మంత్రి లోకేశ్‌ మరోసారి అభాసుపాలు | Minister nara lokesh tongue slips again in karapa public meeting | Sakshi
Sakshi News home page

మంత్రి లోకేశ్‌ మరోసారి అభాసుపాలు

Apr 19 2017 8:56 AM | Updated on Aug 29 2018 3:37 PM

మంత్రి లోకేశ్‌  మరోసారి అభాసుపాలు - Sakshi

మంత్రి లోకేశ్‌ మరోసారి అభాసుపాలు

సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి లోకేశ్‌ మరోసారి తడబడ్డారు.

కాకినాడ: సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్‌ మరోసారి తడబడ్డారు. ఇటీవల అంబేడ్కర్‌ జయంతిని వర్థంతిగా పేర్కొనడమే కాకుండా, శుభాకాంక్షలు కూడా చెప్పి నవ్వులపాలైన లోకేశ్, తాజాగా మరోసారి ప్రజలు అవాక్కయ్యేలా మాట్లాడారు. నిన్న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన లోకేశ్‌.. పెద్దాపురం, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో పలు పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా కరపలో ఏర్పాటుచేసిన సభలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో ప్రతి పల్లెటూరుకు తాగునీరు లేని ఇబ్బందిని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమనడంతో సభలో జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. లోకేశ్‌ ఈ సమ యంలో ‘ఇబ్బంది.. కాదు.. కాదు’ అంటూ తడబడుతూ చివరివరకు ఒక్కో మాట వత్తి పల కడంతో సభకు హాజరైనవారు ఘొల్లున నవ్వారు. సహజంగా ఏ మంత్రయినా తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెబుతుంటారు.

స్వయానా పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి అయిన సీఎం తనయుడు లోకేశ్‌ మాత్రం.. అసలు తాగునీరే లేకుండా ఇబ్బందులు కలుగజేస్తాననడంతో సభలో నవ్వులు విరిశాయి. అలాగే డ్వాక్రా గ్రూపులోని ఒక్కో మహిళకు రూ.7 వేలు చొప్పున ఇచ్చామని లోకేశ్‌ చెబుతుండగా, పక్కనే ఉన్న ఒక నాయకుడు కలుగజేసుకొని రూ.6 వేలే ఇచ్చామని చెవిలో చెప్పారు. దీంతో గొంతు సవరించుకున్న లోకేశ్‌ త్వరలోనే మిగిలిన రూ.4 వేలు ఇస్తామని ముక్తాయించారు. కాగా, ఇదే సభలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మరో అడుగు ముందుకేసి లోకేశ్‌ను కాబోయే ముఖ్యమంత్రి అంటూ తన స్వామిభక్తిని చాటుకునే ప్రయత్నం చేశారు.

దండ వేస్తాను.. మీరంతా అక్కడే ఉండండి
ఇదిలాఉండగా, కరపలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన లోకేశ్‌.. అక్కడే ఉన్న డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించకపోవడంపై అంబేడ్కర్‌ యువజన సేవా సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేయాలని కోరగా.. మీరంతా అక్కడే ఉండండి, నేనొచ్చి దండ వేస్తానని లోకేశ్‌ వారికి బదులిచ్చాడు. దీంతో వారంతా అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పూలదండలతో వేచిచూస్తుండగా.. లోకేశ్‌ మాత్రం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆగకుండానే వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన యువజన సంఘ నాయకులు అంబేడ్కర్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నిరసనకు దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement