ఆ నోట్ల సరఫరాను పెంచుతున్న ఆర్‌బీఐ | Sakshi
Sakshi News home page

ఆ నోట్ల సరఫరాను పెంచుతున్న ఆర్‌బీఐ

Published Sat, Sep 2 2017 2:03 PM

ఆ నోట్ల సరఫరాను పెంచుతున్న ఆర్‌బీఐ

సాక్షి, న్యూఢిల్లీ : వినాయక చవితి సందర్భంగా రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబేలా కొత్త రూ.200 నోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. చిల్లర కొరతకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ ఈ నోట్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వీటి ఉత్పత్తిని కూడా ఆర్బీఐ భారీగా పెంచనుందట. ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో కరెన్సీ ప్రింటింగ్‌ ప్రెస్‌ల వద్ద రూ.200 నోట్ల ఉత్పత్తిని పెంచామని, కాలక్రమంలో మరిన్ని నోట్లు మార్కెట్‌లోకి విడుదల చేస్తామని పేర్కొంది. అవసరమయ్యే మేరకు ఈ నోట్లు ప్రజల్లోకి అందుబాటులోకి తెస్తామని తెలిపింది. బ్యాంకింగ్‌ ఛానళ్ల ద్వారా వీటిని ఆర్బీఐ సరఫరా చేయనుంది. ప్రస్తుతమైతే ఈ కొత్త నోట్లు ఎంపికచేసిన ఆర్బీఐ ఆఫీసుల వద్ద, బ్యాంకుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎప్పడి నుంచి ఈ నోట్లను ఏటీఎంలలో అందించనుందో ఇంకా సెంట్రల్‌ బ్యాంకు స్పష్టంచేయలేదు. 
 
ఈ నోట్లు ఏటీఎంలలోకి రావాలంటే కొత్త సమయం పట్టే అవకాశమే కనిపిస్తోంది. కొత్త ఈ నోట్లు లావాదేవీలు వేగవంతం అవడానికి దోహదం చేస్తుందని, ముఖ్యంగా సాధారణ ప్రజానీకానికి ఇవి ఎంతో సహకరిస్తాయని గత నెలలో ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌ గాంధీ చెప్పారు. రూ.200 కరెన్సీ నోట్ల పొడవు ప్రస్తుత కరెన్సీకి భిన్నంగా ఉందని, క్యాసెట్ క్యాలిబ్రేషన్(సవరించాలి) చేయవలసిన అవసరం ఉందని తెలిసింది.  200 నోటుతో పాటు భారత్‌లో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు 1, 2, 5,10, 20,50,100, 500, 2000 డినామినేషన్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు 100కు 500కు మధ్యలో ఎలాంటి డినామినేషన్‌ నోటు లేదు. 200 రాకతో వీటి అంతరాన్ని తొలగించింది. అంతేకాక పౌరుల దైనందిన లావాదేవీల్లో ఇబ్బందులు తొలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటి ఉత్పత్తిని మరింత పెంచి, పౌరులకు మరింత సహకరించాలని ఆర్బీఐ చూస్తోంది.  

Advertisement
Advertisement