మంచి చేస్తే ప్రభుత్వానికి మద్దతు | ysrcp support if telangana doing good to people | Sakshi
Sakshi News home page

మంచి చేస్తే ప్రభుత్వానికి మద్దతు

Oct 17 2014 1:15 AM | Updated on Aug 21 2018 5:36 PM

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మంచి చేస్తే తమ పార్టీ తరఫున బేషరతుగా మద్దతు ఇస్తామని కానీ, వారికి నష్టం చేసే కార్యక్రమాలు చేపడితే మాత్రం ఉద్యమిస్తామని

* వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మంచి చేస్తే తమ పార్టీ తరఫున బేషరతుగా మద్దతు ఇస్తామని కానీ, వారికి నష్టం చేసే కార్యక్రమాలు చేపడితే మాత్రం ఉద్యమిస్తామని ఖమ్మం ఎంపీ, వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.

ప్రజలను ప్రభుత్వం కష్టాలపాలు చేస్తే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని హెచ్చరించారు. కేంద్ర కార్యాలయంలో గురువారం నుంచి పార్టీ తెలంగాణ జిల్లాల సమావేశాలు ప్రారంభమయ్యాయని, తొలిరోజు మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల సమావేశాలు జరిగాయన్నారు. పార్టీ బలోపేతంపై నేతలు, కార్యకర్తలతో చర్చించామన్నారు. ప్రజలను కేసీఆర్ మోసపూరిత మాటలతో నమ్మించడం వల్లే 2014 ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ ఓడిపోయిందన్నారు.

వంద రోజుల పాలనలో ఏమీ చేయలేకపోయానని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, జూన్ 2న ప్రమాణస్వీకారం చేసిననాడే పంటలకు 7 గంటల విద్యుత్ ఇవ్వలేనని చెప్పి ఉంటే రైతులు ఇంతగా నష్టపోయేవారు కాదని, దాదాపు 250 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడేవారు కాదని పొంగులేటి పేర్కొన్నారు.
 
షర్మిల స్టార్ కాంపెయినర్
మీడియాలో షర్మిలపై వస్తున్న వార్తలు నిజంకాదని, ఆమె పార్టీ స్టార్ కాంపెయినర్ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. 2 ప్రాంతాలకు ఆమె సేవలు ఉపయోగపడతాయని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు సందర్భానుసారం ప్రజల్లోకి వస్తారన్నారు. జిల్లా టూర్ పూర్తిచేసి పార్టీకి ఓ రూపు వచ్చిన తర్వాత షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభిస్తారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement