణంలో చూస్తోంది. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే అనేక ఘర్షణలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్తో ప్రత్యక్ష సైనిక సంఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాషింగ్టన్ భావిస్తోంది. ముఖ్యంగా చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, సముద్ర రవాణాపై దాని ప్రభావం భారీగా ఉండవచ్చు. అందుకే దౌత్య చర్చల ద్వారా ఇరాన్ అణు కార్యక్రమాన్ని పర్యవేక్షించడం, పరిమితం చేయడం యుద్ధం కంటే మెరుగైన మార్గమని అమెరికా అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ తనిఖీల ద్వారా ఇరాన్ కార్యకలాపాలపై నిఘా కొనసాగించవచ్చని వారి అభిప్రాయం.ప్రాంతీయ రాజకీయాలపై ప్రభావంఈ ఒప్పందం కుదిరితే మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఏర్పడే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు కూడా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇరాన్ ఆర్థికంగా బలపడితే ప్రాంతీయ శక్తి సమతుల్యత మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, ఇజ్రాయెల్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసినట్లుగా, తన జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడిందని భావిస్తే అంతర్జాతీయ ఒప్పందాలకు అతీతంగా స్వతంత్ర చర్యలు తీసుకునే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని నిపుణులు పేర్కొంటున్నారు. -
ఆంత్రోపిక్ కు అమెరికా బిగ్ షాక్..ఫేబుల్ 5, మైథోస్ 5 బంద్
-
17న ట్రంప్, మోదీ భేటీ
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న ఫ్రాన్స్లో జీ7 సదస్సు సందర్భంగా ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. వారిద్దరూ ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని వైట్హౌస్ శనివారం వెల్లడించింది. భారత్, అమెరికా మధ్య కీలక వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న చర్చల పట్ల వారు అభిప్రాయాలు పంచుకొనే అవకాశం ఉంది. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి భేటీ కాబోతుండడం ఇదే మొదటిసారి. అప్పట్లో మోదీ వాషింగ్టన్లో పర్యటించారు. తర్వాత వారు పలుమార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు.టారిఫ్ల యుద్ధంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు కొంత బలహీనపడ్డాయి. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని ట్రంప్ పదేపదే ప్రకటించగా, భారత్ కొట్టిపారేసింది. అలాగే ఇటీవల ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా దాడులు చేయడంతో ముగ్గురు భారతీయులు మరణించారు. అమెరికా చర్యను భారత్ ఖండించింది. ఈ నేపథ్యంలో ట్రంప్, మోదీ సమావేశం కాబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీ జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి బయల్దేరిన భారత ప్రధాని మోదీ శనివారం ఫ్రాన్స్ చేరుకున్నారు. నైస్ నగర ఎయిర్పోర్ట్కు చేరకున్న మోదీని ఫ్రాన్స్ విద్యా మంత్రి ఎడోగార్డ్ గిఫ్రే, పరిశోధనా మంత్రి ఫిలిఫే బాప్టిస్టే, భారత్లో ఫ్రాన్స్ రాయబారి థియెరీ మాథ్యూ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. నైస్తోపాటు ఎవియాన్, పారిస్లోనూ మోదీ పర్యటించనున్నారు. మేక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ను ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమంలో ఇరుదేశాలతోపాటు ఇతర దేశాలకు చెందిన అత్యుత్తమ నవ్య అంకుర సంస్థలు, పెట్టుబడుల సంస్థలు పాల్గొననున్నాయి. ఫ్రాన్స్ నుంచి మోదీ తర్వాత స్లోవేకియాకు వెళ్లనున్నారు. 14–15 తేదీల్లో అక్కడ బ్రాటిస్లావాలో అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని, ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికో, వ్యాపారరంగ ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. తిరిగి ఫ్రాన్స్ చేరుకుని 16, 17 తేదీల్లో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో గ్లోబల్ సౌత్ గళం వినిపిస్తానని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. -
యూఎస్ అటార్నీగా జేమ్స్ మెక్డొనాల్డ్!: ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటనలో, న్యూయార్క్ దక్షిణ జిల్లాకు యునైటెడ్ స్టేట్స్ అటార్నీగా జేమ్స్ ఎం. మెక్డొనాల్డ్ను నియమించాలనే తన ఉద్దేశాన్ని ప్రకటించారు. ఈ పదవి అమెరికా న్యాయవ్యవస్థలో అత్యంత కీలకమైనది, ముఖ్యంగా ఆర్థిక నేరాలు, అవినీతి కేసులు, ఫెడరల్ స్థాయి క్రిమినల్ కేసులను నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.జేమ్స్ మెక్డొనాల్డ్ ఒక అనుభవజ్ఞుడైన న్యాయవాది. ఈయన గతంలో అదే న్యూయార్క్ దక్షిణ జిల్లాలో అసిస్టెంట్ యూఎస్ అటార్నీగా పనిచేశారు. అమెరికా కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా కూడా సేవలందించారు. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో ఆయన ఈ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సల్లివన్ & క్రోమ్వెల్ న్యాయ సంస్థలో సీనియర్ పార్ట్నర్గా పనిచేస్తున్నారు.వర్జీనియా విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ లా, హార్వర్డ్ కాలేజీలలో చదువుకున్న మెక్డొనాల్డ్ అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ జి. రాబర్ట్స్, జూనియర్ వద్ద లా క్లర్క్గా కూడా పనిచేశారు. కాబట్టి దేశానికి శక్తివంతమైన ఫలితాలు అందించగల సామర్థ్యం ఆయనకు ఉందని ట్రంప్ పేర్కొన్నారు. -
ఇరాన్తో ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన!
పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలను తరిమేస్తూ శాంతికపోతాలకు స్వాగతం పలుకుతూ శాశ్వత శాంతి ఒప్పందం ఇరాన్తో ఆదివారం కుదుర్చుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం రాత్రి ప్రకటించారు. ఒప్పందం సంతకాలు పూర్తవగానే హార్మూజ్ను అందరికీ తెరుస్తామని ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్పెట్టారు.ఇరాన్ విషయంలో ఒబామా హయాంలో అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పు అని ఎత్తిపొడుస్తూ ఒక పోస్ట్పెట్టారు. ‘‘బరాన్ హుస్సేన్ ఒబామా ఇరాన్తో ఉమ్మడి సమగ్ర కార్యాచరణ(జేసీపీఓఏ) ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఇరాన్ అణ్వాయుధం తయారీకి ఒక రకంగా బాటలుపరిచింది. ఇది ఇలాగే అమల్లో ఉండి ఉంటే ఇరాన్ ఆరేళ్ల క్రితమే అణ్వాయుధాన్ని తయారుచేసి ఉండేది. ఇప్పటికే దానిని ఉపయోగించేవారు. ఇరాన్తో నేను కుదుర్చుకుంటున్న ఒప్పందం దీనిని పూర్తి విరుద్ధం.ఇరాన్ అణ్వాయుధ కలను కల్లను చేసే ఒప్పందం ఇది. కొనుగోలు, సమీకరణ, అభివృద్ధి ద్వారా కూడా వాళ్ల లక్ష్యం నెరవేరకుండా నా ఒప్పందం చేస్తుంది. ఇంతటి గొప్ప ఒప్పందం ఆదివారం జరగబోతోంది. ఒప్పందంపై సంతకాలు పూర్తవగానే హార్మూజ్ను అందరి కోసం తెరుస్తాం. ఇరాన్తో మా బంధం గతం కంటే భిన్నంగా, గత ప్రభుత్వాల కంటే ఎంతో మెరుగ్గా ఉండనుంది. ఒబామా వందల బిలియన్ల డాలర్లను పెట్టుబడులు, ఒప్పందాలు, నగదు రూపంలో ఇరాన్ కోసం ఖర్చుచేశారు. కానీ మేం అదనుచూసి గుట్టుచప్పుడుకాకుండా ఇరాన్లోని అణుధూళిని పట్టుకొచ్చేస్తాం.అద్భుతమైన పైలట్లు బీ–2 బాంబర్ విమానాలతో ఇరాన్ పర్వతాల్లో రేడియోధార్మిక పదార్థాన్ని భూస్థాపితం చేశారు. ఇప్పుడు మేం ఇరాన్తో, యావత్ పశి్చమాసియాతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. భవిష్యత్లోనూ కలిసి పనిచేస్తాం. ఈ ప్రక్రియ వేగంగా, సులభంగా, సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నా. ఇది ఒకవేళ ఆచరణసాధ్యంకాకపోతే మాకు భయంకరమైన ప్రత్యామ్నాయం ఉంది. ఇది ఎప్పటికీ ఉపయోగించకూడదనే కోరుకుంటున్నా’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.]24 గంటల్లోనే: షెహబాజ్ షరీఫ్యుద్దం ముసిగి శాంతి ఒప్పందం రాబోయే 24 గంటల్లో ఖరారు కావొచ్చని అంతకుముందు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగీ్చలను ట్యాగ్ చేశారు. ‘‘శాంతి ఒప్పందం విషయంలో గతంలో ఎన్నడూ లేనంత దగ్గరగా వచ్చేశాం. రాబోయే 24 గంటల్లో దీనికి తుదిరూపం లభించే అవకాశం ఉంది. ఆ వెంటనే ఒప్పందంపై ఎల్రక్టానిక్ విధానంలో అమెరికా, ఇరాన్లు సంతకాలు పెట్టేందుకు పాకిస్తాన్ సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత వచ్చేవారం సాంకేతిక స్థాయి చర్చలు జరుగనున్నాయి. శాంతి చర్చల సమయంలో అమెరికా, ఇరాన్లు చూపిన నిబద్ధతకు కృతజ్ఞతలు’’అని షరీఫ్ తెలిపారు.వచ్చే నెల 4న ఖమేనీ అంత్యక్రియలు!ఇస్లామాబాద్: ఇరాన్ దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వచ్చే నెల 4వ తేదీన జరుగుతాయని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ శనివారం వెల్లడించింది. పశి్చమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా అమెరికా, ఇరాన్ల మధ్య అతిత్వరలో ఒప్పందం కుదరబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.ట్రంప్ ఆరోపణలు పూర్తిగా నిరాధారం: ఇరాన్ ఒమన్ తీరంలో భారతీయులున్న మూడు నౌకలపై ఇరాన్ సైన్యమే డ్రోన్లతో దాడి చేసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను భారత్లోని ఇరాన్ ఎంబసీ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తేల్చిచెప్పారు. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించిన ఘటన నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఇరాన్పై అసంబద్ధ ఆరోపణలు చేశారని పేర్కొంది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో పోస్టుచేసింది. -
నరకానికి పంపించేశాం.. ట్రంప్ సంచలన ప్రకటన
డ్రగ్స్ ముఠా ట్రెన్ డి అరాగువా (Tren de Aragua)కు పెద్ద దెబ్బ తగిలింది. ఆ ముఠా లీడర్ హెక్టర్ రుస్తెన్ఫోర్డ్ గెర్రెరో ఫ్లోరెస్ అలియాస్ నినో గెర్రెరో హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వెనెజువెలాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గ్యాంగ్పై అమెరికా కీలక ఆపరేషన్ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ట్రంప్ షేర్ చేశారు. ఈ వీడియోలో పచ్చటి పైకప్పు ఉన్న భవనం పేల్చివేయబడి.. ముక్కలు ముక్కలుగా అవ్వడం కనిపించింది."ట్రెన్ డి అరాగువా ఉగ్రవాదులకు ఇకపై వెనిజులాలో కానీ.. మరెక్కడా కానీ సురక్షితమైన స్థావరం ఉండదు. నా నాయకత్వంలో ఈ ఘోరమైన హంతకులను, డ్రగ్ మాఫియా నాయకులను ఎప్పుడైనా, ఎక్కడైనా సరే వెతికి పట్టుకుంటాం. వారు ఉండాల్సిన నరకానికి వారిని పంపుతాం’’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్లో రాసుకొచ్చారు. ఈ ఆపరేషన్ను తాము ఎంతో సత్సంబంధాలు కలిగి ఉన్న వెనిజులాలోని తమ స్నేహితులతో కలిసి సమన్వయంతో చేపట్టినట్లు ట్రంప్ పేర్కొన్నారు.“నా ఆదేశాల మేరకు అమెరికా సదర్న్ కమాండ్ వేగవంతమైన, అత్యంత కచ్చితమైన దాడి నిర్వహించి ట్రెన్ డి అరాగువా నాయకుడు నినో గెర్రెరోను హతమార్చింది. ప్రపంచంలోని అత్యంత రక్తపిపాసి ఉగ్ర సంస్థల్లో ఇది ఒకటి” అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఈ ముఠాను అమెరికా గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించిన సంగతి తెలిసిందే.గెర్రెరో తలపై ఐదు మిలియన్ డాలర్ల రివార్డ్ కూడా ఉంది. అమెరికాలో డ్రగ్స్ అక్రమ రవాణాతో పాటు హింసాత్మక ఘటనల వెనుక ఈ ముఠా హస్తం ఉందని అమెరికా ఆరోపిస్తోంది. పదేళ్ల క్రితం ఓ జైల్లో ఏర్పాటైన ట్రెన్ డి అరాగువా.. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో కన్నుసన్నల్లోనే ఈ గ్యాంగ్ పనిచేస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. -
యుద్ధం ముగించలేదు.. ట్రంప్ కు ఇరాన్ హెచ్చరిక
-
ట్రంప్ వేట.. వెనిజువెలా డ్రగ్ లార్డ్ హతం
వాషింగ్టన్: అంతర్జాతీయ నేర సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ లీడర్ హెక్టార్ ‘నినో’ గెరెరోను అమెరికా సైన్యం మట్టుబెట్టింది. వెనిజువెలాకు చెందిన ‘ట్రెన్ డి అరాగువా’ ట్రాన్స్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ హెడ్ గెరెరోను సైనిక దాడిలో హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ ఆపరేషన్కు సంబంధించిన వీడియో ఫుటేజీని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ట్రూత్ సోషల్’లో పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ - సంచలన వీడియోఅమెరికా సదరన్ కమాండ్ మెరుపు వేగంతో నిర్వహించిన ఈ ‘కైనెటిక్ స్ట్రైక్’లో గెరెరో హతమయ్యాడని ట్రంప్ పేర్కొన్నారు. ‘మా నాయకత్వంలో, ఈ క్రూరమైన హంతకులను, డ్రగ్ లార్డ్లను ఎక్కడైనా, ఎప్పుడైనా సరే వేటాడి పట్టుకుంటాం’ అని ట్రంప్ హెచ్చరించారు. వెనిజువెలా అధికారులతో సంపూర్ణ సమన్వయంతోనే ఈ వ్యూహాత్మక ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశామని, ప్రస్తుతం వెనిజువెలా ప్రభుత్వంతో అమెరికా కలిసికట్టుగా పనిచేస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు.𝗗𝗼𝗻𝗮𝗹𝗱 𝗝. 𝗧𝗿𝘂𝗺𝗽 𝗣𝗼𝘀𝘁𝘀 𝗩𝗶𝗱𝗲𝗼 𝗼𝗻 𝗧𝗿𝘂𝘁𝗵 𝗦𝗼𝗰𝗶𝗮𝗹 - 𝟬𝟮:𝟬𝟯 𝗣𝗠 𝗘𝗦𝗧 𝟬𝟲.𝟭𝟮.𝟮𝟲At my direction, the United States Southern Command delivered a swift and lethal kinetic strike to successfully execute Niño Guerrero, the infamous leader of… pic.twitter.com/IMj9iZzTYM— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) June 13, 2026బైడెన్ సరిహద్దు విధానాలపై తీవ్ర విమర్శలుఈ అద్భుతమైన విజయాన్ని ప్రకటిస్తూనే, ట్రంప్ తన పూర్వ అధ్యక్షుడు జో బైడెన్ అనుసరించిన సరిహద్దు విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బైడెన్ హయాంలో సరిహద్దులను అదుపులేకుండా వదిలేయడం వల్లే ‘ట్రెన్ డి అరాగువా’ వంటి విదేశీ క్రిమినల్ ముఠాలు అమెరికాలోకి చొరబడ్డాయని ఆరోపించారు. గతంలో అమెరికాలో కలకలం రేపిన 12 ఏళ్ల జోస్లిన్ నుంగారే, 22 ఏళ్ల లాకెన్ రైలీల హత్యలను ప్రస్తావిస్తూ, ఈ సైనిక చర్య ద్వారా బాధిత కుటుంబాలకు న్యాయం చేకూరిందని, అమెరికా సైన్యం వారి తరఫున ప్రతీకారం తీర్చుకుందని ట్రంప్ ఉద్ఘాటించారు. ‘ట్రెన్ డి అరాగువా’ నేరచరిత్రవెనిజువెలాలో పుట్టిన ఈ ‘ట్రెన్ డి అరాగువా’ గ్యాంగ్ ప్రస్తుతం లాటిన్ అమెరికా అంతటా విస్తరించి ఒక పెద్ద ముప్పుగా మారింది. ఈ ముఠా దోపిడీలు, మానవ అక్రమ రవాణా, వలసదారుల స్మగ్లింగ్, డ్రగ్స్ మాఫియా, అనేక క్రూరమైన హింసాత్మక నేరాలకు పాల్పడుతున్నట్లు పలు దేశాల అధికారులు గుర్తించారు. ట్రంప్ ప్రభుత్వం తమ వలస విధానాలు, జాతీయ భద్రతా ఎజెండాలో భాగంగా ఈ గ్యాంగ్ను ప్రధాన లక్ష్యంగా చేసుకుంది.ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెన -
నిన్నటి మిత్రులు.. నేటి ప్రత్యర్థులా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కలిసి ఇరాన్పై యుద్ధాన్ని ప్రారంభించినప్పటికీ, ఇప్పుడు అదే యుద్ధం ముగింపుపై ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఒకే వ్యూహంతో ముందుకెళ్లిన ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం తమ తమ దేశీయ రాజకీయ అవసరాల కారణంగా వేర్వేరు దారుల్లో నడుస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.యుద్ధం ఎలా మొదలైంది?ఫిబ్రవరి 28, 2026న అమెరికా-ఇజ్రాయెల్ మద్దతుతో ఇరాన్పై భారీ సైనిక చర్య ప్రారంభమైంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం, ప్రాంతీయ భద్రతా ముప్పులను తగ్గించడం, టెహ్రాన్ ప్రభావాన్ని కట్టడి చేయడం ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించారు. ప్రారంభ దశలో ట్రంప్, నెతన్యాహు ఒకే వైఖరితో ముందుకు సాగారు.ఇప్పుడు ఎందుకు విభేదాలు?ప్రస్తుతం ట్రంప్ ప్రధానంగా యుద్ధాన్ని ముగించి ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) దాదాపు సిద్ధమైందని, త్వరలోనే సంతకాలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే, నెతన్యాహు మాత్రం ఇరాన్పై ఒత్తిడిని కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ అణు సామర్థ్యం, క్షిపణి కార్యక్రమం, హెజ్బొల్లా వంటి మిత్ర బలగాలపై మరింత కఠిన చర్యలు అవసరమని ఇజ్రాయెల్ వాదిస్తోంది.ట్రంప్ రాజకీయ లెక్కలునవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలు (Midterm Elections) ట్రంప్కు కీలకం. యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగడం, చమురు ధరల అస్థిరత, ప్రజల్లో యుద్ధ వ్యతిరేక భావన పెరగడం ఆయనకు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే యుద్ధాన్ని ముగించిన నాయకుడు అనే గుర్తింపుతో ఎన్నికల్లోకి వెళ్లాలని ట్రంప్ భావిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.నెతన్యాహు లక్ష్యం వేరుఇక నెతన్యాహు కూడా దేశీయ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్లో భద్రతా అంశం అత్యంత కీలకమైన రాజకీయ అంశం కావడంతో, ఇరాన్పై పూర్తి స్థాయి వ్యూహాత్మక ఆధిపత్యం సాధించకుండానే యుద్ధాన్ని ముగించడం ఆయనకు రాజకీయంగా ప్రమాదకరంగా మారవచ్చని భావిస్తున్నారు. అందువల్ల ఆయన మరింత కఠిన వైఖరిని అవలంబిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.బయటపడుతున్న ఉద్రిక్తతఇటీవల ట్రంప్ ఇరాన్పై ప్రణాళికాబద్ధమైన దాడులను రద్దు చేసి, చర్చలకు ప్రాధాన్యం ఇచ్చిన నిర్ణయం నెతన్యాహును ఆశ్చర్యానికి గురి చేసిందని వార్తలు వెలువడ్డాయి. ఆ నిర్ణయం గురించి ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాకుండా, ఇరాన్పై మరోసారి యుద్ధాన్ని ప్రారంభించవద్దని ట్రంప్ నెతన్యాహును హెచ్చరించినట్లు కూడా రాయిటర్స్ వెల్లడించింది. "మరింత జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఒంటరిగా మిగిలిపోతారు" అని ట్రంప్ హెచ్చరించినట్లు కథనాలు పేర్కొన్నాయి.శాంతి చర్చలపై విభేదాలుప్రస్తుతం అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇజ్రాయెల్ పాత్ర పరిమితంగా ఉండటం, ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా కొంత సడలింపు చూపుతుందనే అనుమానాలు నెతన్యాహు వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొత్తంగా ట్రంప్నకు యుద్ధం ముగింపు రాజకీయ లాభం అయితే, నెతన్యాహుకు ఇరాన్పై మరింత ఒత్తిడి కొనసాగించడం రాజకీయ అవసరంగా మారింది. ఈ విభిన్న లక్ష్యాలే ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల్లో కనిపిస్తున్న చీలికకు ప్రధాన కారణమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
యుద్ధానికి ముగింపు? కీలక ప్రకటన చేసిన ఇరాన్!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దారితీసిన అమెరికా-ఇరాన్ ఘర్షణ ముగింపుకు చేరువైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరే దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటిదాకా ట్రంప్ ప్రకటనలను ఖండిస్తూ వచ్చిన ఇరాన్.. ఈసారి కాస్త సానుకూలంగానే స్పందించింది. ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసిన హర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకోనున్న నేపథ్యంలో.. అసలు ఈ ఒప్పందంలో ఏం ఉండబోతోంది? యుద్ధం ముగిస్తే ఎవరు గెలిచినట్లు?.. అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) ముసాయిదాపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా పరిపాలనలోని ఓ సీనియర్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే కొద్ది రోజుల్లో తొలి ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ కూడా చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ దాదాపు ఖరారైందని ప్రకటించింది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. చర్చలు తుది దశకు చేరాయని అన్నారు. "అమెరికాతో ఒప్పందం ఇంత దగ్గరగా ఎప్పుడూ రాలేదు" అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆ పోస్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేయడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో.. ట్రంప్ మరో ట్విస్ట్ ఇచ్చారు.ఇరాన్ మీడియా ప్రచురించిన 14 అంశాల అవగాహన ఒప్పందం వివరాలను ట్రంప్ ఖండించారు. ఇటు అసలు షరతులపై ఊహాగానాలు చేయొద్దని అరాఖ్చీ మీడియాను కోరారు. చర్చలు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు ఈ యుద్ధంలో తామే గెలిచినట్లు ఇరాన్ ప్రకటించుకోవడం.. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.అదే కీలకంఈ ప్రతిపాదిత ఒప్పందంలో.. అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి ఉండబోతోందని తెలుస్తోంది. ప్రపంచ చమురు, సహజవాయు సరఫరాల్లో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. యుద్ధం తర్వాత ఇరాన్ మూసివేసిన ఈ జలసంధిని మళ్లీ తెరవడానికి అంగీకరించినట్లు సమాచారం. ప్రతిగా అమెరికా ఇరాన్పై విధించిన కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించడంతో పాటు, నిలిపివేసిన బిలియన్ల డాలర్ల ఆస్తులను విడదీయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.అణు ఒప్పందం.. ఆగాల్సిందే!అయితే అణు కార్యక్రమం అంశం మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. 60 రోజులపాటు ప్రత్యేక చర్చలు జరిపి దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఒప్పందంలో ప్రతిపాదించినట్లు సమాచారం. అమెరికా వాదన ప్రకారం ఇరాన్ అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తొలగించి, అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. కానీ ఇరాన్ మాత్రం యురేనియాన్ని పూర్తిగా వదులుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. దాన్ని తక్కువ శుద్ధి స్థాయికి మార్చే (డౌన్బ్లెండింగ్) మార్గానికే తాము సిద్ధమని అరాఖ్చీ ఓ అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం.ఈ ఒప్పందంలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. యుద్ధ నష్టాలకు పరిహారం, అలాగే ఇరాన్ క్షిపణి కార్యక్రమంపై అమెరికా చాలా కాలంగా చేస్తున్న డిమాండ్లను పక్కన పెట్టే అవకాశాలపై కూడా చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే అమెరికా అధికారులు ఈ అంశాలను ఖండిస్తున్నారు.ఇది ఇంకో ట్విస్ట్ఇక ఈ చర్చల్లో ఇజ్రాయెల్ భాగస్వామి కాకపోవడం మరో కీలక పరిణామం. అమెరికాతో కలిసి ఇరాన్పై సైనిక చర్యలకు దిగిన ఇజ్రాయెల్.. తుది ఒప్పందంలో భాగం కాదని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే లెబనాన్లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలుగుతుందని ఇరాన్ కోరుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాత్రం అలాంటి ఆలోచన లేదని ప్రకటించింది.ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు సరఫరాలపై భయాలు తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు రెండు నెలల కనిష్ఠానికి చేరాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం తన ప్రధాన లక్ష్యాలను నెరవేర్చిందని చెబుతున్నప్పటికీ, ఒప్పంద నిబంధనలు ఇరాన్కు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు “యుద్ధంలో విజేత ఇరానే” అని టెహ్రాన్ ప్రకటించడం ఈ ఒప్పందం చుట్టూ మరింత రాజకీయ ఆసక్తిని పెంచుతోంది.ప్రస్తుతం ప్రపంచ దృష్టంతా ఒక్క విషయంపైనే ఉంది. నిజంగానే యుద్ధానికి ముగింపు పలికే చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందా? లేదంటే చివరి క్షణంలో మళ్లీ కొత్త మలుపులు తిరుగుతుందా?.. -
యుద్ధం ముగిసింది
వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. శాంతి ఒప్పందం ఖరారు చేసుకోవడానికి అత్యంత చేరువలోకి వచ్చామని అన్నారు. ఒప్పందంపై ఈ వారాంతంలోనే సంతకాలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. యూరప్లో సంతకాలు జరిగే అవకాశం ఉందన్నారు. గురువారం మధ్యాహ్నం వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్తో శాంతి ఒప్పందంపై సంతకాల కార్యక్రమానికి తమ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇరాన్తో తాజా చర్చలకు సంబంధించి ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, పాకిస్తాన్లతో సహా మధ్యప్రాచ్య దేశాల నాయకులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఇరాన్తో ఒప్పందాన్ని స్టాక్ మార్కెట్ కూడా అనుకూలంగా భావిస్తోందని చెప్పారు. ఒప్పందం ఖరారైన తర్వాత హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని వివరించారు. ఇది చాలా బలమైన, సమగ్రమైన అవగాహన ఒప్పందమని, కచ్చితంగా కార్యరూపం దాల్చబోయే విషయమని వ్యాఖ్యానించారు. ‘‘చాలా తక్కువ మంది మాత్రమే తట్టుకోగలిగే తీవ్రమైన దెబ్బలను వారు(ఇరాన్) ఎదుర్కొన్నారు. అందుకే శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని నాకంటే వారే ఎక్కువగా కోరుకుంటున్నారు’’అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మా డిమాండ్కు ఇరాన్ అంగీకారం అనంతరం.. గవర్నర్ పదవికి పోటీ చేస్తున్న జార్జియా లెఫ్టినెంట్ గవర్నర్ బర్ట్ జోన్స్కు మద్దతుగా నిర్వహించిన ఆన్లైన్ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. ఈ రోజు (గురువారం) ఇరాన్తో యుద్ధాన్ని ముగించామని ప్రకటించారు. ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదన్న తమ డిమాండ్కు ఇరాన్ అంగీకరించిందని ఉద్ఘాటించారు. ఇరాన్ వద్ద ప్రాణాంతక ఆయుధాలు ఉండకూడదని, అదే తమ అసలు ఉద్దేశమని వివరించారు. ‘‘వారు(ఇరాన్) అణ్వాయుధాన్ని కొనుగోలు చేయరు లేదా ఏ విధంగానూ దానిని అభివృద్ధి చేయరు. వారి వద్ద అణ్వాయుధం ఉండదు’’అని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్పై దాడులు ఆపాలని అమెరికా సైన్యానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందంపై జెనీవాలో సంతకాలు జరుగుతాయని ప్రచారం సాగుతోంది. అలాంటిదేమీ లేదు: ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరినట్లేనని, ఈ వారాంతంలో సంతకాలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని పేర్కొంది. ఇరుపక్షాలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఒప్పందం కుదిరిందన్న వార్తలు కేవలం ఊహాగానాలేనని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. -
అది ఇరాన్ ఘాతుకమే
వాషింగ్టన్: ఒమన్ తీరం సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై దాడి చేసింది తాము కాదని.. అది ముమ్మాటికీ ఇరాన్ ఘాతుకమేనని అమె రికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తేల్చిచెప్పారు. హార్మూజ్ జలసంధి నుంచి బయలుదేరిన నౌకలపై ఇరాన్ సైన్యం డ్రోన్లు ప్రయోగించిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్టుచేశారు. అలాగే శాంతి ఒప్పందంలోని పలు అంశాలను మీడియాకు ఇరాన్ లీక్ చేసిందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, మూడు నౌకలపై అమెరికా సైన్యం దాడి చేసినట్లు భారత ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇంతలోనే ట్రంప్ ఇరాన్ వైపు వేలెత్తి చూపడం చర్చనీయాంశంగా మారింది. ప్రాణాంతక దాడులు ఆపాల్సిందే: భారత్ భారతీయ సిబ్బందితో కూడిన మూడు వాణిజ్య నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని అంతకుముందు భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ముగ్గురు భారతీయులు మృతిచెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఇలాంటి ప్రాణాంతకమైన, ఘోరమైన దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, వీటిని ఆపాల్సిందేనని తేల్చిచెప్పింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ భారత్లో అమెరికా అత్యున్నత దౌత్యవేత్త(ఛార్జ్ డి అఫైర్స్) జాసన్ మీక్స్కు శుక్రవారం సమన్లు జారీ చేసింది. తమ విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొంది. జాసన్ మీక్స్కు సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి. నౌకపై భీకర దాడి గురించి తెలిసిన తర్వాత తొలుత బుధవారం రాత్రి సమన్లు ఇచ్చారు. ముగ్గురు మృతిచెందినట్లు నిర్ధారణ కావడంతో మరోసారి సమన్లు జారీ చేశారు. ‘‘భారతీయ సిబ్బంది విధి నిర్వహణలో ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం కొనసాగిస్తున్న దాడుల పట్ల జాసన్ మీక్స్కు ఇప్పటికే ఒకసారి తీవ్ర నిరసన తెలియజేశాం. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించడం బాధాకరం’’అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నౌకాయానంపై ప్రాణాంతకమైన బలప్రయోగం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇలాంటి దుందుడుకు చర్యలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కావని, క్లిష్ట సమయంలో ఒక సున్నితమైన ప్రాంతంలో అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని తేల్చిచెప్పింది. భారతదేశం తీవ్ర ఆందోళనలను అమెరికా ప్రభుత్వ వర్గాలకు తెలియజేయాలని, అలాగే పశ్చిమాసియాలో పనిచేస్తున్న అమెరికా సైనిక బలగాలు పౌరుల ప్రాణనష్టం జరగకుండా నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని అమె రికా దౌత్యవేత్తకు సూచించినట్లు తెలియజేసింది. భరతమాత బిడ్డలను మోదీ కాపాడలేరు: రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: అమెరికా మిలటరీ కాల్పుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికాతో రాజీపడ్డ ప్రధాని భరతమాత బిడ్డలను కాపాడలేకపోయారని, వారి ప్రాణా లను తీసుకున్న వారిని ప్రశ్నించే శక్తి కూడా ఆయనకు లేకపోయిందని శుక్రవారం ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. మూడు రోజుల్లో అంతర్జాతీయ సముద్ర జలాల్లో మూడు నౌకలపై అమెరికా దాడుల చేసి ముగ్గురు భారతీయులను చంపితే ఇప్పటివరకూ ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వచ్చే వారం జరగనున్న జీ–7 సమావేశాల్లోనూ ఆయన నోరు మెదపరని, నవ్వుతూ కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేసి వస్తారని, మరణించిన ముగ్గురు నావికుల గురించి ఏమీ మాట్లారని విమర్శించారు.ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు: ఇరాన్ భారత సిబ్బందితో ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేయడాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ శుక్రవారం ఖండించారు. ఇలాంటి చర్యలు ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు కలిగిస్తాయని తేల్చిచెప్పారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అమెరికా చర్యలు నౌకాయాన స్వేచ్ఛకు ప్రమాదం కలిగిస్తున్నాయని ఆరోపించారు. అమెరికాను జవాబుదారీగా నిలబెట్టాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. నౌకలపై అమెరికా దాడులు చేయడాన్ని ప్రభుత్వ సాయుధ దోపిడీ, సముద్రపు దొంగతనంగా ఇస్మాయిల్ బఖాయీ అభివర్ణించారు. -
ఇరాన్లో తగ్గి క్యూబాలో నెగ్గేనా?
మెరుపు దాడిలో వెనిజులా అధ్యక్షుడిని బంధించిన తరువాత యూఎస్ అధ్యక్షుడి తరువాతి లక్ష్యం క్యూబా అని అందరూ భావించారు. అనుకోని పరిస్థితులలో ఇరాన్ యుద్ధం క్యూబాను వెనక్కు నెట్టే సింది. ఇరాన్ ఎదురు దెబ్బల నేపథ్యంలో యూఎస్ పక్కా ప్రణాళికతో క్యూబా పథకాన్ని రచిస్తున్నట్లుగా విశదమవుతు న్నది. మే నెల చివరలో యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిమిట్జ్ను కరేబియన్ సముద్రంలోకి పంపించటంతో యుద్ధమేఘాలు కమ్ముకోవటం ప్రారంభమైంది. క్యూబా మాజీ అధ్యక్షుడు రావుల్ కాస్ట్రోపై యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ హత్యానేర అభియోగాలను మోపటం క్యూబాపై దాడికి యూఎస్ పావులు కదుపుతున్నట్లుగా అర్థమవుతున్నది. క్షేత్ర స్థాయిలో క్యూబా కూడా దాడికి సన్నద్ధమవుతున్న వార్త లొస్తున్నాయి. ‘ప్రజలందరి యుద్ధం’ డాక్ట్రిన్ను క్యూబా పాటించ బోతున్నది. ఈ సిద్ధాంతం ప్రకారం అమెరికా దాడిని క్యూబా సైన్యమే కాకుండా, క్యూబా పౌరులందరూ ప్రతిఘటిస్తారు. కమ్యూ నిస్టు పార్టీ వ్యవస్థ, విప్లవ చరిత్ర కలిగిన క్యూబాను దారికి తేవడం యూఎస్కు తేలిక కాదు. కానీ ఇరాన్ వైఫల్యాల నుండి ప్రజలదృష్టిని మరలించటానికి ట్రంప్కు క్యూబాపై విజయం కీలకం.గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నంకరేబియన్ సముద్రంలో అమెరికాకు కేవలం 90 మైళ్ల దూరంలో ఉన్న క్యూబా దీవి వ్యూహాత్మకంగా భౌగోళిక ఉనికిని కలిగి ఉన్నది. క్యూబాలో విదేశీ శక్తులు తిష్టవేస్తే ఫ్లోరిడా జలసంధిని దిగ్బంధించి యూఎస్ను కట్టడి చేయవచ్చు. అందుకే 200 ఏళ్ళ క్రితమే మన్రో డాక్ట్రిన్లో భాగంగా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండా లను యూఎస్ తన వ్యూహాత్మక ప్రాంతాలుగా ప్రకటించింది. 1898లో స్పెయిన్ను యూఎస్ ఓడించటంతో క్యూబాకు వలస పాలన నుండి విముక్తి లభించింది. కానీ 1901 ప్లాట్ సవరణ చట్టం ద్వారా క్యూబాను యూఎస్ తన నియంత్రణలో ఉంచుకొన్నది. 1934లో ఈ చట్టాన్ని రద్దు పరచినప్పటికీ క్యూబా ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నది. యూఎస్ పెత్తనాన్ని ఎదిరించి ఫిడెల్ కాస్ట్రో 1959లో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పరచి క్యూబాలోని యూఎస్ వ్యాపారాలను, ఆస్తులను జాతీయీకరణం చేశాడు. 1960లో క్యూబాపై అమెరికా ఆంక్షలు విధించింది. 1961లో యూఎస్లోని క్యూబా ప్రవాసుల ద్వారా ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సీఐఏ ప్రయత్నించి విఫలమైంది. దీనిని ‘బే ఆఫ్ పిగ్స్ తిరుగుబాటు’గా పిలుస్తారు. యూఎస్ను ఎదు ర్కోవటానికి కాస్ట్రో సోవియట్ రష్యా పంచన చేరాడు. 1962లో సోవియట్ యూనియన్ క్యూబాలో అణుక్షిపణులను మోహరించ టంతో అగ్ర రాజ్యాలు అణుయుద్ధపు అంచులకు చేరాయి. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమవటంతో క్యూబాకు దిక్కుతోచలేదు. కాస్ట్రో ఒకవైపు ఉక్కు పిడికిలితో క్యూబాను పాలిస్తూనే కమ్యూనిజంను లాటిన్ అమెరికా అంతటా వ్యాప్తి చేయటానికి ప్రయత్నించాడు. అంగోలా, ఇథియోపియాలలో కూడా క్యూబన్ గెరిల్లా సైనికులు సేవలందించారు.సంబంధాలు కొంత మెరుగైనా...రావుల్ కాస్ట్రో 2008లో క్యూబా పగ్గాలు చేపట్టాక యూఎస్తో కొంత సుహృద్భావ వైఖరిని ప్రదర్శించాడు. ఒబామా హయాంలో యూఎస్–క్యూబా సంబంధాలు కొంత గాడిన పడ్డాయి. 2015లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ జరిగింది. 2016లో క్యూబా పర్యటనలో భాగంగా క్యూబాను టెర్రరిజంను ప్రోత్సహించే దేశాల లిస్టు నుండి తొలగించారు. ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ట్రంప్ 2017లో అధికారంలోకి రావటంతోనే మళ్లీ ఘర్షణ వాతావరణం పునఃస్థాపితమైంది. బైడెన్ కూడా క్యూబాపై ఆంక్షలను చాలావరకు కొనసాగించాడు. వెనిజులాపై దాడి తరువాత తన తదుపరి లక్ష్యం క్యూబా అని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించాడు. ఆరు దశాబ్దాలుగా కొనసాగు తున్న ఆర్థిక–వాణిజ్య ఆంక్షలు చాలవన్నట్లు ఈ ఏడాది జనవరిలో ట్రంప్ చమురు దిగ్బంధనాన్ని (ఆయిల్ ఎంబార్గో) ప్రకటించాడు. క్యూబాకు చమురు సరఫరా కాకుండా యూఎస్ నౌకాబలం అడ్డు కుంటున్నది. ముఖ్యంగా వెనిజులా నుండి చమురు దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. క్యూబా తన శక్తి అవసరాలకు 60 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నది. దీనితో క్యూబాలో శక్తి సంక్షోభం ఏర్పడింది. ప్రతిరోజు 20–22 గంటల కరెంటు కోతలు సాధారణ మైనాయి. రవాణా స్తంభించింది. నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెత్త రవాణాకు కూడా వాహనాలకు ఇంధనం లేక పోవటంతో హవానాతో సహా పలు పట్టణాలలో వీధులలో చెత్త పేరుకుపోయింది. ఆసుపత్రులలో కరెంటు కొరతతో పలు వైద్య సేవలు స్తంభించాయి. పాఠశాలలు, యూనివర్సిటీలు మూత పడ్డాయి. కోవిడ్ తరువాత కోలుకుంటున్న పర్యాటక రంగం కుదేల యింది. అమెరికా పథకం ప్రకారమే క్యూబా సమాజాన్ని ఒత్తిడి లోనికి నెట్టి వేసింది. క్యూబాతో వాణిజ్యం చేసే దేశాలు, సంస్థలపై ద్వితీయ శ్రేణి ఆంక్షలకూ సిద్ధమైంది. ఈ సంక్షోభం నుండి క్యూబా సమాజంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్యుద్ధం, తిరుగుబాటు కోసం యూఎస్ వేచి చూస్తుండవచ్చు.మూడు శక్తులు ‘ఒక్కటైతే’?నాణ్యమైన విద్య, వైద్యాన్ని చౌకగా అందించటంలో విజయం సాధించిన క్యూబా ఈ ఆర్థిక యుద్ధాన్ని ఎదుర్కోవటం కష్టమే. రష్యా, చైనా ఆర్థికంగా, సైనికపరంగా ప్రత్యక్షంగా క్యూబాకు దన్నుగా ఉండటం సందేహాస్పదమే. చైనా సౌర విద్యుత్ పలకల సరఫరా ద్వారా క్యూబా విద్యుత్ గ్రిడ్ను స్థిరీకరించటానికి ప్రయత్ని స్తున్నది. దీర్ఘకాలంలో మాత్రమే క్యూబా ఈ రంగంలో విజయం సాధించగలుగుతుంది. కానీ క్యూబాకు అంత సమయం లేదు. మెక్సికో లాంటి పొరుగు దేశాలు ఆహారం, మందులు, మానవతా సహాయం చేస్తున్నా, అవి యూఎస్ను ఎదిరించి క్యూబాకు సహాయ పడే సాహసం చేయలేవు. రష్యా ప్రస్తుత దృష్టి ఉక్రెయిన్పై, నాటోపై ఉన్నది. చైనా దృష్టి తైవాన్పై ఉన్నది. తైవాన్, ఉక్రెయిన్ విషయంలో అమెరికా మెతక వైఖరికి సిద్ధపడితే, ప్రతిగా రష్యా, చైనా మధ్య ప్రాచ్యం, కరేబియన్ ప్రాంతాల నుండి తమ దృష్టిని పూర్తిగా మరల్చ టానికి సిద్ధపడవచ్చును. దీనినే ‘గ్రేట్ పవర్స్ బార్గెయిన్’ అని పిలుస్తారు.బహుశా రష్యా, చైనాలతో లోపాయికారీ అంగీకారంతో క్యూబాపై ట్రంప్ పూర్తి స్థాయిలో దాడి చేయవచ్చు. కానీ క్యూబా గెరిల్లా పోరాట సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు. పెద్ద మొత్తంలో రక్తపాతం సంభవిస్తుంది. క్యూబా నుండి పెద్ద మొత్తంలో యూఎస్కు వలసలు జరగవచ్చు. యూఎస్ ఈ రెండు పరిణా మాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో క్యూబన్ సంతతికి చెందినవాడు. ఈ పరిణామాలపై పూర్తి అవగాహన ఉండి ఉంటుంది. క్యూబాలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి రావుల్ కాస్ట్రో అంగీకరిస్తే సమస్యకు శాంతియుత పరిష్కారం లభించినట్లవుతుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
తుది దశలో కీలక ఒప్పందం.. ఇరాన్ విదేశాంగ మంత్రి పోస్ట్!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను ముగించడానికి అమెరికా - ఇరాన్ దేశాలు ఒక కీలక ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి (Abbas Araghchi) ప్రకటించారు. ఈ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.అరాఘ్చీ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో, 'ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం' గతంలో ఎప్పుడూ లేనంతగా తుది దశకు చేరుకుందని తెలిపారు. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడే వరకు మీడియా సంయమనం పాటించాలని, ఊహించి చెప్పవద్దని పేర్కొన్నారు.The Islamabad Memorandum of Understanding has never been closer. Pending its finalization, the media should refrain from entering speculation about its content. In line with our responsible and transparent approach, all details will be shared with the public in due course.— Seyed Abbas Araghchi (@araghchi) June 12, 2026ఇటీవల కొన్ని ఇరానియన్ మీడియా సంస్థలు ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను ప్రచురించాయి. దీనిపై స్పందించిన అరాఘ్చీ, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, ఒప్పందం ఖరారైన తర్వాత అన్ని వివరాలను ప్రజలకు వెల్లడిస్తామని చెప్పారు.ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ అంశంపై స్పందించారు. అరాఘ్చీ చేసిన పోస్టును తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేస్తూ.. మీడియాలో వస్తున్న లీకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ మీడియాలో ప్రచురితమైన వివరాలు సరైనవి కావని ఆయన స్పష్టం చేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఇంకా కొన్ని విభేదాలు, చర్చించాల్సిన అంశాలు మిగిలి ఉన్నాయని సమాచారం. అయినప్పటికీ, ఇరు దేశాలు ఒక ఒప్పందం దిశగా ముందుకు సాగడం ప్రపంచ శాంతి, మధ్యప్రాచ్య స్థిరత్వానికి సానుకూల సంకేతం అని చెబుతున్నారు. -
ముగ్గురు భారతీయులు మృతి.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదన్నారు. నౌకలపై దాడి చేస్తుంది ఇరాన్ అని వాటిని అమెరికా అడ్డుకుంటుందన్నారు. హర్ముజ్లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల హర్ముజ్లో భారతీయ నౌకలపై జరిగిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించిన సంగతి తెలిసిందే.ఇటీవల తరచుగా హర్ముజ్ జలసంధిలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకలపై అమెరికా దాడులు జరిపింది. బుధవారం ఒమన్ సమీప ఎంటీ సెటెబె చమురురవాణా నౌకపై జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ వాసిగా గుర్తించారు. ఒకరోజు తర్వాత మరోసారి భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడి చేసింది. ఒమన్లోని షినాస్ నౌకాశ్రయం సమీప జలాల్లో ఉన్న ఎంటీ జల్వీర్ నౌక పైనా అమెరికా దాడులకు తెగించింది. ఈ నౌకలో 20 మంది భారతీయ నావికులున్నారు. గినియా బిసావూ దేశ జెండాతో వెళ్తున్న ఈ నౌక మీదకు అమెరికా తన యుద్ధవిమానం నుంచి రెండు హెల్ఫైర్ గైడెడ్ క్షిపణులను ప్రయోగించింది. గత నాలుగురోజుల్లో భారతీయన నౌకలపై దాడి చేయడం ఇది మూడోసారి.ఈ ఘటనపై తీవ్రంగా ఆగ్రహించిన భారత విదేశాంగశాఖ ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి, చార్జ్డిఅఫైర్స్ జేసన్ను పిలిపించి భారత్ తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయనకు మూడురోజుల వ్యవధిలో రెండుసార్లు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ అంశంపై స్పందించారు. -
ఇరాన్ కోసం మెట్టు దిగిన ట్రంప్.. భారీ ఆఫర్!
అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న అణు చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించిన తాజా శాంతి ఒప్పంద ముసాయిదాలో, ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల అంశంపై కొంత సడలింపు చూపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదని, పూర్తి వివరాలు రెండో దశ చర్చల్లో ఖరారు కావాల్సి ఉందని సమాచారం.ఇరాన్ అణు కార్యక్రమం చాలా కాలంగా అమెరికా, పాశ్చాత్య దేశాలకు ఆందోళన కలిగిస్తున్న అంశం. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి చేసిన యురేనియాన్ని దేశం వెలుపలికి తరలించాలని, లేదా పూర్తిగా నిర్వీర్యం చేయాలని డిమాండ్ చేసింది. అయితే తాజా చర్చల్లో ఇరాన్ తన అణు ఆయుధ కార్యక్రమాన్ని కొనసాగించబోమని హామీ ఇవ్వడం, అలాగే అణు నిల్వల భవిష్యత్పై ప్రత్యేక చర్చలకు అంగీకరించడం వల్ల చర్చల్లో పురోగతి కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక, ట్రంప్ గతంలో పలుమార్లు ఇరాన్ యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని, వాటిని ఇరాన్ వద్ద ఉంచబోమని ప్రకటించారు. కానీ తాజా అవగాహన ఒప్పందంలో యురేనియం నిల్వల నిర్వహణపై మరింత సౌలభ్యవంతమైన విధానం అవలంబిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ ఈ అంశంపై అమెరికా, ఇరాన్ వర్గాల నుంచి పరస్పర విరుద్ధ ప్రకటనలు వస్తుండటంతో తుది నిర్ణయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఐరాస ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో ఈ యురేనియం నిల్వలపై సంతకాల కార్యక్రమం జెనీవాలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జేడీ వాన్స్ పర్యటనకు అవసరమైన పరికరాలతో నాలుగు సీ-17 విమానాలు ఐరాపాకు ప్రయాణం అయ్యాయి.ఇదిలా ఉండగా, ఇరాన్ మాత్రం తమ శుద్ధి చేసిన యురేనియం దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని, దాన్ని విదేశాలకు తరలించే ఒప్పందం ఇప్పటివరకు కుదరలేదని స్పష్టం చేసింది. ఇరాన్ అధికారులు యురేనియం నిల్వలపై తుది నిర్ణయం భవిష్యత్ అణు చర్చల్లోనే తీసుకుంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటించిన శాంతి ప్రణాళిక అమల్లోకి వస్తే, హార్మూజ్ జలసంధి పునఃప్రారంభం, ఆంక్షల సడలింపు, అణు చర్చల కొనసాగింపు వంటి కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే యురేనియం నిల్వల భవితవ్యమే ఈ ఒప్పంద విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశంగా మారింది. -
యుద్ధంపై ట్రంప్ యూటర్న్.. చర్చలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!
-
డొనాల్డ్ ట్రంప్కు ఊరట
వాషింగ్టన్: ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపుతున్న అమెరికా 10 శాతం గ్లోబల్ టారిఫ్ల వ్యవహారంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తాత్కాలిక ఊరట లభించింది. ఈ సుంకాలను నిలిపివేయాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటికే విధించిన స్టేను అమెరికా ఫెడరల్ అప్పీళ్ల కోర్టు తాజాగా పొడిగించింది. దీంతో కేసుపై తుది విచారణ పూర్తయ్యే వరకు ఈ టారిఫ్లు అమల్లోనే ఉండనున్నాయి.అమెరికాలోని ఫెడరల్ సర్క్యూట్ అప్పీళ్ల కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు ప్రకారం.. ట్రంప్ ప్రభుత్వం ముగ్గురు దిగుమతిదారుల నుంచి 10 శాతం సుంకాలను వసూలు చేయడం కొనసాగించవచ్చు. ఈ ముగ్గురిలో రెండు చిన్న వ్యాపార సంస్థలతో పాటు, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ కొనుగోళ్లపై సుంకాలు చెల్లించిన వాషింగ్టన్ రాష్ట్రం కూడా ఉంది.వాస్తవానికి మే 7న అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు (U.S. Court of International Trade) ఈ టారిఫ్లకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అయితే దేశవ్యాప్తంగా సుంకాల వసూళ్లను నిలిపివేయకుండా, కేసు దాఖలు చేసిన ముగ్గురు పిటిషనర్లకే పరిమిత ఉపశమనం కల్పించింది. దీనిపై ట్రంప్ ప్రభుత్వం వెంటనే అప్పీల్కు వెళ్లగా.. మే 12న అప్పీళ్ల కోర్టు తాత్కాలిక స్టే ఇచ్చి టారిఫ్ల వసూళ్లకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు అదే స్టేను మరింత కాలం కొనసాగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.అమెరికా సుప్రీంకోర్టు 2025లో ట్రంప్ విధించిన పలు టారిఫ్లను రద్దు చేసిన తర్వాత, ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ ప్రభుత్వం ‘ట్రేడ్ యాక్ట్-1974లోని సెక్షన్ 122’ కింద కొత్తగా 10 శాతం గ్లోబల్ టారిఫ్ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం అధ్యక్షుడు కాంగ్రెస్ అనుమతి లేకుండానే పరిమిత కాలానికి దిగుమతులపై సుంకాలు విధించే అధికారం కలిగి ఉంటారు.ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ 10 శాతం గ్లోబల్ టారిఫ్ జూలైలో ముగియాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ గడువు పొడిగిస్తే మరింత కాలం కొనసాగించే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా, టారిఫ్ల చట్టబద్ధతపై తుది తీర్పు ఇంకా రావాల్సి ఉంది. కేసు పూర్తయిన తర్వాత కోర్టు ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే.. ఇప్పటివరకు వసూలు చేసిన సుంకాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి రావచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.మొత్తంగా చూస్తే.. ట్రంప్ టారిఫ్ విధానానికి ఇది తాత్కాలిక న్యాయ విజయం. అయితే ఈ 10 శాతం గ్లోబల్ టారిఫ్లు భవిష్యత్తులో కొనసాగుతాయా? లేక కోర్టు వాటికి బ్రేక్ వేస్తుందా? అన్నది తుది తీర్పుపైనే ఆధారపడి ఉంది. -
ట్రంప్ హామీ.. డీల్ కుదిరిందా? లేదంటే మరో ట్విస్ట్ తప్పదా??
మూడునెలలుగా యుద్ధ జ్వాలల్లో చిక్కుకున్న పశ్చిమాసియా ఒక్కసారిగా ఆశల వైపు చూస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసిన ఘర్షణకు ముగింపు దగ్గరపడిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అయితే అదే సమయంలో ఇరాన్ నుంచి వచ్చిన స్పందన కొత్త సందేహాలకు తావిచ్చింది. నిజంగానే శాంతి ఒప్పందం కుదిరిందా? లేదంటే ఇంకా చివరి అడ్డంకులు మిగిలే ఉన్నాయా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ వారాంతంలోనే రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. వైట్హౌజ్లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. "ఇరాన్తో యుద్ధానికి అద్భుతమైన పరిష్కారం దొరికింది. కొన్ని పత్రాలపై తుది సంతకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి" అని చెప్పారు.ఒప్పందంపై సంతకాలు యూరప్లో జరగవచ్చని, అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొనే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి తిరిగి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుందని కూడా ఆయన ప్రకటించారు.అయితే ట్రంప్ ప్రకటనకు భిన్నంగా ఇరాన్ స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. చర్చల ముసాయిదాలో చాలా భాగం పూర్తయిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఒప్పంద ప్రతిపాదన ప్రస్తుతం దేశంలోని కీలక నిర్ణయాధికార సంస్థల పరిశీలనలో ఉందన్నారు. అమెరికా చర్చల మధ్యలో కొత్త డిమాండ్లు తెరపైకి తెస్తోందని ఆరోపించిన ఆయన.. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తన "రెడ్లైన్స్"ను దాటదని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాఖ్యల మర్మం ఏంటన్నదానిపై కుతూహలం నెలకొంది.ఇక ఈ ఒప్పందంలో అత్యంత కీలక అంశం ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమమే. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదని, కొనుగోలు చేయబోదని అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. ఇదే మొత్తం చర్చల ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాల కోసమేనని గతంలాగే పునరుద్ఘాటిస్తోంది.అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్పై సంయుక్త దాడులతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలయ్యాయి. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి చివరి వారంనుంచి ఇప్పటివరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఇరాన్, లెబనాన్లో భారీ నష్టం సంభవించింది. చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఆ తర్వాత కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ.. పరస్పర దాడులు కొనసాగించాయి. అమెరికా అపాచీ హెలికాప్టర్ను కూల్చివేసిన ఘటన తర్వాత హర్ముజ్ ప్రాంతంలో అమెరికా కొత్త దాడులు జరిపింది. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.ఇదిలా ఉండగా, ఒప్పందానికి ఇరాన్ అత్యున్నత నాయకత్వం కూడా అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆమోదం తెలిపారని తనకు సమాచారం ఉందన్నారు. అలాగే ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ సహా పశ్చిమాసియాలోని పలు దేశాలు ఈ ఒప్పందానికి మద్దతు తెలిపాయని చెప్పారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం మాత్రం ఈ అవగాహన ఒప్పందంలో తాము భాగస్వాములు కాదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఇరాన్ అణు సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఒప్పందం ఉండాలని ట్రంప్కు నెతన్యాహూ సూచించినట్లు వెల్లడించింది.మొత్తంగా చూస్తే.. ట్రంప్ "డీల్ దాదాపు ఖరారైంది" అంటుండగా, ఇరాన్ "ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు" అంటోంది. నిజంగానే ఈ వారాంతంలో శాంతి ఒప్పందం కుదిరి యుద్ధానికి తెరపడుతుందా? లేదంటే చివరి క్షణంలో మరోసారి ఉద్రిక్తతలు రాజుకుంటాయా? అని ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
ఒప్పందానికి మిత్రపక్షాల గ్రీన్సిగ్నల్
వాషింగ్టన్: ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఒప్పందంలోని అంశాలపై మిత్ర దేశాలు సానుకూలత తెలిపాయన్నారు. మరికొద్ది గంటల్లో ఇరాన్పై భీకర దాడులుంటాయంటూ తీవ్ర హెచ్చరికలు చేసిన ట్రంప్ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. ‘ఇప్పటిదాకా ఇరాన్ ప్రతినిధులతో జరిగిన చర్చల ప్రతిపాదనలు చివరకు ఇరాన్ అత్యున్నత నేతల దాకా వెళ్లాయి. వాళ్లు వాటిని ఆమోదించారు. అందుకే కొన్ని గంటల క్రితం ఇరాన్పై రాత్రి వేళ భీకర బాంబు దాడులు చేయాలనుకున్న నా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నా. చర్చల్లో ప్రస్తావించిన కీలక అంశాలపై మధ్యవర్తిత్వ, భాగస్వామ్య దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, తుర్కియే, పాకిస్తాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈజిప్ట్ తదితర దేశాలు సమ్మతి తెలపడం శుభపరిణామం. ఈ శాంతి ఒప్పందం కుదిరి, అమల్లోకి వచ్చేదాకా హార్మూజ్ జలసంధి దిగ్బంధం యథాతథంగా కొనసాగుతుంది. శాంతి ఒప్పందం ఏరోజు, ఎక్కడ కుదుర్చు కోబోతు న్నామో త్వరలోనే వెల్లడిస్తా’అని ట్రంప్ ట్రూత్ సోషల్లో వెల్లడించారు. అంతకుముందు ఇరాన్ చమురు పరిశ్రమను మొత్తం గుప్పిటపట్టేలా భీకర స్థాయిలో దాడులతో దురాక్రమణ చేస్తామని, అందుకు గురువారం రాత్రే ముహూర్తం ఖరారుచేశామని ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘నావికాదళం, వైమానిక దళం, సైన్యం, రాడార్, గగనతల రక్షణ వ్యవస్థలు, అన్ని రకాల వ్యవస్థలను కోల్పోయిన ఇరాన్పై ఇక బీభత్సంగా బాంబులేస్తాం. అందుకు ఈరోజు రాత్రే ముహూర్తం పెట్టా. ఇరాన్ కీలక ఖర్గ్ ద్వీపంలోని అతిపెద్ద ఆయిల్ టర్మినల్ను త్వరలోనే వశపర్చుకుంటాం. ముడి చమురు పరిశ్రమ మొత్తాన్నీ మా పరం చేసుకుంటాం. అన్నింటినీ ఆక్రమిస్తాం. చమురు, సహజవాయు రంగాలన్నింటిపై ఆధిపత్యం సాధిస్తాం. అచ్చం వెనెజువెలాలో మెరుపుదాడులు చేసినట్లుగా అనూహ్యరీతిలో దాడులతో తెగబడతాం. మా దాడుల తర్వాత వెనెజువెలాపై అమెరికా ఆధిపత్యం మొదలైంది. దీంతో వెనెజువెలా, అమెరికా రెండింటికీ లాభం చేకూరింది. ఇప్పుడు దానినే ఇరాన్లో పునరావృతం చేస్తాం’’అని ట్రంప్ ప్రకటించారు. బుధవారం దాడులకు కొనసాగింపుగా గురువారం తెల్లవారుజామున సైతం దాడులుచేశాక ట్రంప్ ఈ పోస్ట్ పెట్టారు. ఖర్గ్ ద్వీపం అనేది ఇరాన్ చమురు పరిశ్రమకు గుండెకాయ. ఇక్కడి నుంచి 90 శాతం చమురు ఎగుమతులు జరుగుతాయి. అయితే ఖర్గ్ దీవిని స్వా«దీనంచేసుకోవడం అమెరికాకు అంత తేలికైన విషయం కాదు. దీవి నుంచి కేవలం 33 కిలోమీటర్ల దూరంలోనే ఇరాన్ ప్రధానభూభాగం, సైన్యం ఉంది. అక్కడి నుంచి దూసుకొచ్చే ఇరాన్ క్షిపణులను, ఆత్మాహుతి డ్రోన్లు, శతఘ్ని ఫిరంగులను అమెరికా పూర్తిస్థాయిలో నిలువరించడం కష్టమని నిపుణులు తేల్చేశారు. అయినాసరే ఖర్గ్ ద్వీపాన్ని స్వాదీనం చేసుకునేందుకు తాము అత్యంత ప్రాధాన్యతనిస్తామని గురువారం ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పునరుద్ఘాటించారు. ‘‘ద్వీపంలోకి అమెరికా బలగాలను దించుతా. సైనికులను రంగంలోకి దింపాల్సిందే. నిజానికి ఆర్మీని తీసుకురావడం నాకు ఇష్టంలేదు. కానీ మొత్తం దీవిని స్వా«దీనం చేసుకోవాలంటే సైన్యం రాక తప్పదు. స్వా«దీనం చేసుకున్నాక ఎంతకాలంపాటు దానిపై పట్టు నిలుపుకోగలం అనేది నాకైతే తెలీదు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొనసాగిన అమెరికా దాడులు.. బుధవారం అర్ధరాత్రి దాటాక చాలా పొద్దుపోయాక అమెరికా ఇరాన్పై దాడులు చేసింది. ఇరాన్ సైనిక నిఘా సామర్థ్యాన్ని భారీగా దెబ్బతీశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది. బందర్ అబ్బాస్ తీర పట్టణం సహా హార్మూజ్ సమీప దక్షిణ ప్రాంతాలపై అమెరికా దాడులుచేసింది. టెహ్రాన్లోని తయారీ కర్మాగారం, సైనిక బ్యారెక్లు, స్థానిక పోలీసుల కేంద్రాలపైనా దాడులు జరిగాయని ఇరాన్ పారామిలటరీ రెవల్యూషనరీ గార్డ్ సైతం వెల్లడించింది. దాడులు మొదలెట్టి అమెరికా చర్చలకు అర్థంలేకుండా చేసిందంటూ ఇరాన్ విదేశాంగ శాఖ గురువారం ఒక ప్రకటనలో తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఇజ్రాయెల్ వంటి మిత్రదేశాలకు ఇరాన్ కారణంగా జరిగిన ఆర్థిక నష్టాలను పూడ్చుకునేందుకు విదేశాల్లో మేం జప్తుచేసుకున్న ఇరాన్ బ్యాంక్, ఆర్థిక ఖాతాల నుంచి రాబట్టుకుంటామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బీసెంట్ ప్రకటించారు. -
ట్రంప్ క్యాబినెట్లోకి కీలక వ్యక్తి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై దాడులకు బ్రేక్ ఇచ్చిన తరువాత, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ పదవికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.'జే క్లేటన్'ను డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) పదవికి ఎంపిక చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ పదవి అమెరికా ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన భద్రతా బాధ్యతలలో ఒకటి. దేశంలోని అన్ని గూఢచార సంస్థల పనిని సమన్వయం చేయడం ఈ పదవి ప్రధాన బాధ్యత.జే క్లేటన్ను అమెరికా అధ్యక్షుడు అత్యంత గౌరవనీయమైన వ్యక్తిగా పేర్కొన్నారు. ఈయన గతంలో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC) చైర్మన్గా పని చేశారు. అంతే కాకుండా ఈయన సులివన్ & క్రామ్వెల్ మాజీ హెడ్, ప్రస్తుతం న్యూయార్క్ దక్షిణ జిల్లాకు యునైటెడ్ స్టేట్స్ అటార్నీగా పనిచేస్తున్నారని కూడా వెల్లడించారు.నా మంత్రివర్గంలో పనిచేయడానికి క్లేటన్ను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ఈయన నియామకాన్ని వీలైనంత త్వరగా ధృవీకరించాలని నేను యునైటెడ్ స్టేట్స్ సెనేట్ను కోరుతున్నాను ట్రంప్ పేర్కొన్నారు. -
భారత నౌకలపై దాడులా?
ప్రపంచానికి పీడలా పరిణమించిన అమెరికా... భారత్ వస్తున్న నౌకలపై తన ప్రతాపాన్ని చూపటం మొదలెట్టింది. మంగళవారం ఒమన్ తీరంలో 24 మందితో వెళ్లే నౌకపై క్షిపణి ప్రయోగించటంతో ముగ్గురు నావికులు మరణించారు. వారిలో ఒకరు ఆంధ్ర ప్రదేశ్కు చెందిన పట్నాల సురేష్ అనే చీఫ్ మెరైన్ ఇంజినీర్. అంతకుముందు రోజు సైతం భారత్కు వస్తున్న మరో నౌకపై ఇలాగే దాడి జరగ్గా, అందరూ క్షేమంగా బయట పడగలిగారు. ఆ రెండు నౌకలూ భారత్కు చెందినవని తెలిసే ఉద్దేశపూర్వకంగా దాడి చేశా రని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఈ రెండు ఉదంతాల్లోనూ ఒమన్ సైన్యం మన నావికుల్ని ఆదుకుంది. తమ నిషేధాన్ని ధిక్కరించి ఇరాన్నుంచి చమురు కొనుగోలు చేసి వెళ్తుండటంవల్లే దాడులు చేశామని అమెరికా సైనిక దళం పశ్చిమాసియా సెంట్రల్ కమాండ్ (సెంట్కాం) అంటున్నది. ఒకపక్క భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రాణ మిత్రుడని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెబుతారు. మనతో వాణిజ్య ఒప్పందం కోసం వెంపర్లాడతారు. కానీ భారత్కొస్తున్న వాణిజ్య నౌకలను ధ్వంసం చేస్తారు. అసలు రెండు దేశాల మధ్య కుదిరే వాణిజ్య లావాదేవీలపై, సంబంధం లేని మూడో దేశం ఆంక్షలు విధించటమేమిటి? మనం ఎవరి దగ్గర కొనాలో, కొనకూడదో చెప్పడానికి ట్రంప్ ఎవరు?దాడులు జరిగిన ప్రాంతం అమెరికాకు సరిహద్దేమీ కాదు. ఆ నౌకల గమనంవల్ల దానికి కలిగే ముప్పేమీ లేదు. అయినా ఖండాంతరాలు దాటి, వేల మైళ్లు ఈవలకొచ్చి విధినిషేధాలు పెట్టడం వింత కాదా? ఒక్క సెంట్కాం మాత్రమే కాదు... భూగోళమంతటా వేర్వేరు పేర్లతో అమెరికా పహారా కాస్తోంది. ఆఫ్రికాలో ‘ఆఫ్రికాం’, ఇండో–పసి ఫిక్లో ‘ఇండోపాకాం’, యూరప్లో ‘ఈయూకాం’, ఉత్తరమెరికాలో ‘నార్త్ కాం’ పేరిట సైన్యాల్ని దించి, క్షిపణులు గురిపెట్టి, యుద్ధ విమానాలు మోహరించి, అక్కడక్కడ అణు బాంబులు పోగేసి దేశాలపై పెత్తనం చలాయిస్తోంది. ఈ లక్షలాదిమంది సైన్యాన్ని పోషించటం కోసం అడ్డగోలు సుంకాలతో, వేరే దేశాలకు భారీనష్టం కలిగే వాణిజ్య ఒప్పందా లతో చెలరేగిపోతోంది. చిత్రమేమంటే... ఒక్కటంటే ఒక్క దేశం ‘నీకిక్కడేం పని?’ అని అమెరికాను ప్రశ్నించలేకపోతోంది. తాజా దాడుల తర్వాత మన దేశం గట్టిగా స్పందించింది. అమెరికా చార్జ్ డీ ఎఫైర్స్ జాసన్ మీక్స్ను పిలిపించి, ‘దౌత్యపరమైన నిరసన’ తెలిపింది. అందరూ ముక్తకంఠంతో నిరసిస్తేనే ఈ దుర్మార్గం ఆగుతుంది.అక్రమంగా యుద్ధానికి దిగి, శాంతి ఒప్పందానికి రావాలని ఇరాన్ను ట్రంప్ బెదిరి స్తున్నారు. ప్రపంచంలోనే ఎదురులేనిదని గప్పాలు కొట్టుకున్న మిలిటరీ హెలికాప్టర్ అపాచేను అది కూల్చేయటంతో గత మూడు రోజులుగా దాడులు, ప్రతిదాడులతో పశ్చి మాసియా దద్దరిల్లుతోంది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. తమ దాడి ఆత్మరక్షణ అని అమెరికా చెప్పు కోవటం సిగ్గుచేటు. ట్రంప్ వచ్చాక అమెరికా రక్షణ శాఖ పేరునే యుద్ధశాఖ అని మార్చాక, అందులో ‘ఆత్మరక్షణ’ ప్రసక్తి ఎక్కడ? అసలు తమ సరిహద్దులు దాటి వేల కిలోమీటర్ల ఆవలనున్న దేశాలపై దాడులు జరుపుతూ, దానికి ఆత్మరక్షణ అని పేరెట్టడం నయవంచన కాదా? వేరేవాళ్లపై యుద్ధానికి దిగుతూ, అందుకు పర్యవసానాలుండరాదని ట్రంప్ అత్యాశకు పోతున్నారు. స్వల్పకాలంలోనే ఇరాన్ కీలక చమురు క్షేత్రాలున్న ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటానని హెచ్చరికలు జారీచేస్తున్నారు.నాలుగో నెలలోకి ప్రవేశించిన ఈ యుద్ధంవల్ల ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ పెను సంక్షోభంలో కూరుకుపోయాయి. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో ప్రపంచ చమురు మార్కెట్ ఒక్కసారిగా భగ్గుమంది. దాడులకు వెరవకుండా ఇరాన్ దీటైన జవాబివ్వటంతో అమెరికాకు ఎటూ పాలుబోవడం లేదు. నిజంగా ట్రంప్ అంటున్నట్టు ఖర్గ్ ద్వీపం జోలికిపోతే ఇది మరింత వికటించి, పరిస్థితులు ఇంకా క్షీణిస్తాయి. దురదృష్టమేమంటే, అమెరికాకు ఎవరూ నచ్చజెప్పే స్థితి లేదు. పటిష్టమైన వ్యవస్థలున్నాయనుకున్న ఆ దేశంలోనూ ఏ ఒక్కటీ ట్రంప్ను నియంత్రించలేకపోతోంది. అక్కడి ప్రజల్లో కదలికవచ్చి, ట్రంప్పై ఒత్తిళ్లు పెరగనంతకాలం ప్రపంచం ఇలా బిక్కుబిక్కుమని బతుకీడ్చక తప్పదు. -
తూచ్.. మేము బాంబులెయ్యం!
ఈ రాత్రి ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీసేలా భీకర దాడులు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు హెచ్చరికలు జారీ చేశారు. అయితే తాజాగా.. డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇందులో ''ఈ సాయంత్రం ఇరాన్పై జరగాల్సిన వైమానిక దాడులను, బాంబు దాడులను రద్దు చేశాను'' అని పేర్కొన్నారు.ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో చర్చలు ఇరాన్ నాయకత్వంలోని అత్యున్నత స్థాయికి చేరి, ఆమోదం పొందాయి. కాబట్టి నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడిగా, ఈ సాయంత్రం ఇరాన్పై జరగాల్సిన దాడులను రద్దు చేశాను. తుది ఒప్పందానికి అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, టర్కీ, పాకిస్తాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈజిప్ట్, ఇతరులతో సహా ఇందులో పాలుపంచుకున్న అన్ని పక్షాలు, ఈ చర్చలకు ఆమోదం తెలిపాయి.ఒప్పందం ఖరారయ్యే వరకు.. నౌకాదళ దిగ్బంధనం పూర్తి స్థాయిలో అమలులో ఉంటుంది. తుది ఒప్పందానికి సంబంధించిన సమయం, ప్రదేశం వంటి విషయాలను తాను అధికారికంగా ప్రకటించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బెదిరింపులకు దిగారు. ఈ రాత్రి ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీసేలా భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి.ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆయన ఇప్పటికే ఇరాన్ మిలటరీ శక్తి, సామర్థ్యాలను తుత్తునీయుల్ని చేశామని, తదుపరి సైనిక చర్య ఆసన్నమైందని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ రాత్రి ఇరాన్ ప్రభుత్వానికి నిద్ర కరువవుతుంది. ఆ దేశానికి చెందిన నేవి, ఎయిర్ఫోర్స్, రాడార్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్స్తో పాటు మిగిలిన రక్షణ వ్యవస్థలను సర్వనాశనం చేస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో వెనిజువెలా తరహాలో ఇరాన్లోని ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని, ఆయిల్, గ్యాస్ మార్కెట్లను ఆధీనంలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ నిర్ణయం వెనిజువెలా, అమెరికాకు అద్భుతంగా కలిసివస్తుందని అన్నారు. ఇరాన్-అమెరికా దాడుల కారణంగా పశ్చిమాసియాలో యుద్ధం తారాస్థాయికి చేరువవుతున్న తరుణంలో, దౌత్యపరమైన అంశాలపై మరింత అనిశ్చితి నెలకొంది.ఓవైపు బెదిరింపులు.. మరోవైపు చర్చలు ఓవైపు ఇరాన్ను బెదిరిస్తున్నప్పటికీ అమెరికా-ఇరాన్ల మధ్య ప్రాథమిక ఒప్పందంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్, యూరోపియన్ దేశాల వర్గాల సమాచారం ప్రకారం, సుదీర్ఘ చర్చల్లో పలు అంశాలపై విభేదాలు తలెత్తుతున్నాయని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన ఇరాన్ నిధుల విడుదలే ప్రధాన అడ్డంకిగా మారింది.ఇరాన్ ఆయిల్ అమ్మకాల ద్వారా సంపాదించిన బిలియన్ల డాలర్లు దక్షిణ కొరియా, ఖతార్, యూఏఈ వంటి దేశాల బ్యాంకుల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. అమెరికా ఆంక్షల చట్టాల ప్రకారం, డాలర్ ఆధారిత లావాదేవీలను నియంత్రించే అధికారం అమెరికాకు ఉంది. అందువల్ల అమెరికా ఒత్తిడి కారణంగా ఆ దేశాల బ్యాంకులు ఇరాన్ నిధులను ఫ్రీజ్ చేశాయి. అమెరికా మార్కెట్ యాక్సెస్ కోల్పోకుండా ఉండటానికి ఆ బ్యాంకులు ఆంక్షలను పాటించాయి.ఇరాన్ నిలిపివేసిన 6 బిలియన్ల నుంచి 12 బిలియన్ల వరకు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. కానీ అమెరికా మాత్రం మానవతా సాయం కింద షరతులతో కొద్దికొద్దిగా మాత్రమే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ కారణంగా ఇరాన్తో అమెరికా మధ్య సంఘర్షణ మరింత తీవ్రతరమవుతోందని వర్గాలు వెల్లడించాయి. సైనిక దృష్ట్యా ఈ యుద్ధం అంతులేని మార్గమని, ఇరాన్పై దాడి చేసి అమెరికా తన లక్ష్యాలను సాధించలేకపోయిందని విశ్లేషకులు పేర్కొన్నారు.చర్చల్లో కొంత పురోగతి ఉన్నప్పటికీ, చివరికి అమెరికా-ఇరాన్ సంఘర్షణకు ముగింపు రావాలంటే విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన నిధులను తిరిగి ఇరాన్ పొందడమే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ట్రంప్ వ్యాఖ్యలు వైరల్! ప్రత్యర్థులకు ఫుల్ జోష్
అమెరికాలో నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. మే నెలలో వినియోగదారుల ద్రవ్యోల్బణం (సీపీఐ) మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరడంపై ఆందోళనలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. పైగా ‘ఆర్థిక గణాంకాలు చాలా బాగున్నాయి... నేను ద్రవ్యోల్బణాన్ని ప్రేమిస్తున్నాను’ అంటూ విలేకరులతో ట్రంప్ అనడం ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వచ్చే నవంబర్లో జరగబోయే కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల్లో ఈ ధరల పెరుగుదలనే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్న డెమొక్రాట్లకు ట్రంప్ వ్యాఖ్యలు వరంగా మారుతాయని కొందరు చెబుతున్నారు.డెమొక్రాట్ల ఎదురుదాడిట్రంప్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష డెమొక్రాట్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా యూఎస్ సెనేట్ డెమొక్రాటిక్ మైనారిటీ నేత చక్ షూమర్ మాట్లాడుతూ.. ‘అమెరికన్ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై ట్రంప్నకు ఉన్న నిర్లక్ష్యానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. తాను ద్రవ్యోల్బణాన్ని ప్రేమిస్తున్నానని పబ్లిక్గా ఒప్పుకున్నారు. అమెరికా ప్రజల పట్ల ఆయనకున్న ధిక్కారానికి హద్దులు లేవు’ అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.డెమొక్రాటిక్ పార్టీ వ్యూహంట్రంప్ మాట్లాడిన వీడియో క్లిప్ను జోడిస్తూ డెమొక్రాటిక్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో కొత్త ప్రచార ప్రకటనను విడుదల చేసింది. ‘ట్రంప్ తన మనసులోని నిశ్శబ్దాన్ని బయటపెట్టేశారు. ఆయనకు ద్రవ్యోల్బణం అంటే ఇష్టం. ప్రతి అమెరికన్ దీనిని గమనించాలి’ అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. మరోవైపు హౌస్ రిపబ్లికన్ స్పీకర్ మైక్ జాన్సన్ అధ్యక్షుడి వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ట్రంప్ అన్న మాటలను అంసందర్భంగా మారుస్తూ రాజకీయం చేస్తున్నారని వాదించారు.మూడేళ్ల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణంతాజా గణాంకాల ప్రకారం, మే నెలలో వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) వార్షిక ప్రాతిపదికన 4.2 శాతానికి పెరిగింది. ఇది ఏప్రిల్ నెలలోని 3.8 శాతం కంటే ఎక్కువ మాత్రమే కాకుండా, ఏప్రిల్ 2023 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి కావడం గమనార్హం. కిరాణా సామగ్రి, ఇంధనంతో పాటు వైద్య సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ సేవల ఖర్చులు, విమాన ప్రయాణ ఛార్జీలు, వినోద రంగాల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.ధరల పెరుగుదలకు కారణంకొవిడ్ సృష్టించిన సంక్షోభం నుంచి కోలుకోకముందే.. వరుస అంతర్జాతీయ పరిణామాలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ విధించిన అంతర్జాతీయ సుంకాలు ఇప్పటికే ఆర్థికవ్యవస్థను దెబ్బతీయగా ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన యూఎస్-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం చమురు మార్కెట్ను కోలుకోలేని దెబ్బతీసింది.ప్రపంచ చమురు, వాయువు రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈ పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే ద్రవ్యోల్బణం ఒక్కసారిగా తగ్గుతుందని ట్రంప్ అంచనా వేస్తున్నారు. కానీ, ఆర్థికవేత్తలు మాత్రం యుద్ధం ముగిసినా చమురు ధరలు పూర్వస్థితికి రావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని స్పష్టం చేస్తున్నారు.ఆశాజనకమైన సంకేతాలుకొంతకాలంగా గ్యాసోలిన్ ధరలు స్వల్పంగా స్థిరపడుతుండటం మార్కెట్ విశ్లేషకులలో ఆశలు రేకెత్తిస్తోంది. ‘అధిక ఇంధన ధరలు గత నెలలో ద్రవ్యోల్బణాన్ని మళ్లీ పెంచిన మాట వాస్తవమే. కానీ, ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుందని మా అంచనా. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది తగ్గుముఖం పడుతుంది. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్తో చర్చలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి’ అని నేషన్ వైడ్ చీఫ్ ఎకనామిస్ట్ కాథీ బోస్ట్జోన్సిక్ అన్నారు.వడ్డీ రేట్ల తగ్గింపు కష్టమేనా?అమెరికా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతం లక్ష్యానికి పరిమితం చేయాలని భావిస్తోంది. వచ్చే వారం ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణాయక కమిటీ సమావేశం కానుంది. గత నెలలోనే పగ్గాలు చేపట్టిన కొత్త ఛైర్మన్ కెవిన్ వార్ష్ నేతృత్వంలో జరగబోయే మొదటి సమావేశం ఇది కావడం విశేషం. వడ్డీ రేట్లను తగ్గించాలని ట్రంప్ ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడ్ రేట్లను యథాతథంగా ఉంచేందుకే మొగ్గు చూపవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లను పెంచే అవకాశం కూడా లేకపోలేదనే అభిప్రాయాలున్నాయి.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
ట్రంప్ చెప్పింది నిజమేనా?.. లేక గప్పాలా?
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ పరిస్థితులు నెలకొంటున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ కళ్లుగప్పి హర్ముజ్ జలసంధిలో ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. అత్యంత రహస్యంగా నిర్వహించిన సైనిక ఆపరేషన్ ద్వారా భారీ పరిమాణంలో చమురును అంతర్జాతీయ మార్కెట్కు చేరవేశామని ప్రకటించారు. అంతేకాదు, గత నెల రోజులుగా అలానే 200కు పైగా వాణిజ్య నౌకలను హర్ముజ్ దాటించామని వెల్లడించారు.ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్.. గత నెలలోనే అమెరికా సైన్యానికి ఓ రహస్య ఆదేశం ఇచ్చినట్లు తెలిపారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలకు రహస్యంగా రక్షణ కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ మిషన్ ఫలితంగా 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు ప్రపంచ మార్కెట్కు చేరిందని, 200కుపైగా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయని పేర్కొన్నారు.అమెరికా కారణంగానే హర్ముజ్ జలసంధిలో రవాణా కొనసాగుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. "హర్ముజ్ను నియంత్రించేది ఇరాన్ కాదు.. అమెరికానే" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ఇరాన్ సైనికంగా ఓడిపోయిందని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని కూడా ట్రంప్ పేర్కొన్నారు.వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ మరో సంచలన విషయం వెల్లడించారు. ఇటీవల ఒకే రాత్రిలో 22 నౌకలను ఎలాంటి లైట్లు లేకుండా, రాడార్ ట్రాకింగ్కు చిక్కకుండా హర్ముజ్ జలసంధి దాటించినట్లు చెప్పారు. రాత్రి చీకటిని ఉపయోగించుకుని ఈ ఆపరేషన్ను నిర్వహించినట్లు వెల్లడించారు. అలాగే ప్రతిరోజూ లక్షలాది బ్యారెళ్ల చమురును బయటకు తీసుకువస్తున్నామని, అందువల్లే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అదుపులో ఉన్నాయని వ్యాఖ్యానించారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలపై తర్వాత అమెరికా సైనిక, ఇంధన శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్ నుంచి చమురును "తీసుకురావడం" లేదా "స్వాధీనం చేసుకోవడం" జరగలేదని స్పష్టం చేశారు. వాస్తవానికి హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల భయంతో నిలిచిపోయే పరిస్థితి వచ్చిన వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం రక్షణ కల్పించిందని తెలిపారు.అమెరికా సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో ఒమన్ తీర ప్రాంతాన్ని ఉపయోగిస్తూ సురక్షిత మార్గాల్లో ట్యాంకర్లు, వాణిజ్య నౌకలను దాటించినట్లు వెల్లడించారు. గత కొన్ని వారాల్లో 200కుపైగా నౌకలు ఈ భద్రతా వ్యవస్థ ద్వారా హర్ముజ్ను సురక్షితంగా దాటాయని పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు తరచూ అంతర్జాతీయ చర్చలకు దారితీస్తున్నాయి. ఒకసారి ఇరాన్ చర్చలకు సిద్ధమైందని, మరోసారి శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని, ఇంకోసారి తాను జోక్యం చేసుకోవడంతోనే ఇజ్రాయెల్-లెబనాన్ ఘర్షణలు తగ్గాయని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాయి. అయితే ఈ ప్రకటనలను ఇరాన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హర్ముజ్ జలసంధిలో 100 మిలియన్ బ్యారెళ్ల చమురును రహస్య ఆపరేషన్ ద్వారా సురక్షితంగా తరలించామన్న ట్రంప్ వ్యాఖ్యలు కూడా కొత్త సందేహాలకు తావిచ్చాయి. ప్రపంచ చమురు సరఫరాకు జీవనాడిగా భావించే హర్ముజ్ జలసంధి ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. జలసంధిపై ఆధిపత్యం ప్రకటించుకున్న ఇరాన్ తన నిఘా కొనసాగిస్తోంది. అమెరికా గస్తీలో ఉన్న నౌకలను అస్సలు వదలడం లేదు. మరి ట్రంప్ చెప్పినట్లుగా అమెరికా నిజంగానే ఇరాన్ కళ్లు గప్పి భారీ ఆపరేషన్ నిర్వహించిందా? సొంత సరిహద్దుల్లోనే ఇరాన్ బకరా అయ్యిందా? లేదంటే తన రాజకీయ, దౌత్య బలాన్ని చాటిచెప్పేందుకు ట్రంప్ మరోసారి అతిశయోక్తి వ్యాఖ్యలు చేశారా? చర్చ రాజకీయ, దౌత్య వర్గాల్లో జోరుగా సాగుతోంది. -
గల్ప్ దేశాలకు కొత్త టెన్షన్
ప్రపంచానికి హెచ్చరిక.. ఇరాన్, అమెరికా మధ్య భీకర యుద్ధం మళ్లీ ప్రారంభం.. -
మూల్యం చెల్లించుకోవాల్సిందే : ఇరాన్కు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఇరాన్పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమతో ఒప్పందానికి రాకుండా, గ్రేట్ డీల్ను మిస్ చేసుకుంది అంటూ ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందంటూ హెచ్చరించారు. ఇరాన్తో చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని పదే పదే ప్రకటించే ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైన్యం పూర్తిగా ఓడిపోయింది, అన్నీ ఉత్తమాటలే, చేతలేమీ లేవు అంటూ తన ‘ట్రూత్ సోషల్’ (Truth Social) ప్లాట్ఫామ్లో ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ సైనిక సామర్థ్యం దారుణంగా క్షీణించిందని, మంచి ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాన్ని ఇరాన్ నాయకత్వం చేజేతులా వృధా చేసుకుందన్నారు. ఇరాన్ సైన్యం పూర్తిగా అతలాకుతలమైంది. అసలు నౌకాదళం, వాయుసేన వంటి చాలా విభాగాలు ఉనికిలోనే లేవు, పూర్తి ఓటమి పాలయ్యారంటూ అని ట్రంప్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. అంతేకాదు అంతా మాటలే.. చేతల్లో ఏమీ లేదు. మిడిల్ ఈస్ట్ పెత్తందారు కథ ముగిసింది!!! అంటూ ఇరాన్పై ధ్వజమెత్తారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన గడువును ప్రస్తావిస్తూ చర్చలను తెగనీయకుండా సాగదీశారని ఇరాన్ నేతలను విమర్శించారు. ఎంతో మేలు చేకూర్చే ఒప్పందంపై చర్చలకు చాలా సమయం తీసుకున్నారు,ఇప్పుడు దానికి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!!!" అని ఆయన హెచ్చరించారు. > ఇదీ చదవండి: భర్తను అలా చూసి కారు బోనెట్పైకి భార్య చివరికి.. వైరల్ వీడియోఇరాన్ లక్ష్యాలపై అమెరికా ఇటీవల జరిపిన దాడుల నేపథ్యంలో వాషింగ్టన్తో చర్చల భవిష్యత్తుపై తాము పునఃసమీక్షిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయ్ స్పందిస్తూ.. అమెరికా పరస్పర విరుద్ధమైన వైఖరిని అవలంబిస్తూ, కాల్పుల విరమణ అవగాహనలను పదేపదే ఉల్లంఘిస్తూ దౌత్య ప్రక్రియను దెబ్బతీస్తోందని ఆరోపించారు.అయితే మధ్యప్రాచ్యంలో పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నప్పటికీ, గత కొన్ని వారాలుగా చర్చలు ఒక కొలిక్కి వస్తున్నాయని ఆయన పలుమార్లు పేర్కొన్నారు. ఇరాన్తో గ్రీట్ డీల్కి చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ పదేపదే చెబుతూ వస్తున్నప్పటికీ, దీన్ని ఇరాన్ ఖండిస్తూ వస్తోంది. సైనిక దాడులు కొనసాగుతున్నంత కాలం దౌత్యం విజయవంతం కాలేదని స్పష్టం చేస్తూ మొదటినుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తకాగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో అమెరికాకు చెందిన 'అపాచీ' దాడి హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేసిందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, నిఘా కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. ఈ తాజా ఘర్షణల తర్వాతే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. జోర్డాన్, బహ్రెయిన్లలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేసింది. ఇది మధ్యప్రాచ్యంలో మరింత పెద్ద ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందేమోనన్న ఆందోళనలను పెంచింది.ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్ -
రెండు వారాల్లో కీలక ప్రకటన: ట్రంప్
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడిు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు.అమెరికా హెలికాప్టర్ అపాచీపై దాడి చేసింది ఇరాన్ అని ఆరోపించారు. ఈ ఘటనపై ఎట్టిపరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతామని ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం మరోసారి తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు చేసింది. అమెరికా స్థావరాలపై మొత్తం 21పైగా దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు, నిఘా రాడార్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా గతంలో జరిపిందని దానికి ప్రతిచర్యగా ఈ అటాక్ చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.అయితే డొనాల్ట్ ట్రంప్ సైతం ఈ దాడులపై గుర్రుగా ఉన్నారు. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ను కూల్చివేసింది. ఇరాన్ అని దానికి ఎట్టిపరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతామన్నారు. యుద్ధంలో అమెరికా తన అధిపత్యాన్ని కొనసాగిస్తోందని మరో రెండు వారాల్లో ఇరాన్పై సంపూర్ణ విజయం ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆ ప్రకటనతో చమురు ధరలు సైతం దిగొస్తాయని ప్రకటించారు.అయితే ఈ వ్యాఖ్యలపై ఇరాన్ సైతం ఘూటుగానే బదులిచ్చింది. ఎలాంటి దాడి జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రతిదాడి తీవ్రంగా జరుగుతుందని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమిన్ నెతన్యాహు సైతం ఇరాన్పై దాడులు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. "అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి మూల్యాలు చెల్లించాల్సి వచ్చినా.. ఆ పరిస్థితికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన కేబినెట్ వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధం మరోసారి తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉంది.


