స్టీఫెన్-బాబు వాయిస్ రికార్డులున్నాయి: నాయిని
నోటుకు ఓటు ముడుపుల వ్యవహారాన్ని ఏపీ సీఎం చంద్రబాబే నడిపారని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు.
వరంగల్ : నోటుకు ఓటు ముడుపుల వ్యవహారాన్ని ఏపీ సీఎం చంద్రబాబే నడిపారని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. పట్టణంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రేరణ, ఆదేశాల మేరకే టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారం నడిపారని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఇవి వెన్నతో పెట్టిన రాజకీయాలని నాయిని మండిపడ్డారు. బాబు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు నేను అదే పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పారు. టీడీపీ పార్టీ పెట్టాక... ఆ పార్టీలోకి వెళ్లి ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారని హోంమంత్రి అన్నారు.
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో ఫొన్లో చంద్రబాబు మాట్లాడారని, దీనికి సంబంధించిన వాయిస్ రికార్డ్లు కూడా ఉన్నాయని చెప్పారు. ముడుపుల వ్యవహారంలో ప్రధాన కుట్రదారుడు చంద్రబాబేనని నాయిని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో రూ.5 కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలను కొనడం దుర్మార్గమని పేర్కొన్నారు.


