breaking news
Donald Trump
-
నువ్వు.. నా మనసు దోచావ్.. మదురోకు వైట్హౌస్ ‘ప్రేమ’ సందేశం
వాలెంటైన్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో రాజకీయంగా ప్రభావం కలిగించే డిజిటల్ కార్డుల శ్రేణిని విడుదల చేసింది అగ్రరాజ్యపు వైట్హౌస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోపారి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనలను ప్రతిబింబించేలా ఈ కార్డులు ఉండటం గమనార్హం. ఇలా పలు రకాల వాలెంటైన్స్ డే ప్రేమ సందేశాలను పంపింది వైట్హౌస్. అంటే, ఇవి సాధారణ ప్రేమ కార్డుల మాదిరి కాకుండా, రాజకీయ పరిణామాలను, రాజకీయ నేతలను పరిహాసం చేసేలా రూపొందించారు. ఇందులో వెనుజువేలా మాజీ అధ్యక్షుడు నికోలాస్ మదురో కోసం ప్రత్యేకంగా ఒక గ్రీటింగ్ కార్డును వైట్హౌస్ రిలీజ్ చేసింది. ఇందులో నువ్వు నా మనసు దోచావ్( You Captured My Heart) అంటూ మదురోపై సెటైర్లు వేస్తూ గ్రీటింగ్ కార్డు రిలీజ్ చేసింది. ఇందులో మదురోకు కళ్లకు గంతలు కట్టి, చేతులను బేడీలతో బందించి ఉన్న ఫోటోను పెట్టి.. ఈ క్యాప్షన్ ఇచ్చింది. ఇలా పలు పరిణామాలను జోడిస్తూ వైట్హౌస్ ప్రేమ సందేశాలను పంపింది. మరో కార్డు ట్రంప్ ఒక “Executive Order 4547” అనే పత్రాన్ని పట్టుకుని, దానిపై “UR My Valentine” అని రాసి ఉన్నట్లు చూపిస్తుంది. మూడవ కార్డుపై డెమోక్రాటిక్ సెనేటర్ క్రిస్ వాన్ హోలెన్ ఎల్ సాల్వడార్లో MS-13 గ్యాంగ్ సభ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కిల్మార్ అబ్రెగో గార్సియాతో మార్గరిటాస్ తాగుతున్నట్లు చూపిస్తుంది. నీపై నా ప్రేమ, అక్రమ వలసదారులపై డెమోక్రాట్ల ప్రేమంత బలంగా ఉంది. నీతో ఒక డ్రింక్ తాగడానికి నేను 1,537 మైళ్ళు ప్రయాణిస్తాను’ అని వ్యంగ్యంతో కూడిన వాలెంటైన్స్ డే సందేశాలను ఉంచింది వైట్హౌస్. ఈ కార్డులు సాధారణ ప్రేమ సందేశాల కంటే రాజకీయ హాస్యంతో కూడినవిగా ఉండటంతో పెద్ద చర్చకు దారితీశాయి. ఇది ట్రంప్ పైత్యమని పలువురు మండిపడుతున్నారు.Made just for you 💌 pic.twitter.com/DhSgnGK1M6— The White House (@WhiteHouse) February 14, 2026 -
అమెరికా వ్యూహం.. ఇరాన్పై ఏ క్షణమైనా దాడి?
వాషింగ్టన్: అణ్వాయుధ కార్యక్రమాలు నిలిపివేసేలా ఇరాన్పై మరింత ఒత్తిడి పెంచాలని అమెరికా నిర్ణయించింది. ఇందుకోసం భారీగా సైన్యాన్ని తరలిస్తోంది. ఒకవైపు ఇరాన్తో చర్చలు జరుగుతుండగానే, మరోవైపు బలప్రయోగంతో ఇరాన్ను దారికి తెచ్చుకోవడానికి పావులు కదుపుతోంది.భారీ విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్’ తోపాటు మరికొన్ని యుద్ధ నౌకలను మధ్య ప్రాచ్యానికి తరలిస్తోంది. ఇప్పటికే ‘యూఎస్ఎస్ అబ్రహాం లింకన్’ నౌకను అరేబియా సముద్రంలో మోహరించింది. ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్’ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ విమానాల వాహక నౌకగా పేరుగాంచింది. వెనెజులాలో గత నెలలో జరిగిన అమెరికా సైనిక ఆపరేషన్లో పాలుపంచుకుంది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదూరోను అమెరికా సైన్యం నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఇరాన్పై ఏ క్షణమైనా దాడి? ఇరాన్ అణు కార్యక్రమాలపై అమెరికా ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. వాటిని తక్షణమే నిలిపివేయాలని, ఈ విషయంలో తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని పట్టుబడుతోంది. తమ వద్ద అణ్వాయుధాలు లేవని ఇరాన్ చెబుతున్నప్పటికీ అమెరికా విశ్వసించడం లేదు. ఇరాన్పై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏ క్షణమైనా దాడికి దిగే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్–అమెరికా మధ్య యుద్ధం మొదలైతే మధ్యప్రాచ్యంలో భారీ సంక్షోభం తప్పదని చెబుతున్నాయి. -
ట్రంప్ "బోర్డ్ ఆఫ్ పీస్" మీటింగ్ ఆహ్వానం
గాజాలో శాంతి స్థాపనకోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే "బోర్డ్ ఆఫ్ పీస్"ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన తొలి సమావేశం ఈ నెల 19న నిర్వహించనున్నారు. అయితే ఆ మీటింగ్ కు హాజరుకానున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. అయితే ఈ విషయంలో భారత్ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు.ఇటీవల పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా అసిఫ్ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యుఎస్ఏ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్థాన్ని టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుందని ఆరోపించారు. 1999 కార్గిల్ యుద్దం, 9/11 దాడుల తర్వాత ఆ దేశంతో జతకట్టడం తమ దేశానికి దీర్ఘకాలిక నష్టం కలిగించిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్లో ఉగ్రవాదం.... ప్రధానంగా అవినీతి, స్మగ్లింగ్, నెట్వర్క్ల ద్వారా పెరుగుతుందని అంగీకరించారు. దీంతో అమెరికాతో పాక్ డిస్టెన్స్ పెంచుతుందేమోనని అంతా భావించారు.అయితే తాజాగా పాకిస్తాన్ ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశంలో పాల్గొననున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీప్ ఆ సమావేశానికి హాజరుకానున్నట్లు ఆదేశ ప్రతినిధులు తెలిపారు. అంతేకాకుండా అదేరోజు ప్రధాని షెహబాజ్ వాషింగ్టన్లో జరిగే మరో సమావేశానికి వెళతారని పేర్కొంది. అయితే భారత్ సైతం ఈ వ్యవహారంపై స్పందించింది. బోర్డు ఆప్ పీస్ మిషన్లో పాల్గొనాలని ఆహ్వానం అందిందని ఆ అంశంపై ఆలోచనలు జరుపుతున్నామని భారత అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు. ఇటీవల భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి మెరుగుపడిన సంగతి తెలిసిందే. ట్రంప్ అధిక పన్నులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. భారత్ సైతం దానికి కృతజ్ఞత తెలిపింది. కాగా గత నెలలో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో డొనాల్డ్ ట్రంప్ "బోర్డ్ ఆప్ పీస్" ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటి్ంచారు. ఇందులో ఇప్పటి వరకూ 26 దేశాలు చేరాయి. భారత్ ఇందులో చేరే అంశం ఇంకా ప్రకటించలేదు. -
డొనాల్డ్ ట్రంప్కు ఎదురుదెబ్బ
వాషింగ్టన్: విచ్చలవిడిగా టారిఫ్ల బాదుడుతో ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెనడాపై టారిఫ్ల విషయంలో ట్రంప్ దూకుడును సొంత పార్టీ నేతలే వ్యతిరేకించారు. కెనడా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 100 శాతం టారిఫ్లు విధిస్తానని ఆయన ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. చైనాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి కెనడా ఉత్సాహం చూపుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు. అంతేకాకుండా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, ట్రంప్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. మాటల యుద్ధం సాగుతోంది. మొత్తానికి అమెరికా, కెనడా మధ్య చిచ్చు మొదలైంది. కెనడాపై గత ఏడాది 35 శాతం సుంకాలు విధించారు. మరిన్ని సుంకాలకు సిద్ధమవుతున్నారు. కెనడాపై టారిఫ్ల విషయంలో ట్రంప్ ప్రతిపాదనను ఖండిస్తూ విపక్ష డెమొక్రటిక్ సభ్యులు అమెరికా కాంగ్రెస్లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై బుధవారం ఓటింగ్ జరిగింది. తీర్మానానికి అనుకూలంగా 219 మంది, వ్యతిరేకంగా 211 మంది ఓటు వేశారు. తీర్మానం నెగ్గింది. ఆరుగురు రిపబ్లికన్ సభ్యులు తీర్మానానికి మద్దతు పలికారు. అంటే ట్రంప్కు సొంత పార్టీ నుంచే చుక్కెదురైంది. ఈ తీర్మానంపై త్వరలో సెనేట్లో ఓటింగ్ జరుగనుంది. ఒకవేళ సెనేట్లో కూడా ఆమోదం పొందినప్పటికీ ట్రంప్ తన అధికార బలంతో వీటో చేస్తారనడంలో సందేహం లేదు. ట్రంప్ టారిఫ్ల విధానం స్వదేశంలోనే చాలామందికి నచ్చడం లేదు. వాణిజ్య ఒప్పందాల విషయంలో టారిఫ్లను ట్రంప్ ఒక ఆయుధంగా ప్రయోగిస్తున్నారు. తమతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికిగాను చర్చలకు రాకపోతే టారిఫ్ లు పెంచేస్తానని బెదిరిస్తున్నారు. మరోవైపు విదేశీ ఉత్పత్తులపై సుంకాల బాదుడు వల్ల అమెరికాలో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతోంది. అది చట్టసభ సభ్యులపై ఒత్తిడిని పెంచుతోంది. ట్రంప్ మొండితనం వల్ల నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని, ప్రజలపై భారం పడుతోందని వారు విమర్శిస్తున్నారు. ట్రంప్ వల్ల రాజకీయంగా నష్టపోతున్నామన్న ఆందోళన ఆయన పార్టీ నేతల్లో నెలకొంది. ట్రంప్ హెచ్చరికలు సొంత పార్టీ నేతలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశా రు. తన విధానాలను వ్యతిరేకిస్తే తీవ్ర పరిణా మాలు ఉంటాయన్నారు. కెనడాపై టారిఫ్ల విషయంలో ప్రతినిధుల సభలో విపక్ష డెమొక్రటిక్ పార్టీ తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి రిపబ్లికన్ పార్టీ సభ్యులు మద్దతివ్వడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చైనాను బెదరగొడితే చాలు!
ప్రపంచం దృష్టి వెనిజులా, గ్రీన్ల్యాండ్, ఇరాన్ పరిణామాలపై కేంద్రీకృతం అయి ఉండటంతో, అమెరికన్లు మళ్లీ మళ్లీ ప్రక టిస్తున్న ఇండో–పసిఫిక్ వ్యూహం చర్చకు రావటం లేదు. ఈ వ్యూహంలో భారత దేశాన్ని కూడా భాగంగా చేసి చూపుతున్నందున, మౌలికంగా ఆ వ్యూహం ఏమిటో తెలుసుకోవటం అవసరం. ఆ వ్యూహం ఏమిటో తెలిసేందుకు మూడు డాక్యుమెంట్లను చూడవలసి ఉంటుంది: ఒకటి – 2022 ఫిబ్రవరిలో అప్పటి డెమోక్రటిక్ బైడెన్ ప్రభుత్వం ప్రకటించిన ‘ఇండో–పసిఫిక్ స్ట్రాటజీ’. రెండు – 2025 నవంబర్లో ప్రస్తుత రిపబ్లికన్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన ‘నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ’. మూడు – ఇదే ప్రభుత్వం 2026 జనవరిలో, అనగా గత నెలలో ప్రకటించిన ‘నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీ’. వీటన్నింటిలో ఇండో–పసిఫిక్ గురించిన సారాంశం ఈ విధంగా ఉంది. ప్రపంచ వాణిజ్యానికే అతిపెద్ద, అత్యంత క్రియా శీలమైన మార్కెట్ ప్రాంతం ఇది. కనుక అమెరికా భద్రత, స్వేచ్ఛ, సౌభాగ్యాలపై చాలా ప్రభావం చూపుతుంది.చైనా సవాల్ఈ ప్రకటనతో ఆరంభించిన అమెరికా వ్యూహం, తమ ప్రయోజనాల పరిరక్షణకు అక్కడ ఏమేమి చేయాలన్న విషయమై చాలానే చెప్పింది: పశ్చిమార్ధ భూగోళాన్ని మన్రో, డోన్రో డాక్ట్రిన్లను అనుసరించి పూర్తి నియంత్రణలోకి తెచ్చుకుంటున్నాము. పశ్చిమాసి యాలో ప్రయోజనాలు ఇజ్రాయెల్ ద్వారా నెరవేరుతున్నాయి. యూరోపియన్ దేశాలు తమ సహచరులే గనుక, వారు తమ రక్షణ వ్యయాన్ని మాత్రం పెంచి తమతో నిలబడితే సరిపోతుంది. ఆర్కిటిక్కు సంబంధించి గ్రీన్ల్యాండ్ను ఏదో ఒక విధంగా అధీనంలోకి తెచ్చుకుంటే ఆ సమస్య తీరుతుంది. ఉక్రెయిన్ యుద్ధం తేలిపోతే రష్యాతో పేచీ ఉండదు. పైగా అది ఒక ప్రాంతీయ శక్తి మాత్రమే. ఆ విధంగా ఇక మిగిలేది ఇండో–పసిఫిక్ ఒక్కటే!ఇండో–పసిఫిక్ మాత్రమే మిగిలి ఉండటం ఎందుకంటే చైనా కారణంగా. మరొక విధంగా చెప్పాలంటే, మొత్తం ప్రపంచపు భౌగోళిక వ్యూహంలోనే అమెరికాకు మిగిలి ఉండగల సమస్య చైనా అన్నమాట. వేరెవరో అనవలసిన అవసరం లేకుండా, వ్యూహ పత్రా లలో అమెరికన్ ప్రభుత్వాలే అరమరికలు లేకుండా చెప్పాయి. చైనా పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, ఆర్థికంగానే గాక సైనిక బలం రీత్యా కూడా ఎదిగి ఇపుడు తమకు పోటీదారుగా మారిందన్నాయి. ఒత్తిడిలో అమెరికాఈ స్థితిని ఎదుర్కోవటం ఎట్లాగన్నది ప్రశ్న. మరొక మాటలో చెప్పాలంటే ఈ స్థితిని ఎదుర్కొని అమెరికా అగ్రస్థానాన్ని పదిలపర చుకోవటం, చైనాను ఇంతకుమించి ముందుకు రానివ్వక పోవటం అన్నమాట. రాగల కాలంలో అమెరికన్ వ్యూహాల కేంద్రీకరణ అంతా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఉంటుందన్నది స్పష్టం. వాస్తవా నికి ఈ ఆలోచనలు కొత్తవి కావు. పశ్చిమాసియాలో ఎదురు దెబ్బల తర్వాత డెమోక్రటిక్ అధ్యక్షుడు ఒబామా(2009–17), ఇక తమ దృష్టి అటునుంచి ఆసియాకు మారాలని ప్రతిపాదించారు. బైడెన్ (2021–25) పైన పేర్కొన్న ‘ఇండో–పసిఫిక్ స్ట్రాటజీ’ని ప్రకటించారు. చైనాపై వాణిజ్య, పారిశ్రామిక యుద్ధాలను ట్రంప్ శక్తి మేర సాగించారు. అమెరికా ప్రయోజనాల కోసం ఇండో–పసిఫిక్ విధాన మన్నది డెమోక్రటిక్, రిపబ్లికన్ ప్రభుత్వాల రెండింటి ఉమ్మడి సంప్రదాయం అయింది.తన మొదటి విడత పాలనా కాలంలో (2017–21) ఏ వ్యూహ పత్రమూ ప్రకటించని ట్రంప్ ఇపుడు ఏడాదిలోనే రెండు పత్రాలు తేవటం గమనించదగ్గది. పదేళ్ల క్రితంతో పోల్చితే అమెరికా బలహీన పడగా, చైనా బలపడింది. అమెరికాపై పలు విధాలైన ఒత్తిళ్లు పెరుగు తున్నాయి. చైనాను కట్టడి చేయక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్థికంగా చూసినట్లయితే వారికి వేర్వేరు దేశాల నుంచి ఇంధనంతో సహా వనరుల సేకరణకు, మార్కెట్లకు, పెట్టుబడులకు ఆటంకాలు కల్పించాలి. వాటిని తమ నియంత్రణలోకి తెచ్చుకుని, ఇంతవరకు వలె గాక రాగల కాలంలో తమ అభివృద్ధిని వేగవంతం చేయాలి. సైన్స్, టెక్నాలజీ ఆధునికీకరణలు, వాటి ఆధారంగా ఆధునిక ఉత్ప త్తులు భవిష్యత్తుకు కీలకం అయినందున, ఆ రంగాలలో చైనా పురో గతి ఒక సవాలుగా మారినందున... ఆ విషయమై మరింత దృష్టి పెట్టాలి.ఎన్ని వ్యూహాలు?సైనిక విషయాలకు వస్తే వ్యూహ పత్రాలు ఒక సూత్రాన్ని పదే పదే పేర్కొనటం గమనించదగ్గది. అది– చైనాను కట్టడి చేయటమైతే తప్పనిసరి. కానీ యుద్ధం ద్వారా కాదు. ఒక బెదురు అన్నది సృష్టించి నిలువరించటం ద్వారా! బెదురును సృష్టించటం ఏ విధంగా? ఒకటి– ఇండో–పసిఫిక్ ప్రాంతంలోని తమ సైనిక స్థావ రాలను (66 అని అంచనా) శక్తిమంతం చేయటం. రెండు– అక్కడి తమ కూటమి దేశాల సైన్యాలను బలోపేతం చేయటం. వారు తమ రక్షణ వ్యయాలను పెంచటం. మూడు– ఒకే చైనా విధానాన్ని కొన సాగిస్తూనే, తైవాన్ను తమ రక్షణ వ్యూహం కోసం ఉపయోగించు కోవటం. నాలుగు– జపాన్ నుంచి బోర్నియో వరకు వరుసగా గల మొదటి వరుస దీవులను (ఫస్ట్ ఐలాండ్ ఛెయిన్) దాటి చైనా యుద్ధ నౌకలు పసిఫిక్లోకి రాకుండా అడ్డుగోడ వంటిది తయారు చేయటం అన్నది వ్యూహం. దీనంతటి అమలు కోసమే ఇండియాతో కూడిన ‘క్వాడ్’ను 2017లో క్రియాశీలం చేసి, 2021లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో కలిసి ‘ఆకస్’ తదితర సంస్థలు ఏర్పాటు చేశారు.ట్రంప్ వ్యూహ పత్రాలలో ఆసక్తికరమైన అంశం ఒకటి కనిపి స్తుంది. దాని ప్రకారం, చైనా అభివృద్ధికి వారు వ్యతిరేకం కాదు. కానీ అమెరికా అగ్రస్థానానికి మాత్రం చైనా సవాలు కారాదు. ఇందు కోసం ఇండో–పసిఫిక్లోని అన్ని దేశాలనూ రకరకాల పేర్లతో ఉపయోగించుకుంటారు. ఈ వ్యూహాల అమలుకు వచ్చినప్పుడు మాత్రం కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతోపాటు ఇండో–పసిఫిక్లోనూ అనేక దేశాలు అమెరికా ప్రయోజనాల కోసం ఉపయోగపడేందుకు సిద్ధంగా లేక బహుళ ధ్రువ ఆలోచనలు, అమెరికా–చైనా మధ్య సమతుల్యతల పాటింపు వంటివి చేస్తున్నాయి. ఇండియా కూడా ఈ కోవలోకే వస్తుంది. ట్రంప్ బుల్డోజరిజం కెనడా, యూరప్లలోనే వ్యతిరేకతను ఎదు ర్కొంటూ, ఆ దేశాలు చైనాతో వరుస ఒప్పందాలు చేసు కోవటం ఇందుకు అద్దం పడుతున్నది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
భారత్తో ఒప్పందం చరిత్రాత్మకం: ట్రంప్
వాషింగ్టన్: తాము భారతదేశంతో కుదుర్చుకున్న నూతన వాణిజ్య ఒప్పందం చరిత్రాత్మకమైనదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందం కారణంగా అమెరికా నుంచి బొగ్గు ఎగుమతులు భారీగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ ఇంధన ఉత్పత్తిదారుగా ఎదిగిందన్నారు. జపాన్, కొరియా తదితర దేశాలతో పాటు భారత్తో కుదిరిన ఈ తాజా ఒప్పందాలు అమెరికా ఇంధన ఎగుమతులను మరింత విస్తృతం చేస్తాయని ట్రంప్ అన్నారు. తమ దేశ బొగ్గు ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగినదని ట్రంప్ పేర్కొన్నారు.గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన భారత్-అమెరికా వాణిజ్య చర్చలు దాదాపు ఏడాది కాలం పాటు సాగి, చివరకు ఒక కొలిక్కి వచ్చాయి. గత వారంలో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలో ఈ తాత్కాలిక ఒప్పందానికి సంబంధించిన విధివిధానాలు ఖరారయ్యాయి. 2025 ఆగస్టులో రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లు చేస్తున్నారనే నెపంతో అమెరికా.. భారత్పై 50 శాతం సుంకాలను విధించడంతో చర్చలు స్తంభించాయి. అయితే, తాజా దౌత్యపరమైన ముందడుగుతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను చక్కదిద్దింది.ఈ నూతన ఒప్పందం ప్రకారం భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలు భారీగా తగ్గనున్నాయి. గతంలో 50 శాతంగా ఉన్న సుంకాన్ని ఇప్పుడు 18 శాతానికి తగ్గించారు. దీనివల్ల అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు తగ్గి, పోటీ మరింతగా పెరగనుంది. వాషింగ్టన్ విడుదల చేసిన 'ఫ్యాక్ట్ షీట్' ప్రకారం ఈ ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు పరస్పర ప్రయోజనం చేకూర్చే విధంగా రూపొందాయి. ఇది భారత్ నుంచి అమెరికాకు జరిగే వాణిజ్యాన్ని కొత్త పుంతలు తొక్కించనుంది.ఈ సుంకాల తగ్గింపు నిర్ణయంతో భారతదేశంలోని కీలక రంగాలకు భారీ లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, ఆర్గానిక్ కెమికల్స్ ఎగుమతులు పెరగనున్నాయి. వీటితో పాటు గృహాలంకరణ వస్తువులు, హస్తకళాకృతులు, ఎంపిక చేసిన యంత్ర పరికరాల విభాగాల్లో భారతీయ ఎగుమతిదారులు అమెరికా మార్కెట్లో తమ పట్టును సాధించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం భారతీయ పారిశ్రామిక రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: శాంతి మంత్రంతో బౌద్ధ సన్యాసుల సరికొత్త చరిత్ర -
నేను జోక్యం చేసుకోకపోతే అది అణు యుద్ధంగా మారేది
వాషింగ్టన్: గత ఏడాది భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తానే చొరవ తీసుకొని ఆపేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించారు. ఒకవేళ తాను స్పందించకపోతే అది కచ్చితంగా అణుయుద్ధంగా మారేదని, టారిఫ్ల యుద్ధం జరిగేదని అన్నారు. ట్రంప్ మంగళవారం ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలకు ముగింపు పలికానని చెప్పారు. ఇందులో ఆరు యుద్ధాలు టారిఫ్ల బెదిరింపు వల్ల ఆగిపోయానని తెలిపారు. మాట వినకపోతే మీ ఉత్పత్తులపై భారీగా టారిఫ్లు విధిస్తానని హెచ్చరించడంతో ఆయా దేశాలు దారికొచ్చాయని పేర్కొన్నారు. యుద్ధాల కారణంగా సామాన్య ప్రజలు మరణించడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదన్నారు. టారిఫ్ల భయంతో భారత్, పాకిస్తాన్లు యుద్ధం నిలిచివేశాయని వెల్లడించారు. ఇరుదేశాల ఘర్షణలో కనీసం 10 యుద్ధ విమానాలు నేలకూలాయని తెలియజేశారు. అయితే, అవి ఏ దేశానికి చెందినవన్న సంగతి ట్రంప్ బయటపెట్టలేదు. యుద్ధాన్ని ఆపడం ద్వారా కనీసం కోటి మందిప్రజల ప్రాణాలను ట్రంప్ రక్షించారని అప్పట్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పినట్లు గుర్తుచేశారు. తాను గనుక కలుగజేసుకోకపోతే భారత్, పాక్ల మధ్య అణుయుద్ధం జరిగేదని ట్రంప్ తేల్చిచెప్పారు. టారిఫ్ల హెచ్చరిక బాగా పనిచేసిందని వ్యాఖ్యానించారు. భారత్, పాక్ యుద్ధాన్ని తానే ఆపేశానంటూ ట్రంప్ చెప్పుకోవడం ఇది 80వ సారి కావడం గమనార్హం. అయితే, పాకిస్తాన్పై దాడులు నిలిపివేయడం వెనుక ట్రంప్ ప్రమేయం ఏమాత్రం లేదని భారత ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. కాల్పుల విరమణ పాటించాలని పాకిస్తాన్ ప్రభుత్వం పదేపదే వేడుకోవడం వల్లనే మానవతా దృక్పథంతో తాము వెనక్కి తగ్గామని పలుమార్లు ప్రకటించింది. ఇందులో మూడో వ్యక్తి జోక్యం లేదని తెలియజేసింది. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత సైన్యం గత ఏడాది మే నెలలో పాకిస్తాన్పై, పాక్ ఆక్రమిత కశ్మీర్పై భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే. -
యూఎస్ ‘అవాంఛిత’ జాబితాలో మనోళ్లు
అమెరికాలో వలసదారులను లక్ష్యం చేసుకుని ట్రంప్ సర్కారు తాజాగా మరో చర్యకు దిగింది. ‘పలు తీవ్ర నేరాలకు పాల్పడ్డ, అభియోగాలను ఎదుర్కొంటున్న వారు’ అని పేర్కొంటూ పాతిక వేల మంది వలసదారులతో కూడిన జాబితాను హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) తాజాగా విడుదల చేసింది. ‘అత్యంత దారుణాలకు పాల్పడి అరెస్టైన వారు’ అనే పేరిట ఈ మేరకు ఏకంగా సరికొత్త డేటాబేస్నే రూపొందించారు! 2025 నుంచి అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అదుపులోకి తీసుకున్న వారితో కూడిన ఈ జాబితాలో 89 మంది భారతీయులున్నారు. వీరిలో అత్యధికులు ఆర్థిక నేరాలు, మోసాల కేసుల్లో పోలీసులకు చిక్కినవారే కావడం గమనార్హం. కాగా కొందరు లైంగిక దాడులు, డ్రగ్ ట్రాఫికింగ్, ఇతర హింసాత్మక నేరాల్లో అరెస్టయ్యారు. అమెరికాలో ఉన్న వలసదారుల్లో నేరగాళ్లు, అసాంఘిక శక్తులను దేశ పౌరుల్లో ప్రతి ఒక్కరూ సులువుగా గుర్తించేందుకు తాము రూపొందించిన ఈ కొత్త వెబ్సైట్ తోడ్పడుతుందని డీహెచ్ఎస్ అసిస్టెంట్ సెక్రెటరీ ట్రిసియా మెక్లాలిన్ చెప్పారు. అలాగే వారు పాల్పడ్డ నేరాలు, వాటి తీవ్రత కూడా అందరికీ తెలిసొస్తుందన్నారు. పారదర్శకతను పెంచే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఈ నిందితులను వారి పేరు, జాతీయత, అరెస్టయిన రాష్ట్రం... ఇలా పలు రకాలుగా సెర్చ్ చేసి చూసుకునేందుకు సంబంధిత వెబ్సైట్లో అవకాశం కల్పించారు. ఈ జాబితాలోని 89 మంది భారతీయుల్లో 22 మందిపై దొంగతనాలు, పన్ను ఎగవేత, ఆన్లైన్ మోసాల వంటి ఆర్థిక నేరాల అభియోగాలున్నాయి. 21 మంది దోపిడీలు, ఇతర హింసాత్మక ఘటనల అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 17 మంది లైంగిక నేరాల్లో పోలీసులకు చిక్కారు. అణచివేతను సమర్థించుకునేందుకే...! డీహెచ్ఎస్ రూపొందించిన ఈ ‘అత్యంత దారుణ నేరగాళ్ల’జాబితా పలు విమర్శలకు కూడా తావిస్తోంది. దానిపై స్థానిక సామాజికవేత్తలు, హక్కుతల నేతలే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు! ‘‘నిందితులు, వారు పాల్పడ్డారంటున్న నేరాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపకుండా కేవలం పోలీసుల అదుపులో ఉండగా తీసిన వాళ్ల మగ్షాట్స్ (ఫొటోలు), సైట్లో ఉంచడం, విచారణ దశలోనే ఏకపక్షంగా నేరగాళ్లనే ముద్ర వేయడం దారుణం. ఇది ఏ మాత్రమూ సరికాదు. కేవలం వలసదారులపై తీసుకుంటున్న అత్యంత కఠినమైన అణచివేత చర్యలను సమర్థించుకోవడమే దీని లక్ష్యంగా కనిపిస్తోంది’’అని వారు ఆరోపిస్తున్నారు. ‘‘ఈ జాబితా పూర్తిగా శ్వేతేతరులతో నిండిపోయి ఉంది. దీన్ని చూసే అమెరికన్లకు వారంతా నేరగాళ్లు, దొంగలు అన్న అభిప్రాయం ఏర్పడే ఆస్కారముంది’’అంటూ మైన్ వలసదారుల హక్కు సంఘం నేత రూబెన్ టోరెస్ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. అసలు పనిగట్టుకుని మరీ ఇలాంటి వెబ్సైట్ రూపొందించి హడావుడిగా ఇలా పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఏమొచి్చందని యూనివర్సిటీ ఆఫ్ మన్ స్కూల్ ఆఫ్ లాస్కు చెందిన రెఫ్యూజీ అండ్ హ్యూమన్రైట్స్ క్లినిక్ డైరెక్టర్ అన్నా వెల్చ్ ప్రశ్నించారు. ఇది కేవలం అమెరికావ్యాప్తంగా వలసదారులపై ట్రంప్ సర్కారు ఏడాదికి పైగా పాల్పడుతున్న అత్యంత అమానవీయ చర్యలను సమర్థించుకునే ఎత్తుగడగానే కనిపిస్తోందంటూ ఆక్షేపించారు. డీహెచ్ఎస్ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘స్టార్ట్’కి చెదలు!
అడిగేవారు లేకపోతే, జవాబుదారీతనం కొరవడితే... ఎక్కడైనా ఇష్టారాజ్యం తప్పదు. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలు అలాగే వ్యవహరిస్తున్నాయి. ఎవరేమనుకుంటే ఏమిటన్నట్టు రెచ్చిపోతున్నాయి. అణ్వాయుధాల వల్ల భూగోళానికి పెను ముప్పు ఏర్పడుతుందని ప్రపంచ ప్రజానీకం దశాబ్దాల పాటు ఒత్తిళ్లు తెచ్చిన పర్యవసానంగా ఆ రెండింటి మధ్యా 1991లో మొదటిసారి వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు(స్టార్ట్)–1 ఒప్పందం కుదిరింది. దాని స్థానంలో 2010లో ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం సాకారం కాగా, దానికి ఈనెల 5తో నూకలు చెల్లాయి. ఆ విషయంలో మళ్లీ చర్చలు మొదలెట్టాలని, సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి రావాలని రెండేళ్లుగా పలువురు నిపుణులు, ప్రపంచ శాంతిని కాంక్షించేవారు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. కానీ అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయారు. ఆయన స్థానంలో నిరుడు జనవరిలో వచ్చిన డోనాల్డ్ ట్రంప్కు సైతం ఈ సంగతి తెలుసు. దాన్ని గురించి మీడియా ప్రశ్నిస్తే ‘ముగిసిపోతుందా...పోనీయండి. దాని స్థానంలో మరొకటి కుదుర్చుకుంటాం’ అన్నారే తప్ప ఇంతవరకూ ఆ దిశగా చర్చల కోసం చేసిందేమీ లేదు. కొత్త ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అడపా దడపా చెప్పకపోలేదు. కానీ ఉక్రెయిన్లో ఆయన సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం ఆ మాటల్లోని చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేసింది. అమెరికా పోకడలూ దానికి భిన్నంగా ఏమీలేవు. ‘న్యూ స్టార్ట్’ ముగియటంతో ఇరుపక్షాలనూ కట్టిపడేసే అంతర్జాతీయ ఒప్పందమేదీ ఉనికిలో లేకుండా పోయింది. ఇకపై రెండు అగ్రరాజ్యాలూ ఆయుధాలు పోగేసుకున్నా, పరస్పరం కయ్యానికి కాలు దువ్వుకున్నా, అణ్వాయుధాల్ని ప్రయోగించే సాహసం చేసినా... ప్రపంచమంతా నిస్సహాయంగా చూస్తూ ఉండక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు దేశాలకూ, వాటిని సమర్థిస్తున్నవాటికీ జవాబుదారీతనం, భయభక్తులు, వెరపు వంటివి మాయ మయ్యాయి. ఒకప్పుడు ప్రపంచం ఇంతకన్నా కాస్తయినా మెరుగ్గా ఉండేదనటానికి వ్యూహాత్మక ఆయుధాల పరిమితి ఒప్పందం(సాల్ట్) గురించిన చర్చలే ఉదాహరణ. ఆ ఒప్పందం సాకారం కాలేదు. ఒకవేళ అలా అయినా దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఎందుకంటే అప్పటికే ఇరు దేశాలూ పోగేసుకున్న ఆయుధాలు ఇక పెరగకుండా చూడటం తప్ప ఆ చర్చలు సాధించేది పెద్దగా ఏమీ ఉండేదికాదు. కానీ అంతకన్నా మెరుగైన ‘స్టార్ట్–1’ కుదిరింది. అణ్వాయుధం, లేదా వేరే బాంబును మోసుకేళ్లే సామర్థ్యమున్న క్షిపణులను (వార్హెడ్లను) 6,000కు తగ్గించటం, వాటి లాంచర్ల (వాహనాల) సంఖ్యను 1,600కు కుదించటం అది సాధించిన ఘనవిజయం. 2010లో కుదిరిన ‘న్యూ స్టార్ట్’ కూడా చెప్పుకోదగ్గ ముందడుగు. దానివల్ల వార్హెడ్ల సంఖ్య 1,550కి, లాంచర్ల సంఖ్య 700కు తగ్గాయి. పరస్పరం డేటా మార్పిడి, నోటిఫికేషన్ల విడుదల, క్షిపణుల్ని మోహరించిన ప్రాంతాల తనిఖీలకు అనుమతించటం అందులో ఉన్నాయి. నిజానికి ఈరెండింటికీ మధ్య 1993లో ‘స్టార్ట్–2’ గురించి చర్చలు సాగాయి. బహుళ సంఖ్యలో వార్హెడ్లను ప్రయోగించగల క్షిపణులను నిషేధించాలన్నది ఈ చర్చల ఆంతర్యం. కానీ ఎలాంటి ఫలితమూ లేకుండా ముగిసిపోయాయి. ఇప్పటికే అమెరికా, రష్యాల మధ్య చడీచప్పుడూ లేకుండా ఆయుధ పోటీ సాగుతోంది. తమదగ్గరున్న అణ్వాయుధాలకు కృత్రిమ మేధ(ఏఐ)ను జతచేసి, వాటి శక్తిని అనేక రెట్లు పెంచుకుంటున్నాయి. గంటకు 6,437 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగల రకరకాల క్షిపణులు వచ్చేశాయి. వాటిని విడివిడిగా గురిచూసి కొట్టడం అసాధ్యమని తేలాకే ట్రంప్ ‘గోల్డెన్ డోమ్’ పేరుతో కొత్త పాట అందుకున్నారు. ఆ ‘బంగారు గుమ్మటం’ అమెరికాను ఎంతవరకూ రక్షిస్తుందో నిజంగా ఏమైనా జరిగితే తప్ప ఎవరికీ తెలియదు. మొత్తానికి ఇద్దరి వద్దా అటూ ఇటూగా చెరో 5,000 అణ్వాయుధాలున్నాయి. మిగతా దేశాలన్నిటి వద్దా అందులో సగం కూడా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో తక్షణమే కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రపంచ ప్రజానీకం, ముఖ్యంగా ఆ రెండు దేశాల్లోని ప్రజలూ తీవ్రంగా ఒత్తిళ్లు తీసుకురావాలి. లేనట్టయితే ప్రపంచం క్షణక్షణ గండంగా బతుకీడ్చక తప్పదు. -
విదేశీయులకు బిగ్ షాక్.. H1-B వీసా రద్దు?
-
మరో కొత్త వివాదానికి తెరలేపిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి కెనడాను టార్గెట్ చేశారు. మరో వాణిజ్య వివాదానికి తెరలేపారు. కెనడా-అమెరికా మధ్య వంతెనను బ్లాక్ చేస్తామంటూ హెచ్చరించారు. అమెరికా నుంచి పొందిన వాటన్నింటికీ పూర్తిస్థాయిలో చెల్లించకపోతే చర్యలు తప్పవన్న ట్రంప్.. ఈ మేరకు తన 'ట్రూత్ సోషల్' (Truth Social) ప్లాట్ఫామ్లో సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. వాణిజ్య పరంగా కెనడా అన్యాయంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు.గోర్డీ హోవే బ్రిడ్జ్ (Gordie Howe Bridge) ప్రాజెక్టుపై కెనడాతో తక్షణమే చర్చలు ప్రారంభిస్తామని.. వాషింగ్టన్కు కనీసం సగం వాటా, తగిన పరిహారం చెల్లించే వరకు వంతెన ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటామంటూ ఆయన హెచ్చరించారు. దశాబ్దాలుగా కెనడా అమెరికా పట్ల.. చాలా అన్యాయంగా" వ్యవహరిస్తోందని ఆరోపించారు. అంటారియో, మిచిగాన్ మధ్య నిర్మిస్తున్న ఈ కొత్త వంతెన విషయంలో పూర్తి పరిహారం అందే వరకు దానిని తెరవనిచ్చేది లేదంటూ ట్రంప్ స్పష్టం చేశారు.గోర్డీ హోవ్ బ్రిడ్జ్ ప్రాముఖ్యత..మిచిగన్- కెనడా ఒంటారియోను కలిపే ఆరు లైన్ల వంతెన ఇది.. డెట్రాయిట్ నది మీదుగా నిర్మాణం జరుగుతోంది. ఇది మిచిగాన్లోని ఇంటర్ స్టేట్-75ని అంటారియోలోని హైవే 401తో నేరుగా కలుపుతుంది. ట్రాఫిక్ తగ్గించి, రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచే లక్ష్యంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు.గతంలో కూడా కెనడాపై ట్రంప్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. గ్రీన్లాండ్పై గోల్డెన్ డోమ్ నిర్మించడాన్ని కెనడా వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో చైనాతో కెనడా వ్యాపారం చేయడం వారికే నష్టం కలిగిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. గ్రీన్లాండ్పై విస్తారమైన క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించాలనే అమెరికా ప్రణాళికను కెనడా వ్యతిరేకిస్తోందంటూ ఆయన మండిపడ్డారు. -
సాహసోపేతమేగానీ...
సహనం, ఓర్పు, సంయమనం, ప్రయామం, నిగ్రహం... ఎదుటివారు ఎంతగా రెచ్చ గొడుతున్నా మాట తూలకుండా ప్రశాంతంగా ఉండే స్థితిని చెప్పటానికి ఇలా బోలెడు పదాలున్నాయి. కనీసం ఆర్నెల్లుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరిపోయినట్టేనని తరచు చెబుతూవచ్చారు. అందుకు మన దేశంనుంచి ఆశాజనకమైన స్పందన రానప్పుడల్లా రెచ్చిపోయి మాట్లాడారు. పాకిస్తాన్ పౌర, సైనిక అధినేతల్ని నెత్తినెక్కించుకుని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. జమ్మూ–కశ్మీర్ భౌగోళిక చిత్రపటాన్ని పాకిస్తాన్ సంబరపడేలా మార్చేశారు. ఎన్ని చేసినా మన ప్రభుత్వం మౌనంగా ఉండిపోవటం, లేదా ఆచితూచి మాట్లాడటం పనికొచ్చినట్టుంది. ఎట్టకేలకు మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి భారత–అమెరికాల మధ్య ఒక అవగాహన కుదిరిందని మొన్న శనివారం అధికారికంగా ఉమ్మడి ప్రకటన వెలువడింది. అందుకు సంబంధించిన ఒక అమరిక (ఫ్రేమ్వర్క్) కూడా రూపొందింది. అంతే... వెనువెంటనే 25 శాతం అదనపు సుంకాలు రద్దయ్యాయి. ఇకపై సుంకాలు 18 శాతానికి మాత్రమే పరిమితమవుతాయని అమెరికా ప్రకటించింది. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి అలముకున్న తరుణంలో మన దేశం ఈ మాదిరి ఒప్పందానికి సంసిద్ధం కావటం ఒక సాహసోపేతమైన చర్య. అయితే ‘ఇల్లలకగానే పండగ కాద’న్నట్టు ఈ ఒప్పందం వాస్తవ రూపం దాల్చేవరకూ ఒకింత ఉత్కంఠ, సంశయం తప్పవు. అటు తర్వాత కూడా దిన దిన గండం ఉండనే ఉంటుంది. అక్కడున్నది ట్రంప్ గనుకే ఈ సమస్య. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు గమనిస్తే ఇది తెలుస్తుంది. ‘భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనడం ఆపేసి, ఆ ఉత్పత్తులను అమెరికా నుంచే కొంటుందని ఆశిస్తున్నామ’ని అందులో ఉంది. భారత– రష్యా చమురు వాణిజ్యంపై తమ నిఘా ఉంటుందని కూడా అంటున్నది. ఈ విషయంలో మన దేశం అధికారికంగా ఏమీ చెప్పలేదు. ఉమ్మడి ప్రకటనలోనూ ఆ ప్రస్తావనలేదు. కానీ జాతీయ ఇంధన ప్రయోజనాలే మన గీటురాయి అని గతంలో మోదీ అన్నారు. మన వ్యవసాయ, పాడి రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టే ప్రశ్నే లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ చెబుతున్నారు. అలాగే అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు సుంకాలు తగ్గించబోమంటున్నారు. అయితే ఉమ్మడి ప్రకటనలో అమెరికాకు సంబంధించిన అన్ని పారిశ్రామిక సరుకులు, విస్తృతశ్రేణి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు లేదా రద్దు చేయటానికి భారత్ అంగీకరించిందని ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేనట్టయితే భారత్ వెనక్కి తగ్గిందని ట్రంప్ యాగీ చేయటంతోపాటు, అదనపు సుంకాలకు సాకుగా ఉపయోగించుకుంటారు.ప్రస్తుత భారత–అమెరికా వాణిజ్యం 13,000 కోట్ల డాలర్ల మేర ఉంది. ఇందులో అమెరికాకు మన ఎగుమతులు 8,500 కోట్ల డాలర్ల వరకూ ఉంటే, అమెరికా నుంచి దిగుమతులు 4,500 కోట్ల డాలర్ల వరకూ ఉన్నాయి. అంటే మనం 4,000 కోట్ల డాలర్ల వాణిజ్య మిగులులో ఉన్నాం. దీన్ని మార్చాలన్నదే ట్రంప్ తాపత్రయం. అందుకే వచ్చే అయిదేళ్లలో అమెరికా నుంచి 50,000 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులుండేలాఒప్పందం నిర్దేశిస్తోంది. ఇంధనం ఉత్పత్తులు, విమానాలు, విమాన విడిభాగాలు,సాంకేతిక ఉత్పత్తులు, అరుదైన లోహాల వంటివి ఉంటాయంటున్నారు. అంటే ఆ దేశంనుంచి ఏటా అదనంగా వందకోట్ల డాలర్ల అదనపు ఉత్పత్తులు వస్తాయి. అప్పుడు మన వాణిజ్య మిగులు ఆవిరై, లోటులో పడుతుంది. దీన్ని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు?కార్మికుల అవసరం ఎక్కువుండే మన ఉత్పత్తులకు ఒప్పందం వల్ల భారీ ప్రయోజనం కలిగే అవకాశమైతే ఉంటుంది. ఆ రకంగా దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగవు తాయి. ఇక జన్యుమార్పిడి ఆహారం అనారోగ్యహేతువని, ఆ విత్తనాల వల్ల దిగుబడి భారీగా వచ్చినా, అవి వాడిన పంటపొలాల్లో భవిష్యత్తులో దేశీయ విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉండదని గతంలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ విషయంలో సందే హాలన్నీ నివృత్తి చేయాలి. అలాగే తుది ఒప్పందం సమయానికి అవసరమైన మార్పులు, చేర్పులకు ఇరుపక్షాలూ సిద్ధపడే షరతుపైనే ఏ ఒప్పందంపైనైనా సంతకం చేయాలి. -
క్రికెట్ ప్రపంచంలోకి ఎంటరైన ట్రంప్
అనునిత్యం వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా క్రికెట్ ప్రపంచంలోకి కూడా ఎంటరయ్యాడు. భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో పాల్గొంటున్న తమ జట్టుకు (యూఎస్ఏ) ట్రంప్ మద్దతు ప్రకటించాడు. సోషల్ ట్రూత్లో ఓ ప్రత్యేక సందేశం పోస్ట్ చేస్తూ.. టీమ్ యూఎస్ఏ చాలా బలమైంది. అమెరికా మొత్తం మీ వెనుకే ఉంది అని పేర్కొన్నాడు. ట్రంప్ ఇచ్చిన మద్దతు యూఎస్ఏ జట్టులో కొత్త ఉత్సాహం నింపింది. రేపు (ఫిబ్రవరి 10) పాకిస్తాన్తో జరుగబోయే కీలక మ్యాచ్కు ముందు ట్రంప్ సందేశం యూఎస్ఏ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ట్రంప్ మద్దతు అమెరికాలో క్రికెట్ ఎదుగుదలకు కొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి ట్రంప్కు క్రికెట్పై పెద్దగా అవగాహన లేదు. గోల్ఫ్, అమెరికన్ ఫుట్బాల్ వంటి క్రీడలపై అతనికి ప్రత్యేక ఆసక్తి ఉంది. అయితే ట్రంప్కు 2020లో అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్టేడియం (ప్రస్తుతం నరేంద్ర మోడి స్టేడియం) ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనుభవం ఉంది. భారత్తో వాణజ్యపరమైన సంబంధాలు ఇప్పుడిప్పుడే బలపడుతున్న వేల, ట్రంప్ ప్రకటన భారతీయుల్లోనూ ఆసక్తి కలిగిస్తుంది. ట్రంప్ మద్దతు ఉంటే క్రికెట్ కూడా విశ్వక్రీడగా మారిపోయే అవకాశం ఉంది.అమెరికాలో క్రికెట్ అభివృద్ధి 2023లో ప్రారంభమైన మేజర్ లీగ్ క్రికెట్తో మొదలైంది. ఆ టోర్నీలో భారత్ తప్ప, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లందరూ పాల్గొంటారు. 2024 టీ20 ప్రపంచకప్కు సహ-ఆతిథ్యం ఇవ్వడంతో అమెరికా ప్రజలకు క్రికెట్ మరింత చేరువైంది. యూఎస్ఏలో ఇప్పటికే 150 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఇదిలా ఉంటే, యూఎస్ఏ జట్టు గత ఎడిషన్ టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ను చిత్తు చేసి పెను సంచలనం సృష్టించింది. ప్రస్తుత ఎడిషన్లోనూ ఆ జట్టు మరో సంచలనం సాధించే అవకాశం ఉంది. టోర్నీ ఓపెనర్లో భారత్తో జరిగిన మ్యాచ్లో యూఎస్ఏ ఆటగాళ్లు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చారు. ఈ మ్యాచ్లో వారి పోరాటానికి క్రికెట్ అభిమానులంతా ముగ్దులయ్యారు. టీమిండియా ఆ మ్యాచ్ను మాత్రమే గెలిచింది కానీ, యూఎస్ఏ జట్టు మాత్రం క్రికెట్ ప్రపంచాన్నంతా గెలిచింది. -
ప్రధాని మోదీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. నిజమెంత?
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాను తలుచుకుంటే నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని అంతం చేయగలనని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఉన్న ఈ క్లిప్ భారతీయ నెటిజన్లలో తీవ్ర గందరగోళాన్ని, ఆందోళనను రేకెత్తించింది. ట్రంప్ రెండవమారు అధికారంలోకి వచ్చాక భారత్-అమెరికా సంబంధాల్లో ప్రతికూలతలు కనిపిస్తున్న తరుణంలో ఈ వైరల్ క్లిప్ దుమారం రేపుతోంది.అయితే ఈ వైరల్ వీడియో ప్రచారంలో వాస్తవం లేదని ‘ఫ్యాక్ట్ చెక్’ ద్వారా స్పష్టమైంది. ఈ వీడియో 2025 అక్టోబర్లో వైట్ హౌస్లో ట్రంప్ విలేకరులతో మాట్లాడిన సందర్భానికి సంబంధించినదని తేలింది. ఆ సమయంలో ఆయన మోదీని ప్రశంసిస్తూ, ఆయనపై తనకు ఉన్న గౌరవాన్ని చాటుకునేందుకు ప్రయత్నించారు. ప్రధాని మోదీకి తనపై ఎంతో ప్రేమ ఉందని చెబుతూ, ఆ ‘ప్రేమ’ అనే పదాన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకూడదని ట్రంప్ చమత్కరించారు. ఆ సందర్భంలోనే ఆయన తాను ప్రధాని మోదీ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదంటూ సరదాగా వ్యాఖ్యానించారు. 🚨 Breaking NewsDonald Trump's statement is making headlines.“I could end Narendra Modi’s political career, but I don’t want to.”One Statement, Many Questions.Is this just a Political statement, or is there a Deeper Meaning Behind It?In Global Politics, Words Carry… pic.twitter.com/my42g7J6r2— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) February 8, 2026కొందరు సోషల్ మీడియా యూజర్స్ ట్రంప్ వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించి పోస్ట్ చేస్తున్నారు. ‘నేను మోదీ కెరీర్ను అంతం చేయగలను.. కానీ నాకు ఇష్టం లేదు’ అని ట్రంప్ బెదిరించినట్లుగా క్యాప్షన్లు పెట్టి షేర్ చేస్తున్నారు. కాగా అధికారిక వైట్ హౌస్ నివేదికలు గానీ, అంతర్జాతీయ మీడియా సంస్థలు గానీ ఇలాంటి హెచ్చరికలు వచ్చినట్లు తెలియజేయలేదు. అసలు క్లిప్లో ట్రంప్ ఎంతో స్నేహపూర్వకంగా మోదీని ‘గ్రేట్ మ్యాన్’ అని కొనియాడారు.కొందరు కేవలం ఒక చిన్న పదాన్ని పట్టుకుని, అప్పటి సందర్భాన్ని తొలగించి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టమయ్యింది. నాడు ట్రంప్ భారతదేశంపై, మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా అభివర్ణిస్తూ, గతంలో భారత్ పదే పదే నాయకత్వ మార్పులను చూసేదని, కానీ మోదీ వచ్చాక రాజకీయ స్థిరత్వం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. మోదీని కాలపరీక్షకు నిలబడిన నాయకుడు అని ట్రంప్ కొనియాడారు. ఇది కూడా చదవండి: ‘ఆ బిడ్డ నాది కాదు’.. తేజ్ ప్రతాప్ విలవిల -
ట్రంప్ కు భారీ విజయం.. అప్పీల్ కోర్టు సంచలన తీర్పు
-
ట్రంప్నకు భారీ విజయం.. వలసదారులకు ఎదురుదెబ్బ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అప్పీల్స్ కోర్టు భారీ ఊరట దక్కింది. వలసదారులను నిర్బంధించే విషయంలో ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని అప్పీల్స్ కోర్టు సమర్థించింది. దీంతో, కోర్టులో భారీ విజయం దక్కింది. ఈ మేరకు ధర్మాసనం తరఫున 2-1 మెజారిటీతో జడ్జి ఎడిత్ హెచ్ జోన్స్ తీర్పు రాశారు.కాగా, అమెరికాలో ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వలసదారులను అరెస్టు చేసినప్పుడు హోంలాండ్ భద్రతాధికారులు బాండ్ హియరింగ్ను నిరాకరిస్తున్నారు. బాండ్ హియరింగ్కు అనుమతి ఇవ్వకుండానే వలసదారులను నిర్భందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వలసదారుల నిర్భందాలపై పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఐదో సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు.. ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని సమర్థించింది. ధర్మాసనం తరఫున 2-1 మెజారిటీతో జడ్జి ఎడిత్ హెచ్ జోన్స్ తీర్పు రాశారు. ఈ సందర్భంగా.. బాండ్ హియరింగ్ నిర్భందాలకు అనేక కోర్టులు వ్యతిరేకంగా తీర్పులిస్తున్నాయి. కానీ ఇది రాజ్యాంగం, ఫెడరల్ వలస చట్టాలకు అనుగుణంగానే ఉంది. వలస, జాతీయ చట్టాలకు ప్రభుత్వం సరిగానే అర్థం చెప్పిందని అభిప్రాయపడ్డారు. అనుమతిలేని విదేశీయులు దేశంలో ఎక్కడ పట్టుబడినా బాండ్పై విడుదలకు అనర్హులని స్పష్టం చేశారు. వారు ఎంతకాలం దేశంలో ఉన్నారన్నదీ అప్రస్తుతమని పేర్కొన్నారు.అయితే, గతంలో విదేశీయులు సరిహద్దుల్లో అరెస్టయితే.. వారికి ఎటువంటి నేర చరిత్రా లేకపోతే వలసదారుల కోర్టులో బాండ్ హియరింగ్ను కోరేవారు. కోర్టులూ వారికి బాండ్లను మంజూరు చేసేవి. కానీ, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వలసదారులపై ఉక్కుపాదం మోపారు. అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించేశారు.ఈ నేపథ్యంలో మెక్సికోకు చెందిన ఇద్దరు వలసదారులు అమెరికాలో పదేళ్లుగా ఉంటున్నారు. గత ఏడాది వారు తమను నెలలపాటు నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్లు వేశారు. వారికి గత అక్టోబరులో టెక్సాస్ కోర్టు బాండ్లు మంజూరు చేసింది. గత జులైలో ట్రంప్ యంత్రాంగం బాండ్ల విధానాన్ని తిరగదోడింది. తాజాగా అప్పీల్స్ కోర్టు ఆ విధానాన్ని సమర్థించింది. కాగా, ఇలాంటి నిర్బంధాలను ఇటీవల దిగువ కోర్టులు తప్పుబడుతున్న నేపథ్యంలో ఈ తీర్పు ట్రంప్నకు భారీ న్యాయ విజయంగా చెప్పవచ్చు. -
‘అమెరికాతో యుద్ధం వచ్చినా..’..ఇరాన్ కీలక ప్రకటన
టెహ్రాన్: అమెరికాతో జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఇరాన్ ఒక కీలక ప్రకటన చేసింది. తమ దేశ అణు కార్యక్రమాల్లో భాగంగా చేపడుతున్న యురేనియం శుద్ధి ప్రక్రియను ఎలాంటి పరిస్థితుల్లోనూ నిలిపివేయబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. అమెరికాతో యుద్ధం ముంచుకొచ్చినా సరే, తమ సార్వభౌమత్వానికి సంబంధించిన ఈ విషయంలో ఎప్పటికీ రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. తమ ప్రవర్తనను శాసించే హక్కు ఏ దేశానికీ లేదని, శాంతి చర్చల పేరుతో తమను లొంగదీసుకోవాలని చూడటం అస్సలు సాధ్యం కాదని అబ్బాస్ అరాగ్చీ పునరుద్ఘాటించారు.తమ దేశ సరిహద్దుల్లో అమెరికా తన సైనిక బలాన్ని పెంచడంపై ఇరాన్ ఏమాత్రం ఆందోళన చెందడం లేదని అరాగ్చీ పేర్కొన్నారు. ముఖ్యంగా అరేబియా సముద్రంలో అమెరికాకు చెందిన యుద్ధనౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ మోహరింపు తమను ఎంతమాత్రం భయపెట్టలేదని అన్నారు. అమెరికా ఒకవైపు చర్చలు జరుపుతూనే, మరోవైపు సైనిక చర్యల ద్వారా బెదిరింపులకు పాల్పడటం వారి ద్వంద్వ నీతిని నిదర్శనమని విమర్శించారు. అగ్రరాజ్యం అనుసరిస్తున్న ఈ ధోరణి కారణంగా చర్చలపై తమకు నమ్మకం సడలుతోందని ఆయన వ్యాఖ్యానించారు.ఒమన్ వేదికగా ఇరాన్- అమెరికా ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చల్లో వాషింగ్టన్ చిత్తశుద్ధిపై ఇరాన్ అనుమానం వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, చమురు ఎగుమతులను అడ్డుకునేందుకు ఆంక్షలు విధించడం చర్చల ప్రక్రియకు విరుద్ధమని అరాగ్చీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తమ వ్యూహాత్మక భాగస్వాములైన చైనా, రష్యాతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, అమెరికా తీరును అనుసరించి చర్చల కొనసాగింపుపై ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇరాన్ అణు బాంబు తయారీ కోసం ప్రయత్నిస్తున్నదన్న పాశ్చాత్య దేశాలు, ఇజ్రాయెల్ ఆరోపణలను అరాగ్చీ తోసిపుచ్చారు. ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడమే ఈ చర్చల్లో తమ ప్రధాన లక్ష్యమని, దానికి ప్రతిగా అణు కార్యక్రమాల విషయంలో నమ్మకాన్ని కలిగించే చర్యలు తీసుకుంటామన్నారు. ఇది కూడా చదవండి: Bangladesh: కీలక నేత కన్నుమూత.. ఎన్నికల ముందు విషాదం -
ఇది వంచనే: కాంగ్రెస్
న్యూఢిల్లీ: భారతీయ రైతులు, సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమలు, ప్రజల ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీసేలా మోదీ సర్కార్ ట్రంప్ ప్రభుత్వం ఎదుట సాగిలపడిందని కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగ సారథి పవన్ ఖేడా శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘తాజాగా కుదిరింది ఎన్డీఏ ప్రభుత్వం, ట్రంప్ సర్కార్ల మధ్య వాణిజ్య ఒప్పందంగా లేదు. అగ్రరాజ్యం ముందు మోదీ ప్రభుత్వం ఒంగి సలామ్ చేసినట్లుగా ఉంది. ఈ ఒప్పందం అమలైతే అమెరికా నుంచి పెద్ద ఎత్తున అమెరికన్ ఉత్పత్తులు భారత్ను ముంచెత్తుతాయి. ఇవి మన రైతులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సాధారణ ప్రజానీకం ప్రయోజనాలను నాశనంచేస్తాయి. గత 75 ఏళ్లుగా భారత్ అవలంభిస్తున్న విధానాలను పూర్తిగా తుంగలో తొక్కి వంచనతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం అంటే ఇరుపక్షాలు సమస్థాయిలో సమావేశమై కుదుర్చుకునేది. అంతేగానీ నీ తలపై తుపాకీ గురిపెట్టి, బ్లాక్మెయిల్ చేసి కుదుర్చుకునేది ఒప్పందం అనిపించుకోదు. అది కేవలం సరెండర్ అవడం అవుతుంది. భారత ప్రధాని విదేశం ఎదుట లొంగిపోవడాన్ని కాంగ్రెస్ ఏమాత్రం సహించట్లేదు. ఇది నిజంగా దురదృష్టం’’అని ఖేడా వ్యాఖ్యానించారు. రైతన్నల వెన్ను విరిచారు ‘‘అమెరికా నుంచి విపరీతంగా సాగు సంబంధ ఉత్పత్తుల దిగుమతికి మోదీ సర్కార్ ఇప్పుడు అనుమతించింది. దీంతో ఇక్కడ రైతుల వెన్ను విరగనుంది. దీంతో భవిష్యత్తులో వ్యవసాయం అనేది కష్టాలపాలుకానుంది. ఈ ఒప్పందం భారత్లో వ్యవసాయాన్ని ఎంతగా నాశనం చేయనుందో త్వరలోనే కళ్లకుకడుతుంది. ఒప్పందం కారణంగా ఎన్ని రకాల ఉత్పత్తులు భారతీయ విపణికి విపరీతంగా పోటెత్తనున్నాయో వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ చెప్పట్లేరు. దిగుమతి కాబోయే వస్తూత్పత్తుల జాబితాను ఆయన తెలివిగా దాచేశారు. ఏఏ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయో అవి మాత్రమే ఘంటాపథంగా చెబుతున్నారు’’అని ఖేడా వెల్లడించారు. గోయల్నుద్దేశిస్తూ.. ‘‘మన రూపాయి భవితవ్యం, మన ఆర్థికవ్యవస్థ తాజా పరిస్థితి మీకు తెలుసా? ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతుల విలువ ఏటా 40 లేదా 42 బిలియన్ డాలర్లు ఉంటే ఇకపై ఏటా అది 100 బిలియన్ డాలర్లకు పెరిగిపోనుంది. అంతగా విదేశీమారకద్రవ్యాలను ఎక్కడి నుంచి తెచ్చి కడతాం?’’అని నిలదీశారు. హగ్లు, ఫొటోలు పనిచేయలేదు ‘‘ఏ దేశాధినేత, ప్రధాని, అగ్రనేతను కలిసినా మోదీ ఆలింగనం చేసుకుంటూ తెగ ఫొటోలు దిగుతారు. ఈ హగ్లు చేసుకునే హగ్లోమసీ, ఫొటోలు దిగే ఫొటో–ఆప్స్ ఏమాత్రం భారత అనుకూల ఒప్పందాన్ని సాకారంచేయలేదు. పేరుకే ఆయన నరేంద్ర మోదీ. పని మాత్రం సరెండ్ కావడం అంటూ ‘నామ్ నరేందర్, కామ్ సరెండర్’అని వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. ‘‘హౌడీ మోదీ నినాదం కంటే నమస్తే ట్రంప్ నినాదమే ఆధిపత్యం కనబర్చింది’’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ‘‘అమెరికన్ రైతులపై భారత్ దిగుమతి సుంకం ఎత్తేసింది. దీంతో వాళ్లు భారత్లోకి విపరీతంగా తమ సరుకులను దిగుమతిచేయడం ఖాయం’’అని జైరాం అన్నారు. -
మధ్యంతర ఒప్పందానికి సై
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా మరో ముందడుగు పడింది. ఇరుదేశాల పారిశ్రామికవర్గాలు, ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు తీపి కబురు అందింది. భారత్, అమెరికాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ను ఖరారు చేసుకున్నాయి. ఈ మేరకు ఇరుదేశాలు శనివారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు వసూలు చేస్తుండగా.. మధ్యంతర ఒప్పందంలో భాగంగా వాటిని 18 శాతానికి తగ్గించినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు గత ఏడాది ఆగస్టులో విధించిన 25 శాతం అదనపు సుంకాలను రద్దు చేసినట్లు వెల్లడించింది. సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. 25 శాతం అదనపు సుంకాలను శనివారం నుంచే రద్దు చేస్తున్నట్లు అమెరికా తేలి్చచెప్పింది. రష్యా నుంచి చమురు కొనడం ఆపేసి, అమెరికా నుంచి ఇంధన ఉత్పత్తులను భారత్ కొంటుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ప్రస్తావించారు. రాబోయే పదేళ్లలో అమెరికాతో రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఫ్రేమ్వర్క్కు కట్టుబడి ఉంటామని భారత్ అంగీకరించిందని పేర్కొన్నారు. వచ్చే నెలలో సంతకాలు! ఒప్పందంలో భాగంగా పలు ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలు రద్దు చేయడం లేదా తగ్గించడం జరిగినట్లు ఉమ్మడి ప్రకటనలో ఇరుదేశాలు పేర్కొన్నాయి. తద్వారా రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక వాణిజ్యం మరింత వృద్ధి చెందుతుందని, పరిశ్రమలకు, ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలియజేశాయి. ఇది పరస్పరం ఇచి్చపుచ్చుకొనే, ఉమ్మడిగా ప్రయోజనం పొందే ఒప్పందమని అభివరి్ణంచాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఇది తొలిదశ అని ఉద్ఘాటించాయి. పూర్తిస్థాయి ఒప్పందంపై చర్చలను మరింత వేగవంతం చేస్తామని తెలిపాయి. మధ్యంతర ఒప్పందం వల్ల అమెరికాలో 30 ట్రిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ భారత ఎగుమతిదారులకు అందుబాటులోకి వస్తుందని భారత ప్రభుత్వం ఆశాభావం వ్యక్తంచేసింది. మధ్యంతర ఒప్పందంపై వచ్చే నెల రెండో వారంలో సంతకాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ ఒప్పందాన్ని చాలా వేగంగా అమల్లోకి తీసుకొస్తామని భారత్, అమెరికా ప్రకటించాయి. భారత్, రష్యాల చమురు వాణిజ్యంపై నిఘా అమెరికా ఆహార, వ్యవసాయ ఉత్పత్తులతోపాటు కొన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలను రద్దు చేశామని, మరికొన్నింటిపై తగ్గించామని భారత ప్రభుత్వం వెల్లడించింది. పశువుల దాణాగా ఉపయోగించే ఎర్రజొన్నలు, ట్రీ నట్స్, శుద్ధి చేసిన పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్, మద్యం తయారీలో వాడే ధాన్యాల వంటివి ఇందులో ఉన్నట్లు పేర్కొంది. అమెరికా నుంచి వచ్చే ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధన ఉత్పత్తులు, ఎయిర్క్రాఫ్ట్లు, విమాన విడిభాగాలు, అరుదైన లోహాలు, టెక్నాలజీ ఉత్పత్తులు, కోకింగ్ కోల్ వంటివి దిగుమతి చేసుకోబోతున్నట్లు స్పష్టంచేసింది. రష్యా నుంచి ప్రత్యక్ష లేదా పరోక్ష చమురు దిగుమతులను భారత్ నిలిపివేస్తుందని తాము ఆశిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఒకవేళ రష్యా నుంచి ఎప్పటిలాగే చమురు కొంటున్నట్లు తేలితే భారత్పై మరోసారి 25 శాతం అదనపు సుంకాలు విధించడంతోపాటు మరికొన్ని ఆంక్షలు ఉంటాయని కార్యనిర్వాహక ఉత్తర్వులో తేలి్చచెప్పడం గమనార్హం. భారత్, రష్యాల మధ్య చమురు వాణిజ్యంపై నిఘా వేస్తామని అమెరికా సర్కార్ వెల్లడించింది. అతిపెద్ద మార్కెట్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జెమీసన్ గగ్రీర్ హర్షం వ్యక్తంచేశారు. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య బంధం మరింత బలపడుతుందని చెప్పారు. అమెరికా ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుందని, దానివల్ల తమ పరిశ్రమలు, కారి్మకులకు మేలు జరుగుతుందని చెప్పారు. భారత్తో ఈ ఒప్పందం విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం గత ఏడాది ఇండియాపై 25 శాతం సుంకాలతోపాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతీకారంగా 25 శాతం అదనపు సుంకాలు విధించింది. మొత్తం సుంకాలు 50 శాతానికి చేరుకోవడంతో భారత్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. భారత ఎగుమతిదారులు నష్టాలు చవిచూశారు. భారత ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ అమెరికా. మధ్యంతర ఒప్పందంతో మొత్తం సుంకాలు ఏకంగా 18 శాతానికి దిగిరావడం భారీ ఊరటగా చెప్పుకోవచ్చు. భారత్ నుంచి వ్రస్తాలు, తోలు ఉత్పత్తులు, చెప్పులు, ప్లాస్టిక్, రబ్బర్, ఆర్గానిక్ రసాయనాలు, ఇంటి అలంకరణ సామగ్రి, కొన్ని రకాల యంత్రాలు, హస్త కళాకృతుల ఎగుమతులు ఇక ఊపందుకోనున్నాయి. భారత జనరిక్ ఫార్మాస్యూటికల్స్, రత్నాలు, వజ్రాలపై టారిఫ్లను రద్దు చేస్తామని అమెరికా తెలియజేసింది. మనకు భారీ ప్రయోజనం → 44 బిలియన్ డాలర్ల ఎగుమతులపై సున్నా సుంకాలు → కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం వల్ల మన దేశానికి భారీగా ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టంచేశారు. మన దేశం నుంచి 44 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతులపై ఎలాంటి సుంకాలు ఉండవని తెలిపారు. సున్నా టారిఫ్లు అమలవుతాయని అన్నారు. శనివారం ఒప్పందం ఖరారైన తర్వాత పీయూష్ గోయల్ స్పందించారు. లేబర్ ఇంటెన్సివ్ రంగాలకు సంబంధించిన వ్రస్తాలు, తోలు, పాదరక్షలు, హస్త కళాకృతుల ఎగుమతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని వెల్లడించారు. 2030 నాటికి అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పారదర్శకమైన, సమతూకంతో కూడిన ఒప్పందానికి వచ్చామని స్పష్టంచేశారు. మన జనరిక్ ఫార్మాస్యూటికల్స్, ఎయిర్క్రాఫ్ట్, ఆటో విడిభాగాలకు సైతం జీరో టారిఫ్ వర్తిస్తుందన్నారు. 30 ట్రిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్ మనకు అందుబాటులోకి వస్తుందని వివరించారు. యువత, మహిళలు, నిపుణులకు అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయని స్పష్టంచేశారు. మనదేశంలో కొత్తగా లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. మన రైతులు, మత్స్యకారుల ఉత్పత్తులకు మంచి ధరలు లభిస్తాయన్నారు. వస్త్రాలు, వజ్రాలు, రత్నాలు, యంత్ర విడిభాగాలు, బొమ్మలు, తోలు, పాదరక్షలు, హోమ్ డెకార్, స్మార్ట్ ఫోన్ల పరిశ్రమల వృద్ధికి చక్కటి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై మనం సుంకాలు రద్దు చేయడం గానీ, తగ్గించడం గానీ చేయడం లేదని తేలి్చచెప్పారు. మన రైతాంగం ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని పీయూష్ గోయల్ వివరించారు. మొత్తానికి మధ్యంతర ఒప్పందం వల్ల ‘మేక్ ఇన్ ఇండియా’కు మరింత ఊపు వస్తుందన్నారు. ముఖ్యాంశాలు → భారత ఉత్పత్తులపై సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిపోతాయి. → భారత ఎగుమతిదారుల కోసం 30 ట్రిలియన్ డాలర్ల విలువైన అమెరికా మార్కెట్లోకి ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రధానంగా భారత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ), రైతులకు, మత్స్యకారులకు లాభం చేకూరుతుంది. → ఎగుమతులు పెరిగితే సహజంగానే పరిశ్రమల్లో ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. దానివల్ల యువతకు, మహిళలకు కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. → ఎగుమతులపై ఆధారపడిన భారత్లోని ముఖ్యమైన రంగాలకు మేలు జరుగుతుంది. → సెక్షన్ 232 కింద విమాన విడిభాగాలపై భారత్కు కొన్ని మినహాయింపులు ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది. ఆటో విడిభాగాలపై టారిఫ్ రేట్ కోటా అమలు చేస్తామని తెలిపింది. → అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలు రద్దు చేసే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టంచేసింది. తమ రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడబోమని ప్రకటించింది. → ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసే నాన్–టారిఫ్ అవరోధాలను, డిజిటల్ ట్రేడ్ అవరోధాలను పరిష్కరించుకుంటామని భారత్, అమెరికా తెలిపాయి. → గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు సహా టెక్నాలజీ ఉత్పత్తుల వాణిజ్యాన్ని మరింత పెంచుకుంటామని వెల్లడించాయి. ఉమ్మడి టెక్నాలజీ సహకారాన్ని ముందుకు తీసుకెళ్తామని ఉద్ఘాటించాయి. అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు నో రిలీఫ్ తమ రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టలేమని, అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులను తమ దేశంలోకి అనుమతించబోమని భారత్ తేల్చేసింది. అమెరికా నుంచి వచ్చే ఆయా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. అమెరికా మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, చీజ్, ఇథనాల్, పొగాకు, కొన్ని రకాల కూరగాయాలు, మాంసంపై సుంకాలు యథాతథంగా వసూలు చేస్తామని, మినహాయింపులేవీ ఉండవని పేర్కొంది. భారత్లో కోట్లాది మంది రైతులు వ్యవసాయ, పాడి పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే. అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తే అవి చౌకగా వచి్చపడే అవకాశం ఉంటుంది. దానివల్ల భారత రైతులు నష్టపోవడం ఖాయం. ఇతర దేశాలతో కుదుర్చుకునే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో మన రైతులు ప్రయోజనాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, పాడి రంగాలే వెన్నెముక అనడం అతిశయోక్తి కాదు.‘మేక్ ఇన్ ఇండియా’ బలోపేతం: మోదీన్యూఢిల్లీ: అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో ‘మేక్ ఇన్ ఇండియా’ బలోపేతం కావడం తథ్యమని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఈ ఒప్పందంతో మనకు నూతన అవకాశాలు వస్తాయన్నారు. రైతులు, వ్యాపారవేత్తలకు మేలు జరుగుతుందని, యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఈ మేరకు మోదీ శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. భారత్, అమెరికాల మధ్య సంబంధాల బలోపేతం కోసం వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్యంతర ఒప్పందం రెండు దేశాలకు ఒక గొప్ప శుభవార్త అని పేర్కొన్నారు. భారత్, అమెరికాల భాగస్వామ్యంలో లోతైన విశ్వాసానికి ఇదొక ప్రతీక అని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ భాగస్వామ్యం మరింత బలపడుతుందన్నారు. సప్లై చెయిన్లకు ప్రోత్సాహం లభిస్తుందని, ప్రపంచానికి సైతం ఆర్థికంగా మేలు జరుగుతుందని మోదీ వివరించారు. మన ప్రజల సాధికారత, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇతర దేశాలతో ఒప్పందాలు, భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఉమ్మడి ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. -
నా పార్టీ వాళ్లే తిట్టినా సరే.. సారీ చెప్పను
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన మొండితనం ప్రదర్శించారు. మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్లీలను కించపరుస్తూ చేసిన పోస్ట్ను సమర్థించుకునే రీతిలో మాట్లాడారు. ఈ క్రమంలో క్షమాపణలు చెప్పాలన్న సొంత పార్టీ నేతల డిమాండ్ను ఆయన తోసిపుచ్చారు.శనివారం ఎయిర్ ఫోర్స్ వన్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జర్నలిస్టులతో మాట్లాడారు. ‘‘ఆన్లైన్లో పెట్టిన వీడియో క్లిప్లోని ఒక భాగాన్ని నేను ముందే చూశా. కానీ, మొత్తం వీడియోను చూడలేదు. 2020 ఎన్నికల మోసానికి సంబంధించిన పోర్షన్ మాత్రం చూశాను. సాధారణంగా నేను ఏ వీడియో అయినా సరే నా సిబ్బందికి ఇస్తా. వారు మొత్తం క్లిప్ను పరిశీలించి పోస్ట్ చేస్తారు. కానీ ఈసారి ఎవరూ చూడకపోయి ఉంటారు’’ అని వ్యాఖ్యానించారు.డెమొక్రట్లతో పాటు రిపబ్లికన్లూ ట్రంప్ క్షమాపణలు కోరాలని చేస్తున్న డిమాండ్పై ట్రంప్ స్పందిస్తూ.. నేను వేలాది విషయాలు చూస్తుంటా. ఏ తప్పూ చేయలేదు. ఇంక క్షమాపణలు ఎందుకు చెప్పడం అని అన్నారాయన.గురువారం రాత్రి ట్రంప్ తన ట్రూత్ సోషల్లో నిమిషం నిడివి ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. అందులో ది లయన్ స్లీప్స్ టునైట్ అనే పాట బ్యాక్డ్రాప్లో వినిపిస్తుంటే.. ఒబామా జంటను అవమానించినట్లు(కోతులతో పోలుస్తూ) కంటెంట్ ఉంది. తీవ్ర విమర్శలు రావడంతో.. ప్రెస్ సెక్రటరీ కరోలీనా లెవిట్ట్ స్పందించారు. మీమ్ వీడియోను పోస్ట్ చేయడంలో తప్పేంటి? అని సమర్థించుకున్నారు.ఆ ఏఐ వీడియోపై డెమొక్రట్లే కాదు.. రిపబ్లికన్లు కూడా తీవ్రంగా స్పందించారు. అది జాత్యాంహకారాన్ని సూచించేలా ఉందని.. తక్షణమే తొలగించి అధ్యక్షుడు క్షమాపణలు చెప్పాలని రిపబ్లికన్ సెనేటర్ టిమ్ స్కాట్ డిమాండ్ చేశారు. ఫేక్ అయినా కూడా అలాంటివి చేయడం సరికాదని సౌత్ కరోలీనా రిపబ్లికన్ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే 12 గం. తర్వాత ఆ వీడియోను టైం లైన్ నుంచి గాయబ్ అయ్యింది. వైట్హౌజ్ ఆ పోస్ట్పై వివరణ ఇస్తూ.. పొరపాటున అది పోస్ట్ అయ్యిందని.. అందుకే తొలగించామని పేర్కొంది.2020 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఎన్నికల్లో మోసాలు జరిగాయని.. డొమీనియన్ వోటింగ్ సిస్టమ్స్(Dominion Voting Systems) ద్వారా ఓట్లు దొంగిలించబడ్డాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే డెమొక్రటిక్ నేత అయిన ఒబార్ ఒబామాను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఇదే కాదు.. గతంలో ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి రావడంపైనా ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటోడికి ఇచ్చి.. తనకు ఎందుకు ఇవ్వలేదంటూ నోబెల్ పీస్ కమిటీని ఆయన తిట్టిపోశారు కూడా. -
ఇది భారత్ వ్యూహాత్మక ముందడుగేనా?
ఎట్టకేలకు భారత్ మరో ముందడుగు వేసింది. ఎప్పట్నంచో అమెరికాతో ఏర్పడిన సందిగ్థతకు ఓ ముగింపు ఇచ్చింది. భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై విధించిన అదనపు 25 శాతం సుంకాలను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం వెనుక భారత్ వ్యూహాత్మక ముందడుగు వేసింది. రష్యా చమురు కొనుగోలును నిలిపివేస్తామని భారత్ హామీ ఇచ్చిన నేపథ్యంలో అమెరికా సుంకాల ఆంక్షలను తగ్గించింది. మరి ఇది రష్యాతో వాణిజ్య స్నేహంపై ఏమైనా ప్రభావం చూపుతుందా? అనేది ఇప్పుటు హాట్ టాపిక్గా మారింది. రష్యాతో స్నేహంపై ప్రభావం ఎంత?రష్యా చమురు కొనుగోలుకు సంబంధించి భారత్పై విధించిన ఆంక్షల నడుమే ట్రంప్ సుంకాలను తగ్గించారు. అయితే ఇది రష్యాతో సంబంధాలపై ఎంతవరకూ ప్రభావం చూపుతుందనే అనుమానం కూడా మరొకవైపు మొదలైంది. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా ఆంక్షలకు భారత్ కట్టుబడటంతో ఓ డైలమా ఏర్పడింది. ఇక రష్యాతో భారత్ సంబంధాలు చెడిపోయినట్లేనా అనే వాదన తెరపైకి వచ్చింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వచ్చిన సమయంలో కూడా చమురు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తుందని కూడా చెప్పకొచ్చారు. అయితే ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితుల్లో రష్యా చమురును చేయడం కష్టమేనా? అంటే అవుననక తప్పదు. అయితే కేవలం చమురు అంశమే భారత్-రష్యాల స్నేహంపై ప్రభావం చూపదని విశ్లేషకులు అంటున్నారు. రష్యాతో భారత్కు చాలా వాణిజ్య ఒప్పందాలున్నాయని, కేవలం చమురు అంశం పక్కకు వెళ్లిపోయినంత మాత్రాన ఈ ఇరు దేశాల సుదీర్ఘ స్నేహ బంధం ఎక్కడికి పోదని అంటున్నారు. భారత్కు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారుభారత్కు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారు అనే విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. భారత్ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంలో రష్యా ప్రధాన పాత్ర పోషిస్తూనే ఉంది. ఇప్పుడు భారత్పై అమెరికా ఆంక్షలు చమురుపై మాత్రమే. అంటే చమురును మాత్రమే రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయదన్నమాట. భారత్కు ఫైటర్ జెట్లు, ట్యాంకులు, మిసైల్ సిస్టమ్స్ వంటి పరికరాల్లో రష్యా కీలక భాగస్వామి. భారత్ స్వదేశీ ఉత్పత్తి పెంచుతున్నప్పటికీ, రష్యా టెక్నాలజీపై ఆధారపడటం కొనసాగుతూనే ఉంది. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ ఉత్పత్తులు వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం పెంపు దిశగా సాగుతున్నాయి. జరుగుతున్నాయి. ఇప్పటికే భారత్కు రష్యా ఎరువు, లోహాలు సరఫరా కూడా చేస్తోంది. ఇలా అమెరికా, యూరప్ ఒత్తిళ్ల మధ్య భారత్ తన వ్యూహాత్మక స్వతంత్రతను కాపాడుకుంటూ, రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాతో కుదిరిన డీల్ భారత్ వ్యూహాత్మక ముందడుగానే చెప్పుకోవచ్చనేది విశ్లేషకుల అంచనా. ఇది సమతుల్య వ్యూహమేనని వారు అంటున్నారు.పూర్తిగా ఆపిసినట్లేనా..?రష్యా నుంచి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చమురు కొనుగోలు చేయకూడదనేది అమెరికా ఆంక్షలు. అంటే సాంక్షన్డ్ ఎంటిటీస్( ఆంక్షలు ఉన్న సంస్థలు), నాన్ -సాంక్షన్డ్ ఎంటిటీస్(ఎటువంటి ఆంక్షలు లేని సంస్థలు) అనే వాదన కూడా ఇక్కడ తెరపైకి వచ్చింది. రష్యాలోని ఆంక్షలున్న సంస్థల నుంచి మాత్రమే చమురు కొనుగోల చేయకూడదా.. లేక ఎటువంంటి ఆంక్షలు లేని సంస్థల నుంచి కూడా చమురు కొనుగోలు చేయకూడదా అనేది ప్రస్తుతం కాస్త డైలమాలోనే ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్నప్పుడు ఈ రెండింటి కింద కూడా చమురు కొనుగోలు చేయకూడదనే విషయం అర్థమవుతున్నా ఇక్కడ పూర్తిగా క్లారిటీ లేదు. ఇదిలా ఉంచితే, భారత్-రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలు చారిత్రాత్మకంగా బలంగా ఉన్నప్పటికీ, గత రెండు మూడేళ్లుగా ప్రాపంచిక పరిస్థితుల కారణంగా కొంత అనిశ్చితి ఏర్పడింది. అయితే 2025 చివర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించిన నేపథ్యంలో సంబంధాలు మళ్లీ చురుకుగా మారాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అమెరికా ఆంక్షలతో రష్యా చమురును భారత్ కొనుగోలు చేయకుండా ట్రంప్ చేసినప్పటికీ, రష్యాతో ఉన్న పలు వాణిజ్య సంబంధాలపై ఇది ఎటువంటి ప్రభావం చూపదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది భారత్ అమలు చేస్తున్న వ్యూహాత్మక ముందడుగుగానే చూడాలని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అమెరికాతో ఎంత వరకూ అవసరముందో అంతవరకూ, రష్యాతో ఏమి అవసరమో వాటిని మాత్రమే పటిష్టం చేసుకునేలా భారత్ సమతుల్య వాణిజ్యాన్ని కొనసాగించడానికి వేసిన ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.ఇదీ చదవండి:ట్రంప్ సుంకాలు.. భారత్కు భారీ ఊరట -
‘మేక్ ఇన్ ఇండియా’కు గ్లోబల్ బూస్ట్: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారతదేశం- అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పంద ముసాయిదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. శనివారం న్యూఢిల్లీలో ఈ కీలక పరిణామాన్ని ప్రకటించిన ఆయన ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి, బంధానికి ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపిస్తున్న చొరవను, నిబద్ధతను మోదీ ఈ సందర్భంగా కొనియాడారు.ఈ వాణిజ్య ఒప్పందం భారతీయ ఆర్థిక వ్యవస్థకు, ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి మరింత ఊతాన్నిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు లభించడంతో స్థానిక పరిశ్రమలు ప్రపంచ స్థాయికి ఎదుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశీయంగా తయారయ్యే వస్తువులకు అంతర్జాతీయ గుర్తింపు లభించడమే కాకుండా, విదేశీ ఎగుమతులు పెరుగుతాయన్నారు. ఈ నూతన ఒప్పందం ద్వారా రైతులకు, పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ ఆవిష్కర్తలకు భారీ ప్రయోజనం చేకూరనుందని ప్రధాని పేర్కొన్నారు. Great news for India and USA! We have agreed on a framework for an Interim Trade Agreement between our two great nations. I thank President Trump for his personal commitment to robust ties between our countries.This framework reflects the growing depth, trust and dynamism of… https://t.co/zs1ZLzamhd— Narendra Modi (@narendramodi) February 7, 2026అమెరికాతో సులభతర వాణిజ్యం వల్ల గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడమే కాకుండా, చిన్న తరహా పరిశ్రమలు తమ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకుండా, దేశంలో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ప్రధానంగా దేశంలోని యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి మార్గాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు దోహదపడుతుందని అన్నారు. ఇది చారిత్రక ఒప్పందం: పీయూష్ గోయల్భారతదేశం- అమెరికా మధ్య కుదిరిన తాజా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక సంబంధాల్లో మైలురాయిగా నిలవనుందని, ప్రధాని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఈ ఒప్పంద ముసాయిదా ఖరారైనట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ స్థాయిలో అపారమైన అవకాశాలు లభించనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
భారత్, అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు
-
ట్రంప్ సుంకాలు: భారత్కు భారీ ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాల విషయంలో భారత్కు భారీ ఊరట లభించింది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల విషయంలో నెలకొన్న వివాదానికి తెరదించుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై విధించిన అదనపు 25 శాతం సుంకాలను రద్దు చేస్తూ శుక్రవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. రష్యా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిన నేపథ్యంలో ఈ వాణిజ్య ఒప్పందం కుదిరింది. శనివారం తెల్లవారుజాము నుంచే ఈ సుంకాల రద్దు అమలులోకి రానుంది.ఈ ఒప్పందంలో భాగంగా భారత్ ఇకపై అమెరికా ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది. రాబోయే పదేళ్ల కాలానికి అమెరికాతో రక్షణ సహకారాన్ని విస్తృతం చేసేలా ఒక కీలక ఫ్రేమ్వర్క్కు భారత్ అంగీకారం తెలిపింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కారణంగా ఇరు దేశాల మధ్య గత కొద్ది నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజా ఒప్పందంతో ఈ సమస్యలకు పరిష్కారం లభించడమే కాకుండా, ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది.రాబోయే ఐదేళ్లలో అమెరికా నుంచి సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, విమానాలు, విమాన విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్ను భారత్ కొనుగోలు చేయనుంది. దీనికి ప్రతిగా విమానాలు, వాటి విడిభాగాలపై విధిస్తున్న సుంకాలను కూడా అమెరికా తొలగించనుంది. గత ఏడాది చివరలో భారత ఉత్పత్తులపై దాదాపు 50 శాతంగా ఉన్న సుంకాలు, ఈ కొత్త ఒప్పందంతో గణనీయంగా తగ్గి 18 శాతానికి చేరుకున్నాయి.తాజా సుంకాల తగ్గింపుతో పొరుగు దేశాల కంటే భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో స్వల్ప ప్రయోజనం చేకూరనుంది. ఇతర దేశాలపై 19 నుంచి 20 శాతం సుంకాలు ఉండగా, భారత్కు అది 18 శాతానికి తగ్గింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన ‘గొప్ప స్నేహితులలో ఒకరు’ అని అభివర్ణించిన ట్రంప్, ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తానని హామీ ఇచ్చిన దరిమిలా ఈ సానుకూల నిర్ణయం సాధ్యమైందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.ఇది కూడా చదవండి: రంజాన్ 2026: సౌదీ అరేబియా కీలక ప్రకటన -
అమెరికా, బంగ్లా మధ్య సీక్రెట్ డీల్.. భారత్ కారణమా?
భారత్ పొరుగు దేశంలో బంగ్లాదేశ్లో ఎన్నికల వేళ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులపై దాడుల కారణంగా భారత్, బంగ్లా మధ్య ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితులు ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరోవైపు.. భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్.. యూనస్ ప్రభుత్వాన్ని టెన్షన్కు గురిచేస్తోంది. ఈ డీల్తో బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ దేశంలో ప్రత్యేకంగా టెక్స్టైల్, రెడీమేడ్ గార్మెంట్స్ రంగంపై ఈ ప్రభావం చూపించడమే ఇందుకు కారణం. ఇలాంటి తరుణంలో యూనస్ సర్కార్.. అమెరికాతో చేసుకున్న సీక్రెట్ డీల్ ఇప్పుడు బంగ్లాలో హాట్ టాపిక్గా మారింది.అయితే, ఎన్నికల ముందు, తమ పదవీకాలం ముగియబోతున్న సమయంలో యూనస్ సర్కార్ ట్రంప్తో సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. బంగ్లాదేశ్లోని ప్రముఖ పత్రిక ‘ప్రథమ్ ఆలో’ ప్రకారం.. బంగ్లా, అమెరికా మధ్య ఒప్పందం గురించి బహిరంగంగా ఏ సమాచారం బయటకు రాలేదు. యూనస్ ప్రభుత్వం ఇప్పటికే అమెరికాతో ఒక నాన్-డిస్క్లోజర్ ఒప్పందం సైన్ చేసింది. అందుకే ఈ ట్రేడ్ డీల్ ముసాయిదా ప్రజలకు తెలియడం లేదు. అంటే ప్రభావితమయ్యే పరిశ్రమలకు కూడా అసలు షరతులు ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ డీల్లో అసలు ఇందులో ఏముంది? ఎవరి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నారు? అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. యూనస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నికల ద్వారా ఎన్నుకోలేదు. ఇది తాత్కాలిక ప్రభుత్వం. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి ఇలాంటి కీలక ఒప్పందం చేసే నైతిక హక్కు ఉందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.కాగా, ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ కేవలం మూడు రోజుల ముందు, అంటే ఫిబ్రవరి 9న అమెరికా–బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్పై సంతకాలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. యూనస్ ప్రభుత్వం ఇంత తొందరగా అమెరికాతో ఒప్పందం ఎందుకు చేయాలనుకుంటోంది? అనే ప్రశ్న ఎదురైంది. కాగా, 2025 ఏప్రిల్లో ట్రంప్ 100 దేశాలపై టారిఫ్ ప్రకటించినప్పుడు, బంగ్లాదేశ్పై 37 శాతం సుంకాలు విధించారు. అనంతరం, జూన్లో నాన్-డిస్క్లోజర్ ఒప్పందం సైన్ చేయడంతో చర్చలు రహస్యమయ్యాయి. జూలైలో టారిఫ్ 35 శాతానికి, ఆగస్టులో 20 శాతానికి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్టు బంగ్లాదేశ్ వాణిజ్య శాఖ చెబుతోంది.ఈ నేపథ్యంలో యూనస్ ప్రభుత్వం సీక్రెట్ ఒప్పందంపై టెక్స్టైల్, గార్మెంట్ తయారీదారులు, సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. తమతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఈ ప్రక్రియ సాగుతుండటం ఆందోళనకు గురి చేస్తోందని గార్మెంట్ తయారీదారుల సంఘం నేతలు అంటున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి ఒప్పందాలు చేయడం భవిష్యత్తులో పెద్ద సమస్యలు తెస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ మొత్తం ఎగుమతుల్లో 90 శాతానికి పైగా ఇదే రంగం ఆధారంగా ఉంది. ఇప్పటికే ట్రంప్ విధించిన భారీ టారిఫ్ల వల్ల వస్త్ర పరిశ్రమ నష్టపోయింది. ఇప్పుడు మరోసారి అమెరికాతో ఏవో షరతులతో ఒప్పందం జరిగితే, లక్షలాది మందికి ఉపాధి ఇచ్చే ఈ రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అలా జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో అమెరికా చేతిలో బంగ్లాదేశ్ జుట్టు అంటూ ఆ దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.మరోవైపు.. సీక్రెట్ ఒప్పందంపై బంగ్లాదేశ్ ప్రముఖ ఆర్థికవేత్త అనూ మహమ్మద్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు ముందు పోర్టులను లీజుకు ఇవ్వడం, ఆయుధాలు దిగుమతి చేయడం, అమెరికాతో తలవంచే ఒప్పందాలు చేసుకోవడం ఇవన్నీ ఎందుకు ఇంత తొందరగా ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఈ ఒప్పందాలు పారదర్శకంగా లేవని, అవాస్తవంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. విదేశీ లాబీలు యూనస్ ప్రభుత్వంలోకి ప్రవేశించి, ఎలాగైనా ఈ ఒప్పందాలు జరిగేలా చూస్తున్నాయని బాంబు పేల్చారు. అయితే, ఈ డీల్పై ఇటీవల వచ్చిన కొన్ని నివేదికలు ఈ అనుమానాలకు మరింత బలం ఇస్తున్నాయి. 2024లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చిన పరిణామాల వెనుక ఇస్లామిక్ శక్తులతో పాటు అమెరికా ‘డీప్ స్టేట్’ మద్దతు ఉందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఆ తర్వాతే యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే ప్రభుత్వం అమెరికాతో రహస్య ఒప్పందం చేయబోతుండటంతో అనుమానాలు పెరుగుతున్నాయి.వివాదాస్పద అంశాలు..పారదర్శకత లోపం: ఒప్పందం వివరాలు ప్రజలకు, పార్లమెంట్కు తెలియజేయలేదు.అనుమానాలు : ఎన్నికల ముందు తాత్కాలిక ప్రభుత్వం దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ఆర్థిక ప్రభావం: ఎగుమతిదారులు, ఆర్థిక నిపుణులు దీని వల్ల బంగ్లాదేశ్ దీర్ఘకాలికంగా అమెరికా వాణిజ్య విధానాలకు బంధించబడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వస్త్ర పరిశ్రమపై ప్రభావం..అమెరికా మార్కెట్ ఆధారపడటం: బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 90% వస్త్రాలు, అందులో ఎక్కువ భాగం అమెరికాకు వెళ్తుంది. కొత్త ఒప్పందం వల్ల 20% టారిఫ్ స్థిరపడింది. ఇది భారతదేశం (25%), వియత్నాం (21%), పాకిస్తాన్ (19%)తో పోలిస్తే పోటీ స్థాయిలో ఉంది.పోటీ సామర్థ్యం: టారిఫ్ తగ్గడం వల్ల అమెరికా మార్కెట్లో బంగ్లాదేశ్ వస్త్రాలు మరింత పోటీగా నిలుస్తాయి.ఉద్యోగ భద్రత: అమెరికా మార్కెట్లో డిమాండ్ పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరగవచ్చు.వేతన ఒత్తిడి: తక్కువ ధరల పోటీ కొనసాగించడానికి తక్కువ వేతనాలు, ఎక్కువ పని గంటలు కొనసాగవచ్చు.సామాజిక ప్రభావం: కార్మికుల హక్కులు, భద్రతా ప్రమాణాలు అంతర్జాతీయ ఒత్తిడితో మెరుగుపడే అవకాశం ఉంది. కానీ తాత్కాలికంగా ఉత్పత్తి ఒత్తిడి పెరుగుతుంది. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ అమెరికా మార్కెట్లో దీర్ఘకాలికంగా స్థిరపడే అవకాశం ఉంది. -
ఎయిర్ ఫోర్స్ వన్లో నిద్రపోను.. నవ్వులు పూయించిన ట్రంప్
ఎయిర్ ఫోర్స్ వన్ ప్రయాణాలపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్లో నేను నిద్రపోను. కిటికీలోంచి క్షిపణుల కోసం చూడటమే నా పని. క్షిపణులొస్తున్నాయేమో గమనిస్తానని ట్రంప్ అన్నారు. ‘నేషనల్ బ్రేక్ఫాస్ట్ ప్రేయర్' కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.20 గంటల సుదీర్ఘ ప్రయాణంలో కూడా తాను అసలు నిద్రపోనంటూ చెప్పుకొచ్చారు. "నేను కిటికీలోంచి బయటకు చూస్తూ క్షిపణులు(missiles), శత్రువుల కోసం వెతుకుతుంటానంటూ ఆయన వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు పూశాయి. నిద్ర తక్కువ.. కబుర్లు ఎక్కువడొనాల్డ్ ట్రంప్ తనకు నిద్ర చాలా తక్కువని గతంలో కూడా చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. 2016 ఎన్నికల ప్రచారంలో తాను రోజుకు కేవలం 3 నుండి 4 గంటలు మాత్రమే నిద్రపోతానని, ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉంటానని చెప్పారు.అలాగే.. 2019లో ఒక వైట్ హౌస్ అధికారి సీఎన్ఎన్తో మాట్లాడుతూ.. అధ్యక్షుడితో ప్రయాణించడం అంటే ‘బందీగా ఉండటం’ లాంటిదని వ్యాఖ్యానించారు. ట్రంప్ నిద్రపోవడానికి బదులుగా.. గంటల తరబడి సిబ్బందితో కబుర్లు చెబుతుంటారని, ప్రభుత్వ విషయాలే కాకుండా క్రీడల గురించి కూడా చర్చిస్తారని ఆయన తెలిపారు.ఎయిర్ఫోర్స్ వన్.. ప్రత్యేకత ఏంటంటే..అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఏ విమాన్నయినా ఎయిర్ఫోర్స్ 1 అనే పిలుస్తారు. ఈ విమానానికి ఎలాంటి అణుబాంబులనైనా తట్టుకునే సామర్థ్యం ఉంది. దాడి జరిగే అవకాశం ఉందని ఉప్పందితే చాలు మొబైల్ కమాండ్ సెంటర్గా మారుతుంది. నాలుగు జెట్ ఇంజిన్స్తో ఈ విమానం నడుస్తుంది. గంటకి వెయ్యి కి.మీ కంటే అధిక వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 70 మంది వరకు ప్రయాణించవచ్చు. గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సౌకర్యం ఈ విమానానికి ఉండడం ప్రత్యేకత. దీంతో ఎంతసేపైనా ప్రపంచం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చుట్టేయగలదు.విమానం లోపల విస్తీర్ణం 4 వేల చదరపు అడుగులు ఉంటుంది. మూడు అంతస్తుల్లో ఈ –విమానాన్ని తయారు చేశారు. వైట్ హౌస్లో ఉన్న సదుపాయాలన్నీ ఇందులో ఉంటాయి. అధ్యక్ష కార్యాలయం, జిమ్, కాన్ఫరెన్స్ గది, డైనింగ్ రూమ్, అత్యాధునిక సమాచార వ్యవస్థ, సిబ్బంది ఉండేందుకు లాంజ్ సహా సకల సౌకర్యాలు ఉంటాయి. ఒకేసారి 100 మందికి వంట చేసే సదుపాయం కూడా ఉంది. ప్రయాణ సమయంలో ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే అధునాతన వైద్య పరికరాలతో మినీ ఆస్పత్రి, అందుబాటులో వైద్యుడు ఉంటారు. -
అమెరికా పవర్ఫుల్ కంట్రీ.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా రక్షణ రంగాన్ని ఎప్పుడూ లేని స్థాయిలో బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో న్యూ స్టార్ట్ అణు ఆయుధ నియంత్రణ ఒప్పందంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సోషల్ మీడియా ట్రుత్ వేదికగా స్పందిస్తూ..‘అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం. నా ఫస్ట్ టర్మ్లోనే మిలిటరీని పూర్తిగా అత్యున్నతంగా తీర్చి దిద్దాను. కొత్త అణ్వాయుధాలు అభివృద్ధి చేశాం. పాత వాటిని రీఫర్బిష్ చేశాం. దేశ రక్షణ రంగాన్ని ఎప్పుడూ లేని స్థాయిలో బలోపేతం చేస్తున్నామన్నారు. అమెరికా సైనిక శక్తి, అణ్వాయుధ సామర్థ్యం గొప్పది. అమెరికా స్పేస్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం మా ప్రభుత్వ పెద్ద నిర్ణయం. అంతరిక్ష భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ చర్య అమెరికా రక్షణ వ్యవస్థను మరింత బలపరిచింది. భవిష్యత్ యుద్ధాలు భూమి మీదే కాకుండా అంతరిక్షంలోనూ జరుగుతాయని, అందుకే స్పేస్ ఫోర్స్ కీలకం’ అని పేర్కొన్నారు.యూఎస్ నౌకా దళంపై..నౌకాదళ విభాగంపై కూడా ట్రంప్ ప్రత్యేకంగా మాట్లాడారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సేవలందించిన ఐవా, మిస్సోరీ, అలబామా వంటి యుద్ధనౌకల కంటే 100 రెట్లు శక్తిమంతమైన ఆధునిక బ్యాటిల్షిప్లను నిర్మిస్తున్నామని తెలిపారు. సముద్ర రక్షణను మరింత పటిష్టం చేయడమే తమ లక్ష్యమన్నారు.భారత్, పాక్పై పాత పాటే.. ఇక అణు యుద్ధాల అంశంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేకెత్తించాయి. భారత్-పాకిస్తాన్, ఇరాన్ ఇజ్రాయెల్, రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యే సమయంలో అణు ఘర్షణలు తలెత్తకుండా తానే జోక్యం చేసుకుని ఆపానని తెలిపారు. అయితే యుద్ధాలకు సంబంధించి స్పష్టమైన వివరాలు మాత్రం ఇవ్వలేదు. అదేవిధంగా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా ట్రంప్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో అమెరికా మధ్యవర్తిత్వం చేసిందని చెప్పారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు గత ఏడాది నుంచి కృషి చేస్తున్నానని, అర్మేనియా- అజర్బైజాన్ మధ్య దీర్ఘకాల ఘర్షణను కూడా పరిష్కరించానని పేర్కొన్నారు.అణు నియంత్రణపై.. ఇక న్యూ స్టార్ట్ అణు ఆయుధ నియంత్రణ ఒప్పందంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం సరైన విధంగా చర్చించకుండా కుదిరిందని, అమెరికాకు అనుకూలంగా లేదని విమర్శించారు. అంతేకాకుండా ఇది ఉల్లంఘనలకు గురవుతోందని ఆరోపించారు. దీనిని పొడిగించడానికి బదులుగా కొత్త, మెరుగైన, ఆధునిక ఒప్పందాన్ని రూపొందించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అమెరికా అణు నిపుణులు కలిసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఒప్పందం రూపొందించాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక భద్రతను కల్పించే విధంగా సమగ్ర అణు నియంత్రణ వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. -
పుతిన్, ట్రంప్తో జిన్పింగ్ మాటామంతి
బీజింగ్: చైనా అధినేత జిన్పింగ్ బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడిన కొన్ని గంటల వ్యవధిలోనే ట్రంప్తో సంభాషించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా, రష్యా సంబంధాలపై పుతిన్తో జిన్పింగ్ విస్తృతంగా చర్చించారు. ఈ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒక ‘గ్రాండ్ ప్లాన్’ను పుతిన్ ప్రతిపాదించారు. గత ఏడాది నవంబర్ తర్వాత జిన్పింగ్, పుతిన్ ఫోన్లో మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. ఇటీవలి కాలంలో చైనా, జపాన్ సంబంధాలు దెబ్బతింటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్తో సంభాషణ చర్చనీయాంశంగా మారింది. పుతిన్తో, ట్రంప్తో జిన్పింగ్ ఒకేరోజు మాట్లాడడం అత్యంత అరుదైన ఘటన. అయితే, ట్రంప్తో ఏం చర్చించారన్నది తెలియరాలేదు. దీనిపై చైనా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. రష్యా, అమెరికాల మధ్య 2010లో కుదిరిన అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందం గడువు గురువారం ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కొత్త ఒప్పందాన్ని ప్రతిపాదించారు. ఇందులో చైనా భాగస్వామిగా మారాలని కోరుతున్నారు. అందుకు చైనా అంగీకరించడం లేదు. -
ట్రంప్నే బెంబేలెత్తించింది.. భారత్ విజయ రహస్యం ఇదే!
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే అక్కసుతో భారత్పై భారీగా సుంకాలు మోపిన అమెరికా.. ఉన్నఫళంగా ఎందుకు దిగివచ్చింది? ఏకపక్షంగా సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా భారత్తో డీల్ కుదిరిందని, ట్యాక్స్లను 18 శాతానికి తగ్గించామని ఎందుకు ప్రకటించారు?? బెదిరింపులతో లొంగదీసుకుందామని ట్రంప్ భావిస్తే.. ఏకు మేకై కూర్చుంటామంటూ పలు దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం అమెరికా తల వంచిందా?ఐరోపా సమాఖ్యతో స్వేచ్ఛాయుత వాణిజ్యంపై భారత్ కుదుర్చుకున్న డీల్ ఇప్పుడు ట్రంప్ మెడలను వంచిందా? బంగారం ధరలు మొదలు.. పలు దేశాల షేర్ మార్కెట్లను మాటలతో శాసిస్తున్న ట్రంప్ వెనక్కి తగ్గడానికి కారణాలేంటి?? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే..! అహింసామార్గంలో.. శాంతియుతంగా ఎదుటివారి మెడలు వంచేలా చేయడం భారత్ నైజం..!! ఈ విషయంలో భారత్ వ్యూహాత్మక అడుగులు.. వాటి ఫలితాలను గురించి వివరంగా తెలుసుకోవాలంటే.. చదవాల్సిందే👉అది అనుకున్నంత ఈజీ కాకపోగా..ప్రస్తుత పరిస్థితుల్లో ఒక దేశాన్ని ఓడించాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు..! బాలిస్టిక్ మిసైల్స్.. యుద్ధ విమానాలతో విరుచుకుపడాల్సిన పని లేదు..! ఆంక్షల ఛట్రంలో ఆ దేశాన్ని బంధించి, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు రద్దయ్యేలా చేస్తే చాలు..! ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే దశలో ఆ దేశాలను దారికి తెచ్చుకోవచ్చు..! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఆడుతున్న మైండ్ గేమ్ ఇదే..! ఇదే మైండ్ గేమ్తో ఎన్నో దేశాలను దారికి తెచ్చుకున్నాడు. భారత్ను కూడా అదే గాడిన కట్టాలనుకున్నాడు. భారత్ ఆత్మగౌరవం ముందు ఓడిపోయాడు. అది అనుకున్నంత ఈజీ కాకపోగా.. అమెరికన్లకే ధరాఘాతంతో శాపంగా మారుతోంది. దీంతో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదుల మెట్లు దిగిరాక తప్పలేదు..!👉ఆ మౌనమే ట్రంప్ను బెంబేలెత్తించింది..భారత్ను దారికి తెచ్చుకోవాలనే తపనతో ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి భారత్ నుంచి ప్రకటనలు లేకున్నా.. తానే భారతీయుల తరఫున ప్రకటనలు చేసుకున్నారు. రష్యా చమురును భారత్ కొనబోదని.. అమెరికా నుంచే కొంటుందని ప్రకటించేసుకున్నారు. అలాంటి ప్రకటనలకు భారత్ తొందరపడి ఏమాత్రం స్పందించలేదు. ‘నో కామెంట్’ అంటూ దాటవేయలేదు. చేసిందల్లా.. మౌనంగా ఉండడమే..! ఆ మౌనమే ఇప్పుడు ట్రంప్ను బెంబేలెత్తించింది. వెనక్కి తగ్గేలా చేసింది. మౌనంగానే భారత్ విజయం సాధించింది.👉జియోపాలిటిక్స్లో మౌనానికి అర్థాలే వేరు..సాధారణంగా మౌనం అర్ధాంగీకారం అంటారు. కానీ, జియోపాలిటిక్స్లో మౌనానికి అర్థాలే వేరు. ఒక పాలసీని అమలు చేయడానికి ముందు.. దానికి సమ్మతిని ఇవ్వడానికి ముందు చేసే ఆలోచనలు, కసరత్తుకు నిదర్శనమే మౌనం అంటారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. 1988లో అమెరికన్ ఆలోచనాపరుడు నోమ్ చోమ్స్కీతోపాటు.. ఆర్థికవేత్త ఎడ్వర్డ్.ఎస్.హెర్మాన్ తమ పుస్తకం ‘ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ద మాస్ మీడియా’లో ఇదే అంశాన్ని నొక్కి వక్కాణించారు. ఆంక్షలు, లేదా యుద్ధాలకు ముందు.. నిరసనను వ్యక్తం చేయకుండా.. విధానాలను సాధారణీకరించేందుకు మౌనం దాల్చడం ఓ రాజనీతి అంటారు. అమెరికా సుంకాల విషయంలో భారత్ పాటించిన మౌనం దీనికి చక్కటి ఉదాహరణ..!👉కన్జూమర్ సైకాలజీ అంటే ఇదే..కొనుగోలుదారులు ఎవరైనా తమకు కావాల్సిన వస్తువు ఎక్కడ చౌకగా దొరుకుతుందో అక్కడే కొంటారు. అది కన్జూమర్ సైకాలజీ. ఈ బేసిక్ నాలెడ్జ్ని కూడా మరిచిపోయిన ట్రంప్ చమురు విషయలో భారత్పై ఒత్తడి తేవాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఇక రాజనీతి విషయానికి వస్తే.. అగ్రదేశాలు అంతగా జియోపాలిటిక్స్ను వంటబట్టించుకోని రోజుల్లోనే మనదేశంలో ద్వాపరయుగంలో విదురనీతి.. ఆధునిక యుగంలో చాణక్యనీతి అమల్లో ఉన్నాయి. భారత్కు రష్యా ముందు నుంచి మిత్ర దేశం. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా ఆంక్షల ఛట్రంలో రష్యా కూరుకుపోయింది.👉భారత్ను దెబ్బతీయాలనుకున్నారు కానీ...ఈ క్రమంలో చౌకగా చమురు అమ్మేందుకు రష్యా సిద్ధమైనా.. అభివృద్ధి చెందుతున్న దేశాలేవీ కొనేందుకు ముందుకు రాలేదు. ఐరోపా దేశాలే రష్యా చమురు కొంటున్న తరుణంలో భారత్ కూడా రష్యాకు అతిపెద్ద వినియోగదారుగా మారింది. ఈ చర్య అటు రష్యాకు, ఇటు భారత్కు లబ్ధి చేకూర్చింది. దీన్ని జీర్ణించుకోలేని ట్రంప్.. సుంకాలతో భారత్ను దెబ్బతీయాలనుకున్నారు. భారత్ తన ప్లాన్-బీని అమలు చేసింది.👉ఊహించని పరిణామం..అంతే.. కొత్త వినియోగదారులను సొంతం చేసుకుంది. ఐరోపా సమాఖ్యతో 19ఏళ్లుగా కలగా ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతకు ముందే.. చైనాకు దగ్గరైంది. ఉప్పు-నిప్పుగా ఉండే తాలిబాన్లను అక్కున చేర్చుకుంది. ఇరాన్తోనూ వాణిజ్య ఒప్పందాలకు సిద్ధమైంది. జీయోపాలిటిక్స్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనే సందేశాన్ని ప్రపంచానికి పంపింది. ఊహించని ఈ పరిణామం అమెరికా మార్కెట్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉండడంతో.. ట్రంప్ వాణిజ్య ఒప్పందంపై ప్రకటన చేయాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.👉భారత్ స్వరం మార్చింది..దౌత్యం విషయంలో భారత వ్యూహాలు మునుపటిలా లేవు. గడిచిన దశాబ్దన్నర కాలంగా వ్యూహప్రతివ్యూహాలు మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు అంతా భగవతేచ్ఛ.. అని భావించే భారత్.. ఇప్పుడు స్వరం మార్చింది. ప్రేమిస్తే.. ప్రాణమిస్తాం.. వంచిస్తే.. కాలరాస్తాం.. ఎక్కడా తగ్గేదే లే.. అని చాటిచెప్పింది. ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో ఈ విషయం స్పష్టమైంది. ఏరంగంలోనైనా శత్రువు ఢీ-అంటే ఢీకొడతామని తేల్చిచెప్పింది.👉ఇంకా చెప్పాలంటే..ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే.. 2019లో ఆంక్షల పేరుతో ఇరాన్, వెనిజెవెలా, భారత్ నుంచి చమురు దిగుమతులను నిలివేశారు. ఆ సమయంలో ఐక్య రాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఉన్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీతో రాయబారాలు నెరిపారు. అప్పటి నుంచే.. భారత్-అమెరికా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు భారత్ ఆత్మనిర్భరతతో ఉందనే విషయాన్ని అమెరికాకు చాటి చెప్పింది. అమెరికా సాధారణంగా తన దారికి తెచ్చుకోవాలనుకునే దేశాలపై ప్రయోగించే సామ, దాన, బేధ, దండోపాయాలకు తాము అతీతమని భారత్ నిరూపించింది. ట్రంప్ మాదిరిగా.. దావోస్లాంటి వేదికను బెదిరింపులకు వినియోగించుకోకుండా.. అసందర్భ ప్రేలాపనలకు పోకుండా.. మౌనం వహించింది. విజయం సాధించింది. -
ఇరాన్–అమెరికా చర్చలకు పాక్
ఇస్లామాబాద్: ఇరాన్–అమెరికాల మధ్య త్వరలో జరిగే చర్చల్లో పాల్గొనాలని పాకిస్తాన్కు ఆహ్వానం అందింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంగళవారం ఈ విషయం వెల్లడించింది. ఇరాన్–అమెరికాల మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చేందుకు, ఒక ఒప్పందానికి వచ్చేందుకు తటస్థ దేశం తుర్కియే వేదికగా త్వరలో చర్చలు జరిగే అవకాశాలున్నాయి.శాంతి ప్రయత్నాలకు మరింత విస్తృతమైన గుర్తింపు, మద్దతు లభించేలా ఇరుగుపొరుగు దేశాలకు కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. విదేశాంగ మంత్రుల స్థాయి చర్చల్లో పాల్గొనాలంటూ సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్టు, ఒమన్, యూఏఈ తదితర దేశాలను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు చేస్తున్న యత్నాలను అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రెండు దేశాల మధ్య వివాదానికి ఇదే ప్రధాన అంశంగా మారింది. తమపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసిన పక్షంలో అణ్వాయుధాల అంశాన్ని వదిలేస్తామని ఇరాన్ అంటోంది. -
మౌనంగానే మెడలు వంచి!
అసలే అతను డొనాల్డ్ ట్రంప్. శత్రువులా, మిత్రులా అన్న తేడా కూడా లేకుండా అన్ని దేశాలనూ హడలెత్తిస్తూ వస్తున్న వ్యక్తి! కఠిన పదజాలంతో కూడిన బెదిరింపులతో, ఎడాపెడా టారిఫ్ల బాదుడుతో వణుకు పుట్టించడాన్నే తన నైజంగా మార్చుకున్నారు. రెండోసారి అధికారం చేపట్టింది మొదలు, ఈ ఏడాది కాలంలో ప్రపంచ దేశాలకు ఒకరకంగా పీడకలలా పరిణమించారు. చివరికి దక్షిణ కొరియా, బ్రిటన్ వంటి అతి సన్నిహిత మిత్ర దేశాలు కూడా ట్రంప్ బెదిరింపులకు జడిసి ఆయన డిమాండ్లకు అనుగుణంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలకు తలొగ్గాల్సి వచ్చింది.ఇలాంటి పరిస్థితుల్లో భారత్ విషయంలో మాత్రం ట్రంప్ హఠాత్తుగా దిగొచ్చిన తీరు ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తోంది. భారత్పై 50 శాతం టారిఫ్లను ఏకంగా 18 శాతానికి తగ్గిస్తున్నట్టు సోమవారం ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. దీన్ని భారత్ సాధించిన ఘన విజయంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో తొలినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రంప్ బెదిరింపులకు తలొగ్గకుండా, మాటల యుద్ధానికి బదులివ్వకుండా సంయమనం పాటిస్తూనే చివరికి మౌనంగానే ఆయన మెడలు వంచారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమ వుతోంది. బెదిరింపులనే తిరుగులేని ఆయుధంగా చేసుకుంటూ గత ఏడాది కాలంలో ట్రంప్ చెలరేగి పోయారు. దేశాధినేతలంతా తాను చెప్పినట్టు వినాలన్న ఒంటెత్తు పోకడ ప్రదర్శించారు. చివరికి నోబెల్ శాంతి పురస్కారానికి తాను అర్హుడినంటూ ప్రకటనలు చేయాల్సిందిగా వారిని ఒత్తిడి చేసే స్థాయికీ వెళ్లారు! పాక్ లాంటి పలు దేశాల అధినేతలు అందుకు తలొగ్గారు కూడా. కానీ మోదీ నుంచి మాత్రం మౌనమే సమాధానమైంది. దాంతో ట్రంప్ ఇగో దెబ్బ తిన్నది కూడా. మోదీ వ్యక్తిగతంగా ఫోన్ చేయనందుకే భారత్తో వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ బాహాటంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పట్టాయి. ప్రధాని మాత్రం వీటిని పట్టించుకోలేదు. అంతేగాక ట్రంప్ బెదిరింపుల ఉచ్చులో పడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.ఒప్పందం విషయమై ట్రంప్ నాలుగుసార్లు స్వయంగా ఫోన్ కాల్స్ చేసినా పట్టించుకోలేదు. ఆయన కారాలు, మిరియాలు నూరుతున్నా లక్ష్యపెట్టకుండా బ్రిటన్, న్యూజిలాండ్, అనంతరం ఒమన్లతో లాభదాయక రీతిలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తద్వారా స్వతహాగా వ్యాపారి అయిన ట్రంప్నే మించిపోయే స్థాయిలో మోదీ వ్యాపార దక్షత ప్రదర్శించారు. ఈ చర్యతో ఆయనను పునరాలోచనలో పడేశారు. ఇక గత నెలలో యూరోపియన్ యూనియన్తో అతి కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని భారత్ ఖరారు చేసుకుంది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత భారీదని కొనియాడుతున్న ఈ డీల్ భారత్పై దూకుడు విషయంలో ట్రంప్కు గట్టిగా బ్రేకులు వేసిందని చెబుతున్నారు.27 దేశాల కూటమి అయిన ఈయూతో కుదిరిన ఈ ఒప్పందం అంతర్జాతీయ వేదికపై భారత స్థాయిని మరింత పెంచింది. ట్రంప్ చపలచిత్తం పుణ్యమా అని ఇతర దేశాల దృష్టిలో అమెరికా శరవేగంగా విశ్వసనీయతను కోల్పోతూ వస్తోంది. అందుకు విరుద్ధంగా భారత్ మాత్రం అత్యంత నమ్మదగ్గ భాగస్వామ్య దేశంగా తన ప్రతిష్టను పెంచుకుంటూ వచ్చింది. పైగా ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ను ఏ దేశమూ ఇప్పుడు తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఇందుకు అమెరికా కూడా మినహయింపు కాదు. అందుకే వ్యవసాయ, పాడి తదితర కీలక రంగాలను అమెరికా పరిశ్రమలకు బాహాటంగా తెరిచేందుకు కరాఖండిగా నిరాకరించి కూడా ఒప్పందానికి ట్రంప్ను భారత్ ఒప్పించగలిగింది! అదే సమయంలో ట్రంప్ ఎంతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ప్రతి వ్యాఖ్యలకు దిగకుండా మోదీ పరిణతి ప్రదర్శించారు. చైనాతో స్నేహ గీతంట్రంప్ దూకుడుకు చెక్ పెట్టే చర్యల్లో భాగంగా వ్యూహాత్మకంగా చైనాకు దగ్గరయ్యేందుకు కూడా భారత్ వెనకాడలేదు. గతేడాది షాంఘై సహకార సమాఖ్య భేటీకి హాజరయ్యేందుకు ఏడేళ్ల అనంతరం మోదీ చైనాలో పర్యటించారు! ఆ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అవి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చివరికి ట్రంప్ కూడా వాటిపై చిర్రబుర్రులాడారు. భారత్, రష్యాలను అమెరికా చివరికి చైనాకు కోల్పోయిందంటూ నిట్టూర్చారు! ఆ తర్వాత రెండు నెలలకే పుతిన్కు ఢిల్లీలో మోదీ రాచమర్యాదలు చేశారు.రష్యాతో పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఇలా పలు అగ్ర రాజ్యాలతో భారత్ వ్యూహాత్మకంగా ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకుంటున్న వైనం కూడా ట్రంప్ను పునరాలోచనలో పడేసింది. భారత్ అక్కడితోనే ఆగలేదు. ట్రంప్ టారిఫ్లకు ప్రతీకా రంగా తాను కూడా అమెరికాపై సుంకాలు బాదింది! అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పులు, తృణధాన్యాలపై ఏకంగా 30 శాతం టారిఫ్లు విధించింది. ట్రంప్లా గొంతెత్తి ప్రకటనలు చేయకుండా మౌనంగానే గత నవంబర్ నుంచే వాటిని వసూలు చేయడం కూడా ప్రారంభించింది.‘ఒప్పందం’పై మోదీ మౌనంభారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరిపోయిందని ట్రంప్ ప్రకటించినా, దానిపై మోదీ మాత్రం సూటిగా స్పందించకపోవడం విశేషం. అంతేగాక రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేసేందుకు భారత్ ఒప్పుకుందని, అమెరికా నుంచి దిగుమతులను ఏకంగా 500 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లనుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపైనా మోదీ మౌనమే వహించారు. కేవలం టారిఫ్ల తగ్గింపుకు హర్షం వ్యక్తం చేయడానికే తన స్పందనను పరిమితం చేయడం గమనార్హం. – సాక్షి, నేషనల్ డెస్క్ ‘గోర్’ ఫ్యాక్టర్సెర్గియో గోర్. భారత్లో అమెరికా నూతన రాయబారి. భారత్తో అమెరికా వాణిజ్య ఒప్పందం, టారిఫ్ల తగ్గింపు వెనక ఆయన పాత్ర కీలకంగా నిలిచింది. ఇరు దేశాల సంబంధాలు కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా దిగజారిన తరుణంలో గత జనవరి 12న ఆయన బాధ్యతలు స్వీకరించారు. ద్వైపాక్షిక సంబంధాలను ఎన్నడూ లేనంత బలోపేతం చేయడమే ఆ సందర్భంగా స్పష్టంగా ప్రకటించారు. ‘నిజమైన మిత్రులు తొలుత విభేదించవచ్చు. కానీ అంతిమంగా ఒక్కతాటిపైకే వస్తారు’ అని చెప్పుకొచ్చారు. అమెరికాకు భారత్ కంటే ముఖ్యమైన దేశం మరేదీ లేదని కూడా స్పష్టం చేశారు.ఖనిజాల అన్వేషణ, ఏఐ టెక్నాలజీ వాడకానికి సంబంధించి అమెరికా ఏర్పాటు చేసిన ‘పాక్స్ సిలికా’ కూటమిలో చేరాల్సిందిగా భారత్ను ఆహ్వానించారు కూడా. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న సుదీర్ఘ ప్రతిష్టంభన కాస్తా ఆయన వచ్చిన మూడు వారాల్లోపే వీడిపోవడం విశేషం. ట్రంప్కు అత్యంత సన్నిహితునిగా గోర్కు పేరుంది. ఏ సందర్భంలోనైనా గోర్ను తాను పూర్తిగా విశ్వసిస్తానని ట్రంప్ చెబుతుంటారు. భారత్తో ఒప్పందం, టారిఫ్ల తగ్గింపు విషయంలో ట్రంప్పై ఆయన ప్రభావం చాలా ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.మాకు సమాచారం లేదు: రష్యా మాస్కో: చమురు కొనుగోళ్ల నిలిపి వేతపై భారత్ నుంచి ఇప్పటి దాకా అధికారికంగా ఎలాంటి సమాచారమూ లేదని రష్యా పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేసేందుకు భారత్ అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఇకపై వెనెజువెలా నుంచే భారత్ అధికంగా చమురు కొనుగోలు చేస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ మంగళవారం ఈ మేరకు స్పందించారు. భారత్తో వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.ట్రంప్ వ్యాఖ్య లను నిశితంగా పరిశీలి స్తున్నట్టు రష్యా ఇంధన రంగ వ్యవహారాలు చూసే ఉప ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ చెప్పారు. భారత రిఫైనరీల నుంచి ఒప్పందాల రద్దు దిశగా ఎలాంటి నోటీసులూ అందలేదని రష్యా ఇంధన శాఖ వర్గాలు కూడా స్పష్టం చేశాయి. ఉక్రెయిన్తో యుద్ధం అనంతరం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ భారీగా పెంచుకోవడం తెలిసిందే. ఆ దేశం నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశంగా కూడా నిలిచింది. దీనిపై అమెరికాతో పాటు యూరప్ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా లెక్కచేయని సంగతి తెలిసిందే. -
ప్రధాని మోదీపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: లోక్సభలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్పై విమర్శలు గుప్పించారు. చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వలేదు. మోదీ ఇమేజ్ను క్రియేట్ చేసిన వాళ్లే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్లో విడుదల చేయనివి ఇంకా ఉన్నాయి. అమెరికాలో అదానీపై కేసు నమోదు చేశారు. వాళ్ల టార్గెట్ అదానీ కాదు.. మోదీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. యూఎస్-ఇండియా ట్రేడ్ నాలుగు నెలలుగా పెండింగ్లో ఉంది. ఇప్పటికిప్పుడు భారత్-అమెరికా ట్రేడ్ ఒప్పందంపై కేంద్రం ఆమోదం ఎందుకు తెలిపింది.‘మోదీ చాలా భయంతో ఉన్నారు. మోదీని ట్రంప్ బెదిరించి ఒప్పందం చేసుకున్నారు. ట్రంప్ ఒత్తిడితోనే ట్రేడ్ డీల్పై ప్రధాని మోదీ సంతకాలు చేశారు. రైతుల రక్త మాంసాలను కేంద్రం అమ్ముకుంది. మోదీ దేశాన్ని అమెరికాకు అమ్మేశారు.’ అని దుయ్యబట్టారు. ప్రధాని మోదీపై రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్లోక్సభలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్కు గుయ్యారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంతవరకు సస్పెన్షన్ కొనసాగనుంది. సెక్రటరీ జనరల్ బెంచ్పైకి ఎక్కి నినాదాలు చేస్తూ సభ సజావుగా జరగనీయకుండా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాగూర్, వారింగ్, కిరణ్ రెడ్డి సస్పెన్షతో పాటు మొత్తం ఎనిమిది మంది లోక్సభ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. -
ట్రంప్ గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన రూపీ విలువ
-
గ్రేట్ ట్రేడ్ డీల్.. అయినా ష్ గప్చుప్
అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్ దాదాపుగా కుదిరినట్లే!. ఇరు దేశాల మధ్య ర్చలు ఓ కొలిక్కి వచ్చాయని.. తన మిత్రుడు మోదీతో ఫోన్లో సంప్రదింపులు జరిపానని.. అన్నింటికి ఆయన ఒప్పుకున్నారని.. అందుకే భారత్పై సుంకాలను తగ్గిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇటు ఈ డీల్ను గ్రేట్గా అభివర్ణిస్తూ భారత ప్రజల తరఫున ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు కూడా. అయితే.. ఇక్కడే ఓ మెలిక ఉంది. భారత్ నుంచి ప్రస్తుతం అమెరికా 50 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. ఇందులో 25 శాతం ప్రతీకార సుంకాలు కాగా.. మరో 25 శాతం పెనాలిటీ టారిఫ్ ఉంది. టారిఫ్లు 18 శాతానికి తగ్గిస్తున్నామని.. వీటిని సున్నాకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తామని ట్రంప్ అన్నారు. ఈ క్రమంలో రష్యా నుంచి పూర్తిగా చమురు కొనుగోలును ఆపేందుకు భారత్ అంగీకరించిందని చెప్పారు. అయితే సుంకాల తగ్గింపుపై థ్యాంక్స్ మెసేజ్లో మోదీ ఈ అంశాన్ని ఏమాత్రం ప్రస్తావించలేదు. అలాగే అమెరికా ఉత్పత్తులను భారీ మొత్తంలో భారత్ కొనుగోలు చేస్తుందన్న ట్రంప్ స్టేట్మెంట్పైనా స్పందించలేదు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ ఇలా ప్రకటనలు చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఇలా చార్లు ఆయన బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆయన ప్రకటనతో ఆయా సందర్భాల్లో భారత ప్రభుత్వం బహిరంగంగా విబేధించింది. అలాంటిదేం ఉండబోదని.. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గమని.. జాతి ప్రయోజనాల మేరకు తమ నిర్ణయం ఉంటుందని ప్రకటించింది. అయితే ఈసారి మాత్రం ఇంక ప్రభుత్వం తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీనిని వ్యూహాత్మక మౌనమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా, రష్యాలతో సంబంధాల నేపథ్యంలోనే ఇలా వ్యవహరిస్తుందని అంచనా వేస్తున్నారు. రష్యా ఆయిల్ కొనుగోలు ఆపివేతపై టారిఫ్ల తగ్గింపు నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన ఇస్తుందో చూడాలి. అలాగే టారిఫ్లు 50 నుంచి 18కి తగ్గాయా? లేదంటే 25 శాతం నుంచే 18కి చేరాయా? అనేదానిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అటు.. రష్యా సైతం ట్రంప్ తాజా ప్రకటనపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. గతంలో మాత్రం.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకంగా చూస్తూ, తమ చమురు మార్కెట్పై ప్రభావం ఉంటుందని సూచించింది. అలాగే భారత్ తమకు మిత్ర దేశమని.. ఇతర దేశాల ఒత్తిళ్లకు తలొగ్గే అవకాశమే ఉండబోదని ధీమా వ్యక్తం చేసింది. ఒకవేళ భారత్ రష్యా చమురు దిగుమతులను ఆపితే, రష్యా ఆసియా మార్కెట్లో తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా చమురు ఆగిందా?ట్రంప్ చెబుతున్నట్లు.. భారత్ రష్యా చమురు దిగుమతులు పూర్తిగా ఆగిపోలేదు. 2024లో రష్యా నుంచి భారత్ సుమారు 52.7 బిలియన్ డాలర్ల విలువైన చమురు దిగుమతి చేసింది. 2025 చివరలో ఈ తగ్గుదల కనిపించినా.. 2026 జనవరిలో కూడా మూడు కంపెనీలు (IOCL, BPCL, Nayara Energy) రష్యా చమురు కొనుగోలు కొనసాగించాయి. ఇక..ఒకప్పుడు రష్యా నుంచి భారత్ కేవలం 2 శాతం మాత్రమే చమురు దిగుమతి చేసుకునేది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ రష్యా చమురు కొనుగోలు పెంచింది. ఎందుకంటే ఆ సమయంలో డిస్కౌంట్ ధరలు లభించాయి కాబట్టి. అలా.. 2024లో సుమారు US$52.7 బిలియన్ విలువైన చమురును దిగుమతి చేసుకుంది. 2025లో.. అమెరికా సుంకాల-ఆంక్షల బెదిరింపులు.. ట్రంప్ ఒత్తిడి, రష్యా నుంచి వచ్చే డిస్కౌంట్ తగ్గిపోవడం, మిడిల్ ఈస్ట్ నుంచి సరఫరా పెరగడం.. తదితర కారణాలతో చమురు దిగుమతులు తగ్గినట్లు అనిపించాయి. డిసెంబర్ 2025లో భారత్ మొత్తం చమురు దిగుమతులు 21.6 మిలియన్ టన్నులకు చేరాయి, అయితే.. గత 9 నెలల్లో ఇదే అత్యధికం. ఇక.. జనవరి 2026లో రష్యా చమురు దిగుమతులు నవంబర్తో పోలిస్తే 35% తగ్గాయి. రిలయన్స్ వంటి పెద్ద ప్రైవేట్ కంపెనీలు రష్యా చమురు కొనుగోలు తగ్గించాయి, కానీ IOCL, BPCL, Nayara Energy మాత్రం కొనుగోలు కొనసాస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.సూటిగా మూడు పాయింట్లలో.. భారత్: ట్రంప్ సుంకాల తగ్గింపును స్వాగతించింది. కానీ రష్యా చమురు అంశంపై మౌనం పాటిస్తోందిఅమెరికా: భారత్ రష్యా చమురు ఆపివేస్తుందని ధృవీకరించిందిరష్యా: ఆసియా మార్కెట్ దెబ్బ తినే అవకాశంతో.. ట్రంప్ ప్రకటనను ఖండించే చాన్స్ -
జడ్జి సంచలన తీర్పు చిక్కుల్లో ట్రంప్..
-
టారిఫ్ తగ్గింపుతో బలపడిన రూపాయి
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం ప్రభావం.. భారత ఆర్థిక రంగంలో స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా భారత ఉత్పత్తులపై విధిస్తున్న టారిఫ్ను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగింది. ఈ పరిణామం నేరుగా రూపాయి విలువపై ప్రభావం చూపింది.రూపాయి విలువ పెరుగుదలరూపాయి డాలర్తో పోలిస్తే 48 పైసలు బలపడింది.ఆరు వారాల్లో ఇంత పెద్ద పెరుగుదల ఇదే తొలిసారి.ప్రస్తుతం రూపాయి విలువ 90.94 పైసలు వద్ద నిలిచింది.కారణాలుటారిఫ్ తగ్గింపు: భారత ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో పోటీదారులపై స్పష్టమైన ప్రయోజనం లభించింది.పెట్టుబడిదారుల విశ్వాసం: వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయని భావించి విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.రష్యా చమురు కొనుగోళ్లు తగ్గింపు సంకేతాలు: అమెరికా–భారత్ ఒప్పందం నేపథ్యంలో భారత్ రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తుందనే అంచనాలు కూడా రూపాయి బలపడటానికి తోడ్పడ్డాయి.ప్రభావంఎగుమతిదారులకు లాభం: తక్కువ టారిఫ్తో అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది.దిగుమతిదారులకు ఊరట: రూపాయి బలపడటంతో డాలర్లో చెల్లింపులు కొంత తగ్గుతాయి.సామాన్య ఆర్థిక వ్యవస్థ: రూపాయి బలపడటం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.మొత్తంగా, ఇంతకాలం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరకపోవడం వల్లే విదేశీ మదుపర్లు మన మార్కెట్లలో భారీగా అమ్మకాలు జరుపుతున్నారు. ఫలితంగా డాలర్కు గిరాకీ పెరిగి, రూపాయి విలువ క్షీణిస్తూ వచ్చింది. తాజా పరిణామాలతో మన మార్కెట్లు, రూపాయి కోలుకుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ప్రపంచ శాంతికి ట్రంప్ నాయకత్వం అవసరం
భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్పై విధించిన సుంకాలను తగ్గించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు ఇరు దేశాల మధ్య చిరకాలంగా పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందం దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని అన్నారాయన. అమెరికా వాణిజ్య విషయంలో భారత్ తీరు సరిగా లేదంటూ.. గతేడాది ట్రంప్ 25 శాతం ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని 18 శాతానికి తగ్గుతాయని ట్రంప్ తన సోషల్ ట్రూత్లో ప్రకటించారు. అయితే.. భారత ఉత్పత్తులపై అమెరికా మొత్తంగా 50 శాతం టారిఫ్లు వసూలు చేస్తోంది. ఇందులో రష్యాతో చమరు కొనుగోళ్ల నేపథ్యంతో విధించిన 25 శాతం సుంకాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో.. రష్యాతో చమురు వాణిజ్యం పూర్తిగా నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని కూడా ట్రంప్ తన సోషల్ మీడియా సోషల్ ట్రూత్లో వెల్లడించారు. కానీ, ఆ సుంకాల పరిస్థితిపై మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు.మోదీ ఏమన్నారంటే..ట్రంప్ ఫోన్కాల్.. సోషల్ మీడియా పోస్ట్ పరిణామంపై భారత ప్రధాని మోదీ కూడా స్పందించారు. భారత వస్తువులపై అమెరికా ఇకపై 18 శాతం సుంకమే విధిస్తుందని చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఇంత గొప్ప ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రెసిడెంట్ ట్రంప్కు ఎంతగానో కృతజ్ఞతలు. ప్రపంచ శాంతి, సుస్థిరత, ప్రగతికి ఆయన సారథ్యం ఎంతో కీలకం’’అంటూ కొనియాడారు. శాంతిసాధన దిశగా ఆయన ప్రయత్నాలకు భారత్ పూర్తిగా సహకరిస్తుంది.. .. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆర్థిక, ప్రజాస్వామిక వ్యవస్థలు కలసికట్టుగా పని చేస్తే అంతిమంగా ప్రజలకు ఎనలేని మేలు కలుగుతుంది. ఇరు పక్షాలకూ లాభదాయంగా అపారమైన అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి. భారత్, అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లే దిశగా ట్రంప్తో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నా’’అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ట్రంప్ చెప్పిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై మాత్రం మోదీ ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం! ఇక ట్రంప్ ఏమన్నారంటే.. ‘‘మోదీతో నా స్నేహం, ఆయనపై గౌరవం దృష్ట్యా, ఆయన విజ్ఞప్తి మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదిరింది. ఇది తక్షణం అమల్లోకి వచ్చింది. అమెరికాపై టారిఫ్, టారిఫేతర అడ్డంకులన్నింటినీ సున్నాకు తగ్గించే దిశగా భారత్ చర్యలు చేపట్టనుంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా నిలిపేయనుంది. ఇకపై వెనెజువెలా, అమెరికా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఈ పరిణామం ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి తెర దించేందుకు దోహదపడుతుందని ట్రంప్ హర్షం వెలిబుచ్చారు. నేను, మోదీ మాటల మనుషులం కాదు. పక్కా చేతల వ్యక్తులం. కనుక భారత్, అమెరికా నడుమ ఇప్పటికే ఉన్న అద్భుత సంబంధాలు మున్ముందు మరింత బలోపేతం కానున్నాయి. మోదీని నా అత్యుత్తమ మిత్రుల్లో ఒకరు. వర్తకం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించడంతో పాటు పలు అంశాలపై మోదీతో సుదీర్ఘంగా చర్చించా. ఇకపై అమెరికా వస్తువులను భారత్ మరింత భారీ పరిమాణంలో కొనుగోలు చేస్తుందని మోదీ నాకు హామీ ఇచ్చారు(BUY AMERICAN). 500 బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే చమురు, టెక్నాలజీ, వ్యవసాయ, బొగ్గు తదితర ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు అని ట్రంప్ అన్నారు. అంతకు ముందు.. సోమవారం రాత్రి నుంచే ఈ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్.. ట్రంప్-మోదీ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అంటూ బ్రేకింగ్ న్యూస్లా ఒక్కో పరిణామాన్ని వివరించుకుంటూ పోయారు. అయితే.. రష్యా చమురు సంకాల పరిస్థితిపై మాత్రం అటు ట్రంప్, ఇటు మోదీ నుంచి క్లారిటీ రాలేదు. కానీ, గోర్ మాత్రం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘భారత్పై అమెరికా తుది టారిఫ్లు 18 శాతం మాత్రమే’అంటూ స్పష్టత ఇచ్చారు. అయితే.. రష్యా చమురు విషయంలో జాతి ప్రయోజనాల విషయంలో తగ్గేదే లే అని భారత్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ ఒత్తిళ్లకు నిజంగానే తలొగ్గిందా? అనేదానిపై కేంద్రం నుంచి స్పష్టత రావ్సాల్సి ఉంది. -
కొలిక్కివచ్చిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం. అమెరికా టారిఫ్లు 18 శాతానికి తగ్గింపు
-
భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం!
న్యూఢిల్లీ: కొంతకాలంగా ఒడిదుడుకుల్లో పడ్డ భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య చిరకాలంగా పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అందులో భాగంగా భారత్పై సుంకాల భారాన్ని తగ్గిస్తున్నట్టు కూడా వెల్లడించారు. గతేడాది తాను విధించిన 25 శాతం ప్రతీకార సుంకాలు 18 శాతానికి తగ్గుతాయని ప్రకటించారు. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రస్తుతం 50 శాతం టారిఫ్లు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం ట్రంప్ ఫోన్లో సంభాíÙంచారు. ఆ వెంటనే వాణిజ్య ఒప్పందం, సుంకాల తగ్గింపుపై ప్రకటన చేశారు.‘‘మోదీతో నా స్నేహం, ఆయనపై గౌరవం దృష్ట్యా, ఆయన విజ్ఞప్తి మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదిరింది. ఇది తక్షణం అమల్లోకి వచి్చంది’’అని ట్రంప్ వెల్లడించారు. తన సోషల్ మీడియా ట్రూత్సోషల్లో ఈ మేరకు పోస్టు పెట్టారు. అంతేకాదు, ‘‘అమెరికాపై టారిఫ్, టారిఫేతర అడ్డంకులన్నింటినీ సున్నాకు తగ్గించే దిశగా భారత్ చర్యలు చేపట్టనుంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా నిలిపేయనుంది. ఇకపై వెనెజువెలా, అమెరికా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది’’అని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ పరిణామం ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి తెర దించేందుకు దోహదపడుతుందని హర్షం వెలిబుచ్చారు. ‘‘నేను, మోదీ మాటల మనుషులం కాదు.పక్కా చేతల వ్యక్తులం. కనుక భారత్, అమెరికా నడుమ ఇప్పటికే ఉన్న అద్భుత సంబంధాలు మున్ముందు మరింత బలోపేతం కానున్నాయి’’అని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. మోదీని తన అత్యుత్తమ మిత్రుల్లో ఒకరిగా అభివర్ణించారు! ‘‘వర్తకం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించడంతో పాటు పలు అంశాలపై మోదీతో సుదీర్ఘంగా చర్చించా. ఇకపై అమెరికా వస్తువులను భారత్ మరింత భారీ పరిమాణంలో కొనుగోలు చేస్తుందని మోదీ నాకు హామీ ఇచ్చారు. 500 బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే చమురు, టెక్నాలజీ, వ్యవసాయ, బొగ్గు తదితర ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు’’అని చెప్పుకొచ్చారు. తుది టారిఫ్ 18 శాతమే: గోర్ సోమవారం ట్రంప్, మోదీ ఇరువురూ ఫోన్లో సంభాషించుకున్నారని అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్ వెల్లడించిన కాసేపటికే వెంటవెంటనే కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ‘‘ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడే ప్రధాని మోదీతో మాట్లాడారు. (ఏం జరగనుందో) వేచి చూడండి’’అంటూ గోర్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు భారత్పై అదనంగా విధించిన మరో 25 శాతం టారిఫ్ గురించి మాత్రం ట్రంప్ ప్రస్తావించలేదు. రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయని వ్యాఖ్యానించి సరిపెట్టారు.ఆ టారిఫ్ను తొలగిస్తున్నదీ లేనిదీ స్పష్టత ఇవ్వలేదు. అయితే గోర్ ఇండియా టుడే వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘భారత్పై అమెరికా తుది టారిఫ్లు 18 శాతం మాత్రమే’అంటూ స్పష్టత ఇచ్చారు. తద్వారా, రష్యా చమురు టారిఫ్ను తొలగించినట్టేనని అన్యాపదేశంగా చెప్పారు. ఇక అమెరికాపై టారిఫ్లను దశలవారీగా పూర్తిగా ఎత్తేసే విషయమై ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ అధికారికంగా స్పందించలేదు. ఒప్పందంపై మోదీ మౌనం ఈ పరిణామంపై మోదీ కూడా స్పందించారు. భారత వస్తువులపై అమెరికా ఇకపై 18 శాతం సుంకమే విధిస్తుందని చెప్పేందుకు ఎంతో సంతోíÙస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. ‘‘ఇంత గొప్ప ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రెసిడెంట్ ట్రంప్కు ఎంతగానో కృతజ్ఞతలు. ప్రపంచ శాంతి, సుస్థిరత, ప్రగతికి ఆయన సారథ్యం ఎంతో కీలకం’’అంటూ కొనియాడారు. శాంతిసాధన దిశగా ఆయన ప్రయత్నాలకు భారత్ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.‘‘ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆరి్థక, ప్రజాస్వామిక వ్యవస్థలు కలసికట్టుగా పని చేస్తే అంతిమంగా ప్రజలకు ఎనలేని మేలు కలుగుతుంది. ఇరు పక్షాలకూ లాభదాయంగా అపారమైన అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి. భారత్, అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లే దిశగా ట్రంప్తో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నా’’అని పేర్కొన్నారు. అయితే ట్రంప్ చెప్పిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై మాత్రం మోదీ ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం! -
ఖమేనీ హెచ్చరికలు.. ట్రంప్ బేఖాతర్
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ ముందుకు వస్తుందనే ఆశ తనలో ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చేసిన హెచ్చరికలను కూడా ఆయన ప్రస్తావించారు. అమెరికా గనుక దాడులకు దిగితే అది తీవ్రమైన ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందని ఖమేనీ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.వాషింగ్టన్తో ఇరాన్ చర్చలు ఒకవేళ విఫలమైతే ఖమేనీ చేసిన హెచ్చరిక ఎంతవరకు నిజమో తేలిపోతుందని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో నివాసంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ సమీపంలో అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను మోహరించినట్లు తెలిపారు. అయితే సైనిక చర్య కంటే దౌత్యపరమైన పరిష్కారానికే తాము మొగ్గు చూపుతున్నామన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నామని, అది సాధ్యం కాకపోతే తదుపరి పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధమని ట్రంప్ పేర్కొన్నారు.ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సోషల్ మీడియా వేదికగా అమెరికాను హెచ్చరిస్తూ వరుస పోస్టులు చేశారు. అమెరికా గనుక యుద్ధాన్ని ప్రారంభిస్తే, అది కేవలం ఇరాన్ సరిహద్దులకే పరిమితం కాదని, ఈ ప్రాంతాన్నంతా చుట్టుముట్టే యుద్ధంగా మారుతుందని హెచ్చరించారు. యుద్ధ నౌకలు లేదా విమానాలతో చేసే బెదిరింపులకు ఇరాన్ భయపడదని అన్నారు. గతంలోనూ అమెరికా ఇలాంటి ప్రకటనలు చేసిందని, వీటివల్ల తమ దేశ ప్రయోజనాలకు భంగం కలగదని ఖమేనీ అన్నారు.తాము ఏ దేశంతోనూ యుద్ధాన్ని కాంక్షించడం లేదని, అయితే ఎవరైనా దాడికి దిగితే నిర్ణయాత్మకమైన దెబ్బ కొడతామని ఖమేనీ స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద ఉన్న సహజ వనరులు, వ్యూహాత్మక భౌగోళిక స్థానంపై పట్టు సాధించేందుకే అమెరికా తమను లొంగదీసుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.ఇది కూడా చదవండి: పొద్దున్నే వణికించిన భూకంపం -
మాపై దాడి చేస్తే అంతే.. ట్రంప్కు ఖమేనీ తీవ్ర హెచ్చరిక
అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ట్రంప్ ఆ దేశానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అణుఒప్పందం విషయంలో ఇరాన్ తగ్గకపోతే వెనిజువెలా సీన్ను మించి రిపీట్ అవుతుందని హెచ్చరించారు. దీనిపై ఇరాన్ సుప్రీం ఖమేనీ ఘాటుగా రిప్లై ఇచ్చారు. అమెరికా తమపై దాడి చేస్తే అది ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందని ట్రంప్ను హెచ్చరించారు.ఇటీవల ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా స్పందిచారు. ప్రస్తుతం ఇరాన్ వైపు అమెరికా నావిక దళం వెళుతుందని అది ఇంతకు ముందు వెనిజువెలా వెళ్లన దాని కంటే పెద్దదన్నారు. సమయం మించిపోతుందని అణు ఒప్పందం విషయంలో ఇరాన్ దిగిరాకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయన్నారు. దానికి ఇరాన్ సైతం తీవ్రంగా స్పందించింది. కాగా తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ట్రంప్ను తీవ్రంగా హెచ్చరించారు.ఆదివారం ఇరాన్ శాసనసభలో ఆదేశ సుప్రీం లీడర్ ఖమేనీ మాట్లాడారు. " టంప్ వాక్చతుర్యానికి ఇరానీయులు భయపడవద్దు.మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ మాపై దాడి చేస్తే గట్టిగా బదులిస్తాం. ఒకవేళ మాపై దాడి చేస్తే అది ప్రాంతీయ యుద్ధంగా మారే అవకాశం ఉందనే విషయం గుర్తుంచుకోండి" అని అన్నారు. అంతేకాకుంగా ఇరాన్లో జరిగిన నిరసనలను అమెరికా, ఇజ్రాయెల్ ప్రోత్సాహంతోనే జరిగాయని ఖమేని అభివర్ణించారు.అల్లర్లు జరిపిన వారు ప్రభుత్వ కార్యాలయాలపై, మసీదులపై, బ్యాంకులపై దాడిచేశారని అది ఇరాన్పై జరిగిన తిరుగుబాటన్నారు. దానిని భద్రతా బలగాలు విజయవంతంగా అణిచివేశాయని తెలిపారు ఇరాన్లో జరిగిన నిరసనల్లో మూడు వేల మంది పౌరులు మరణించినట్లు ఆ దేశం అంగీకరించింది. ఇటు ట్రంప్ హెచ్చరికలు.. అటు ఖమేనీ తగ్గేదేలే అనడంతో ప్రస్తుతం ఏం జరగనుందా అని ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. -
ట్రంప్ కోసమే మోదీ అలా చేశారు.. భారత్ రియాక్షన్ ఇదే
ఎప్స్టీన్ ఫైల్స్ ప్రస్తుతం అమెరికాలో ఈ వ్యవహారం ఎంత హాట్టాఫిక్గా మారిందో అంతా తెలిసిందే. ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్క్లింటన్తో పాటు బిల్గ్రేడ్స్, మైకేల్ జాక్సన్ లాంటి ప్రముఖుల అంతరంగిక వ్యవహారాలు అందులో ఉన్నాయి. అయితే ఆ ఫైళ్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్థావన ఉండడంతో భారత్ దానిపై వివరణ ఇచ్చింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ దీనిపై స్పందించారు.ఇటీవల అమెరికా న్యాయవిభాగం జెఫ్రీ ఎప్స్టీన్ దర్యాప్తునకు సంబంధించిన కీలక పత్రాలను విడుదల చేసింది. అయితే ఇందులో చాలా మంది ప్రముఖుల అంతరంగిక విషయాలకి సంబంధించిన సమాచారంపై ఆరోపణలున్నాయి. అయితే అందులో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన ట్రంప్ సూచన మేరకే జరిగిందని ఉంది. ఎప్స్టీన్ మెయిల్స్లలో..2017లో ట్రంప్- మోడీ భేటీ జరిగింది. అప్పుడు ట్రంప్ మోదీని ఇజ్రాయెల్ పర్యటించాల్సిందిగా సూచించారు. దీంతో మోదీ ఆ ఏడాది ఇజ్రాయెల్ పర్యటన చేశారు. అని మెయిల్లో ఉంది.అంతేకాకుండా 2014లో ప్రస్తుత కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి.. ప్రధానిగా మోదీ ఎన్నికైన తర్వాత భారత్తో సంబంధాలు ఎందుకు మెరుగుపరుచుకుకోవాలో అని మెయిల్లో తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. " ఎప్స్టీన్ ఫైళ్లలో 2017లో భారత ప్రధాని ఇజ్రాయెల్లో పర్యటించిన విషయం మినహా అంతకు మించి ఏది నిజం కాదు. మిగతా ప్రస్థావనలు అన్నీ ఒక నేరస్థుడు చెప్పిన అసత్య ప్రకటనలు" అని ఆయన అన్నారు. అవి పూర్తిగా అవాస్తవాలు అని తెలిపారు.అయితే రెండు రోజుల క్రితం అమెరికా న్యాయశాఖ విభాగం ఎప్స్టీన్కు సంబంధించి 30 వేల పత్రాలు, 2వేల వీడియోలు, విడుదల చేశారు. అందులో ఆ దేశ మాజీ అధ్యక్షులతో పాటు బిల్గ్రేట్స్, ఎలాన్ మస్క్కు సంబంధించిన కీలక సమాచారం ఉంది. -
భారత్తో డీల్ కుదిరింది: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకాం ఇరాన్ నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్.. ఇకపై వెనెజువెలా నుంచి చేసుకునేందుకు ముందుకొచ్చిందని పేర్కొన్నారు. ఆదివారం ఫ్లోరిడాకు వెళ్తున్న క్రమంలో.. ఎయిర్ఫోర్స్ వన్లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘మేము ఇప్పటికే వెనెజువెలాతో ఒక డీల్ కుదుర్చుకున్నాం. ఇందులో భారత్ కూడా చేరనుంది. భారత్ ఇకపై వెనెజువెలా చమురును దిగుమతి చేసుకుంటుంది. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాం’’ అని ట్రంప్ తెలిపారు. అలాగే వెనెజువెలా చమురు కోసం చైనా కూడా తమతో చర్చలు జరిపే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. దాన్ని మేము స్వాగతిస్తామన్నారు. దీనిపై భారత్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు వెనెజువెలాలో పాలనపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఇప్పుడు తన అధీనంలోనే ఉందన్నారు. తాను కోరుకున్నట్లుగానే ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. అక్కడి చమురు నిల్వలు పూర్తిగా అమెరికా చేతికి వచ్చే వరకు ఆమెనే తాత్కాలిక నాయకురాలిగా కొనసాగుతారని తెలిపారు.వెనెజువెలాపై సైనిక దాడి చేసి.. ఆ దేశ నేత నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. భారతదేశం ఒకప్పుడు వెనిజులా నుంచి లక్షల బ్యారెల్ల చమురు దిగుమతి చేసుకునేది. ఒనానొక టైం వచ్చేసరికి.. ఆ దేశం మొత్తం చమురు ఎగుమతుల్లో దాదాపు సగం వరకు భారతదేశం వాటా కలిగి ఉండేది. అయితే, 2010 చివర్లో.. అమెరికా వెనెజువెలాపై ఆంక్షలను కఠినతరం చేసింది. ఈ క్రమంలో.. ద్వితియ శ్రేణి ఆంక్షలు(Secondary Sanctions) భయంతో భారత్కు చెందిన కంపెనీలు కొనుగోళ్లను తగ్గించాయి, ఫలితంగా వెనిజులా చమురు దిగుమతులు గణనీయంగా పడిపోయాయి. అదే సమయంలో.. అమెరికా ఆంక్షలను సైతం లెక్క చేయకుండా ఇంతకాలం భారత్ ఇరాన్ నుంచి కాస్తకూస్తో చమురు దిగుమతులను చేసుకునేది. అయితే ఈమధ్యే భారత ప్రధాని మోదీ - వెనెజువెలా అధ్యక్షురాలు రోడ్రిగ్జ్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులతో సహా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించుకున్నారు కూడా. -
సౌదీ, ఇజ్రాయెల్లకు అమెరికా ఆయుధాలు
వాషింగ్టన్: ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలకు భారీగా ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధమైంది. ఇజ్రాయెల్కు 667 కోట్ల డాలర్లు, సౌదీకి 900 కోట్ల డాలర్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను పెద్ద మొత్తంలో విక్రయించేందుకు ట్రంప్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఇరాన్పై అమెరికా సైనిక దాడులు చేసే అవకాశం ఉందన్న వార్తలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం ఈ విషయాన్ని కాంగ్రెస్కు తెలిపిన విదేశాంగ శాఖ, ఆ వెంటనే ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. విదేశాంగ విధానానికి అనుగుణంగా, అమెరికా ప్రయోజనాలరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో తెలిపింది. సౌదీకి విక్రయించే వాటిలో 730 పేట్రియాట్ క్షిపణులు, సంబంధిత పరికరాలున్నాయి. వీటితో సౌదీ అరేబియా క్షిపణి రక్షణ వ్యవస్థ మెరుగుపడుతుందని తెలిపింది. అదేవిధంగా, 30 అపాచీ అటాక్ హెలికాప్టర్లు, సంబంధిత సామగ్రి, 3,250 లైట్ టాక్టికల్ వాహనాలను ఇజ్రాయెల్కు విక్రయించనున్నామని వివరించింది. -
30 లక్షల పేజీల పత్రాలు
న్యూయార్క్: అమెరికా కుబేరుడు, ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్పై దర్యాప్తునకు సంబంధించిన కీలక పత్రాలను అమెరికా న్యాయ శాఖ తాజాగా విడుదల చేసింది. 30 లక్షల పేజీల పత్రాలతోపాటు 2 వేల వీడియోలు, 1.80 లక్షల ఫొటోలు బయటపెట్టడం గమనార్హం. పలువురు యువతులు, బాలికలపై ఎప్స్టీన్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్ వంటి ప్రముఖులు, ధనవంతులతో ఎప్స్టీన్ జరిపిన సంభాషణలపైనా దర్యాప్తు జరిగింది. దర్యాప్తు వివరాలు, పత్రాలను చట్ట ప్రకారమే బహిర్గతం చేసినట్లు న్యాయశాఖ వెల్లడించింది. వీటిని శుక్రవారం తమ వెబ్సైట్లో పొందుపర్చింది. ఇందులో ఆండ్రూ మౌంట్బాటన్ విండ్సర్ (ప్రిన్స్ ఆండ్రూ), ఎలాన్ మస్క్ తదితర మిత్రులతోనూ ఎప్స్టీన్ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఈ–మెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఎప్స్టీన్తోపాటు ఆయన ప్రియురాలు మాక్స్వెల్ నిర్వాకాలపై దర్యాప్తు వివరాలు బయటపెట్టాలని ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ చట్టాన్ని తీసుకొచ్చింది. న్యాయ శాఖ గత నెలలో పరిమితంగా కొన్ని పత్రాలు విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తాజాగా మొత్తం ఫైళ్లు బయటపెట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎప్స్టీన్ బంధం చర్చనీయాంశంగా మారుతోంది. చాలామంది ప్రముఖులకు అమ్మాయిలను ఎరవేసి, తన పనులు పూర్తిచేసుకున్నట్లు ఎప్స్టీన్పై ఆరోపణలు వచ్చాయి. అయితే, అతడితో చాలా ఏళ్ల క్రితమే సంబంధాలు తెంచేసుకున్నానని ట్రంప్ ఇటీవల వివరణ ఇచ్చారు. జెఫ్రీ ఎప్స్టీన్ 1953 జనవరి 20న న్యూయార్క్లో జన్మించాడు. లైంగిక వేధింపులకు సంబంధించి ఆయనపై పలు అభియోగాలు నమోదయ్యాయి. 18 ఏళ్లలోపు బాలికలను వేధించినట్లు నిరూపణ జరిగింది. 2019 ఆగస్టు 10 న్యూయార్క్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
‘పీస్’ ఫుల్ఫామ్.. ‘పి’ ఫర్ పెయిన్–మేకర్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను ‘పీస్’ ప్రైజ్ వరించిందనే వార్త ప్రపంచాన్ని అయోమయంతో కూడిన ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు ట్రంప్ ఆనందానికి అవధులు, ఆనకట్టలు, డ్యామ్లు, కాలువలు లేవు.‘ఈసారి కచ్చితంగా నాకే’ అని గన్షాట్ ఆశ పెట్టుకున్న ట్రంప్ను గతంలో ఎస్నో సార్లు ‘పీస్’ ప్రైజ్ వెక్కిరిస్తూ వచ్చింది.పరాభవానికి గురైన ట్రంప్ ‘శాంతి’ బహుమతిపై అశాంతి, కసి, కోపం, పగ, ప్రతీకారం, రివేంజ్.. ఇలాంటివి ఎన్నో పెట్టుకున్నాడు. అంతేకాదు...‘పి’తో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులతో మాట్లాడడం మానేశాడు. ‘పి’తో మొదలయ్యే వంటకాలను తినడం మానేశాడు.‘పి’తో మొదలయ్యే డ్రింక్స్ తాగడం మానేశాడు.అలాంటి ట్రంప్ను ‘పీస్’ ప్రైజ్ వరించడంతో... ఆ ప్రైజ్పై అతడికి అభిమానం, అనురాగం, ఆనందం, ఆప్యాయత, ప్రేమ, మమత, సమత... ఇలాంటి భావాలెన్నో కలిగాయి. ఆ ఆనంద కిక్లో వైట్హౌజ్లో ప్రెస్మీట్ పెట్టాడు.‘అరచేయి అడ్డుపెట్టి అప్పడం కాలకుండా చేయగలరా? నో... నెవర్! పీస్ ప్రైజ్ నాకు రావడం కూడా అలాంటిదే. ఈ శుభ సందర్భంగా ప్రపంచశాంతిని ఆశిస్తూ ఒక పాట పాడుతాను’ అని గొంతు సవరించాడు ట్రంప్. ఆ పాట వినడానికి సభాసదుల చెవుల వైశాల్యం రెట్టింపు అయ్యింది. ‘నేను విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ’ అని పాడడం ప్రారంభించాడు శ్రీ ట్రంప్.‘సోడా బుడ్డికి ప్రపంచ శాంతికి సంబంధం ఏమిటి?’ అని అడగబోయిన ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక విలేఖరికి వెజెజువెలా ప్రెసిడెంట్ గుర్తుకు వచ్చాడు. ‘అంత పెద్ద ప్రెసిడెంట్నే మాయం చేసిన వాడికి నేనొక లెక్కా’ అని జాగ్రత్తగా లెక్కలు వేసుకొని నీట్గా రూట్ మార్చాడు.చదవండి: చుక్కల్లో పసిడి ధరలు.. చదివింపుల గుబులు‘మీరు పాడిన పాట ఏ భాషదో తెలియదుగానీ... ఎంత అద్భుతంగా పాడారు సర్!’ అని మెలికలు తిరిగిపోయాడు. ‘థ్యాంక్యూ మిత్రమా’ అని చెప్పిన ట్రంప్కు తన పాట ఎంత బ్లడ్పాతం సృష్టించిందో తెలియదు. దీనికి సాక్ష్యం... వాషింగ్టన్ పోస్ట్ విలేఖరి చెవిలోని నుంచి ఆగకుండా కారుతున్న రక్తం!!!!కసి మెరుపు: ఇంతకీ... ట్రంప్కు ‘పీస్’ ప్రైజ్ ప్రకటించింది నోబెల్ కమిటీ కాదు.‘హారిబుల్’ కమిటీ! అర్జెంటీనాలోని ఫాక్స్నక్కపాలెన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కమిటీ... మూర్ఖత్వం, అహం మూర్తీభవించిన ప్రతిభా‘వాంతు’లకు ప్రతి యేటా ‘పీస్’ ప్రైజ్ ప్రకటిస్తుంది. ఇంతకీ... ఈ ‘పీస్’ ప్రైజ్లో శాంతి పిసరంత కూడా ఉండదు.– యాకుబ్ భాషఇంతకీ... వీరి ‘పీస్’ ఫుల్ఫామ్...‘పి’ ఫర్ పెయిన్–మేకర్: బాధలు తయారుచేసే వ్యక్తి‘ఇ’ ఫర్ ఎంప్టీ హెడ్: ఖాళీ బుర్ర‘ఎ’ ఫర్ ఆరగెంట్: గర్వం మూర్తిభవించిన వ్యక్తి‘సి’ ఫర్ క్రేజీ: తెలివితక్కువ–సెన్స్లెస్కు ఎక్కువ‘ఇ’ ఫర్ ఇగోయిస్టిక్: అహంకారి -
USA: నో వర్క్ .. నో స్కూల్ .. నో షాపింగ్
-
కెవిన్ వార్ష్ చేతికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ పగ్గాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఉంటున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ స్థానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. యూఎస్ సెంట్రల్ బ్యాంక్గా ఉన్న ‘ఫెడరల్ రిజర్వ్’ తదుపరి ఛైర్మన్గా మాజీ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ కెవిన్ వార్ష్ను నామినేట్ చేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ పదవీకాలం 2026 మే నెలలో ముగియనుంది. ఆ వెంటనే వార్ష్ బాధ్యతలు చేపడతారని ట్రంప్ వెల్లడించారు.అర్హతలే ప్రామాణికం..వార్ష్ ఎంపికను సమర్థిస్తూ ఆయన నేపథ్యాన్ని ట్రంప్ ప్రశంసించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ లా స్కూల్ నుంచి పట్టభద్రుడైన వార్ష్ గతంలో మోర్గాన్ స్టాన్లీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా 2006–2011 మధ్య కాలంలో ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో సభ్యుడిగా సేవలందించిన అనుభవం ఆయనకు ఉంది. జీ-20 సదస్సుల్లో అమెరికా ప్రతినిధిగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆర్థిక సంస్కరణల సలహాదారుగా ఆయనకున్న ట్రాక్ రికార్డును ట్రంప్ హైలైట్ చేశారు. వార్ష్ను ‘యూఎస్ పరిపాలన విభాగంలో ఇట్టే ఇమిడిపోయే అద్భుతమైన అభ్యర్థి’గా ట్రంప్ అభివర్ణించారు.మార్కెట్ల స్పందనట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే అమెరికన్ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల ధోరణి కనిపించింది. అక్కడి మార్కెట్ సూచీలైన డౌ జోన్స్, నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 పతనమయ్యాయి. వార్ష్ గతంలో ‘ఇన్ఫ్లేషన్ హాక్’(ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి)గా పేరు పొందడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.స్వతంత్రతపై ప్రశ్నలు.. సెనెట్ ఆమోదం బాకీవార్ష్ ఎంపికపై ఆర్థిక వర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఒకవైపు ట్రంప్ తక్కువ వడ్డీ రేట్లను ఆశిస్తుండగా వార్ష్ దానికి అనుగుణంగా నడుచుకుంటారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రత దెబ్బతినే అవకాశం ఉందని కొందరు రాజ్యాంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెవిన్ వార్ష్ నియామకం ఇప్పుడు అమెరికా సెనెట్ ఆమోదానికి వెళ్లనుంది. అక్కడ రాజకీయంగా, ఆర్థికంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. సెనెట్ ఆమోదం లభిస్తేనే మే 2026 నుంచి ఫెడ్ నిర్వహణ బాధ్యతులు వార్ష్ చేతుల్లోకి వెళ్తుంది.ట్రంప్ చిరకాల మిత్రుడి అల్లుడే వార్ష్కెవిన్ వార్ష్ భార్య జైన్ లాడర్ ప్రపంచ ప్రసిద్ధ కాస్మెటిక్స్ సంస్థ అయిన ‘ఎస్టే లాడర్’ వ్యవస్థాపకురాలు ఎస్టే లాడర్ మనవరాలు. ఆమె ఒక బిలియనీర్, వ్యాపారవేత్త. జైన్.. రోనాల్డ్ లాడర్ కుమార్తె. రోనాల్డ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు చిరకాల మిత్రుడు, మద్దతుదారుగా ఉన్నారు. జైన్ లాడర్ 1996లో తన కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఆమె ఎస్టే లాడర్ కంపెనీల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ డేటా ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహించారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ఆమె నికర ఆస్తి విలువ సుమారు 2.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.22,000 కోట్లకు పైగా). కెవిన్ వార్ష్, జైన్ లాడర్కు మధ్య స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పరిచయం ఏర్పడింది. వారు 2002లో వివాహం చేసుకున్నారు.ఇదీ చదవండి: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం.. -
అంతకు మించి అంటున్న ట్రంప్
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నివురు గప్పిన నిప్పులా కొనసాగుతోంది. తాజాగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. వెనెజువెలాపై జరిపిన దాడులకు మించి ఇరాన్పై చేసే అవకాశం ఉందంటూ ప్రకటించారు.ట్రంప్ తన సోషల్ ట్రూత్లో ఇలా రాసుకొచ్చారు. "ఇరాన్ వైపు వెళ్తున్న అమెరికా నౌకాదళం... ఇంతకు ముందు వెనిజులాకు పంపిన దానికంటే పెద్దది. ఏమవుతుందో చూద్దాం" అని పేర్కొన్నారు. తద్వారా ఇరాన్ వైపునకు మరిన్ని బలగాలు పంపడం ద్వారా.. ఆ దేశంపై అణు ఒప్పందం విషయంలో ఒత్తిడి చేయాలన్నదే ట్రంప్ ప్రయత్నంగా కనిపిస్తోంది. అంతకు ముందు..బుధవారం కూడా ట్రంప్ ఇదే తరహా హెచ్చరికలే జారీ చేశారు. సమయం మించి పోతుందని.. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ దిగి రాకపోతే పరిస్థితి దారుణంగా ఉండొచ్చని హెచ్చరించారు. అయితే అందుకు ఇరాన్ కూడా అదే రీతిలో స్పందించింది. తమ వేలు కూడా ట్రిగ్గరైపైనే ఉందని.. అమెరికా దాడులకు దిగితే ప్రతిస్పందన కూడా మునుపెన్నడూ లేని రీతిలో ఉంటుందని అంటోంది.అమెరికా.. టైం తక్కువగా ఉంది, ఇరాన్ వెంటనే చర్చల టేబుల్ వద్దకు రావాలిఇరాన్.. పరస్పర గౌరవం, ప్రయోజనాల ఆధారంగా చర్చలకు సిద్ధం, కానీ ఒత్తిడి చేస్తే ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా ప్రతిస్పందిస్తాంప్రస్తుతం ఇరాన్ వైపు అమెరికా భారీ నౌకాదళాన్ని మోహరించింది. ప్రధానంగా యూఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే ఎయిర్ క్రాప్ట్ క్యారియర్ రెడీగా ఉంది. దీంతో పాటు యుద్ధనౌకలు, డిస్ట్రాయర్లు, క్రూయిజర్లు, సబ్మెరైన్లు.. అలాగే పైటర్ జెట్లు, హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఇరాన్ కూడా ప్రతిస్పందనగా తన షాహిద్ బఘేరి(Shahid Bagheri) డ్రోన్ క్యారియర్ను హార్ముజ్ జలసంధి వద్ద మోహరించింది.హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాకు కీలకం. ఇక్కడ ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ చమురు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆంక్షలు కూడా..ఇరాన్పై ఒత్తిడి చేసే క్రమంలో ట్రంప్ సర్కార్ కొత్త ఆంక్షలను తెర మీదకు తెచ్చింది. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మొమెనీపై, అలాగే ఓ ఇరానీయన్ ప్రముఖ వ్యాపారవేత్తపైనా ఆంక్షలు విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇరాన్లో ఇటీవల జరిగిన ప్రజా నిరసనలను మొమెనీ ఆధ్వర్యంలోని బలగాలు క్రూరంగా అణచివేశాయని.. వేలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని.. అందుకే ఆయనపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. -
అంతకు మించి అంటున్న ట్రంప్
యర్ను న్పై ఒత్తిడి చేసే క్రమంలో ట్రంప్ సర్కార్ కొత్త ఆంక్షలను తెర మీదకు తెచ్చింది. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మొమెనీపై, అలాగే ఓ ఇరానీయన్ ప్రముఖ వ్యాపారవేత్తపైనా ఆంక్షలు విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇరాన్లో ఇటీవల జరిగిన ప్రజా నిరసనలను మొమెనీ ఆధ్వర్యంలోని బలగాలు క్రూరంగా అణచివేశాయని.. వేలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని.. అందుకే ఆయనపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. -
వార్ టెన్షన్.. ట్రంప్తో యుద్ధానికి సిద్ధమన్న ఇరాన్
ఇస్తాంబుల్: శాంతియుత ఆందోళనలను తీవ్రంగా అణచివేయడంతోపాటు మూకుమ్మడి మరణశిక్షలను అమలు చేస్తున్న ఇరాన్పై మిలటరీ దాడులు తప్పవంటూ అమెరికా చేస్తున్న హెచ్చరికలను ఆ దేశం బేఖాతరు చేస్తోంది. ఉద్రిక్తతలను సడలించేందుకు అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామంటున్న ఇరాన్ ప్రభుత్వం.. ప్రస్తుతానికి అందుకు సంబంధించిన ప్రణాళికేదీ లేదని మరోవైపు చెబుతోంది.ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి శుక్రవారం తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్తో కలిసి ఇస్తాంబుల్లో మీడియాతో మాట్లాడారు. అమెరికాతో నిష్పక్షపాత, సమానత్వంతో కూడిన చర్చలకు సిద్ధమన్నారు. అయితే, ముందుగా ఏ అంశంపై చర్చ జరగాలి, ఎక్కడ కలుసుకోవాలి అనే వాటిపై నిర్ణయం జరగాలని స్పష్టం చేశారు. చర్చలకు, అవసరమైతే యుద్ధానికి కూడా తాము సిద్ధమేనంటూ అరాగ్చి వ్యాఖ్యానించారు. అమెరికా ఆంక్షలుమరోవైపు.. ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇస్కందర్ మోమినీపై అమెరికా శుక్రవారం ఆంక్షలు విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన నిరసనకారులపై మోమినీ ఆదేశాల మేరకు భద్రతా సిబ్బంది దమనకాండకు పాల్పడ్డారని ట్రంప్ యంత్రాంగం పేర్కొంది. మోమినీతో పాటు.. ఇరాన్ పారిశ్రామిక బాబక్ జంజానీ సహా 18 మంది వ్యక్తులు, కొన్ని సంస్థలపై ఆంక్షలు విధించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. -
భారతీయులకు శుభవార్త.. హెచ్-1బీ వీసాలపై కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ(H-1B) వీసాల విషయంలో కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ష్యెడూల్ను విడుదలైంది. హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ఏడాది మార్చి 4 నుంచి ప్రారంభించనున్నట్టు పేర్కొంది. ఈ ప్రక్రియ మార్చి 20 వరకు కొనసాగుతుందని తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.వివరాల మేరకు.. హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తుల ప్రక్రియ మార్చి నాలుగో తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం కల్పించారు. లాటరీలో మెరిట్, అధిక వేతనం ఉన్న వారికి టాప్ ప్రయారిటీ ఇవ్వనున్నారు. నైపుణ్యం ఆధారిత వెయిటెడ్ సెలక్షన్ పద్దతిని ట్రంప్ సర్కార్ అమలు చేయనుంది. ఇదే సమయంలో మల్టిపుల్ రిజిస్ట్రేషన్ల మోసాలకు యూఎస్సీఐఎస్ చెక్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 31, 2026 నాటికి ఎంపికైన వారి వివరాలను వెల్లడించనున్నారు. ఈ లాటరీ ద్వారా ఎంపికైనవారు 2027 వీసా కింద అక్టోబర్ 1 నుంచి అమెరికాలో పని చేయవచ్చు. ప్రస్తుతం చాలా మంది భారతీయ ఇంజినీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్ వీసా లాటరీ కోసం ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉండగా.. హెచ్-1బీ వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వీసా లాటరీ విధానంలో ఒకే వ్యక్తికి ఒకే యజమాని ద్వారా ఒక్క రిజిస్ట్రేషన్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఒకే యజమాని ఒక ఉద్యోగి పేరుతో అనేక రిజిస్ట్రేషన్లు చేస్తే అవన్నీ రద్దు చేస్తారు. కాగా మొత్తం H-1B వీసాలు 85,000 మాత్రమే ఉండగా.. ఇందులో 65,000 వీసాలు సాధారణ కేటగిరీకి, మరో 20,000 వీసాలు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి కేటాయించారు. ఈ వీసాకు అర్హులైనవారు బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. అలాగే అమెరికాలో స్పెషలైజ్డ్ జాబ్ ఆఫర్ ఉండాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉద్యోగి కాకుండా ఉద్యోగం ఇచ్చే కంపెనీ లేదా యజమాని చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం 10 డాలర్లు మాత్రమే అయినా.. లాటరీలో సెలెక్ట్ అయితే వీసా ఫీజులు, ఇతర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. -
కెనడా విమానాలపై 50% టారిఫ్లు
వాషింగ్టన్: కెనడాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ల బాంబు పేల్చారు. అమెరికాలో విక్రయించే కెనడా విమానాలపై ఏకంగా 50 శాతం సుంకాలు బాదుతానని ప్రకటించారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్సోషల్ పోస్టులో ఈ మేరకు పేర్కొన్నారు. జార్జియాకు చెందిన అమెరికా కంపెనీ గల్ఫ్స్ట్రీమ్ ఏరోస్పేస్కు చెందిన జెట్ విమానాలను సర్టిఫై చేసేందుకు కెనడా నిరాకరించిందంటూ ఆయన ఈ మేరకు బెదిరింపులకు దిగారు.కెనడా నిర్ణయానికి ప్రతిచర్యగా బొంబార్డియర్తో పాటు ఆ దేశానికి చెందిన అన్ని కంపెనీల విమానాలనూ తాము కూడా డీసర్టిఫై చేస్తామని హెచ్చరించారు. బొంబార్డియర్ విమానాల గుర్తింపు రద్దు తక్షణం అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించారు. బొంబార్డియర్, గల్ఫ్స్ట్రీమ్ ఒకరకంగా ఆగర్భ శత్రువులు. ట్రంప్ ప్రకటనపై మాంట్రియల్కు చెందిన బొంబార్డియర్ కంపెనీ వెంటనే స్పందించింది. ఆయన హెచ్చరికలపై కెనడా ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు చెప్పింది.కెనడాపై కత్తులుకెనడాపై కొంతకాలంగా ట్రంప్ కత్తులు నూరుతున్నారు. ముఖ్యంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీకి, ఆయనకు నడుమ సంబంధాలు బాగా బెడిసికొట్టాయి. కార్నీని ట్రంప్ తరచూ ‘కెనడా గవర్నర్’ అని సంబోధిస్తూ హేళన చేస్తున్నారు. పెద్ద దేశాల ఒంటెత్తు పోకడల వల్ల అంతర్జాతీయ ఒప్పందాలకు విలువే లేకుండా పోతోందంటూ ట్రంప్ తీరును దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక నుంచే కార్నీ తూర్పారబట్టారు.అప్పటినుంచీ వారి నడుమ మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే కెనడాపై టారిఫ్లను ఏకంగా 100 శాతానికి పెంచుతానని ఇటీవలే ట్రంప్ బెదిరించడం తెలిసిందే. అయినా కార్నీ చైనాలో పర్యటించడమే గాక ఆ దేశంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. -
USA: మీ పాలన వద్దు బాబోయ్.. ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఆ దేశంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇంతకాలం ఆయన ఇమ్మిగ్రేషన్ పాలసీనే వ్యతిరేకించిన అమెరికన్లు ఇప్పుడు ట్రంప్ పాలనపైనే వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఆయన పాలనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తున్నట్లు సమాచారం."నేనేప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు" ఇది ఒక సినిమాలోని ఫేమస్ డైలాగ్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారంలో సరిగ్గా సరిపోతుంది. ఆయన ఎప్పుడు ఏంమాట్లాడుతారో.. ఏదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో.. ఏభూమిని స్వాధీనం చేసుకుంటారో.. ఏ దేశంపై పన్నులు పెంచుతారో ఆయనకే తెలియదు.. అందుకే ట్రంప్ పాలన విధానంపై ప్రపంచ దేశాలు భయంభయంగా ఉంటాయి. అయితే ఇప్పుడు సీన్ మరింతగా ముదిరింది. ఆయన పాలనపై తాజాగా అమెరికాలోనూ తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.ఇటీవల అమెరికా మిన్నోసోటా రాష్ట్రంలో ఇమ్మిగ్రేషన్ అధికారుల దాడుల్లో ఇద్దరు మరణించగా అందుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. చాలామంది తమ వ్యాపారాలను మూసి వేసి రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. విద్యార్థులు సైతం పాఠశాలల నుంచి క్లాసులు వాకౌట్ చేశారు. అంతేకాకుండా నోవర్క్, నోస్కూల్, నోషాపింగ్ పేరుతో అమెరికా అంతటా ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు.దీంతో ట్రంప్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతుందని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఆయన ఇమ్మిగ్రేషన్ విధానాన్నే వ్యతరేకించిన అమెరికన్స్ తాజాగా ఆయన పరిపాలన పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలోనూ ట్రంప్ పాలనను అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడైంది. మెుత్తానికి మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ని చివరకు ఆ దేశ ప్రజల చేతే తిరస్కరణకు గురవుతున్నట్లు తెలుస్తోంది. -
మరో మదురోగా ఖమేనీ? ఏ క్షణమైనా అమెరికా పూర్తిస్థాయి యుద్ధం..!!
వాషింగ్టన్ డీసీ: అయతుల్లా ఖమేనీ.. ఇరాన్ సుప్రీం లీడర్..! ఇప్పుడు ఇతణ్ని కూడా వెనిజెవెలా అధ్యక్షుడు మదురో మాదిరిగా పట్టుకునేందుకు అమెరికా సిద్ధమైందా?? 1979లో రిపబ్లిక్గా మారినప్పటి నుంచి ఇరాన్లో ఎన్నడూ లేని విధంగా ప్రజాగ్రహం వెల్లువెత్తడం.. దాన్ని అణచివేసేందుకు ఖమేనీ నేతృత్వంలోని ఐఆర్జీసీ బలగాల దమనకాండ.. వేల మంది మరణాల నేపథ్యంలో.. ఏ క్షణంలోనైనా ట్రంప్ తన సైన్యంతో టెహ్రాన్పై దాడికి సన్నద్ధమయ్యారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు, జియోపాలిటిక్స్ ఈక్వేషన్లు అవుననే సమాధానం చెబుతున్నాయి. మదురోను అరెస్టు చేసిన సమయంలో అమెరికా తన నౌకదళాన్ని ఎక్కువగా వాడుకుంది. అదే సమయంలో సైబర్ ఎటాక్లు చేసింది. ఇప్పుడు కూడా అమెరికాకు చెందిన యుద్ధ విమానాల వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ జలాల సమీపంలోకి రావడంతో.. ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.యూఎస్ సెంట్రల్ కమాండ్ ఇప్పుడు ఇరాన్ సమీపంలోని జలాల్లో పూర్తిస్థాయిలో మోహరించింది. అదే సమయంలో.. వెనిజెవెలా మాదిరిగా సైబర్ దాడి చేసేందుకు అమెరికా సైబర్ కమాండ్ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ పౌరులు కూడా ఖమేనీ శకాన్ని ఖతం చేయాలంటూ భీష్మించుకోవడం.. లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుండడం ఇప్పుడు అమెరికాకు కలిసివచ్చింది. నిజానికి 2012లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనేజాద్ తాము యురేనియం కడ్డీని తయారు చేశామని ప్రకటించినప్పటి నుంచే అమెరికా గుర్రుగా ఉంది. ఇప్పుడు టెహ్రాన్లో ప్రజాందోళనలు అమెరికాకు కలిసివచ్చాయి. ఇదే అదనుగా యుద్ధానికి అమెరికా సిద్ధమవుతోంది.వాస్తవానికి ఇరాన్-అమెరికా వివాదాలు, దాడులు-ప్రతిదాడులు గత ఏడాది నుంచి మొదలయ్యాయి. గత ఏడాది జూన్ 21 అర్ధరాత్రి దాటాక ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఆ మర్నాడే ఇరాన్ ప్రతీకార దాడి చేసింది. ఖతార్లోని అమెరికా ఎయిర్ బేస్లపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే.. ఆ దాడి గురించి ఇరాన్ తమకు ముందుగానే సమాచారం అందించిందని అప్పట్లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాహాటంగా చెప్పారు. ఫలితంగా తాము ఇరాన్ క్షిపణులను సమర్థంగా ఎదుర్కొన్నట్లు వివరించారు. 2020లో ట్రంప్ ఇదే తరహా దాడులు చేయించారు. ఆ ఏడాది జనవరి 3న ఇరాక్లోని బగ్దాద్ విమానాశ్రయం సమీపంలో.. కుద్స్ఫోర్స్ కమాండర్ ఖాసీం సులేమానీ లక్ష్యంగా దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ తన క్షిపణులతో ఇరాక్లో అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న అల్-అసద్ వైమానిక స్థావరంపై విరుచుకుపడింది. అప్పట్లో కూడా ఇరాన్ ముందస్తుగా సమాచారం ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఈ దాడులతో అమెరికా సైనికులకు ప్రాణనష్టం జరగకున్నా.. అప్పట్లో అక్కడ పనిచేసిన సైనికులు ఇప్పుడు అదే ట్రామాలో కొనసాగుతూ మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారనే నివేదికలు వచ్చాయి.గతంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇప్పుడు దాడులు-ప్రతిదాడుల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టమవుతోంది. అమెరికా సైనిక శక్తి విషయంలో బలంగా ఉంది. ఇరాన్ ఆ విషయంలో చాలా వెనుకబాటులో ఉంది. అయితే.. బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధాలను సమకూర్చుకోవడంలో ఇరాన్ గడిచిన మూడేళ్లలో చాలా పురోగతి సాధించింది. అయితే.. సొంత ప్రజలే వ్యతిరేకంగా ఉండడంతో.. ఇరాన్ సర్కారు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని, కొన్ని ప్రాంతాలపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందంటూ ఇటీవల నివేదికలు వచ్చాయి.ఖమేనీ ఇప్పటికీ టెహ్రాన్లోనే ఉన్నాడా? లేక రష్యాలో తలదాచుకుంటున్నాడా? ఇప్పుడు ఈ ప్రశ్నలు చర్చనీయాంశాలయ్యాయి. అయితే.. అమెరికా నిఘా సంస్థలు మాత్రం ఖమేనీ ఉనికిపై ఓ స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైనా.. యుద్ధ విమానాలు, సేనలను ఇరాన్ చుట్టూ మోహరిస్తున్నా.. ప్రజలకు నష్టం కలగకుండా.. కలుగులో దాక్కొన్న ఖమేనీ, నియంతృత్వ భావాలున్న ఇతర నాయకులే అమెరికా లక్ష్యమని స్పష్టమవుతోంది. అంటే.. పరిమిత ప్రాంతాలపైనే.. ఇంకా చెప్పాలంటే నిర్ణీత భవనాలు, బంకర్లపైనే అమెరికా దాడులు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఇరాన్ గార్డ్స్, సైన్యాధికారులు కూడా తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలోనైనా ట్రంప్ సేనలు ఇరాన్ పెద్దలను బంధించేందుకు దాడులు జరిపే అవకాశాలున్నాయి. -
Donald : ఆయన భార్య అందగత్తె.. అందుకే పదవి ఇచ్చా!
-
ట్రంప్ శాంతి మండలి.. ఫస్ట్ షాక్
గాజా సంక్షోభాన్ని చల్లార్చే క్రమంలో.. బోర్డు ఆఫ్ పీస్ పేరిట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హడావిడి చూస్తున్నదే. ఇప్పటికే ఈ జాబితాలో 35 దేశాలు చేరాయి. రష్యా(చేరుతుందని ట్రంప్ ప్రకటించినా పురోగతి కనిపించడం లేదు), చైనా, జీ7 కూటమిలోని కొన్ని దేశాలు(యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా) ఇంకా చేరలేదు. భారత్ కూడా వాణిజ్య ఒప్పందం ఖరారు కాకపోవడంతో తన వైఖరిని స్పష్టం చేయకుండా దోబుచులాడుతోంది. ఈ క్రమంలో ట్రంప్ ఆహ్వానాన్ని నేరుగా తిరస్కరించింది న్యూజిలాండ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రారంభించిన శాంతి మండలికి తొలి షాక్ తగిలింది. ఇందులో చేరాలని ఇచ్చిన ఆహ్వానాన్ని న్యూజిలాండ్ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు ఆ దేశపు ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతానికి ఇందులో చేరకూడదనే నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారాయన. న్యూజిలాండ్ ఏం చెబుతోంది?ట్రంప్ ఈ బోర్డును గత వారం ప్రారంభించారు. మొదటగా గాజా ప్రాంతంలో తాత్కాలిక కాల్పుల విరమణను బలపరచడమే లక్ష్యంగా ఉన్నా, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా విస్తృత పాత్ర పోషించాలనే ఉద్దేశం ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ స్పందిస్తూ.. ఇది కొత్త సంస్థ. దీని పరిధి, భవిష్యత్తు పాత్రపై స్పష్టత అవసరం ఉంది. అప్పుడే మా నిర్ణయాన్ని కూడా చెప్పగలం అని పేర్కొన్నారు. ఇదే విషయంపైనా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ‘‘గాజా సమస్యపై ఇప్పటికే ప్రాంతీయ దేశాలు ముందుకు వచ్చి సహకరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో న్యూజిలాండ్ పీస్ బోర్డులో చేరడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. న్యూజిలాండ్ అనేది ఇప్పటికే ఐక్యరాజ్యసమితి స్థాపక సభ్యదేశం. అలాంటప్పుడు ఈ కొత్త బోర్డు చేసే పనులు UN చార్టర్కు అనుగుణంగా ఉండాల్సిందే’’ అని విన్స్టన్ పీటర్స్ స్పష్టం చేశారు.ఇప్పటికే ట్రంప్ పీస్ బోర్డులో టర్కీ(తుర్కియే), ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి మధ్యప్రాచ్య(Middle East) దేశాలు. అలాగే ఇండోనేషియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం చేరాయి. కానీ, అమెరికాతో మంచి సంబంధాలు ఉన్న దేశాలు సైతం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండడం కొసమెరుపు.భారత్ ఇంకా ఎందుకు చేరలేదు?భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ట్రంప్ ఆహ్వానం పంపించారు. అయితే భారత్ ఈ బోర్డు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ బోర్డు అంతర్జాతీయ చట్టబద్ధత, దీర్ఘకాల ప్రభావాలపై స్పష్టత లేకపోవడాన్ని భారత్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పైగా ఈ బోర్డు యూఎన్ చార్టర్కు విరుద్ధంగా ఉండే అవకాశం ఉండడం, ఐరాస శాంతి దళాల పనిని బలహీనపర్చవచ్చనే ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటోంది. అన్నింటికీ మించి పాకిస్తాన్ ఈ బోర్డులో చేరడంతో భారత్కు ఇది సున్నితమైన అంశంగా మారింది. ఈ క్రమంలో వేచిచూడాలనే ధోరణితో వ్యూహాత్మక వైఖరిని అవలంభిస్తోంది భారత్. -
ఇరాన్లో ఖమేనీని తొలగిస్తే.. రూబియో సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దాడులు చేస్తామని అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తుండగా.. తాము తగ్గేదేలా అనే విధంగా ఇరాన్ యుద్ధానికి రెడీ అవుతోంది. పశ్చిమాసియా దేశాల మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్ నిమగ్నమైంది. ఇలాంటి తరుణంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని తొలగిస్తే.. అంటూ కామెంట్స్ చేయడం కొత్త చర్చకు దారి తీసింది.అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇరాన్లో పాలన మార్పు తర్వాత ఏం జరుగుతుందనే ప్రశ్నలకు రూబియో స్పందిస్తూ.. ‘ఇరాన్లో ఎవరు అధికారం చేపడతారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రభుత్వం ఎన్నోఏళ్ల నుంచి పాతుకుపోయి ఉంది. అక్కడున్న అధికారులు, సైన్యం.. ఖమేనీ ఆదేశాల మేరకే నడుచుకుంటారు. సుప్రీం లీడర్, పాలన పడిపోతే.. అక్కడ తర్వాత ఏం జరుగుతుందనే ప్రశ్నకు బదులివ్వడం కష్టం. ఇరాన్లో పాలన ఖమేనీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో పాటు ఎన్నికైన వ్యక్తుల మధ్య విభజించి ఉంది. ఇది వెనెజువెలా కంటే చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎదురైతే దానిపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పశ్చిమాసియా అంతటా అమెరికా సైన్యాన్ని బలోపేతం చేయాలనే ట్రంప్ నిర్ణయాన్ని రూబియో సమర్థించారు. అమెరికన్ బలగాలు, భాగస్వాములపై దాడి చేసేందుకు ఇరాన్ సామర్థ్యాన్ని కూడగట్టుకుంటుందన్నారు.BREAKING: 🚨🇺🇸🇮🇷 Marco Rubio warns that no one knows who will lead Iran after Khamenei. pic.twitter.com/yNmCeqsms4— Globe Observer (@_GlobeObserver) January 29, 2026మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ను హెచ్చరించిన విషయం తెలిసిందే. అణు ఒప్పందంపై చర్చలకు రాని పక్షంలో ఇరాన్పై భీకర స్థాయిలో విరుచుకుపడతామని వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాలను నిషేధించే ఒప్పందం అందరికీ మేలు చేస్తుంది. భారీగా యుద్ద నౌకలు ఇరాన్వైపు వెళుతున్నాయి. సమయం లేదు. ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్కు మరోసారి చెబుతున్నా. ఇరాన్ చర్చలకు రాకపోతే గతంలో కంటే భీకరస్థాయిలో దాడులు చేస్తాం.. నాశనం తప్పదని హెచ్చరించారు. మరోవైపు ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమను యుద్ధం దిశగా నెడితే.. గతంలో ఎన్నడూ చేయని స్థాయిలో దాడి చేస్తామంది. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. అమెరికా దాడి నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్ నిమగ్నమైంది. -
ఈయూ, భారత్ ట్రేడ్పై అమెరికా ఓవరాక్షన్!
వాషింగ్టన్: భారత్, యురోపియన్ యూనియన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వేళ అగ్రరాజ్యం అమెరికా.. భారత్ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు కురిపిస్తోంది. తాజాగా అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్.. భారత్, ఈయూ వాణిజ్య ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించారు, ఈ ఒప్పందం యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు ఇవ్వడం కంటే వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఈయూ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. భారత్తో వాణిజ్యం విషయంలో ఈయూ నిర్ణయం పట్ల నిరాశ చెందాను. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ ఒప్పందాన్ని అన్ని ఒప్పందాలకు తల్లిగా ప్రశంసించారు. కానీ, వారు తమకు ఏది ఉత్తమమో అది చేయాలి. భారత్పై అమెరికా సుంకాలను విధించడాన్ని ఈయూ ఇష్టపడటం లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25 శాతం సుంకాలను విధించాం. కానీ.. ఏం జరిగిందో చూశారా? యురోపియన్లు భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. అమెరికాలాగే భారత్పై అదనపు సుంకాలు విధించేందుకు ఈయూ విముఖత వ్యక్తం చేసిందన్నారు. సొంత వాణిజ్య ఒప్పందానికి ముందుకు వెళ్తున్నందునే.. వారు ఆ పని చేసేందుకు ఇష్టపడలేదన్నారు. ఐరోపా ఉక్రెయిన్ ప్రజల కంటే వాణిజ్య ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. రష్యన్ చమురు తొలుత భారత్కు వెళ్తోంది. అక్కడి నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు బయటకు వస్తున్నాయి. వాటిని ఐరోపావాసులు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నారు’ అంటూ విమర్శలు గుప్పించారు.Bessent: "I find the Europeans very disappointing because the Europeans are on the frontline of the Ukraine-Russia war. India started buying sanctioned Russian oil and guess who was buying the refined products? The Europeans. So the Europeans have been funding the war against… pic.twitter.com/QSkcdYL7QL— Aaron Rupar (@atrupar) January 28, 2026అంతకుముందు కూడా బెసెంట్.. భారత్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్పై అమెరికా విధించిన సుంకాలు సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు బెసెంట్ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ‘రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించుకుంది. అది భారీ విజయం. చమురు విషయంలో ఇప్పటికీ టారిఫ్లు అమల్లో ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉందని అనుకుంటున్నాను’ అని సుంకాల తొలగింపు గురించి పరోక్షంగా వెల్లడించారు. -
ఒప్పందం చేసుకోకుంటే మారణహోమమే
వాషింగ్టన్/బాగ్దాద్: బద్ధ శత్రువు ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి దాడుల హెచ్చరికలు చేశారు. అణ్వాయుధాల్లో వినియోగం కోసం కొనసాగిస్తున్న అత్యంత నాణ్యమైన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని తక్షణం నిలిపేయాలని ఇరాన్కు సూచించారు. మాట వినకపోతే మారణహోమం తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు తన సొంత సామాజికమాధ్యమం ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘ భారీ స్థాయిలో యుద్ధనౌకలు, సైన్యం ఇరాన్ దిశగా కదులుతోంది. అత్యంత శక్తివంత ఆయుధాలతో, ఉత్సకతతో, సదుద్దేశంతో సాయుధులు ఇరాన్ వైపుగా వెళ్తున్నారు. ప్రతిష్టాత్మక యుద్ధ విమాన వాహకనౌక ‘అబ్రహాం లింకన్’ ఈ బలగాలకు సారథ్యం వహిస్తోంది. వెనెజువెలాలో మాదిరే ఆపరేషన్కు సిద్ధమవుతోంది. వెనెజువెలాలో తరహాలో మిషన్ను పూర్తిచేసేందుకు ఉత్సాహం చూపిస్తోంది. అవసరమైతే వేగంగా, హింసాత్మకంగా పని పూర్తిచేస్తారు. ఇరాన్ త్వరగానే చర్చలకు ముందుకొస్తుందని ఆశిస్తున్నా. అణ్వాయుధాలు ప్రయోగించాల్సిన పనిలేకుండానే సామరస్యంగా చర్చలు జరుపుదాం. సమయం మించిపోతోంది. ఇప్పటికైనా ఇరాన్ మాతో ఒప్పందం కుదుర్చుకోవాలి. లేదంటే ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ సిద్ధంగా ఉంది. ఇరాన్ వినాశనం తప్పదు. మేం చేసే తదుపరి దాడి దారుణంగా ఉంటుంది. అలా జరక్కుండా చూసుకోండి’’ అని ట్రంప్ హెచ్చరించారు. దాడులు చేస్తామని భయాందోళనలు ఓవైపు పెంచుతూ మళ్లీ చర్చలకు కూర్చోవాలంటే కుదరదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వ్యాఖ్యానించిన కొన్ని గంటలకే ట్రంప్ పైవిధంగా మరోసారి హెచ్చరికలు చేయడం గమనార్హం. -
మా భూమిపై కాలు పెడితే అంతే.. ఇరాన్ హెచ్చరిక
ఇరాన్, అమెరికా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రియమైన భూమిపై జరిగే దాడిని ఎదుర్కొవడానికి ఇరాన్ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయన్నారు. అందుకోసం భద్రతబలగాలు ట్రిగ్గర్పై వేలు ఉంచాయన్నారు.ప్రస్తుతం ఇరాన్- అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ వైపు తమ భద్రతా బలగాలు కదిలాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ సమయంలోనైనా అమెరికా దాడి చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అమెరికాను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు.ఆయన మాట్లాడుతూ" మా శక్తివంతమైన సైనికులు సిద్ధంగా ఉన్నారు. వారి వేలు ట్రిగ్గర్స్ పై ఉన్నాయి. మా గాలిపై, భూమిపై, సముద్రంపై, ఎటువంటి దాడి జరిగినా ఎదుర్కొవడానికి వారు రెడీ అని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదే సమయంలో ఇరు దేశాలకు ప్రయోజనకరమైన న్యాయమైన అణు ఒప్పందాన్ని ఇరాన్ స్వాగతిస్తుందని తెలిపారు.అయితే ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగారు. అణ్వయుధ ఒప్పందంపై ఇరాన్ పాలకులు చర్చలకు అంగీకరించకపోతే తమ తదుపరి దాడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. దీనికోసం అమెరికా విమాన వాహన నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అమెరికా నేవీ గల్ఫ్ ప్రాంతంలోకి ప్రవేశించిందని తెలిపారు. -
ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికాలో ఆందోళనలు
-
హెచ్–1బీలకు ఉద్యోగాలివ్వకండి
హూస్టన్: ప్రభుత్వ నిధులతో పనిచేసే తమ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, విభాగాల్లో హెచ్–1బీ వీసాదారుల నియమాకాలను తక్షణం నిలిపేయాలని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో హెచ్–1బీ ఉద్యోగ వీసాదారుల కష్టాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ‘‘టెక్సాస్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ టెక్సాస్ కార్మికులు, టెక్సాస్లోని సంస్థల యాజమాన్యాల ప్రయోజనాల కోసం మాత్రమే పాటుపడాలి. ఇలాంటి టెక్సాస్లో హెచ్–1బీ వీసా పథకంలో పలు అవకతవకలు జరిగాయని తెలుస్తోంది. హెచ్–1బీ వీసాలను పలువురు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో ఉద్యోగాలు అమెరికా కార్మికులకే దక్కాలి. అలాగే టెక్సాస్లో ఉద్యోగ అవకాశాలు టెక్సాస్ ప్రజలకే దక్కాలి. అందులో భాగంగానే మన రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారుల నిధులతో పనిచేసే అన్ని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్న హెచ్–1బీ వీసాదారుల పిటిషన్ల పరిశీలనను తక్షణం నిలిపేయండి’’ అని వర్సిటీలు, ఏజెన్సీలకు రాసిన లేఖలో గ్రెగ్ పేర్కొ న్నారు. ‘‘నియామకాల నిబంధనలను కఠినతరం చేశాం. హెచ్–1బీ వీసాదారులను నియమించుకునే ప్రక్రియను 2027 మే 31వ తేదీదాకా నిలిపివేస్తున్నాం. కొన్ని ఉద్యోగాల్లో హెచ్–1బీ వీసాదారులను నియమించుకోవడం తప్ప మరో మార్గంలేదని టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్ నుంచి సిఫార్సు లేఖలు తీసుకొచ్చిన సందర్భాల్లో మాత్రమే పాక్షికంగా మినహాయింపు వర్తిస్తుంది’’ అని ఆయన స్పష్టంచేశారు. ‘‘ మీ పరిధిలో ఎంత మంది హెచ్–1బీ వీసాదారులకు ఉద్యోగాలిచ్చారు? ఎలాంటి ఉద్యోగాలిచ్చారు? వాళ్లది ఏ దేశం? వాళ్ల వీసా గడువు తేదీలను పేర్కొంటూ వివరాలు సమర్పించండి’’ అని గ్రెగ్ ఆదేశించారు. టెక్సాస్ ప్రభుత్వ వర్సిటీల్లో వందలాది మంది విదేశీ బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో ఇంజనీరింగ్, ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక రంగాల నుంచి భారతీయులు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు. హెచ్–1బీ వీసాదారుల ఉద్యోగ నియమకాలు ఆగిపోతే వర్సిటీల్లో పరిశోధన, ఆవిష్కరణ రంగాలు కుదేలయ్యే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రెగ్ నిర్ణయంతో స్థానికులకు ఉద్యోగాలు దక్కుతాయని కొందరు భావిస్తుంటే ఉన్నత విద్య, పరిశోధనలో అంతర్జాతీయంగా టెక్సాస్ పోటీతత్వం తగ్గిపోతుందని విమర్శకులు వ్యాఖ్యానించారు. -
దక్షిణ కొరియాకు ట్రంప్ బెదిరింపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతేడాది కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని ఇప్పటి వరకు అమలు చేయని కారణంగా దక్షిణ కొరియాపై టారిఫ్లు విధించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.ఈ సందర్భంగా ఔషధాలు, ఆటోమొబైల్ తదితర రంగాలకు చెందిన ఉత్పత్తులపై 15 నుంచి 25 శాతం వరకు టారిఫ్లను వసూలు చేస్తామని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య గతేడాది జూలైలో వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీన్ని దక్షిణ కొరియా పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ‘వాణిజ్య ఒప్పందాలు మాకు చాలా ముఖ్యమైనవి. ఒప్పందాలు కుదిరిన చోట్ల టారిఫ్లు తగ్గించుకుంటూ వస్తున్నాం. భాగస్వామ్య దేశాలు కూడా ఇదే రీతిలో స్పందిస్తాయని భావిస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ హెచ్చరికలపై దక్షిణ కొరియా ప్రభుత్వం స్పందించింది. హామీ ఇచ్చిన విధంగా అమెరికాలో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని, ఒప్పందంలోని ఇతర అంశాలపై ఉన్నత స్థాయి సంప్రదింపులు కొనసాగిస్తామని తెలిపింది. -
మీ పాలసీ మాకొద్దు.. అమెరికాలో ట్రంప్పై వ్యతిరేకత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీపై USAలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. తాజాగా జరిపిన సర్వేలో ఇదే అంశం వెల్లడైంది. అమెరికాను గొప్పగా చేస్తానంటూ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు చర్యలతో ఆ దేశ ప్రజలలో ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తుంది. "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" అనేది అమెరికా అధ్యక్షుడి ఎన్నికల నినాదం యుఎస్ఎను మరోసారి స్ట్రాంగ్ చేస్తానంటూ ప్రచారం చేసిన ట్రంప్ ఎట్టకేలకు రెండోసారి అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అనంతరం అమెరికా సొమ్మును వేరే దేశాల వారు దోచుకుంటున్నారంటూ హంగామా చేసి ఇష్టారీతిన ఇమిగ్రేషన్ పాలసీని మార్చి వలస కార్మికులపై కఠిన నిబంధనలు విధించారు. తాజాగా ఇప్పుడు ఆ నిబంధనలే ఆయనపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకతను పెంచేలా చేశాయి.అమెరికాలో వలస నియంత్రణ కోసం పనిచేస్తున్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారుల దాడులు ఇటీవల శృతిమించుతున్నాయి. గతేడాది వీరు జరిగిన దాడుల్లో 32మంది మరణించగా ఇటీవల మిన్నెసోటా రాష్ట్రంలో జరిపిన కాల్పుల్లో మరో ఇద్దరు మరణించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వలసవిధానంపై అమెరికన్లు గుర్రుగా ఉన్నారు. కేవలం 39 శాతం ప్రజలు మాత్రమే ట్రంప్ వలస విధానంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే గత నెలలో ఈ సంఖ్య 41శాతంగా ఉంది. దీనిని 53 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు తేలింది. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో ఆయన నిర్ణయాలకు 50 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. అయితే మెుత్తంగా ఆయన నిర్ణయాలకు జనవరిలో 41శాతం మంది ఆమెదం తెలుపగా ప్రస్తుతం ఆ సంఖ్య 38 శాతానికి దిగజారింది -
నన్ను ఎలా గుర్తుంచుకుంటారో.. ట్రంప్ అంతర్గత మథనం?
గత కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం సరిగ్గా లేదంటూ పుకార్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆయనకు వయసైందని ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ట్రంప్ వీటన్నిటిని కొట్టిపడేసి ఐయామ్ ఆల్రైట్ అన్నారు. అయితే తన వృద్ధాప్యం నేపథ్యంలో ట్రంప్ మనసులోని మాటపై న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ ఒక ఆసక్తికర కథనం ప్రచురించిందిన్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ నివేదిక ప్రచురించిన కథనంలో డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తులో ప్రజలు తనను ఏఅంశంలో గుర్తుంచుకుంటారో అనే విషయంపై అధికంగా ఆలోచిస్తున్నారని ప్రచురించింది.అయితే ట్రంప్ తన జుట్టుకు గోల్డ్ కలర్ వేయడానికి ఇష్టపడట్లేదని దానిని నేచురల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారని పేర్కొంది. ఆయన మనస్సులో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారని తెలిపిందిఅయితే ట్రంప్ వ్యక్తిత్వంపై ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ మాట్లాడుతూ "ట్రంప్ మూఢనమ్మకం గల వ్యక్తి, ఆయనమరణం గురించి ఆలోచించడానికి ఇష్టపడడు. అతను భవిష్యత్తు కంటే వర్తమానంలో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతారు. ఎదో విధంగా ఆయన అందరి మనస్సులో ఉన్నారు. ఆయనకు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి". అన్నారు.అయితే ఇటీవల వైట్ హౌస్ ఆయనను అత్యంత శక్తివంతమైన అధ్యక్షుఽడిగా అభివర్ణించింది. ఆయనకు సగటు మనిషికంటే ఎక్కుువ ఓర్పు,శక్తి ఉన్నాయి. ఆయన జ్ఞాపకశక్తి అద్భుతంగా ఉంది. ఆయన ప్రస్తుతం మరింతగా కష్టపడి పనిచేయగలరు. అని డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ట్రంప్ ఆయన వైద్యులు సూచించిన దాని కంటే అధిక మోతాదులో ఆస్పిరిన్ తీసుకుంటానన్నారు. తనకు 81 మి.గ్రా సూచించగా తాను మాత్రం రోజుకు 325 మి.గ్రా. ఆస్పిరిన్ తీసుకుంటానని వెల్లడించాడు, క్యాబినెట్ సమావేశాల్లో నిద్రపోతున్నట్లు వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ అంతర్గత మథనంపై టైమ్స్ మ్యాగజైన్ ఆసక్తికర నివేదిక ప్రచురించింది. -
ఈసారి రాజకీయ దావోస్
స్విట్జర్లాండ్లోని దావోస్లో ‘ప్రపంచ ఆర్థిక సదస్సు’లు ఇంతకుముందు 1971 నుంచి 55 సార్లు జరిగాయి గానీ, ఈ తరహా పరిస్థితులు ఎప్పుడూ తలెత్తినట్లు లేవు. సాధారణంగా ఆ సదస్సు అజెండా లోకి ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం, ప్రైవేట్ రంగానికీ ప్రభుత్వాలకూ మధ్య సహ కారం, సామాజిక అసమానతలు, సాంకే తిక రంగం, వాతావరణ పరిరక్షణ, రాజ కీయ సుస్థిరతల వంటి అంశాలు వస్తాయి. వీటన్నింటిని కూడా ఆర్థిక రంగ కోణం నుంచే చూస్తారు. అందుకే వాటికి ఆర్థిక సదస్సులనే పేరు వచ్చింది. కానీ, ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగిన సమావేశాలలో ఈ అంశాలపై ఏ చర్చలు జరిగినా జరగకున్నా, గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ వివాదాలు రాజ్యమేలాయి. అది ఆర్థిక దావోస్కు బదులు రాజకీయ దావోస్ అయింది.మిత్రుల మధ్యే భేదాభిప్రాయలుతిరిగి అందులోనూ గమనార్హమైన విశేషం ఒకటున్నది. దావోస్ సమావేశాలు మొదలైనప్పటినుంచి ఇంతవరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అమెరికా, యూరప్ కలిసి శాసిస్తూ వచ్చాయి. అటువంటిది ఈసారి ఆ రెండు పక్షాల మధ్యనే భేదాభిప్రాయాలు ఏర్ప డ్డాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్ ఉడ్స్ సమావేశా లతో ఆరంభించి అమెరికా, యూరప్లు కలిసి పలు అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య సంస్థలను సృష్టించాయి. అన్ని చట్టాలూ తామే చేశాయి. ఆర్థిక, వాణిజ్య రంగాలను తమ గుప్పిట పెట్టుకుని లాభ పడ్డాయి. అటువంటిది ఈసారి సమావేశాలు వచ్చేసరికి అంతర్గత విభేదాలతో పరస్పరం కత్తులు దూసుకున్నాయి. ఈసారి దావోస్ భిన్నమైనది కావటం అందువల్లనే!అయితే ఇది ఆకస్మిక పరిణామం కాదు. ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత గత ఏడాదిగా ఉభయపక్షాల మధ్య పొగ రాజుకుంటూనే వస్తున్నది. అది, తక్కిన దేశాలతో పాటు యూరప్పై భారీ సుంకాలు, ఉక్రెయిన్ విషయంలో రష్యా అను కూల వైఖరి తీసుకోవటం, యూరప్ తన రక్షణ వ్యయాన్ని రెట్టింపు చేసి తన భద్రతను తాను చూసుకోవాలనటం, ‘నాటో’తో సంబంధాలు గతంలో వలె ఉండబోవన్న సూచనలు, యూరప్ ఇంతకాలం ‘తమపై పడి తిన్న’దనే తరహా వ్యాఖ్యలు, యూరప్లోని ఉదార వాద ప్రభుత్వాలు, పార్టీలకు వ్యతిరేకంగా తమ తరహా మితవాద – జాతీయవాద పార్టీలకు బహిరంగ మద్దతు వంటి చర్యలు ఆ పొగకు కారణమయ్యాయి. అలాగే గత కొద్ది నెలలుగా యూరప్ను ఈసడించి మాట్లాడటం ఒకటైతే, గత నవంబర్లో ట్రంప్ ప్రకటించిన ‘జాతీయ భద్రతా వ్యూహ పత్రం’లో అదే వైఖరిని చూపుతూ, అసలు యూరోపియన్ నాగరికత అన్నదే ‘తుడిచి పెట్టుకుపోయే’ పరిస్థితి వచ్చిందనటం మరొకటి అయింది.గ్రీన్ల్యాండ్తో పైపైకి...ఆ విధంగా పొగలు దట్టం కాగా, తమ సాటి ‘నాటో’ దేశమైన డెన్మార్క్కు చెందిన గ్రీన్ల్యాండ్ విషయమై జరుగుతున్న తతంగంతో ఆ పొగ కాస్తా భగ్గున మంటగా మారింది. మొదట ఇదే విధంగా కెనడాను సైనిక బలంతోనైనా తమ 51వ రాష్ట్రంగా మార్చుతామన్న ట్రంప్ పుట్టించిన ఆ మంటలు ఇప్పటికీ ఆగ్రహాన్ని రగుల్చుతుండగా, ఇపుడు గ్రీన్ల్యాండ్ను బలప్రయోగంతో 51వ రాష్ట్రం చేయగల మనటం అగ్నికి ఆజ్యంగా మారింది. గత వారపు దావోస్కు ముందు అందరూ ఎవరి దేశంలో వారుండి రాళ్ళు విసురుకోగా, దావోస్లో ఒకేచోట సమావేశమయే పరిస్థితితో బాహాబాహీ వంటి సన్నివేశాలు కనిపించాయి.ఇది అంతిమంగా ఏ విధంగా పరిణమించేదీ చెప్పలేము. మౌలికంగా ఇరువురివీ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విధానాలు. ఉభయుల ప్రయోజనాలు కలిసి ఉన్నాయన్నది ట్రంప్ వ్యూహపత్రంలోనూ వివరించిన విషయమే. కానీ గతానికీ, ఇప్పటికీ ఒక కీలక మైన తేడా ఉంది. ‘అమెరికా ఫస్ట్’, ‘మాగా’ లక్ష్యాలను ప్రకటించిన ట్రంప్, యూరప్ సహా ప్రపంచ దేశాలన్నింటినీ అందుకోసం ఉప యోగించుకోవటమే తన విధానమైనట్లు ఆ పత్రంలో దాపరికం లేకుండానే ప్రకటించారు. ఆ పద్ధతిలో ముందుకు సాగుతుండటం వల్లనే ఇరువురి మధ్య గతంలో లేని విధంగా పొగలు, మంటలు రాజుకుంటున్నాయి. దావోస్లో సమావేశాలు జరుగుతున్నప్పుడు, అవి ముగిసిన తర్వాత కూడా రెండు వైపుల నుంచి వినవచ్చిన మాటలను గమనించగా, రాజీలు కనీసం ప్రస్తుతానికి జరగక పోవచ్చు. తన వ్యూహాలు, ఎత్తుగడలు నెగ్గే పరిస్థితి లేదని ట్రంప్ గ్రహించి బాగా వెనుకకు తగ్గితే తప్ప. కానీ ఆయన స్వభావం తెలిసిన వారిలో అటువంటి ఆశాభావం కనిపించటం లేదు.ఢీ అంటే ఢీపరిస్థితి అర్థం అయేందుకు రెండువైపుల నుంచి వినవచ్చిన కొద్ది మాటలను గమనించాలి. ట్రంప్ అన్నది, ‘నేను మితిమీరిన బలప్రయోగానికి నిర్ణయిస్తే తప్ప బహుశా మాకేదీ లభించదు. అపుడు మమ్ములను ఎవరూ ఆపలేరు. అయితే నేనాపని చేయను’. ఇది గ్రీన్ల్యాండ్ గురించినది. మరొకవైపు యూరోపియన్ యూని యన్ కమిషనర్ ఉర్సులా వ్యాఖ్యలు ఇవి: ‘గతాన్ని (ఇరువురి సంబంధాలపై) గుర్తు చేసుకున్నంత మాత్రాన గత వ్యవస్థలు,సంబంధాలు తిరిగి రావు. ఈ మార్పే గనుక శాశ్వతమైతే, యూరప్ కూడా శాశ్వతంగా మారాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కుని ఒక కొత్తదైన యూరప్ను శాశ్వతంగా నిర్మించుకోవాలి’. ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన గీతా గోపీనాథ్, ‘అమెరికా, యూరప్ల మధ్య విశ్వాసమన్నది పూర్తిగా భంగపడి పోయింది. ఇపుడు యూరప్ ఆర్థికంగా, అంతర్గత భద్రత రీత్యా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కోసం ఆలోచిస్తున్న’దని అన్నారు.ఈ కొత్త పరిస్థితికి బాగా అద్దం పట్టింది కెనడా ప్రధాని మైక్ కార్నీ ఉత్తేజకర ప్రసంగం. అది అంతే ఆలోచనాస్ఫోరకం కావటంతో వెంటనే దావోస్లోనే గాక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్కు అదే స్థాయిలో ఆగ్రహాన్ని తెప్పించింది. దానిపై ఆయన వ్యాఖ్యను హైదరాబాద్ పరిభాషలో చెప్పాలంటే, ‘యాద్ రఖ్లో బేటా, దేఖ్ లూంగా’ అవుతుంది. అట్లా అని ఊరుకోలేదు. అమెరికా లేనిదే కెనడా అసలు బతకలేదన్నారు. దానిని కార్నీ తిప్పి కొట్టడమేగాక, పది రోజుల క్రితం చైనా వెళ్లి భారీ ఒప్పందాలు చేసుకున్నారు. పైగా చైనా నమ్మదగ్గ భాగస్వామి అనీ, అమెరికా కాదనీ ప్రకటించటాన్ని ట్రంప్ గుర్తు చేసుకుంటూ... ఆ ఒప్పందాలు చేసుకున్నందుకు కెనడాపై వందశాతం సుంకాలు విధించగలనని ప్రకటించారు. వాస్తవానికి కార్నీ ప్రసంగం పూర్తి పాఠంగా పత్రిక లలో రాదగ్గది. మొత్తంమీద ఈసారి దావోస్ సమావేశాల ప్రభావం దీర్ఘకాలం ఉండనున్నది.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
'ముందు 50 శాతం డాడీ ట్యాక్స్ చెల్లించండి': ట్రంప్ పోస్ట్!
సుదీర్ఘ నిరీక్షణ తరువాత భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ చర్యను ప్రశంసిస్తూ.. ఇది అన్ని ఒప్పందాలకూ తల్లి లాంటిదని (మదర్ ఆఫ్ ఆల్ డీల్స్)అన్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించినట్లు.. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.అబద్దాలకోరు ఉర్సులా & భారత బృందం 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' అనే ఒప్పందంపై సంతకాలు చేస్తున్నారని నేను వింటున్నాను. ఇది చాలా బాగుంది. నేను దేశాన్ని పాలిస్తుంటే, వాళ్లు ఇంట్లో కూర్చుని ఆటలు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఒక డాడీ ఉన్నాడని అందరికీ తెలుసు, అతను ఓవల్ ఆఫీస్లో కూర్చుని అమెరికాను మళ్లీ ధనిక దేశంగా మారుస్తున్నాడు అని పోస్టులో వెల్లడించారు.అంతే కాకుండా.. యూరోపియన్ యూనియన్ దివాలా తీసింది కాబట్టే వాళ్లు ఒక తల్లి కోసం వేడుకోవాల్సి వచ్చింది. బహుశా వాళ్లు తమ సొంత బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నారు కాబోలు!. నేను భారతదేశంతో చెప్పాను. మీకు ఒప్పందం కావాలా? అయితే ముందుగా 50 శాతం డాడీ ట్యాక్స్ (టారిఫ్లు!) చెల్లించండి. ఇది జరగబోయే ఒక పెద్ద విపత్తు. నా ఒప్పందాలు భారీగా ఉంటాయని, ఆ ఒప్పందం ఒక హైస్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ మాదిరిగా ఉందని కూడా పేర్కొన్నారు.సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కానీ ట్రంప్ ట్రూత్ సోషల్లో ఇలా పోస్ట్ చేసినట్లు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.భారత్ - ఈయూ డీల్ ప్రయోజనాలుఇండియా.. యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఒప్పందం కారణంగా.. మన దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు పెరుగుతాయి. ట్యాక్స్ తగ్గించడంతో.. వీటి ధరలు చాలా వరకు తగ్గుతాయి. తద్వారా.. మన దేశంలో ప్రీమియం కార్ల ధరలు, మెడిసిన్స్ ధరలు, మద్యం ధరలు చాలా వరకు తగ్గుతాయి. అంతే కాకుండా.. ఎలక్ట్రానిక్ & హై-టెక్ యంత్రాలపైన, ఉక్కు & రసాయన ఉత్పత్తులపైన ట్యాక్స్ రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం. -
చావును వెతుక్కుంటూ 70 కి.మి ప్రయాణించి.. చివరకు..The Nihilist Penguin సోర్టీ ఇదే
ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతోంది.. డెడ్లైన్లు, బాధ్యతలు, బిల్లులు, stress… ఈ గందరగోళం మధ్య “ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లిపోవాలి?” అనే భావన చాలామందిలో ఉంటుంది. ఇప్పుడు కనిపించబోయే ఈ సీన్… మీ మనసు లోతుల్లో ఉన్న భావనకి మౌనంగా సమాధానం.ఇంటర్నెట్లో ఓ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అదే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే ఒక చిన్న పెంగ్విన్. దాన్ని నెటిజన్లు ప్రేమగా “ది నిహిలిస్ట్ పెంగ్విన్” అని పిలుస్తున్నారు, అంటే ఇక ఏదీ పట్టించుకోని పెంగ్విన్. ఎందుకంటే అది వెళ్లే దారిలో ఎవరూ లేరు, ఏ శబ్దం లేదు, ఏ గమ్యం కూడా లేదు.ఈ వీడియో కొత్తది కాదు. ఇది 2007లో వచ్చిన ప్రఖ్యాత జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తీసిన Encounters at the End of the World అనే డాక్యుమెంటరీ నుంచి తీసుకున్న క్లిప్.డాక్యుమెంటరీ వీడియోలో డాక్టర్ డేవిడ్ ఎయిన్లే మాట్లాడుతూ.. ‘ఒక వేళ ఆ పెంగ్విన్ అక్కడి నుంచి తిరిగి కాలనీకి వచ్చేద్దామని అనుకున్నా కూడా సాధ్యపడదు. తిరిగి రావటం కూడా ‘డెత్ మార్చ్’ అవుతుంది. మార్గం మధ్యలోనే అది చనిపోయే అవకాశం ఉంది’ అని అన్నారు. ఆ డాక్యుమెంటరీ వీడియో తీసిన ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్జోగ్ మాట్లాడుతూ...వీడియో తీసిన కొంత సేపటికే ఆ పెంగ్విన్ చనిపోయి ఉంటుంది. అది చనిపోవడానికి ముందు అంటార్కిటికా మంచు పర్వతాల్లో దాదాపు 70 కిలోమీటర్లు ఒంటరిగా నడిచింది’ అని చెప్పారు. అయితే, ఆ పెంగ్విన్ అలా అన్నిటినీ వదలి చావును వెతుక్కుంటూ వెళ్లిపోవటం వెనుక ఉన్న సరైన కారణం ఇంత వరకు తెలియరాలేదు. తన భాగస్వామి చనిపోవటం వల్ల ఆ పెంగ్విన్ డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని, ఆ బాధలో డెత్ మార్చ్ చేసి ప్రాణాలు తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇప్పుడు ఈ క్లిప్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయింది. ముఖ్యంగా దీనికి ఒక పాటను జోడించిన తర్వాత ఇది మరింత ఎమోషనల్ గా మారింది. కానీ అసలు ప్రశ్న ఇదే… ఈ పెంగ్విన్ వీడియోకి ఇంత క్రేజ్ ఎందుకు? ఎందుకంటే ఇది మనల్నే చూపిస్తోంది. ఆఫీసు కుర్చీలో కూర్చొని, ల్యాప్టాప్ ముందు కళ్ళు ముడుచుకుని “ఇక చాల్రా… అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలి” అనిపించిన క్షణాల్ని ఇది గుర్తుచేస్తోంది. పెంగ్విన్ మాటలు మాట్లాడదు, కానీ దాని నడక చెబుతోంది – “నాకు శాంతి కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు కొంచెం ఒంటరితనం కావాలి.అని.ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..ఇది ఒక పెంగ్విన్ కథ కాదు, ఇది మన ఆత్మ కథ. అని కామెంట్లు పెడుతున్నారు. పెంగ్విన్ వీడియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఆ పెంగ్విన్తో తాను కూడా నడుచుకుంటూ వెళుతున్నట్లు ఓ ఏఐ ఫొటో క్రియేట్ చేశారు. -
ట్రంప్ కు బిగ్ షాక్...యూరప్ భారత్ మెగా డీల్
-
అలాంటి ఉద్దేశం ట్రంప్నకు లేనే లేదు, కానీ..
అమెరికాలో వలస నియంత్రణ కోసం పని చేస్తున్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) దాడులు మళ్లీ తీవ్రతరమయ్యాయి. ఈ క్రమంలో మిన్నెసోటా స్టేట్లో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికన్లలో ఆందోళన పెరిగిపోతుండగా.. ఐస్ వ్యతిరేక నిరసనలు ఒకసారిగా ఉధృతం అయ్యాయి. మరోవైపు.. ట్రంప్ సర్కార్ మానవ హక్కులను కాలరాస్తోందనే రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇమ్మిగ్రేషన్ అధికారులు నిరుడు జరిపిన దాడుల్లో.. 32 మంది మరణించారు. ఈ ఏడాదిలో మొన్నమధ్యే మిన్నెసోటా రాష్ట్రంలో ఐస్ అధికారులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఇది రాజకీయంగా పెను దుమారం రేపింది. జనాల ప్రాణాల్ని తీస్తున్న ట్రంప్ సర్కార్ అంటూ డెమోక్రటిక్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రిపబ్లికన్ పార్టీ మాత్రం ఈ దాడుల్ని సమర్థించుకుంటున్నారు. అదే సమయంలో పరిస్థితిని భూతద్దంలో చూపిస్తూ అమెరికన్లలో లేనిపోని భయాలను డెమోక్రాట్లే సృష్టిస్తున్నారని తిట్టిపోస్తోంది. ఇటు.. ప్రజాభిప్రాయ సర్వేలు మాత్రం అమెరికన్లలో మెజారిటీ ఐస్ దాడుల పద్ధతులను వ్యతిరేకిస్తున్నారు.వైట్ హౌస్ స్పందనమిన్నెసోటా ఘటనపై వైట్ హౌస్ స్పందించింది. అమెరికా వీధుల్ని నెత్తరోడ్చడం అధ్యక్షుడు ట్రంప్ ఉద్దేశం ఎంతమాత్రమూ కాదని పేర్కొంది. వైట్హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోనీన్ లెవిట్ మాట్లాడుతూ.. జనాల్ని గాయపర్చడమో.. చంపడమో ట్రంప్ ఉద్దేశం కాదని అన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారామె. ఈ పరిస్థితికి డెమోక్రటిక్ నాయకులే కారణమని ఆరోపించారామె. ఫెడరల్ అధికారులపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్, మేయర్ జాకబ్ ఫ్రేలపై ఆమె మండిపడ్డారు. ఇలాంటివి అవసరమా?న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మామ్దానీ ICE దాడులను “క్రూరమైనవి, మానవత్వరహితమైనవి” అభివర్ణించారు. ఆయన ఈ సంస్థను పూర్తిగా రద్దు చేయాలని పిలుపునిచ్చారు. ఏబీసీ ది వ్యూ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇలాంటి సంస్థకు అమెరికాలో స్థానం లేదన్నారు. అలాంటి దాడులు న్యూయార్క్ నగరం దాకా రానివ్వబోనని సవాల్ చేశారు.2026 మధ్యంతర ఎన్నికల్లో ఐస్ వ్యవహారం కీలకంగా మారే అవకాశం ఉందనే విశ్లేషణ నడుస్తోంది. అమెరికాలో ఈ ఏడాది నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 435 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సీట్లు, 35 సెనేట్ సీట్లు, అలాగే 39 రాష్ట్రాల్లో గవర్నర్ ఎన్నికలు జరుగుతాయి. ఇవి అమెరికా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఎన్నికలుగా భావిస్తున్నారు. కాబట్టి రెండో దఫా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్నకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమనే చెప్పొచ్చు. హౌస్ లేదంటే సెనేట్లో రిపబ్లికన్ పార్టీ ఆధిక్యం కోల్పోతే.. ఆయనపై ఇంపీచ్మెంట్ అవకాశాలు పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. -
భారత్-యూరప్ డీల్.. కొత్త టెన్షన్!
భారత్, యురోపియన్ యూనియన్ల ట్రేడ్ డీల్ ఓ కొలిక్కి రావడం అమెరికాకు ఏమాత్రం నచ్చనట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ అండ్ టీం వరుస ప్రకటనలు ఇస్తోంది. తాజాగా.. అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా యూరప్ దేశాలు తమపై యుద్ధానికి తామే నిధులు సమకూర్చుకుంటున్నాయని వ్యాఖ్యానించారాయన. ‘‘ఈ ఒప్పందం ద్వారా యూరప్ తన భద్రతను తానే బలహీనపర్చుకుంటోంది. ఉదాహరణకు.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25 శాతం సుంకాలను విధించాం. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చూశారా?. ఇప్పుడు యూరోపియన్లు భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడ ఓ విషయం గమనించాలి. రష్యన్ చమురు తొలుత భారత్కు వెళ్తోంది. అక్కడి నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు బయటకు వస్తున్నాయి. వాటిని యూరప్ ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా తమ తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నారు’’ అంటూ బెసెంట్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో వాణిజ్యం, ఇంధన రంగం మళ్లీ అమెరికా–యూరప్ సంబంధాల్లో ప్రధాన ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం ఉన్నట్లు సంకేతాలు అందించారాయన. మరోవైపు.. భారత్పై అమెరికా విధించిన సుంకాలు సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు బెసెంట్ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ‘‘రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించుకుంది. అది భారీ విజయం. చమురు విషయంలో ఇప్పటికీ టారిఫ్లు అమల్లో ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉందని అనుకుంటున్నాను’’ అని సుంకాల తొలగింపు గురించి పరోక్షంగా చెప్పారాయన. తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోనే ఉక్రెయిన్- రష్యా యుద్ధానికి తెరపడుతుందని బెసెంట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి పరిష్కారం చూపేందుకు ట్రంప్ కృషి చేస్తున్నారని, ఈ వ్యవహారంలో యూరప్ దేశాల కంటే అమెరికానే చాలా పెద్ద త్యాగాలు చేసిందని చెప్పారు. అయితే అంతపెద్ద త్యాగాలు ఏంటన్నది మాత్రం ఆయన ప్రస్తావించలేదు. డీల్ సెట్2007లో ప్రారంభమైన చర్చలు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ముగింపు దశకు చేరుకున్నాయి. ఈయూతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు విజయవంతంగా ముగిశాయని.. ఈమేరకు ఒప్పందం ఖరారైనట్లు భారత వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ఆదివారం వెల్లడించారు. భారత్ కోణం నుంచి ఈ ఒప్పందం సమతుల్యంగా, దూరదృష్టితో కూడి ఉందని చెప్పారు. ఇరువైపులా వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు, ఆర్థిక సంబంధాల బలోపేతానికి ఇది దోహదపడుతుందన్నారు. ఈ ఒప్పందం ద్వారా భారత టెక్స్ట్టైల్స్, కెమికల్స్, రత్నాలు, ఆభరణాలు, ఎలక్ట్రికల్ యంత్రాలు, లెదర్ వస్తువులు, ఆటోమొబైల్స్, ఫుట్వేర్ వంటి రంగాలకు డ్యూటీ-ఫ్రీ లభించనుంది. ఒక రకంగా ఈయూతో ట్రేడ్ డీల్.. ఆర్థిక పరంగా ఇది భారత్కు ఒక పెద్ద విజయంగా భావించవచ్చు. రష్యా చమురు దిగుమతులు తగ్గుతున్నప్పటికీ(డిసెంబర్లో భారత్ రష్యా చమురు దిగుమతులు రెండు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరాయి. అదే సమయంలో, OPEC దేశాల నుండి చమురు దిగుమతులు 11 నెలల గరిష్ట స్థాయికి పెరిగాయి).. యూరప్తో వాణిజ్య ఒప్పందం ద్వారా కొత్త మార్కెట్లు తెరుచుకోనున్నాయి. ఇది భారత్ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచగలదు. -
ట్రంప్ ‘టారిఫ్’ పిడుగు: మరో దేశంపై ప్రతీకారం?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో దేశంపై ‘టారిఫ్’ పిడుగు కురిపించారు. దక్షిణ కొరియా నుండి దిగుమతి అయ్యే ఆటోమొబైల్స్, కలప, ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తులపై టారిఫ్లను 25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేయడంలో దక్షిణ కొరియా విఫలమైందని ఆయన ఆరోపించారు. 2025 జూలై 30న అధ్యక్షుడు లీ జే మ్యుంగ్తో తాను కుదుర్చుకున్న ఒప్పందాన్ని, అలాగే అక్టోబర్ 29న తన పర్యటనలో తాను చెప్పిన అంశాలను అక్కడి పార్లమెంటు ఇంకా ఎందుకు ఆమోదించలేదని ట్రంప్ ప్రశ్నించారు. దీనికి ప్రతిచర్యగా తాను సుంకాలను 15శాతం నుండి 25 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికాకు వాణిజ్య ఒప్పందాలనేవి అత్యంత ముఖ్యమని, తాము కుదుర్చుకున్న ప్రతి డీల్లోనూ ఒప్పందం ప్రకారం సుంకాలను తగ్గించామని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. తమ వాణిజ్య భాగస్వాములు కూడా అదే విధంగా వ్యవహరించాలని ఆశిస్తున్నట్లు ఆయన తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో ఒక పోస్ట్లో పేర్కొన్నారు. కాగా వాషింగ్టన్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తమ ఎగుమతులపై అమెరికా టారిఫ్లను తగ్గించేలా నవంబర్ నుండి దక్షిణ కొరియా చర్యలు చేపడుతోంది. మరోవైపు, డేటా లీక్ కారణంగా అమెరికాకు చెందిన ఈ కామర్స్ సంస్థ ‘కూపాంగ్’పై జరుగుతున్న దర్యాప్తు విషయంలో కూడా సియోల్ అధికారులు అమెరికా ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.అమెరికాకు దక్షిణ కొరియా కీలక వాణిజ్య భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఏటా సుమారు $150 బిలియన్ల(సుమారు రూ. 12.5 లక్షల కోట్లు) విలువైన వస్తువులు అమెరికాకు ఇక్కడి నుండే దిగుమతి అవుతాయి. గత ఏడాది జూలైలో ఇరు దేశాల అధ్యక్షులు ఒక ఒప్పందానికి వచ్చినప్పటికీ, అమెరికా కోరిన పెట్టుబడి హామీల విషయంలో ఏర్పడిన భేదాభిప్రాయాలతో ఈ ప్రక్రియ స్తంభించింది. అనంతరం అక్టోబర్లో ట్రంప్ ఆసియా పర్యటన సందర్భంగా, అమెరికాలో $350 బిలియన్ల(రూ. 35,000 కోట్లు పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాన్ని ఖరారు చేశారు.ఈ నేపథ్యంలో నవంబర్లో వైట్ హౌస్ ఒక ‘ఫ్యాక్ట్ షీట్’ విడుదల చేస్తూ, దిగుమతి సుంకాలను 15 శాతానికి పరిమితం చేసింది. అయితే అమెరికా ప్రస్తుత నిర్ణయంతో ఆ సుంకాలు తిరిగి పాత స్థాయికి చేరుకోనున్నాయి. 2025 ఏప్రిల్లో దక్షిణ కొరియా ‘లిబరేషన్ డే’ సందర్భంగా మొదట 25 శాతం టారిఫ్ ప్రకటించగా, అది మార్కెట్లను కుదిపేసింది. అప్పట్లో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా, ఇప్పుడు మళ్లీ అమలులోకి తెచ్చారు. గతంలో కెనడాపై 10 శాతం, గ్రీన్లాండ్ విషయంలో యూరప్ దేశాలపై, ఇటీవల కెనడాపై 100 శాతం టారిఫ్ విధిస్తామన్న ట్రంప్ హెచ్చరికల తర్వాత ఈ తాజా ప్రకటన వెలువడటం గమనార్హం. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పని ఒత్తిడి.. టెక్కీ దుస్థితి వైరల్ -
ట్రంప్కే ఇష్టం లేదు!
వాషింగ్టన్: భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కే ఇష్టం లేదంటూ టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రుజ్ బాంబు పేల్చారు. ఆయన అధికార రిపబ్లికన్ పార్టీ నేతే కావడం విశేషం! అంతేగాక ఈ విషయమై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారోలది కూడా అదే వైఖరి అని ఆయన చెప్పుకొచ్చారు. పారీ్టకి విరాళాలిచ్చే దాతలతో భేటీ సందర్భంగా క్రుజ్ చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో టేపులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. 2025 జూన్ నాటి ఆ టేపులను ఉటంకిస్తూ అమెరికాకు చెందిన మీడియా సంస్థ ఆక్సియోస్ తాజాగా ఈ మేరకు కథనం వెలువరించింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చాలాకాలంగా పెండింగ్లోనే ఉన్న విషయం తెలిసిందే. దానిపై ఇరుదేశాల నడుమ అత్యున్నతాధికారుల స్థాయిలో పలు దఫాలుగా చర్చలు జరిగినా తుది నిర్ణయం, ఒప్పందం మాత్రం ఇప్పటికీ జరగలేదు. ట్రంప్ భేషజాలకు పోవడం వల్లే ఈ ఒప్పందం ఆగిపోయిందనే అర్థంలో అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ ఇటీవలే వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ‘‘నిజానికి ఆ ఒప్పందం ఎప్పుడో దాదాపుగా తుదిరూపునకు వచ్చింది. అయితే దానికోసం ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా తనతో ఫోన్లో మాట్లాడాలని ట్రంప్ ఆశించారు. అలా జరగకపోవడం వల్లే ఒప్పందాన్ని పక్కన పెట్టారు’’అని లుట్నిక్ చెప్పుకొచ్చారు. క్రుజ్ వ్యాఖ్యలు కూడా దాన్ని బలపరిచేలానే ఉండటం విశేషం. భారత్పై ట్రంప్ అత్యధికంగా 50 శాతం టారిఫ్లు వేయడం, దాంతో ఇరుదేశాల నడుమ ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే. అమెరికాతో సంబంధాలు కూడా కొంతకాలంగా తిరోగమన బాట పట్టాయి. టారిఫ్లతో ట్రంప్ పదవికే ఎసరు ఆడియో టేపుల ప్రకారం, భారత్తో వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి కారణం ఎవరని ఒక దాత క్రుజ్ను అడిగారు. ‘నవారో, వాన్స్. కొన్నిసార్లు ట్రంప్ కూడా’’అని ఆయన బదులిచ్చారు. ప్రపంచ దేశాలపై ట్రంప్ గతేడాది ఏప్రిల్లో ఎడాపెడా టారిఫ్లు విధించడం తెలిసిందే. అది సరికాదని, వాటిని వెనక్కు తీసుకోవాలని ఎంత నచ్చజెప్పినా ఆయన వినలేదని క్రుజ్ చెప్పారు. ‘‘పలువురు సెనేటర్లు ఈ విషయమై ట్రంప్కు ఫోన్ చేసి అర్ధరాత్రి దాకా సుదీర్ఘంగా మాట్లాడాం. కానీ ఆయన మా మాట వినిపించుకోలేదు. పైగా మాపై తిట్లకు లంకించుకున్నారు. నన్నైతే బూతులు తిట్టారు’’అంటూ వాపోయారు. ట్రంప్ టారిఫ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థనే భారీగా దెబ్బ తీస్తాయని, అంతిమంగా ఆయన పదవీచ్యుతికి దారితీసినా ఆశ్చర్యం లేదని క్రుజ్ అన్నారు. అంతేగాక రానున్న మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పారీ్టకి ఓటమి కూడా తప్పకపోవచ్చని అంచనా వేశారు. ఆ తర్వాత రెండేళ్లపాటూ ట్రంప్ మెడపై నిత్యం పదవీచ్యుతి కత్తి వేలాడుతూనే ఉంటుందన్నారు. -
సడలిన అమెరికా వైఖరి
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎంచుకున్న టీం సభ్యులు సైతం అచ్చం ఆయన తరహాలోనే రోజుకో రీతిన మాట్లాడటంలో ఆరితేరారు. అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బిసెంట్ చేస్తున్న ప్రకటనలు దాన్నే నిరూపిస్తున్నాయి. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదరబోతున్నదని, తమ షరతులన్నిటికీ తలొగ్గటానికి ఆ దేశం సిద్ధపడిందని పలుమార్లు ఏకపక్షంగా ప్రకటించటం, అంతలోనే ఏదో సాకుతో అదనపు సుంకాలు విధించటం ట్రంప్ అలవాటు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేయనందు వల్ల భారత్పై విధించే సుంకాలు 500 శాతానికి కూడా చేరుకోవచ్చని పదిరోజులనాడు కూడా ట్రంప్ బెదిరించారు. స్కాట్ బిసెంట్ సైతం ఆ తోవనే పోయారు. కానీ ఇప్పుడు బెదిరింపుల పర్వం ఉపశమించినట్టు కనబడుతోంది. భారత్పై విధించిన అదనపు సుంకాల్లో 25 శాతాన్ని తగ్గించబోతున్నామని బిసెంట్ ప్రకటించారు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లు పడిపోయినందు వల్ల ఈ నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు. చమురు కొనుగోళ్లు తగ్గిన మాట వాస్తవమే అయినా, దాన్ని అసలు గుర్తించనట్టు ఎప్పటికప్పుడు కొత్త డిమాండ్లు పెట్టడం అలవాటు చేసుకున్న అమెరికా వైఖరి మార్చుకోవటం వెనక వేరే మతలబు ఉంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో మన దేశం రేపో మాపో వాణిజ్య ఒప్పందం కుదురుతుండటమే ఇందుకు కారణం. ఉక్రెయిన్పై 2022లో రష్యా దాడి తర్వాత అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆదేశంతో సంబంధాలు తెంచుకున్నాయి. అటు తర్వాత మన రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు పెరిగాయి. ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల్లో మనం రెండో స్థానంలో ఉన్నాం. ప్రపంచం మునుపటిలా లేదు. ఏకపక్షంగా, అనాలోచితంగా ఆంక్షలు విధిస్తే స్వీయ నష్టాలు కూడా తప్పవు. ప్రపంచ దేశాలపై విధించిన ఆంక్షల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకుల్లో పడింది. తాజాగా డాలర్ విలువ నాలుగు నెలల కనిష్ఠస్థాయికి పడి పోయింది. అమెరికా బెదిరింపులకు దిగిన మొదట్లో మన దేశానికి చెందిన ప్రైవేటు సంస్థలు రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు తగ్గించిన మాట వాస్తవం. అప్పటికి రోజూ సగటున 17 లక్షల బ్యారెళ్ల ముడిచమురు కొనుగోలు చేస్తుండగా, మొన్న డిసెంబర్ నాటికి అది 12 లక్షల బ్యారెళ్లకు తగ్గింది. అమెరికా సంస్థలతో లావాదేవీలున్న కొన్ని భారత్ కంపెనీలు ఆంక్షలకు తలొగ్గటమే మంచిదని నిర్ణయించుకోవటం ఇందుకు కారణం. కానీ రష్యా ప్రముఖ చమురు కంపెనీలైన రోజ్నెఫ్ట్, లుకోయిల్ నుంచి చమురు కొనుగోలు చేయరాదన్నది అమెరికా పెట్టిన ఆంక్షల్లో ఒకటి. దానికి విరుగుడుగా రష్యా వేరే కంపెనీలను రంగంలోకి దించి వాటిద్వారా భారత్కు ముడి చమురు ఎగుమతులు మొదలుపెట్టింది. వీటి ప్రభావం ఒకటి రెండు నెలల్లో కనబడుతుందనీ, అటుతర్వాత రష్యా నుంచి వచ్చే ముడిచమురు కొనుగోళ్లు యథాప్రకారం ఉంటాయని నిపుణుల అంచనా. చవగ్గా వచ్చే రష్యా ముడి చమురును వదులుకోవటం ఎవరికైనా అంత సులభం కాదు. రష్యా చమురుకూ, సౌదీ అరేబియా నుంచి కొనే చమురుకూ మధ్య బ్యారెల్కు దాదాపు 10 డాలర్ల వ్యత్యాసం కనబడుతున్నప్పుడు ఆంక్షలకు తలొగ్గాలని ఎవరూ అనుకోలేరు. తమ డెయిరీ ఉత్పత్తులనూ, జన్యుపరంగా మార్పుచేసిన ఆహారధాన్యాలనూ భారత్ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతించాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నందు వల్లే వాణిజ్య ఒప్పందం కుదరటంలో ఆలస్యం అవుతోంది. ఏదో వంకతో ఆంక్షలు విధిస్తే భారత్ దారికొస్తుందని అమెరికా భావన. ఈలోగా ఈయూ–భారత్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదిరే అవకాశాలు కనబడటం అమెరికా జీర్ణించు కోలేకపోతోంది. అందుకే ఒకపక్క ఎఫ్టీఏను దృష్టిలో పెట్టుకున్నందు వల్లే భారత్ పట్ల ఈయూ మెతకవైఖరి ప్రదర్శించిందని విమర్శిస్తూనే, తాను విధించిన అదనపు సుంకాల్లో కోతకు సిద్ధపడుతోంది. అమెరికాతో ఒప్పందం కుదరటం మాటెలావున్నా, ప్రపంచ దేశాలన్నిటితో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకునే ప్రస్తుత విధానాన్ని మన దేశం కొనసాగించటమే ఉత్తమం. ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే ధోరణి ఎప్పుడూ ప్రమాదకరమే! -
భారత్కు డొనాల్డ్ ట్రంప్ సందేశం
న్యూఢిల్లీ: భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సందేశాన్ని పంపారు. భారతదేశంలోని ప్రభుత్వానికి, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో భారత్-అమెరికాలది హిస్టారిక్ బాండ్ అంటూ కోడ్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉన్న ‘బ్లాక్ అండ్ వైట్’ ఫోటోను షేర్ చేశారు ట్రంప్. తమది ఎన్నో దశాబ్దాల సంబంధం అని అర్ధం వచ్చేలా ఉంది ట్రంప్ షేర్ చేసిన ఫోటో. భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలను అమెరికా ప్రజల తరఫున తెలియజేస్తున్నాను అని ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించి యూఎస్ ఎంబసీ తన అధికారిక అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈరోజు అంతకముందే భారత్కు అమెరికా శుభాకాంక్షలు తెలియజేసింది. భారత్తో తమది చారిత్రాత్మక బంధం అంటూ అమెరికా శుభాకాంక్షలు తెలియజేసింది. ఆపై అధ్యక్షుడు ట్రంప్ కూడా అదే సందేశాన్ని ఇచ్చారు. “On behalf of the people of the United States, I extend my heartfelt congratulations to the government and people of India as you celebrate your 77th Republic Day. The United States and India share a historic bond as the world’s oldest and largest democracies.” - President… pic.twitter.com/oC9x3Qs9y3— U.S. Embassy India (@USAndIndia) January 26, 2026 ఇదీ చదవండి: మనది చారిత్రాత్మక బంధం: అమెరికా శుభాకాంక్షలు -
అమెరికా చెప్పేవన్నీ అసత్యాలే: WHO
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి వైదొలగడానికి అమెరికా చెప్పిన కారణాలు అసత్యమని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసస్ స్పష్టం చేశారు. ఆమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఒక్క ఆదేశానికి కాకుండే ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసస్ మాట్లాడుతూ..అమెరికా డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగడానికి చూపిన కారణాల్లో ఎలాంటి వాస్తవం లేదు. డబ్ల్యూహెచ్ఓ అమెరికాతో పాటు అన్ని సభ్య దేశాలతో వారి సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ పనిచేస్తుంది’ అని సూచించారు.అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో, ఆరోగ్య కార్యదర్శి రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో డబ్ల్యూహెచ్వో నుంచి అమెరికా అధికారికంగా వైదొలిగిందని ప్రకటించారు. కోవిడ్-19 సమయంలో డబ్ల్యూహెచ్వో పనితీరుపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. డబ్ల్యూహెచ్వో అమెరికాను తక్కువ చేసి, స్వతంత్రతను దెబ్బతీసింది. అలాగే,కోవిడ్ సమయంలో కీలక సమాచారం అందించకుండా కాలయాపన చేసింది. ఫలితంగా దేశంలో భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగిందన్నారు.అమెరికా చేస్తున్న ఈ ఆరోపణల్ని డబ్ల్యూహెచ్ఎవో ఖండించింది.అమెరికాతో నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించాము. కోవిడ్ సమయంలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని వెంటనే ప్రపంచానికి తెలియజేశాం. మాస్క్లు, టీకాలు, భౌతిక దూరం పాటించమని సూచించాము. కానీ ఎప్పుడూ మాస్క్ మాండేట్లు, టీకా మాండేట్లు లేదా లాక్డౌన్లు విధించమని చెప్పలేదు. అవి ప్రతి దేశం స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయాలు’ అని డబ్ల్యూహెచ్వో తెలిపింది. -
ఇరాన్ లో టెన్షన్ టెన్షన్ ఏ క్షణమైనా యుద్ధం..
-
ఇండియన్ టెకీలకు షాక్ ఇచ్చిన ట్రంప్
-
Venezuela: డెన్సీ రోడ్రిగ్జ్ వీడియో టేపుల కలకలం
కారకస్: ‘మేం చెప్పినట్లు వింటారా? లేదంటే మరో 15 నిమిషాల్లో మీ ప్రాణాలు తీయమంటారా?’ అంటూ తమని బెదిరించారంటూ అమెరికాపై వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెన్సీ రోడ్రిగ్జ్ చేసిన కామెంట్స్ తాలుకూ వీడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి. జనవరి 3న వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో దంపతులను అమెరికా నిర్బంధించి పదవీచ్యుతున్ని చేసిన విషయం తెలిసిందే. అమెరికా ప్రత్యేక దళాలు ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్’(Operation Absolute Resolve) పేరుతో మిలటరీ ఆపరేషన్ చేపట్టాయి. ఈ మిలటరీ ఆపరేషన్లో డెల్టా ఫోర్స్ సైనికులు హెలికాప్టర్ల ద్వారా వెనెజువెలా రాజధాని కారాకస్లోని ఫోర్ట్ టియునా సైనిక స్థావరంలోకి ప్రవేశించి మదురో దంపతుల్ని అదుపులోకి తీసుకున్నారు.అయితే, మదురో దంపతుల్ని నిర్భందించిన 15 నిమిషాల తర్వాత పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మాదురోను అమెరికా దళాలు పట్టుకున్న తర్వాత.. తమ డిమాండ్లను అంగీకరించాలని తమ మంత్రివర్గ సభ్యులకు బెదిరింపులను అమెరికా బెదిరించినట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెన్సీ రోడ్రిగ్జ్ అంతర్గత సమావేశంలో మాట్లాడిన వీడియో టేపులు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. తాము చెప్పినట్లు వినకపోతే 15 నిమిషాల్లో మంత్రి వర్గ సభ్యుల ప్రాణాలు తీస్తామని అమెరికా దళాలు బెదిరించాయని డెల్సీ రోడ్రిగ్స్ మాట్లాడిన మాటలు ఆ వీడియోలో ఉన్నట్లు సమాచారం. -
చైనాతో ఒప్పందం చేసుకుంటే... 100 శాతం టారిఫ్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహాగ్ని తాజాగా కెనడా వైపు మళ్లింది. చైనాతో వాణిజ్య ఒప్పందం విషయంలో మొండిగా ముందుకెళ్తే కెనడాపై ఏకంగా 100 శాతం టారిఫ్లు విధిస్తామని శనివారం ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వాటి మధ్య ఒప్పందం కుదిరితే ఆ మరుక్షణమే సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్సోషల్లో ఈ మేరకు పోస్టు పెట్టారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చైనా వస్తువులు, ఉత్పత్తులను అమెరికాలో గుమ్మరించేందుకు ఆయన కెనడాను వేదికగా మార్చజూస్తున్నారని ఆరోపించారు. ‘‘కార్నీ ఉద్దేశం అదే అయితే గనక ఆయన చాలా పొరబడుతున్నారు. అలా జరిగేందుకు నేనెప్పటికీ అనుమతించబోను’’అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కెనడా ప్రధాని కార్యాలయం అధికారికంగా స్పందించలేదు. ట్రంప్ తన పోస్టులో కార్నీని ‘గవర్నర్’గా సంబోధించడం విశేషం. అమెరికాలో కెనడా 51వ రాష్ట్రంగా విలీనం కావాలని ఆయన పలుమార్లు సూచించడం తెలిసిందే. ఈ సంబోధన తాలూకు ఉద్దేశం కూడా అదేనంటున్నారు. ట్రంప్, కార్నీ నడుమ కొంతకాలంగా మాటల యుద్ధం సాగుతోంది. ట్రంప్వి ఏకపక్ష పోకడలంటూ ఇటీవల కార్నీ దుయ్యబట్టారు. దాంతో చిర్రెత్తుకొచి్చన ట్రంప్, అసలు కెనడా బతుకుతున్నదే అమెరికా దయాదాక్షిణ్యాల మీద అంటూ దావోస్ వేదికగా ఎద్దేవా చేశారు. దీనిపై కార్నీ స్పందిస్తూ, నియంతృత్వ పోకడలకు తల వంచకుండా ప్రపంచానికి కెనడా ఒక ఉదాహరణగా నిలుస్తుందంటూ బదులిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో గాజా పునర్నిర్మాణానికి తలపెట్టిన శాంతిమండలిలో చేరేందుకు కెనడాకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు. చైనా తన విద్యుత్ వాహనాలపై టారిఫ్లను తగ్గించేలా కెనడాతో కొంతకాలంగా బేరసారాలాడుతోంది. ప్రతిగా కెనడా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపుకు సంసిద్ధత వెలిబుచ్చింది. ఈ మేరకు ఒప్పందం దిశగా వాటి మధ్య ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. దీన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ ఒప్పందం కుదుర్చుకుంటే కెనడాను ఆర్థికంగా, సామాజికంగా చైనా పూర్తిగా కబళించేస్తుందని ఇటీవలే ఆయన హెచ్చరించారు. అమెరికా ప్రతిపాదిత గోల్డెన్డోమ్ రక్షణ ఛత్రంలోకి వచ్చేందుకు కెనడా నిరాకరించడంపై కూడా ట్రంప్ తీవ్ర అసహనం వెలిబుచ్చారు. -
ఇమిగ్రేషన్ అధికారుల కాల్పుల్లో మరొకరు మృతి
అమెరికాలో మినయాపాలిస్లో ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్కు వ్యతిరేకంగా జరగుతున్న నిరసనలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. శనివారం (జనవరి 24, 2026) ఫెడరల్ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో మరో అమెరికన్ పౌరుడు మరణించాడు. మరణించిన వ్యక్తిని 37 ఏళ్ల మినయాపాలిస్ నివాసిగా అధికారులు గుర్తించారు.మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సదరు వ్యక్తి వద్ద తుపాకీతో పాటు రెండు మ్యాగజైన్లు ఉన్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. అయితే అధికారులపైకి తిరగబడటంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మినయాపాలిస్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండో సారి. కొన్ని రోజుల క్రితం రెనీ నికోల్ గుడ్ అనే 37 ఏళ్ల మహిళను ఫెడరల్ ఏజెంట్లు ఆమె కారులోనే కాల్చి చంపారు.ఈ క్రమంలో వరుస కాల్పుల ఘటనలతో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. నిరసనకారులను చెదరగొట్టడానికి ఫెడరల్ ఏజెంట్లు బాష్పవాయువు ప్రయోగించారు. అయితే ఇదే సమయంలో ఓ ఐసీఈ ఏజెంట్ నిరసనకారులను వెక్కిరిస్తూ గట్టి అరిచాడు.దీంతో నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. ఈ ఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ స్పందించారు. మిన్నెసోటా ప్రజల సహనం నశించింది. ఇది అత్యంత క్రూరమైన చర్య. అధ్యక్షుడు ట్రంప్ వెంటనే ఈ ఆపరేషన్ను నిలిపివేయాలి. వేల సంఖ్యలో ఉన్న ఈ ఫెడరల్ అధికారులను వెంటనే మిన్నెసోటా నుండి వెనుక్కి పిలవాలి అని వాల్జ్ డిమాండ్ చేశారు.కాగా అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులను ఏరివేయడానికి దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్లు చేపట్టింది. ఇందులో భాగంగానే వేల సంఖ్యలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, బార్డర్ పెట్రోల్ ఏజెంట్లు మినయాపాలిస్ వంటి నగరాలకు పంపారు. -
రెచ్చిపోతున్న బంగారం.. గోల్డ్ దూరం చేసిన ఘనుడు!
-
వెనక్కి తగ్గిన ట్రంప్.. గ్రీన్ ల్యాండ్ పై కొత్త రాగం..
-
ఇరాన్-అమెరికా.. కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు!
ఇరాన్ అమెరికా మధ్య కమ్ముకుంటున యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తమ సైన్యం ఇరాన్కు బయల్దేరింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం.. అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఇరాన్ వైపు కదులుతున్నాయి. ఆర్థిక సంక్షోభం వేళ.. అక్కడి ప్రజల తీవ్ర నిరసనలతో ఇరాన్ అట్టుడికిపోయింది. భద్రతా బలగాల ప్రతిఘటనలో వేల సంఖ్యలో నిరసనకారులు మరణించారని హక్కుల సంఘాలు నివేదికలు ఇచ్చాయి. అలాగే వేల మందిని జైల్లో పెట్టారని.. వాళ్లలో కొందరిని దేశద్రోహులుగా ఉరి తీయబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ అణచివేతపై ట్రంప్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. తాము చూస్తూ ఉండబోమని.. ఇరాన్ నిరసనకారులకు అవసరమైన సాయం పంపిస్తామని ప్రకటించారు. ఈ లోపు పరిస్థితులు చల్లబడి ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో నిరసనకారుల ఉరితీత ఆగిపోయింది. అయితే.. తన వల్లే నిరసనకారుల ఉరి ఆగిందంటూ ట్రంప్ ప్రకటించుకోగా.. ఇరాన్ దానిని తోసిపుచ్చింది. కాస్త ఆలస్యమైనా శిక్ష తప్పదన్నట్లు ఖమేనీ ప్రభుత్వం సంకేతాలు పంపించింది. దీంతో ట్రంప్నకు మళ్లీ కోపమొచ్చింది. ఈలోపు.. ఇరాన్ అణు కార్యకలాపాలు నిర్వహిస్తుందన్న అనుమానాలూ వ్యక్తం చేసిన ఆయన.. గట్టి వార్నింగే ఇచ్చారు. సైనిక చర్యే చివరి ఆప్షన్ అంటూ ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలో సైన్యం మోహరింపు ఆదేశాలు జారీ చేసిన ఆయన.. అదనపు బలగాలనూ సిద్ధం చేయాలని సూచించారు. దీంతో ఐదు వేల మంది సిబ్బందితో కూడిన బలగాలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు.. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ధీటుగా స్పందిస్తోంది. తమ వేలు ట్రిగ్గర్పైనే ఉందంటూ ప్రకటనలు ఇస్తోంది. ఇరాన్ను నిశితంగా గమనిస్తున్నాం. భారీ సంఖ్యలో మా యుద్ధనౌకలు ఆ దేశం వైపు కదులుతున్నాయి. ఏమీ జరగకూడదనే అనుకుంటున్నా. వాటిని మేం ఉపయోగించకపోవచ్చు. ఏం జరుగుతోందో చూద్దాం అని ట్రంప్ దావోస్ సదస్సు అనంతరం వ్యాఖ్యానించారు. అయితే.. ట్రంప్ ఇప్పటిదాకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోయినా.. అమెరికా యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ వైపు కదులుతుండటంతో పరిస్థితి హీటెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
చైనాతో జాగ్రత్త.. కెనడాకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కెనడాను టార్గెట్ చేశారు. కెనడాపై విరుచుకుపడ్డారు. గ్రీన్లాండ్పై గోల్డెన్ డోమ్ నిర్మించడాన్ని కెనడా వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో చైనాతో కెనడా వ్యాపారం చేయడం వారికే నష్టం కలిగిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ట్రుత్ వేదికగా.. గ్రీన్లాండ్పై విస్తారమైన క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించాలనే అమెరికా ప్రణాళికను కెనడా వ్యతిరేకిస్తోంది. అయినప్పటికీ గోల్డెన్ డోమ్ కెనడాను రక్షిస్తుంది. అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్.. కెనడాను రక్షించబోతోంది. కెనడా మా నుండి చాలా ఉచితాలను పొందుతుంది. అమెరికా కారణంగానే కెనడా మనుగడ సాగిస్తోంది. వారు కూడా కృతజ్ఞతతో ఉండాలి. అలా కాకుండా అమెరికాతో సంబంధాలను తెంచుకుకుంటున్నారు. బదులుగా చైనాతో వ్యాపారం చేసేందుకు కెనడా ఆమోదం తెలిపింది. చైనాకు అనుకూలంగా ఓటు వేశారు. మొదటి సంవత్సరమే కెనడాను చైనా తినేస్తుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ చైనాతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించడానికి బీజింగ్ను సందర్శించిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.మరోవైపు.. ట్రంప్ వ్యాఖ్యలపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు. అమెరికా మద్దతు కారణంగానే కెనడా మనుగడ సాగిస్తుందనే ట్రంప్ వాదనను తిరస్కరించారు. ఈ క్రమంలో మార్క్ కార్నీ మాట్లాడుతూ..‘కెనడాకు అమెరికాతో సంబంధమే లేదు. మనం కెనడియన్లం కాబట్టి కెనడా అభివృద్ధి చెందుతుంది. కెనడా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం. కెనడాకు మనమే యజమానులం. ఇది మన సొంత దేశం. ఇది మన భవిష్యత్తు అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, దావోస్లో ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే చిన్న దేశాల పట్ల గొప్ప శక్తులు బలవంతం చేయడాన్ని కార్నీ తప్పుబట్టారు. -
ఇక అమెరికా-భారత్ బంధానికి బీటలు!
శత్రువుకు శత్రువు మిత్రుడనే సామెత ఒకటి ఉంది. భారత్ నిర్ణయాలకు వ్యతిరేకంగా.. అలాంటి శత్రువుతోనే జత కట్టాలని, భుజం తట్టి ప్రొత్సహించాలని అగర్రాజ్యం బలంగా భావిస్తోంది!. ఈ నేపథ్యంలోనే అమెరికా-భారత్ మధ్య స్నేహబంధానికి బీటలు వారే అవకాశం ఉందంటున్నారు..బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల్లో శాంతి యుతంగా ఎన్నికల నిర్వహణ అనేది పెద్ద సవాలే. అయితే.. అక్కడి జమాత్-ఎ-ఇస్లామీతో సంబంధాలు పెంచుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో వాషింగ్టన్-ఢిల్లీ మధ్య సంబంధాలపై ప్రభావం పడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారట్లు.. వాషింగ్టన్ పోస్ట్ ఓ సమగ్ర కథనం ప్రచురించింది. అందులో..ఇటీవల నిర్వహించిన సర్వేల్లో జమాత్, బీఎన్పీలకు ప్రజాదరణ అధికంగా ఉన్నట్లు తేలింది. మరీ ముఖ్యంగా జమాత్ విద్యార్థి విభాగం ‘‘ఇస్లామీ ఛాత్ర శిబిర్’’ ఆమధ్య నిర్వహించిన వర్సిటీ ఎలక్షన్స్లో ఆధిపత్యం సాధించింది. దీంతో రాబోయే ఎన్నికలకు జమాత్ బలమైన పునాది వేసుకుందనే విశ్లేషణ నడుస్తోంది. ఈ పరిణామాలపై అమెరికన్ రాయబారి ఒకరు స్పందిస్తూ.. బంగ్లాదేశ్ ఇస్లామిక్ వైపు మళ్లింది అని అన్నారు. ఈ తరుణంలో జమాత్ నాయకులతో అమెరికా స్నేహపూర్వక సంబంధాలు పెంచుకుంటే మంచిదని సూచించారు కూడా.భారత్ ఆందోళనలు ఏంటంటే..జమాత్-అమెరికా దోస్తానాపై భారత్ ఆందోళనలో అర్థం ఉంది. ఎందుకంటే.. జమాత్-ఎ-ఇస్లామీని భారత్ ఎప్పటినుంచో శత్రువుగానే చూస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. 1971 యుద్ధంలో ఈ పార్టీ పాకిస్తాన్ పక్షాన నిలిచిన చరిత్ర ఉంది. అలాగే మతోన్మాదంతో ఆ సమయంలో మైనారిటీలను ఊచకోత కోసిందని అభియోగాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జమాత్ అధికారంలోకి వస్తే.. హిందువుల సహా ఇతర మైనారిటీలకు భద్రత ఉండబోదని ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికాతో వాణిజ్య వివాదాలు, వ్యూహాత్మక విభేదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా జమాత్కు మద్దతుగా నిలిస్తే.. భారత్-అమెరికా సంబంధాలు తీవ్రంగా దెబ్బ తినే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.జమాత్ బ్యాక్గ్రౌండ్ ఇది.. 1971 విమోచన యుద్ధానికి వ్యతిరేకంగా.. పాక్కు మద్దతుగా నిలిచింది జమాత్-ఎ-ఇస్లామీ. పార్టీకి చెందిన అనేక నాయకులు, వార్ క్రైమ్స్ (యుద్ధ నేరాలు)లో పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. పైగా హింస, హత్యలతో పాటు మైనారిటీలపై దాడులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఒకప్పుడు ఆ పార్టీపై జనాల్లో వ్యతిరేకత ఉండేది.ఒకానొక టైంలో దేశద్రోహి పార్టీ అంటూ అనేకసార్లు నిషేధానికి గురైంది. విమోచన యుద్ధానికి వ్యతిరేకంగా నిలిచినందుకు, మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు, రాజ్యాంగ విరుద్ధ విధానాలు.. ఇలా రకరకాల కారణాలు చూపించారు. మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ రాజ్యాంగం సెక్యులర్ విధానాన్ని అనుసరిస్తుంటే.. జమాత్ మాత్రం షరియా చట్టం అమలు చేయాలని భావిస్తోంది. ఈ విధానం వల్లే.. 2013లో బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానం ఆ పార్టీని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఆ వెంటనే ఎన్నికల సంఘం ఆ పార్టీ రిజిస్ట్రేషన్ను తీసేసింది. దీంతో ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే ప్రధాని హోదాలో షేక్ హసీనానే ఆనాడు ఈ పని చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి.అయితే మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిపోయాక.. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీం కోర్టు జమాత్పై నిషేధం ఎత్తేసింది. దీంతో అవినీతి వ్యతిరేకం.. సంక్షేమం.. అంటూ జమాత్ కొత్త నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఆ పార్టీకి ఆదరణ పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.అమెరికా మరోలా.. ప్రస్తుతానికైతే అమెరికా.. జమాత్తో ఫ్రెండ్షిఫ్ను కోరుకోవడం లేదని సమాచారం. ‘‘బంగ్లాదేశ్లో జరగబోయే ఎన్నికల్లో మేం ఎవరికీ మద్దతు ఇవ్వబోం’’ అని ఆ దేశ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అదే సమయంలో మత ఛాందస పార్టీగా పేరున్న జమాత్ భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేసి.. షరియా చట్టాలను అమలు చేస్తే.. బంగ్లాదేశ్ గార్మెంట్ ఎగుమతులపై 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించింది కూడా.రాజకీయ వాతావరణంహసీనా తొలగింపుతో ఏర్పడిన యూనస్ తాత్కాలిక ప్రభుత్వం.. ప్రజాస్వామ్య మార్పు పేరుతో ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే మాజీ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్.. యూనస్ ప్రభుత్వం మత ఛాందస వాదులతో చేతులు కలిపి అవామీలీగ్ కేడర్ను, హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. హసీనా ప్రస్తుతం భారత్లో ప్రవాసంలో ఉండగా.. జమాత్ సహా ఇస్లామిస్టులు ఆమె ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించారు. -
శాంతి మండలిపై ట్రంప్ కొత్త రాగం..
న్యూయార్క్/వాషింగ్టన్: అంతర్జాతీయ వేదికపై కొత్తగా శాంతి మండలి ఆవిర్భావం ఐక్యరాజ్యసమితికి కూడా మేలు చేసే అంశమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఐరాస తన సామర్థ్యానికి తగ్గట్టుగా ఫలితాలు సాధించడంలో విఫలమైందని ఆక్షేపించారు. గురువారం దావోస్ నుంచి అమెరికా తిరిగి వెళ్తూ ఎయిర్ఫోర్స్వన్ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ..‘గాజాలో శాంతి స్థాపనకు మాత్రమే కాదు, అంతకుమించి కూడా మరెన్నో అంశాల్లో ఐరాసతో కలిసి గొప్పగా పని చేస్తాం. ఒక సంస్థగా ఐరాసకు ఉన్న సామర్థ్యం అంతా ఇంతా కాదు. కానీ అందుకు తగ్గట్టుగా పని చేయడంలో, ఫలితాలు సాధించడంలో ఐరాస విఫలమైంది. నేను ఏకంగా ఎనిమిది యుద్ధాలు ఆపాను. కానీ దీని గురించి ఐరాసతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు’ అన్నారు.దీనిపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫన్ డుజారిక్ స్పందించారు. ‘ట్రంప్ ప్రకటనలు (శాంతి మండలిని ఉద్దేశిస్తూ) చూశాం. అయితే సార్వత్రిక సభ్యత్వమున్న ఏకైక అంతర్జాతీయ సంస్థ ఐరాసే’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి దిశగా తమ కృషి, ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. గాజాలో అత్యధిక పరిమాణంలో మానవతా సాయాన్ని పంచింది ఐరాస మాత్రమేనని స్టీఫన్ గుర్తు చేశారు. -
నాటో పాత్రను చులకన చేస్తారా!
లండన్: అఫ్గానిస్తాన్లో యుద్ధం సమయంలో అమెరికా బలగాలు మాత్రమే ముందుండగా నాటో దేశాల బలగాలు దూరంగా ఉండిపో యాయని అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై యూకే ప్రధానమంత్రి స్టార్మర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలతో దిగ్భ్రాంతి చెందాను. ఆ వ్యాఖ్యలు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు, అలాగే దేశ ప్రజలకు తీవ్ర వేదన కలిగించాయి’అని స్టార్మర్ పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్లో నాటో బలగాలు సాహసోపేతంగా పోరాడాయని, దేశం కోసం త్యాగాలు చేశాయని స్టార్మర్ కొనియాడారు. నాటో బలగాల గురించి అవమానకరంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని ట్రంప్ను ఆయన కోరారు. అవసరమైనప్పుడు అమెరికాకు మద్దతు ఇవ్వడానికి నాటో సిద్ధంగా ఉంటుందన్న తనకు నమ్మకం లేదని ట్రంప్ దావోస్లో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘మాకు నాటో అవసరం ఎప్పుడూ రాలేదు, మేం వారిని నిజానికి ఏమీ అడగలేదు. నాటో దేశాల వారు అఫ్గానిస్తాన్కు, ఇతర ప్రాంతాలకు కొన్ని దళాలను పంపించారు. కానీ, వారు ముందు వరుసలో ఉండటానికి బదులు వెనుకనే ఉండిపోయారు’అని ట్రంప్ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. -
ఈ మండలి శాంతికేనా?!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తన మనోభీష్టాన్ని నెరవేర్చుకున్నారు. గాజాలో ‘శాంతి నెలకొల్పడమే’ లక్ష్యంగా 19 సభ్యదేశాలతో ‘శాంతిమండలి’ ఏర్పాటై నట్టు గురువారం ప్రకటించారు. అర్జెంటీనా మొదలుకొని వియత్నాం, పాకిస్తాన్ వరకూ పోటీ పడి ఇందులో సభ్యత్వం తీసుకోగా, ఈ అర్థరహిత విన్యాసానికి మన దేశందూరంగా ఉండి మంచి పని చేసింది. అమెరికా చిరకాల సన్నిహిత దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, స్లొవేనియాలు ఇందులో చేరబోమని ప్రకటిస్తే, మనతోపాటు రష్యా, చైనా, జర్మనీ, యూరోపియన్ యూనియన్(ఈయూ), సింగపూర్ వగైరాలు తటస్థంగా ఉండి పోయాయి. అమెరికా ప్రత్యక్ష, పరోక్ష సహాయ సహకారాలతో రెండేళ్ల పాటు గాజాలో నరమేధం సాగించిన ఇజ్రాయెల్ సైతం ‘తగుదునమ్మా’ అంటూఇందులో చేరటం కొసమెరుపు. ‘నాకు నోబెల్ శాంతి బహుమతి రాలేదు గనుక, ఇకపై శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని ప్రకటించిన ట్రంప్, వారం తిరిగేసరికల్లా అంత ర్జాతీయ శాంతిదూత అవతారం ఎత్తడం ఒక వైచిత్రి.భద్రతామండలి తన 70 ఏళ్ల చరిత్రకు కళంకం తెచ్చుకునే విధంగా గత నవంబర్లో గాజా శాంతికి అగ్రరాజ్యాలు చొరవచూపాలని కోరుతూ ఆమోదించిన తీర్మానాన్ని అడ్డుపెట్టుకుని ట్రంప్ ఈ చర్యకు సాహసించారు. రష్యా, చైనాలు వీటో చేసివుంటే ఆ తీర్మానానికి ఆమోదముద్ర పడేదికాదు. కానీ గైర్హాజరుతో సరిపెట్టి ఈ వైపరీత్యానికి వారూ తోడ్పడ్డారు. దురాక్రమణలు, నరమేధాలు, ఊచకోతలు, సైనిక కుట్రలు తదితరాలను ఎదుర్కొనటానికి అంతర్జాతీయంగా ఆమోదించిన అనేక చట్టాలున్నాయి. వాటిల్లో ఏ చట్టాలు విఫలమైనాయని, ఎలాంటి ప్రయత్నాలు చేసిందని నవంబర్ తీర్మానాన్ని ఆమోదించాల్సి వచ్చిందో భద్రతామండలి చెప్పాలి. గాజాలో అకారణంగా, అన్యాయంగా వేలాదిమందిని హతమారుస్తుంటే, విధ్వంసకాండను కొనసాగిస్తుంటేకంటితుడుపు ప్రకటనలు చేయటం మినహా, ఆ సంస్థ పక్షాన జరిగిన యత్నాలేమీ లేవు. కానీ అకృత్యాలకు పాల్పడినవారికే దాన్ని ఉద్ధరించేందుకు లైసెన్సునిచ్చింది. ఈ‘శాంతిమండలి’ అమెరికా కోసం కాదు... ఏకంగా ప్రపంచ ఉద్ధరణకేనని దావోస్ లోట్రంప్ ఘనంగా ప్రకటించుకున్నారు. గాజాలో శాంతి నెలకొల్పగానే అది ప్రపంచంలోని ఇతర ఘర్షణలపై దృష్టిసారిస్తుందని కూడా ఆయన చెబుతున్నారు.ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి ఎంతగా విఫలమైనా, వాటికి ఉజ్జ్వలమైన చరిత్ర ఉంది. రెండో ప్రపంచయుద్ధం మానవాళికి తెచ్చిపెట్టిన లాంటి ఉత్పాతం భవిష్యత్తులో ఎన్నడూ సంభవించనీయబోమని వాగ్దానం చేస్తూ అవి ఆవిర్భవించాయి. కానీ ఇప్పుడు పుట్టుకొచ్చిన ‘శాంతిమండలి’ ట్రంప్ అల్లుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి జేర్డ్ కుష్నెర్ మానసపుత్రిక. 3,000 కోట్ల డాలర్ల వ్యయంతో గాజా సాగరతీరాన కళ్లు చెదిరే భవంతులు, రిక్రియేషన్ క్లబ్లు, క్యాసినోలు నిర్మించాలని ఆయనగారి తపన. తరతరాలుగా పేదరికంలో మగ్గిన పాలస్తీనియన్లు ఈ అభివృద్ధి చూసి మూర్ఛపోతారని ట్రంప్ చెబుతున్నారు. శాంతిమండలిలో చేరిన నెతన్యాహూ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో యుద్ధనేరారోపణలు ఎదుర్కొంటున్నారు. స్విట్జర్లాండ్లో అడుగుపెడితే అరెస్టవుతానని తెలిసి ఈ సంబరానికి దూరంగా ఉండిపోయారు. నిర్మానుష్యమైన తూర్పు జెరూసలేంలోని ఐక్యరాజ్యసమితి సహాయసంస్థ భవనాన్ని బుల్డోజర్లతో నేలమట్టం చేయించిన మర్నాడే ఆయన ‘శాంతిమండలి’లో చేరటం గమనార్హం. ఇంతవరకూ ట్రంప్కు అంటిన మరకలు ఇకపై శాంతిమండలి సభ్యులకూ తప్పవు. వెనిజులాపై సైనిక దాడి చేసి ఆ దేశాధ్యక్షుణ్ణి అపహరించటం, అక్కడి ముడిచమురుపై తమ ఆధిపత్యాన్ని ప్రకటించుకోవటం, గ్రీన్ల్యాండ్ను కాజేయాలని ఆత్రపడటం, మాట వినని దేశాలపై భారీ సుంకాలు విధించటం, ప్రపంచం నలుమూలలా సైనిక స్థావరాల ఏర్పాటు యత్నాలు వంటి ట్రంప్ అనాలోచిత చర్యలకూ, ఆయన బెదిరింపు ధోరణు లకూ ఇకపై ఈ మండలి సైతం సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సమితికి సంబంధించిన కర్తవ్యాలు శాంతిమండలి స్వీకరిస్తుందని ట్రంప్ చెప్పటంతోపాటు భవిష్యత్తులో సమితికి కాలం చెల్లుతుందనటాన్ని గమనిస్తే ఇదంతా చివరకు ఎటుపోతుందో... ఏమవు తుందో సులభంగానే గ్రహించవచ్చు. -
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికా అధికారికంగా వైదొలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సిబ్బందిని యూఎస్ వెనక్కి పిలిపించింది. డబ్ల్యూహెచ్వోకు అగ్రరాజ్యం రూ.2 వేల కోట్లు బకాయిపడింది. బకాయిలు చెల్లించేవరకు యూఎస్ ఉపసంహరణ పూర్తికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పిందికొవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో, సంస్కరణలను అమలుచేయడంలో డబ్ల్యూహెచ్వో విఫలమైందంటూ యూఎస్ ఆరోగ్య, మానవ సేవల విభాగం (HHS) ఆరోపించింది. సభ్య దేశాల రాజకీయ ప్రభావం కూడా కారణమేనని తెలిపింది. ఇకపై డబ్ల్యూహెచ్వోకు అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల నిధులు నిలిపివేస్తున్నామని స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్వోకు సంబంధించిన సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు యూఎస్ పేర్కొంది. అయితే, డబ్ల్యూహెచ్వో.. అమెరికా ఆరోపణలను తోసిపుచ్చింది. ఈ ఉపసంహరణ అమెరికాకే కాకుండా ప్రపంచ మొత్తానికి ఒక నష్టమని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ పేర్కొన్నారు.సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా చెప్పగానే సరిపోదని.. సంస్థకు బకాయిపడిన 260 మిలియన్ డాలర్లను చెల్లించేవరకు డబ్ల్యూహెచ్వో నుంచి యూఎస్ ఉపసంహరణ సాధ్యం కాదని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెల్లించాల్సిన బకాయిలపై అమెరికా అధికారిక వర్గాలు స్పందిస్తూ.. సంస్థ నుంచి వైదొలగడానికి ముందు బకాయిలను పూర్తిగా చెల్లించాలనే చట్టబద్ధమైన నియమమేమీ లేదంటూ కొట్టిపారేశాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో ఆ సంస్థ నుంచి వైదొలుగుతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఏడాది క్రితమే ట్రంప్ ఈ ఉపసంహరణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. -
ట్రంప్ ఓవరాక్షన్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. తన వల్లే ఇరాన్లో నిరసనకారులకు మరణ శిక్షలు ఆగిపోయాని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటరిచ్చింది. నిరసనకారులకు సామూహిక మరణ శిక్ష విధించాలనే నిర్ణయమే తమ ప్రభుత్వం తీసుకోలేదని ఓ అధికారి చెప్పుకొచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు. వందల మంది నిరసనకారులకు విధించిన ఉరిశిక్ష విధించాలని ఖమేనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, అమెరికా ఒత్తిడి వల్ల అక్కడి అధికారులు దాదాపు 800 మందికి మరణ శిక్షను రద్దు చేశారు. అమెరికా కల్పించుకోకపోయి ఉంటే 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేవారు. వారి ఉరిశిక్షలను నేనే ఆపాను. నేను తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంతో ఇరాన్ పాలకవర్గం వెనక్కి తగ్గింది అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన అధికారి స్పందించారు. ట్రంప్ చెబుతున్నవన్నీ అబద్ధాలే అని క్లారిటీ ఇచ్చారు. నిరసనకారులకు సామూహిక మరణ శిక్ష విధించాలనే నిర్ణయమే తమ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. ఎవరికీ ఉరిశిక్షలు విధించలేదని తెలిపారు. అరెస్టు చేసిన వారి సంఖ్య కూడా అంత మొత్తంలో లేదన్నారు. దీనిపై తప్పుడు వార్తలు, ప్రకటనలను ప్రచారం చేయొద్దని అంతర్జాతీయ మీడియా వర్గాలకు సూచించారు.ఇరాన్లో నిరసనలు.. ఇదిలా ఉండగా.. ఇరాన్లో ద్రవ్యోల్బణం, అవినీతి తదితర కారణాలతో అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఇస్లామిక్ పాలన అంతంకావాలంటూ ఆందోళనలు చేశారు. మహిళలు సైతం రోడ్లెక్లి హిజాబ్లను తొలిగించి చేతిలో సిగరెట్లు పట్టుకొని ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా నిరనసలు జరుపుతున్నారు. అయితే ఆందోళన కారులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని అమెరికా రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. నిరసన కారులను ఊచకోతకోస్తుంది.రెండు వేల మందికిపైగా మృతిఇరాన్లో నిరసనలో పాల్గొన్న వారిలో రెండువేల మందికిపైగా మృతి చెందిన విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారి ఒకరు మరణాల సంఖ్యను వెల్లడించారు. ఇరాన్ పౌరులు చేపట్టిన ఈనిరసనలను ఆ దేశం ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ఆందోళనలు ఇలానే కొనసాగితే మరణాల సంఖ్య కూడా ఇలానే ఉంటుందని హెచ్చరించింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఉగ్రవాద శక్తులు ప్రభుత్వ భవనాలు, పోలీస్ స్టేషన్లు, వ్యాపారాలు, పౌరులు, భద్రతా దళాలపై కాల్పులు జరిపాయని సదరు అధికారి పేర్కొన్నారు. -
అమెరికా-కెనడాల మధ్య ‘బోర్డ్ ఆఫ్ పీస్’ అగ్గి..!
అమెరికా-కెనడాల మధ్య డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ అగ్గి రాజేస్తుంది. ట్రంప్ ఏర్పాటు చేసిన ఈ పీస్ బోర్డుకు కెనడా సమ్మతి తెలపకపోవడంతో అది మరొక వివాదానికి దారి తీసింది. తమకు సహకరించని దేశాలను గుర్తుపెట్టుకుంటామని వ్యాఖ్యానించిన ట్రంప్.. కెనడాపై మాత్రం పెరు పెట్టి మరీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కెనడా కృతజ్ఞత లేని దేశం అంటూ నిప్పులు చెరిగారు. తమ వల్లే ఆ దేశం మనుగడలోకి వచ్చిందని, ఇప్పటికీ తామే ఆదేశానికి ఆధారమని ధ్వజమెత్తారు. దీనిపై కెనడా ఘాటుగా స్పందించింది. ట్రంప్.. ఇక మీ మాటలు చాలంటూ ఘాటుగా బదులిచ్చింది. దీనిపై కెనడా ప్రధాని మార్క్ కార్నే మాట్లాడుతూ.. తమకు స్వతంత్ర ప్రతిపత్తి ఉందంటూ ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. తమ ఎవరి మీద ఆధారపడి బతకడం లేదని, కెనడియన్లకు ప్రత్యేకమైన జీవన స్థితిగతులు ఉన్నాయన్నారు. ‘ అమెరికా వల్ల కెనడియన్లు జీవించడం లేదు. కెనడా అభివృద్ధి చెందుతోంది ఎందుకంటే మనం కెనడియన్లం’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో బోర్డ్ ఆఫ్ పీస్లో తమను జాయిన్ అవ్వమని ట్రంప్ నుంచి ఆహ్వానం అందిన విషయాన్ని కార్నే అంగీకరించారు. ఆయన రెండు దేశాల మధ్య ఉన్న అద్భుతమైన భాగస్వామ్యాన్ని కూడా ఒప్పుకున్నారు. కాకపోతే తమకు ప్రత్యేక అభిప్రాయాలుంటాయనే విషయాన్ని కార్నే తేల్చిచెప్పారు. ఆ బోర్డుకు అత్యధిక మొత్తంలో చెల్లించడానికి తాము సిద్ధంగా లేమని తెగేసి చెప్పేశాకాగా, ఇక దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోఅమెరికా ఆధిపత్యంపై సెటైర్లు వేశారు. అమెరికా ఆధిపత్యం తగ్గిపోతున్నదని, మధ్యస్థ శక్తులు కలిసి కొత్త సహకార ప్రపంచాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ శాంతి కూటమికి కెనడా దూరంగా ఉంది. అయితే ట్రంప్ మాత్రం కెనడాపై రెచ్చిపోయి ప్రసంగించడంతో ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎటు దారితీస్తాయో అనే చర్చ మొదలైంది.ఇదీ చదవండి:Trump: మరో కొత్త తలనొప్పి..! -
Trump: మరో కొత్త తలనొప్పి..!
డొనాల్డ్ ట్రంప్.. కాసేపు యుద్ధం అంటారు..అంతలోనే శాంతి అంటారు. కాసేపు అది మాకు కావాలంటారు.. మరికాసేపటికి మాకు సహకరించకపోతే వారిని గుర్తు పెట్టుకుంటామంటారు ఎలా చెప్పుకున్నా ట్రంప్ వైఖరి గంటకో అవతారం అన్న మాదిరిగా ఉంది. ఈ క్రమంలోనే ట్రంప్ కొత్త కూటమిని ఏర్పాటు చేశారు. వరల్డ్ ఎకానిమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలు జరుగుతున్న దావోస్ నగర వేదికగా బోర్డ్ ఆఫ్ పీస్(శాంతి మండలి)ని ఏర్పాటు చేశారు. దీనికి 35 దేశాల మద్దతు తెలుపగా, భారత్ తటస్థ వైఖరిని అవలంభించింది. దీనికి భారత్ దూరంగా ఉండటానికి కారణాలను ఒక్కసారి విశ్లేషిస్తే.. ప్రధాన కారణం మాత్రం ఈ మండలి యొక్క న్యాయబద్ధతపై సందేహాలు ఉంటమేనని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దాంతో పాటు భారతదేశం యొక్క స్వతంత్ర విదేశాంగ ధోరణి మరొక కారణం. ట్రంప్ స్వ ప్రయోజనాలతో ఏర్పడిన కూటమా?ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి మండలిపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డ్ ఆఫ్ పీస్ అంటూ కొత్త కొలిమిని ఏర్పాటు చేసినా. అది ట్రంప్ స్వప్రయోజనాలతో ముడిపడి ఉందనే విషయాన్ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆకస్మికంగా ట్రంప్ శాంతి కూటమిని ఏర్పాటు చేయడానికి ఆయన సొంత లాభం లేకపోతే ఎందుకు ఏర్పాటు చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా UN General Assembly లాంటి సర్వసభ్యత్వం లేకపోవడం వల్ల ఇది అంతర్జాతీయంగా సమగ్రతను కోల్పోయందనేది విశ్లేషకుల మాట. మరొకవైపు మండలిలో పాలస్తీనా వర్గాల ప్రత్యక్ష భాగస్వామ్యం స్పష్టంగా లేకపోవడం భారతదేశానికి ఆందోళన కలిగించింది.భారతదేశం ఎప్పటినుంచో రెండు దేశాల సమస్య పరిష్కారానికి మద్దతు ఇస్తూ వస్తోంది.ఇది భారీ ఆర్థిక బాధ్యత.. అదే సమయంలో ఈ కూటమి భారీ ఆర్థిక బాధ్యతతో కూడుకున్నది. ఇందులో ఉన్న సభ్య దేశాలు $1 బిలియన్ (సుమారు ₹8,300 కోట్ల రూపాయలు) చెల్లించాల్సిన నిబంధన ఉంది. అంటే భారీ ఆర్థిక భారాన్ని సభ్య దేశాలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది భారతదేశానికి భారీ ఆర్థిక బాధ్యతగా చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. స్వతంత్ర, సమతుల్య విదేశాంగ విధానానికే భారత్ పెద్దపీటభారత్ ఎప్పుడూ స్వతంత్ర, సమతుల్య విదేశాంగ విధానాన్నే అనుసరిస్తుంది. అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిన మండలిలో చేరడం వల్ల అంతర్జాతీయంగా పక్షపాత భావన కలగవచ్చని భారత్ భావించినట్లు కనబడుతోంది. భారత్ ఇప్పటికే యూఎన్ ఏజెన్సీల ద్వారా గాజాకు సహాయం అందిస్తోంది. ట్రంప్ మండలిలో చేరకుండా కూడా పునర్నిర్మాణం, సహాయం అందించగలదని భారత్ నమ్ముతోంది.ఇది కూడా గుర్తు పెట్టుకుంటారా?తమకు సహకరించిన, సహకరించిన దేశాలను గుర్తు పెట్టుకుంటామని అదే దావోస్ వేదికగా ట్రంప్ చెప్పుకొచ్చారు. తాము చేసేది మహాయజ్ఞం అన్న చందంగా బిల్డప్ ఇచ్చిన ట్రంప్.. సహకరించకపోతే మాత్రం తప్పుకుండా మదిలో పెట్టుకుంటామన్నారు. ఇప్పుడు ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి కూటమికి భారత్, రష్యాలతో పాటు చైనా కూడా తటస్థ వైఖరిని అవలంభించింది. ఇప్పుడు ఈ కూటమికి అంత సీన్ లేదనే ఈ మూడు దేశాలు భావించే కాస్త దూరంగా ఉన్నాయి. అలాగని కూటమిలో చేరడం లేదని కానీ, భవిష్యత్లో చేరే ఉద్దేశం కూడా లేదని కానీ చెప్పలేదు. మరి ఈ మూడు అగ్రదేశాలను ఒప్పించి, మెప్పించే పని ట్రంప్ చేస్తారా? అనేది మరొక ప్రశ్న. ఇప్పటికే భారత్పై పూర్వపు ప్రేమను ట్రంప్ కురిపిస్తున్నారు. భారత్ తమక మిత్రదేశమని, త్వరలో అతి పెద్ద ట్రేడ్ డీల్ ఉంటుందని కూడా చెప్పేశారు. ఇక రష్యా విషయానికొస్తే.. ఆ దేశం కూడా ట్రంప్ వైఖరిని చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. గ్రీన్లాండ్ అంశానికి సంబంధించి కూడా రష్యా సానుకూలంగానే స్పందించింది. అది ట్రంప్కు, నాటో దేశాలకు సంబంధించిన విషయమని, ఇక్కడ రష్యా జోక్యం ఉండదని చాలా కామ్ అండ్ నీట్గా పుతిన్ తేల్చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూల్గా వెళ్లిపోతేనే బెటర్ అనే భావనలో పుతిన్ ఉన్నారు. అందుకు గ్రీన్లాండ్పై ట్రంప్ వైఖరిని ఖండించలేదు. ఇక చైనా ఎప్పుడూ అమెరికాకు పోటీనే. మరి ఇప్పుడు ఆ దేశం కూడా ట్రంప్ శాంతి కూటమికి దూరంగానే ఉంది. కానీ భవిష్యత్లో జరగబోయే పరిణామాల దృష్యా చైనా ఒక నిర్ణయానికి రావొచ్చు. లేకపోతే శాశ్వతంగా ఈ కూటమికి దూరంగా కూడా ఉండొచ్చు. అమెరికా మాదిరిగానే చైనా కూడా స్వప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుందనేది కాదనలేని సత్యం. ఇక్కడ చైనాకు ఏమైనా ప్రయోజనాలు ఉంటేనే అందులో చేరుతుంది. అందుచేత అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కూటమిని చైనా నిశితంగా గమనించిన తర్వాతే ఒక్క నిర్ణయానికి రావొచ్చు.ఇప్పటికే ఫ్రాన్స్, నార్వే, స్లోవేనియా, స్వీడన్, బ్రిటన్లుఘా కూటమిలో చేరమని తేల్చేయగా, ఖతార్, సౌదీ అరేబియా, అర్జెంటీనా, మంగోలియా, పాకిస్తాన్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, ఇండోనేసియా, జోర్డాన్, అల్బేనియా, అర్మేని యా, అజర్బైజాన్, బహ్రెయిన్, బెలారస్, బల్గేరియా, ఈజిప్ట్, హంగేరీ, కజకిస్తాన్, కొసోవో, మొరాకోలు కూటమిలో చేరాయి. తటస్థంగా ఉన్న దేశాలు ఇవి..రష్యా, భారత్, సింగపూర్, థాయ్లాండ్, ఉక్రెయిన్, ఇటలీ, జర్మనీ, కాంబోడియా, చైనా, క్రొయేషియా, సైప్రస్, గ్రీస్, పరాగ్వే, యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక విభాగం -
ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’పై మస్క్ సెటైర్లు
దావోస్: గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అపర కుబేరుడు ఎలాన్ మస్క్ దుమ్మెత్తి పోశారు. ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ (శాంతి మండలి)ని బోర్డ్ ఆఫ్ పైస్ (శాంతి ముక్కలు)గా మార్చుకుంటే సరిపోతుందని పరోక్షంగా దుయ్యబట్టారు.దావోస్ వేదికగా కొనసాగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో బ్లాక్రాక్ సీఈవో లారీ ఫిక్ అధ్యక్షత వహిస్తున్న ప్యానల్ ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ట్రంప్ బోర్డు పీస్ బదులుగా పైస్ అని ఉండాలని మస్క్ సూచించారు. ‘నేను పీస్ సమ్మిట్ ఏర్పాటు గురించి విన్నాను. అది పీసా లేదంటే గ్రీన్లాండ్ పైస్,వెనిజువెలా పీస్ అని నేను అనుకున్నాను’. మనకు కావాల్సింది పైస్ కాదు పీస్ అంటూ నిశబ్ధంగా ఉన్న ఆడియెన్స్తో నవ్వులు పూయించారు. ELON MUSK: "I heard about the formation of the peace summit? And I was like, is that piece or peace? Like little piece of Greenland a little piece of Venezuela." 😂 pic.twitter.com/QxmbOrH2wC— DogeDesigner (@cb_doge) January 22, 2026 -
తగ్గేదేలే.. ఇరాన్ వైపునకు భారీగా అమెరికా బలగాలు
చల్లారుతుందనుకున్న అమెరికా-ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు ట్రంపరితనంతో మళ్లీ మొదటికొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ వైపు భారీ నౌకాదళాన్ని పంపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సైనిక చర్యకు దిగేదాకా పరిస్థితిని తెచ్చుకోవద్దంటూ ఇరాన్ను హెచ్చరించారాయన. అయితే.. ఈ చర్యపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ ప్రకటించింది.ఇరాన్ వైపు భారీగా అమెరికా నౌకాదళం వెళ్తోంది. అధికారులు ఎప్పటికప్పుడు నాకు నివేదికలు అందిస్తున్నారు. పరిస్థితిని నేనే స్వయంగా సమీక్షిస్తున్నా. ఏం జరుగుతుందో చూడాలి. అయితే సైనిక చర్య జరగకూడదని ఆశిస్తున్నా. ఒకవేళ ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాన్ని గనుక కొనసాగిస్తే.. అమెరికా కచ్చితంగా కఠినంగా స్పందిస్తుంది అని ట్రంప్ స్పష్టం చేశారు.ఇప్పటికే అమెరికా యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్తో పాటు డిస్ట్రాయర్లు, యుద్ధవిమానాలను మిడిల్ఈస్ట్కు తరలిస్తోంది. అదనపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇరాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ నిరసనలపై కఠిన చర్యలు తీసుకోవడంతో వేలాది మంది మరణించినట్లు మానవహక్కుల సంస్థలు చెబుతున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ హెచ్ఆర్ఏఎన్ఏ లెక్కల ప్రకారం ఆ సంఖ్య వేలల్లోనే ఉంది. ఇరాన్ అధికారులు మాత్రం ఆ సంఖ్య 5,000 దాకా ఉండొచ్చని అంటున్నారు. మృతుల్లో వందలాది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. వేల మంది నిరసనకారుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. వాళ్లలో కొందరిని దేశద్రోహం కింద ఉరి తీయాలనే ఆలోచనతో ఉన్నారు.అయితే వాళ్లను ఉరి తీసే ప్రయత్నాలు చేస్తే.. ఇరాన్పై సైనిక చర్య చేపడతామని ట్రంప్ మొదటి నుంచి హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో.. తమ ఒత్తిడి కారణంగానే ఇరాన్ నిరసనకారులను ఉరి వేసే ప్రణాళికను రద్దు చేసిందని మొన్నీమధ్య ప్రకటించారు కూడా. ఈ నిర్ణయం కారణంగానే ఆ దేశంపై సైనిక చర్య విషయంలో తాను వెనక్కి తగ్గినట్లు చెప్పుకున్నారు కూడా. అయితే తాజాగా.. సుమారు 837 మందిని ఉరి తీయకుండా నేను కాపాడాను అంటూ ఆయన ప్రకటించారు.‘అణు’ వార్నింగ్దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో ట్రంప్ ఇరాన్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తే అమెరికా మళ్లీ చర్యలు తీసుకుంటుంది, కానీ పరిస్థితి శాంతియుతంగా ముగియాలని కోరుకుంటున్నా అని వ్యాఖ్యానించారాయన. ఇదిలా ఉంటే.. ఐరాస విభాగం అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) తన మార్గదర్శకాల ప్రకారం.. సాధారణంగా నెలకు ఓసారి ‘అణు తనిఖీ’ చేపట్టాలి. కానీ, గత ఏడు నెలలుగా ఇరాన్లోని యురేనియం నిల్వలను పరిశీలించలేదని సమాచారం. దీంతో అధిక స్థాయిలో ఉండొచ్చనే ఆందోళన వ్యక్తం అవుతోంది.ఖబడ్దార్.. అమెరికా బలగాల కదలికలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ.. అమెరికా గనుక దాడి చేస్తే ప్రతిదాడి తప్పదు. ఇది బెదిరింపు కాదు, వాస్తవం. ఈసారి ఇరాన్ సైన్యం పూర్తి స్థాయిలో ప్రతిస్పందిస్తుంది. అప్పుడు యుద్ధం దీర్ఘకాలం సాగుతూ మిడిల్ఈస్ట్ అంతా విస్తరిస్తుంది. అమెరికా బేస్లు ఉన్న దేశాలు జాగ్రత్త అంటూ పరోక్షంగా ఇజ్రాయెల్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అయితే.. ఇరాన్ అణు కార్యక్రమం పునరుద్ధరించే పరిస్థితి మీద మాత్రం ఆయన స్పందించలేదు. -
మాకు సంబంధం లేదు
మాస్కో: గ్రీన్లాండ్ను తమ స్వాధీనం చేయా లంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న డిమాండ్తో నాటో ఐక్యతకు బీటలు వారుతున్న వేళ ఈ వ్యవహారంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనదైన శైలిలో స్పందించారు. గ్రీన్లాండ్ విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని తెగేసి చెప్పారు. బుధవారం రాత్రి మాస్కోలో జరిగిన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘గ్రీన్లాండ్ను డెన్మార్క్ ఒక కాలనీ మాదిరిగా పరిగణిస్తోంది. అక్కడి ప్రజల విషయంలో క్రూరంగా కాకున్నా, కఠినంగా వ్యవహరించిందన్నది నిజం. అది వేరే విషయం. గ్రీన్లాండ్పై ఇప్పుడు ఎవరికైనా ఆసక్తి ఉంటుందా అంటే అనుమానమే’అని పేర్కొన్నారు. ‘గ్రీన్లాండ్కు సంబంధించిన పరిణామాలపై మాకెలాంటి ఆందోళన లేదు. ఈ అంశాన్ని వాళ్లే పరిష్కరించుకుంటారని భావిస్తున్నా’అని పుతిన్ తెలిపారు. ‘1917లో డెన్మార్క్ వర్జిన్ దీవులను అమెరికాకు అమ్మేసింది. ఆ మాట కొస్తే రష్యా 1867లో అలా స్కాను అమెరికాకు 72 లక్షల డాలర్లకు విక్రయించింది’అని ఆయన చరిత్రను గుర్తు చేశారు. -
మన తక్షణ కర్తవ్యమేంటి?
బ్రస్సెల్స్: గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ మొండిపట్టు పట్టడంతో తమ తదుపరి కార్యాచరణపై సమాలోచనలు జరిపేందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. గురువారం బ్రస్సెల్స్లో యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా సారథ్యంలో ఐరోపా మండలి సమావేశాలు ఆరంభమయ్యాయి. డెన్మార్క్ విషయంలో తమకు మద్దతివ్వని ఏడు యూరోపియన్ దేశాలపై 10 శాతం అదనపు సుంకాలను విధిస్తానన్న తన నిర్ణయం నుంచి ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గడంతో ఆయా దేశాలు కాస్తంత ఊపిరిపీల్చుకున్న తరుణంలో ఈ సమావేశాలు జరగడం గమనార్హం. ట్రంప్ శాంతి మండలిలో చేరేందుకు కొన్ని యూరప్దేశాలు విముఖత వ్యక్తంచేశాయి. గ్రీన్లాండ్ విషయంలోనూ ట్రంప్తో విబేధించాయి. ఈ నేపథ్యంలో ఇకమీదట అమెరికాతో ఏదైనా తేల్చుకునేందుకు ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలని, ఐక్యంగానే ముందడుగు వేయాలని యూరోపియన్ కౌన్సిల్ సమావేశంలో సభ్యదేశాలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. -
తగ్గిన ట్రంప్..మార్కెట్ జంప్
ముంబై: మూడు రోజుల వరుస నష్టాల తర్వాత ఎట్టకేలకు దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం అరశాతం మేర లాభపడింది. గ్రీన్ల్యాండ్ స్వా«దీనం విషయంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గడం, అమెరికా–భారత్ ట్రేడ్ డీల్ ఖరారవుతుందనే అంచనాలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి స్వల్ప రికవరీ, క్రూడాయిల్ ధరలు దిగిరావడం తదితర అంశాలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 398 పాయింట్లు లాభపడి 82,307 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 132 పాయింట్లు పెరిగి 25,290 వద్ద నిలిచింది. ఉదయమే లాభాలతో మొదలైన సూచీలు... రోజంతా అదే ధోరణిలో కొనసాగాయి. ముఖ్యంగా ఇటీవల 3రోజుల మార్కెట్ పతనంలో భాగంగా కనిష్టాలకు దిగివచి్చన నాణ్యమైన షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఒక దశలో సెన్సెక్స్ 874 పాయింట్లు ఎగసి 82,783 వద్ద, నిఫ్టీ 278 పాయింట్లు ర్యాలీ చేసి 25,434 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. గ్రీన్ల్యాండ్ విషయంలో ఈయూ దేశాలపై విధించిన టారిఫ్లను ఎత్తివేస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఆసియాలో జపాన్, చైనా, కొరియా, హాంగ్కాంగ్ సూచీలు 1% వరకు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 1.50% పెరిగాయి. అమెరికా స్టాక్ సూచీలు అరశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. → కన్జూమర్, రియల్టీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో పీఎస్యూ బ్యాంక్ 2.43%, క్యాపిటల్ గూడ్స్ 2.03%, ఇండ్రస్టియల్స్ 1.78%, యుటిలిటి 1.45%, విద్యుత్ 1.43%, మెటల్స్ 1.34%, ఎఫ్ఎంసీజీ 1.22%, కమోడిటిస్ 1.15%, ఫార్మా 1.11 శాతం లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్లు వరుసగా 1.28%, 1.13 శాతం పెరిగాయి. → డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు 8% క్షీణించి రూ.859 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఏకంగా 10% పతనమై రూ.838 వద్ద లోయర్ సర్క్యూట్ తాకింది. -
డొనాల్డ్ ట్రంప్పై కాసుల వర్షం.. ఒకే ఏడాదిలో 12 వేల కోట్లకు పైగా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కూడా ట్రంప్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా గ్రీన్లాండ్కు మద్దతుగా నిలుస్తున్న ఐరోపా దేశాల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.అయితే ఈ సందర్భంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, ఇదొక 'ఎకనామిక్ మిరకిల్' అని ట్రంప్ అభివర్ణించారు. తన టారిఫ్ విధానాల వల్ల దేశంలోకి $18 ట్రిలియన్ల (సుమారు రూ. 1,512 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ఇతర దేశాల వస్తువులపై విధిస్తున్న భారీ సుంకాల వల్ల, అమెరికా దిగుమతిదారులు ఎక్కువ పన్ను కడుతున్నారు. దీంతో వస్తువుల ధరలు పెరిగి సామాన్య అమెరికా ప్రజలే నష్టపోతున్నారు.ట్రంప్పై కాసుల వర్షంఅయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కంటే ట్రంప్ ఆస్తులే ఎక్కువగా పెరిగనట్లు తెలుస్తోంది. న్యూయర్క్ టైమ్స్ ప్రకారం.. రెండోసారి అధ్యక్షుడైన ఆయన కేవలం ఒకే ఏడాదిలో $1.4 బిలియన్లు (సుమారు రూ. 12,810 కోట్లు) సంపాదించినట్లు సమాచారం. ట్రంప్ తన క్రిప్టోకరెన్సీ వెంచర్ల నుంచి గణనీయమైన మొత్తంలో డబ్బు సంపాదించారంట. ఆయన కుటుంబానికి చెందిన 'వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్', 'మీమ్ కాయిన్'($TRUMP) ద్వారా వందల మిలియన్ల డాలర్లు వచ్చినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒమన్,సౌదీ అరేబియా, వియత్నాం వంటి దేశాల్లో ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్టుల ద్వారా కోట్లాది రూపాయలు లైసెన్సింగ్ ఫీజుల రూపంలో ట్రంప్ 23 మిలియన్ డాలర్లు సంపాదించారని సమాచారం. -
కొలువైన ట్రంప్ శాంతి మండలి
దావోస్/న్యూఢిల్లీ: మాటలతోనే పెనుకుంపట్లు రాజేసే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతికాముకుడి అవతారమెత్తి ప్రపంచ యవనికపై కొత్త కూటమిని కొలువుతీర్చారు. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలు జరుగుతున్న దావోస్ నగరంలో 19 దేశాల అగ్రనేతల సమక్షంలో బోర్డ్ ఆఫ్ పీస్(శాంతి మండలి)ని ట్రంప్ గురువారం అధికారికంగా ప్రకటించారు. అగ్రనేతల సమక్షంలో సంబంధిత పత్రంపై ట్రంప్ సంతకం చేసి కొత్త కూటమిని ఉనికిలోకి తీసుకొచ్చారు. ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయంగా తన కనుసన్నల్లో పనిచేసేలా గాజా పునర్నిర్మాణ, అభివృద్ధి మాటున శాంతి మండలిని ఏర్పాటుచేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలను ట్రంప్ ఈ సందర్భంగా తోసిపుచ్చారు. ‘‘ శాంతి మండలిలో భాగస్వాములుగా ఉండేందుకు ప్రతి దేశం అమితాసక్తి కనబరుస్తోంది. ఇవేగాక మరెన్నో దేశాలతో కలిసి పనిచేస్తాం. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేస్తా. ఇప్పుడిప్పుడే ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి. ఐరోపా, అమెరికా, పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. ఏడాది క్రితం యుద్ధాలతో ప్రపంచం అగ్నిగోళంగా ఉండేది. ఇది చాలా మందికి తెలీదు. సమకాలీన పరిస్థితుల పర్యవసానంగా ఏర్పడిన ఈ ‘శాంతి మండలి’ అంతర్జాతీయ కూటముల్లో ఒకటిగా గొప్పదిగా ఉండబోతోంది. శాంతి మండలి అనేది ప్రపంచానికి చాలాచాలా ప్రత్యేకమైంది. ఐక్యరాజ్యసమితిలో ఎంతో సత్తా ఉంది. ఒక పశ్చిమాసియాలో ఇజ్రాయెల్–హమాస్ యుద్ధమేకాదు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల ముగింపు కోసం ఐరాసతో కలిసి పనిచేస్తా. ఐరాస, కొత్త శాంతి మండలి కలిసి పనిచేస్తే అది ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ముఖ్యంగా పశ్చిమాసియాకు కొత్త రోజులొస్తాయి. గాజా యుద్ధం దాదాపు చివరి దశకు చేరుకుంది. అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నా వాటిని మనం ఆపేయబోతున్నాం. వాగ్దానం చేసినట్లు హమాస్ వాళ్లు ఆయుధాలు విడనాడాలి. ఆయుధాలను త్యజించని రోజున అదే వాళ్లకు ఆఖరి రోజు అవుతుంది’’ అని ట్రంప్ హెచ్చరించారు. కొత్త కూటమితో ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగిసిపోనుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.35 దేశాలతో మొదలు..35 దేశాలతో శాంతి మండలిని ఆరంభిస్తున్నామని ట్రంప్ తెలిపారు. వేదికపై ఆసీనులైన పలువురు అగ్రనేతలను ట్రంప్ పేరుపేరున పొగిడారు. తనతో కలిసి ముందడుగువేస్తున్నందుకు అభినందించారు. ‘‘మేమంతా ఎంతో కీలకమైన పనులు చేయబోతున్నాం. ఇంతటి ఘనకార్యాలు చేయడానికి ఇంతకు మించిన వేదిక మరోటి లేదు. వ్యవస్థాపక చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. గర్వంగానూ ఉంది’’ అని ట్రంప్ అన్నారు. శాంతి మండలి డాక్యుమెంట్పై ట్రంప్ సంతకంచేశాక అక్కడి 19 దేశాల అగ్రనేతలను సంతకాలుచేశారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం కార్యక్రమంలో పాల్గొని కూటమిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ముష్కరులను ముద్దుచేస్తూ ఉగ్రవాదాన్ని పెంచి అశాంతిని రాజేసే పాకిస్తాన్.. శాంతికాముక∙బోర్డ్లో చేరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు దేశాలు శాంతి మండలిలో చేరేందుకు ఆసక్తి చూపించగా ఐరోపా సమాఖ్యలోని కొన్ని సభ్యదేశాలు నిరాకరించాయి. ఆహ్వానం అందుకున్నా ఇంకొన్ని దేశాలు తమ వైఖరిని బయటపెట్టలేదు. భారత్ సైతం ఈ కార్యక్రమం నుంచి దూరంగా ఉండిపోయింది.నేనింకా రియల్ ఎస్టేట్ మనిషినే..గాజా పునర్నిర్మాణలో భాగంగా గాజాను సము ద్రతీర ప్రాంతాలకు, రవాణా, ఇంధన మౌలిక వసతులను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ అన్నారు. ఇదే వేదికపై ఆయన నూతన గాజా ఇలా ఉండబోతోందంటూ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. ‘‘ సముద్రతీర ప్రాంతం ఎంత బాగుందో చూడండి. బీచ్లతో అలరారుతున్న గాజా స్ట్రిప్లో ఆకాశహ ర్మ్యామ్యలను నిర్మించబోతున్నాం. తీరప్రాంత పర్యాటకం ఊపందుకోబోతోంది. ఇన్నాళ్లూ ఇదే ప్రాంతంలో కడు పేదరికంలో మగ్గిపోయిన పాలస్తీనియన్లు మేం చేసే అభివృద్ధి తర్వాత అద్భుతజీవనం కొనసాగిస్తారు. భవిష్యత్లో సాక్షాత్కారం కాబోయే ఈ భవంతులను చూస్తుంటే నాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి మేల్కొంటున్నాడు. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నేను రియల్ ఎస్టేట్ వ్యక్తినే’’ అని ట్రంప్ అన్నారు.మండలిలో చేరతామన్న దేశాలుఖతార్, సౌదీ అరేబియా, అర్జెంటీనా, మంగోలియా, పాకిస్తాన్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, ఇండోనేసియా, జోర్డాన్, అల్బేనియా, అర్మేని యా, అజర్బైజాన్, బహ్రెయిన్, బెలారస్, బల్గేరియా, ఈజిప్ట్, హంగేరీ, కజకిస్తాన్, కొసోవో, మొరాకోసమ్మతి తెలపని దేశాలు..ఫ్రాన్స్, నార్వే, స్లోవేనియా, స్వీడన్, బ్రిటన్తటస్థ వైఖరితో ఉన్న దేశాలురష్యా, భారత్, సింగపూర్, థాయ్లాండ్, ఉక్రెయిన్, ఇటలీ, జర్మనీ, కాంబోడియా, చైనా, క్రొయేషియా, సైప్రస్, గ్రీస్, పరాగ్వే, యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక విభాగం -
గాజా శాంతి మండలిని ఆవిష్కరించిన ట్రంప్
దావోస్: గాజా శాంతి మండలిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించారు. దావోస్ వేదికగా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’ సంతకాలు జరిగాయి. అయితే, గాజా ’బోర్డ్ ఆఫ్ పీస్కు కార్యక్రమానికి భారత్ దూరంగా ఉంది. అయితే, గాజా శాంతిమండలిలో పాకిస్తాన్ సభ్య దేశంగా చేరింది. గాజా పునర్నిర్మాణం, శాంతి కోసమే బోర్డ్ ఆఫ్ పీస్ అంటూ చెబుతున్న ట్రంప్.. ఆయుధాలు వీడకపోతే బూడిద చేస్తామంటూ హమాస్ను ఈ సందర్భంగా మరోసారి హెచ్చరించారు.అంతర్జాతీయ విభేదాలను పరిష్కరించడానికి సహాయపడుతుందని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగం కావాలని కోరుకుంటున్నారని ట్రంప్ అన్నారు. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తామని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. కాగా, శాంతి మండలిలో చేరాలని 50 మందికిపైగా ట్రంప్ దేశాధినేతలకు ఆహ్వానాలు పంపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా పలు దేశాల అధినేతలకు ఆహ్వానాలు అందాయి.మధ్యప్రాచ్యంలో శాంతిని సుస్థిరం చేయడానికి, ప్రపంచ సంఘర్షణల పరిష్కారానికి కొత్త మార్గాన్ని అన్వేషించడానికి ఉద్దేశించిన ఈ బోర్డులో చేరాలని ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ లేఖ రాశారు. ఈ బోర్డులో చేరిన దేశాల్లో ప్రస్తుతం పాకిస్థాన్తో పాటు బహ్రెయిన్, మొరాకో, అర్జెంటీనా, అర్మేనియా, అజర్బైజాన్, బల్గేరియా, హంగేరి, ఇండోనేషియా, జోర్డాన్, కజకిస్థాన్, కొసోవో, పరాగ్వే, ఖతార్, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈ, ఉజ్బెకిస్థాన్, మంగోలియా ఉన్నాయి.గాజా శాంతి మండలిలో చేరాలంటూ ట్రంప్ ఆహ్వానంపై భారత్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ మండలిలో పాకిస్థాన్ చేరికను ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాక్ గడ్డపై పని చేస్తున్న లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు, హమాస్కు మధ్య సంబంధాలు పెరుగుతున్నాయని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ఐక్యరాజ్యసమితి స్థానంలో ట్రంప్ ఈ గాజా శాంతి మండలిని తీసుకువస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది.ఈ బోర్డుకు ట్రంప్ ఛైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ మండలిలో ఉప విభాగాలు ఏర్పాటు, రద్దు చేసే సర్వాధికారాలు ఆయనకే ఉంటాయిట్. ట్రంప్ ఎంపిక చేసే ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు రెండేళ్ల పదవీకాలం కలిగి ఉంటారు. వైట్ హౌస్ (అధ్యక్ష పదవి) నుండి వైదొలిగినా, ట్రంప్ స్వచ్ఛందంగా రాజీనామా చేసే వరకు ఆయనే ఛైర్మన్గా కొనసాగేలా నిబంధనలు రూపొందించారు. -
గ్రీన్లాండ్: ఇక్కడ ఇల్లు కొనొచ్చు.. కానీ స్థలం కొనలేరు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది గ్రీన్లాండ్. దశాబ్దాల క్రితం తమ చేజారిన ఈ ద్వీప దేశాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. డెన్మార్క్ రాజ్యంలో భాగమైన స్వయంప్రతిపత్త ప్రాంతం మొత్తాన్ని కొనుగోలు చేయడానికి అమెరికా ఆసక్తిని వ్యక్తం చేస్తుండగా వాస్తవంగా ఇక్కడ ఎక్కడా లేని భిన్న భూ యాజమాన్య చట్టాలు ఉన్నాయి.ఇంటి కొనుగోలు, భూమి పరిమితులుగ్రీన్లాండ్లో మీరు ఇల్లు కొనుగోలు చేయవచ్చు కానీ భూమి స్వంతం చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే.. గ్రీన్లాండ్ మొత్తం భూమి ప్రభుత్వానికి చెందినది. ప్రైవేట్ భూ యాజమాన్యానికి అనుమతి ఉండదు. స్థానికులు, కంపెనీలు, లేదా సహకార గృహ సంఘాలు మాత్రమే భూమిని ఉపయోగించుకునే హక్కును పొందగలరు. కానీ భూమి అసలు వారికి స్వంతం కాదని గుర్తుంచుకోవాలి.హౌసింగ్ కంపెనీలు.. పబ్లిక్ హౌసింగ్, ఇతర ఆస్తులను నిర్వహిస్తాయి. మీరు ఇల్లు కొనుగోలు చేసినా, భూమి కోసం “సైట్ కేటాయింపు” (use-right allocation) కోసం స్థానిక మునిసిపాలిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సైట్ కేటాయింపు పొందిన తర్వాత మాత్రమే ఆ భూమిని ఉపయోగించుకునేందుకు వీలుంటుది. కానీ దాన్ని కొనలేరు.సైట్ కేటాయింపుతో ఏమేం చేయొచ్చు..కొత్త ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇప్పటికే ఉన్న ఇంటిని విస్తరించుకోవచ్చు. నిర్మించిన ఇల్లు కొనుక్కోవచ్చు. కారు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. నిర్మాణం ఉపయోగాన్ని మార్చుకోవచ్చు (ఉదాహరణకు, దుకాణం నుంచి ఇల్లుగా మార్పు). పైపు, శాటిలైట్ డిష్, మురుగునీరు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు.గ్రీన్లాండ్లో భూమి చట్టాలు ఒక తాత్విక సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటాయి. అదేంటంటే.. భూమి వ్యక్తిగత యాజమాన్యంలో ఉండకూడదు. అది సమష్టిగా ప్రజలందరికీ చెందాలి.ఆస్తి ఎవరు కొనొచ్చు..గ్రీన్లాండ్, డెన్మార్క్ లేదా ఫారో దీవుల పౌరులు ఇక్కడ ఆస్తి కొనవచ్చు. ఈ ద్వీపంలో కనీసం రెండు సంవత్సరాలు నివసించి, పన్నులు చెల్లించిన వారు కూడా సైట్ కేటాయింపు కోసం దరఖాస్తు చేయవచ్చు.ఇంటివలన పొందే స్థల పరిమాణం కూడా కుటుంబానికి అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకు, నలుగురు సభ్యులున్న కుటుంబానికి నాలుగు పడకగదుల అపార్ట్మెంట్ కేటాయిస్తారు. కానీ నుక్ వంటి పెద్ద పట్టణాలలో వెయిటింగ్ లిస్ట్ చాలా పొడవుగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఇంటికి సైట్ కేటాయింపు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది.గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్గ్రీన్లాండ్లో పెద్ద పట్టణాలు గృహాల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉద్యోగుల కోసం ముఖ్యంగా స్వయంప్రతిపత్త ప్రాంతాలకు వలస వచ్చిన వారికి ప్రత్యేక వసతులు ఉంటాయి. ఇంటికి సైట్ కేటాయింపు కోసం వేచి ఉండే సమయం నుక్లో సుమారుగా 10–12 సంవత్సరాలు ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు వసతిని అందిస్తాయి. -
ఇరాన్ కు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్
-
అప్పుడు మేం అలస్కాను యూఎస్కు అమ్మేశాం: పుతిన్
గ్రీన్లాండ్ను ఎలాగైనా చేజిక్కించుకోవాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఊహించని మద్దతు లభించింది. ఇప్పటివరకూ అమెరికా- గ్రీన్లాండ్ అంశంపై రష్యా వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉందని అంతా భావించినా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ మాత్రం.. యూఎస్కే దాదాపు మద్దతు తెలిపాడు. జాతీయ భద్రతా మండలిలో పుతిన్ మాట్లాడుతూ.. ‘ గ్రీన్లాండ్ అంశం మాకు సంబంధం లేదు. అది యూఎస్-నాటోలు చూసుకుంటాయి. గ్రీన్లాండ్ మా జోక్యం ఉండదు. అది అసలు రష్యాకు సంబంధం లేని అంశం. ఆ విషయాన్ని నాటో ఆర్గనైజేషన్-అమెరికాలు చూసుకుంటాయి. గ్రీన్లాండ్పై మధ్యలో మేము దూరాల్సిన అవసరం లేదు. గ్రీన్లాండ్ను డెన్మార్క్ ఎప్పుడూ కాలనీగా చూస్తుంది. గ్రీన్లాండ్పై క్రూరత్వం ప్రదర్శించకపోయినా.. దానిపై డెన్మార్క్ కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా.. ఏం జరిగినా గ్రీన్లాండ్ ఎపిసోడ్ అనేది మాకు అనవసరం. వాళ్ల వాళ్లు చూసుకుంటారు. మాకైతే సంబంధమే లేదు. 1917లో వర్జిన్ దీవుల్ని అమెరికాకు డెన్మార్క్ అమ్మేసింది. మేం కూడా అలస్కా(ప్రస్తుతం యూఎస్లో ఉన్న 49వ రాష్ట్రం) ను యూఎస్కు అమ్మేసాం. 1867లో సుమారు 7.2 మిలియన్ డాలర్లకు అలస్కాను అమ్మేశాం’ అని పుతిన్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. -
గ్రీన్లాండ్ టారిఫ్లు.. వెనక్కి తగ్గిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చల్లబడ్డారు. గ్రీన్లాండ్ విషయంలో యూరప్ దేశాలపై విధించబోయే సుంకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దావోస్ వేదికగా గ్రీన్లాండ్.. యూరోపియన్ దేశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. యూరప్లో తమ మిత్రదేశాలపై ఫిబ్రవరి 1 నుంచి సుంకాలు విధించబోతున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు స్వయంగా ఆయనే తన సోషల్ మీడియా అకౌంట్లో ప్రకటించారు. నాటో చీఫ్ మార్క్ రుట్టేతో జరిగిన భేటీలో ఆర్కిటిక్ భద్రతపై భవిష్యత్ ఒప్పందానికి రూపకల్పనపై అంగీకారం కుదిరిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 1న అమలులోకి రావాల్సిన సుంకాలను విధించబోను. గ్రీన్లాండ్కు సంబంధించిన "గోల్డెన్ డోమ్" అంశంపై అదనపు చర్చలు కొనసాగుతున్నాయని, చర్చలు ముందుకు సాగేకొద్దీ మరిన్ని వివరాలు వెల్లడిస్తాం. ఈ చర్చలు, ఒప్పందాలు అమెరికా మరియు నాటో దేశాలందరికీ ప్రయోజనకరంగా ఉంటాయి. చర్చల బాధ్యతను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరియు ఇతరులు నిర్వహిస్తారు. వారు నేరుగా నాకు నివేదిస్తారు.. అని ట్రంప్ తన పోస్టులో తెలియజేశారు. అంతకు ముందు.. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో మాట్లాడుతూ.. గ్రీన్లాండ్ను ఓ ఐస్ ముక్కగా అభివర్ణించారు. ఎలాగైనా దానిని అమెరికా సొంతం చేసుకోవాల్సిందేనంటూ మాట్లాడారు. అయితే ఇందుకోసం బలప్రయోగం(సైనిక చర్య) చేయబోమని.. అమెరికా విస్తరణను నాటో అడ్డుకునేందుకు ప్రయత్నించకూడదని అంటూనే ఇటు యూరప్ మిత్రదేశాలనూ ఆయన హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికానే యూరప్ను రక్షించింది. ఆ సంగతి మరిచిపోకూడదు. అలాగే.. నాటోకు మేమెంతో సాయం అందించాం. కాబట్టి మా అభ్యర్థన చిన్నదే అని అనుకుంటున్నాం అంటూ గ్రీన్లాండ్ విషయంలో అడ్డుపడకూడదంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. మేం బలప్రయోగం జరిపితే పని తేలికగా అవుతుంది. కానీ, అలా చేయం. ఆ అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్కు అమెరికా భద్రత కోసం అవసరమని, రష్యా–చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఇది కీలకమని ఆయన వాదించారు. గ్రీన్లాండ్ విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత ప్రకటించారు. ఈ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరకులపై 10 శాతం అదనపు సుంకం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలకు ఈ సుంకం వర్తిస్తుందన్నారు. ఒకవేళ.. గ్రీన్లాండ్ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ 1కల్లా అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25శాతానికి పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. ఈ హెచ్చరికలను యూరోపియన్ దేశాలు ఖండించాయి. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్.. అమెరికా సుంకాలు విధిస్తే యూరప్ ఒక్కటిగా.. కఠినంగా ప్రతిస్పందిస్తుందన్నారు. అమెరికా–యూరప్ మధ్య వాణిజ్య ఒప్పందం దెబ్బతింటే.. అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం కలుగుతుందని హెచ్చరించారు. గ్రీన్లాండ్ భవిష్యత్తుపై సుంకాల బెదిరింపులకు తాము తలొగ్గే ప్రసక్తే లేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సైతం అన్నారు. మరోవైపు యూరోపియన్ పార్లమెంట్ సైతం అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేసే ఆలోచనను తీవ్రతరం చేసింది. ఈలోపు దావోస్లో ట్రంప్ ప్రసంగం, నాటో చీప్తో భేటీ జరిగిన కాసేపటికే యూరప్ దేశాలపై సుంకాలు విధించాలన్న తన నిర్ణయాన్ని ఆయన మార్చుకున్నారు. రియాక్షన్ ఇదే.. దావోస్ వేదికగా ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలపై డెన్మార్క్ ప్రభుత్వం స్పందించింది. తమ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని అమెరికాకు స్పష్టం చేసింది. మరోవైపు.. ఇది తమ దేశాన్ని అవమానించడమేనని గ్రీన్లాండ్ భావిస్తోంది. ట్రంప్ అనిశ్చితి కలిగించే నాయకుడంటూ తిట్టిపోస్తోంది. అయితే సైనిక చర్య ఉండదని ట్రంప్ చెబుతున్నప్పటికీ.. గ్రీన్లాండ్ ప్రభుత్వం మాత్రం అప్రమత్తమైంది. ఐదు రోజుల పాటు సరిపడా ఆహారం, నీరు, ఇంధనం నిల్వ చేసుకోవాలంటూ ఆ దేశ ప్రజలకు సూచనలు చేసింది. నూక్ నగరంలోని ప్రజలు అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
తొంబై ఒకటోసారి..
న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి అన్నారు. రెండు దేశాలు అణు యుద్ధానికి సిద్ధమయ్యాయని, ఆ యు ద్ధాన్ని ఆపి తాను లక్షలాది మంది ప్రాణాలు కాపాడానని చెప్పారు. పది నెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపిన ఘనత తనదని చెప్పుకొ చ్చారు. తన రెండవ పదవీకాలం వార్షికోత్స వం సందర్భంగా ఆయన వైట్హౌస్లో మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. తనను కలిసిన పాక్ ప్రధాని ‘మిస్టర్ ట్రంప్.. మీరు కోటి మంది, అంతకంటే ఎక్కువ మంది ప్రాణాలే కాపాడారు’ అని చెప్పారనన్నారు. మిగిలిన దేశాల యుద్ధాల వల్ల నష్టపోయేది లక్షలాది మందేనని, కానీ భారత్, పాకిస్తాన్ లో మాత్రం కోటి, కోటిన్నర, రెండు కోట్లు, అంతకంటే ఎక్కువ జనాభా కూడా అయి ఉండొచ్చన్నారు. ఇది చాలా పెద్ద విషయమ ని చెప్పారు. భారత్, పాక్ల మధ్య యుద్ధం వాషింగ్టన్ మధ్యవర్తిత్వంతోనే ఆగిందని గతేడాది మే 10న ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అదే విషయాన్ని సుమారు 90 సార్లు పేర్కొన్నారు. అమెరికాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశానికి వెళ్లినా ఈ వాదనను పదేపదే ముందుకు తెస్తున్నారు. ‘365 రోజుల్లో 365 విజయాలు’ట్రంప్ 2.0 మొదటి ఏడాదిలో సాధించిన విజయాల సమగ్ర సంకలనాన్ని వైట్ హౌస్ విడుదల చేసింది. ‘365 రోజుల్లో 365 విజయాలు’ పేరుతో విడుదల చేసిన ఆ ప్రకటన ఆధునిక అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడి పదవీకాలంలో సాధించని అద్భుతమైన విజయాలు అధ్యక్షుడు ట్రంప్ సాధించారని పేర్కొంది. వలసలు తగ్గించడం, హత్యల రేటు రికార్డు స్థాయిలో తగ్గటం, దేశంలోకి ట్రిలియన్ల కొద్దీ పెట్టుబడులు, యుద్ధాలు ముగించి శాంతి ఒప్పందాలు, రికార్డు స్థాయిలో ఇంధన ఉత్పత్తి, బ్యూరోక్రసీలో భారీకోతలు అన్నీ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాఏ సాధ్యమ య్యాయని తెలిపింది. అత్యవసరమైన ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని ట్రంప్ అమలు చేశారని, ఇది ప్రారంభం మ్రాతమేనని ప్రకటించింది. ట్రంప్ జనవరి 20, 2025న రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సంవత్సరంలో సాధించిన విజయాల్లో ‘భారత్, పాకిస్తాన్ల మధ్య శాంతిని నెలకొల్పడం’ కూడా ఉందని పేర్కొంది. ఇక, ఇజ్రాయెల్ – ఇరాన్, ఈజిప్టు – ఇథియోపియా, అర్మేనియా – అజర్బైజాన్ మధ్య యుద్ధాలను ముగించినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి లభించి ఉండాల్సిందని కూడా ట్రంప్ అన్నారు. తాను సంఘర్షణను ముగించిన ప్రతి దేశంలోని నాయకులు నోబెల్ శాంతి బహుమతికి తననే నామినేట్ చేశారని చెప్పారు. ఆ దేశాల నాయకులు తనకు బహుమతి ఇవ్వాలని కోరుతూ బలమైన సిఫార్సులను కూడా పంపారని ఆయన తెలిపారు. శాంతి బహుమతి గ్రహీతను ఎంపిక చేసే నార్వేజియన్ నోబెల్ కమిటీపైనా ఆయన మండిపడ్డారు. అధికారులు తమకు సంబంధం లేదని చెబుతున్నా, నోబెల్ బహుమతి ఎవరికి ఇవ్వాలనే అంశాన్ని నార్వేనే నిర్ణయిస్తుందని తాను భావిస్తున్నా న్నారు. ఆమెకు దక్కిన నోబెల్ శాంతి–2025 బహుమతిని తనకు అందజేసిన వెనిజువెలా ప్రతిపక్ష నాయ కురాలు మచాడోపై తనకు అపారమైన గౌరవం ఉందని తెలిపారు. ఎనిమిది యుద్ధాలను ముగించినందుకు నోబెల్ బహుమతికి అర్హత మీకే ఉందని, ఆ బహుమతికి తాను అర్హురాలిని కాదని ఆమె చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. -
త్వరలో భారత్తో బిగ్ ట్రేడ్ డీల్: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2026 సదస్సులో బుధవారం పాల్గోన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ భారత్-అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని, ఇరు దేశాల మధ్య త్వరలోనే ఒక భారీ ట్రేడ్ డీల్ కుదరబోతుందని ఆయన అన్నారు.ఈ ప్రపంచ ఆర్థిక సదస్సులో తన ప్రసంగం ముగిసిన తర్వాత భారత్కు చెందిన 'మనీకంట్రోల్' వార్తా సంస్థతో ట్రంప్ మాట్లాడారు. "మీ ప్రధానమంత్రిపై నాకు అపారమైన గౌరవం ఉంది. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. నాకు మంచి మిత్రుడు. త్వరలో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాము" అని ట్రంప్ పేర్కొన్నారు.కాగా భారత్-యూఎస్ బీటీఎ ఒప్పందం మొదట దశకు చాలా దగ్గరగా ఉందని భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రేడ్ డీల్ గురుంచి ట్రంప్ కూడా వ్యాఖ్యలు చేయడం ప్రధాన్యత సంతరించుకుంది.ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $191(సుమారు ₹15.8 లక్షల కోట్లు) బిలియన్లుగా ఉంది. అయితే ఈ కొత్త డీల్ ద్వారా 2030 నాటికి దీనిని $500 బిలియన్లకు (సుమారు ₹41 లక్షల కోట్లు) చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్కు ప్రస్తుతం అమెరికానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. భారత్ మొత్తం ఎగుమతుల్లో సుమారు 18 శాతం వాటా అమెరికాదే. అయితే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్పై 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు సుంకాలను ట్రంప్ ప్రభుత్వం విధించింది. దీంతో భారత ఎగుమతులు సుమారు 8.5 శాతం తగ్గాయి. అయితే దావోస్ సదస్సులో భారత్పై ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు చేయడంతో ఈ సుంకాలు తగ్గే అవకాశముంది. -
ట్రంప్ ఏడాది పాలన... ప్రపంచానికి పీడకల
డొనాల్డ్ ట్రంప్ 2.0 క్రమంగా ప్రపంచానికి మర్చిపోలేని పీడకలగా మారుతోంది. అమెరికా అధ్యక్షునిగా రెండో టర్మ్లో ఆయన తొలి 12 నెలల పాలన అన్ని దేశాలనూ చెప్పలేనంత అనిశ్చితికి, అయోమయానికి, అంతకు మించిన అభద్రతా భావానికి గురి చేసింది. 2025 జనవరి 20న ప్రమాణస్వీకారం చేసింది మొదలు మితిమీరిన దూకుడు, మతిలేని నిర్ణయాలతో ప్రతి దేశాన్నీ ట్రంప్ హడలెత్తిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో అమెరికా గౌరవాన్ని, అగ్ర రాజ్యంగా దానికున్న పరువు ప్రతిష్టలను కూడా మంటగలుపుతున్నారు. నోటికొచ్చిన వ్యాఖ్యలు, చౌకబారు కామెంట్లకు ట్రంప్ మారుపేరుగా మారిపోయారు. ఆచితూచి మాట్లాడటం తన డిక్షనరీలోనే లేదని నిరూపిస్తున్నారు. కనీస దౌత్య మర్యాదలకు కూడా తిలోదకాలిస్తూ దేశాధినేతలనే మీడియా సాక్షిగా అవమానించి అప్రతిష్ట మూటగట్టుకున్నారు. ఇక ప్రతి దేశంపైనా ఎడాపెడా భారీ టారిఫ్లు విధిస్తూ అంతర్జాతీయ వాణిజ్య వాతావరణాన్నే అతలాకుతలం చేసేశారు ట్రంప్. మాట వినని దేశాలను బెదిరించేందుకు టారిఫ్లను అస్త్రంగా ప్రయోగిస్తూ విపరీతమైన చెడ్డపేరు తెచ్చుకున్నారు. తన ఏడాది పాలన ఘనతలపై మంగళవారం మీడియాతో ట్రంప్ ఏకంగా గంటా నలభై నిమిషాల పాటు ప్రసంగించారు. 365 రోజుల్లో రోజుకొకటి చొప్పున ఏకంగా 365 విజయాలు సాధించానంటూ గొప్పలకు పోయారు. అమెరికాను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేయడంతో పాటు పలు అద్భుతాలు చేశానని చెప్పుకున్నారు. ఆ క్రమంలో మూడొంతులకు పైగా అర్ధసత్యాలు, అసత్యాలే చెప్పి విస్మయపరిచారు. పొరుగు దేశాలను అమెరికాలో కలిపేసుకోవాలన్న విస్తరణ కాంక్షను, గ్రీన్లాండ్ విషయంలో యూరప్ మిత్ర దేశాలతో కూడా కయ్యానికి కాలు దువ్వడాన్నీ అడ్డంగా సమర్థించుకున్నారు. ఈ పెడ పోకడలపై మీడియా అడిగిన ప్రశ్నలకు తప్పించుకునే ధోరణిలోనే బదులిచ్చి సరిపెట్టారు. గడచిన ఏడాదికాలంలో అటు సొంత ప్రజలను, ఇటు ప్రపంచాన్ని ట్రంప్ హడలెత్తించిన తీరుపై ఫోకస్...టారిఫ్లే టారిఫ్లుటారిఫ్లు. ఈ ఏడాది పొడవునా ట్రంప్కు ఫేవరెట్గా మారిన పదం ఇదేనంటే అతిశయోక్తి కాదు. మిత్రులు, ప్రత్యర్థులు, శత్రువులు అని తేడా లేకుండా ప్రతి దేశంపైనా ఎడాపెడా సుంకాల బాదుడుకు దిగారు ట్రంప్. పిడుగుకూ, బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్టుగా ప్రతిదానికీ టారిఫ్లనే అస్త్రంగా ప్రయోగిస్తూ వచ్చారు. తద్వారా మొత్తంగా ప్రపంచ వాణిజ్య స్థితిగతులనే అతలాకుతలం చేసి వదిలారు. సగటున అమెరికాతో వాణిజ్యం నెరుపుతున్న ప్రతి దేశంపైనా కనీసం 10 శాతం అదనపు టారిఫ్లు విధించారు. భారత్పై అత్యధికంగా 50 శాతం మేరకు బాదారు. ఈ టారిఫ్లు, పన్నులు, ఫీజుల ద్వారా 2025లో అమెరికా ఏకంగా 287 బిలియన్ డాలర్లు ఆర్జించినట్టు ఆ దేశ ట్రెజరీ విభాగం గణాంకాలే చెబుతున్నాయి. తద్వారా సగటు అమెరికన్లకు ఒరిగిన ప్రయోజనం కూడా ఏమీ లేదని యేల్ వర్సిటీ బడ్జెట్ ల్యాబ్ తేల్చింది. ట్రంప్ మతిలేని టారిఫ్ల వల్ల పెరిగిన నిత్యావసరాల ధరల దెబ్బకు గత ఏడాది కాలంలో ఒక్కో అమెరికన్ కుటుంబంపై కనీసం 1,500 డాలర్ల మేరకు అదనపు భారం పడ్డట్టు అంచనా వేసింది! ఏడు దేశాలపై దాడులు!యుద్ధాలకు తెర దించి ప్రపంచ శాంతిని సుస్థిరం చేస్తానని రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పెట్టుకున్న ఒట్టును ట్రంప్ సింపుల్గా గట్టుమీద పెట్టేశారు. ఈ ఏడాది కాలంలో కనీసం ఏడు దేశాలపై దాడులకు తెగబడ్డారు! బాధిత దేశాల్లో ఇరాక్తో మొదలుపెట్టి సోమాలియా, ఇరాన్, యెమన్, సిరియా, నైజీరియా, తాజాగా వెనెజువెలా దాకా ఉన్నాయి. ఈ జాబితాలో తర్వాతి పేరు గ్రీన్లాండే అయ్యేలా కన్పిస్తోంది. ఆ దీవిని ఆక్రమించేందుకు యూరప్ దేశాలతో తగాదాలకు కూడా ట్రంప్ వెనకాడటం లేదు! 2024 జనవరి 20 నుంచి ఈ జనవరి దాకా అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి కనీసం 658 వాయు, డ్రోన్ దాడులకు పాల్పడ్డట్టు ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా మానిటర్ పేర్కొంది!6 లక్షల మంది గెంటివేతట్రంప్ ఏడాది పాలనలోనే అమెరికా నుంచి ఏకంగా 6.05 లక్షల మందిని గెంటేశారు! నిర్బంధం, అధికారుల బెదిరింపులు తదితరాలను తట్టుకోలేక ఏకంగా 19 లక్షల మందికి పైగా స్వచ్ఛందంగానే అమెరికాను వీడి వెళ్లిపోయారు. మొత్తమ్మీద ట్రంప్ యంత్రాంగం అడ్డగోలు నిబంధనల దెబ్బకు గత ఏడాది కాలంలో అమెరికాలో నివసిస్తున్న 16 లక్షల మంది వలసదారుల హోదాను కోల్పోయారు. అంతేగాక ఈ ఏడాది కాలంలో ట్రంప్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఏకంగా 66,866 మందిని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిర్బంధించింది. అంటే సగటున రోజుకు 821 మంది ఊచలు లెక్కబెట్టారు! వీటికితోడు, ఏకంగా 75 దేశాలవారు అమెరికా ఇమిగ్రేషన్ వీసాలు పొందేందుకు వీల్లేకుండా ట్రంప్ నిషేధం విధించారు.బెదిరింపుల దౌత్యందౌత్య మర్యాదలకు, సాటి దేశాధినేతలకు ఇవ్వాల్సిన కనీస గౌరవాదరాలకు కనీవినీ ఎరగని రీతిలో పాతర వేశారు ట్రంప్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వైట్హౌస్ ముఖాముఖిలో మీడియా సాక్షిగా దారుణంగా అవమానించి ప్రపంచమంతా ముక్కున వేలేసుకునేలా చేశారు. అంతటితో ఆగలేదు. పలువురు దేశాధినేతలను ఉద్దేశించి మీడియాముఖంగా బెదిరింపులకు దిగడం, వారితో తన ప్రైవేట్ సంభాషణలను బయటపెట్టడం పరిపాటిగా మార్చుకున్నారు. తద్వారా తనతో భేటీ అంటేనే వాళ్లు తీవ్ర విముఖత చూపేదాకా తెచ్చుకున్నారు.228 ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు2025 జనవరి 20న ప్ర మాణస్వీకారం చేసిన తొలి రోజే ట్రంప్ రికార్డు స్థాయి లో 26 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు (ఈఓ) జారీ చేశా రు. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల్లో ఆప ద్ధర్మంగా మాత్రమే ఈవో అస్త్రం వాడాలన్న మర్యాదను అటకెక్కించారు. తొలి టర్ములో నాలుగేళ్లలోనూ కలిపి 220 ఈఓలు ఇస్తే, రెండో టర్ములో తొలి ఏడాది కాలంలోనే ఏకంగా 228 ఈవోలు జారీ చేసి మరో రికార్డు సృష్టించారు! పైగా ఆ ఉత్తర్వులు ఫెడరల్ చట్టాలకు భిన్నంగా ఉండొద్దన్న రాజ్యాంగ నిర్దేశాన్ని కూడా తుంగలో తొక్కారు. దాంతో ట్రంప్ ఈవోలు చాలావరకు కోర్టు కేసులకు దారితీశాయి.పర్యావరణం గాలికిఅగ్రరాజ్యంగా అమెరికాను పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాల్లో ముందు నిలపాల్సింది పోయి, ఆ బాధ్యతలను క్రమంగా పూర్తిగా వదిలించుకుంటూ ట్రంప్ చేతులు దులుపుకుంటున్నారు. పారిస్ ఒప్పందంతో పాటు పలు కీలకమైన పర్యావరణ ఒప్పందాల నుంచి అమెరికా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, పర్యావరణ పరిరక్షణ దిశగా తాజా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన 30కి పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను రద్దు చేసి పారేశారు. పైగా సముద్రాల్లో ఏకంగా 25 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఆఫ్ షోర్ డ్రిల్లింగ్కు పచ్చజెండా ఊపారు!!ఉద్యోగాలు హుష్కాకి!ప్రపంచ దేశాల మీదే కాదు, తన ను నమ్మి గద్దెనె క్కించిన అమె రికన్లపై కూడా ట్రంప్ ఏమాత్రం కనికరం చూపలేదు. కేవలం 10 నెలల్లోనే దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఏకంగా 3.17 లక్షల ఉద్యోగాలను పీకిపారేశారు! అమెరికాను తిరిగి శక్తిమంతమైన దేశంగా మార్చేందుకంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో తెచ్చిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) వ్యయ నియంత్రణ పేరుతో ఇలా ఎడాపెడా ఉద్యోగాలను తీసేస్తూ పోయింది. డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ (డీఈఐ) కార్యాలయాలన్నింటకీ మూత వేసింది. అంతర్జాతీయ అభివృద్ధి విభాగాన్నే నామరూపాల్లేకుండా చేసేసింది!– సాక్షి, నేషనల్ డెస్క్ -
అదో ఐసు ముక్క!.. గ్రీన్లాండ్పై ట్రంప్ వ్యాఖ్యలు
దావోస్: గ్రీన్లాండ్ను కేవలం ‘ప్రపంచానికి మారుమూలగా ఉన్న ఒక మంచు ముక్క’గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివరి్ణంచారు! అయితే, ‘‘వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యమున్న ప్రాంతం గనుకనే ప్రపంచ శాంతిభద్రతల నిమిత్తం దానిపై అమెరికా నియంత్రణ ఉండాలని కోరుతున్నా. అంతే తప్ప అక్కడున్న అరుదైన ఖనిజ నిల్వల కోసం కాదు’’ అని చెప్పారు. గ్రీన్లాండ్ను అమెరికా మాదిరిగా కాపాడే సత్తా మరే దేశానికీ లేదని చెప్పుకొచ్చారు. దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో బుధవారం ట్రంప్ గంటకు పైగా మాట్లాడారు. ‘ఇక్కడ సమావేశమైన ఎందరో మిత్రులారా, కొందరు శత్రువులారా!’ అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టడం విశేషం. ‘గ్రీన్లాండ్పై హక్కులు, యాజమాన్యం, సార్వ¿ౌమాధికారం... అన్నీ అమెరికాకే కావాలి’ అంటూ ఈ సందర్భంగా ఆయన మరోసారి కుండబద్దలు కొట్టారు. గ్రీన్లాండ్కు, యూరప్కు, ముఖ్యంగా డెన్మార్క్కు దశాబ్దాలుగా అమెరికా చేసిన మేలుకు బదులుగా తాను అడుగుతున్నది చాలా చిన్నదని చెప్పుకొచ్చారు. ‘‘అందుకు ఆ దేశాలు అవుననవచ్చు, కాదనీ అనవచ్చు. అయితే ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పదలచుకున్నా. కాదన్న దేశాలను నేను కచ్చితంగా గుర్తు పెట్టుకుంటా’’ అంటూ హెచ్చరించారు! అంతేకాదు, గ్రీన్లాండ్ స్వా«దీనం కోసం బలప్రయోగం చేయబోనని కూడా ట్రంప్ ప్రకటించారు. ‘‘నేను సైనిక చర్యకు దిగుతానని చాలామంది అనుకుంటున్నారు. కానీ నాకు ఆ ఆలోచనే లేదు. గ్రీన్లాండ్పై బలప్రయోగానికి దిగను’’ అని స్పష్టం చేశారు. అయితే, ‘‘గ్రీన్లాండ్ ఉన్నది ఉత్తర అమెరికా ఖండంలో. కనుక అది మా భూభాగమే’’ అంటూ వాదించారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గ్రీన్లాండ్ను అమెరికాయే డెన్మార్క్కు అప్పగించింది. అది నిజంగా తెలివితక్కువ పని. ఆ దీవిని కాపాడే సత్తా డెన్మార్క్కు లేదు’’ అన్నారు. ట్రంప్ ప్రసంగం వినేందుకు వచ్చిన పారిశ్రామిక ప్రముఖులు తదితరులతో దావోస్ వేదిక కిటకిటలాడిపోయింది. యూరప్ను ప్రేమిస్తా, కానీ... యూరప్ అంటే తనకెంతో ప్రేమ అని ట్రంప్ చెప్పుకున్నారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో ఆ ఖండాన్ని కాపాడింది అమెరికాయేనని చెప్పారు. కానీ కొంతకాలంగా యూరప్ మాటలు, చేతలు సరైన దిశలో సాగడం లేదని ఆక్షేపించారు. యూరప్ దేశాలపైనా, నాటో కూటమిపైనా ఈ సందర్భంగా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టారిఫ్లు మొదలుకుని పర్యావరణం, వలసల దాకా ప్రతి విషయంలోనూ యూరప్ దేశాలు పొరపాట్లపై పొరపాట్లు చేస్తున్నాయన్నారు. తమ గ్రీన్లాండ్ స్వాధీన యత్నాలకు అవి కలిసిరాకపోవడం ఘోర తప్పిదమని పదేపదే చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ఈ విషయమై తక్షణం సంప్రదింపుల ప్రక్రియకు యూరప్ దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రీన్లాండ్ను అమెరికా స్వా«దీనం చేసుకోవడానికి నాటో కూడా మద్దతివ్వాలని అభిప్రాయపడ్డారు. అమెరికా గత అధ్యక్షులపై, ముఖ్యంగా జో బైడెన్పై ట్రంప్ విమర్శల వర్షం కురిపించారు. ‘‘అమెరికాను బైడెన్ దివాలా స్థాయికి దిగజార్చారు. నేనొచ్చాక ఏడాదిలోనే దేశ ఆర్థిక పరిస్థితిని అద్భుతంగా తీర్చిదిద్దా’’ అని చెప్పుకున్నారు. యూరప్ మాత్రం తప్పుడు నిర్ణయాలతో ఆర్థికంగా అతలాకుతలం అవుతోందని ఎద్దేవా చేశారు. ‘‘చైనా నుంచి యూరప్ గాలిమరల్ని కొంటోంది. చైనా ఆర్థికంగా బలపడటం, యూరప్లో పక్షులు చనిపోవడం తప్ప వాటివల్ల ఒరిగేదేమిటి? చైనాలో ఎక్కడైనా గాలిమరల్ని వాడుతున్నారా?’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రపంచమంతటికీ ఆర్థిక ఇంజన్ అమెరికాయే. అమెరికా అభివృద్ధి చెందినప్పుడే ప్రపంచమంతా అభివృద్ధి సాధిస్తుంది’’ అన్నారు. ట్రంప్ తన ప్రసంగంలో గ్రీన్లాండ్కు బదులుగా పదేపదే ఐస్లాండ్ అని పేర్కొనడం విశేషం! భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నిలువరించానని దావోస్ వేదికపై కూడా ట్రంప్ పాత పాటే పాడారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పటికైనా తెర దించకపోతే ఆ దేశాల అధ్యక్షులు పుతిన్, జెలెన్స్కీ మూర్ఖులే అవుతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు! అయితే, వాళ్లు మూర్ఖులు కాదని తనకు తెలుసంటూ ముక్తాయించారు. ట్రంప్ కాన్వాయ్ దావోస్ వేదిక వద్దకు వస్తుండగా నిరసనకారులు దారి పొడవునా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మాక్రాన్ కళ్లద్దాలపై చెణుకులు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ధరించిన కళ్లద్దాలపై దావోస్ వేదికగా ట్రంప్ చెణుకులు విసిరారు. ‘‘నిన్న దావోస్ వేదికపై మాక్రాన్ అందమైన కళ్లద్దాలు ధరించడం చూశా. పాపం, ఆయనకు ఏమైందసలు?’’ అంటూ ప్రశ్నించడంతో సభికులంతా ఘెల్లున నవ్వారు. తాత్కాలిక కళ్ల సమస్య కారణంగా వాటిని ధరించక తప్పడం లేదని మాక్రాన్ చెప్పడం తెలిసిందే.మావల్లే మీ ఉనికి! కెనడాపై ట్రంప్ ఫైర్ మార్క్, నోరు జాగ్రత్త! ప్రధానికి హెచ్చరికలు దావోస్ వేదికగా అమెరికాపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ గుప్పించిన విమర్శలపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను కూడా అదే వేదిక నుంచి ఆయనకు గట్టిగా చురకలు వేశారు. అమెరికా వల్లే కెనడా బతికి బట్టకడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘మార్క్ (కెనడా ప్రధానిని ఉద్దేశించి)! దశాబ్దాలుగా అమెరికా నుంచి కెనడా ఎన్నో తాయిలాలు అందుకుంటూ వచ్చింది. ఇకపై ఏ వ్యాఖ్యలైనా చేసేముందు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకో’’ అంటూ హెచ్చరించారు. తమ సాయం పట్ల కెనడాకు కృతజ్ఞతే లేదంటూ ఆక్షేపించారు. అమెరికా ఏకపక్ష పోకడలను కార్నీ మంగళవారం దావోస్ సదస్సులో ఏకిపారేయడం తెలిసిందే. -
ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'లో చేరేందుకు నో చెప్పిన చైనా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చైనా షాకిచ్చింది. గాజా పునర్నిర్మాణం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం కోసం ట్రంప్ ప్రతిపాదించిన "బోర్డ్ ఆఫ్ పీస్"లో చేరేందుకు చైనా నిరాకరించింది. ఐక్యరాజ్యసమితికి సంబంధం లేని ఏ వ్యవస్ధలోనూ చేరే ఉద్దేశం తమకు లేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ స్పష్టం చేశారు."ప్రపంచ పరిస్థితులు ఎలా మారినా చైనా మాత్రం ఐరాస చట్టాలకు, అంతర్జాతీయ నిబంధనలకే కట్టుబడి ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ 'బోర్డ్ ఆఫ్ పీస్' ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయంగా మార్చాలనే వ్యూహంతో ట్రంప్ ముందుకెళ్తున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా.. ట్రంప్ శాంతి మండలి విజయవంతమైతే తమకు ప్రాధాన్యత తగ్గిపోతుందని భయపడుతోంది. ఈ క్రమంలోనే ట్రంప్ ఆహ్వానాన్ని చైనా తిరస్కరించింది.కాగా ట్రంప్ శాంతి మండలికి యూరప్ నుంచి కూడా ఊహించని వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే ఫ్రాన్స్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు ట్రంప్ శాంతి మండలిలో చేరబోమని స్పష్టం చేశాయి. తాజాగా ఇటలీ కూడా తమ దేశ రాజ్యాంగ నిబంధనలకు విరుద్దంగా ఈ మండలిలో చేరలేమని స్పష్టం చేసింది.ప్రస్తుతానికి 20 దేశాలు ఈ మండలిలో చేరేందుకు అంగీకరించినట్లు అమెరికా ప్రకటించింది. ఇజ్రాయోల్ కూడా ఈ బోర్డ్ ఆఫ్ పీస్ చేరింది. తొలుత టర్కీ, ఖతార్ వంటి దేశాలకు చోటు కల్పించడంపై అభ్యంతరాలు ఇజ్రాయోల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని గౌరవిస్తూ ఈ పీస్ బోర్డులో చేరాలని ఇజ్రాయోల్ ప్రధాని నెతన్యాహు నిర్ణయించుకున్నారు. ఈ బోర్డులో భాగస్వామి కావడానికి పాకిస్తాన్ కూడా సుముఖత వ్యక్తం చేసింది. అయితే భారత్కు కూడా ఈ శాంతి మండలిలో చేరాలని ఆహ్వానం అందింది. కానీ దీనిపై భారత ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. -
'వ్యూహం' అమలు తీరు ఇదేనా?
అమెరికా గత నవంబర్లో ప్రకటించిన ‘జాతీయ భద్రతా వ్యూహ’ పత్రాన్ని చది విన వారికి, ఆ తర్వాత నుంచి అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును గమనించి నప్పుడు, ఆ వ్యూహాన్ని అమలు పరచవలసింది ఇట్లాగేనా అనే సందేహం కలుగు తుంది. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా) అనే లక్ష్యంతో రూపొందించిన ఆ సమగ్ర వ్యూహం అమలులో చాకచక్య మైన దౌత్య నైపుణ్యాన్ని, ఓర్పును ప్రదర్శించాలి. అమెరికా ఆధిపత్యానికి 21వ శతాబ్దం ఆరంభం నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్న స్థితిలో, తమ దేశాన్ని ‘తిరిగి గొప్పదిగా’ చేయదలచుకునే నాయకత్వం అటువంటి నీతిని అనుసరించని పక్షంలో, ఉన్న సవాళ్లు పరిష్కారం కాకపోగా కొత్తవి తలెత్తక తప్పదు.ట్రంప్ చాణక్యనీతికి బదులు ధూర్తనీతికి పాల్పడుతున్నందున ప్రస్తుతం జరుగుతున్నది అదే. అందుకు వెనిజులా, గ్రీన్ల్యాండ్, యూరప్, కెనడా, ఇండియా వంటి కొన్ని ఉదాహరణలను గమనించినా, ఆయన నాయకత్వాన అమెరికా ‘తిరిగి గొప్పది’ కావటం అట్లుంచి మరింత వేగంగా తన గొప్పతనాన్ని కోల్పోక తప్పదనే అభిప్రాయం కలుగుతుంది. గ్రీన్ల్యాండ్కు సంబంధించి జరుగుతున్నది ప్రపంచాన్ని ఆశ్చర్యపరచటం అట్లుంచి, అమెరికా మిత్ర ప్రపంచంలోనే కల్లోలాన్ని సృష్టిస్తున్నది. చివరకు విషయం ఎటు తేలినా, ఆ మిత్ర ప్రపంచంతో పాటు తక్కిన ప్రపంచం దృష్టిలోనూ ట్రంప్ పట్ల విశ్వసనీయత మాత్రం తీవ్రంగా దెబ్బతింటున్నది. ఒక వ్యూహం విజయవంతం కావాలంటే కేవలం అమెరికాకు గల ఆర్థిక బలం, మార్కెట్ బలం, సైనిక బలం చాలవు. వాటితో పాటు శాస్త్ర, సాంకేతిక బలం ఉండి కూడా గత పాతికేళ్ళుగా సవాళ్ళు పెరగటం లేదా? కనుక కావలసింది దేశాలతో విశ్వసనీయత, సత్సంబంధాలు. కేవలం బలాలను ఉపయోగించి ఇతరులను బెదిరించే కాలం గతించి పోయిందని సాక్షాత్తూ ‘వ్యూహ’ పత్రమే అంగీకరిస్తున్నది. అయినప్పటికీ ట్రంప్ తన తీరును మార్చుకోక పోవటం ఆశ్చర్యకరం.మొత్తంగా వశమైతేనే...గ్రీన్ల్యాండ్ విషయం ముందు చూద్దాం. యూరప్లోని డెన్మార్క్కు చెందిన ఆ ద్వీపపు రక్షణ, అక్కడి వనరులు ఆ ప్రాంతాల కోసమో, యూరప్ కోసమో అవసరమనీ, వాటిని రష్యా, చైనాల బారిన పడకుండా కాపాడాలనీ ట్రంప్ భావిస్తున్నట్లయితే, ఆ ప్రకారం గ్రీన్ల్యాండ్, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్లతో చర్చలు జరిపి తగిన ఉమ్మడి విధానాన్ని రూపొందించవచ్చు. కానీ ఆయన గ్రీన్ల్యాండ్ భూభాగం, అక్కడి వనరులు, దాని రక్షణ ‘అమెరికా ప్రయోజనాల కోసం తప్పక అవసర’మని బాహాటంగా ప్రకటిస్తున్నారు. అందుకు గ్రీన్ల్యాండ్, డెన్మార్క్, యూరప్లలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, ‘అంగీకరిస్తారా, సైన్యాన్ని పంపమంటారా’ అని భయపెట్టజూస్తున్నారు. ఒత్తిడి చేసేందుకు ఈ నెల 17న 10 శాతం సుంకాలు ప్రకటించి, వాటిని జూలై నుంచి 25 శాతానికి పెంచగలనని హెచ్చరించారు.అమెరికాను ‘తిరిగి గొప్పది’ చేయగల దౌత్యనీతి, ఆర్థిక విధానం ఇవేనా అన్నది ప్రశ్న. అది కూడా ‘నాటో’ కూటమిలో తన సహచరులై, రాగల కాలంలో తమతో తప్పక నిలవవలసిన దేశాలంటూ ‘వ్యూహ పత్రం’లో తామే ప్రకటించిన వారిపట్ల చూపవలసిన వైఖరి? వాస్తవానికి గ్రీన్ల్యాండ్లో అమెరికన్ సైనిక స్థావరాల నిర్మాణం, వాటి విస్తరణ కోసం డెన్మార్క్తో 1951లోనే ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందపు పాఠాన్ని చూసిన వారికి, అక్కడ ఏమి చేయాలన్నా డెన్మార్క్తో ‘సంప్రదింపులు’ జరపాలనే నిబంధన తప్ప వారి ‘అంగీకారం’ కావాలనే షరతు కనిపించదు. అనగా అంతటి స్వేచ్ఛ అమెరికాకు ఉందని స్పష్టమవుతుంది. అమెరికన్లు అక్కడ గతంలోనే ఒక ఉపరితల స్థావరం, ఒక భూగర్భ అణుశక్తి స్థావరం నిర్మించారు కూడా! కానీ ఇవేవీ చాలవని, గ్రీన్ల్యాండ్ ‘పూర్తిగా స్వాధీనమైతేనే దాని రక్షణకు తగిన మానసిక స్థితి’ తనకు కలుగుతుందని ట్రంప్ ఆశ్చర్యకరంగా వాదిస్తున్నారు. ఆ ప్రాంతంలోని రష్యా, చైనా యుద్ధ నౌకలున్నాయని, వారు మైనింగ్ జరుపుతూ వనరులను కొల్లగొడుతున్నారనే మాటలు ఎంతమాత్రం నిజం కాదని గ్రీన్ల్యాండ్, డెన్మార్క్లు స్పష్టం చేస్తున్నా లెక్క చేయటం లేదాయన.మిత్రులు సైతం దూరంగ్రీన్ల్యాండ్ విషయం అట్లుంచి కూడా, ముఖ్యంగా చైనా సవాలు గురించి ‘వ్యూహపత్రం’లో సుదీర్ఘంగా చేసిన చర్చలో, యూరప్ తిరిగి శక్తిమంతం కావటం, రష్యా–యూరప్ల మధ్య రాజీ, అమెరికాతో సంబంధాల అభివృద్ధి వంటి తనదైన దార్శ నికతను చూపిన ట్రంప్, ఆచరణలో అందుకు తగిన దౌత్యపరిణతిని ప్రదర్శించటానికి బదులు, అంతకుముందు వలెనే, ఈ ‘పత్రం’ ప్రకటన తర్వాత సైతం ధూర్త దౌత్యాన్నే ప్రయోగిస్తున్నారు. ఉక్రె యిన్ యుద్ధం, సుంకాల విధింపు దరిమిలా యూరోపియన్ యూని యన్కు అమెరికాతో ఇప్పటికే పేచీలున్నాయి. ముఖ్యంగా వాణిజ్య వివాదాల కారణంగా వారు అమెరికా నుంచి చైనా వైపు మళ్లటం మొదలైంది. చైనాను వ్యతిరేకిస్తూ వచ్చిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ... అమెరికా నమ్మదగ్గ భాగస్వామి కాదనీ, చైనా నమ్మదగ్గదనీ బహిరంగంగా ప్రకటిస్తూ, గత వారమే బీజింగ్కు వెళ్లి భారీ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. చైనా ఎలక్ట్రికల్ కార్ల దిగుమతిపై సుంకా లను 100 శాతం ఎత్తివేయటం వాటిలో ఒకటి. రానున్న కొద్ది నెలల్లో మరికొందరు యూరోపియన్ ప్రభుత్వాధినేతల పర్యటనలు కూడా ఖరారయ్యాయి.అమెరికాకు అన్నివిధాలా సన్నిహితమైన యూరప్ పరిస్థితి ఇది కాగా, తక్కిన ప్రపంచ దేశాల ఆలోచనలు ఏమిటో ఊహించవచ్చు. అటు తూర్పున అమెరికాకు ఇంతే సన్నిహితమైన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మ్యూంగ్ కూడా ఈ నెల మొదటి వారంలో చైనా వెళ్లి ఒప్పందాలు చేసుకోవటం గమనించదగ్గది. ఇంతకూ ట్రంప్ ‘వ్యూహ పత్రం’, దాని అమలు తీరు, అమెరికా పట్ల దాని మిత్ర దేశాల విశ్వాసం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. తనకు ‘మాగా’, ‘అమెరికా ఫస్ట్’తో తప్ప అంతర్గతంగా గానీ, అంతర్జాతీయంగా గానీ ఏ నియమ నిబంధనలతో నిమిత్తం లేదని బాహాటంగా ప్రక టించిన ట్రంప్ 33 పేజీల ‘వ్యూహ పత్రాన్ని’ పరిశీలిస్తే అర్థమయ్యేది ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే, మిత్రులా, ప్రత్యర్థులా అనే దానితో నిమిత్తం లేకుండా అందరినీ అమెరికా ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి. అందుకోసం సామ దాన భేద దండోపా యాలు అన్నింటినీ ప్రయోగించగలమనే సూచనలు కూడా ఆ పత్రంలో దండిగానే ఉన్నాయి.వాడుకొని వదిలెయ్!ఇండియా గురించి కూడా ‘వ్యూహ పత్రం’లో రాసిన మాట లన్నింటి సారాంశం ఇదే. ఒకవైపు వాణిజ్యం, మరొకవైపు ఇండో– పసిఫిక్లో సైనిక వ్యూహాల విషయంలో భారతదేశాన్ని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు ట్రంప్ గత ఏడాదిగా చేస్తూ వస్తున్నదేమిటో చూస్తూనే ఉన్నాము. ఇపుడు ఈ ‘పత్రం’ మూలంగా అర్థం చేసుకోవలసిందేమంటే, ‘ఉపయోగించుకో – ఒత్తిడి చెయ్ – ఉపయోగించుకో – వదిలెయ్’ విధానం ఇండియాకు సంబంధించి రాగల కాలంలో కూడా కొనసాగుతుందన్నమాట. వ్యూహ పత్రాల రూపంలో ప్రకటించినా, లేకున్నా సామ్రాజ్యవాద విధానాలు ఎప్పుడూ ఇవే!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
దావోస్: గ్రీన్లాండ్ మాక్కావాలి..
గ్రీన్లాండ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో యూరోపియన్ మిత్రదేశాల నుంచి కొంత వ్యతిరేక స్పందన (pushback) వ్యక్తమవుతుండగా, ఆయన ఈ రోజు దావోస్కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడి ప్రసంగానికి ముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) కాంగ్రెస్ హాల్లోని ‘జోన్ సిలో’ వద్ద వందలాది మంది ప్రతినిధులు క్యూకట్టారు. ట్రంప్ ప్రసంగంపై అంతర్జాతీయంగా భారీ ఆసక్తి నెలకొంది.అధ్యక్ష పదవికి ఏడాది.. ట్రంప్ ప్రశంసలుఅధ్యక్ష పదవిలో ఏడాది పూర్తి అయిన సందర్భంగా దావోస్లో జరిగిన డబ్ల్యూఈఎఫ్ వేదికపై ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తన పాలనలో సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు.“నిన్న నా ప్రమాణ స్వీకారానికి ఏడాది పూర్తైంది. ఈ రోజు అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వృద్ధి ఉధృతంగా ఉంది, ఆదాయాలు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. గతంలో తెరిచి ఉన్న ప్రమాదకరమైన సరిహద్దులు ఇప్పుడు మూసివేయబడ్డాయి. అమెరికా తన చరిత్రలోనే అత్యంత కీలకమైన మలుపు దశలో ఉంది” అని ట్రంప్ అన్నారు.యూరప్ సరైన దిశలో లేదుడబ్ల్యూఈఎఫ్ వేదికపై మాట్లాడిన ట్రంప్, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు “గుర్తించలేనంతగా మారిపోయాయి” అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో “వాదనకు తావు లేదని” పేర్కొన్నారు.“నేను ఐరోపాను ప్రేమిస్తున్నాను. ఐరోపా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుతం అది సరైన దిశలో ముందుకు సాగడం లేదు” అని ట్రంప్ స్పష్టం చేశారు.అలాగే, ప్రపంచంలోని సుమారు 40 శాతం దేశాలతో అమెరికా చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు. వివిధ దేశాలపై విధించిన సుంకాల వల్ల అమెరికాలో భారీ వాణిజ్య లోటులు తగ్గాయని ఆయన పేర్కొన్నారు.గ్రీన్లాండ్ కావాల్సిందే..అమెరికా, రష్యా, చైనాల మధ్య కీలకమైన వ్యూహాత్మక ప్రదేశంలో గ్రీన్లాండ్ ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికాకు ఈ ద్వీప భూభాగం దాని ఖనిజాల కోసం కాదని, "వ్యూహాత్మక జాతీయ, అంతర్జాతీయ భద్రత" కోసం అవసరమని అమెరికా అధ్యక్షుడు అన్నారు. డెన్మార్క్కు కృతజ్ఞత లేదని ట్రంప్ ఆక్షేపించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత "గ్రీన్లాండ్ ను తిరిగి ఇవ్వడం" అమెరికా "మూర్ఖత్వం" అని అన్నారు. "మేము డెన్మార్క్ కోసం గ్రీన్లాండ్లో స్థావరాలను ఏర్పాటు చేశాం. డెన్మార్క్ కోసం పోరాడాము. గ్రీన్లాండ్ను రక్షించాం. శత్రువులు అడుగు పెట్టకుండా నిరోధించాము. యుద్ధం తర్వాత మేము గ్రీన్లాండ్ ను తిరిగి డెన్మార్క్ కు ఇచ్చాము. అలా చేయడం మా తెలివి తక్కువతనం' అన్నారు. మరోవైపు గ్రీన్లాండ్ను అమెరికా కొనుగోలు చేయండం వల్ల నాటోకు ఎలాంటి ముప్పు ఉండదన్నారు. నాటోనే అమెరికాను "చాలా అన్యాయంగా" చూస్తోందని ట్రంప్ విమర్శించారు. -
బ్రిటన్-మారిషస్ ఒప్పందంపై ప్లేట్ మార్చిన ట్రంప్
-
ట్రంప్ విమానానికి తప్పిన ప్రమాదం.. అసలేమైందంటే..?
-
అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి బిగ్ అలర్ట్!
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక చేసిన మొదటి పని.. వలసవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడం. ఇందుకోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) తరపున ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అన్లిమిటెడ్ పవర్ కట్టబెట్టారు. అమెరికా భద్రత పేరిట లైంగిక దాడులు, గృహ హింస, మాదక ద్రవ్యాల కేసులు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాలకు పాల్పడినవారిని ఐస్ లోకల్ పోలీసులతో గుర్తించి అరెస్టులు చేసి చర్యలు తీసుకునేది. అయితే ఇప్పుడు ఆ దృష్టి పార్ట్టైం జాబులు చేసే భారతీయ విద్యార్థులు.. ప్రొఫెషనల్ జాబులు చేసేవాళ్లపైకి మళ్లడం ఇండియన్ కమ్యూనిటీలో ఆందోళన రేకెత్తిస్తోంది..తాజాగా.. మిన్నెసోటాలోని సెయింట్ లూయిస్ పార్క్లోని ఒక భారతీయ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థులను ఐస్ (Immigration and Customs Enforcement) అధికారులు అరెస్టు చేశారు. అలాగే.. ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేసే ఉద్యోగిని ఏకంగా కంపెనీలోకి వెళ్లి మరీ బేడీలు వేసి లాళ్లినట్లు ఓ ప్రచారం నడుస్తోంది. ఈ రెండు కేసుల్లో తమ వద్ద అధికారిక ప్రతాలు చూపించినా.. తమకేం తెలియదని వాళ్లు ఎంత మొత్తుకున్నా అక్కడి అధికారులు వినలేదు. అధ్వాన్నమైన పరిస్థితులు ఉండే డిటెన్షన్ సెంటర్లో గంటల తరబడి కూర్చోబెట్టి.. చివరాఖరికి పంపించేశారు.అమెరికాకు ఉన్నత విద్య కోసం భారత్తో పాటు ఇతర దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు వెళ్తుంటారు. ముఖ్యంగా F1 స్టూడెంట్ వీసాపై ఉన్నవారు ఖర్చులు తీర్చుకోవడానికి పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే, అమెరికా వీసా నిబంధనల ప్రకారం క్యాంపస్ వెలుపల నిర్దిష్ట గంటలకు మించి పనిచేయడం చట్టవిరుద్ధం. అలా అక్రమంగా పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తే అరెస్టులు తప్పవని ఐస్ గత కొంతకాలంగా హెచ్చరిస్తూ వస్తోంది. అయితే..ట్రంప్ పదవిలోకి వచ్చాక ఐస్ తన తనిఖీలను మరింత ఉధృతం చేసింది. గత ఏడాది వేలాది మందిని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసింది. అందులో అక్రమంగా చొరబడిన భారతీయులు కూడా ఉన్నారు. అమెరికాలో రాజకీయ నాయకుల వ్యాఖ్యలు.. సోషల్ మీడియా వేదికలలోని చర్చలు భారతీయులపై పెరిగిపోతున్న వ్యతిరేకతకు సంకేతాలను ఇస్తున్నాయి. అందుకే ప్రత్యేకించి భారతీయులే మీద ఐసీఈ ఫోకస్ పెట్టిందన్న చర్చ జోరందుకుంది. ఈ పరిస్థితుల్లో భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం. కాబట్టి.. చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు చేయవద్దని విద్యార్థులను నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త.. తెలుగోడా!పైన చెప్పిన రెండు అరెస్టులలో.. బాధితులు తెలుగువాళ్లే కావడం గమనార్హం!. వాళ్లను ఎందుకు నిర్బంధించారో కూడా అధికారులు వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. అంటే.. ఏ రకంగా వాళ్ల దృష్టిలో పడ్డ తాట తీస్తారనే సంకేతాలు పంపించినట్లయ్యిందన్నమాట. ఈ పరిస్థితుల్లో న్యూమన్ గ్రూప్ లాయర్లు ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది..మా నాయకుడు గొప్పని.. మా కులం గొప్పని కొందరు దేశంకాని దేశంలో ఉంటూ వ్యాఖ్యలు చేస్తుండడం, సోషల్ మీడియాలో పోస్టులు తరచూ చూస్తుండేదే. అలా అమెరికాలో ఉండి ఇక్కడి సినిమాలు, రాజకీయాల కోసం అడ్డగోలుగా మాట్లాడడం, సో.మీ.లో పోస్టులు చేయడం ఏమాత్రం మంచిది కాదని న్యూమన్ గ్రూప్ లాయర్లు సూచిస్తున్నారు. అలాగే కులం పేరిట అతి ప్రదర్శనలు కూడా చేయొద్దంటున్నారు. ఇవి చట్ట విరుద్ధమైన చర్యలు కావు కదా అని ఫీల్ అయిన కూడా.. అక్కడి అధికారుల దృష్టిలో పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఈ హెచ్చరికను బేఖాతరు చేస్తే అరెస్టు, డిపోర్టేషన్ ప్రమాదం తప్పదని కుండబద్ధలు కొడుతున్నారు.మనిషి చచ్చాక యమ భటులు వచ్చి లాక్కెళ్తారు కదా.. ఒకవేళ భారతీయులు గనుక అదుపులో ఉండకపోతే ఐస్(ICE) అధికారులు అంతకు మించి ట్రీట్మెంట్తో లాక్కెళ్లే ప్రమాదం ఉందనేది సోషల్ మీడియాలో ఓ యూజర్ చేసిన పోస్ట్ సారాంశం.. అమెరికాలో అటు రాజకీయ నాయకుల్లో, ఇటు సోషల్ మీడియాలో భారతీయుల మీద పెరుగుతున్న వ్యతిరేకత..ఇలాంటి సమయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అంటున్న అమెరికా లాయర్ న్యూమన్ గ్రూప్..అమెరికాలో సినిమాల కోసం, రాజకీయాల కోసం అతి చేయొద్దు అని ముఖ్యమైన సలహా ఇస్తున్న లాయర్లు..సినిమా ఇంకా… pic.twitter.com/uIZKc9TGKD— UttarandhraNow (@UttarandhraNow) January 21, 2026 -
ట్రంప్ విమానంలో విద్యుత్కు అంతరాయం.. యూటర్న్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం అలాగే వెనక్కి మళ్లింది. చిన్నపాటి విద్యుత్ సమస్య వల్లే ఇలా జరిగిందని.. విమానం సురక్షితంగానే దిగిందని వైట్హౌజ్ వర్గాలు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్ దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఎయిర్ఫోర్స్ విమానంలో ఆయన బయల్దేరారు. అయితే కాసేపటికే విద్యుత్ సమస్య తలెత్తడంతో.. ప్రెస్ కేబిన్లోని లైట్లు ఆరిపోయాయి. దీంతో సిబ్బంది సేఫ్టీ ప్రొటోకాల్ ప్రకారం విమానాన్ని తిరిగి యూఎస్ బేస్కు మళ్లించారు. #AirForce one is returning back to Washington DC because the crew detected a minor electrical issue. @POTUS Trump and staff are safe. pic.twitter.com/4EBPfEMw8w— @BeeNewsDailyB (@BeenewsdailyB) January 21, 2026వాషింగ్టన్ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ట్రంప్ మరో విమానంలో(బ్యాకప్ ఎయిర్ఫోర్స్ వన్) దావోస్కు వెళ్లినట్లు ప్రెస్ సెక్రటరీ కరోలీనా లెవిటీ స్పష్టం చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం సాధారణమని తెలిపారామె. ట్రంప్ రెండో దఫా అధ్యక్ష పదవి చేపట్టాక.. భారీ ఖర్చుతో బోయింగ్ 747-200 మోడల్ విమానాలు రెండింటికీ మార్పులు(ఒకటి బ్యాకప్) చేయించారు. ట్రంప్ ప్రయాణించే విమానాలు ఎయిర్ఫోర్స్ వన్(Air Force One) నిర్వహణ ఖర్చు చాలా ఎక్కువ. ఒక్క గంట ప్రయాణానికి సుమారు 2,00,000–2,50,000 డాలర్లు (రూ.16–20 కోట్లు) వరకు ఖర్చు అవుతుంది(ఇంధనం, సిబ్బంది, భద్రతా, నిర్వహణ.. అన్నీ కలిపి). ఈ భారం పన్నుల రూపంలో మోసేది అమెరికన్లే. అయితే.. అధికారిక పర్యటనలే కాదు తన వ్యక్తిగత పర్యటనలకూ ఆయన ఈ విమానాన్ని వినియోగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. -
భూమిపై ఇరాన్ అన్నదే లేకుండా చేస్తా: ట్రంప్
‘‘నన్ను చంపేస్తే.. ఇరాన్ను భూస్థాపితం చేస్తాం’’ అంటూ ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హచ్చరించారు. 'న్యూస్ నేషన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుణ్ని ఏ దేశమైనా చంపితే, అమెరికా సైన్యం సైలెంటుగా ఎందుకు ఉంటుంది? కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందన్న ట్రంప్.. తనను ఇరాన్ చంపితే, ఆ తర్వాత భూమిపై ఇరాన్ అన్నదే లేకుండా చేస్తా.. మా వాళ్లకు ముందే ఆదేశాలిచ్చానంటూ వ్యాఖ్యానించారు.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ 37 ఏండ్ల దుష్ట పాలనను అంతం చేయాలంటూ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్లో అశాంతి ఇలాగే కొనసాగితే దేశం మొత్తం పేలిపోతుందంటూ మరో వార్నింగ్ ఇచ్చారు. కాగా, నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోంది. రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్నాయి. తమపై దాడికి దిగే దుస్సాహసం చేస్తే అగ్ర రాజ్యం, దానితో పాటు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇటీవల పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలిబాఫ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే..@POTUS on threats from Iran: "I've left notification, anything ever happens... the whole country's going to get blown up." pic.twitter.com/oD6WpeWVoY— Rapid Response 47 (@RapidResponse47) January 21, 2026 మరోవైపు, ట్రంప్.. ప్రపంచ దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు టారిఫ్లను ఆయుధంగా వాడుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. తన మాట వినని కారణంగా టారిఫ్లు విధిస్తానంటూ ట్రంప్ కక్ష సాధింపు చర్యలకు దిగారు. గాజా శాంతి మండలిలో చేరాలన్న ట్రంప్ ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మాక్రాన్పై ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఈ నేపథ్యంలో మాక్రాన్ను టార్గెట్ చేసిన ట్రంప్.. తాజాగా ఫ్రాన్స్పై 200 శాతం టారిఫ్లు వేస్తానని బెదిరించారు. -
‘అణుయుద్ధం ఆపా.. కోటి మందిని కాపాడా’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్- పాకిస్తాన్ మధ్య జరగబోయే భారీ యుద్ధాన్ని తానే నివారించానని, లేదంటే పరిస్థితి అణుయుద్ధానికి దారితీసేదని మరోమారు పేర్కొన్నారు. తన రెండో విడత పాలన ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా వైట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయని, ఆ సమయంలో ఎనిమిది విమానాలు కూల్చివేశారని అన్నారు.తాను అధికారంలోకి వచ్చిన దరమిలా కేవలం పది నెలల కాలంలో ఎనిమిది యుద్ధాలను ఆపగలిగానని, అందులో భారత్-పాక్ యుద్ధం అత్యంత ప్రమాదకరమైనదని, వారు అణుయుద్ధానికి సిద్ధమయ్యారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. గత ఏడాది మే 10న భారత్- పాక్ కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుండి, ఈ యుద్ధాన్ని ఆపింది తానేనని ట్రంప్ ఇప్పటికి 80 సార్లు పైగా చెప్పడం గమనార్హం. ఈ విషయంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు కృతజ్ఞతలు తెలిపారని ట్రంప్ వెల్లడించారు. #WATCH | US President Donald Trump says, "...I ended eight unendable wars in 10 months...Pakistan and India. They were really going at it. Eight planes were shot down. They were going to go nuclear, in my opinion. The Prime Minister of Pakistan was here and he said, President… pic.twitter.com/kTDa912iLQ— ANI (@ANI) January 20, 2026‘పాకిస్థాన్ ప్రధాని ఇక్కడికి వచ్చినప్పుడు.. అధ్యక్షుడు ట్రంప్ సుమారు కోటి మంది ప్రాణాలను కాపాడారని చెప్పారని ట్రంప్ అన్నారు. తన కారణంగానే కోట్లాది మంది ప్రాణాలు నిలిచాయని, అయితే ఈ విషయంలో తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎనిమిది యుద్ధాలను నిలువరించినప్పటికీ, ప్రపంచం ఆ విషయాన్ని గుర్తించడం లేదని వాపోయారు. నోబెల్ శాంతి బహుమతి తనకు రాకపోవడంపై ట్రంప్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. వెనెజువెలాలో సైనిక చర్య చేపట్టినందుకు అక్కడి మహిళా నేత మరియా మచాడో తన నోబెల్ బహుమతిని తనకు అంకితం చేశారని ట్రంప్ గుర్తు చేశారు.కాల్పుల విరమణపై ట్రంప్ చేస్తున్న వాదనలను భారత్ పూర్తిగా తోసిపుచ్చింది. 2025 ఏప్రిల్లో జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించగా, దానికి ప్రతిస్పందనగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టి, పాక్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) మే 10న స్వయంగా భారత అధికారులను సంప్రదించి, కాల్పుల విరమణ కోరారని భారత అధికారులు స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షికంగా జరిగిందే తప్ప, ఇందులో మూడో పక్షం పాత్ర లేదని మోదీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ట్రంప్ వాదనలను ఖండించింది.ఇది కూడా చదవండి: లక్షల్లో ‘బిహారీ’ బందీలు.. 50 ఏళ్లుగా.. -
ఇదంతా మాదే! మూడు దేశాలను కలుపుకుని అమెరికా కొత్త మ్యాప్
-
చాగోస్లా కావొద్దనే...
లండన్/దావోస్: గ్రీన్లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు తాను చేస్తున్న తీవ్ర ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమర్థించుకున్నారు. ‘‘బ్రిటన్ వంటి దేశమే మారిషస్ నుంచి అప్పుడెప్పుడో కొనుగోలు చేసిన చాగోస్ దీవులపై అధికారాన్ని అకారణంగా తిరిగి ఆ దేశానికి వదిలేసుకుంటోంది. అక్కడి డీగో గార్షియా దీవుల్లో అమెరికాకు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన నావిక, బాంబర్ స్థావరాలున్నాయి. వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారిందిప్పుడు.గ్రీన్లాండ్ విషయంలోనూ అలాంటిది జరగొద్దనే ఆ దీవి అమెరికా చేతిలో ఉండాలని చెబుతున్నాను’’ అని సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్సోషల్లో రాసుకొచ్చారు! ‘నాటోకు చెందిన అత్యంత తెలివైన సభ్య దేశం’ ఇలాంటి తెలివి తక్కువ పనికి దిగుతోందంటూ బ్రిటన్ను ఎద్దేవా కూడా చేశారాయన. ‘‘బ్రిటన్ కనబరిచిన ఈ బలహీనతను చైనా, రష్యా కచ్చితంగా గమనించే ఉంటాయి. గ్రీన్లాండ్పై మరింత దూకుడు పెంచే ఆలోచన కూడా చేస్తుండి ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలను బ్రిటన్ ఖండించింది.చాగోస్ దీవులను మారిషస్కు అప్పగించాలన్న నిర్ణయం పూర్తిగా సబబేనని పేర్కొంది. చాగోస్ దీవుల్ని రెండు శతాబ్దాల క్రితం మారిషస్ నుంచి బ్రిటన్ కారుచౌకగా కొనుగోలు చేసింది. వాటిని మారిషస్కు తిరిగిచ్చేలా, డీగో గార్షియా దీవిని మాత్రం 99 ఏళ్ల లీజుకు బ్రిటనే అట్టిపెట్టుకునేలా గతేడాది ఒప్పందం కుదిరింది. అప్పుడు దాన్ని స్వాగతించిన ట్రంప్ ఇప్పుడు మాత్రం తప్పుబడుతున్నారు!ట్రంప్ విశ్వసనీయత కోల్పోయారు: ఉర్సులాగ్రీన్లాండ్ స్వాధీన యత్నాలకు మద్దతివ్వనందుకు పలు యూరప్ దేశాలపై 10 శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ట్రంప్ చేసిన ప్రకటనను యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్ తూర్పారబట్టారు. ఈ నిర్ణయాన్ని ఘోర తప్పిదంగా అభివర్ణించారు. ‘‘ఈయూపై ఇక టారిఫ్లు విధించబోనని గతేడాది ఇచ్చిన హామీని ట్రంప్ సునాయాసంగా తుంగలో తొక్కారు. ఆయనకు అసలు విశ్వసనీయత అన్నది ఏమైనా ఉందా?’’ అంటూ ఆమె మండిపడ్డారు. ‘‘వ్యాపారంలో మాదిరిగానే రాజకీయాల్లో కూడా ఒప్పందమంటే ఒప్పందమే. ఈయూ సమైక్యంగా నిలుస్తుంది. ట్రంప్ టారిఫ్లపై దీటుగా స్పందిస్తుంది’’ అని ప్రకటించారు. కాస్త వెన్నెముక చూపండి!టారిఫ్ల వ్యవహారంలో యూరప్ దేశాలు పిరికిగా వ్యవహరిస్తున్నాయంటూ కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఎద్దేవా చేశారు. ఆ దేశాలకు అసలు వెన్నెముక అనేదే లేదా అంటూ తూర్పారబట్టారు. ట్రంప్ టారిఫ్లను కలసికట్టుగా, దీటుగా ఎదుర్కోవాలని వాటికి సూచించారు. అలాగే గ్రీన్లాండ్కు కూడా యూరప్ దేశాలన్నీ సమైక్యంగా మద్దతిచ్చి ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్నారు.అమెరికాపై ట్రేడ్ బజూకా?ట్రంప్ టారిఫ్లకు అదే విరుగుడుఈయూ దేశాలకు మాక్రాన్ పిలుపుదావోస్: గ్రీన్లాండ్ స్వాధీ నానికి అంగీకరించడం లే దంటూ పలు యూరప్ దేశా లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 10 శాతం టారిఫ్పై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యు యేల్ మాక్రాన్ మరోసారి ధ్వజమెత్తారు. అంతూ పొంతూ లేకుండా సాగుతున్న ట్రంప్ టారిఫ్ల బెదిరింపులను దీటుగా ఎదుర్కోవాలని యూరోపియన్ యూనియన్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. అందుకోసం అవసరమైతే ‘ట్రేడ్ బజూకా’గా పిలిచే యాంటీ కొయెర్షన్ ఇన్స్ట్రుమెంట్ (ఏసీఐ) ఆయుధాన్ని వాడేందుకు కూడా ఈయూ కూటమి వెనకాడొద్దన్నారు. మంగళవారం దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరంలో మాట్లాడుతూ మాక్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈయూ కూటమి చేతిలో ఉన్న అతి పదునైన ఆయుధం ఏసీఐ.ప్రస్తుత కఠిన పరిస్థితుల దృష్ట్యా దాన్ని అమెరికాపై వాడేందుకు ఈయూ దేశాలు ఏమాత్రం వెనకాడొద్దు’’ అని అభిప్రా యపడ్డారు. ఈయూ దేశాలపై ఆర్థిక, ఇతరత్రా ఒత్తిళ్లు, బెదిరింపులను తిప్పికొట్టేందుకు ఆ సమాఖ్య రూపొందించుకున్న వాణిజ్య అస్త్రం ట్రేడ్ బజూకా. దీనిద్వారా కూటమేతర దేశాలపై ప్రతీకార సుంకాల విధింపుతో పాటు పలు ఇతరత్రా ఆంక్షలు విధించే అధికారం ఈయూకు దఖలు పడింది. అలాగే ఈయూకు చెందిన ఎలాంటి బిడ్డింగుల్లోనూ సదరు దేశాలు పాల్గొనేందుకు వీలుండదు. కూటమేతర దేశాలను, ముఖ్యంగా చైనా, రష్యాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ట్రేడ్ బజూకాను మిత్రదేశమైన అమెరికాపైనే ఈయూ ప్రయోగించే పరిస్థితులు కన్పిస్తుండటం విశేషం! -
కెనడాపైనా ట్రంప్ కన్ను!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు నానాటికీ శ్రుతి మించి రాగాన పడుతోంది. అర్ధరాత్రి అధ్యక్ష దంపతులను కిడ్నాప్ చేసి చెరబట్టిన వెనెజువెలాతో పాటు గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలని కలలుగంటున్న ట్రంప్ దృష్టి పొరుగుదేశం కెనడా పైనా పడింది. ఆ మూడు దేశాలనూ అమెరికా మ్యాప్లో చేర్చేసి మురిసిపోయారాయన! కెనడా, వెనెజువెలా, గ్రీన్లాండ్తో కలిపిన అమెరికా మ్యాప్ను సొంత సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్రూత్ సోషల్లో ట్రంప్ మంగళవారం పోస్టు చేశారు. తద్వారా అవి ఎప్పటికైనా అమెరికా భూభాగాలేనన్న సంకేతాలిచ్చారు! ఈ మేరకు ట్రంప్ పోస్టు చేసిన ఏఐ ఫొటో వైరల్గా మారింది. అందులో వైట్హౌస్లోని ఓవల్ ఆఫీసులో పలువురు దేశాధినేతలతో ఆయన ఏదో సీరియస్గా చర్చిస్తూ కన్పిస్తున్నారు.నేపథ్యంలో మూడు దేశాలను అమెరికా భూభాగంతో కలిపి చూపుతున్న ఆ దేశ సరికొత్త మ్యాప్ ప్రముఖంగా కన్పిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్, నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టె తదితరులు ఫొటోలో ఉన్నారు. తద్వారా... కెనడా, వెనెజువెలా, గ్రీన్లాండ్ స్వాధీనానికి ఆయా దేశాల ఆమోదముందని చెప్పడం ట్రంప్ ఉద్దేశమని విశ్లేషిస్తున్నారు.ట్రంప్ అక్కడితో ఆగలేదు! గ్రీన్లాండ్ గడ్డపై తాను సగర్వంగా అమెరికా జెండా పాతుతున్నట్టుగా మరో ఏఐ ఆధారిత ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఆయనతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫొటోలో కన్పిస్తున్నారు. ‘‘గ్రీన్లాండ్, అమెరికా భూభాగం, స్థాపితం: 2026’ అని రాసిన బోర్డు కూడా ఫొటోలో దర్శనమిస్తోంది. కెనడా స్వచ్ఛందంగా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని గతంలో ట్రంప్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇక డెన్మార్క్ అధీనంలోని స్వయంపాలిత ప్రాంతమైన గ్రీన్లాండ్ స్వాధీ నానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ఆ క్రమంలో చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కొంతకాలంగా అంతర్జాతీయ రగడకు దారితీస్తు న్నాయి. డెన్మార్క్ తో పాటు గ్రీన్లాండ్ కూడా ట్రంప్ యత్నాలను ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. అమెరికాలో కలిసేది లేదని గ్రీన్లాండ్ స్పష్టం చేసింది.గ్రీన్లాండ్కు యూఎస్ విమానం!డెన్మార్క్తో నానాటికీ తీవ్రతరమవుతున్న ఉద్రిక్తతల నడుమ, గ్రీన్లాండ్లోని అమెరికా సైనిక స్థావరంలో యుద్ధ విమానాన్ని మోహరించాలని ట్రంప్ తాజాగా మరో వివాదాస్పద నిర్ణ యం తీసుకున్నారు. అక్కడి పిటుఫిక్ స్థావరంలో దీర్ఘకాలిక అవసరాల నిమిత్తం ఈ చర్య చేపడుతున్నట్టు వైట్హౌస్ చెప్పుకొచ్చింది. -
'ట్రంప్ ఓ ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై బ్రిటన్ ప్రతిపక్ష నేత, లిబరల్ డెమొక్రాట్ పార్టీ అధ్యక్షుడు ఎడ్వర్డ్ జోనాథన్ డేవీ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. బ్రిటీష్ పార్లమెంట్లో ప్రసంగించిన సర్ ఎడ్ డేవీ.. ట్రంప్ను అత్యంత ఘాటైన పదజాలంతో విమర్శించాడు. ఆయన ట్రంప్ను ఓ ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్గా అభివర్ణించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిపరుడైన అధ్యక్షుడు అని సర్ డేవీ మండిపడ్డారు.ఈ విమర్శలకు కారణమేంటంటే..?డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. గ్రీన్లాండ్ను అమెరికాకు విక్రయించాలని లేదా తమ దేశంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ట్రంప్ ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది.డెన్మార్క్ నిర్ణయానికి బ్రిటన్తో పాటు పలు ఐరోపా దేశాలు మద్దతు ఇచ్చాయి. దీంతో ఆగ్రహించిన ట్రంప్.. గ్రీన్లాండ్ విషయంలో తమకు సపోర్ట్ చేయని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా ఎనిమిది యూరప్ దేశాలపై ఫిబ్రవరి నుంచి 10 నుంచి 25 శాతం వరకు దిగుమతి సుంకాలు విధిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే మంగళవారం బ్రిటన్ పార్లమెంట్లో చర్చ జరిగింది.ఈ సందర్భంగా సర్ డేవీ మాట్లాడుతూ.. ట్రంప్ అంతర్జాతీయ గ్యాంగ్స్టర్లా ప్రవర్తిస్తున్నారు. మిత్రదేశాల సార్వభౌమాధికారాన్ని కాలరాస్తూ, ఆర్థిక ఒత్తిడితో అందరినీ భయపెట్టాలని చూస్తున్నారు" అని విమర్శలు గుప్పించారు. కేవలం పుతిన్, షీ జిన్పింగ్ వంటి వారే ట్రంప్కు మద్దతు ఇస్తున్నారని, ఇది నాటో కూటమిని బలహీనపరుస్తుందని ఆయన పేర్కొన్నాడు.ఫ్రాన్స్తో కూడా విభేదాలుట్రంప్ కేవలం బ్రిటన్ మాత్రమే కాకుండా ఫ్రాన్స్ను కూడా హెచ్చరించాడు. ట్రంప్ ప్రతిపాదించిన 'బోర్డ్ ఆఫ్ పీస్' లో చేరనందుకు, ఫ్రెంచ్ వైన్, షేంపేన్లపై 200 శాతం సుంకం విధిస్తామని బెదిరించాడు. దీనిని ఫ్రాన్స్ తీవ్రంగా ఖండించింది. -
ట్రంప్ సంచలనం.. అమెరికా కొత్త మ్యాప్ రిలీజ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెర తీశారు. వెనెజువెలా, కెనడా, గ్రీన్లాండ్ ద్వీపంతో కూడిన అమెరికా మ్యాప్ను ట్రంప్ తాజాగా విడుదల చేశారు. దీంతో, ట్రంప్ తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగకుండా ట్రంప్.. మ్యాప్ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది.అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేసిన రెండు ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక పోస్టులో గ్రీన్లాండ్ సరిహద్దులో అమెరికా జెండాను పాతుతున్నట్లు చూపించే చిత్రాన్ని షేర్ చేశారు. ఆ చిత్రంలో ఆయనతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మైలురాయి బోర్డుపై ‘గ్రీన్లాండ్ అమెరికా భూభాగం-2026లో ఏర్పాటైంది’ అని రాసి ఉన్న సూచిక బోర్డు కనిపిస్తుంది. మరో పోస్టులో ఏకంగా అమెరికా మ్యాప్ను మార్చేశారు. ఓవల్ ఆఫీస్లో ట్రంప్తో పాటుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సహా ఇతర నాటో నేతలు కనిపించారు. అయితే, ఆ ఫొటోలో ఓ బోర్డుపై అమెరికా మ్యాప్ ఉంది. ఆ మ్యాప్లో కెనడా, గ్రీన్లాండ్, వెనిజువేలా దేశాలు అమెరికా భాగాలుగా చూపించారు. దీంతో, అమెరికా మ్యాప్ ఇప్పుడు సంచలనంగా మారింది.గ్రీన్లాండ్లోకి యుద్ధ విమానం..మరోవైపు.. ట్రంప్ తొలి పోస్ట్ పెట్టిన కాసేపటి తర్వాత నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (ఎన్ఓఆర్ఏడీ) ఎక్స్ వేదికగా కీలకమైన ట్వీట్ చేసింది. ఒక యుద్ధ విమానాన్ని గ్రీన్లాండ్లోని పిటుఫిక్ వైమానిక స్థావరానికి పంపుతున్నామని ఎన్ఓఆర్ఏడీ కమాండ్ ప్రకటించింది. గ్రీన్లాండ్ భద్రత కోసం రూపొందించిన పలు దీర్ఘకాలిక ప్రణాళికల అమలు కోసమే ఆ విమానాన్ని పంపుతున్నామని వెల్లడించింది. డెన్మార్క్, గ్రీన్లాండ్ల సమన్వయంతోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపింది.అమెరికాలో కెనడా 51వ రాష్ట్రం..2025 సంవత్సరం మే నెల చివరి వారంలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే. కెనడా అనేది అమెరికాలో 51వ రాష్ట్రం అవుతుందన్నారు. నాటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కెనడా గవర్నర్ అవుతారని కామెంట్ చేశారు. కానీ కెనడా కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఈ వ్యాఖ్యలను ఖండించారు. కెనడా ఎన్నటికీ అమెరికాలో కలవదని తేల్చి చెప్పారు. అయినా ట్రంప్ తన వాదనను కొనసాగించారు. -
H-1B వీసా ఫీజు : లక్షలాది అమెరికన్ల ఆరోగ్యం సంక్షోభంలో!
అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజుల విషయంలో తీసుకున్న నిర్ణయం గ్రామీణ అమెరికాను తీవ్రంగా ప్రభావితం చేయనుందా? అక్కడి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత సంక్షోభంలోకి కూరుకుపోనుందా. లక్షలాదిమంది అమెరికన్ల ఆరోగ్యం ప్రమాదంలో ఉందా? తాజా అంచనాలు ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి. హెచ్1 బీ వీసాల ఫీజు భారీ పెంపు అమెరికాలోని అత్యంత అవసరమైన ప్రాంతాలకు విదేశీ శిక్షణ పొందిన వైద్య నిపుణుల రాకకుఅంతరాయం ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విధానం వల్ల సామాన్య అమెరికన్లకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం లక్షలాది మందికి వైద్యం అందకుండా పోయే ప్రమాదం ఉందని వైద్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి.గ్రామీణ అమెరికా వైద్య సంక్షోభం సమస్యను అధిగమించడానికి గ్రామీణ ఆసుపత్రులు గతంలో H-1B వీసా ద్వారా విదేశీ నిపుణులను నియమించుకునేవి. తక్కువ ఖర్చుతో నైపుణ్యం కలిగిన సిబ్బందిని పొందేందుకు ఇదొక గొప్ప మార్గంగా ఉండేది. అయితే, ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఈ ఆసుపత్రులపై కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న చిన్న ఆసుపత్రులు అంత భారీ మొత్తాన్ని చెల్లించి విదేశీ వైద్యులను నియమించుకోవడం అసాధ్యంగా మారింది.ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్' (One Big Beautiful Bill Act) వల్ల మెడికెయిడ్ నిధులు తగ్గిపోవడం, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల నుండి తక్కువ రీయింబర్స్మెంట్ రావడం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తోంది. ఒకవైపు నిధుల కొరత, మరోవైపు పెరిగిన వీసా ఖర్చుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా సామాన్యులకు ప్రాథమిక చికిత్స అందడం గగనంగా మారుతోంది.మెడికెయిడ్ (Medicaid) నిధులలో కోతలు విధించడం వల్ల 2034 నాటికి సుమారు 1.7 కోట్ల మంది అమెరికన్లు ఆరోగ్య బీమాను కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఖర్చులకు భయపడి ప్రజలు ఆసుపత్రులకు వెళ్లడం తగ్గించేస్తున్నారు, ఫలితంగా తక్కువ రోగులు ఉండటంతో ఆసుపత్రుల ఆదాయం తగ్గి అవి మూతపడుతున్నాయి. అమెరికాలో 2026 నాటికి దాదాపు 32 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ కార్మికుల కొరత ఏర్పడవచ్చని అంచనా, ఇది ఇప్పటికే ఉన్న సంక్షోభాన్ని మరింత పెంచుతోంది. పెరుగుతున్న మెడికల్ డెసర్ట్స్ఈ పరిస్థితుల వల్ల గ్రామీణ ప్రాంతాలు "మెడికల్ డెసర్ట్స్" (వైద్య ఎడారులు) గా మారుతున్నాయి. అమెరికాలోని 80శాతం గ్రామీణ కౌంటీలు ఈ జాబితాలోకి వస్తున్నాయి. అత్యవసర చికిత్స లేదా తీవ్రమైన గాయాల కోసం ప్రజలు గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రజల్లో ఊబకాయం మరియు అకాల మరణాల రేటు 20% ఎక్కువగా ఉంది. ఆసుపత్రుల మూత వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ జరగక, చికిత్స అందక అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను తీర్చడానికి విదేశీ నిపుణులు, ముఖ్యంగా H-1B వీసాదారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికాలోని ప్రతి నలుగురు వైద్యులలో ఒకరు విదేశీయులే. అయితే తాజా వీసా రుసుమును భారీగా పెంచడం వల్ల ఈ ఆసుపత్రులు కొత్తవారిని నియమించుకోలేక పోతున్నాయి.జామా ఆందోళనది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA)లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 11,080 మంది వైద్యులకు H-1B వీసాలను స్పాన్సర్ చేశారు, ఇది అమెరికాలోని మొత్తం వైద్య సిబ్బందిలో 0.97 శాతానికి సమానం. గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆధారపడటం దాదాపు రెట్టింపు ఎక్కువగా ఉంది, అక్కడ 1.6 శాతం మంది వైద్యులు H-1B వీసాలపై ఉండగా, పట్టణ ప్రాంతాలలో ఈ సంఖ్య 0.95 శాతంగా ఉంది. మొత్తంగా, వైద్య మరియు ఆరోగ్య వృత్తులలో H-1B ఆమోదాల సంఖ్య 16,937గా ఉంది, ఇది మొత్తం ఆమోదాలలో 4.2 శాతం. ఇందులో వైద్యులు ,సర్జన్లు సుమారు సగం మంది (8,557) ఉన్నారు.దీని వల్ల సామాజిక-ఆర్థికంగా అత్యంత బలహీనమైన సమాజాలు తీవ్రంగా దెబ్బతింటామని మాస్ జనరల్ బ్రిగమ్లో నివాసి వైద్యుడు , JAMA అధ్యయనం సహ రచయిత డాక్టర్ మైఖేల్ లియు పేర్కొన్నారు. హై క్వాలిటీ హెల్త్ కేర్ కోసం "మిలియన్ల మంది అమెరికన్లు విదేశీ ఆరోగ్య సంరక్షణ కార్మికులపై ఆధారపడతారు" అని ఆయన హెచ్చరించారు.గ్రామీణ అమెరికా ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తగినంత మంది వైద్యులు, నర్సులు లేకపోవడం , ప్రభుత్వ నిధుల కొరత కారణంగా వందలాది ఆసుపత్రులు మూతపడుతున్నాయి లేదా సేవలను నిలిపివేస్తున్నాయి. ముఖ్యంగా 2005 నుండి సుమారు 195 గ్రామీణ ఆసుపత్రులు మూతపడగా, ప్రస్తుతం మరో 700 ఆసుపత్రులు ఆర్థిక ఇబ్బందుల వల్ల మూతపడే దిశలో ఉన్నాయి. దీనివల్ల కొన్ని లక్షల మంది ప్రజలు అత్యవసర వైద్య సేవలకు మరియు ప్రసూతి వంటి కీలక చికిత్సలకు దూరమవుతున్నారు. -
ఏ క్షణమైనా యుద్ధం.. రంగంలోకి ఫ్రాన్స్, జర్మనీ బలగాలు
-
స్టాక్ మార్కెట్ క్రాష్.. ప్రధాన కారణాలు ఇవే!
దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో రోజు భారీ నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,092.44 పాయింట్ల నష్టంతో 82,153.74 వద్ద, నిఫ్టీ 360.05 పాయింట్ల నష్టంతో 25,225.45 వద్ద నిలిచాయి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగియడంతో.. ఒక్క రోజులోనే మదుపర్ల సంపద రూ.9 లక్షల కోట్ల వరకు ఆవిరైంది.ప్రస్తుత పరిస్థితులు.. పెట్టుబడిదారులలో భయాన్ని రేకెత్తించాయి. సోమవారం మొదలైన అమ్మకాల ఒత్తిడి.. ఈ రోజు (జనవరి 20) కూడా కొనసాగడంతో.. దలాల్ స్ట్రీట్ నేలచూపులు చూస్తోంది. స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటనే విషయానికి వస్తే..స్టాక్ మార్కెట్ పతనం: ప్రధాన కారణాలువాణిజ్య యుద్ధ భయాలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలన్న దూకుడు వైఖరితో పాటు, యూరప్ దేశాలపై టారిఫ్లను విధిస్తామనే హెచ్చరికలు చేయడం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ప్రతీకార టారిఫ్లపై ఆలోచిస్తోందన్న వార్తలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలను పెంచాయి. ఈ అనిశ్చిత పరిస్థితి భారత మార్కెట్పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.క్యూ3 (Q3) ఫలితాలు: మూడో త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. లాభాల్లో పెద్దగా పాజిటివ్ సర్ప్రైజ్లు లేకపోవడం వల్ల ఇప్పటికే బలహీనంగా ఉన్న మార్కెట్ సెంటిమెంట్ మరింత తగ్గింది. అయితే ఆటో రంగ ఫలితాలు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.విదేశీ అమ్మకాలు: జనవరిలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు సుమారు రూ. 29,000 కోట్ల విలువైన ఇండియా షేర్లను విక్రయించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనత, లాభాలు - విలువల మధ్య అసమతుల్యత వంటి అంశాలు ఈ విక్రయాలకు కారణమయ్యాయి. ఇది కూడా మార్కెట్ పతనానికి ప్రధాన కారణమైంది.పెట్టుబడులు: పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా.. బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా మార్కెట్ పతనానికి ఒక కారణం.బడ్జెట్ 2026: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై మార్కెట్ భారీ అంచనాలతో ఎదురుచూస్తోంది. ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, వినియోగ డిమాండ్ పెంచే చర్యలు ఉంటాయని ఆశిస్తున్నారు. అయితే ఆర్థిక లోటు నియంత్రణపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టి, మూలధన వ్యయాన్ని తగ్గిస్తుందేమో అన్న భయం పెట్టుబడిదారుల్లో జాగ్రత్తను పెంచుతోంది. ఈ ఆందోళన కూడా మార్కెట్ పతనానికి కారణమైంది.ఇదీ చదవండి: వడ్డీ వస్తుందా.. అందుకేనా స్విస్ బ్యాంక్లో డబ్బు! -
మాట వినని మాక్రాన్.. ట్రంప్ మరో హెచ్చరిక
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాను అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలనే ఆలోచనతో ట్రంప్ ముందుకు సాగుతున్నారు. ప్రపంచ దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు టారిఫ్లను ఆయుధంగా వాడుతున్నారు. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. తన మాట వినని కారణంగా టారిఫ్లు విధిస్తానంటూ ట్రంప్ కక్ష సాధింపు చర్యలకు దిగారు.అయితే, గాజా శాంతి మండలిలో చేరాలన్న ట్రంప్ ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మాక్రాన్పై ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఈ నేపథ్యంలో మాక్రాన్ను టార్గెట్ చేసిన ట్రంప్.. తాజాగా ఫ్రాన్స్పై 200 శాతం టారిఫ్లు వేస్తానని బెదిరించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. మాక్రాన్ తప్పకుండా శాంతి మండలిలో చేరాల్సిందే. లేని పక్షంలో ఫ్రాన్స్ వైన్, షాంపైన్ దిగుమతులపై 200 శాతం టారిఫ్లు విధిస్తాను అని హెచ్చరించారు. అనంతరం, ఫ్రాన్స్పై టారిఫ్లు విధిస్తే.. మాక్రాన్ శాంతి మండలిలో చేరాల్సిన అవసరం ఉండదు అని సెటైర్లు సైతం వేయడం గమనార్హం. మరోవైపు.. గ్రీన్లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.ABSOLUTE CINEMA 😳Trump threatens 200% tariffs on French wine and champagne after Paris signals it may decline his invitation to join his proposed “Board of Peace.”Trump also shared on Truth Social a private message he received from President Macron regarding Greenland. pic.twitter.com/i8MSN28DwW— Sharp Sighter (@SharpSighter) January 20, 2026ఇదిలా ఉండగా.. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఉద్దేశించిన మండలిలో భాగం కావాలని భారత్ సహా కొన్ని దేశాలను డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. ఈ క్రమంలో గాజా పునరాభివృద్ధికి నిధుల సమీకరణ, పాలన పర్యవేక్షణకు మండలిని తొలుత ఉద్దేశించారు. ఇక, గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ రెండోదశలో భాగంగా దీనిని తెరపైకి తెచ్చారు. అయితే, ట్రంప్ ఆహ్వానాన్ని మాక్రాన్ తిరస్కరించారు. ట్రంప్ హెచ్చరికలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులకు లొంగబోమని స్పష్టం చేశారు. దీంతో, ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. -
పాములు పట్టే వాడు చివరికి పాము కాటుకే బలైనట్లు..
నుయుక్: పాములు పట్టే వాడు చివరికి పాము కాటుకే బలైనట్లు.. ట్రంప్నకు అధికారాన్ని తెచ్చిన మాగా (MAGA) నినాదమే గ్రీన్లాండ్ వీధుల్లో వ్యంగ్యంగా మారింది. ఒకప్పుడు అమెరికా గర్వానికి ప్రతీకగా నిలిచిన ఆ నాలుగు పదాలు, ఇప్పుడు నిరసనకారుల చేతిలో ఎరుపు టోపీలపై ఆయుధంగా మారాయి.‘మాగా’ అనేది ట్రంప్ 2016 ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినిపించిన స్లోగన్. 1980లో రోనాల్డ్ రీగన్ ‘Let’s Make America Great Again’ అనే నినాదాన్ని వినిపించగా, ట్రంప్ దాన్ని ‘Make America Great Again’గా మార్చి 2015లో అధికారికంగా ట్రేడ్మార్క్ చేసుకున్నారు. ఎరుపు టోపీపై తెల్ల అక్షరాలతో రాసిన ఈ నినాదం ఆయన మద్దతుదారులలో ఐకానిక్ గుర్తుగా నిలిచింది.2016లో ట్రంప్ సభల్లో మాగా నినాదం భావోద్వేగాన్ని రగిలించింది. ఒక ఆశగా, ఒక ఉద్యమంగా మారింది. మద్దతుదారులు దీన్ని అమెరికా శక్తి, జాతీయ గర్వం, సరిహద్దుల రక్షణకు ప్రతీకగా చూశారు. విమర్శకులు మాత్రం దీన్ని విభజనాత్మకంగా భావించారు. అనూహ్యంగా, డెన్మార్క్.. గ్రీన్లాండ్లో ప్రజలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కొత్త రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘Make America Great Again’ కాస్తా అక్కడి వీధుల్లో ‘Make America Go Away’గా మారింది. ఈ నినాదంతో ఎరుపు రంగు టోపీలు ధరించి ప్రజలు వీధుల్లోకి వచ్చారు.డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్లో మంచులో గడ్డకట్టే స్థితిలో వేలాది మంది ప్రజలు ఈ టోపీలు ధరించి నిరసన ప్రదర్శన చేశారు. గ్రీన్ లాండ్ను సైనికంగా స్వాధీనం చేసుకోవాలన్న వ్యాఖ్యలు, అలాగే యూరప్పై కొత్త టారిఫ్లు విధించాలన్న నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. ఈ నిరసనలో పాల్గొన్నవారు అమెరికా అధ్యక్షుడి విధానాలను వ్యంగ్యంగా ఎగతాళి చేస్తూ, గ్రీన్ లాండ్ స్వతంత్రతను కాపాడాలని గట్టిగా నినదించారు.నిరసనకారులు కేవలం అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలకే కాకుండా, ఆర్కిటిక్ ప్రాంత భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనతో కూడా వీధుల్లోకి వచ్చారు. యూరప్లోని అనేక దేశాలు కూడా డెన్మార్క్, గ్రీన్లాండ్కు మద్దతు తెలుపుతూ..ట్రంప్ చర్యలు పాశ్చాత్య భద్రతకు ప్రమాదకరమని హెచ్చరించాయి. మొత్తం మీద, ట్రంప్ గ్రీన్లాండ్ స్వాధీనం ప్రయత్నాలు యూరప్లో తీవ్ర ప్రతిఘటనకు దారితీశాయి. ‘Make America Go Away’ క్యాప్స్ ఇప్పుడు గ్రీన్లాండ్, డెన్మార్క్ ప్రజల నిరసనకు ప్రతీకగా మారాయి. ఇది కేవలం సెటైరికల్ నినాదం మాత్రమే కాదు.. అమెరికా విధానాలపై యూరప్ ప్రజల అసహనాన్ని స్పష్టంగా చూపించే చిహ్నంగా నిలిచింది. -
ట్రంప్ నోబెల్ బహుమతి చెల్లదంతే!
నాకు నోబెల్ బహుమతి ఇవ్వలేదు. ఇక శాంతి గురించి ఆలోచించను. అమెరికా ప్రయోజనాల కోసం గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకుని తీరతా అంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ట్రంప్ చేసిన ఆరోపణలపై నార్వే ప్రభుత్వం స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలపై నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ స్పందించారు. నోబెల్ శాంతి బహుమతికి, నార్వే ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదన్నారు. "నోబెల్ బహుమతులను ఒక స్వతంత్ర కమిటీ నిర్ణయిస్తుంది తప్ప మా ప్రభుత్వం కాదు. ఈ విషయాన్ని నేను అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తెలియజేస్తూ స్పష్టంగా ఓ లేఖ రాశాను" అని స్టోర్ తెలిపారు.ఇక తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతి గౌరవాన్ని.. వెనెజువెలా విపక్ష నేత మారియా కొరీనా మచాడో ట్రంప్నకు అందజేసిన సంగతి తెలిసిందే. మచాడో నుంచి అవార్డును స్వీకరించిన అనంతరం ట్రంప్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ధన్యావాదాలు కూడా తెలిపారు. అయితే.. దీనిపై నోబెల్ కమిటీ తాజాగా మరోసారి స్పందించింది.‘‘ఒకసారి నోబెల్ ప్రకటించిన తర్వాత.. దానిని రద్దు, బదిలీ చేయడం లేదంటే ఇతరులతో పంచుకోవడం కుదరదని స్పష్టం చేసింది. ఒకవేళ గ్రహీతలు దానిని అమ్మేసుకున్నా.. వేలం వేసుకున్నా.. అది వాళ్ల ఇష్టం. కానీ, ఆ గౌరవం మాత్రం మచాడో పేరు మీదనే ఉంటుంది. కాబట్టి ఆయన బహుమతి చెల్లదు’’ అని కమిటీ తాజాగా మరో ప్రకటనలో తెలిపింది. గ్రీన్ల్యాండ్ విషయంలో తనకు అభ్యంతరాలు చెబుతున్న యూరప్ దేశాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భారీ సుంకాల పెంపును ప్రతిపాదించారు కూడా. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నార్వే ప్రధాని స్టోర్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సంయుక్తంగా ట్రంప్నకు ఒక సందేశం పంపారు. అయితే దానికి బదులుగా ట్రంప్.. ‘‘సుమారు ఎనిమిది యుద్ధాలను ఆపిన నాకు మీ దేశం (నార్వే) నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు. అందుకే ఇకపై కేవలం శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన బాధ్యత నాకు లేదు’’ అంటూ రిప్లై ఇచ్చారు. -
గ్రీన్ల్యాండ్పైకి అమెరికా యుద్ధ విమానాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేయబోతున్నారా?.. గ్రీన్ల్యాండ్ను చేజిక్కించుకోవాలనే ప్రయత్నాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారా?.ఈ క్రమంలోనే సైన్యాన్ని గ్రీన్ల్యాండ్లోకి దింపబోతున్నారా?. ఈ తరుణంలో డెన్మార్మ్ ఆందోళనలో అర్థం ఉందా?.. అసలు దీనంతటికి కారణమైన నోరాడ్ అంటే ఏంటసలు?..గ్రీన్ల్యాండ్లోని పిటుఫిక్ స్పేస్ బేస్కి అమెరికా తన యుద్ధ విమానాలు పంపడం ఆర్కిటిక్ ప్రాంతంలో రాజకీయ, సైనిక ఉద్రిక్తతలకు దారి తీసింది. అగ్రరాజ్యం చర్యపై డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిగా డెన్మార్క్ తన సైన్యాన్ని ఇప్పటికే గ్రీన్ల్యాండ్లో మోహరింపజేసింది. అయితే.. నోరాడ్ (ఉత్తర అమెరికా వైమానిక రక్షణ కమాండ్) మాత్రం ఇది రొటీన్ ఆపరేషన్స్ అంటూ చెబుతోంది.అమెరికా సైనిక విమానాలు త్వరలో గ్రీన్లాండ్లోని పిటుఫిక్ స్పేస్ బేస్ (మునుపటి తులే ఎయిర్ఫోర్స్ బేస్) వద్దకు చేరనున్నాయి. దీనిని దీర్ఘకాలిక రక్షణ కార్యకలాపాల భాగంగా పేర్కొంటూ.. అమెరికా, కెనడా, డెన్మార్క్ మధ్య ఉన్న రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని నోరాడ్ చెబుతోంది. అయితే.. అమెరికా చర్యలను డెన్మార్క్ మాత్రం ఖండిస్తోంది.ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక, వ్యూహాత్మక ఆధిపత్యాన్ని పెంచుకోవడం అమెరికా ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. అయితే.. తమ ఆధీనంలో ఉన్న స్వయం పాలక గ్రీన్ల్యాండ్పై అమెరికా సైనిక చర్యలకు దిగితే అది తమ సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడమేనని డెన్మార్క్ భావిస్తోంది. అదే జరిగితే నాటోలో విబేధాలు తప్పవని డెన్మార్క్ ప్రధాని ఇప్పటికే ట్రంప్కు స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. తాజా పరిణామంతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.ఏమిటీ నోరాడ్NORAD అంటే "North American Aerospace Defense Command". ఇది అమెరికా-కెనడా కలిసి ఏర్పాటు చేసిన ద్వైపాక్షిక రక్షణ సంస్థ. దీని ప్రధాన పని ఉత్తర అమెరికా మీదకు వచ్చే విమానాలు, క్షిపణులు, అంతరిక్ష వాహనాలపై హెచ్చరికలు ఇవ్వడం.. గగనతల నియంత్రణ చేయడం, అలాగే సముద్ర మార్గాలపై పర్యవేక్షణ చేయడం. నోరాడ్ గ్రీన్ల్యాండ్లో ప్రధానంగా.. పిటుఫిక్ స్పేస్ బేస్ నుంచే తన కార్యకలాపాలు నిర్వహించుకుంటోంది. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న అత్యంత కీలకమైన సైనిక స్థావరం కూడా. పిటుఫిక్ బేస్లోని రాడార్ వ్యవస్థలు రష్యా, చైనా వంటి దేశాల నుండి వచ్చే బాలిస్టిక్ మిసైల్ దాడులను ముందుగానే గుర్తించడానికి ఉపయోగపడతాయి.గ్రీన్ల్యాండ్ స్వయం పాలనలో ఉన్నప్పటికీ.. విదేశాంగం, రక్షణ వ్యవహారాలు ఇంకా డెన్మార్క్ ఆధీనంలో ఉన్నాయన్నది తెలిసిందే. కాబట్టి NORAD కార్యకలాపాలకు డెన్మార్క్ అనుమతి కచ్చితంగా అవసరం. నాటో సభ్యదేశమైన డెన్మార్క్.. నోరాడ్లో కార్యకలాపాల్లో భాగస్వామి కూడా. ఈ మేరకు అమెరికాతో 1951లో ప్రత్యేక రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. అందుకే ఒప్పందం ప్రకారం ఇప్పుడు అమెరికా చర్యలను అడ్డుకోవడానికి లేదు. కానీ, గ్రీన్ల్యాండ్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలను మాత్రం అడ్డుకునే అవకాశం ఉంది. అదే జరిగితే.. యుద్ధం తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
వాణిజ్య యుద్ధం ఎవ్వరికీ మంచిది కాదు
లండన్: గ్రీన్లాండ్ను సొంతం చేసుకునే క్ర మంలో యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షు డు ట్రంప్ చేస్తున్న తీవ్ర ఒత్తిడులపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తనదైన శైలిలో స్పందించారు. అమెరికా, యూకే ఎప్పటిలా గానే సన్నిహిత మిత్ర దేశాలుగా కొనసాగు తాయన్న ఆయన..వాణిజ్య యుద్ధం వల్ల ఎవ్వరికీ లాభం కలగదన్నారు. సోమవారం ఆయన అత్యవసర మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రీన్లాండ్ను సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్ని స్తున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. మిత్ర దేశాలపై టారిఫ్లను అస్త్రంగా ప్రయో గించడం పూర్తిగా తప్పన్నారు. అదే సమయంలో, యూకే జాతీయ ప్రయోజనాల పరిరక్షణే తన బాధ్యతన్నారు. ‘అందుకే, భాగస్వామ్యం, వాస్తవాలు, పరస్పర గౌరవం ప్రాతిపదికగా ఈ సమస్యపై పరిష్కారం కనుగొనే క్రమంలో ఆదివారం ట్రంప్తోపాటు యూరప్ దేశాల నేతలు, నాటో సెక్రటరీ జనరల్తో ఫోన్లో మాట్లాడా. ఎందుకంటే, బలమైన కూట ములు తమ ఉమ్మడి ప్రయోజనాలను ఆ విధంగానే కాపాడుకుంటాయి’అని వ్యాఖ్యా నించారు. ట్రంప్తో క్రమం తప్పక మాట్లాడు తూనే ఉంటానన్న స్టార్మర్..విభేదాలున్నా లేనట్టుగా నటించడం కాదు, వాటిని ముఖా ముఖి చర్చించి పరిష్కరించుకోవడమే పరిణతి చెందిన కూటముల లక్షణమని చెప్పారు. -
నాకు నోబెల్ ఇవ్వలేదు కాబట్టి.. శాంతి గురించి ఆలోచించను..!
ఓస్లో: గ్రీన్లాండ్ అంశంపై ఉద్రిక్త తలు కొనసాగుతున్న వేళ నార్వే ప్రధానమంత్రి జొనాస్ గహ్ర్ స్టోర్ ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టారు. నోబెల్ శాంతి బహుమ తిని, గ్రీన్లాండ్తో ముడిపెడుతూ అమెరికా అధ్యక్షుడు తనకో సందేశం పంపారని చెప్పారు. ‘నోబెల్ శాంతి బహుమతి నాకు లభించలేదు. కాబట్టి, శాంతి గురించి మాత్రమే మాట్లాడాల్సిన బాధ్యత ఎంతమాత్రం నాకు లేదు’అని అందులో ట్రంప్ పేర్కొన్నట్లు తెలిపారు. ‘ఎనిమి దికి పైగా యుద్ధాలను ఆపినందుకుగాను నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకూడదని మీ దేశం నిర్ణయించింది. అందుకే ఇకపై కేవలం శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన బాధ్య త నాకు ఉందని అనుకో వడం లేదు. శాంతికి ఎప్పు డూ ప్రాధాన్యత ఉంటుంది, కానీ, ఇప్పుడు అమెరికాకు ఏది మంచిది, ఏది సరైనది అనే దానిపైనే నేనిప్పుడు ఆలోచిస్తా. గ్రీన్లాండ్పై మాకు పూర్తి, సమగ్ర నియంత్రణ ఉంటే తప్ప ఈ ప్రపంచం సురక్షి తంగా ఉండదు’అని ఆయన అందులో పేర్కొ న్నట్లు జొనాస్ వివరించారు. ట్రంప్ నోబెల్ వాదనపై జొనాస్.. ‘నోబెల్ శాంతి బహుమతి ఎంపిక బాధ్యత నార్వేజి యన్ నోబెల్ కమిటీయే తప్ప నార్వే ప్రభు త్వం కాదు. కమిటీ ఒక స్వతంత్ర విభాగం. అందులోని ఐదుగురు సభ్యులను నార్వే పార్లమెంట్ నియమిస్తుంది’అని వివరించారు. -
ట్రంప్ ప్రమాదకర పోకడ
వారానికో, పదిరోజులకో తన విధ్వంసక ప్రకటనలతో ప్రపంచాన్ని హడలెత్తించటం అలవాటు చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ఇప్పుడు దాన్ని నిత్యకృత్యంగా మార్చుకున్నట్టు కనబడుతోంది. డెన్మార్క్లో భాగమైన కీలకదీవి గ్రీన్ల్యాండ్ దురాక్రమణకు సమాయత్తమవుతూ, అందుకు అభ్యంతరం చెప్పిన యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలపై వచ్చే నెల 1 నుంచి పదిశాతం సుంకాలు విధిస్తానని బెదిరించి కయ్యానికి కాలుదువ్వారు. మరోపక్క గాజా పునర్నిర్మాణం కోసమంటూ తన ఆధ్వర్యంలో ‘శాంతిమండలి’ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఆ మండలిలో ‘ఖరీదైన’ సభ్యత్వాన్ని ఇస్తానని భారత్తో సహా 60 ప్రపంచ దేశాలకు వర్తమానం పంపారు. ఎనిమిది దశాబ్దాల క్రితం హిట్లర్ రూపంలో తలెత్తి ప్రపంచాన్ని చాప చుట్టేయాలని చూసిన నియంతను వదుల్చుకోవటానికి ఎంత మారణహోమం చవి చూడాల్సి వచ్చిందో, ఎన్ని కోట్లమంది బలిదానాలు చేయాల్సి వచ్చిందో తెలిసి కూడా ఏడాదిగా బుజ్జగింపు ధోరణితో పొద్దుపుచ్చిన దేశాలకూ, ఐక్యరాజ్యసమితికీ తాజా పరిణామాలు ఒక పెద్ద షాక్. తాను ఆశించినట్టు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు గనుక ఇక శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం ట్రంప్కు లేదట. అమెరికాకు ఏది ప్రయోజనకరమో అదే చేస్తారట!గాజాపై ఏర్పాటు చేయదల్చుకున్న శాంతి బోర్డుకు తలాతోకా లేదు. అది గాజాకే పరిమితమై ఉండదట. భవిష్యత్తులో వేరే దేశాల వివాదాల్లో తలదూరుస్తుందట! బోర్డుకు ట్రంప్ జీవితకాల అధ్యక్షుడు. అందులో ‘రా రమ్మ’ని పిలిచిన దేశానికి మూడేళ్లపాటు సభ్యత్వం ఇస్తారు. శాశ్వత సభ్యత్వానికైతే వందకోట్ల డాలర్లు చెల్లించాలి. గాజాలో అంతంతమాత్రంగా అందుతున్న సాయాన్ని కూడా ఆపటానికీ, అక్కడ ఉంటున్నవారి కడుపుమాడ్చి వెళ్లగొట్టడానికీ, నరమేధం ఆనవాళ్లు చెరిపేయటానికీ తోడ్పడటమే ఈ బోర్డు ఏర్పాటు ఆంతర్యం. నిజానికి ఈ బోర్డు ఆలోచన భద్రతామండలిది. 2027 చివరి వరకూ ఈ బోర్డు గాజా ఘర్షణలపై దృష్టి సారిస్తుందని ద్రతామండలి మొన్న నవంబర్లో ప్రకటించింది. గాజాలో రెండేళ్లపాటు మారణహోమం సాగించిన ఇజ్రాయెల్నూ, దానికి ప్రత్యక్షంగా సహకరించిన అమెరికానూ పల్లెత్తు మాట అనని మండలి... దొంగ చేతికి తాళం చెవులు అప్పగించినట్టు గాజాను ఉద్ధరించటానికి పూనుకోవాలని అగ్ర రాజ్యాలను కోరుతూ తీర్మానించింది. ఇంతకూ ట్రంప్ బోర్డూ, ఐక్యరాజ్యసమితి బోర్డూ వేర్వేరా... ఒకటేనా అనేది ఎవరికీ తెలియదు. దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేకపోవటం వల్ల కావొచ్చు... సమితి కూడా అస్పష్టంగా మాట్లాడుతోంది. ‘సభ్యదేశాలు ఎవరికి నచ్చిన గ్రూప్లో వారు చేరొచ్చ’ని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ చేతులు దులుపుకొన్నారు. అమెరికా అధ్యక్ష పదవే ఇంకో మూడేళ్ల ముచ్చట కాగా,శాంతి బోర్డుకు యావజ్జీవ అధ్యక్షుడెలా కాగలరో అనూహ్యం. ఒక దేశంగా ఇందులో అమెరికా ప్రమేయం కూడా ఉండదా? ఇది ట్రంప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? ఏమైనా కావొచ్చు. అమెరికా సుంకాలతో బెదిరించినా... ఏ సార్వభౌమాధికార దేశమైనా ఇందులో భాగస్వామ్యానికి అంగీకరించగలదా? బలహీనంగా కనబడే దేశాలను కించపరచటం, పాదాక్రాంతం చేసుకునేందుకు ప్రయత్నించడం ట్రంప్ నైజం. అమెరికా స్వప్రయోజనాల కోసం నాటో తీసుకొస్తే, భద్రతకు పూచీపడుతుందని నమ్మి అందులో చేరిన ఈ దేశాలు ఇప్పుడు అమెరికాయే దండ యాత్రకు పూనుకోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. డెన్మార్క్లో స్వయంప్రతిపత్తి గల గ్రీన్ల్యాండ్ పేరుకు ప్రపంచంలోనే పెద్ద దీవి. జనాభా 60,000 మించదు. వివాదం ఎందుకని అప్పగిస్తే అమెరికా హిరణ్యాక్షుడు శాంతిస్తాడన్న నమ్మకం లేదు. అలాంటి హిరణ్యాక్షులు ఇంకా ఇద్దరున్నారు. చైనా తైవాన్నూ, రష్యా ఉక్రెయిన్నూ కబళించే యత్నం చేస్తాయి. ఇలా కండబలంతో ఎవరికి వారు చెలరేగితే ఈ ప్రపంచం మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. కనుక ఇన్నాళ్ల బుజ్జగింపులకూ స్వస్తిచెప్పి యూరప్ దేశాలు ఇకనైనా దృఢంగా నిలబడాలి. 75 ఏళ్ల చరిత్రలో ఎందుకూ కొరగాని ‘నాటో’ ఉన్నా ఊడినా ఒకటేనన్న తెలివి తెచ్చుకుని, ప్రతీకార సుంకాలతో జవాబీయాలి. గాజా శాంతిబోర్డు పైనా ఛీత్కారాలు వెల్లువెత్తాలి. అప్పుడు మాత్రమే ట్రంప్ దారికొస్తారు. -
అమెరికాలో.. స్వేచ్ఛకు తూట్లు..! పెరుగుతున్న పేదరికం..!!
వాషింగ్టన్ డీసీ: ‘అందమైన లోకమని.. రంగురంగులుంటాయని.. అందరూ అంటుంటారు రామరామ.. అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా’ అని సినీకవి అన్న మాటలు అగ్రరాజ్యం అమెరికాకు సరిగ్గా నప్పుతాయి..! స్వేచ్ఛాసమానత్వాల భూమిగా అమెరికా గడ్డకు పేరుంది. కానీ, ఆ పేరు వెనక విరోధ భావాలు కూడా ఉన్నాయి. అణచివేత ధోరణులూ ఉన్నాయి. మరో కోణంలో అమెరికాను చూస్తే.. విస్తుపోయే నిజాలు కనిపిస్తాయి. డొనాల్డ్ ట్రంప్ ఏడాది పాలన నేపథ్యంలో.. ‘అమెరికా మరో పార్శ్వం’పై సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ రిపోర్ట్..గన్కల్చర్కు అమెరికా పెట్టింది పేరు..! ఎప్పుడు ఏ బడిలో తూటా పేలుతుందో తెలియదు..! ఎప్పుడు ఏ పబ్లిక్ ఈవెంట్పై ఉన్మాదుల తుపాకీ గర్జిస్తుందో ఊహించలేం..! మనుషుల కంటే తుపాకులే ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశం అమెరికా. విద్యార్థులు పరీక్షలకు కాకుండా.. గన్ షూటింగ్కు సన్నద్ధమవుతుంటారు. తొమ్మిది.. పదేళ్ల వయసులోనే బ్యాగులో తుపాకీ తెచ్చుకుని, కోపంతో టీచర్లు, తోటి విద్యార్థులపై గురిపెడతారు. 33.5 కోట్ల జనాభాకు 40 కోట్ల గన్స్ ఉండడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది. 2024లో తుపాకీ తూటాలకు 40 వేల మంది బలవ్వగా.. వారిలో 1,200 మంది చిన్నపిల్లలున్నారు. అమెరికాలో తల్లిదండ్రులు ఏకంగా తమ పిల్లలకు బుల్లెట్ ప్రూఫ్ బ్యాగులు, దుస్తులు కొనే పరిస్థితి అక్కడ నెలకొంది. తుపాకీ కారణంగా అమెరికాలో పౌరులు బిక్కుబిక్కుమంటూ గడిపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి పౌరులకు స్వేచ్ఛ ఉన్నట్లా..? లేనట్లా..?స్వేచ్ఛావాయువులు అమెరికాలో బలంగా వీస్తాయంటారు. ఇంకా చెప్పాలంటే.. ఫలానా దేశంలో స్వేచ్ఛేలేదంటూ రిపోర్టులిచ్చే ఎన్నెన్నో ఏజెన్సీలకు అమెరికా ఆలవాలం. ఫలానా దేశంలో ఫలానా మతస్థులను ఊచకోత కోస్తున్నారంటూ గగ్గోలు పెట్టే మీడియా అమెరికాకు సొంతం. అయితే.. ఇదంతా గురివింద చందమే..! అమెరికాలో జాతి వివక్ష ఏమాత్రం తగ్గ లేదు. ఇంకా చెప్పాలంటే.. అమెరికా జైళ్లలో ఉంటున్న ఖైదీల్లో శ్వేత జాతీయుల కంటే.. నల్ల జాతీయుల సంఖ్య ఐదు రెట్లు అధికంగా ఉంటోంది. అమెరికాలో జీఈ, న్యూస్ కార్ప్, డిస్నీ, వియాకామ్, టైమ్ వార్నర్, సీబీఎస్ అనే ఆరు సంస్థల చేతుల్లో 90% మీడియా ఉంది. ఈ సంస్థలేవీ అమెరికాలో జరుగుతున్న జాతి వివక్షను బయటి ప్రపంచానికి చూపించవు. కానీ, భారత్ లాంటి దేశాల్లో స్వేచ్ఛ లేదంటూ గగ్గోలు పెడతాయి. అమెరికా జైళ్లలో రెండు మిలియన్ల ఖైదీలుండగా.. వీరిలో సింహభాగం శ్వేతజాతీయులు కాని వారే. 21 లక్షల మంది జైళ్లలో మగ్గుతున్నారు. వీరితో జైళ్లలో బండ చాకిరీ చేయించుకుని, ముష్టి పారేసినట్లు గంటకు 25 సెంట్ల చొప్పున కూలీ ఇస్తారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కడో స్లమ్లలో పరిస్థితులను భూతద్దంలో చూపించే అమెరికా మీడియా.. ఆయా దేశాల్లో పేదరికం పేట్రేగుతోందని, ప్రజలు కూడు, గూడు, గుడ్డకు నోచుకోవడం లేదని చూపడం సహజమే..! అయితే.. అమెరికాలో అంతా సంపన్నులే ఉన్నారా? పేదలే లేరా? అనే ప్రశ్నకు పాశ్చాత్య మీడియా కూడా నోరు మెదపదు. నిజమేంటంటే.. అమెరికాలో 18శాతం మంది పౌరులు నిరాశ్రయులు. ఆరున్నర లక్షల మంది పౌరులు వంతెనల కింద, రోడ్లపైనే నిద్రిస్తుంటారు. సైనికులు ఏర్పాటు చేసే టెంట్లలో 40 వేల మంది నిద్రిస్తారని అంచనా..! ఇక లాస్ ఏంజిల్స్, సాన్ ఫ్రాన్సిస్కో, సియాటిల్ ప్రాంతాల్లో ఏకంగా ‘టెంట్ సిటీస్’ పేరుతో పేదల బస్తీలు పుట్టుకొస్తున్నాయి. అదే సమయంలో.. బిలియనీర్ల సంపద ఒక్క కొవిడ్ సమయంలోనే 2 ట్రిలియన్ డాలర్ల మేర పెరగడం గమనార్హం..! ఏటా వైద్యంపై 4.5 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నామని అమెరికా గొప్పలు చెప్పుకొంటోంది. అయితే.. అనారోగ్యంతో సరైన వైద్యం అందక అమెరికాలో చనిపోతున్న వారి ఏటా 50 వేల మంది చనిపోతున్నట్లు ఓ నివేదిక ఉంది. అమెరికా అంటేనే వైద్య బీమా తప్పనిసరి అంటారు. అది కేవలం ఇమిగ్రెంట్లకేనని తెలుస్తోంది. ఇప్పటికీ అమెరికాలో 2 కోట్ల 70 లక్షల మంది పౌరులకు బీమా అందడం లేదని, ఐదు లక్షల కుటుంబాలు వైద్య ఖర్చుల కారణంగా దివాళా తీస్తున్నాయని పలు నివేదికలు వచ్చాయి. వైద్యం ప్రాథమిక హక్కు అని చెప్పుకొనే అమెరికాలో ఒక సర్జరీ కాస్ట్ 50 వేల డాలర్లుగా.. అంబులెన్స్ చార్జీలు కనీసం రెండు వేల డాలర్లుగా ఉండడం గమనార్హం..! అంటే.. అమెరికాలో రోగి ప్రాణాన్ని ధనమే నిర్ణయిస్తుందని స్పష్టమవుతోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఇప్పుడు అమెరికాలో ధరాభారం పెరిగింది. అమెరికాలో ఒక సగటు ఉద్యోగి జీతం తీసుకుని ఒక్కరోజు గడవక ముందే.. మళ్లీ జీతం రావడానికి ఎన్నిరోజులు ఉందా? అని లెక్కలేసుకుంటున్నాడు. ఈ కోవలో 60శాతం మంది ఉద్యోగులు ఉన్నట్లు ఓ అధ్యయనం చెబుతోంది. ఇళ్ల ధరలు, అద్దెలు, విద్య, వైద్యం, నిత్యావసరాలు.. ఇలా అన్నీ చుక్కలనంటుతున్నాయి. దిగుమతులపై ట్రంప్ టారిఫ్లతో ధరలు పెరిగి, అమెరికా పౌరులు విలవిల్లాడుతున్నారు. వేతనాలు పెరగవు.. ధరలు తగ్గవు అంటూ నిట్టూరుస్తున్నారు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎన్నికల వ్యవస్థపై అభాండాలు వేసే అమెరికాలో.. ఎన్నికలు కూడా అత్యంత ఖరీదుతో కూడుకున్నవే..! ట్రంప్ విజయం సాధించిన 2024 ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలిచిపోయాయి. ఇందుకు 16 బిలియన్ డాలర్ల మేర ఖర్చయిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఖర్చులో కార్పొరేట్ కంపెనీల విరాళాలు కూడా ఉంటాయి. ఫలితంగా ఆయా సంస్థలు తమకు అనుకూల చట్టాలు తెప్పించుకుంటాయి. నేతల స్టాక్ పోర్ట్ఫోలియోలు కూడా విమర్శలకు తావిస్తున్నాయి. 2023లో 50 మంది నేతలు ఈ తరహాలో వ్యాపారం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇక అమెరికాలో ట్రంప్ వంటి పాలకుల కారణంగా.. పౌరుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ప్రతి ఐదుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక రుగ్మతను ఎదుర్కొంటున్నట్లు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ సైకియాట్రీ చెబుతుంగా.. ఈ కారణాలతో 15 – 34 ఏజ్ గ్రూప్ వారిలోనే ఎక్కువగా ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ఒంటరితనం, ఒత్తిడి, డ్రగ్స్ వంటివి ఈ ఆత్మహత్యలకు కారణాలుగా తెలుస్తోంది. యాంటీ డిప్రెసెంట్ ఔషధాలు అత్యధికంగా అమెరికాలోనే వినియోగమవుతున్నట్లు సమాచారం. ఓహియో, వెస్ట్ వర్జీనియా, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ వ్యసనం తీవ్రంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డ్రగ్స్ ఓవర్ డోస్ మరణాలు కూడా ఇక్కడ ఎక్కువే..! ఇక్కడి యువత డీ-అడిక్షన్ ఔషధాల కోసం వేల డాలర్లు ఖర్చుపెడుతోంది. ఎడ్వర్డ్ స్నోడెన్ డేటా ఈ విషయాలను చెబుతోంది.ఇక టెక్నాలజీ.. డిజిటల్ యుగం అని చెప్పే అమెరికాలో యువత చదువు కోసం విలవిల్లాడుతోంది. విద్య ఓ హక్కు అయినా.. మన విద్యావేత్త చుక్కా రామయ్య లాంటి వారు రాసిన ‘అమెరికా పాఠం’ వంటి పుస్తకాల్లో ఆ దేశంలో విద్యకు ఇచ్చే ప్రాధాన్యతను చక్కగా వివరించినా.. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. విద్యలో ఒకప్పుడు అమెరికా నాయకత్వ ధోరణిలో ఉన్నా.. ఇప్పుడు విద్యపై అప్పులు పెరుగుతున్నాయి. స్టూడెంట్ డెబ్ట్ ఇప్పుడు 1.7 ట్రిలియన్ డాలర్లను దాటినట్లు అంచనా. సగటు కాలేజీ విద్యార్థి 38 వేల డాలర్ల మేర అప్పును భరిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం పాఠశాలల బడ్జెట్ను తగ్గిస్తోంది. ప్రైవేటు యూనివర్సిటీలు భారీ లాభాల్లో ఉంటున్నాయి. అమెరికాలో ఇప్పుడు విద్య అంటే ఆలోచనల సృష్టి కాదు. ఉద్యోగుల తయారీ వ్యాపారం అనే స్థాయికి చేరుకుంది. ఇక కాలుష్యంలోనూ అమెరికా అతిపెద్ద ఉత్పత్తిదారు కావడం తెలిసిందే. ఏటా 5 బిలియన్ టన్నుల మేర కార్బన్-డై-యాక్సైడ్ ఆ దేశంలో ఉత్పత్తి అవుతోంది. క్లైమేట్ యాక్షన్, పారిస్ ఒప్పందాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేసేది కూడా అమెరికానే. ప్రపంచాన్ని పాలించాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతుంటే.. ఆ ప్రపంచాన్ని నాశనం చేసే రేంజ్లో కాలుష్యం వెదజల్లుతోంది అమెరికా..! ఇప్పుడు చెప్పండి.. ఇంతటి దరిద్రాలను కలిగి ఉన్న అమెరికాకు వెళ్లడం.. అక్కడ సెటిల్ అవ్వాలని, గ్రీన్కార్డు పొందాలని ఆశించడం సరైనదేనా?? -
నార్వే ప్రధాని లేఖలో తేల్చిచెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ టంప్కు నోబెల్ బహుమతిపై ఉన్న ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. ఎలాగైనా ప్రపంచశాంతి బహుమతి సాధించాలని ట్రంప్ ఎక్కని గడపా లేదు.. చేయని రచ్చా లేదు. ఎలాగైనా ఈ అవార్డు తనకు ప్రకటించాలంటూ పలుసార్లు బహిరంగ ప్రకటన సైతం చేశారు. కానీ నోబెల్ మాత్రం ట్రంప్కు దక్కలేదు. తాజాగా ట్రంప్ మరోసారి నోబెల్పై తనకు ప్రకటించకపోవడంపై తనకున్న అక్కసును వెల్లగక్కారు. తాజాగా నార్వే ప్రధాని జోనస్ గహర్కు ట్రంప్ లేఖ రాశారు. అందులో ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న విధ్వంసానికి కారణం ఆదేశం తనకు నోబెల్ ప్రకటించకపోవడమేనన్నారు. అందువల్లే తన రూట్ మార్చానని తెలిపారు. శాంతిని వదిలి యుద్ధ బాట పట్టినట్లు పేర్కొన్నారు.ఆలేఖలో ట్రంప్ ... "నేను ఎనిమిది యుద్ధాలు ఆపాను. అయినా మీ దేశం నన్ను శాంతిదూతగా గుర్తించలేదు. అందుకే ఇక నేను శాంతి గురించి ఆలోచించాలనుకోవడం లేదు. ఇప్పుడు నేను కేవలం అమెరికాకు ఏది లాభం చేకురుస్తోంది అదే చేస్తాను" అని ట్రంప్ లేఖలో అన్నారు. గ్రీన్లాండ్కు ఎప్పటికైనా చైనా, రష్యాల నుంచి ముప్పు పొంచి ఉంది ఈ నేపథ్యంలో ఆ భూమిపై వారికి యాజమాన్య హక్కులు ఎలా ఉంటాయి అని ట్రంప్ ప్రశ్నించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడ పడవలు దిగాయి. మా భూభాగంలో కూడా పడవలు దిగాయి. అంతే .. ఆ భూమిపై యాజమాన్య పత్రాలు ఆదేశానికి లేవు అని అన్నారు.అయితే గ్రీన్లాండ్ ద్వీపాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆక్రమించుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ నిర్ణయాన్ని డెన్మార్క్తో సహా ఇతర నాటో దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆ నాటో దేశాలపై 10 శాతం సుంకం విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. నోబెల్ బహుమతి ప్రకటన అనేది పూర్తిగా నోబెల్ కమిటీ ఎంపిక మాత్రమే అక్కడి ప్రభుత్వానికి అందులో ఎటువంటి జోక్యం ఉండదు. -
బాబోయ్ ట్రంపూ.. అప్పుడే ఏడాది పూర్తి
2024 జనవరి 20.. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా వైట్హౌజ్లో అడుగు పెట్టిన రోజు. అమెరికా ఫస్ట్ నినాదంతో నెగ్గిన ఆయన.. దేశాన్ని ఓ గాడిన పెడతాడని, అదే సమయంలో అంతర్జాతీయంగా పెద్దన్న రోల్ను సమర్థనీయంగా పోషిస్తారని ఆనాడు అంచనాలు ఉండేవి. కానీ, ఒక సంవత్సరం గడిచేలోపే సీన్ సితార అయ్యింది. ట్రంప్ సంతకం చేసిన అనేక నిర్ణయాలు అమెరికాలోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా తీవ్ర చర్చలకు దారితీశాయి. వాటిలో చాలామట్టుకు ‘‘తల తిక్క’’ నిర్ణయాలుగా గుర్తింపు దక్కించుకున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.. వలసవాదానికి చుక్కలు .. అధికారంలోకి రాగానే ట్రంప్ చేసిన మొదటి పని.. శరణార్థులపై కఠిన ఆంక్షల విధింపు. ఈ నిర్ణయంలో అక్రమ వలసవాదుల్ని వెతికి మరీ.. వాళ్ల వాళ్ల దేశాలకు డిపోర్ట్ చేశాడు. ఈ క్రమంలో బేడీలు వేసి.. కనీస వసతుల్లేని విమానాల్లో తరలించడం తీరు తీవ్రవిమర్శలు తావిచ్చింది. మానవ హక్కుల సంస్థలు వలసవాదులకు తలుపులు మూసేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. అయినప్పటికీ అమెరికా భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ సమర్థించుకున్నాడు.. ఇదేగాక.. వీసా టఫ్ రూల్స్.. అమెరికన్ల ఉద్యోగాల్ని రక్షించడం అనే పేరుతో.. హెచ్1బీ వీసా నియమాలను కఠినతరం చేశారు. ఫీజులు గణీయంగా పెంచారు. అధిక వేతన ప్రమాణాలు, కఠిన అర్హతలు, తక్కువ అనుమతులతో.. తీవ్ర చర్చనీయాంశంగా మారారాయన. ఈ నిర్ణయంతో.. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ప్రభావితమయ్యారు.ఆ దేశాలపై ట్రావెల్ బ్యాన్.. 2025 డిసెంబర్లో ట్రంప్ చేసిన ఒక ప్రకటన తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 39 దేశాల పౌరులపై అమెరికా ప్రవేశ నిషేధం విధించారాయన. అఫ్గన్ పౌరుడొకడు వాషింగ్టన్లో గన్ ఫైర్ ఎటాక్ జరపడమే ఇందుకు కారణం. ఈ లిస్టులో చాలా వరకు ముస్లిం దేశాలే ఉన్నాయి. ఇది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.టారిఫ్ కింగ్.. 2025లో ట్రంప్ను ప్రత్యేకంగా నిలిపింది ఏదైనా ఉందీ అంటే.. అది సుంకాల యుద్ధమే. తనకు నచ్చని.. తన మాట వినని దేశాలపై టారిఫ్ కొరడా ఝుళిపించారాయన. ఈ క్రమంలో.. చైనా, యూరప్, కెనడా, మెక్సికో వంటి దేశాలపై భారీ దిగుమతి సుంకాలు (tariffs) విధించారు. ట్రంప్ టారిఫ్ వార్లు అమెరికా పరిశ్రమలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రారంభమైనా, అవి గ్లోబల్ ట్రేడ్లో ఉద్రిక్తతలు, భారత్ లాంటి మిత్రదేశాలతో సంబంధాల క్షీణత, వినియోగదారులపై అదనపు భారాలు వంటి అనేక సమస్యలకు దారితీశాయి.ఫెడరల్ టు స్టేట్స్.. 2024 నవంబర్లో ట్రంప్ తన ఎన్నికల హామీలో.. విద్యాశాఖను పూర్తిగా రద్దు చేస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగా.. అధికారంలోకి రాగానే ఆ పని చేశారు. 2025 మార్చి 20న ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసి, కేంద్ర(ఫెడరల్) విద్యాశాఖను మూసివేయడానికి అధికారిక ప్రక్రియను ప్రారంభించారు. ఫెడరల్ ప్రభుత్వంపై అనవసర భారం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన. 40 ఏళ్లలో 3 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసినా ఫలితం లేదు. విద్యా నియంత్రణ రాష్ట్రాలకే ఉండాలి అనేది ఆయన వాదన. దీంతో ఆ దేశంలో కేంద్ర విద్యా శాఖ కనుమరుగు అయ్యే ప్రాసెస్ నడుస్తోంది. అయితే.. ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు భారం కానుంది.అదే సమయంలో.. ఇటు అమెరికా ఆరోగ్య శాఖ (Department of Health and Human Services – HHS)ను కూడా రద్దు చేయాలని నిర్ణయించారు. రెండో టర్మ్లో ఈ మేరకు ప్రతిపాదన కూడా చేశారు. ఆయన వాదన ప్రకారం, ఆరోగ్య విధానాలు రాష్ట్రాలకే అప్పగించాలి.. ఫెడరల్ స్థాయిలో ప్రత్యేక శాఖ అవసరం లేదు. అయితే ఇది ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉంది. ప్రస్తుతానికి దాని అధికారాలు, నిధులు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒబామాకేర్( Affordable Care Act) రద్దు ప్రయత్నాలతో కలిపి, ఆరోగ్య శాఖను పునర్వ్యవస్థీకరించాలనే ప్రణాళిక మాత్రం రేపో మాపో అమలయ్యే ఛాన్స్ ఉంది.వీటితో పాటు ఐక్యరాజ్య సమితిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గప్పించడం.. నిధుల్ని తగ్గించడం.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నిధుల్ని కోత వేసే ప్రయత్నాలు.. భారత్తో వాణిజ్య వివాదాలు.. పాక్తో మైత్రి, వెనెజువెలా అధ్యక్షుడ్ని బంధించి ఎత్తుకెళ్లి.. ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు మద్దతు.. ఆమెకు దక్కిన నోబెల్ మెడల్ను స్వీకరించడం.. “ఇకపై కేవలం శాంతి గురించే ఆలోచించాల్సిన బాధ్యత లేదు” అని వ్యాఖ్యలు చేయడం, ఇరాన్ నిరసనకారుల్ని రెచ్చగొట్టడం.. డెన్మార్క్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ గ్రీన్లాండ్ను చేజిక్కించుకునే ప్రయత్నాలు.. వీటికి తోడు ఫేక్ న్యూస్ అంటూ మీడియా సంస్థలపై దాడులు, దావాలు వేయడం.. ఈ ఏడాది కాలంలో కుటుంబ వ్యాపారాలు విపరీతమైన లాభాలు అర్జించి సంపద పెరగడం ట్రంప్ను తిట్టిపోసేలా చేశాయి. -
‘సమయం ఆసన్నమైంది’.. గ్రీన్లాండ్పై ట్రంప్ కీలక ప్రకటన!
వాషింగ్టన్ డీసీ: గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాలనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై డెన్మార్క్తో సహా ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలు నీళ్లు చల్లాయి. గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తే.. ట్రేడ్ బజూకా పేరుతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించాయి. ఈ క్రమంలో ఆ హెచ్చరికలపై ట్రంప్ పరోక్షంగా స్పందించారు. డెన్మార్క్పై ఆగ్రహ వ్యక్తం చేశారు. ‘రష్యా నుంచి గ్రీన్లాండ్కు ముప్పు ఉంది. దాన్ని నుంచి బయటపడేందుకు డెన్మార్క్ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఇప్పటికే 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా ప్రభావం పెరుగుతోంది. అందుకే గ్రీన్లాండ్ను సొంతం చేసుకుని, దానిపై రష్యా ముప్పును తొలగిస్తామని ప్రకటించారు. అమెరికా తన మిత్రదేశాలను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.గ్రీన్లాండ్ భౌగోళికంగా ఆర్కిటిక్ సముద్ర మార్గాలకు కీలకమైన ప్రాంతం. అమెరికా దీన్ని తన రక్షణ వ్యవస్థలో భాగంగా చూస్తోంది. థూల్ ఎయిర్బేస్ అమెరికా సైనిక వ్యూహంలో ప్రధాన కేంద్రంగా ఉంది. అదే సమయంలో ఆర్కిటిక్లో రష్యా సైనిక స్థావరాలు పెంచడం వల్ల అమెరికా, నాటో మిత్రదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్కు చెందిన స్వయం పాలిత ప్రాంతం. అమెరికా, డెన్మార్క్తో కలిసి రక్షణ చర్యలు చేపడుతోంది. డెన్మార్క్ ప్రభుత్వం కూడా ఆర్కిటిక్లో రష్యా ఉనికిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా–రష్యా మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో పెరుగుతున్న పోటీని మరోసారి వెలుగులోకి తెచ్చాయి. రష్యా కొత్త సైనిక స్థావరాలు ఏర్పాటు చేస్తుండగా, అమెరికా దీనిని ప్రాంతీయ భద్రతకు ముప్పుగా చూస్తోంది. -
ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు
అమెరికా ఓవల్ ఆఫీస్లో రెండోసారి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే కీలక నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్.. గడిచిన 365 రోజుల్లో తన ‘ట్రంపరితనాన్ని’ చూపిస్తూనే ఉన్నారు. అమెరికా ఫస్ట్ అనే మంత్రాన్ని జపిస్తూ శరవేగంగా వెలువడుతున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. చైనాతో టారిఫ్ల యుద్ధం, అక్రమ వలసలపై ఉక్కుపాదం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్తో కలిసి డోజ్(DOGE) ద్వారా ప్రభుత్వ ప్రక్షాళన.. ఇలా ప్రతి అడుగులోనూ ట్రంప్ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది.ఈ ఏడాది పొడవునా సాగిన ఈ సంచలన నిర్ణయాల తుపాను ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ముద్ర వేసింది? జీడీపీ లెక్కలు, ఏఐ బూమ్ వెనుక దాగిన మార్కెట్ వాల్యుయేషన్లు ట్రంప్నకు విజయ కేతనం పడుతున్నాయా లేక 2026లో రాబోయే భారీ ఆర్థిక పరీక్షకు సంకేతాలు ఇస్తున్నాయా? వంటి అంశాలపై విశ్లేషణ..అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టి రేపటితో ఏడాది పూర్తవుతుంది. ఈ సంవత్సరం కాలంలో సుంకాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ(DOGE), కృత్రిమ మేధ (ఏఐ)లో భారీ పెట్టుబడుల వంటి నిర్ణయాలతో వైట్హౌస్ నిరంతరం వార్తల్లో నిలిచింది. రాజకీయంగా పెను మార్పులు చోటుచేసుకున్న ఈ ఏడాది ఆర్థికంగా కూడా మిశ్రమ ఫలితాలను అందించింది.ఆరంభంలో సంకోచం.. ఆపై..ట్రంప్ పాలన 2025 ప్రారంభంలో కొంత ఒడిదుడుకులతో సాగింది. 2025 మొదటి త్రైమాసికంలో అమెరికా జీడీపీ 0.6 శాతం క్షీణించింది. 2022 తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇలా వెనకబడటం ఇదే తొలిసారి. అయితే, ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.3 శాతం వృద్ధి నమోదై ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలెక్కింది. వినియోగదారుల ఖర్చు పెరగడం, ఎగుమతులు పుంజుకోవడం, దిగుమతుల్లో తగ్గుదల ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.ద్రవ్యోల్బణం, ఉద్యోగాల సవాలుద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. పీసీఈ (PCE) ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 2.8 శాతంగా ఉండగా, డిసెంబర్ నాటికి 2.7 శాతానికి తగ్గింది. సుంకాల వల్ల ధరలు భారీగా పెరుగుతాయన్న ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి అటువంటి నాటకీయ మార్పులు కనిపించలేదు. కానీ, ఉద్యోగ మార్కెట్ ఆందోళన కలిగిస్తోంది. యూఎస్లో నిరుద్యోగ రేటు 2025 నవంబర్లో 4.5 శాతానికి చేరింది. 2025లో నెలకు సగటున కేవలం 49 వేల ఉద్యోగాలు మాత్రమే జోడయ్యాయి. ఇది గడిచిన ఏడేళ్ల సగటు (1.41 లక్షలు) కంటే చాలా తక్కువ. బిగ్ టెక్ సంస్థల్లో కొనసాగుతున్న లేఆఫ్స్ దీనికి ప్రధాన కారణం.అమెరికా కంటే ప్రపంచమే ముందంజట్రంప్ 2.0 తొలి ఏడాదిలో అమెరికా మార్కెట్లు లాభాలను పంచాయి. గడిచిన ఏడాదిలో..ఎస్ అండ్ పీ 500: +16%నాస్డాక్: +20%డౌ జోన్స్: +14%ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా మార్కెట్ల జోరు తక్కువగానే ఉంది. జపాన్ నిక్కీ (40%), కొరియా కోస్పి (92%), హాంగ్ సెంగ్ (37%) వంటి అంతర్జాతీయ సూచీలు అమెరికాను మించిపోయాయి. డాలర్ ఇండెక్స్ 9.3 శాతం పడిపోవడం, బంగారం ధరలు అనూహ్యంగా పెరగడం ఈ ఏడాది విశేషం.ఏఐ బూమ్ట్రంప్ హయాంలో ఏఐ రంగానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా ‘స్టార్గేట్’ వంటి 500 బిలియన్ డాలర్ల మెగా ప్రాజెక్టులు టెక్ రంగాన్ని ఉత్సాహపరిచాయి. ఆల్ఫాబెట్, ఎన్విడియా వంటి ‘మాగ్-7’ స్టాక్స్ మార్కెట్ విలువలో 20 శాతం వృద్ధి సాధించాయి. ప్రస్తుతం ఎస్ అండ్ పీ 500లో 42 శాతం వాటా కేవలం ఏఐ అనుబంధ కంపెనీలదే ఉండటం గమనార్హం.అసలైన పరీక్ష ముందే?ప్రస్తుతం అమెరికా మార్కెట్లు 28 రెట్ల పీఈ(ప్రైస్ టు ఎర్నింగ్ - ఉదాహరణకు.. కంపెనీ రేషియో 20 ఉంటే ఆ కంపెనీ సంపాదించే 1 రూపాయి లాభం కోసం 20 రూపాయలు చెల్లిస్తున్నారని అర్థం) వద్ద ట్రేడవుతున్నాయి. ఇది 2000 నాటి డాట్కామ్ బబుల్ స్థాయిని గుర్తుచేస్తోంది. 2026లో వడ్డీ రేట్ల నిర్ణయాలు, ఫెడ్ రిజర్వ్ వైఖరి, సుంకాల దీర్ఘకాలిక ప్రభావం అమెరికా ఆర్థిక స్థితిని నిర్ణయించనున్నాయి. రికార్డు స్థాయి స్టాక్ మార్కెట్లపై ట్రంప్ గర్వపడుతున్నా పెరుగుతున్న రుణాలు, మార్కెట్ వాల్యుయేషన్ల మధ్య ఈ ఏఐ బూమ్ ఎంతకాలం నిలుస్తుందనేది వేచి చూడాలి.ఇదీ చదవండి: ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే.. -
ట్రంపరితనం.. బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసిన ఈయూ
గ్రీన్ల్యాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగ్గేదే లే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వ్యతిరేక గళం వినిపిస్తున్న యూరప్పైనా టారిఫ్ యుద్ధం ప్రకటించారాయన. అయితే ఆ వార్నింగ్కు కౌంటర్ యాక్షన్ ఇచ్చేందుకు యూరోపియన్ యూనియన్ (EU) సిద్ధమైంది. తొలిసారి తన వాణిజ్య బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసింది. ఎక్కువ చేస్తే.. దీనిని అగ్రరాజ్యంపై ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలిచ్చింది. ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో యూరప్పై టారిఫ్లు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఫిబ్రవరి 1 నుంచి డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, యుకే నుంచి వచ్చే వస్తువులపై 10% దిగుమతి పన్ను విధిస్తానన్నారు. అంతటితో ఆగకుండా.. జూన్ 1 నుంచి ఈ పన్ను 25% వరకు పెరగవచ్చని హెచ్చరించారు. అయితే.. ఈయూ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది. ఇది బ్లాక్మెయిలింగ్ అవుతుందని మండిపడుతోంది. ఈ క్రమంలోనే శక్తివంతమైన ‘ఏసీఐ’(Anti-Coercion Instrument)ను తెరపైకి తెచ్చింది. ఇతర దేశాల ఆర్థిక ఒత్తిళ్ల (coercion) నుంచి ఈయూ సభ్య దేశాలను కాపాడుకునేందుకు రూపొందించిందే ఏసీఐ. వాణిజ్య బ్లాక్మెయిలింగ్లు లేదంటే రాజకీయ ఒత్తిడి ప్రయత్నాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం దీని ఉద్దేశం. ఇది 2023 డిసెంబర్ 27 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇంతకాలం కాగితానికే పరిమితమైన దానిని.. తొలిసారిగా ఏకంగా అమెరికాపై ప్రయోగించేందుకు ఈయూ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఏసీఐ(Anti-Coercion Instrument).. దీనిని ట్రేడ్ బజుకాగా అభివర్ణిస్తారు. అమెరికాపై దీనిని ప్రయోగిస్తే గనుక.. అమెరికాపై భారీ టారిఫ్లు, ఈయూ దేశాల్లో అమెరికా సింగిల్ మార్కెట్ యాక్సెస్ను నిరోధించడం, ఎగుమతులను పరిమితం చేయడం లాంటివి జరుగుతాయి. అలాగే పెట్టుబడులపై నియంత్రణలు విధించే అవకాశం లేకపోలేదు. తద్వారా ఈయూలో వ్యాపారం చేసే అమెరికా సంస్థలకు అదనపు అడ్డంకులు ఎదురవుతాయి. ట్రేడ్ బజుకా ద్వారా సుమారు 93 బిలియన్ పౌండ్ల(రూ11.31) లక్షల కోట్లు విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించే అవకాశముంది. ఈ నేపథ్యంతోనైనా గ్రీన్ల్యాండ్ టారిఫ్ల విషయంలో అమెరికా వెనక్కి తగ్గే అవకాశం ఉంది. అందుకే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సహా పలువురు నాయకులు దీన్ని ప్రయోగించాలని అంటున్నారు.ఈయూ చర్యను ట్రంప్ చర్యలకు కౌంటర్గా తీసుకున్న అత్యంత కఠినమైన వాణిజ్య ప్రతీకార చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ద్వారా అమెరికాపై భారీ టారిఫ్లు విధించవచ్చు. అయితే.. ఇది అమెరికా–యూరప్ వాణిజ్య సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారి తీయడంతో పాటు అంతర్జాతీయ సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని ఆదోళన వ్యక్తం అవుతోంది. -
ట్రంప్ కు షాక్ ఇచ్చిన యూరోపియన్ యూనియన్
-
ట్రంప్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. ఇలా మోసం చేస్తాడనుకోలేదు
ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు.. ప్రపంచాన్ని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకసారి సైనిక చర్యకు సిద్ధమని.. మరోసారి శాంతి చర్చలని.. ఇంకోసారి ఇరాన్ నాయకత్వాన్ని పొగుడుతూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టులే అందుకు కారణం. దీంతో ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఆయన సరిగా అంచనా వేయలేకపోయారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. అదే సమయంలో.. పోటస్(President of the United States) ట్రంప్ ఫేస్ చూసి ఇరాన్ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. తమ దేశంలో తలెత్తిన సంక్షోభంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందని.. ఖమేనీని గద్దె దించుతుందని.. తమకు స్వేచ్ఛ లభిస్తుందని వాళ్లు బలంగా నమ్మారు. ఆ ఆశతోనే నిరసనల్లో ఉవ్వెత్తున పాల్గొని మరింత ఉధృతం చేశారు. ఈ క్రమంలో ప్రాణాలు పోతున్నా.. అరెస్టులు జరిగినా లెక్క చేయలేదు. అయితే తమను ఇంతలా రెచ్చగొట్టిన ట్రంప్.. చివరకు ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మాటలు నమ్మి ఘోరంగా మోసపోయామని తిట్టిపోస్తున్నారు. ఆ ప్రకటన తర్వాతే.. మతపరమైన పాలనపై ఎప్పటి నుంచో ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తికి ఆర్థిక సంక్షోభం తోడైంది. సోషల్ మీడియా ప్రచారం ద్వారా డిసెంబర్ 28న రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రధాన నగరాల్లో నిరసనలు మొదలయ్యాయి. అదే సమయంలో వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య జరిపి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి తీసుకెళ్లింది. ఇది సాధారణంగానే ఇరాన్ ప్రజలకు ఆశలు పుట్టించింది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు.. అప్పటికే రోడ్డెక్కిన ఆందోళనకారులకు ట్రంప్ ప్రకటనలు బలాన్ని ఇచ్చాయి. ‘‘సహాయం వస్తోంది.. నిరసనలు కొనసాగించండి’’ అని.. ‘‘లాక్డ్ అండ్ లోడెడ్’’ అంటూ చేసిన సో.మీ. పోస్టులు చూసి వేల మంది రోడ్డెక్కారు. అయితే నిరసనలు మళ్లీ ఉధృతం కావడంతో ఇరాన్ ప్రభుత్వం పాత పద్ధతులను అనుసరించింది. కమ్యూనికేషన్లు నిలిపివేయడం, భద్రతా బలగాలను మోహరించడం, కాల్పులు జరపడం. దేశవ్యాప్తంగా స్నైపర్ దాడులు, మెషిన్ గన్ కాల్పులు, వందలాది మరణాలు, అదృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో.. ప్రజలు ట్రంప్ కచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని బలంగా ఫిక్సయ్యారు. సరిగ్గా అప్పుడే..అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ నుంచి ఇరాన్కు యుద్ధ విమానాలు రెడీ ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగింది. ఏ క్షణమైనా అమెరికా తమ భూభాగంపై దాడులు జరుపుతుందని ఆకాశం వంక చూడసాగారు. అనూహ్యంగా ట్రంప్ వెనక్కి తగ్గి.. ‘‘ఇరాన్ నాయకత్వం ఆందోళనకారుల ఉరి శిక్షలు ఆపుతామని హామీ ఇచ్చింది.. అందుకు కృతజ్ఞలు అని చెబుతూ సైనిక చర్య జరగదని పరోక్షంగా చెప్పేశారు. ఈ ప్రకటన ఇరాన్ నిరసనకారులకు గట్టి షాక్ ఇచ్చింది.ట్రంప్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ఇరాన్ నిరసనలను కొందరు అధికారులు ఎగతాళి చేస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్నవాళ్లకు ఇక చుక్కలు చూపిస్తామంటూ కొందరు బాహటంగానే ప్రకటిస్తున్నారు. దీంతో చాలా మంది భయపడిపోతున్నారు. ప్రస్తుతానికి ఇరాన్లో నిరసనలు చాలా వరకు చల్లారాయి. మళ్లీ జరుగుతాయో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలిపశువుల్ని చేశారా?ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని ట్రంప్ కచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని భావించామని.. కానీ, చివరకు ఆయనొక బిల్డప్ బాబాయ్గా తేలిపోయిందని గాలి తీస్తున్నారు ఇరాన్ ప్రజలు. ఓ అంతర్జాతీయ మీడియా అక్కడి ప్రజలను ఇంటర్వ్యూ చేసింది. ఆందోళనల్లో వేలమంది మరణించారు. ఆ మరణాలకు ట్రంపే బాధ్యుడు అంటూ ఓ వ్యాపారి తెలిపాడు. అమెరికా అధ్యక్షుడి పిలుపుతోనే వేలమంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. చివరికి ఆయన మా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని మమ్మల్ని మోసం చేశాడు అని ఆరోపించింది మరో మహిళ. మరికొందరేమో.. ట్రంప్ తమను బలిపశువుల్ని చేశాడంటూ తిట్టిపోస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం ట్రంప్ వెనకడుగు వ్యూహాత్మకమని.. ఇరాన్ ప్రభుత్వాన్ని నమ్మించి మోసం చేసి దెబ్బ తీస్తాడని చెబుతుండడం కొసమెరుపు. -
మిన్నెపొలిస్లో ‘వలస’ల రగడ
మిన్నెపొలిస్: ట్రంప్ సర్కారు వలసల అణచివేత చర్యలపై అమెరికాలో మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నెపొలిస్ అట్టుడుకుతోంది. వలసల వ్యతిరేక, అనుకూల వర్గాల నడుమ ఘర్షణలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జాతీయ భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని గవర్నర్ కార్యాలయం తెలిపింది. వలసల అణచివేతపై నిరసనల్లో భాగంగా శనివారం మిన్నియాపోలీస్ డౌన్టౌన్లో నిరసన కారులు పెద్ద సంఖ్యలో చేరారు. వారికి వలసలపై అణచివేతకు అనుకూల ఆందోళనకారులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఒకరిపై ఒకరు స్నో బాల్స్, ఇతర నీటి బెలూన్లను విసురుకున్నారు. ముసుగులు ధరించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇళ్ల నుంచి, కార్ల నుంచి ప్రజలను బయటకు లాగడమే కాక.. దూకుడుగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు విమర్శించారు. తక్కువగా ఉన్న అనుకూల సమూహాన్ని తరిమికొట్టిన నిరసనకారులు, అనుకూల ఆందోళనకారుల్లో ఒకరైన జేక్లాంగ్ను పట్టుకుని దాడిచేశారు. గతేడాది జనవరి 6న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించిన వారిలో జేక్ ఉన్నారు. ఆయన బేస్బాల్ బ్యాట్తో అధికారిపై దాడి చేయడం సహా పలు నేరాలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి. క్షమాభిక్షతో బయటికి వచి్చన జేక్.. ఫ్లోరిడాలోని యూఎస్ సెనేట్కు పోటీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. మిన్నెపొలిస్, సెయింట్ పాల్ జంట నగరాల్లో వలసలపై అణచివేత చర్యల్లో భాగంగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇటీవల 2వేల మందికి పైగా ఫెడరల్ అధికారులను తరలించింది. ఇమ్మిగ్రేషన్ అమలును వేగవంతం చేసింది. నాటి నుంచి ప్రతిరోజూ నిరసనలు జరుగుతున్నాయి. ట్విన్ సిటీస్లో జరుగుతున్న ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్లో ఇటీవల ఒక మహిళ మరణించింది. అమెరికా పౌరురాలైన ఆమెను జనవరి 7న జరిగిన ఘర్షణలో ఇమ్మిగ్రేషన్ అధికారులు కాల్పి చంపారు. దీంతో శనివారం అధికారులు శాంతియుతంగా నిరసనకారులపై ఎలాంటి నిర్బంధం, టియర్గ్యాస్ను కూడా ప్రయోగించలేదు. మిన్నెసోటా స్టేట్ ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటానికే కాదు, శాంతియుతంగా సమావేశమయ్యే ప్రజల హక్కులకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని డెమోక్రటిక్ గవర్నర్ టిమ్ వాల్జ్ తెలిపారు. అయితే, దేశంలో ఉండటానికి హక్కు లేని అక్రమ వలసదారుల అరెస్టు, నిర్బంధం బహిష్కరణ కోసం తాము పోరాడుతూనే ఉంటామని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్ లాఫ్లిన్ అన్నారు. -
చాబహర్ పోర్టుపై రాజకీయ రగడ
ఇరాన్లోని చాబహర్ ఓడ రేవు భారత్లో రాజకీయ వివాదానికి దారితీస్తోంది. ఈ ఓడరేవుతో భారత్కు ఎంతో అనుబంధం ఉంది. పోర్ట్ నిర్మాణంలో దాదాపు దశాబ్ద కాలంగా భాగస్వామిగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం భారత్కు ఇబ్బందికరంగా మారింది. ట్రంప్ ఒత్తిడిని తట్టుకోలేక చాబహర్ పోర్ట్ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడుతున్నారని విపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. భారత విదేశాంగ విధానాన్ని అమెరికా వైట్హౌస్ నిర్దేశించే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడింది. భారత్పై పెత్తనం చేయడానికి ట్రంప్ను ఎందుకు అనుమతిస్తున్నారని నిలదీసింది అయితే, కాంగ్రెస్ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధికార బీజేపీ కొట్టిపారేసింది. చాబహర్ పోర్ట్ విషయంలో వైఖరి మార్చుకొనే ప్రసక్తే లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చాబహర్ పోర్ట్ నుంచి భారత్ నిజంగా వెనక్కి తగ్గుతుందా, అదే జరిగితే మనకు నష్టమెంత అనేదానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. గ్వాదర్ పోర్టుకు పోటీగా.. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో గ్వాదర్ ఓడరేవును చైనా నిర్మిస్తోంది. దాంతో ఆ ప్రాంతంలో స్వీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి భారత్ కూడా రంగంలోకి దిగింది. గ్వాదర్ పోర్ట్కు పోటీగా ఇరాన్ తీరంలో చాబహర్ పోర్ట్ నిర్మాణాన్ని భారత్ ప్రారంభించింది. గత ఏడాది ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాబహర్ పోర్ట్పై సెప్టెంబర్లో అమెరికా సర్కార్ ఆంక్షలు విధించింది. అక్కడ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని భారత్కు సూచించింది. అందుకు ఆరు నెలల గడువు విధించింది. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2026 ఏప్రిల్ దాకా ఆంక్షల నుంచి మినహాయింపు ఇచి్చంది. పోర్ట్ నిర్మాణం కోసం భారత్ ఇప్పటికే ఇరాన్కు 12 కోట్ల డాలర్లు బదిలీ చేసింది. ఎందుకంత కీలకం? చాబహర్ ఓడ రేవు ఇరాన్లో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో.. పాక్లోని గ్వాదర్ పోర్ట్కు 170 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ప్రపంచ ఇంధన వ్యాపారానికి చెక్పాయింట్ లాంటి హొర్మూజ్ జలసంధికి సమీపంలోనే ఉండడంతో భారత్ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. దీంతో అఫ్గనిస్తాన్, మధ్య ఆసియాతో నేరుగా వ్యాపార మార్గం ఏర్పడుతుంది. పాకిస్తాన్ రేవులతో పనిలేదు. అంతేకాకుండా అంతర్జాతీయ ఉత్తర–దక్షిణ రవాణా కారిడార్(ఐఎన్ఎస్టీసీ)లో చాబహర్ పోర్ట్ ముఖ్యమైనది. ముంబై నుంచి ఈ పోర్ట్ గుండా రష్యా, యూరప్లకు చేరుకోవచ్చు. సరుకు రవాణా సులభతరమవుతుంది. ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గిపోతుంది. అరేబియా, పశి్చమ హిందూ మహా సముద్రంలో పాక్–చైనాల ఆధిపత్యాన్ని అడ్డుకోవచ్చు. పోర్ట్ నిర్మాణం, నిర్వహణ, ఇతర కార్యకలాపాల కోసం భారత్, ఇరాన్ మధ్య 2003లో చర్చలు ప్రారంభమయ్యాయి. 2015లో ఇరుదేశాల నడుమ ఒప్పందం కుదిరింది. 2018 డిసెంబర్లో చాబహర్లో భారత కార్యకలాపాలు ప్రారంభించింది. చాబహర్ నుంచి అఫ్గానిస్తాన్ సరిహద్దులోని జహెదాన్ వరకు రైలు మార్గాన్ని అభివృద్ధి చేయడానికి భారత్ అంగీకరించింది. దీంతో వ్యాపార విస్తరణ మెరుగుపడే అవకాశం ఉంది. సుంకాలతో భారత్కు నష్టమే చాబహర్ కోసం భారత్ చేస్తున్న మొత్తం వ్యయం 370 మిలియన్ డాలర్లు. ఇందులో 120 మిలియన్ డాలర్లు ప్రత్యక్ష పెట్టుబడి కాగా, 250 మిలియన్ డాలర్లను ఇరాన్కు రుణంగా ఇస్తోంది. 120 మిలియన్ డాలర్లను ఇప్పటికే ఇరాన్కు అందించింది. చాబహర్పై విధించిన ఆంక్షలు గడువు త్వరలోనే ముగిసిపోనుంది. గడువు పెంపుకోసం భారత ప్రభుత్వం ప్రయతి్న స్తోంది. అమెరికాతో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్పై ట్రంప్ ప్రభు త్వం కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆంక్షలను ఎత్తివేసే సూచనలు కనిపించడంలేదు. పోర్ట్ విషయంలో ఇలాగే ముందుకు వెళ్తే ట్రంప్ హెచ్చరించినట్లు భారత్పై మరో 25 శాతం సుంకాలు అమల్లోకి వచి్చనా ఆశ్చర్యంలేదు. అదే జరిగితే భారత్కు భారీగా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. 120 మిలియన్ డాలర్ల పెట్టుబడిని వదులుకోవాలా? లేక అమెరికాతో జరిగే 132 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని వదులుకోవాలా? అనేది భారత ప్రభుత్వం నిర్ణయించుకోవాలని అంటున్నారు. మొత్తానికి చాబహర్ ఓడరేవు అంశంలో భారత్ విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటోందని చెప్పొ చ్చు. భారతదేశ ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శాంతి మండలిలో సభ్యత్వం... బిలియన్ డాలర్లే!
వాషింగ్టన్: గాజా పునర్నిర్మాణ క్రతువు కోసం కొలువుదీరే ‘శాంతి మండలి’లో శాశ్వత సభ్యత్వం కోసం ఒక్కో దేశం 100 కోట్ల డాలర్లు (దాదాపు రూ.9,071 కోట్లు) చెల్లించాలట! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఈ మేరకు ప్రకటించారు!! ఈ మండలికి ఆయనే సారథ్యం వహిస్తుండటం తెలిసిందే. గాజా పునర్నిర్మాణం కోసమే శాంతి మండలి (బోర్డ్ ఆఫ్ పీస్) అని తొలుత చెప్పినా నిజానికి దీన్ని ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయంగా ట్రంప్ ఏర్పాటు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రతిపాదిత మండలికి సంబంధించిన ముసాయిదా చార్టర్లోని వివరాలను అంతర్జాతీయ మీడియా సంపాదించింది. అందులోని అంశాలతో కథనాలు వెలువడ్డాయి. ఐరాస, దాని అనుబంధ శాఖలు, సంస్థలు, కమిషన్లు, సలహా మండళ్లలో ఇతర దేశాల ఆధిపత్యం కొనసాగుతుండటంతో విసిగిపోయిన ట్రంప్ తన కనుసన్నల్లో పనిచేసే శక్తిమంతమైన అంతర్జాతీయ కూటమి ఏర్పాటుకు మొగ్గుచూపి ఆ మేరకే కొత్తగా ఈ శాంతిమండలిని తెరమీదకు తెచ్చారు. తనకు నచ్చిన దేశాలకు ఇష్టానుసారం సభ్యత్వం ఇస్తున్నారు. దీనిపై అమెరికా ఉన్నతాధికారి ఒకరు వివరణ ఇచ్చారు. ‘‘దేశాలకు మూడేళ్ల వరకు శాంతి మండలి సభ్యత్వం ఉచితం. ఆ తర్వాత శాశ్వత సభ్యత్వం కోసం కనీసం 100 కోట్ల డాలర్లు చెల్లించాల్సిందే. అది కూడా నగదు రూపంలో. ఐదేళ్ల గడువులో పూర్తి మొత్తాలను చెల్లించాలి. శాశ్వత సభ్యత్వం ఎవరికివ్వాలనే విషయంలో తుది నిర్ణయం ట్రంప్దే. శాంతి మండలిలో తీసుకునే నిర్ణయాలపై ప్రతి దేశం ఓటు హక్కు కల్గిఉంటుంది. కానీ ఆ ఓటు చెల్లుబాటయ్యేదీ లేనిదీ ట్రంప్ నిర్ణయిస్తారు. మండలి ఆర్థిక వ్యవహారాలు చైర్మన్ ఆదేశాల మేరకు జరుగుతాయి. సభ్యులను తొలగించే అధికారమూ పరోక్షంగా ఆయనదే’’ అని చెప్పారు. ఈ కూటమిలో భాగస్వామిగా ఉండాలంటూ భారత్కు ట్రంప్ స్వయంగా ఆహ్వానం పంపారు. -
ఖమేనీని సాగనంపాల్సిందే
వాషింగ్టన్: ఇరాన్లో సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ శకం పరిసమాప్తి కావాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. పొలిటికో వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఇరాన్ అంశంపై మాట్లాడారు. ‘‘ఇరాన్లో నూతన నాయకత్వం తెరమీదకు రావల్సిన తరుణం ఆసన్నమైంది. ఖమేనీని సాగనంపాల్సిందే’’అని అన్నారు. తమ దేశంలో హింసకు ట్రంపే కారణమని ఖమేనీ పలుమార్లు ఆరోపణలు గుప్పించిన వేళ ఇరాన్లో నాయకత్వ మార్పుపై ట్రంప్ వ్యాఖ్యలుచేయడం ఇదే తొలిసారికావడం విశేషం. ‘‘దేశంలో అత్యున్నత పరిపాలనా హోదాలో కొనసాగుతూ కూడా దేశం సర్వనాశనమవుతుంటే ఆయన(ఖమేనీ) పట్టించుకోలేదు. పైగా పోలీసు చర్యతో ఉద్యమాలను అణచివేస్తూ హింసను ప్రోత్సహించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో హింసాత్మక ఘటనలకు కారకుడయ్యారు. నాయకులు నాలా దేశాన్ని సవ్యంగా పరిపాలించడంపై దృష్టి సారించాలి. అధికారంలో కొనసాగేందుకు ఆయనలాగా నేను వేలాది మందిని చంపలేదు. అసమర్థ ఖమేనీకి పరిపాలించే అర్హత లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
భారత్కు ట్రంప్ ఆహ్వానం.. గాజా 'బోర్డ్ ఆఫ్ పీస్'లో ఆఫర్
గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఏర్పాటు చేయనున్న ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో భాగస్వామిగా చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను ఆహ్వానించారు. గాజాలో కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకడం, శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ చొరవ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల శాంతి ప్రణాళికలో భాగంగా, రెండో దశ అమలుకు సంబంధించినదిగా తెలుస్తోంది.ప్రపంచ స్థాయిలో భారత్కు ఉన్న విశ్వసనీయత, సమతుల్య విదేశాంగ విధానం, శాంతి ప్రయత్నాల్లో దాని పాత్రను దృష్టిలో ఉంచుకుని ఈ ఆహ్వానం ఇచ్చినట్లు సమాచారం. గాజాలో పరిస్థితిని పర్యవేక్షించడం, మానవతా సహాయం, పునర్నిర్మాణం, సంఘర్షణ నివారణకు సంబంధించిన చర్యలను ఈ బోర్డు సమన్వయం చేస్తుంది. అయితే ఈ ప్రతిపాదనపై భారత్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. భారత్ ఈ చొరవలో భాగమైతే, పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియలో తన పాత్ర మరింత బలోపేతం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.బోర్డు సభ్యుల వివరాలువైట్ హౌస్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’ సభ్యుల జాబితాను విడుదల చేసింది. గాజాలో శాంతి, స్థిరత్వం, పునర్నిర్మాణం, దీర్ఘకాలిక అభివృద్ధిని పర్యవేక్షించనున్న ఈ బోర్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చైర్మన్గా వ్యవహరించనున్నారు.ఈ బోర్డులోని ప్రముఖ సభ్యులు:* అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో* బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్* ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్* ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా* ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్* అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సీఈఓ మార్క్ రోవాన్* అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రాబర్ట్ గాబ్రియేల్* తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్* ఖతారీ దౌత్యవేత్త అలీ అల్ తవాడిసభ్యత్వ రుసుముపై స్పష్టీకరణగాజా శాంతి బోర్డులో చేరేందుకు దేశాలు ఒక బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందన్న మీడియా కథనాలను వైట్ హౌస్ ఖండించింది. బోర్డులో చేరేందుకు ఎలాంటి కనీస రుసుము నిర్ణయించలేదని స్పష్టం చేసింది. శాంతి, భద్రత, శ్రేయస్సు పట్ల లోతైన నిబద్ధత చూపే భాగస్వామ్య దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పిస్తామని వైట్ హౌస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. -
గ్రీన్లాండ్ వివాదం.. ట్రంప్నకు యూరప్ షాక్!
బెల్జియం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్ తగిలింది. గ్రీన్లాండ్ దక్కించునేందుకు అమెరికా ప్రయత్నిస్తుండగా.. అందుకు ఒప్పుకోని యూరోపియన్ యూనియన్ దేశాలపై సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరింపులకు దిగాడు. అయితే, ఈక్రమంలో ట్రంప్ బెదిరింపులకు తాము తలొగ్గబోమని, అవసరమైతే అమెరికాతో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల్ని రద్దు చేసుకుంటామంటూ యూరోపియన్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. అంతేకాదు, తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్ కంపెనీలపై సుంకాల పేరుతో ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత ఏడాది జూలైలో అమెరికా-యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. కానీ ట్రంప్ తాజా బెదిరింపులు ఈ ఒప్పంద భవిష్యత్తుపై ఆందోళనలను రేకెత్తించాయి. ఫిబ్రవరి 1 నుంచి గ్రీన్లాండ్ కొనుగోలుకు ఒప్పుకోని డెన్మార్క్తో సహా ఎనిమిది దేశాలపై 10శాతం సుంకం విధిస్తామని స్పష్టం చేశారు. అప్పటికీ ఒప్పుకోకపోతే, జూన్ నుంచి ఈ సుంకం 25 శాతం వరకు పెరుగుతుందన్నారు. గ్రీన్లాండ్ అమెరికా జాతీయ భద్రతకు కీలకం. చైనా, రష్యా ఈ ప్రాంతంలో ఆధిపత్యం పెంచుతున్నందున గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవడం అమెరికాకు అవసరమని ట్రంప్ పేర్కొన్నారు.ఈ క్రమంలో డెన్మార్క్తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. ఈయూ నాయకులు సైతం సోషల్ మీడియా వేదికగా..‘అమెరికా బెదిరింపులకు తలొగ్గం. అవసరమైతే ఒప్పందాలను రద్దు చేస్తాం’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో యూరప్లో పనిచేస్తున్న అమెరికన్ కంపెనీలపై జరిమానాలు, నిషేధాలు విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇది గూగుల్, మెటా, ఎక్స్ వంటి టెక్ దిగ్గజాలకు పెద్ద ఎదురుదెబ్బే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ట్రంప్ సైనిక చర్య తీసుకోవచ్చనే భయంతో జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్ గ్రీన్లాండ్లో దళాలను మోహరించాయి. డెన్మార్క్ కూడా తన సైనిక ఉనికిని పెంచుకుంది. ట్రంప్ సైనిక చర్య తీసుకుంటే నాటో కూటమి కూలిపోతుంది. ఈ పరిస్థితి ట్రాన్స్ అట్లాంటిక్ భద్రతా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది.గ్రీన్లాండ్ వివాదం అమెరికా-ఈయూ సంబంధాలను కొత్త సంక్షోభంలోకి నెడుతోంది. ట్రంప్ సుంకాల బెదిరింపులు, ఈయూ ప్రతిస్పందన, సైనిక ఉద్రిక్తత అన్నీ కలిపి ఇరు దేశాల వాణిజ్య ఒప్పంద భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. రానున్న రోజుల్లో ఈ సమస్య అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక రంగంలో ప్రధాన చర్చగా మారనుంది. -
ట్రంప్ టారిఫ్.. షాక్ ఇచ్చిన యూరప్
-
అంతర్జాతీయ పీస్ మిషన్ ప్లాన్లో ట్రంప్..?
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. అనేక అంతర్జాతీయ సంస్థలను తన ఆర్థిక, అంగ బలంతో గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు తానే అధ్యక్షుడిగా ఒక అంతర్జాతీయ పీస్ మిషన్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.ట్రంప్కున్న తలబిరుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ సంస్థలన్నీ అమెరికా దయా దాక్షిణ్యాల మీదే ఆధారపడతాయని అందుకే ఆ దేశం మాటే చెల్లాలని ఆయన తరచుగా వాదిస్తారు. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితిపై కూడా ట్రంప్ పలుమార్లు విమర్శలు చేశారు. అంతేకాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు నిధులు తగ్గించడంతో పాటు కొన్ని సంస్థలను బహిష్కరించారు.ఈ నేపథ్యంలో ట్రంప్ ఒక అంతర్జాతీయ పీస్ మిషన్ స్థాపించబోతున్నట్లు బ్లుూమ్బర్గ్ నివేదిక తెలిపింది. అందులో చేరే ప్రతి సభ్యదేశానికి మూడు సంవత్సరాల కాలపరిమితి ఉండేలా నియమాలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది. పీస్ మిషన్ తీసుకునే ప్రతి నిర్ణయాలకు ఆ సంస్థ అధ్యక్షుడి నిర్ణయం తప్పనిసరై ఉండేలా నియమాలు రూపొందించనున్నట్లు బ్లూమ్బర్గ్ పేర్కొంది.అయితే ఏ దేశమయితే 1బిలియన్ డాలర్లు సంస్థకు విరాళంగా ఇస్తుందో ఆ దేశానికి సంస్థ యెుక్క శాశ్వత సభ్యత్యం లభిస్తుందని తెలిపింది. ఈ శాంతి ఆర్గనైజేషన్ యెుక్క ఉద్దేశం అంతర్జాతీయంగా శాంతిని సుస్థిరపరచడమేనని పేర్కొంది. అయితే ఈ శాంతిమిషన్లో చేరడానికి 1బిలియన్ డాలర్లు చెల్లించాలనే అనే వాదన పూర్తిగా అవాస్తవం అని వైట్హౌస్ తెలిపింది.


